పెళ్లి కుమారుడిగా రంగనాథుడు
జూపాడుబంగ్లా: తర్తూరు శ్రీ లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం స్వామివారు పెళ్లికుమారునిగా ముస్తాబయ్యారు. ఉదయం స్వామివారికి అర్చకులు పంచామృత అభిషేకాలు, పుష్పార్చన, కుంకుమార్చన వంటి విశేషపూజలు చేపట్టారు. అనంతరం స్వామివారిని పట్టువస్త్రాలతో పెళ్లికుమారునిగా అర్చకులు అలంకరించారు. స్వామివారు తర్తూరులో పెళ్లికుమారునిగా ముస్తాబైన అనంతరం ఇక్కడ పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అయితే తర్తూరులో స్వామివారికి కల్యాణం నిర్వహించరు. బ్రహ్మోత్సవాల అనంతరం స్వామి వారు నెల్లూరు జిల్లాల్లోని శ్రీరంగాపురంలో జరిగే కల్యాణ వేడుకలకు తరలివెళ్తారని, అక్కడ శ్రీలక్ష్మి సమేత రంగనాథ స్వామివార్లకు కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని పూజారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ వారం స్వామివారికి సింహ వాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి ఈశ్వరరెడ్డి, ఈఓ సాయికుమార్, ఫెస్టివల్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు.
శ్రీశైలంలో 15న కుంభోత్సవం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 15న భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థాన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. కుంభోత్సవం నిర్వహించే రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అమ్మవారి ఆలయ మెట్ల మార్గంలో అదనపు క్యూలైన్లను ఏర్పాటు చేయాలన్నారు. దేవదాయ చట్టాన్ని అనుసరించి క్షేత్ర పరిధిలో జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధించా మన్నారు. క్షేత్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల్లో కూడా పోలీసు, రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో దేవస్థాన వైదిక సిబ్బంది, శాఖాధిపతులు, విభిన్న విభాగాల పర్యవేక్షకులు, తహసీల్దార్ కేవీ శ్రీనివాసులు, సీఐ ప్రసాదరావు పాల్గొన్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మధ్యాహ్నం వరకే
నంద్యాల: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే కార్యక్రమం మధ్యాహ్నం లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించాలన్నారు.
వారిది ఆత్మహత్యాయత్నం
పాములపాడు: ఇస్కాల గ్రామంలో సోమేశ్వరుడు అనే రైతు నలుగురు కుటుంబ సభ్యులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని డీఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ తెలిపారు. గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అతిసార లక్షణాలతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో డీఎంఅండ్హెచ్ఓ ఆదివారం ఇస్కాలను సందర్శించారు. అయితే గ్రామంలో డయేరియా కేసు లు లేవని నిర్ధారించారు. సోమేశ్వరుడు అప్పులబాధతో కుటుంబసభ్యులతో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసిందన్నారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారికి సమాచారం ఇచ్చామన్నారు. ఆయన వెంట డాక్టర్ నాగలక్ష్మి, సర్పంచు మౌలాలి, హెల్త్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
పెళ్లి కుమారుడిగా రంగనాథుడు
పెళ్లి కుమారుడిగా రంగనాథుడు


