
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని వైవిధ్యమైన పాత్రలో విజయ్ కనిపించనున్నారు. ఈ సినిమాను తొలుత మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.
అయితే ఆ తర్వాత మే 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్ మేరకే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ– ‘‘కింగ్డమ్’ని తొలుత రెండు భాగాలుగా రూపొందించాలనుకోలేదు. అయితే స్టోరీ డిమాండ్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
రెండో భాగం కోసమని మొదటి పార్ట్ కథను పెంచలేదు. రెండో భాగానికి ‘కింగ్డమ్ స్క్వేర్’ లేదా ‘కింగ్డమ్ 2’.. ఏ టైటిల్ పెట్టాలి? అన్నది తొలి భాగం ఫలితం తర్వాత నిర్ణయిస్తాం’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ నటించిన ఏ సినిమా ఇప్పటివరకూ రెండు భాగాలుగా రాలేదు. అలా వస్తున్న ఆయన మొదటి చిత్రం ‘కింగ్డమ్’ కానుండటం విశేషం. ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్.
Comments
Please login to add a commentAdd a comment