సాగరతీరంలో పోలీసుల మాక్ డ్రిల్
కోడూరు: మండలంలోని హంసలదీవి సాగరతీరం వెంట పోలీసులు గురువారం ప్రత్యేక మాక్డ్రిల్ చేశారు. కోస్టల్ అధికారుల ఆదేశాల మేరకు గురువారం తీరంలో సీ–విజిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మచిలీపట్నం ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకాయతిప్ప మైరెన్ సీఐ సురేష్రెడ్డి పర్యవేక్షణలో 50 మంది పోలీసులు కోడూరు, నాగాయ లంక మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు తీరప్రాంత గ్రామాల్లోకి ప్రవేశించి, ఏదో ఒక ప్రాంతంలో దాగి ఉంటే, వారిని కనిపెట్టేందుకు చేపట్టే చర్యలతో మాక్ డ్రిల్ చేపట్టామని మైరెన్ సీఐ సురేష్రెడ్డి తెలిపారు. ఉగ్రవాదులు, తీవ్రవాదుల రూపంలో వచ్చిన ఇండియన్ నేవీ అధికారులను కనిపెట్టేందుకు పోలీసులు ప్రత్యేక పడవల ద్వారా సముద్రమార్గం వెంట సంచరించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవలను తనిఖీ చేశారు. హంసలదీవి, పాలకాయతిప్ప, ఉల్లిపాలెం గ్రామాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వాహనాలను తనిఖీ చేయడంతో పాటు అపరిచిత వ్యక్తుల వివరాలను సేకరించారు. వేటకు వెళ్లిన మత్స్యకారుల ఐడీ కార్డులను పరిశీలించడంతో పాటు వారికి కూడా అనుమానితులను గుర్తించే ప్రక్రియపై అవగాహన కల్పించారు. సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
సముద్రమార్గం ద్వారా ఉగ్రవాదుల కోసం గాలింపు 50 మంది పోలీసులతో తీరప్రాంతాల్లో గస్తీ


