వడ్డీ మాఫీతో
మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపునకు గ్రీన్సిగ్నల్
●
ప్రయోజనం పొందాలి..
పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీ రాయితీ కల్పించింది. ఈ నెల 31 వరకు అయితే 10 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలోని దుకాణాలు, ఇంటింటికి వెళ్లి ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. సమయం తక్కువగా ఉండటంతో ఈ అవకాశాన్ని ప్రతి వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలి.
– యాదయ్య,
మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చెల్లింపులకు బకాయిదారులు ముందుకు వస్తున్నారు. ఈ నెల 31 చివరి తేదీ కావడంతో కేవలం 10 శాతం వడ్డీ కడితే సరిపోతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి బకాయి వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని అధికారులకు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఈ నాలుగు రోజుల్లోగా వందశాతం పన్నులు వసూలు చేసేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
అచ్చంపేట: ఆస్తిపన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ ఊరటనిచ్చింది. నివాస గృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు సంబంధించి రాయితీ అవకాశం కల్పించారు. మొండి బకాయిలను రాబట్టేందుకు వన్టైం సెటిల్మెంట్ స్కీం (ఓటీఎస్) ప్రకటించింది. ఆస్తిపన్ను బకాయిలు పూర్తిగా చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బకాయి ఉన్నవారికి ఆస్తి పన్నుపై విధించిన వడ్డీని 90 శాతం తగ్గిస్తూ ఓటీఎస్ అమలులోకి తీసుకొస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లింపునకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో బకాయిలు 10 శాతం వడ్డీతో ఈ పథకం కింద చెల్లించవచ్చని పేర్కొన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు పన్నుల రాబడితో అభివృద్ధికి అడుగులు పడతాయి. దీంతో ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించింది.
ముందే చెల్లించిన వారికి సర్దుబాటు
జిల్లాలోని నాగర్కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో 90 శాతం రాయితీకి అర్హులైన పన్ను చెల్లింపుదారులను గుర్తించింది. ఈ మేరకు వీరంతా వందశాతం రాయితీ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 2025 మార్చి నాటికి ఆస్తిపన్ను వడ్డీ, జరిమానా చెల్లించిన వారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారు చెల్లించిన 90 శాతం వడ్డీ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నులో సర్దుబాటు చేస్తారు. ప్రభుత్వం ప్రతి ఏటా మార్చి, అక్టోబరు నెలల్లో ఇదే మాదిరిగా వన్టైం సెటిల్మెంట్ స్కీం తీసుకొస్తోంది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ప్రభుత్వం మరోసారి ఈ స్కీం అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వందశాతం సద్వినియోగం చేసుకునేలా పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలని కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలందాయి. సెలవు దినాల్లో సైతం కార్యాలయాల్లో అందుబాటులో ఉండి పన్ను చెల్లింపు స్వీకరించాలని సూచించింది.
మరో నాలుగు రోజులే..
90 శాతం రద్దుకు
అంగీకరించిన ప్రభుత్వం
31 వరకే ఓటీఎస్ పథకానికి అవకాశం
బృందాలుగా ఏర్పడి
ఇంటింటికి తిరిగి వసూలు
వందశాతం వసూలే లక్ష్యంగా చర్యలు
వెసులుబాటు


