
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రపంచం యావత్తూ సంతాపం తెలుపుతోంది. ఈ ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఒక్కో బాధిత కుటుంబానిది ఒక్కో విషాద గాథ. వీటిని వింటున్నప్పుడు ఎవరికైనా కళ్లు చమర్చరకమానవు. ఎయిర్ ఇండియా విమానం ఏI 171 ప్రమాదంలో మరణించిన 242 మందిలో 37 ఏళ్ల జావేద్, అతని భార్య మరియం, వారి ఐదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నారు.
తల్లితో పండుగ చేసుకునేందుకు వచ్చి..
15 ఏళ్ల తరువాత ఈద్ అల్-అధా పండుగను తమ తల్లితో కలిసి చేసుకునేందుకు జావేద్ నలుగురు తోబుట్టువులు తమ కుటుంబాలతో సహా అహ్మదాబాద్కు తరలివచ్చారు. ఈ విధంగా కుటుంబంలోని అందరూ కలుసుకునేందుకు వారు ఏళ్ల తరబడి ఎదురు చూశారు. అయితే ఈ విమాన ప్రమాదం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందని వారు ఆ సమయంలో గ్రహించలేకపోయారు. ఈ ప్రమాదంలో జావేద్ కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయిందనే సంగతిని హృద్రోగంతో బాధపడుతూ, త్వరలో చికిత్స చేయించుకోబోతున్న అతని తల్లికి చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.
దీనికి ఎవరు బాధ్యులు?
తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి జావేద్ సోదరుడు ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ ‘అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో బాధితులను గుర్తించేందుకు వారి నమూనాలను సేకరిస్తున్నారని అధికారులు తెలిపారు. మా సోదరుడు సంతోషంగా వేడుకలు చేసుకునేందుకు అహ్మదాబాద్ వచ్చాడు. ఇప్పుడు మేము నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయాం. దీనికి ఎవరు బాధ్యులు? ఈ ప్రమాదంలో 240 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. విమానం బయలుదేరిన కొద్ది సెకెన్లకే అది కూలిపోయింది. ఇది ఎలా జరిగింది? 11 ఏళ్ల క్రితం చదువుకునేందుకు యూకే వెళ్లిన నా సోదరుడు మరియంను వివాహం చేసుకుని, బ్రిటిష్ పౌరునిగా మారాడు.
‘అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్’
మా అమ్మతో ఈద్ వేడుక చేసుకునేందుకు జావేద్ ఇక్కడికి వచ్చాడు. అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్ జరగాల్సివుంది. మేమంతా గత 15 ఏళ్లుగా ఎప్పుడూ కలిసివుండలేదు. మా అమ్మకి ఇంకా ఆ విషయం చెప్పలేదు. జావేద్ను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పాం. మా కుటుంబం ఇద్దరు చిన్నారులను కూడా కోల్పోయింది. ఇది మాకు తీరని విషాదం. గురువారం రాత్రి జావేద్ మృతదేహాన్ని గుర్తించేందుకు రక్త నమూనాను ఇచ్చాను. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చాకనే మా సోదరుణ్ణి గుర్తించగలుగుతాం. ఆదివారం నాటికి రిపోర్టు వస్తుందని చెబుతున్నారు’ అని ఇంతియాజ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతిచెందారు.
ఇది కూడా చదవండి: వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు..