ప్రారంభమైన ‘పది’ స్పాట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ‘పది’ స్పాట్‌

Apr 4 2025 1:32 AM | Updated on Apr 4 2025 1:32 AM

ప్రారంభమైన ‘పది’ స్పాట్‌

ప్రారంభమైన ‘పది’ స్పాట్‌

నంద్యాల(న్యూటౌన్‌): పదో తరగతి జవాబుపత్రాల స్పాట్‌ (మూల్యాంకనం) గురువారం ప్రారంభమైంది. నంద్యాల పట్టణ శివారులోని ఎస్‌డీఆర్‌ పాఠశాలలో చేపట్టిన స్పాట్‌కు దాదాపు 684 మంది ఉపాధ్యాయులు, 100 మంది సిబ్బంది హాజరయ్యారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన జవాబు పత్రాలను పకడ్బందీ ఏర్పాట్ల మధ్యన మూల్యంకనం చేస్తున్నారు. డీఈఓ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాకు ఇప్పటి వరకు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి 2 లక్షల వరకు జవాబు పత్రాలు వచ్చాయి. జనరల్‌ విద్యార్థుల సోషల్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన జవాబు పత్రాలు రావాల్సి ఉంది.

‘పీఎం సూర్య ఘర్‌’పై

విస్తృత ప్రచారం

నంద్యాల: పీఎం సూర్య ఘర్‌ పథకంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని విద్యుత్‌ అధికారులను జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో పీఎం సూర్య ఘర్‌, కుసుమ్‌ పథక అమలుపై జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌తో కలిసి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 87,632 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు సూర్య ఘర్‌ సోలార్‌ ప్యానల్‌ కనెక్షన్ల కోసం పేర్లు నమోదు చేయించుకున్నారన్నారు. పీఎం సూర్య ఘర్‌ సంబంధించి ప్రతి నియోజకవర్గంలో పదివేల ఇళ్లపై సోలార్‌ ఫలకలు ఏర్పాటు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారన్నారు. పీఎం కుసుం పథకం కింద జిల్లాలో 130 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లకు అవసరమైన స్థలాల సేకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సుధాకర్‌ కుమార్‌, ఈఈలు, ఎల్‌డీఎం రవీంద్ర కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మార్కెటింగ్‌ శాఖకు

పెరిగిన ఆదాయం

కర్నూలు(అగ్రికల్చర్‌): 2024–25 సంవత్సరంలో మార్కెటింగ్‌ శాఖకు ఆదాయం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలపై వ్యాపారుల నుంచి సంబంధిత మార్కెట్‌ కమిటీలు 1 శాతం ఫీజు వసూలు చేస్తారు. ఆ ప్రకారం రూ.36.18 కోట్ల ఫీజు వసూలు లక్ష్యం కాగా, రూ.39.36 కోట్లు వసూలైంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ మార్కెట్‌ కమిటీలు లక్ష్యాలను అధిగమించగా.. మంత్రాలయం, కోడుమూరు, ఆలూరు మార్కెట్‌లు వెనుకబడినట్లు మార్కెటింగ్‌ శాఖ ఏడీ నారాయణమూర్తి తెలిపారు.

మెరిట్‌, ఎంపిక జాబితా విడుదల

కర్నూలు(హాస్పిటల్‌): ఉద్యోగాల భర్తీకి ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌, సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌, జనరల్‌ హాస్పిటల్స్‌, గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి 2023 నవంబర్‌ 20న నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 11 కేటగిరీల అభ్యర్థుల ఫైనల్‌ మెరిట్‌, సెలక్షన్‌ జాబితాను https:// kurnool. ap. gov. in, https:// nandyal. ap. gov. in, https:// kurnoolmedical. ac. inలల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశామమని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు సెట్ల నకలు సర్టిఫికెట్లతో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 10.30 గంటలకు కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. హాజరుకాని అభ్యర్థుల ఎంపిక రద్దు చేస్తామన్నారు.

రైతుసేవా కేంద్రాల్లో

జొన్నల కొనుగోలు

కర్నూలు(సెంట్రల్‌): రైతుసేవా కేంద్రాల్లో మహేంద్ర రకం జొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు జేసీ డాక్టర్‌ బి.నవ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్‌, ఈకేవైసీ చేయించుకున్న రైతులు తమ పేర్లను సచివాలయాల్లో నమోదు చేసుకుంటే క్వింటా జొన్నలు రూ.3,371 ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. నిర్దేశించిన మేరకు నాణ్యత ఉండే జొన్నలనే కొనుగోలు చేస్తామని.. హమాలీ, రవాణా ఖర్చులను పౌరసరఫరాల సంస్థ భరిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement