-
మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
మీరు.. మీ పిల్లల ఆలోచనలను, వారి నడవడికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే.. అది మీకు, మీ పిల్లలకి మధ్య భావోద్వేగ అంతరానికి కారణం కావచ్చు. ఈ దూరాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం మీ పిల్లలతో చాలా మాట్లాడటం. కొన్ని ప్రశ్నలు అడుగుతూండటం చేయాలి. మీరడిగే ప్రతీది వారి మనస్సును మలుచుకోవడంలో సహాయమవుతుంది. భావోద్వేగాలను పంచుకోవడంలో తోడ్పడుతుంది. అలాగే, వారిలో పాతిపెట్టిన విషయాలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇలా చేసి చూడండి!ప్రతీ తల్లితండ్రులు తమ పిల్లలను అడగాల్సిన ప్రశ్నలివే..1. 'నీవు ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తావు?'.. అనే ఈ ప్రశ్న అడగడంతో.. పిల్లవాడిని ఆలోచించేలా చేస్తాయి. దీంతో మీరు అతని అంతర్గత ఆలోచనలు, సమస్యలను మెరుగైన మార్గంలో ఉంచగలుగుతారు. ఇలాంటి విషయాలను తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్గా అడగడమే ఉత్తమం.2. 'నీకు నచ్చే విషయమేంటి? ఎలా సంతోషంగా ఉంటావ్?'.. ఈ ప్రశ్న అతనికి తన గురించి చెప్పే అవకాశాన్ని ఇస్తుంది. దీంతో తన కోరికలను వ్యక్తం చేయగలడు.3. మీరు మీ పిల్లల్ని తప్పకుండా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే? 'నేను మీతో తక్కువ లేదా ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది?' ఈ విధంగా సూటిగా చూస్తూ అడగడంతో.. వారి కళ్ళ నుంచి మీకు, మీ బిడ్డకు మధ్య ఉన్న సరైన బంధాన్ని అర్థం చేసుకోగలరు.4. పిల్లలు పెరుగుతున్నప్పుడు.. తరచుగా కొన్ని ఆలోచనలలో మునిగిపోతూంటారు. ఆ సమయంలో మీరు వారిని తప్పకుండా అడగాల్సిన విషయం ఇదే.. 'నీ జీవితంలో నీవు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఏదైనా సమస్యా?' అని అడగడంతో వారిలో ఏదైనా ప్రశ్న ఉన్నా భయ సంకోచాన్ని వదిలేస్తారు.5. 'కుటుంబంతో నీవు కలిగి ఉన్న ఉత్తమ జ్ఞాపకం ఏంటి?' ఇలా అడిగితే.. వాళ్లు కుటుంబంతో గడిపిన మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. పిల్లలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో కూడా మీరు అర్థం చేసుకుంటారు.6. 'ఒత్తిడికి లేదా ఆందోళనకు గురికావడం వంటివి ఏవైనా ఉన్నాయా?' ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే? నేటి జీవనశైలిలో 'మానసిక ఒత్తిడి' పిల్లల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. వారి వ్యక్తిత్వ ఎదుగుదలపై ప్రభావితం చూపుతుంది. ఈ ఒత్తిడిని పెద్దలు నిర్వహించగలరు. కానీ పిల్లలు తరచుగా ఈ సమస్యలలో చిక్కుకుంటున్నారు. దీని పర్యవసానాలు చాలా ప్రమాదకరమైనవి. కనుక వారిని తరచుగా అడగండి.. ఒత్తిడి నుంచి ఎలా బయటపడాల్లో నేర్పించండి.7. 'మీరు నాతో ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా!' అని అడగడంతోపాటు వారి ఆశను నెరవేర్చాలి. ఎందుకంటే? పిల్లలు తరచుగా ఒంటరిగా ఉంటారు. తల్లిదండ్రులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపాలని లోలోనే తపిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారితో కలిసి కొన్ని కొత్త విషయాలను నేర్చుకోవడంలో మంచి అవకాశాన్ని ఇస్తుంది. -
జేసీ కుటుంబంపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో జేసీ కుటుంబ సభ్యులు విధ్వంసం సృష్టించారు. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదైంది.జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్పై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఐదు వాహనాలు ధ్వంసం కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు. -
గేమింగ్ వరల్డ్కు.. పురాణ సౌరభం నింపిన ‘చిత్తం!’
చెన్నైకి చెందిన చరణ్య కుమార్కు గేమింగ్ అంటే ఎంతో ఇష్టమో, పురాణాలు అంటే కూడా అంతే ఇష్టం. అందుకే పురాణాలలోని ఆసక్తికర అంశాలను, స్ఫూర్తిదాయకమైన విషయాలను గేమింగ్లోకి తీసుకువచ్చింది చరణ్య కుమార్. ఆమెప్రారంభించిన ‘చిత్తం’ గేమింగ్ కంపెనీ విజయపథంలో దూసుకుపోతోంది...యూఎస్లో ఇంజినీరింగ్ చేసిన చరణ్య కుమార్ ఎన్నో పెద్ద కంపెనీలలో కన్సల్టింగ్ విభాగంలో పనిచేసింది. కొన్ని సంవత్సరాల క్రితం వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సమస్యల వల్ల పురాణాలకు దగ్గరైంది. వాటిని చదవడం తనకు ఎంతో సాంత్వనగా ఉండేది. అమ్మమ్మ ద్వారా పురాణాలలోని గొప్పదనం గురించి చిన్న వయసులోనే విన్నది కుమార్.‘జీవితంలో ప్రతి సమస్యకు పురాణాల్లో సమాధానం దొరుకుతుంది’ అంటుంది కుమార్. ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకున్న కుమార్ ఆ తరువాత ఎంబీఏ చేసింది. ‘పురాణాలు ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితమైనవి కాదు. పౌరాణిక విషయాలు నిత్యజీవితంలో ఎన్నో రకాలుగా దారి చూపుతాయి. కష్టకాలంలో పురాణ పఠనం నాకు ధైర్యాన్ని ఇవ్వడమే కాదు సొంతంగా ఏదైనాప్రారంభించాలనే పట్టుదలను కూడా ఇచ్చింది. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. నేను ధైర్యంగా వేసిన మొదటి అడుగు ఎంబీఏ చేయడం’ అంటున్న కుమార్ గేమింగ్ కంపెనీ ‘చిత్తం’ రూపంలో తన కలను నెరవేర్చుకుంది.తక్కువప్రాడక్ట్లతో మొదలైన ‘చిత్తం’ మొదటి సంవత్సరంలోనే పదమూడుప్రాడక్ట్స్కు చేరుకుంది. ‘ఫన్’ ఎలిమెంట్స్ను జత చేస్తూ ‘చిత్తం’ రూపొందించిన గేమ్స్, యాక్టివిటీస్, బుక్స్ సూపర్ హిట్ అయ్యాయి. తమిళ సామెతలను దృష్టిలో పెట్టుకొని ‘పార్టీ టాక్స్’ అనే గేమ్ను డిజైన్ చేశారు. ‘భరత విలాస్’ అనేది చిత్తం బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఈ కార్డ్ గేమ్ మన సంస్కృతిలోని రకరకాల నృత్యరూపాలు, వంటల రుచులు... మొదలైన వాటిని వెలికితీస్తుంది.‘సింపుల్ గేమ్ ప్లే–సింపుల్ కంటెంట్ అనే రూల్ని నమ్ముకొని ప్రయాణంప్రారంభించాం. మా నమ్మకం వృథా పోలేదు’ అంటుంది చరణ్య. వ్యాపార అనుభవం లేకపోవడం వల్ల మొదట్లో ఫండింగ్ విషయంలో కాస్తో కూస్తో ఇబ్బంది పడినా ఆ తరువాత మాత్రం తనదైన ప్రత్యేకతతో ఇన్వెస్టర్లను ఆకర్షించి విజయపథంలో దూసుకుపోతోంది ‘చిత్తం’.ఇవి చదవండి: కాన్స్లో ఆ ముగ్గురు -
ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
వరి పంట పండించటంలోనే కాదు, పంటను నూర్పిడి చేసి ఆరుబయట కళ్లంలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవటంలోనూ రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు కళ్ళాల్లో వరి ధాన్యం తడిచిపోవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్లాల్లో పంట కళ్లెదుటే నీటిపాలవ్వకుండా రక్షించుకోవటానికి రైతులు ఎవరికి వారు తమ కళ్లం దగ్గరే నిర్మించుకోదగిన ఓ ఫ్లాట్ఫామ్ గురించి సింగరేణి మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీరామ సూచిస్తున్నారు.ఇది కళ్లం/పొలంలోనే నిర్మించుకునే శాశ్వత నిర్మాణం. నలు చదరంగా ఉండే పొలంలో అయితే, ప్లస్ ఆకారంలో, సుమారు 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తుగల మంచెను పర్మనెంటుగా వేసి ఉంచాలి. దీర్ఘ చతురస్రాకార పొలమైతే, పొడుగ్గా దీన్ని నిర్మిస్తే చాలు. దీనికి, పొలం గట్లపై ఉండే 2 లేక 3 తాడి చెట్లు కొట్టి వేస్తే చాలు. తాటి మొద్దులను 5 అడుగుల ముక్కలుగా కోసి, భూమిలోకి 2 అడుగులు, భూమి పైన 3 అడుగులు ఎత్తున ఉండేలే చూడాలి. రెండు మొద్దుల మధ్య దూరం 6 అడుగులు ఉంటే చాలు.దీని మీద జీఐ చెయిన్ లింక్ ఫెన్స్ లేదా మెటల్ ఫెన్స్ లేదా రోజ్ హెడ్ నెయిల్స్ సహాయంతో వ్యవసాయ సీజన్ మొదట్లోనే అమర్చి ఉంచుకోవాలి. అకాల వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన సమయంలో ఈ మంచెపైన టార్పాలిన్ షీట్ పరచి, దానిపైన ధాన్యాన్ని ఎత్తిపోసుకోవాలి. ధాన్యంపైన కూడా టార్పాలిన్ షీట్ కప్పి చైన్లింక్ ఫెన్స్కి తాళ్లలో గట్టిగా కట్టాలి. ఎంతపెద్ద గాలి అయినా, తుపాను అయినా, 2 అడుగుల లోపు వరద వచ్చినా, ధాన్యం తడవకుండా ఇలా రక్షించుకోవచ్చు. ధాన్యం ధర తగ్గించి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.చిన్న కమతాల్లో అయితే అకాల వర్షం నుంచి పంటను కాపాడుకోవటానికి రైతు, అతని భార్య ఈ పని చేసుకోవచ్చు లేదా ఇద్దరు మనుషులు చాలు. ఈ మంచెకు పొలం విస్తీర్ణంలో ఒక శాతం అంటే ఎకరానికి ఒక సెంటు స్థలాన్ని కేటాయిస్తే చాలు. ఆ స్థలం కూడా వృథా కాదు. దీన్ని పందిరిగా వాడుకుంటూ బీర, ఆనప, చిక్కుడు తదితర తీగ జాతి కూరగాయలు సాగు చేసుకోవచ్చు.చిత్రంలో సూచించిన మాదిరిగా మంచెను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ సూచించిన కొలతలను రైతులు తమ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఎకరానికి ఒక సెంటు భూమిలో ఇలా తక్కువ ఖర్చుతో, రైతుకు తేలికగా దొరికే తాడి దుంగలతో వేదికను నిర్మించుకుంటే సరిపోతుందని శ్రీరామ (83095 77123) సూచిస్తున్నారు.ఇవి చదవండి: పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం! -
పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం!
ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా అవసరమైనది జీవామృతం. దేశీ ఆవుల పేడ, మూత్రం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసే జీవామృతం ప్రభావశీలంగా పనిచేస్తుందన్న భావన ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో రాజస్థాన్కు చెందిన మహిళా రైతు ‘జయ దగ’ అందుకు భిన్నంగా.. గుర్రాల పేడ, మూత్రంతో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. గిర్ ఆవుల విసర్జితాలతోనే కాకుండా.. గుర్రాల విసర్జితాలతో కూడా ఆమె వేర్వేరుగా ద్రవ జీవామృతం తయారు చేసి తమ పొలాల్లో వివిధ పంటల సేంద్రియ సాగులో ఆమె వాడుతున్నారు.అహ్మదాబాద్కు చెందిన మహేశ్ మహేశ్వరి అభివృద్ధి చేసిన ట్యూబ్ పద్ధతిలో అధిక కర్బనంతో కూడిన అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతాన్ని ఈ రెండు రకాలుగా జయ గత 8 నెలలుగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఈ జీవామృతంతో తమ వ్యవసాయ క్షేత్రాల్లో నేపియర్ గడ్డి, మునగ, మామిడి తదితర పంటలను సేంద్రియంగా సాగు చేస్తున్నారు.ఆవుల జీవామృతంతో పోల్చితే గుర్రాల విసర్జితాలతో తయారైన జీవామృతం పంటల సాగులో మరింత ప్రభావశీలంగా పనిచేస్తోందని జయ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అయితే, గుర్రాల జీవామృతాన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో పంటలకు వాడకూడదని, ఇతర కాలాల్లో ఏ పంటలకైనా వాడొచ్చని ఆమె సూచిస్తున్నారు.గుర్రాల పెంపక క్షేత్రాలు..రాజస్థాన్కు చెందిన జయ దగ కుటుంబీకుల ప్రధాన వ్యాపారం గుర్రాల ద్వారా ఔషధాల ఉత్పత్తి. ఇందుకోసం సుమారు 2 వేల వరకు గుర్రాలను రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్తో పాటు మహబూబ్నగర్ జిల్లాలోని ముత్పూర్, రాజాపూర్ గ్రామాల్లో గల తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆమె పెంచుతున్నారు. పాములు, తేళ్లు కాటు వేసినప్పుడు విరుగుడుగా వాడే ఇంజక్షన్లతో పాటు.. కుక్క కాటు వేసినప్పుడు రేబిస్ సోకకుండా వేసే ఇంజక్షన్లను సైతం పోనిల ద్వారా దాదాపు మూడు దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఇంజక్షన్లను భారత ప్రభుత్వానికి విక్రయించటంతో పాటు.. అనేక ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తమ విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు జయ దగ వివరించారు.అహ్మదాబాద్కు చెందిన ఆవిష్కర్త మహేశ్ మహేశ్వరి వద్ద నుంచి పొందిన టెక్నాలజీ ద్వారా జయ ట్యూబ్ పద్ధతిలో అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తమ క్షేత్రంలో గత 8 నెలలుగా తయారు చేస్తున్నారు. ట్యూబ్ ద్వారా ప్రత్యేక పద్ధతిలో తయారవుతున్న ఈ అడ్వాన్స్డ్ జీవామృతం తమ పొలాల్లో మంచి ఫలితాలనిచ్చిందని ఆమె సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆమె క్షేత్రంలో పెరుగుతున్న నేపియర్ గడ్డి, మునగ తోటలు చాలా ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఆకర్షణీయంగా ఉండటం విశేషం. నేపియర్ గడ్డి, మునగ ఆకు ముక్కలతో పాటు బార్లీ, సోయా, మొక్కజొన్నల మొలకలు, గోధుమ తవుడుతో కూడిన దాణాను కూడా ఆవులు, గుర్రాలకు ఆమె మేపుతున్నారు.50 వేల లీటర్ల ట్యూబ్లు రెండు..గుర్రాలు, పోనిలతో పాటు వందలాది గిర్ ఆవుల పోషణ కోసం గత 8 నెలల నుంచి తిమ్మాపూర్ వ్యవసాయ క్షేత్రంలో అనేక ఎకరాల్లో నేపియర్ గడ్డిని, మునుగ ఆకును జయ దగ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు. ఇందుకోసం 50,000 లీటర్ల సామర్థ్యం గల ట్యూబ్లు రెండిటిని ఆమె ఏర్పాటు చేసుకున్నారు. ఒక దాని ద్వారా గిర్ ఆవుల పేడ, మూత్రంతో.. రెండో దానిలో గుర్రాల పేడ, మూత్రంతో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ట్యూబ్ రోజుకు వెయ్యి లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు.అడ్వాన్స్డ్ జీవామృతం 30 రోజుల్లో తయారవుతుంది!సాధారణ జీవామృతం తయారీ ప్రక్రియకు.. ట్యూబ్ ద్వారా అడ్వాన్స్డ్ జీవామృతం తయారీ ప్రక్రియకు చాలా వ్యత్యాసం ఉంది. ట్యాంకు లేదా డ్రమ్ములో వేసి నీటిలో నాటు ఆవు పేడ, మూత్రం, పప్పులపిండి, బెల్లం, పిడికెడు మంచి మట్టిని కలిపితే.. సాధారణ జీవామృతం 48 గంటల్లో వాడకానికి సిద్ధమవుతుంది. ఇందులో పిప్పి, పీచు, నలకలు అలాగే ఉంటాయి.అయితే, ట్యూబ్లో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు కావటానికి 30 రోజులు పడుతుంది. ట్యూబ్ను ఏర్పాటు చేసుకొని, ఆ ట్యూబ్ పరిమాణాన్ని బట్టి నిర్ణీత పరిమాణంలో పేడ, మూత్రం, కూరగాయలు, పండ్ల వ్యర్థాలు తదితరాలను ద్రవ రూపంలోకి మార్చి ట్యూబ్లోకి వేస్తూ ఉంటారు. దీనికి తోడు మహేశ్ మహేశ్వరి రూపొందించిన ప్రత్యేక మైక్రోబియల్ కల్చర్ను కూడా తగిన మోతాదులో కలిపి వేస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ ట్యూబ్ లోపలికి వేస్తూనే ఉండాలి.30 రోజులు వేసిన తర్వాత నుంచి ప్రతి రోజూ ఎటువంటి పిప్పి, పీచు, నలకలు లేని శుద్ధమైన అడ్వాన్స్డ్ జీవామృతం ట్యూబ్ నుంచి వెలికివస్తుంది. ప్రతి రోజూ ఎంత పరిమాణంలో పేడ తదితరాలను ట్యూబ్లో ఒక వైపు నుంచి వేస్తూ ఉంటామో.. ట్యూబ్ వేరే వైపు నుంచి అంతే మోతాదులో అడ్వాన్స్డ్ జీవామృతం బయటకు వస్తుంది. సాధారణ ద్రవ జీవామృతాన్ని 15 రోజుల్లో వాడేయాలి. అయితే, ఈ అడ్వాన్స్డ్ జీవామృతం ఏడాదిన్నర వరకు నిల్వ ఉంటుందని.. అధిక కర్బనం, సూక్ష్మజీవుల జీవవైవిధ్యంతో కూడినదైనందు వల్ల ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం తయారుచేసే ట్యూబ్లుఆర్గానిక్ పురుగుల మందు కూడా..ఆర్గానిక్ పురుగుల మందును కూడా 200 లీటర్ల ట్యూబ్ ద్వారా మహిళా రైతు జయ దగ తయారు చేస్తున్నారు. మహేశ్ మహేశ్వరి నుంచి తెచ్చిన మైక్రోబియల్ కల్చర్ 2 లీటర్లు, 2 కిలోల దేశీ ఆవు పేడ, 10 కిలోల పెరుగుతో చేసిన మజ్జిగ, 40 లీటర్లు దేశీ ఆవు మూత్రం కలిపి ట్యూబ్లో పోస్తారు. 30 రోజులు ఇలా పోస్తూనే ఉండాలి. 30 రోజుల తర్వాత ట్యూబ్ నుంచి ఆర్గానిక్ పురుగుమందును తీసుకొని వాడుకోవచ్చు. ఈ పురుగు మందును నేరుగా పంటలపై చల్లకూడదు. 1 లీ. పురుగుమందును 1 లీ. నాటు ఆవు మూత్రం, 1 లీ. పుల్ల మజ్జిగ, 17 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఈ ఆర్గానిక్ పురుగుమందును పిచికారీ చేసిన రోజు జీవామృతం పిచికారీ చేయకూడదని జయ తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం అరెకరానికి ఉచితం!రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లోని తమ క్షేత్రానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రైతులు ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చెయ్యాలనుకుంటే.. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఉచితంగా ఇస్తాను. వరి లేదా పత్తి వంటి పంటలకు ఎకరానికి 400 లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతం అవసరం ఉంటుంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపడా 200 లీటర్లను రెండు దఫాలుగా ఇస్తాను. గిర్ ఆవుల జీవామృతం లీటరు రూ. 10, గుర్రాల జీవామృతం లీటరు రూ. 15, ఆర్గానిక్ పురుగుల మందు లీటరు రూ. 20కి విక్రయిస్తున్నాం. వీటితో సాగు చేసిన నేపియర్ గడ్డి మేపిన తర్వాత గిర్ ఆవు పాలలో కొవ్వు శాతం 3.4 నుంచి 4.7కు పెరిగింది. ఇతర వివరాలకు డాక్టర్ వెంకటేశ్ (98482 09696)ను సంప్రదించవచ్చు. – జయ దగ, మహిళా రైతు, తిమ్మాపూర్, రంగారెడ్డి జిల్లా, jsd@vinsbio.inరోజూ వెయ్యి లీటర్లు..50 వేల లీటర్లు పట్టే ట్యూబ్ నుంచి మహిళా రైతు జయ దగ వెయ్యి లీటర్ల జీవామృతం పొందుతున్నారు. అంతే మొత్తంలో లోపలికి పోస్తున్నారు. ప్రతి బ్యాచ్లో 30 కేజీల ఆవులు లేదా గుర్రాల పేడ, 40 లీ. మూత్రం, 20 కిలోల బెల్లం, 10 కిలోల పండ్లు, 20 కిలోల కూరగాయలు, 10 కిలోల కలబంద జ్యూస్, 300 లీటర్ల జీవామృతంతో పాటు మిగతా 430 లీటర్ల నీటిని కలిపి ట్యూబ్లో పోస్తున్నారు. ఈ రోజు పోసింది నెలరోజుల తర్వాత అడ్వాన్స్డ్ జీవామృతంగా మారి బయటకు వస్తుంది. ఏడాదిన్నర నిల్వ ఉంటుంది..సాధారణ జీవామృతంలో నలకలు పిప్పి ఉంటుంది. అయితే, ట్యూబ్లో గాలి తగలకుండా 30 రోజులు మగ్గిన తర్వాత అసలు ఏ నలకలూ, చెత్త లేని జీవామృతం వెలువడుతుంది. ఇందులో కర్బనం 15% వరకు ఉంటుందని, అందువల్ల ఇది సాధారణ జీవామృతం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి చెబుతున్నారు.సాధారణ జీవామృతం 15 రోజుల తర్వాత పనికిరాదు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కలియతిప్పాలి. అయితే, ట్యూబ్ జీవామృతం కనీసం ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకు నిల్వ ఉంటుంది. ప్రతి రోజూ కలియతిప్పాల్సిన అవసరం లేదు. బ్యారెల్స్లో నింపుకొని నిల్వ చేసుకుంటే చాలు. మరో విషయం ఏమిటంటే.. ట్యూబ్ని కానీ, దానిలో తయారైన జీవామృతాన్ని గానీ నీడలోనే ఉంచాలన్న నియమం లేకపోవటం మరో విశేషం అని జయ దగ చెబుతున్నారు. ఈ ప్రత్యేకతల వల్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఒక చోట తయారు చేసి, దూర ప్రాంతాలకు కూడా రవాణా చేసుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ట్యూబ్ టెక్నాలజీ వల్ల తమకు గడ్డి సమస్య శాశ్వతంగా తీరిపోయిందని ఆమె సంతోషిస్తున్నారు. – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్ -
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
