అగ్ని ప్రమాదాలపై నిర్లక్ష్యం వహించొద్దు
నాగర్కర్నూల్ క్రైం: అగ్ని ప్రమాదాల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి అన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ముంబాయి విక్టోరియా డాక్ యార్డు నౌకలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు అనేవి అనుకోకుండా సంభవిస్తామని, ప్రమాదాలు జరిగినప్పుడు డయల్ 101కు సమాచారం అందిస్తే వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరకుని ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు కృషిచేస్తారన్నారు. అగ్ని అనేది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని, కానీ దానిని ఉపయోగించే క్రమంలో ఏదైనా అలసత్వం ప్రదర్శిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అగ్ని ప్రమాదాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణనష్టంతోపాటు, ఆస్తినష్టం కూడా సంభవిస్తుందన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
‘భూ భారతి’కి
మద్దూరు ఎంపిక
నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్ను సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద మద్దూరుమండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్షాలం సూచనలతో తహసీల్దార్ మహేశ్గౌడ్, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేతస్థాయిలో రైతులకు, ప్రజలకు ముందుగా భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు.
రెవెన్యూ గ్రామాలు 17..
భూమి 30,621 ఎకరాలు
మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్, చెన్నారెడ్డిపల్లి, చింతల్దిన్నె దమ్గన్పూర్ దొరెపల్లి, జాదరావ్పల్లి, ఖాజీపూర్, లక్కాయపల్లి, మద్దూర్, మల్కిజాదవ్రావ్పల్లి, మొమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్, పల్లెర్ల, పర్సపూర్, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండల వ్యాప్తంగా 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్ఐ, ఒకరు సర్వేయర్ విధుల్లో ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూర్ మండలానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.


