మందులు బంద్!
సోమవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
మహబూబాబాద్: మూగజీవాలకు అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం 1962 సంచార వైద్యశాలలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే కొన్ని నెలలుగా మందులు సరఫరా కావ డం లేదు. దీంతో మూగజీవాలకు మెరుగైన సేవలు అందడం లేదు. దీనికి తోడు సిబ్బంది వేతనాలు కూడా పెండింగ్లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో 45 పశు వైద్యశాలలు..
జిల్లాలో 3 ఏరియా వెటర్నరీ వైద్యశాలలు(ఏవీహెచ్), 23 ప్రైమరీ వెటర్నరీ వైద్యశాలలు (పీవీహెచ్), 19 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు నియోజకవర్గానికి ఒక సంచార వైద్యశాల వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లాలో పూర్తిస్థాయిలో మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలు ఉండగా.. ఇల్లెందు నియోజకవర్గంలోని రెండు మండలాలు, ములుగు నియోజకవర్గం రెండు మండలాలు, పాలకుర్తి నియోజకవర్గంలో రెండు మండలాలు ఉన్నాయి. ఈమేరకు మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాల్లో రెండు సంచార వాహనాలు ఉన్నాయి. అలాగే ములుగు నియోజకవర్గ పరిధిలోని గంగారం, కొత్తగూడ మండలాలకు ఒక వాహనాన్ని కేటాయించారు. దీంతో జిల్లాలో 3 సంచార పశువైద్యశాల వాహనాలు ఉన్నాయి. అయితే వాటిలో పనిచేసే సిబ్బంది కోసం రూం కానీ, ఇతర ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు.
వాహనానికి నలుగురు..
ప్రతీ వాహనంలో డాక్టర్, కాంపౌండర్, డ్రైవర్, హెల్పర్ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. 1962కు కాల్ చేయగానే వారు నమోదు చేసుకుంటారు. ఆ కాల్స్ ఆధారంగా వాహనాల డాక్టర్లకు షెడ్యూల్ ఇస్తారు. దాని ప్రకారం ఆయా గ్రామాలకు వెళ్లి మూగ జీవాలకు చికిత్స చేస్తారు. కాగా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్ (ఐఎంఆర్ఐ), జీవీకే, గ్రీన్హెల్త్ సర్జిల్ సంస్థలకు ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంస్థల ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్లో సిబ్బంది నియామకం, మందులు అందజేస్తారు.
మందుల సరఫరా బంద్..
నాలుగైదు నెలల నుంచి మందులు రావడం లేదని సిబ్బంది తెలిపారు. కనీసం సిరంజీలు కూడా లేక వెటర్నరీ వైద్యశాలలో అడిగి తీసుకెళ్తున్నామని వారు వాపోతున్నారు. మందులు లేవని.. బయట తెచ్చుకొమ్మని చెబుతున్నారని రైతులు అంటున్నారు. మందులు లేక పశువులకు పూర్తిస్థాయిలో చికిత్స అందడం లేదు. పశువైద్యశాలలకు కూడా సంవత్సరానికి మూడుసార్లు సరఫరా చేస్తున్నారని, అవి కూడా సరిపోవడం లేదని వెటర్నరీ వైద్యులు అంటున్నారు. మందుల కొరతతో అరకొర చికిత్స చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్రీల్
మూగ జీవాల అత్యవసస వైద్యంపై
నిర్లక్ష్యం
నియోజకవర్గానికి ఒక్క
సంచార పశువైద్యశాల
పెండింగ్లో 1962–సిబ్బంది వేతనాలు
ఇబ్బందులు పడుతున్న సిబ్బంది
వేతనాలు పెండింగ్లోనే ..
ఐదు నెలల వేతనాలు రాలేదని కొంత మంది సిబ్బంది చెబుతుండగా.. మరికొంత మంది మూడు రోజుల క్రితం మూడు నెలల వేతనాలు విడుదల చేశారని అంటున్నారు. వారు చెప్పిన ప్రకారం రెండు నెలల వేతనాలు పెండింగ్లోనే ఉన్నాయి. వేతనాలు రాక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సంచార వైద్యశాలల్లో మందుల కొరత, వారి వేతనాల విషయంలో పశువైద్య, సంవర్థక శాఖ అధికారులను వివరణ కోరగా వాటితో తమకు సంబంధం లేదని బదులిచ్చారు. కాగా, సంచార వైద్యశాలల విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మందుల కొరత, వేతనాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మూగ జీవాలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని రైతులు కోరుతున్నారు.
మందులు బంద్!
మందులు బంద్!