అహం ఎప్పుడూ కూడా మనిషిని పాషాణం అయ్యేట్టు చేస్తుంది. కామం తీరలేదనుకోండి. శత్రుభావం పెంచుకుని అవతలి వాళ్ళమీద కఠినంగా వ్యవహరించేటట్లు చేస్తుంది. అయితే ప్రేమ మాత్రం కరిగిపోయే లక్షణాన్ని పొంది ఉంటుంది. అవతలివాళ్ళల్లో ఎన్ని లోపాలున్నా వారి నాశనాన్ని ప్రేమ కోరుకోదు. వారు బాగుపడాలి, సంస్కరింపబడాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి... అని కోరుకుంటుంది తప్ప వారిపట్ల ద్వేషం పెంచుకోదు. అందుకే ప్రేమ అవసరం. దానికి పూర్వ పరిచయం లేదు, భవిష్యత్తు మాత్రం ఉంది. దానికి పునాది ప్రేమలోనే ఉంది తప్ప కామంలో లేదు. అందుకే ఆమె ‘ధర్మపత్ని’ తప్ప కామపత్ని కాదు. ఇంత పెద్దప్రాతిపదికచేసి గృహస్థాశ్రమ ప్రవేశం చేయిస్తారు. కాబట్టి వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు ముందుగా శీలం, వయసు, వృత్తి పరిశీలిస్తారు... తరువాత అభిజనం... అంటే రెండు పక్కల వంశాలు ఎంత గొప్పవి! ఆ వంశాలలో పూర్వీకులు ఎంత గొప్పగా ప్రవర్తించారో అన్న జిజ్ఞాసతో ఆ వంశానికి కీర్తిప్రతిష్ఠలు జోడించేలా ప్రవర్తించాలి. అందువల్ల వాటిని కూడా పెద్దలు పరిశీలిస్తారు.రామాయణంలో... రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేయగానే జనకమహారాజు వచ్చి సీతను అప్పగించాడు, రాముడు వెంట తీసుకెళ్ళాడు... అని చాలామంది అనుకుంటూంటారు. కానీ అది సరికాదు. బాలకాండను అయోధ్యకాండతో కలిపి చదివితే... ఆశ్చర్యపోతాం.. వారి సంస్కారం చూసి... శివధనుర్భంగం కాగానే జనకమహారాజు జలకలశంతో గబగబా వచ్చి..‘‘మొదట ఇచ్చిన మాట ప్రకారం శివధనుర్భంగం చేసినవారికి నా కూతురును ఇస్తానని చె΄్పాను... ఆ పని నీవు విజయవంతంగా చేశావు కాబట్టి ఇదుగో నా కుమార్తె..స్వీకరించు’’... అన్నాడు.దానికి రాముడు.... ‘‘ఒక పిల్ల నాకు భార్య కావాలంటే చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి మా తండ్రిగారు చూడాలి. మా పురోహితులు, పెద్దలు, బంధువులను సంప్రదించి ఆయన నిర్ణయిస్తారు. దానికి నేను కట్టుబడతాను. అందువల్ల మా తండ్రిగారికి కబురు పంపండి’ అన్నాడు. కబురందుకుని దశరథ మహారాజు వచ్చారు.‘నేను స్వయంవరం ఏర్పాటు చేస్తే భూమండలంలోని రాజులందరూ వచ్చిపోటీపడ్డారు. కానీ మీ రాముడు మాత్రమే శివధనుర్భంగం చేయగలిగాడు. ముందు చెప్పిన షరతు ప్రకారం నా కుమార్తెని ఇస్తున్నా. మీ కోడలిగా స్వీకరించండి’ అని జనకుడు కోరాడు. దశరథుడు వెంటనే ఎగిరి గంతేసి అంగీకరించలేదు. ఆయన అన్నాడు కదా... ‘ఈమె నా ఇంటి కోడలిగా రావడానికి ముందు మన రెండు వంశాలు సరిపోతాయా.. దానికి అర్హతలు మనకున్నాయా..’’ అంటూ మరో గొప్పమాటంటాడు..‘‘రాముడు గొప్పవాడు ... పిల్లనివ్వడం మా అదృష్టం’’ అంటూ వంగి మాట్లాడకండి, జనక మహారాజా! మీరు పిల్లనిస్తేనే కదా మా వంశం నిలబడేది. అప్పుడే కదా రుణవిమోచనం. ఇచ్చేవారు మీరు, పుచ్చుకునేవాడిని నేను. ఇప్పుడు వినయంగా ఉండాల్సింది నేను మహారాజా !’’ అన్నాడు. ఆ తరువాత దశరథ మహారాజు కోరికపై వశిష్ఠుడు, జనకుడి కోరికపై వారి పురోహితుడు వారి వారి వంశాలను వివరించారు. అలా ఒకరి నుంచి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకుని నిర్ణయించిన వివాహాలు కాలంలో ఆదర్శంగా నిలిచిపోయాయి. అందుకే గృహస్థాశ్రమానికి రామాయణం ఆదర్శం – అని కంచి మహాస్వామి అంటూండేవారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
మన లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్న లోకంలో తరచుగా వినబడుతూ ఉంటుంది. దానికి ఒక్కొక్కరు ఒక్కోరకమైన సమాధానాన్ని ఇస్తుంటారు. ఈ ప్రపంచం మాయ అనుకున్న వారు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే పోతామని అంటారు. శూన్యవాదులు మనం శూన్యం (ఏమీ లేని వస్తువు) నుంచి వచ్చాము కనుక శూన్యంలోకే పోతామని అభి్రపాయపడతారు. భౌతికవాదులు మాత్రం కోరుకున్న భౌతిక పదార్థాన్ని పొందడమే లక్ష్యం అంటారు. కొందరు ఆధ్యాత్మిక వేత్తలు మనం భగవంతుని నుంచి వచ్చాము కనుక అతనిలోనే కలిసిపోతామని చెప్తుంటారు. అభ్యుదయవాదులు కొందరున్నారు. వారు ఐహిక సుఖమే పరమ లక్ష్యం అంటారు. మతవాదులున్నారు, వారు పరలోకంలో సుఖపడడమే తమ లక్ష్యం అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మానవ లక్ష్యాన్ని పేర్కొంటారు.అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. కనుక ఇతరప్రాణుల కంటే మానవుడు శ్రేష్ఠుడు. అంతేకాదు, ఇతరప్రాణులకు లేని లక్ష్యం మానవునికి ఉంది. నాల్గు పురుషార్థాలలో అర్థ కామాలను లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళున్నారు. నిజానికి మానవుడు ధనాన్ని సంపాదించి, సుఖపడరాదని ఏ ధర్మ గ్రంథమూ చెప్పదు. అయితే ధర్మబద్ధంగా ధనార్జన చేయాలని, ధార్మిక ప్రవృత్తిలోనే కోరికలను తీర్చుకోవాలని, శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి. అందుకే పురుషార్థాలలో మొదట ధర్మాన్నే పేర్కొన్నారు.తనకే కాక, తోటిప్రాణులకు ఏది హితకరమైందో, ఆ కర్మకే ధర్మమని పేరు. ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాన్ని స్వార్థం అంటారు. ఆచారం వ్యక్తిగతమైంది కావచ్చు కాని, ధర్మం సర్వనిష్టమైంది. అందరికీ ఆమోద యోగ్యమైంది. అందుకే పురుషార్థాలను సాధించాలనుకున్న వ్యక్తి మొదట ధర్మపరుడు కావాలి. ధర్మాన్ని దారిబత్తెంగా చేసుకుని ప్రయాణించే వారికి ధన్యప్రాప్తి, సుఖప్రాప్తి కలుగుతాయి. అంతేకాదు, ఆ రెండింటికీ మించి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. అందువల్ల మానవుని లక్ష్యం కేవలం ధనార్జనతోపాటు సుఖ్రపాప్తి మాత్రమే కాదు, మోక్షం సాధించడమే పరమ లక్ష్యమని తెలుస్తుంది.మోక్షం అంటే విడుదల. దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం. అదే మానవుని పరమ లక్ష్యం. బంధనాల్లో చిక్కుకోవడానికి కేవలం కర్మలు చేస్తే చాలు. కాని వాటి నుంచి బయట పడటానికి ధార్మికుడు కావాలి. ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ శరీర తత్వంతోపాటు, ఈ శరీరంలో బంధింపబడిన తానెవరో తెలుసుకోవాలి. అంతేకాదు, మోక్ష ప్రదాతను గుర్తించాలి. శరీరం ఉంది. తాను ఉన్నాడు. శరీరం బంధనం. దాన్ని విడిచిపెడితే మోక్షం. కానీ ఎట్లా విడిచిపెట్టాలి? అందుకు చేయవలసిన పనేమిటి? తెలిస్తే గాని పరమ లక్ష్యాన్ని అందుకోలేం. – ఆచార్య మసన చెన్నప్ప -
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
అది 1968, ఇంగ్లండ్లోని గ్లోస్టర్షర్లోని వాటన్–అండర్–ఎడ్జ్లో ఉన్న ఈ ప్రసిద్ధ చారిత్రక కట్టడాన్ని ‘జాన్ హంఫ్రీస్’ అనే వ్యాపారవేత్త కొనుగోలు చేశాడు. అప్పటి దాకా ఆ భవనం 11వ శతాబ్దానికి చెందినదని, అందులో కొన్నేళ్ల పాటు బార్ అండ్ హోటల్ ఉండేదని మాత్రమే అతడికి తెలుసు. వ్యాపార దృక్పథంతోనే కొన్న జాన్.. ఆ భవనానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించి.. బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ హోటల్గా మార్చాడు. దానిలోనే ఒక పక్క కుటుంబంతో కలసి కాపురం పెట్టాడు. రోజులు గడిచే కొద్ది ఆ ఇంట్లో జరిగే అంతుచిక్కని పరిణామాలు వారిని వణికించడం మొదలుపెట్టాయి.ఒక రాత్రి జాన్ నిద్రపోయిన సమయంలో ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు, ఇల్లంతా తిప్పి విసిరికొట్టినట్లు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఒంటిపై గాయాలున్నాయి. తాను మాత్రం మంచం మీదే ఉన్నాడు. రోజు రోజుకీ ఇలాంటి హింసాత్మక అనుభవాలు మరింత ఎక్కువయ్యాయి. కేవలం జాన్కు మాత్రమే కాదు.. అతడి కూతురు ఎనిమిదేళ్ల కరోలిన్ హంఫ్రీస్తో పాటు జాన్ భార్య, మిగిలిన వారసులు, ఆ హోటల్లో డబ్బు చెల్లించి బస చేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ ఇలాంటి వింత అనుభవాలు హడలెత్తిస్తూ వచ్చాయి.దాంతో జాన్.. అప్పటికే సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ ‘ఏన్షియంట్ రేమ్ ఇన్ హౌస్’ గురించి అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో అతడ్ని భార్య, బంధువులు, కొడుకులు ఇలా అంతా వదిలిపోయినా.. కూతురు కరోలిన్ మాత్రం వదిలిపెట్టలేదు. గగుర్పాటు కలిగించే ఎన్నో అంశాలను వెలికి తీసే తండ్రి ప్రయత్నానికి.. చేయూతను ఇచ్చింది కరోలిన్. దాంతో జాన్.. అనుమానం కలిగిన ప్రతి గదిలోనూ తవ్వకాలు జరిపాడు. ప్రతి మూలలోనూ, గోడలోనూ.. ఆ అతీంద్రియ కదలికలను జల్లెడ పట్టాడు.అతడికి ఆ ఇంట్లో చాలా భయపెట్టే బొమ్మలు, ఎముకలు, పుర్రెలు, సమాధులు, పక్షులు, జంతువుల కళేబరాలు దొరికాయి. చాలా ఎముకలను పరిశీలిస్తే.. అవన్నీ చిన్న పిల్లల ఎముకలని తేలింది. పైగా వాటి చుట్టూ నరబలి ఆనవాళ్లు భయపెట్టాయి. చిత్ర విచిత్రమైన మొనదేరిన కత్తులు దొరికాయి. అవన్నీ 1145 నాటివని పురావస్తు నివేదికలు తేల్చాయి. దాంతో జాన్.. మీడియా సాయం కోరాడు. నాటి నుంచి ఈ హౌస్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది.ఇతడి ఆసక్తికరమైన అన్వేషణలలో ఒక గోడ లోపల.. అప్పటికి 500 సంవత్సరాల నాటి పిల్లి కళేబరం బయటపడింది. ఆ గోడ గల గది ఓ మంత్రగత్తెదని, ఆ పిల్లి ఆ మంత్రగత్తె వెనుక తిరిగే నల్లపిల్లి అని ప్రచారంలో ఉన్న కథను తెలుసుకున్నాడు జాన్. ‘మంత్రగత్తె తనను వ్యతిరేకించే జనాల నుంచి తప్పించుకోవడానికి ఆ హోటల్లో దాక్కుందని, తర్వాత అక్కడే ఆమె మరణించిందని ఇలా ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అక్కడ ఉన్నవారిని.. అక్కడ ఉండటానికి వచ్చినవారిని.. కనిపించని శక్తులు పరుగులు పెట్టించడమే ఇక్కడ మిస్టరీ.ఈ ఇంటికి సమీపంలో ఓ పెద్ద చర్చ్ కూడా ఉంది. అయితే ఆ చర్చికి, ఈ ఇంటికి రహస్య సొరంగ మార్గం ఉండటంతో.. ఆ చరిత్రను కూడా తవ్వే ప్రయత్నం చేశాడు జాన్. అయితే ఆ చర్చిలో పని చేసే బానిసలు, కాథలిక్ సన్యాసులు ఆ సొరంగ మార్గం ద్వారానే రాకపోకలు జరిపేవారని తేలింది. ఆ ఇంట్లోని మానవ అవశేషాలకు.. చర్చ్ అధికారులకు సంబంధం ఉందా అనేది మాత్రం తేలలేదు. అయితే ఈ ఇంటి నిర్మాణానికంటే ముందు అదొక శ్మశానవాటికని.. అందుకే అక్కడ అంత పెద్ద ఎత్తున మానవ ఎముకలు దొరికాయని ఓ అంచనాకు వచ్చారు కొందరు.ఆ ఇంట్లో పలు అసాంఘిక కార్యక్రమాలు జరిగేవని.. ఇదంతా వాటి ఫలితమేనని నమ్మడం మొదలుపెట్టారు మరికొందరు. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఎందరో నిపుణులు, పర్యాటకులు పలు ప్రయోగాలు చేసి.. స్వయంగా బాధితులు అయ్యారు తప్ప.. బలమైన కారణాన్ని మాత్రం కనుగొనలేకపోయారు. దాంతో నేటికీ ఈ భవనం.. ప్రపంచంలోనే అత్యంత హంటెడ్ నిర్మాణాల్లో ఒక్కటిగా మిగిలిపోయింది. అయితే ఇక్కడ హడలెత్తిస్తున్న అతీంద్రియ శక్తి ఏంటీ? నిజంగానే అక్కడ ఆత్మలు ఉన్నాయా? అక్కడ దొరికిన ఎముకలు.. వాటి వెనుకున్న విషాధ గాథలు ఏవీ తేలకపోవడంతో ఈ ఇంటి చరిత్ర మిస్టరీగానే మిగిలిపోయింది. – సంహిత నిమ్మన -
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
