గుండెపోటా.. వైద్యులు లేరు! | - | Sakshi
Sakshi News home page

గుండెపోటా.. వైద్యులు లేరు!

Published Sun, Feb 9 2025 12:44 AM | Last Updated on Sun, Feb 9 2025 12:44 AM

గుండె

గుండెపోటా.. వైద్యులు లేరు!

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో..

పాత కలెక్టరేట్‌ ఆవరణలో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో అయిన అన్ని విభాగాలు అందుబాటులోకి వచ్చి హైదరాబాద్‌కు పోయే బాధ తప్పుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. కొత్తగా నిర్మించే ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం అందుబాటులో ఉండి అందులో అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌, థొరాసిక్‌ సర్జరీ థియేటర్‌, ఇతర పరికరాలు సైతం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక అవసరమైన గుండె వైద్య నిపుణులు, కార్డియో థొరాసిక్‌ సర్జన్లను నియమిస్తే తప్ప పాలమూరు వాసుల సమస్యలు తీరవు.

‘ఇటీవల ఓ జిల్లా స్థాయి అధికారి గుండెపోటు బారినపడ్డారు. స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించాక మళ్లీ హైదరాబాద్‌ రెఫర్‌ చేసి పంపారు. మరో ఘటనలో 35 ఏళ్ల యువకుడికి గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఆదివారం వైద్యులు లేరని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌ తరలించాల్సి వచ్చింది. ఫలితంగా గుండెపోటు బారినపడి జనరల్‌ ఆస్పత్రికి వచ్చిన బాధితులు ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్‌కు తరలించే క్రమంలో మృతి చెందిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇటీవల విధుల్లో ఉన్న ఓ ఏఆర్‌ కానిస్టేబుల్‌కు సడెన్‌గా గుండెపోటు రావడంతో చికిత్స కోసం జనరల్‌ ఆస్పత్రికి తీసుకువచ్చిన కార్డియాలజీ విభాగం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనే ఇందుకు ఉదాహరణ.

ప్రైవేట్‌లోనూ అంతే..

పాలమూరు పట్టణంలో ప్రైవేట్‌ సెక్టార్‌లో నాలుగు క్యాథ్‌ ల్యాబ్‌లు ఉండగా ఆరుగురు వరకు కార్డియాలజిస్ట్‌లు అందుబాటులో ఉన్న కార్డియోథొరాసిక్‌ సర్జన్‌లు ఒక్కరు కూడా లేరు. దీంతో గుండెకు సంబంధించిన ఏదైనా చిన్నపాటి సర్జరీ చేయాలన్నా హైదరాబాద్‌ నుంచి టీంలు రప్పించి ఇక్కడ చేస్తున్నారు. ఇందుకోసం రోగుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. చాలా వరకు మేజర్‌ సర్జరీలు ఉంటే అందరూ హైదరాబాద్‌కు వెళ్తున్నారు. స్థానికంగా ఒకటి రెండు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొంత మేర సేవలు అందుబాటులో ఉన్న ఫీజులు మాత్రం భారీగా ఉంటున్నాయి. ఎంజియోగ్రాం చేయించుకోవడానికి రూ.15 వేల – 25 వేల వరకు ఖర్చు అవుతోంది. ఒకవేళ స్టంట్‌ వేయాల్సి వస్తే అదనంగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కూడా అందుబాటులో లేకపోవడంతో నిరుపేదలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు.

పాలమూరు: ఇటీవల జిల్లాలో గుండెపోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే పాలమూరు ప్రజలకు గుండెపోటు వస్తే అంతే సంగతులు అనే విధంగా మారాయి పరిస్థితులు. ఇటు ప్రభుత్వ ఆస్పత్రి.. అటు ప్రైవేట్‌లోనూ సరైన వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సి వస్తోంది. దీంతో రూ.లక్షల్లో వైద్య ఖర్చులు భరించలేక బాధితులు అవస్థలు పడుతుండగా.. మరికొందరు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటుతో వచ్చే బాధితులకు కనీసం ప్రాథమికంగా చేసే చికిత్స సైతం అందుబాటులో లేకుండాపోయింది. జనరల్‌ ఆస్పత్రిలో 2డీ ఎకో మిషన్‌ అందుబాటులో ఉన్నా టెక్నీషియన్‌ లేక వాడటం లేదు. ఇక ఈసీజీ అందుబాటులో ఉన్న రిపోర్ట్‌ సక్రమంగా వస్తుందా.. రాదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కలెక్టర్‌ చెప్పినా..

జనరల్‌ ఆస్పత్రిలో గుండెపోటు రోగులను పరీక్షించడానికి ప్రైవేట్‌ కార్డియాలజిస్ట్‌లను రప్పించి వారంలో నాలుగు రోజులు ఓపీ చూసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్‌ విజయేందిర ఐఎంఏ అధ్యక్షుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు. కమిటీ సమావేశం జరిగి దాదాపు 25 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆ విధానం అమల్లోకి రాలేదు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో కూడా ఇదే మాదిరిగా ప్రైవేట్‌ గుండె వైద్యులను తీసుకువచ్చి ఓపీ చూసేలా ఏర్పాట్లు చేసినా ఒకటి రెండు రోజులు కూడా రోగులకు అందుబాటులో ఉండలేదు. దీంతో గుండెకు సంబంధించిన సమస్య వస్తే పేదవాడు సైతం జనరల్‌ ఆస్పత్రి రావడం లేదు. ఇక ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన రోగుల్లో ఎవరికై నా గుండె సమస్య వస్తే జనరల్‌ మెడిసిన్‌ వైద్యుడితో పరీక్షిస్తున్నారు. రోగికి సమస్య తీవ్రత అధికంగా ఉంటే బయటకు రెఫర్‌ చేసి పంపుతున్నారు.

జనరల్‌ ఆస్పత్రిలో అందుబాటులోకి రాని కార్డియాలజీ సేవలు

ప్రైవేట్‌ వైద్యులతో ఓపీ సేవలు అందించాలని కలెక్టర్‌ సూచించినా అమల్లోకి రాని వైనం

ప్రైవేట్‌లోనూ అందుబాటులో లేని కార్డియోథొరాసిక్‌ విభాగం

గుండె సమస్యలు అంటేనే హైదరాబాద్‌కు సిఫార్సు

అత్యవసర వేళలో ప్రాణాలు కోల్పోతున్న బాధితులు

ఐఎంఏతో సమన్వయం చేసుకుని ప్రైవేట్‌లో ఉన్న వైద్యులతో మాట్లాడటం జరిగింది. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఓపీ చూడటానికి కసరత్తు చేస్తున్నాం. త్వరలో జనరల్‌ ఆస్పత్రిలో ప్రైవేట్‌ కార్డియాలజిస్ట్‌ సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకొస్తాం.

– సంపత్‌కుమార్‌సింగ్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
గుండెపోటా.. వైద్యులు లేరు! 1
1/1

గుండెపోటా.. వైద్యులు లేరు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement