ట్రాక్టర్ పైనుంచి పడి మహిళ మృతి
గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై నుంచి కిందపడి ఓ మహిళ మృతి చెందినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. గద్వాల మండలం లత్తిపురం గ్రామానికి చెందిన పావని(30) భర్తతో కలిసి గురువారం సాయంత్రం వెంకటోనిపల్లి గ్రామం నుంచి ట్రాక్టర్పై కంకర నింపుకుని స్వగ్రామానికి వస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా కారణంగా మార్గమధ్యలో జమ్మిచెడ్ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పావని ట్రాలీ డోర్ కిందపడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. భర్త శంకర్ శుక్రవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు.
18 ఇసుక ట్రాక్టర్లు సీజ్
ఖిల్లాఘనపురం: అనుమతులు లేకుండా ప్రభుత్వ ఇసుక రీచ్లో అక్రమంగా ఇసుక నింపుతున్న 18 ట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్గౌడ్ తెలిపారు. వివరాలు.. మండలంలోని కమాలోద్దీన్పూర్ గ్రామ పంచాయతీలోని కొత్తపల్లె సమీపంలోని ప్రభుత్వ ఇసుక రీచ్లో గ్రామస్తులు ఫిర్యాదు మేరకు శుక్రవారం తహసీల్దార్ సుగుణ ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీలో ఇసుక నింపుకుంటున్న 19 ట్రాక్టర్లలో కేవలం ఒక్క ట్రాక్టర్కు మాత్రమే అనుమతి ఉండటంతో మిగిలిన 18 ట్రాక్టర్లను ఖిల్లాఘనపురం పోలీస్టేషన్కు తరలించారు. ఈ విషయమై ఎస్ఐకు పిర్యాధు చేయడంతో 18 ట్రాక్టర్లు, యాజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ సురేష్ గౌడ్ పేర్కొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తిమృతదేహం లభ్యం
మహబూబ్నగర్ క్రైం: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. వన్టౌన్ సీఐ అప్పయ్య కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎదుట శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి(40) మృతదేహం లభించింది. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వన్టౌన్ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు.
ఘరానా దొంగ అరెస్ట్ :
5 బైక్లు స్వాధీనం
గద్వాల క్రైం: తప్పించుకు తిరుగుతున్న ఘరానా దొంగను ఏట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం విలేకర్ల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రానికి చెందిన వంశీ, మరో ఏడుగురు యువకులు కలిసి ఉమ్మడి జిల్లాలో ద్విచక్ర వాహనాలను దొంగిలించేవారు. 2024, డిసెంబర్ 2న ముఠాలోని ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి 35 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వంశీ కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్నాడు. శుక్రవారం ఉదయం ధరూర్ మెట్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా పట్టణ శివారులో మరో అయిదు ద్విచక్ర వాహనాలను దాచినట్లు చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకొని వంశీని గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. వంశీపై ఇప్పటికే పలు దొంగతనాల కేసులు నమోదయ్యాయని.. అతడిని పట్టుకునేందుకు సాంకేతిక నిపుణులు చంద్రయ్య, శాంతికిరణ్ సహకరించినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను కోర్టు సమక్షంలో బాధితులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ వివరించారు.
‘ఆర్డీఎస్ రైతులపై
కోపమెందుకు..’
అయిజ: ఆర్డీఎస్ ఆయకట్టు రైతులపై ఎంపీ మల్లు రవికి కోపమెందుకో చెప్పాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని రైతులు కోరుతుంటే, ఎంపీ మాత్రం మల్లమ్మ కుంట రిజర్వాయర్ను రద్దు చేయాలని కలెక్టర్ ఎంబీ సంతోష్కి లేఖ రాశారన్నారు. కలెక్టర్ ఇరిగేషన్ ఎస్ఈకి లేఖ రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ సమస్య పరిస్కరిస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని తుగంలో తొక్కారని ఆరోపించారు. ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలంటే సింధనూరు గ్రామ సమీపంలోని డిస్ట్రిబ్యూటర్ 12 వద్ద ఆర్డీఎస్ కాలువకు లింక్ కలపాలన్నారు. అదే విధంగా వేముల వద్ద జూరాల నీటిని కలిపి మల్లమ్మ కుంట రిజర్వాయర్కు వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు భీమసేనరావు, గోపాలకృష్ణ, లక్ష్మణ్గౌడ్, అశోక్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ పైనుంచి పడి మహిళ మృతి