కోకిల నాలుగో తరగతి చదువుతోంది. రోజూ బడికి వెడుతుంది. తరగతిలో అందరి కంటే ముందు ఉంటుంది. అయితే కోకిల అస్తమానూ నోట్లో వేలు పెట్టుకుంటుంది. గోళ్లు కోరుకుతుంది. ‘కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’ అంటూ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా ,‘అలాగేనమ్మా! అలవాటు మానుకుంటాన’ని అంటుందే కానీ, మానుకోలేక పోతోంది. రోజూలానే ఆరోజు కూడా బడికి వెళ్ళింది కోకిల. సాయంత్రం చివరి పీరియడ్లో సైన్స్ పాఠాలు చెప్పే సుజాతా టీచర్ వచ్చారు. సుజాతా టీచర్ చెప్పే సైన్స్ పాఠాలు కోకిలకు ఎంతో ఇష్టం.‘పిల్లలూ! ఈ రోజు ‘అలవాట్లు’ అనే అంశం మీద మాట్లాడుకుందామా? మీరంతా ఖాళీ సమయంలో ఏమేమి చేస్తారో? ఒకొక్కరుగా టేబుల్ వద్దకు వచ్చి చెప్పాలి. సరేనా!’ అంటూ పిల్లలను అడిగారు సుజాతా టీచర్. ‘అలాగే టీచర్’ అంటూ ఉత్సాహంగా తలూపారు పిల్లలు. ‘అయితే మీ మీ అలవాట్లను చెప్పండి’ పిల్లల కేసి చూస్తూ అడిగారు టీచర్.శశాంక్ లేచి హుషారుగా టేబుల్ వద్దకు వచ్చి ‘టీచర్! నేను ఖాళీ సమయంలో బొమ్మలు వేస్తాను’ అని చెప్పాడు. ‘గుడ్! మంచి అలవాటు’ మెచ్చుకున్నారు టీచర్. ‘నేనయితే ఖాళీ సమయంలో కథలు చదువు తాను’ ఆనందంగా అన్నాడు కిరణ్. ‘వేరీ గుడ్!’ అని కిరణ్ని ప్రశంసిస్తూ ‘మరి నువ్వేం చేస్తావ్’ అంటూ కమలను అడిగారు టీచర్. ‘ఆడుకుంటాను టీచర్’ చెప్పింది కమల. ‘ఆటలు మానసిక ఆనందాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది’ అని చెబుతూ ‘మరి నువ్వేం చేస్తావు కోకిలా?’ అంటూ కోకిలను అడిగారు టీచర్.కోకిల ముందుకు రాలేదు. ‘నేను చెప్పలేను టీచర్.. చెప్పను’ అంటూ విచారంగా జవాబు ఇచ్చింది కోకిల. ‘ముందు నీ అలవాటు చెప్పమ్మా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పర్వాలేదు’ అని టీచర్ అనేసరికి ‘గోళ్లు కోరుకుతాను. అమ్మ ఎన్నిసార్లు వద్దని చెప్పినా, ఆ అలవాటు మానుకోలేకపోతున్నాను’ చెప్పింది కోకిల. విన్న పిల్లలంతా ఘొల్లున నవ్వారు. వెంటనే టీచర్ ‘హుష్! పిల్లలూ! అలా నవ్వకూడదు. అలవాటు మంచిదైతే మెచ్చుకోవాలి. చెడ్డదైతే వద్దని చెప్పాలి. అంతే గానీ వెక్కిరించరాదు’ అంటూ మందలించారు. దాంతో పిల్లలంతా కోకిలకు సారీ చెప్పారు. ‘కోకిలా! అలవాటు చెడ్డదైతే అది మన ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీకు నా చిన్నతనంలో జరిగిన ఓ కథ చెబుతాను’ అన్నారు టీచర్ పిల్లలందరి వంకా చూస్తూ! కోకిలతో సహా పిల్లలంతా ‘చెప్పండి టీచర్’ అంటూ ఉత్సాహంగా అడిగారు. ‘నా చిన్నప్పుడు నాకు ‘చిట్టి ’ అనే స్నేహితురాలు ఉండేది. తనకు ఖాళీ సమయంలో ముగ్గులు పెట్టడమంటే ఎంతో ఇష్టం. బాగా పెట్టేది. చిట్టి ముగ్గు వేస్తే చాలా బావుంటుంది అని ఇరుగుపొరుగు వాళ్లంతా చిట్టిని మెచ్చుకునే వారు. అయితే చిట్టికి ఒక చెడ్డ అలవాటు ఉంది’ అంటూ పిల్లలకేసి చూశారు టీచర్.‘ఏం అలవాటు టీచర్?’ అంటూ ఆసక్తిగా అడిగింది కోకిల. ‘ఉదయాన్నే నిద్ర లేచేది కాదు. బారెడు పొద్దెక్కే దాకా మొద్దు నిద్ర పోయేది. ‘నిద్ర లే చిట్టీ’ అని అమ్మ ఎన్నిసార్లు చెప్పినా, వినిపించుకునేది కాదు. ఒకసారి ఊర్లో సంక్రాంతికి ముగ్గుల పోటీలు పెట్టారు. పచ్చని చిలుకలు, మామిడి తోరణాలతో స్వాగతం చెబుతున్న ముగ్గును పోటీలో వేయాలనుకుంది చిట్టీ. ప్రాక్టీస్ కూడా చేసుకుంది. మరునాడు ముగ్గుల పోటీ అనగా, ఆ రాత్రి పడుకోబోతూ.. ‘అమ్మా! ఉదయాన్నే నన్ను నిద్రలేపు. పోటీకి వెళ్ళాలి’ అని చెప్పి పడుకుంది. కానీ మరునాడు.. చిట్టీని అమ్మ ఎన్నిసార్లు నిద్రలేపినా బద్ధకంతో నిద్ర లేవలేదు చిట్టీ.’‘అయ్యో.. అప్పుడేమయింది? టీచర్?’ పిల్లలంతా ఆసక్తిగా అడిగారు. ‘ఏముంది? చిట్టి అక్కడకు వెళ్లేటప్పటికి పోటీ అయిపోయింది. చిట్టీకి ఏడుపొచ్చింది. అమ్మ చెప్పినట్లు ‘బద్ధకమే బద్ధ శత్రువ’ని గ్రహించింది. చిట్టికి ఆ అనుభవం ఒక గుణపాఠం అయింది. ఇంకెప్పుడూ మొద్దు నిద్ర పోలేదు. బద్ధకం చూపించలేదు. చక్కగా చదువు కుంది. టీచర్ అయ్యింది. ఇప్పుడు మీకు పాఠం చెబుతోంది’ అని ఆపారు సుజాతా టీచర్.పిల్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరికన్నా ముందుగా తేరుకున్న కోకిల వెంటనే ‘చిట్టీ అంటే మీరేనా? టీచర్?’ అని అడిగింది. ‘అవును! కోకిలా, చిన్నప్పుడు నన్ను ముద్దుగా ‘చిట్టీ’ అని పిలిచేవారు. అర్థమైంది కదా కోకిలా .. చెడు అలవాట్ల వల్ల నష్టమేంటో.. పట్టుదలతో ప్రయత్నిస్తే చెడు అలవాట్లను మానుకోవడం పెద్ద కష్టమేం కాదని!’ అన్నారు టీచర్. ‘అవును టీచర్.. తప్పకుండా ప్రయత్నిస్తాను’ చెప్పింది కోకిల. ‘వేరీ గుడ్! కోకిల మారింది’ అంటూ టీచర్ అభినందించగానే, పిల్లలంతా కూడా కోకిలను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. – కె.వి.లక్ష్మణరావు -
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
పేరు.. సంజనా బత్రా హోమ్ టౌన్ అండ్ వర్క్ ప్లేస్ రెండూ కూడా ముంబయే! ఎడ్యుకేషన్ .. యూనివర్సిటీ ఆఫ్ లండన్లో స్క్రీన్ అండ్ ఫిల్మ్ స్టడీస్లో మాస్టర్ డిగ్రీ. మరి ఫ్యాషన్ రంగంలో.. నో ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫ్యాషన్ మీదున్న ఆసక్తే ఆమెను స్టార్ స్టయిలిస్ట్ని చేసింది. పర్సనల్ స్టయిల్.. Classic, Chic.. eclectic! వర్క్ డిస్క్రిప్షన్.. fast-paced, challenging and creatively satisfying.ప్రకృతైనా.. కళాఖండమైనా.. చివరకు చక్కటి డ్రెస్ అయినా.. ఇలా కంటికింపుగా ఏది కనిపించినా మనసు పారేసుకునేదట సంజనా.. చిన్నప్పటి నుంచీ! వాళ్ల నాన్నమ్మ వార్డ్ రోబ్లో చున్నీలు, ఆమె డ్రెసింగ్ టేబుల్లో నెయిల్ పాలిష్, లిప్స్టిక్ల కలెక్షన్స్ ఉండేవట. వాటితో తన చెల్లెలిని ముస్తాబు చేసేదట సంజనా. అది చూసి ఇంట్లోవాళ్లంతా మెచ్చుకునేవారట. ఆ ఈస్తటిక్ సెన్స్ పెరగడానికి సెలవుల్లో కుటుంబంతో కలసి చేసిన యూరప్ ట్రిప్సే కారణం అంటుంది ఆమె.అక్కడ తనకు పరిచయం అయిన ఫ్యాషన్ ప్రపంచం తన మీద చాలా ప్రభావం చూపిందని చెబుతుంది. అయితే అది ఒక ప్యాషన్గానే ఉంది తప్ప దాన్నో కెరీర్గా మలచుకోవాలనే ఆలోచనెప్పుడూ రాలేదట. కానీ క్రియేటివ్ రంగంలోనే స్థిరపడాలనే తపన మాత్రం మెండుగా ఉండిందట. అందుకే లండన్లో ఫిల్మ్ స్టడీస్ చేసింది. స్వదేశానికి తిరిగొచ్చాక అడ్వరై్టజింగ్ ప్రొడక్షన్ హౌస్లో పని చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే స్టయిలింగ్ మీద ఆమె దృష్టి పడింది.బ్యూటీ అండ్ లైఫ్స్టయిల్కి సంబంధించిన ఒక వెబ్ మ్యగజైన్కి ఎడిటర్గానూ వ్యవహరించసాగింది. ఆ సమయంలోనే హృతిక్ రోషన్ నటించిన ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా (ప్రొడక్షన్లో)కి పనిచేసే ఆఫర్ వచ్చింది. స్టయిలింగ్ని ఇంకా లోతుగా పరిశీలించే అవకాశం దొరికిందని హ్యాపీగా ఒప్పుకుంది. స్టయిలింగ్ మీద పూర్తి అవగాహనను తెచ్చుకుంది కూడా! ఆ సినిమా అయిపోయాక సెలబ్రిటీ స్టయిలిస్ట్ల దగ్గర అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టుకుంది. వాళ్ల దగ్గర్నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. ‘బాలీవుడ్ నటి నర్గిస్ ఫక్రీ పర్సనల్ ఫొటో షూట్ ఉంది.. ఆమెకు స్టయిలింగ్ చేయగలవా?’ అంటూ ఓ కాల్ వచ్చింది.ఎదురుచూస్తున్న ఆపర్చునిటీ దరి చేరినందుకు ఆనందం.. ఆశ్చర్యం.. అంతలోనే సంశయం.. చేయగలనా అని! ‘గలను’ అనే ఆత్మవిశ్వాసంతో ఆ చాన్స్ని తీసుకుంది. అక్కడి నుంచి ఆ జర్నీ మొదలైంది. ఆమె వర్క్కి ఎందరో సెలబ్రిటీలు ఇంప్రెస్ అయ్యారు. తమ స్టయిలిస్ట్గా సంజనాను అపాయింట్ చేసుకున్నారు. వాళ్లలో ఆలియా భట్, ప్రాచీ దేశాయ్, శిల్పా శెట్టి, పరిణీతి చోప్రా, కల్కి కోశ్చిలిన్, హుమా కురేశీ, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ఎందరో నటీమణులున్నారు. వీళ్లంతా ఏ చిన్న వేడుకకైనా సంజనా మీదే డిపెండ్ అవుతారు. హెడ్ టు టో వరకు వీళ్లను ఆమె అలంకరించాల్సిందే!"ఫ్యాషన్ అండ్ స్టయిల్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. అవి మన ఇండివిడ్యువాలిటీ, పర్సనాలిటీలను రిఫ్లెక్ట్ చేస్తాయి. నా దృష్టిలో స్టయిలిష్ స్టార్ అంటే అనుష్క శర్మనే. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో మాత్రం నాకు శిల్పా శెట్టి, పరిణీతి అంటే ఇష్టం!" – సంజనా బత్రా -
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
వేసవి సూరీడి కన్ను పడకుండా భద్రంగా ఉండే చోటు ఇల్లే! ఇంట్లో ఉండి ఎండ నుంచి తప్పించుకుంటాం సరే.. వేడి నుంచి ఉపశమనం పొందడమెలా?! ఇండోర్ ప్లాంట్స్తో! అవును.. చక్కగా ఇంట్లో కొలువుదీరి ప్యూర్ ఆక్సిజన్, చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచేవి ఇవిగో ఈ మొక్కలే!అలోవెరా.. కలబంద ఆకులలో నీటిని నిల్వ చేసే గుణం ఉంటుంది. నిర్వహణా సులువే! ఔషధ గుణాలు పుష్కలం. దీని ఆకుల్లోని జెల్.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది.. వడదెబ్బతో సహా చిన్న చిన్న చర్మ సమస్యలకూ ఉపశమనం కలిగిస్తుంది.పీస్ లిల్లీ..ఈ మొక్క సూర్యకాంతి పడని ప్లేస్లో చక్కగా ఎదుగుతుంది. గాలిలోని విషపదార్థాలను తొలగిస్తూ ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తుంది. వేసవిలో ఈ మొక్కలకు అందమైన తెల్లని పువ్వులు పూస్తాయి. వాటితో ఇంటి అందమూ రెట్టింపవుతుంది.స్నేక్ ప్లాంట్..వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. టాక్సిన్లను తొలగిస్తూ ఇవీ ఇంట్లో గాలిని శుద్ధి చేసి ఆరోగ్యాన్నందిస్తాయి.బోస్టన్ ఫెర్న్..అధిక తేమ, పరోక్ష సూర్యరశ్మిలో ఇది బాగా ఎదుగుతుంది. వేసవికి సరైనవి. ఈ మొక్కలు ఇండోర్ వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికడతాయి.గోల్డెన్ పోథోస్..దీన్ని డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. వేసవిని తట్టుకోవడంలో ఇది ఫస్ట్. ఇండోర్ ఎయిర్ని చక్కగా ఫిల్టర్ చేసి నాణ్యతను మెరుగుపరుస్తుంది.జెడ్ జెడ్ ప్లాంట్..దీని పెంపకం చాలా సులువు. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగలదు. దీనికి గాలిని శుభ్రపరచే, కాలుష్యాన్ని నివారించే లక్షణాలు మెండు.స్పైడర్ ప్లాంట్..ఇది వేసవిలో బాగా పెరుగుతుంది. ప్యూర్ ఆక్సిజన్కి ప్రసిద్ధి. -
రాతల్లో నిజాయితీ: రామేశంగారు మాకు..
