ఆర్థిక బాసట.. అతివలకు ఊరట | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక బాసట.. అతివలకు ఊరట

Mar 14 2025 12:48 AM | Updated on Mar 14 2025 1:12 AM

కోస్గి: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడంతోపాటు అన్ని రంగాల్లో చైతన్య పర్చేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పొదుపు సంఘాల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ జీవనోపాధుల మిషన్‌ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) లోకోస్‌ యాప్‌లో మహిళా సంఘాల సమగ్ర సమాచారం నిక్షిప్తం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహిళా సంఘాల సమగ్ర సమాచారం ఇకపై ఢిల్లీతో అనుసంధానం కానుంది.

బీమా పథకాలపై ఆరా..

మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న బీమా పథకాలపై సైతం కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది. ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా, సురక్ష బీమా యోజన పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. తక్కువ ప్రీమియంతో ఈ పథకాల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తూ అనుకోని కష్టకాలంలో బీమా సొమ్ముతో అండగా నిలుస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న బీమా పథకాల్లో చేరిన మహిళల వివరాలను అధికారులు ప్రత్యేక యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

నేరుగా లబ్ధి చేకూర్చే లక్ష్యంతోనే..

కేంద్రం నిధులు నేరుగా లబ్ధిదారులకే అందించాలనే కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. గ్రామ పంచాయతీలకు ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను జీపీల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. గతంలో నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తే అక్కడి నుంచి పంచాయతీలకు సర్దుబాటు చేసేవారు. మూడేళ్ల క్రితం నుంచి ఈ విధానాన్ని నిలిపివేసి నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేస్తున్నారు. మహిళా సంఘాలకు సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలనే లక్ష్యంతోనే లోకోస్‌ యాప్‌ ద్వారా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. పూర్తి వివరాల సేకరణ అనంతరం కేంద్ర ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఇచ్చే వడ్డీ రాయితీ నేరుగా మహిళా సంఘాల సభ్యులకే అందనుంది. ఇదిలాఉండగా, జిల్లాలోని 13 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 415 గ్రామ సమైక్య సంఘాలు, 10,324 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో మొత్తం 1,13,168 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరందరి వివరాలను జిల్లా డీఆర్‌డీఏ అధికారులు ప్రత్యేక లోకోస్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో సమగ్ర వివరాల నమోదు

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా సంఘాల సమగ్ర వివరాలను క్షేత్రస్థాయి నుంచి నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఎన్‌ఆర్‌ఎల్‌ఎంకు చెందిన లోకోస్‌ యాప్‌లో పొదుపు సంఘాలకు సంబందించిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నారు. సంఘం ఏర్పాటైన సంవత్సరం, సభ్యుల సంఖ్య, పొదుపు, బ్యాంకు, సీ్త్రనిధి రుణాలు, వాయిదాల చెల్లింపులు తదితర అంశాలను నమోదు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ నమోదు ద్వారా సంఘాల క్షేత్రస్థాయి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తెలుసుకునేందుకు వీలవుతుంది.

మహిళా సంఘాల వివరాలు సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

ప్రత్యేకంగా లోకోస్‌ యాప్‌ ద్వారా

సమగ్ర వివరాల నమోదు

నేరుగా లబ్ధి చేకూర్చాలని లక్ష్యం

జిల్లాలో 1.13 లక్షల మంది సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement