లింగ నిర్ధారణపై ఉక్కుపాదం
● చట్టవ్యతిరేకంగా స్కానింగ్ కేంద్రాల్లో నిర్ధారణ ● పెరుగుతున్న అబార్షన్లు.. ● తగ్గుతున్న ఆడపిల్లల జననం ● స్కానింగ్ కేంద్రాలపై నిఘా
మంచిర్యాలటౌన్: లింగ నిర్దారణ పరీక్షలు చేయడం, చేయించుకోవడం లేదా ప్రోత్సహించడం చట్టవి రుద్ధం. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. మార్చి 25న జిల్లా కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. ‘బ్రూణ హత్యలను ఆపుదాం, ఆడపిల్లలను కాపాడుకుందాం‘ అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించి, ఒక్క ఆడ శిశువునూ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆడ శిశువుల సంఖ్య తగ్గుదల..
జిల్లాలో ఏటా పుట్టే శిశువుల్లో ఆడవారి కంటే మగవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆడ శిశువుల సంఖ్య క్షీణిస్తుండటంతో, లింగ నిర్దారణ పరీక్షలను నియంత్రించేందుకు పీసీపీఎన్డిటీ (ప్రీ–కాన్సెప్షన్ అండ్ ప్రీ–నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్) చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రెండేళ్ల జిల్లా ప్రసవ గణాంకాల్లో మగ శిశువుల సంఖ్య ఆడవారి కంటే ఎక్కువగా ఉండటం లింగ నిర్దారణ పరీక్షలు జరుగుతున్నాయనే అనుమానాలకు దారితీసింది.
స్కానింగ్ కేంద్రాల్లో లోపాలు
తనిఖీల్లో స్కానింగ్ కేంద్రాల్లో పలు లోపాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల స్కానింగ్ వివరాలు సక్రమంగా లేవు, రిజిస్టర్ల నిర్వహణలో లోపాలు, వైద్యుల వివరాలు లేకపోవడం, ఫీజు వివరాల డిస్ప్లే లేకపోవడం గుర్తించారు. కొన్ని కేంద్రాల్లో గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు లేకుండా స్కానింగ్ జరుగుతోంది. ఇటువంటి కేంద్రాలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు తనిఖీలు, నెలవారీ నివేదికలు సమర్పించాల్సిన నిబంధన ఉన్నప్పటికీ, లోపాలు సరిచేయడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ఈ చర్యలతో జిల్లాలో లింగ నిర్దారణ పరీక్షలను పూర్తిగా నిరోధించి, ఆడ శిశువుల రక్షణకు కలెక్టర్ కృషి చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా రెండేళ్లుగా జరిగిన ప్రసవాల వివరాలు
ఏడాది మొత్తం ప్రసవాలు మగ శిశువులు ఆడ శిశువులు
2023–24 5,819 2,884 2,869
2024–25 5,089 2,574 2,445
మొత్తం 10,908 5,458 5,314
సరిహద్దు రాష్ట్రాలపై దృష్టి
కొందరు జిల్లా సరిహద్దులో ఉన్నా మహారాష్ట్రకు వెళ్లి లింగ నిర్దారణ చేసుకుని, ఆడ శిశువులను అబార్షన్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై దృష్టి సారిస్తే జిల్లాలో ఆడ శిశువుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు
జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేసేందు కు పీసీపీఎన్డీటీ కమిటీని ఏర్పాటు చేసి, ఐదు టీంలను ఏర్పాటు చేశాం. స్కానింగ్ నిబంధనలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించేందుకు పీవో ఎంసీహెచ్ డాక్టర్ కృపాబాయిని నోడల్ ఆఫీసర్గా నియమించి, ఐదుగురు పారామెడికల్ ఆఫీసర్లను వేయడం జరి గింది. వీరితోపాటు, ఇతర ప్రోగ్రాం ఆఫీసర్లుతో నాలుగు టీంలను అదనంగా వేసి అన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వహణ పరిశీలిస్తున్నాం. పరిశీలన పూర్తయ్యాక, స్కానింగ్ కేంద్రాల వారితో సమీక్ష నిర్వహించి, చట్టం గురించి వివరించి, ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – డాక్టర్ హరీశ్రాజ్,
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి
స్కానింగ్ కేంద్రాలపై నిఘా
జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై కలెక్టర్ దృష్టి సారించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రోగ్రాం ఆఫీసర్, ఐదుగురు పారామెడికల్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, ఐదు బృందాలను రంగంలోకి దించారు. జిల్లాలో మొత్తం 52 స్కానింగ్ కేంద్రాలు ఉండగా, 4 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 48 ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 42 కేంద్రాలను తనిఖీ చేసిన కమిటీ, నిబంధనల పాటింపు, రిజిస్టర్ల నిర్వహణ, లింగ నిర్దారణ జరుగుతుందా లేదా అనే అంశాలను పరిశీలించింది. మిగిలిన 6 కేంద్రాల తనిఖీ తర్వాత, నిర్వాహకులతో సమీక్ష నిర్వహించి, చట్ట ఉల్లంఘనలపై చర్యలు తీసుకోనున్నారు.
లింగ నిర్ధారణపై ఉక్కుపాదం
లింగ నిర్ధారణపై ఉక్కుపాదం
లింగ నిర్ధారణపై ఉక్కుపాదం
లింగ నిర్ధారణపై ఉక్కుపాదం