రామేశంగారు మాకు దగ్గరగా ఉండే, దూరపు బంధువు! ఒకే వీధిలో పక్క పక్క ఇళ్ళల్లో ఉండేవారం! ఆయన భార్య వైపు నుంచి మా నాన్నగారికి బీరకాయపీచు చుట్టరికం ఉండేది. మా అన్నదమ్ములందరం వాళ్ళని అత్తయ్య, మావయ్య అని పిలిచేవారం! మా నాన్నగారు, ఆయన ఒకే డిపార్ట్మెంటులో పనిచేసేవారు. దానికితోడు ఇద్దరూ రచయితలే! ఇవన్నీ కలవడంతో, మా కుటుంబాల మధ్య బంధుత్వం మాట ఎలావున్నా, స్నేహం ఎక్కువ కనబడేది!నేను కాలేజీ చదువులకు వచ్చేసరికే.. మా నాన్నగారు పక్షవాతంతో మంచం పట్టడం, రామేశంగారు బదిలీ మీద వేరే ఊరు వెళ్ళిపోవడంతో, మా కుటుంబాల మధ్య దూరం ఏర్పడి పోయింది. తర్వాత కాలంలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చి, మూడు నాలుగు చోట్ల పనిచేసిన తర్వాత బదిలీ మీద నేను తిరిగి మా ఊరు చేరాను. ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటున్న సమయంలో, కౌంటర్ ఎదురుగా నిలబడి.. ‘నువ్వు చిట్డిబాబు కొడుకువి కదూ!’ అంటూ పలకరించారు. బుర్ర వంచి పని చేసుకుంటున్న నేను, ఆ పిలుపు వినగానే బుర్ర ఎత్తి చూశాను. రామేశం గారే!మా నాన్నగారిని ఆ పేరుతో పిలిచేవారు బహు తక్కువగా ఉండేవారు. అందులో రామేశంగారు ఒకరు! ‘అవునండీ .. మీరు రామేశం మావయ్యగారు కదూ!’ అప్రయత్నంగానే నోటంట ఆ పేరు వచ్చేసింది. ‘అవునయ్యా! ఇక్కడికి ఎప్పుడు వచ్చావూ.. మీ నాన్న ఆరోగ్యం ఎలావుంది.. ఇక్కడే ఉన్నారా? నువ్వు కూడా కథలు రాస్తావుట కదా.. మీ బ్యాంకులో పనిచేసే హరగోపాల్ చెప్పాడు! రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేశాను!’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అన్నిటికీ జవాబులిచ్చి.. ‘సాయంత్రం బ్యాంకు అవగానే మీ ఇంటికి వస్తాను!’ అంటూ అడ్రసు తీసుకుని ఆయన పనిచేసిపెట్టి పంపేశాను. అలా.. మా కుటుంబాల మధ్య బంధుత్వం నాతో తిరిగి మొదలైంది! అయితే మా నాన్న కదల్లేని పరిస్థితులలో ఇంటిపట్టునే ఉండేవారు. మా అమ్మ ఏ పేరంటాలకో వెళ్తుండేది. నేను ఖాళీ దొరికినప్పుడో, కథల మీద సలహాలు తీసుకోడానికో, ఆయన పని మీదో వాళ్ళింటికి వెళ్తుండేవాడ్ని! రామేశంగారి భార్య భానుమతిగారు మా ఇంటికి తరచు వస్తుండేవారు. రామేశంగారు మాత్రం ఎవరింటికి వెళ్ళేవారు కాదు! వాళ్ళ పిల్లలు కూడా అంతే.. ఎవరినీ కలసేవారు కాదు. ఇప్పుడు ఆయన మా ఇంట్లోవాళ్లందరి కంటే నాతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి. అలాగే.. ఆయన కథలంటే చాలా ఇష్టపడేవాడ్ని. మంచి శైలి, అభ్యుదయ భావాలతో ఆయన కథలు, ఆసాంతం చదివించేవి. ఆయన్ని కలసినప్పుడల్లా.. నాకు తెలియని చాలా విషయలు చెప్తూ ఉండేవారు.ఆయనతో బాగా చనువు ఎర్పడటంతో, నేను రాసే కథలను ఆయనకే మొదట చూపెట్టేవాడ్ని! బావుండకపోతే.. మొహం మీదే చెప్పేవారు. ఆయన సూచనలు తీసుకుని మార్పులు, చేర్పులు చేసి, మళ్ళీ ఆయన ఓకే అన్న తర్వాతే, పత్రికలకు పంపేవాడ్ని! ఓ సంవత్సర కాలం గడిచిన తర్వాత, ఉన్నట్టుండి రామేశంగారికి మోకాలు నొప్పి వచ్చి, బయటకు వెళ్ళడం తగ్గిపోయింది. ఆ విషయమే ఓ రోజు ఫోన్ చేసి.. ‘చేతి వేళ్లు కూడా పూర్తిగా పట్టు తప్పాయి! నీ అవసరం తరచు ఉంటుంది!’ అంటూ, బ్యాంకు పని ఏదో పురమాయించారు. బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో, వెంటనే వాళ్ళింటికి వెళ్ళలేకపోయాను.ఓ నెల రోజుల తర్వాత వీలు చూసుకుని రామేశంగారిని చూడ్డానికి వెళ్ళాను. తలుపు తీస్తూ.. ‘రా నాయనా! ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయావు! కూర్చో కాఫీ ఇస్తా!’ అంటూ మా అత్తయ్య, నా మాట వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది.‘మార్చి నెల కదా.. బ్యాంకులో చాలా బిజీగా ఉంది! ఇంటికి వెళ్ళేసరికే రాత్రి పది దాటిపోతున్నది!’ అంటూ రామేశంగారి మంచం దగ్గరకి కూర్చి లాక్కుని కూర్చున్నాను. అప్పుడు చూశాను.. మరో కుర్చీలో ఒకావిడ కూర్చుని ఉంది. ఆవిడ్ని నేనెప్పుడూ చూడలేదు.‘ఏంలేదోయ్.. మీ అత్తయ్యలాగే ఈ మధ్య నా చేతివేళ్ళు కూడా నా మాట వినడం లేదు! మెదడు నాదే కదా.. ఇంకా నా చెప్పు చేతల్లోనే ఉంది!’ అంతలో అక్కడికి వచ్చిన మా అత్తయ్య, రామేశంగారి మాటలకు అడ్డం పడుతూ.. ‘చోద్యం కాకపోతే.. డొంకతిరుగుడు లేకుండా విషయం తిన్నగా చెప్పొచ్చుగా!’ అంటూ, నాకు కాఫీ గ్లాసు అందించింది. ‘కథలలో వర్ణనలు, ఉపోద్ఘాతాలు, ఉపమానాలు లేకపోతే, నువ్విచ్చే కాఫీలా చప్పగా ఉంటుంది!’ ఆవిడతో అని..నావైపు చూపు మరలుస్తూ ‘ఏం లేదేయ్.. ఈ మధ్య రాయడం కూడా కష్టంగా ఉంది. అందుకే.. నా రాతకోతలన్నీ ఈ అమ్మాయి చేత చేయిస్తున్నాను. ఓ రకంగా స్టెనోగ్రాఫర్ అనుకో!’ అన్నారు రామేశంగారు.‘కథలు రాసే స్టెనోగ్రాఫర్ అన్నమాట!’ నవ్వుతూ అంటూ, కాస్సేపు మాట్లాడి వచ్చేశాను. తర్వాత రోజుల్లో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ‘ఎక్కడైనా వంట మనిషినో, పని మనిషినో పెట్టుకుంటారు గాని, ఇలా కథలు రాయడానికి మనిషిని పెట్టుకోవడం ఎప్పుడూ వినలేదురా అబ్బి!’ మా అత్తయ్య నవ్వుతూ నాతో అంటుండేది.‘కదల్లేని కథల మనిషికి, నీలా కథలు చెప్పేవారు కాకుండా, కథలు రాసేవారు కావాలి కదోయ్!’ ఆయన కూడా నవ్వుతూ అనేవారు. ‘ఎప్పుడు చూసినా మన కొంపల్లో పదిమంది ఉండేవారు! ఇప్పుడేం వుంది.. లింగు లింగుమని ఇద్దరేసి ఉంటున్నారు! ఈ వయసులో మరో మనిషి సాయం మంచిదే కదా నాయనా!’ అంటూ మా అత్తయ్య కూడా ఆవిడతో సరదాగానే ఉండేది.ఓ రోజు బ్యాంకులో పని చేసుకుంటుంటే, రామేశంగారి నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అత్తయ్య చనిపోయింది, అర్జంటుగా నువ్వు రావాలి’ అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్డిశారు!ఒక్కసారిగా నిర్ఘాంత పోయాను. ‘ఆవిడ ఎప్పుడూ ముక్కు చీదిన సందర్భం కూడా లేదు.. అలాంటిది ఈ ఘోరం ఎలా జరిపోయిందో..’ అనుకుంటూ బ్రాంచి మేనేజరు దగ్గరికి వెళ్ళి, విషయం చెప్పి, సెలవు పెట్టి రామేశంగారింటికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళ పిల్లలు, బంధువులు వచ్చి, తర్వాత కార్యక్రమం గురించి అటూ ఇటూ తిరుగుతున్నారు. రామేశంగారు దిగులుగా ఓ పక్కన కూర్చుని ఉన్నారు. ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు. దగ్గరకి వెళ్ళి గట్టిగా చేతులు పట్టుకున్నాను. ప్రశాంతంగా నిద్ర పోతున్నట్టున్న మా అత్తయ్యని చూడగానే, నా కళ్ళు చెమర్చాయి.‘నిన్న రాత్రి వరకు బానే ఉందయ్యా.. ఉదయాన్నే కొంచెం నలతగా ఉందంటే, డాక్టరు రామ్మూర్తికి ఫోన్ చేశా. ‘మీరు రావొద్దు.. నేనే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, మీ ఇంటికి వచ్చి చూస్తానులెండి!’ అంటూ ఓ పది నిమిషాల్లో వచ్చాడు. ఆయన వచ్చేలోగా.. అదిగో ఆ దివాను మీద పడుకుంది పడుకున్నట్టే పోయింది! హార్ట్ అటాక్ట. పాపం అది చెప్పడానికి రామ్మూర్తి వచ్చినట్టైంది! బీపీ, షుగరు, బెల్లం అన్నీ నాకున్నాయి గాని, మీ అత్తకి ఎప్పుడూ తుమ్ము కూడా రాలేదు! సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది!’ అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకున్నారు. ఓ గంటలో కార్యక్రమం అంతా ముగిసి, రామేశంగారు ఇంట్లో ఒంటరైపోయారు. ఆయన పక్కన మౌనంగా కాస్సేపు కూర్చున్నాను. ఆ కథలు రాసే ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుంది. ‘నాకు తప్పదులే.. పనేమైనా ఉంటే ఫోన్ చేస్తాను! అన్నట్టు.. మీ అమ్మా, నాన్నలకి ఈ విషయం అంత అర్జంటుగా చెప్పకు. మెల్లగా వీలు చూసుకుని చెప్పు’ అంటూ ఆయన నెమ్మదిగా కళ్ళు మూసుకున్నారు. జలజలరాలే నీటిబొట్లు ఆయన ఒళ్లో పడుతుండటం నేను మొదటిసారి చూశాను. కాలగర్భంలో ఆర్నెల్లు గడిచిపోయాయి. ఆ రోజు లంచ్ టైములో.. ‘నీకీ విషయం తెలిసిందా!?’ అంటూ మా కొలిగ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకుంటూ.. తెలియదన్నట్టు తలూపాను. ఎడం చేత్తో సెల్ఫోన్లో ఓ ఫొటో చూపెట్టేడు. అది చూస్తూనే ఒక్కసారిగా షాక్ తగిలినట్టైయింది. నా నోటంట మాట రాలేదు.‘నిజం కాదే’ అన్నట్టు అతని వైపు చూశాను. ‘ఓ వారం కిందట.. మా ఫ్రెండ్ అక్కడకి ఏదో పని మీద వెళ్తే, కనబడ్డారుట.. మీ మావయ్యగారు వీల్ చైర్లో ఉన్నారుట, పక్కన ఆవిడ ఉందిట!’ అంటూ ఆ విషయాన్ని మా కొలిగ్ కళ్ళకు కట్టినట్లు చెప్తుంటే, నమ్మలేకుండా ఉండిపోయాను. లంచ్ తర్వాత కౌంటర్లో కూర్చుని పని చేసుకుంటున్నానే గాని, ఆలోచనలతో మనసంతా కకావికలమైంది!ఓ నాలుగు రోజులు ఆ ఆలోచనలతోనే గడిపాను. ఏం చేయాలో తోచలేదు. ‘అసలు ఏం చేయగలను?’ అనుకుంటూ సమాధాన పడిపోయాను.ఆ రోజు.. బ్యాంక్లో పని పూర్తిచేసి, టేబుల్ సర్దుకుంటుంటే సెల్ఫోన్ మోగింది. రామేశంగారి నుంచి.. ఉలిక్కిపడ్డాను! ఫోన్ ఆన్ చేశాను గాని, మాటలు వెతుక్కుంటూ, తడపడ్డాను!‘బ్యాంకులో ఉన్నావా.. అందరూ బావున్నారా?’ ఆయన మాటల్లో కాస్త వ్యంగం కనబడింది. కారణం.. ఈమధ్య కాలంలో నేను ఆయన్ని కలవలేదు, ఫోన్లో మాట్లాడిందీ లేదు! ‘అందరూ బావున్నారండీ! బ్యాంకులో చాలా బిజీగా ఉంది.. రాలేకపోయాను!’ పొడి పొడిగా వచ్చాయి నా మాటలు.‘ఏం లేదోయ్.. మీ బ్యాంకులో ఉన్న నా పెన్షన్ అకౌంట్కి నామినేషన్ మార్చాలి! ఆ ఫారం పట్టుకుని ఓసారి రా.. !’ ఎప్పటిలాగే.. హుకుం జారిచేసినట్టు అన్నారు. భార్య పోయిన తరువాత పెన్షన్ అకౌంట్కి నామినేషన్ ఇవ్వకపోయినా కొంపలు మునిగిపోవు! అయితే ఆయన చాదస్తం తెలిసిన వాడ్ని కాబట్టి ‘రేపు వస్తాను!’ అంటూ ఫోన్ కట్ చేశాను.ఆయనింటికి వెళ్ళి, ఆయన్నెలా ఫేస్ చెయ్యాలో అర్థం కాలేదు! మర్నాడు ఉదయం బ్యాంకుకి ఓ పావుగంట ముందే బయలుదేరి, మధ్యలో ఆయనింటికి వెళ్ళాను.‘ఏమిటీ.. ఈ మధ్య మరీ నల్లపూసవై పోయావు..’ ఆ మాటలకి సమాధానం చెప్పకుండా.. ముభావంగా నా చేతిలో బ్యాంకు ఫారం ఆయనకి ఇచ్చి ఎదురుగా కూర్చున్నాను. ఆయన ఆ ఫారం నింపుతూ.. ‘ఏంలేదోయ్.. పోయే వయసే కదా, తర్వాత పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు!’ అంటూ నా వైపు క్రీగంట చూస్తూ అన్నారు. వంటింట్లో నుంచి ఆవిడ కాఫీ తెచ్చి, నాకు అందించింది. ఆవిడలో మార్పు నాకు ఏం కనబడలేదు. ‘మా పిల్లలు బానే చూస్తారు, వాళ్ళ దగ్గరకి వచ్చేయమని అంటారు. కానీ, నాకీ కాగితాల్ని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు! ఆ మాట ఎలా ఉన్నా, ఓసారి చూసి.. అన్ని సరిపోయాయో లేదో చెప్పు!’ అంటూ నింపిన ఫారాల్ని నా చేతిలో పెట్టారు. ఫారంలో ఆయన ఫించన్ అకౌంట్ ఎదురుగా నామినీ పేరుని చూసి, నుదురు చిట్లించి, ఆయన వైపు చూశాను.‘ఉన్న ఈ రెండిళ్లు, బ్యాంకు డిపాజిట్లు మా పిల్లలకి రాసేశాను. ఆ ఫించన్..’ అంటూ నా వైపు చూశారు. నా మొహంలో ఏం కనబడిందో.. మళ్ళీ ఆయనే అన్నారు.. ‘ఈ అమ్మాయి తెలుసుగా, ఆమెకి ఎవరూ లేరు. ఓ అనాథ! నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నీకేమిటి.. అందరికీ తెలుసులే, అదేం రహస్యం కాదు! ఇదిగో ఇలా ఈ వీల్ చైర్లోనే అక్కడికి వెళ్ళాను! ఎవరికీ నచ్చదు, కాని..’ అంటూ ఓ పుస్తకంలో ఉన్న, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ నాకందించారు. అయితే.. ఆయన దాన్ని మామూలు విషయంలా చెప్పడం నాకు చాలా చిరాకు కలిగింది.మాట్లాడాలనిపించలేదు! ‘మీ అత్తయ్య వెళ్ళిపోయిందిగా, నా తదనంతరం నా పెన్షన్ తీసుకోవడానికి ఎవరూ లేరు! ఈ అమ్మాయికా.. పాపం ఎవరూ లేరు, జీవనాధారం కూడా లేదు! అందుకే.. అలా చేశాను! అంతే గాని, అందరూ అనుకుంటున్నట్టు కాదులే! ఈ సర్టిఫికెట్తో అమ్మాయికి ఓ ఆధారం దొరుకుతుంది! ఆ విషయమే మా ఆఫీసు వాళ్ళకి ఈ రోజే ఆర్జీ కూడా పంపిసాను! బ్యాంకులో కాస్త ఈ పని చేసి పెట్టు!’ అంటూ గబగబా ఆయన చెప్పదలుచుకుంది చెప్పేశారు.ఆ క్షణంలో.. ఆయనకి.. ఏం చెప్పడానికీ నాకు ధైర్యం సరిపోలేదు! ‘సరే.. వస్తాను!’ అంటూ బ్యాంకు దారి పట్టాను.బ్యాంకులో ఉన్నంతసేపు ఆయన గుర్తుకు రాలేదు. కాని సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత, తిరిగి నా ఆలోచనలు ఆయన చేసిన పని చూట్టూరే తిరిగాయి!ఆ రాత్రి ఏదో ఆలోచిస్తున్న నాకు ఒక్కసారిగా.. ఏదో స్ఫురించి, సెల్ఫోన్ తీసుకున్నాను. ‘మావయ్యగారు నమస్కారం! నా ఈ అభిప్రాయాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేదు.. అలా అని చెప్పకుండా ఉండనూ లేను! అందుకే ఈ మెసేజ్! మీ మ్యారేజ్ని సమాజం కొందరు తప్పని అనొచ్చు.. లేదా వెనుకనున్న మీ ఆలోచనని కొంతమంది మెచ్చుకోవచ్చు! కాని నిజానికి.. మీ ఆలోచనని అచరణలో పెట్టడానికి, మీకు పెళ్ళి తప్పనిసరైంది! అసలు మీ ఆలోచనే తప్పు! మీ ఆస్తిలో కొంత ఆవిడకి ఇచ్చుంటే హర్షించేవాడ్ని, కాని ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యాన్ని, మీరు దుర్వినియోగం చేశారు! ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయాలు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇస్తున్నది. సమాజసేవ అంటూ మీలా అందరూ పెన్షన్లని ఎవరికో ఒకరికి రాసేస్తుంటే.. ఈ దుర్వినియోగనికి ఇంక అంతు ఉండదు! వాటిని చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి మన మీదే పన్నులు వేస్తుంది!మీరు చేసిన పని చట్టసమ్మతం కావొచ్చు. కాని ఈ దేశ పౌరుడుగా నాకు సమ్మతం కాదు! మీ రాతల్లో కనబడే నిజాయితీ, చేతల్లో కనబడలేదు!క్షమించండి.. ఇది మూమ్మాటికీ తప్పే!’ మెసేజ్ టైపు చేసి, రామేశంగారికి పంపాను! తర్వాత.. నాకు నిద్ర పట్టడానికి అట్టే సమయం పట్టలేదు! – జయంతి ప్రకాశశర్మ -
కైలాసంలో శ్రీకృష్ణుడు! 'ఒకనాడు శుభముహూర్తం చూసుకుని'..
శ్రీకృష్ణుడు పుత్రసంతానం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాడు శుభముహూర్తం చూసుకుని, ద్వారకా నగరం నుంచి బయలుదేరి, గంగా తీరంలోని ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఉపమన్యుడి ఆశ్రమంలో రుద్రాక్షలు ధరించి, శరీరమంతా భస్మ లేపనాలు పూసుకున్న మునులు రుద్ర మంత్రాలను జపిస్తూ ఉన్నారు. శివ తపస్సంపన్నులైన ఆ మునులను చూసి, శ్రీకృష్ణుడు నమస్కరించారు. వారందరూ శంఖ చక్ర గదాధారి అయిన శ్రీకృష్ణుడికి ప్రతి నమస్కారాలు చేసి, ఆహ్వానించారు. వారు వెంట రాగా శ్రీకృష్ణుడు ఉపమన్యుడి కుటీరంలోకి అడుగు పెట్టాడు.శ్రీకృష్ణుడిని చూసి ఉపమన్యుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. లేచి ఎదురేగి, కృష్ణుణ్ణి ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ప్రభూ! పరమయోగులకు సైతం దుర్లభమైన నీ దర్శనం ఆశ్చర్యకరంగా ఉంది. నీ రాక నాకు అమితానందం కలిగిస్తోంది. నీ రాకకు కారణం తెలుసుకోవచ్చునా?’ అని అడిగాడు.పరమ యోగీశ్వరుడైన ఉపమన్యుడికి శ్రీకృష్ణుడు నమస్కరించి, ‘మహాత్మా! నేను శంకరుణ్ణి దర్శించాలని అనుకుంటున్నాను. నువ్వు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి. ఏం చేస్తే నేను పరమేశ్వరుణ్ణి చూడగలను?’ అని అడిగాడు. ‘భక్తితో తపస్సు చేయడం వల్లనే పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అందువల్ల ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చేయి’ అని చెప్పాడు ఉపమన్యుడు.ఉపమన్యుడి ద్వారా దీక్ష తీసుకున్న శ్రీకృష్ణుడు నార వస్త్రాలు ధరించి, శరీరమంతా భస్మాన్ని పూసుకుని, మెడలో రుద్రాక్ష మాలలు ధరించి కఠినమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక పరమశివుడు పార్వతీ సమేతంగా ఆకాశమార్గంలో నిలబడి శ్రీకృష్ణుడికి దర్శనం ఇచ్చాడు. కిరీటం, త్రిశూలం, పినాక ధనువు, పులిచర్మంతో కూడిన వస్త్రం ధరించిన శివరూపంలో ఒకవైపు, శంఖ చక్ర గదా ఖడ్గాలు ధరించిన విష్ణురూపంలో మరోవైపు శ్రీకృష్ణుడికి పరమేశ్వర దర్శనం కలిగింది. పరమశివుడికి అంజలి ఘటిస్తూ నిలుచున్న దేవేంద్రుడు, హంస వాహనంపై ఆసీనుడైన బ్రహ్మదేవుడు, నంది, కుమారస్వామి, గణపతి సహా మహా మునిపుంగవులందరూ పరమశివుడితో కలసి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుడు పరమానందభరితుడై పరమశివుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పఠించాడు.పరమశివుడు ఆదరంగా శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుని, ‘కృష్ణా! నువ్వే అందరి కోరికలు తీర్చేవాడివి కదా, ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వెవరివో నీకు జ్ఞాపకం రావడం లేదా? నువ్వే అనంతుడివి, అప్రమేయుడివి, సాక్షాత్తు నారాయణుడివని తెలుసుకో’ అన్నాడు.శ్రీకృష్ణుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘శంకరా! నీ వల్ల మాత్రమే తీరే కోరికను కోరుతున్నాను. అందుకే తపస్సు చేశాను. నాకు నాతో సమానుడైన వాడు, పరమ శివభక్తుడు అయిన కుమారుడు కావాలి. అనుగ్రహించు’ అన్నాడు. కృష్ణుడి భక్తికి పార్వతీ పరమేశ్వరులు అమితానందం చెందారు. తమతో పాటు కొన్నాళ్లు కైలాసంలో గడపవలసిందిగా కోరి, అతణ్ణి ఆకాశమార్గాన కైలాసానికి తీసుకుపోయారు. కృష్ణుణ్ణి కూడా కైలాసవాసులు పరమశివుడితో సమానంగా పూజించసాగారు. కృష్ణుడు కైలాసంలో ఆనందంగా విహరించసాగాడు.కృష్ణుడు ద్వారకానగరంలో కనిపించి అప్పటికే చాలా రోజులు గడచిపోయాయి. కృష్ణుణ్ణి చూసిపోదామని ఒకనాడు గరుత్మంతుడు వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని, కృష్ణుణ్ణి వెదకడానికి బయలుదేరాడు. ఉపమన్యుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కృష్ణుడు లేకపోవడంతో ద్వారకకు వెనుదిరిగాడు. సరిగా అప్పుడే, కృష్ణుడు లేడని తెలుసుకుని, కొందరు రాక్షసులు ద్వారక మీద దండెత్తారు. గరుత్మంతుడు యుద్ధం చేసి వారందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు.కొన్నాళ్లకు నారద మహర్షి కైలాసంలో శ్రీకృష్ణుడిని చూసి, అక్కడి నుంచి నేరుగా ద్వారకా నగరానికి వచ్చాడు. ద్వారకా పురప్రజలు ఆయన చుట్టూ చేరి, ‘మహర్షీ! మా కృష్ణుడు నగరాన్ని విడిచి వెళ్లి చాలా రోజులైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన క్షేమ సమాచారాలు ఏమైనా మీకు తెలుసా?’ అని అడిగారు.‘ప్రజలారా! భగవంతుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు కైలాసంలో ఉన్నాడు. అక్కడ ఆయన ఆనందంగా విహరిస్తున్నాడు. కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ పార్వతీ పరమేశ్వరుల ఆతిథ్యం పొందుతున్నాడు. నేను ఆయనను చూసే ఇక్కడకు వచ్చాను’ అని చెప్పాడు.నారదుడి మాటలు వినగానే గరుత్మంతుడు వెంటనే ఎగిరి వెళ్లి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుడు దివ్యసింహాసనంపై పరమశివుడి పక్కనే ఆసీనుడై కనిపించాడు. గరుత్మంతుడు పరమేశ్వరుడికి, కృష్ణుడికి నమస్కరించాడు.కృష్ణుడి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నువ్వు రోజుల తరబడి కనిపించకపోవడంతో ద్వారకా వాసులు ఆందోళన చెందుతున్నారు. దయచేసి ద్వారకకు నాతో పాటు రావలసినదిగా ప్రార్థిస్తున్నాను’ అన్నాడు.కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల వద్ద అనుమతి తీసుకుని, గరుత్మంతుడిని అధిరోహించి ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణుడు నగరంలో అడుగుపెడుతూనే ద్వారకా వాసులు ఆయనకు ఘనస్వాగతాలు పలికి, అడుగడుగునా మంగళహారతులతో నీరాజనాలు పట్టారు.కొంతకాలానికి శ్రీకృష్ణుడికి జాంబవతి ద్వారా పరమేశ్వరుడి వరప్రసాదంగా సాంబుడు జన్మించాడు. సాంబుడు శ్రీకృష్ణుడంతటి పరాక్రమవంతుడిగా, పరమ శివభక్తుడిగా ప్రసిద్ధి పొందాడు. – సాంఖ్యాయన -
Priyasha Bhardwaj: నేను హీరోయిన్ అవ్వాలని ఈ రంగంలోకి రాలేదు..
