కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.వెంకట్, రాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. మంగళవారం ఉదయం వారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్కు చిన్నారులు లావణ్య, ప్రవీణ్ చౌదరి పేరున విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్సాహంగా...ఉల్లాసంగా..
గుడ్లవల్లేరు: అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో ద్వితీయ సంవత్సరం డైట్ విద్యార్థులకు ప్రథమ సంవత్సర విద్యార్థులు మంగళవారం వీడ్కోలు సభ నిర్వ హించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. విద్యార్థులు తమ అనుభ వాలను పంచుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలను అంజుమ్ కౌసర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, సీనియర్ అధ్యాపకులు వినయకుమార్, మోహినికుమారి, లెక్చరర్లు ఆచార్యులు, జయశ్రీ, ప్రకాశం, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు
విజయవాడ మీదుగావేసవి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడ పనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. హుబ్లీ – కతిహార్ (07325) ప్రత్యేక వారాంతపు రైలు ఈ నెల 9 నుంచి 30 వరకు ప్రతి బుధవారం, కతిహార్–హుబ్లీ రైలు (07326) ఈ నెల 12 నుంచి మే 3 వరకు ప్రతి శనివారం, బెంగళూరు – నారంగీ (06559) ఈ నెల 8 నుంచి 29 వరకు ప్రతి మంగళవారం, నారంగీ – బెంగళూరు (06560) ఈ నెల 12 నుంచి మే 3వ తేదీ వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
రెండు సార్లు హామీలువిస్మరించిన సీఎం
విజయవాడస్పోర్ట్స్: ఓల్గా ఆర్చరీ అకాడమీ అభివృద్ధికి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు రెండు పర్యాయాలు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) అధికారులు రాష్ట్రంలో క్రీడలను ఎలా అభివృద్ధి చేస్తారని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్(ఏపీఓఏ) కార్యదర్శి కె.పి.రావు ప్రశ్నించారు. ఓల్గా ఆర్చరీ అకాడమీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని 2015, 2019లో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ అకాడమీ అధ్యక్షుడు, ఆర్చరీ సీనియర్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారం కొనసాగింది. సత్యనారాయణను కె.పి.రావు పరామర్శించి మాట్లాడారు. రాష్ట్రానికి ఆర్చరీ క్రీడను పరిచయం చేసి, క్రీడాభివృద్ధికి సత్యనారాయణ తన జీవితాన్ని, ఆస్తులను ధారపోశారన్నారు. అకాడమీ అభివృద్ధిపై శాప్ అధికారులు స్పందించిన తీరు బాధాకరంగా ఉందన్నారు. సత్యనారాయణకు రాష్ట్రంలోని క్రీడాకారులు, క్రీడా సంఘాలు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.
11న ఉమ్మడి కృష్ణాజిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా అండర్ –19 పురుషుల వన్డే, మల్టీ డే క్రికెట్ జట్టును ఈ నెల 11న మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎంపిక చేస్తామని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలిపారు. 2006 సెప్టెంబర్ ఒకటో తేదీ తరువాత జన్మించిన వారే ఈ పోటీలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న క్రీడాకారులు ఆధార్, జనన ధృవీకరణ పత్రం జిరాక్స్, వైట్ డ్రస్, స్పోర్ట్స్ షూ, సొంత కిట్తో 11న ఉదయం 7.30 గంటలకు ఎంపిక ప్రాంగణంలో రిపోర్ట్ చేయాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 93934 44279 సెల్ నంబర్లో సంప్రదించాలన్నారు.
కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం
కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం


