బావిలో పడి వృద్ధుడి మృతి
అడ్డాకుల: మండలంలోని కందూర్ గ్రామంలో బావిలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జనిగె రాములు(75) ఉదయం గ్రామానికి సమీపంలో ఉన్న మర్రిబాయి వద్దకు వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకుంటుండగా అకస్మాత్తుగా అందులో పడి మునిగిపోయాడు. చాలా సేపటి తర్వాత బావిలో ఈతకు వెళ్లిన యువకులకు అందులో వృద్ధుడి మృతదేహం కనిపించింది. వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు బావి వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటికి తీశారు. వృద్ధుడికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా, కొన్నేళ్ల కిందట భార్య చనిపోయింది. వృద్ధుడి మృతిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
పాన్గల్: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు వివరాల ప్రకారం.. మండలంలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయ రఘుపతినాయుడు(38) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. ఈనెల 2న వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి అంబులెన్స్లో జిల్లా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. ఆస్పత్రిలో 26 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య శ్రీలేఖ, ఇద్దరు కూతురులు, కుమారుడు ఉన్నారు.
బైక్ను ఢీకొట్టిన
ఆర్టీసీ బస్సు
● యువకుడి దుర్మరణం
గోపాల్పేట: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నరేశ్ కుమార్ వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని హరిజనవాడకు చెందిన శేఖర్ (25) బైక్పై గోపాల్పేట మండలం బుద్ధారం నుంచి వనపర్తికి వెళ్తుండగా.. తాడిపర్తి గ్రామ సమీపంలోని ప్రమాదకర మలుపు (గొల్లోనిమిట్ట) వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో శేఖర్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా, శేఖర్ మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెళ్లి రోజు నాడే శేఖర్ మృత్యువాత పడటంతో వారి రోధనలు మిన్నంటాయి. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలోవ్యక్తి దుర్మరణం
మానవపాడు: జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రకాంత్ వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం మైలారం తండాకు చెందిన రాత్లావత్ శ్రీకృష్ణ(24) కర్నూల్లోని ప్రైవేట్ వెంచర్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై నాగర్కర్నూల్కు బయలుదేరాడు. ఈ క్రమంలో మానవపాడు శివారులో గద్వాల ఎస్పీ కార్యాలయంలో విధులు ముగించుకొని సమద్ రోడ్డు దాటుతున్న క్రమంలో శ్రీకృష్ణ బైక్పై ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు కిందపడ్డారు. శ్రీకృష్ణ తలకు బలమైన గాయాలు కాగా, సమద్కు స్వల్ప గాయాలయ్యాయి. కర్నూల్ ఆస్పత్రికి 108లో తరలించగా, అప్పటికే శ్రీకృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమద్ హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీకృష్ణ సోదరుడు రాత్లావత్ రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వ్యక్తి మృతదేహం
లభ్యం
మల్దకల్: మండలంలోని పెద్దపల్లి సమీపంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ నందికర్ వివరాల మేరకు.. పెద్దపల్లి సమీపంలోని కోళ్లఫారం వద్ద వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వయసు దాదాపు 38 ఏళ్లు ఉండవచ్చని ఎస్ఐ తెలిపారు. పూర్తి వివరాలకు 87126 70295 నంబర్ను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.
బావిలో పడి వృద్ధుడి మృతి