ముంబైని వరల్డ్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ప్రియాషా భరద్వాజ్ కూడా నటి కావాలనే కలను కళ్లనిండా నింపుకుని ఆ కలల ప్రపంచానికి చేరింది! ఆ ప్రయాణంలో కొరియోగ్రాఫర్ అయింది.. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గానూ తన టాలెంట్ని చూపించుకుంది. ఆఖరుకు తను యాక్టర్ కావాలనే కలనూ నెరవేర్చుకుంది.ప్రియాషా పుట్టింది, పెరిగింది గువాహటిలో. చదువుకుంది ఢిల్లీలో! క్రియేటివ్ ఫీల్డ్లో తన పేరు చూసుకోవాలనేది చిన్నప్పటి నుంచి ఆమె డ్రీమ్.అందుకే ముంబై చేరింది. అక్కడ ఇంగ్లిష్, ఉర్దూ థియేటర్లో పనిచేసింది. పేరుమోసిన ఇండియర్ థియేటర్ గ్రూప్స్ బేర్ఫూట్ థియేటర్, ద బ్లైండ్, ది ఎలిఫెంట్ థియేటర్ గ్రూప్స్ రూపొందించిన ఎన్నో నాటకాల్లో నటించింది.థియేటర్ చేస్తున్నప్పుడే మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ప్రింట్ యాడ్స్తోపాటు ఫ్రీచార్జ్, ప్యాంటలూన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫిలిప్స్, బ్రిటానియా గుడ్ డే బిస్కట్స్ వంటి ఎన్నో టీవీ కమర్షియల్స్లోనూ నటించింది.మోడలింగ్ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్ల కోసమూ దాదాపు 200 ఆడిషన్స్ ఇచ్చింది. అందరూ ‘ప్చ్..’ అన్నవాళ్లే! ఆ పెదవి విరుపులకు ఆమె నిరాశపడలేదు. ముంబైలో చేసుకునే వాళ్లకు చేసుకున్నంత పని ఉంది అనే ఆశావాహ దృక్పథంతో థియేటర్లో కొనసాగింది.ఆమె టాలెంట్ విత్ యాటిట్యూడ్ అనామకంగా ఏమీలేదు. స్కూప్హూప్స్, ఫిల్మ్ ఇన్ ద బ్లాంక్స్ వంటి యూట్యూబ్ చానెల్స్లో, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాన్స్ తెచ్చుకుంది.అలా ఆమె ఫస్ట్ టైమ్ కనిపించిన వెబ్ సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’. అందులో రెండే రెండు లైన్లున్న నర్స్ పాత్ర తనది. ఆ రెండు లైన్లతోనే వెబ్ సిరీస్ డైరెక్టర్స్ను ఇంప్రెస్ చేసింది. ఆర్య, మీర్జాపూర్, సాస్, బహూ ఔర్ ఫ్లెమింగో వంటి సిరీస్లలో ప్రాధాన్యం గల భూమికలు పోషించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సిరీస్లలో తన సహనటీనటులైన సుస్మితా సేన్, పంకజ్ త్రిపాఠీ, డింపుల్ కపాడియా లాంటి దిగ్గజాల ప్రశంసలు అందుకుంది."నేను హీరోయిన్ కావాలని ఈ రంగంలోకి రాలేదు. నటి కావాలనే వచ్చాను. సినిమా చాన్స్లు రాలేదన్న అసంతృప్తేం లేదు. ఓటీటీ కొత్త మాధ్యమం. న్యూ మీడియం పట్ల ఆడియెన్స్ ఎప్పుడూ క్రేజీగానే ఉంటారు. ఆ క్రేజీనెస్ని క్యాచ్ చేశాను. పైగా సిరీస్లలో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. నాలుగు పాటలు.. ఆరు ఫైట్లు అనే ఫార్మాట్తో ఉండవు. ఇక్కడ క్రియేటివిటీకి స్కై ఈజ్ ద లిమిట్. అందుకే ఓటీటీతో చాలా కంఫర్ట్గా ఉన్నాను. ఇంకో పది, పదిహేనేళ్లు పనిచేసి గువాహటి వెళ్లిపోతాను. అక్కడ అండర్ ప్రివిలేజ్డ్ అమ్మాయిలకు థియేటర్లో ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక థియేటర్ గ్రూప్ పెట్టాలనుకుంటున్నాను!" – ప్రియాషా భరద్వాజ్ -
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
ఒత్తిడి, చిరాకు ఎక్కువైనప్పుడు సహనం కోల్పోవడం, సహనం కోల్పోయినప్పుడు కేకలేయడం సహజం. కోపం వచ్చినప్పుడు కేకలేయడం ఆఫీసుల్లో అధికారంలో ఉన్నవాళ్లకు కుదురుతుందేమో గాని, సామాన్య ఉద్యోగులకు కుదరదు. పనిఒత్తిడి మితిమీరినప్పుడు సామాన్య ఉద్యోగులకు కూడా కోపతాపాలు రావడం సహజం.ఆఫీసుల్లో కేకలేయలేని దుర్భర స్థితి వాళ్లది. మరి వాళ్లు తమ కోపాన్ని, అసహనాన్ని తీర్చుకోవడం ఎలా? కోపతాపాలను ఎక్కువకాలం అణచిపెట్టి ఉంచుకుంటే, తర్వాత రక్తపోటు నుంచి గుండెజబ్బుల వరకు నానా వ్యాధులకు లోనయ్యే పరిస్థితి దాపురిస్తుంది. కోపం తీర్చుకోవాలనుకునే వారికి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి వేదికా లేదు.ఈ లోటును తీర్చడానికే పారిస్లోని ‘అర్మాత్వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా తన అతిథులకు కోపం తీరేలా కేకలు వేసుకునే అవకాశం కల్పిస్తోంది. హోటల్ చుట్టూ 400 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రైవేటు చిట్టడవిలో అతిథులు గొంతు చించుకుని కేకలు వేయవచ్చు. తమ కోపానికి కారణమైన వారిని తలచుకుని కసితీరా బూతులు తిట్టుకోవచ్చు. కోపావేశాలు చల్లబడేంత వరకు ఎవరి శక్తి మేరకు వాళ్లు ఇలా కేకలు వేసుకోవచ్చు.ఈ ప్రక్రియను ‘అర్మాత్ వెయిట్ హాల్’ హోటల్ అండ్ స్పా యాజమాన్యం ‘స్పా థెరపీ’గా చెబుతోంది. దీనివల్ల మనుషుల కోపావేశాలు చల్లబడి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని, తద్వారా వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ హోటల్ స్పా మేనేజర్ లోరెలా మోవిలియానో చెబుతుండటం విశేషం.ఇవి చదవండి: 'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? -
'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా?
పుష్పవజ్రమా? అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? గని నుంచి తవ్వి తీయకపోయినా, అచ్చంగా వజ్రంలాగానే ఉంటుంది. చైనీస్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూలతో వజ్రాన్ని తయారు చేశారు. గులాబీల మాదిరిగా కనిపించే ఎర్రని పీయనీ పూల నుంచి వేరుచేసిన కార్బన్ అణువులతో మూడు కేరట్ల వజ్రాన్ని తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు.ఈ వజ్రం తయారీ కోసం హెనాన్ ప్రావిన్స్కు చెందిన లువోయాంగ్ నగరంలోని నేషనల్ పీయనీ గార్డెన్స్ నుంచి సేకరించిన పూలను ఉపయోగించారు. కృత్రిమ వజ్రాల తయారీకి ప్రసిద్ధి చెందిన లువోయాంగ్ ప్రామిస్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అరుదైన ఘనతను సాధించారు. పూలతో వజ్రాన్ని తయారుచేయాలని సంకల్పించినట్లు లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ చెప్పడంతో ఆ కంపెనీకి కావలసిన పీయనీ పూలను సరఫరా చేసేందుకు నేషనల్ పీయనీ గార్డెన్ అంగీకరించింది.బయోజెనిక్ కార్బన్ ఎక్స్ట్రాక్టింగ్ టెక్నాలజీతో ఈ పూల నుంచి కార్బన్ అణువులను వేరుచేసి, వాటిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అత్యధిక పీడనకు గురిచేయడం ద్వారా ఈ వజ్రాన్ని తయారు చేయగలిగామని లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ సీఈవో వాంగ్ జింగ్ తెలిపారు. ఈ వజ్రం విలువను మూడు లక్షల యువాన్లుగా (రూ.35.19 లక్షలు) అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇవి చదవండి: వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ.. -
వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ..
అచ్చమైన తెలంగాణ అమ్మాయి. ఆమె ఇన్స్టా కంటెంట్ కూడా తెలంగాణ నేటివిటీనే రిఫ్లెక్ట్ చేస్తుంటుంది. ఫొటోగ్రాఫర్, లిరిసిస్ట్, సింగర్, మ్యుజీషియన్, నేచర్లవర్ ఎట్సెట్రా! ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తుంది. మోటర్సైకిల్ రైడ్ చేస్తుంది. బైక్ రిపేర్ చేస్తుంది. ఇలా పనికి జెండర్ డిస్క్రిమినేషన్ లేదు అని ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తోన్న ప్రతిభ ఆమెది.అసలు ఈ పిల్లకు రాని పని అంటూ ఉందా అని ఆమె ఇన్స్టా ఫాలోవర్స్ అబ్బురపడేలా చేస్తుంది. ధర్మపురికి చెందిన ఈ అమ్మాయి కరోనా టైమ్లో తన చుట్టూ ఉన్న డిప్రెసివ్ మూడ్ని పోగొట్టడానికి.. తన ఊళ్లో మొక్కలను నాటింది. రాత్రనక పగలనక వాటి ఆలనాపాలనా మీదా అంతే శ్రద్ధను పెట్టింది.ఇప్పుడవి పెరిగి ఆ ప్రదేశమంతా ఓ గార్డెన్లా మారింది. గలగలపారే సెలయేరు.. జలజల దూకే జలపాతం.. ఇలా ఏ సినినమ్ అయినా సూటయ్యే ఇన్స్పైరింగ్ గర్ల్ గాయత్రి. ఇప్పుడు ఆమె ‘దేవరకొండాస్ స్పెషల్’ పేరుతో యూట్యూబ్ చానెల్నూ పెట్టింది.ఇవి చదవండి: ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి... -
ప్రొలాప్స్ అంటే ఏంటి? నా ఈ సమస్యకు అదే కారణమా?
