యథాతథంగా రెస్క్యూ ఆపరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

యథాతథంగా రెస్క్యూ ఆపరేషన్‌

Mar 25 2025 1:47 AM | Updated on Mar 25 2025 1:41 AM

అచ్చంపేట: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఏడుగురి కార్మికుల ఆచూకీ కనుగొనాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో రెస్క్యూ ఆపరేషన్‌ యథాతథంగా కొనసాగనుంది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం, సహాయక చర్యల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నేటి సమీక్షలో ప్రభుత్వం సొరంగంలో సహాయక చర్యలు నిలిపివేస్తారన్న అందరి అంచనాలు తారుమారయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించలేమని సహాయక బృందాలు చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో మరికొన్ని రోజులపాటు ఆపరేషన్‌లో పాల్గొననున్నారు. 30 మీటర్ల వద్ద అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తే సహాయక సిబ్బంది ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లనుందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఎంత రెస్క్యూ అయినా కార్మికులను కాపాడాలని నిర్ణయించుకుంది. సహాయక బృందాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశానికి వెళ్లిన సొరంగం కుప్పకూలిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో సహాయక సిబ్బంది సోమవారం 31వ రోజు సహాయక చర్యలు చేపట్టారు. సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడి భాగాలను ప్లాస్మా కట్టర్‌తో కట్‌ చేసి బయటకి తెస్తున్నారు. మట్టి, రాళ్ల దిబ్బలు, బురద పూడిక, ఉబికి వస్తున్న నీటిని వాటర్‌ జెట్ల ద్వారా బయటికి పంపిస్తున్నారు.

సంక్లిష్ట పరిస్థితుల్లో..

ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్‌ నుంచి ప్రమాదం జరిగిన 14 కిలోమీటరు వద్ద గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా మారింది. ఈ క్రమంలో విద్యుత్‌, వెంటిలేషన్‌ పనులను పునరుద్ధరిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాద జోన్‌గా అధికారులు గుర్తించారు. నేషనల్‌ జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఎన్‌డీఆర్‌ఐ నిపుణుల నివేదిక ప్రకారం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎక్స్‌ఫర్ట్‌ కమిటీని కూడా నియమించి వారి సూచనలు, సలహాల మేరకు పనులు కొనసాగించనున్నారు. కేరళ నుంచి వచ్చిన కాడవర్స్‌ డాగ్స్‌ గుర్తించిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో చేపడుతున్న సహాయక చర్యలకు టీబీఎం భాగాలు అడుగడుగునా అడ్డు వస్తున్నాయి. అదేవిధంగా సొరంగం తవ్వకాలకు మినీ హిటాచీ, కన్వేయర్‌ బెల్టు, డీవాటరింగ్‌ పైపులు కూడా అడ్డు పడుతున్నాయి. సింగరేణి, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, దక్షిణమధ్య రైల్వే, హైడ్రా, ర్యాట్‌ హోల్స్‌ మైనర్స్‌, ఆర్మీ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.

ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగనున్న అన్వేషణ

31వ రోజూ సహాయక చర్యలు ముమ్మరం

ఏడుగురి ఆచూకీ కనుగొనాలని సీఎం ఆదేశాలు

యథాతథంగా రెస్క్యూ ఆపరేషన్‌ 1
1/1

యథాతథంగా రెస్క్యూ ఆపరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement