బాల్యం బడికి దూరం
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో మధ్యలో బడికి దూరమవుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ విద్యను మెరుగుపర్చేందుకు కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ విద్యార్థుల డ్రాపౌట్స్ను మాత్రం తగ్గించలేకపోతోంది. 2024–25 విద్యా సంవత్సరంలో మార్చి 19వ తేదీ వరకు డ్రాపౌట్స్(పెండింగ్) అత్యధికంగా మచిలీపట్నం డివిజన్లో 184 మంది బడికి దూరమవ్వగా ఉయ్యూరు డివిజన్ 84, గుడివాడ డివిజన్ 49 మంది ఉన్నారు. అత్యధికంగా 71 మంది మచిలీపట్నం మండలం నుంచి డ్రాపౌట్స్ అయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు ఎక్కువగా మానేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివేవారు అంతా పేదలే. ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే తల్లిదండ్రులు పిల్లలను స్కూల్స్ మాన్పిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఆర్థిక సాయం తల్లికి వందనం అందని కారణంగా పాఠశాలల్లో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి.
గత ప్రభుత్వ హయంలో..
గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల చర్యలకు చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంతో డ్రాపౌట్స్ తగ్గాయి. దీనికి తోడు పాఠశాల విద్యపై బడ్జెట్లో నిధుల కేటాయింపు ఉండేది. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు సంఖ్య గణనీయంగా పెరిగింది. అప్పుడు మౌలిక సదుపాయాల కల్పనతో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించింది. విద్యా కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ టెక్నాలజీకి యాక్సెస్, బ్రిడ్జ్ కోర్సులు, అకడమిక్ లోటులను పరిష్కరించటంతో డ్రాపౌట్స్ తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టడంతో పాటు వారికి నూతన విధానంలో విద్యా బోధన చేయటంతో విద్యార్థులు పాఠశాలలు మానేసే ప్రక్రియ చాలా వరకు తగ్గించారు.
మధ్యలోనే మానేస్తున్నారు..
2023–24లో జిల్లాలో బడి పిల్లల డ్రాపౌట్స్ 372 కాగా 2024–25లో మార్చి 19 వరకు 386కు చేరింది. ఈ ఏడాది 3.76 శాతం జిల్లా వ్యాప్తంగా అనూహ్యంగా పెరిగింది. ఈ పరిస్థితిని మార్చడానికి గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి ప్రవేశపెట్టి తల్లిదండ్రులకు ఆర్థిక వెసులుబాటు కల్పించింది. డ్రాపౌట్స్ను చాలావరకు తగ్గించింది. ప్రాథమిక స్థాయిలో కొంత వరకు బాగానే ఉన్నప్పటికీ ఉన్నత పాఠశాల 10వ తరగతి స్థాయికి వచ్చేసరికి చాలామంది విద్యార్థులు బడి మానేస్తున్నారు. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ డ్రాపౌట్స్ సమస్య ముఖ్యంగా ఆర్థిక అంశాలతో ప్రభావితమై ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా తల్లికి వందనం ఇవ్వకపోవడం, పాఠశాలల్లో నేర్చుకునే విద్యలో లోటుపాట్లు, అకడమిక్ సవాళ్లు డ్రాపౌట్స్కు కారణమవుతున్నాయి.
ఉన్నత పాఠశాల విద్యార్థులే
అధికంగా బడికి దూరం
ఆర్థిక అంశాలతో
డ్రాప్ఔట్స్ ప్రభావితం
గతంలో అమ్మఒడితో తగ్గిన డ్రాపౌట్స్
అర్బన్ ప్రాంతాల్లోనే అధికంగా బడి మానేస్తున్న విద్యార్థులు
పామర్రులో విద్యార్థి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇస్తున్న అధికారులు(ఫైల్)
అన్ని చర్యలు తీసుకుంటాం..
బడిఈడు పిల్లలను ఇప్పటికే ఆయా మండలాల్లో టీమ్లుగా ఏర్పాటు చేసి గుర్తించటం జరిగింది. వారిని రాబోయే విద్యా సంవత్సరానికి బడికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. జూన్ నెలలో ఇందుకోసం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– ఎం.ఫణి దూర్జటి, ఇన్చార్జి అసిస్టెంట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ సమగ్ర శిక్షా
బాల్యం బడికి దూరం