నాకిప్పుడు 45 ఏళ్లు. ప్రొలాప్స్ ఉందని డయాగ్నసిస్ చేశారు. నాకు ప్రసవం చాలా కష్టమైంది. నా ఈ సమస్యకు అదే కారణమా? నాకు సర్జరీ అంటే భయం. సర్జరీ కాకుండా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందా? – వేముల సూర్యకళ, సిరిసిల్లప్రొలాప్స్ అంటే గర్భసంచి కిందకు జారటం. సాధారణంగా కండరాల బలహీనత, ప్రసవమప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల వల్ల పెల్విక్ మజిల్స్, లిగమెంట్స్ వదులు అవుతాయి. కొంతమందికి జన్యుపరమైన కారణాలూ ఉండొచ్చు. హార్మోన్స్ చేంజెస్ కూడా కారణం కావచ్చు. అదేపనిగా దగ్గు వస్తున్నా, మలబద్ధకం ఉన్నా గర్భసంచి జారొచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు దగ్గినా, తుమ్మినా యూరిన్ లీక్ కావడం, బ్యాక్ పెయిన్ ఉంటాయి. కాళ్లు లాగుతున్నట్లనిపిస్తుంది.ప్రొలాప్స్ తొలిదశలోనే డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. లిగమెంట్స్ స్ట్రెంతెనింగ్, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అధిక బరువుంటే బరువు తగ్గడం, పౌష్టికాహారం వంటివాటితో మేనేజ్ చేయొచ్చు. ఫిజియోథెరపీ టీమ్ సపోర్ట్ తీసుకోవాలి. ప్రొలాప్స్ తర్వాత స్టేటెజెస్లో ఎక్సర్సైజెస్తోనే సమస్యను పరిష్కరించలేం. తర్వాత స్టేజెస్లో ప్రాలాప్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ అంటే సర్జరీయే. అయితే సర్జరీని వద్దనుకుంటే ఖజీnజ ్క్ఛటట్చటyని సూచిస్తారు.ఇది సిలికాన్ లేదా ఠిజీny∙మెటీరియల్తో తయారవుతుంది. దీన్ని పేషంటే స్వయంగా వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆ డివైజ్.. జారిన గర్భసంచిని పైకి ఎత్తిపెడుతుంది. పేషంట్ని చెక్ చేసి, తగిన సైజ్ Ring Pressaryని డాక్టర్ సూచిస్తారు. ఇది రౌండ్గా ఉంటుంది. దీన్ని చేతితో పట్టుకుని కంప్రెస్ చేయొచ్చు. లూబ్రికెంట్ జెల్లీతో ఇన్సర్ట్ చేసుకోవాలి. క్లినిక్లో డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక. కాసేపు నడిచి.. యూరిన్ పాస్ చేశాక.. సౌకర్యంగా అనిపిస్తే Pressaryతోనే ఇంటికి పంపిస్తారు.45 రోజులకు ఒకసారి వచ్చి.. చెక్ చేయించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి కొత్త Pressaryని మార్చుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి దీన్ని ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ చెబుతారు. అయితే దీనివల్ల వెజైనాలో విపరీతంగా నొప్పి వస్తున్నా.. మూత్ర విసర్జనప్పుడు ఇబ్బంది పడుతున్నా.. వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నా, దుర్వాసన వేస్తున్నా, బ్లీడింగ్ అవుతున్నా, వెజైనాలో అల్సర్స్ ఫామ్ అయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
సెకండ్ టైమ్ కూడా సిజేరియన్ అయితే.. ఏదైనా సమస్యా..!?
ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. సెకండ్ టైమ్. తొలికాన్పు సిజేరియన్. అయితే కుట్లు సరిగా మానలేదు. ఇప్పుడూ సిజేరియన్ అయితే అలాంటి పరిస్థితే వస్తుందేమోనని భయంగా ఉంది. కుట్లు త్వరగా మానేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. ప్రణిత, శ్రీరాంపూర్సిజేరియన్లో కరిగిపోయే కుట్లు వేస్తారు. లేదంటే ఎన్సేషన్ గ్లూతో క్లోజ్ చేస్తారు. మామూలుగా అయితే ఇవి మానడానికి ఒకటి నుంచి రెండు వారాలు పడుతుంది. కానీ శరీరతత్వాన్ని బట్టి మనిషికి మనిషికి తేడా ఉంటుంది. బరువు ఎక్కువున్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువున్న వాళ్లు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిలో కుట్లు మానడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. సాధారణంగా .. స్కిన్ వూండ్ని క్లోజ్చేసి డ్రెస్సింగ్ చేస్తారు. ఈ డ్రెస్సింగ్ వల్ల గాయం నుంచి ఏదైనా లీకేజ్ వచ్చినా.. అబ్సార్బ్ అయిపోతుంది.గాయం మానడానికి కావల్సిన కండిషన్ను క్రియేట్ చేస్తుంది. గాయానికి మనం వేసుకున్న దుస్తులు తగలకుండా చేస్తుంది. అయితే కుట్లు సరిగా మానకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ అవుతుంది. అంటే కుట్ల దగ్గర క్రిములు పెరిగి.. చీము పడుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ అయితే కుట్లలో పెయిన్ వస్తుంది. ఎర్రగా మారి వాపూ ఉంటుంది. నీరు, బ్లడ్ వంటి ద్రవాలు లీక్ అవుతుంటాయి. దుర్వాసన వేస్తుంది. హై టెంపరేచర్తో జ్వరం వస్తుంది.ఇలాంటి మార్పులు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. త్వరగా డాక్టర్ దగ్గరకు వెళితే ట్రీట్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆసుపత్రిలో చేసిన డ్రెస్సింగ్ డ్రైగానే ఉంటే మూడు రోజుల తర్వాత ఆ డ్రెస్సింగ్ని తీసేసి.. ఇంట్లోనే మీరు డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రెసింగ్ తడిగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇంట్లో డ్రెసింగ్ చేసుకునే ముందు సబ్బు నీటితో చేతులు శుభ్రంగా కడుక్కొని .. తడి లేకుండా తుడుచుకోవాలి.గ్లోవ్ హ్యాండ్తోనే డ్రెస్సింగ్ని తీసేసి.. మళ్లీ ఫ్రెష్గా డ్రెసింగ్ చేసుకోవాలి. కరిగిపోయే కుట్లయితే సాధారణంగా 7–10 రోజుల్లో కరిగిపోతాయి. విప్పే కుట్లయితే 14 రోజుల తర్వాత డాక్టర్ తీసేస్తారు. అప్పటి వరకు కుట్లకు మీరు వేసుకున్న దుస్తులు తగలకుండా కుట్ల దగ్గర కట్టు ఉండటం మంచిది. స్నానం చేసేటప్పుడు తడవకుండా చూసుకోవాలి. కుట్లు విప్పాకే పూర్తిగా షవర్ బాత్ చేయడం మంచిది. కుట్ల మీద స్ట్రాంగ్ సోప్ని వాడకూడదు. అలాగే జెల్స్, లోషన్స్ రాసుకోవద్దు.టాల్కం పౌడర్ కూడా వేయొద్దు. ఆపరేషన్ అయిన రెండు వారాలకు కుట్లు పూర్తిగా మానిపోతాయి. అప్పటి నుంచి నడుముకి బెల్ట్ పెట్టుకోవాలి.. నడుము నొప్పి రాకుండా! ఒకవేళ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే డాక్టర్ చెక్ చేసి.. కుట్ల దగ్గర స్వాబ్ టెస్ట్ చేసి.. ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది.. దానికి ఏ యాంటీబయాటిక్స్ ఇవ్వాలో చూసి.. ట్రీట్మెంట్ ఇస్తారు.– డా॥ భావన కాసు, గైనకాలజిస్ట్ & అబ్స్టేట్రీషియన్, హైదరాబాద్ -
ఎవరీ శశాంక్..? ఇన్నింగ్స్ చివర్లో వచ్చి.. సుడిగాలి వేగంతో..!
29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు.. నాటౌట్.. 25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 46 నాటౌట్..25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 41 పరుగులు..28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 68 నాటౌట్..ఇలా ఐపీఎల్–2024లో ఈ బ్యాటర్ తన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో వచ్చి సుడిగాలి వేగంతో చెలరేగిపోతున్న అతని ఆటతీరు అభిమానులను అలరిస్తోంది. సింగిల్స్తో కాకుండా సిక్సర్లతోనే స్కోరుబోర్డును పరుగెత్తిస్తున్న ఆ శైలి ఈ సీజన్లో అతనికి కొత్త ఫ్యాన్స్ను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా కోల్కతాతో మ్యాచ్లో 262 పరుగుల రికార్డు లక్ష్యాన్ని అందుకునే క్రమంలో మైదానంలో అన్ని వైపులకు అతను బాదిన ఎనిమిది సిక్సర్లు ఔరా అనిపించాయి.ఐపీఎల్ ప్రతి ఏటా కొంత మంది కొత్త హీరోలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. లీగ్లో తమ జట్టు ఓవరాల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా అప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడకపోయినా కొందరి అద్భుత ప్రదర్శన ఫ్రాంచైజీ క్రికెట్కు కొత్త ఊపును, ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి ఒక ఆటగాడే శశాంక్ సింగ్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ అతను ప్రదర్శిస్తున్న సంచలన ఆటతీరుతో అందరి దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్ వేలం సమయంలో తన ప్రమేయం లేకుండానే వివాదంలో నిలిచి అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఈ ఛత్తీస్గఢ్ ఆటగాడు ఇప్పుడు తన ఆటతోనే అందరికీ సమాధానమిచ్చాడు.గత ఏడాది డిసెంబర్ 20న ఐపీఎల్–2024 సీజన్లో మిగిలిన స్థానాల కోసం వేలం జరిగింది. వేలం నిర్వహిస్తున్న మల్లికా సాగర్ ‘శశాంక్ సింగ్’ అనే పేరు ప్రకటించింది. అయితే ఏ ఫ్రాంచైజీ నుంచి కూడా స్పందన రాలేదు. ఆ తర్వాత మరో ఇద్దరు ఆటగాళ్లు వేలంలో అమ్ముడుపోయారు. ఆపై మళ్లీ ‘శశాంక్ సింగ్’ అనే పేరు వినిపించింది. అప్పటి వరకు వరుసగా యువ ఆటగాళ్లను తీసుకుంటూ పోతున్న పంజాబ్ కింగ్స్ యజమానులు కూడా ప్యాడిల్ ఎత్తి తమ ఆసక్తిని ప్రదర్శించారు.రూ. 20 లక్షల కనీస విలువకు ఇతర జట్లేవీ ముందుకు రాకపోవడంతో శశాంక్ను పంజాబ్ తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే కొద్ది క్షణాల తర్వాత అనూహ్యంగా పంజాబ్ యజమాని ప్రీతి జింటా తమకు ఈ ఆటగాడు అవసరం లేదంటూ వేలం నిర్వాహకులకు చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మీరు ఆలస్యం చేశారంటూ మల్లికా సాగర్ స్పష్టం చేసేసింది. దాంతో బలవంతంగా, కాస్త నిరాశగా శశాంక్ను పంజాబ్ తీసుకుంది.దీనిపై పెద్ద దుమారం రేగింది. ఒక యువ ఆటగాడిని ఇలా అవమానపరుస్తారా అంటూ విమర్శలు వచ్చాయి. చివరకు కింగ్స్ యాజమాన్యం పలు రకాలుగా వివరణ ఇస్తూ తమ జట్టులోకి ఆహ్వానించింది. అయితే తాము వద్దనుకున్న ఆటగాడు ఎంత విలువైనవాడో సీజన్ సాగిన కొద్దీ యాజమాన్యానికి తెలిసొచ్చింది. శశాంక్ సింగ్ మాత్రం అన్నింటికీ ఒకే ఒక చిరునవ్వుతో సమాధానం ఇస్తూ మైదానంలో దూసుకుపోయాడు.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకుంటూ..బలమైన నేపథ్యం ఉన్నా..‘నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని ఎవరైనా అంటే అవి ఆర్థికపరమైన కష్టాలే కానవసరం లేదు. గెలుపు దారిలో ఎన్నో ప్రతికూలతలు ఎదురవుతాయి. మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు పట్టుదలగా నిలబడితేనే ముందుకు వెళ్లగలం’ అని శశాంక్ సింగ్ తన గురించి తాను చెప్పుకున్నాడు. ఎందుకంటే శశాంక్ తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి (ప్రస్తుతం మధ్యప్రదేశ్లో స్పెషల్ డీజీగా పని చేస్తున్నారు).ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. 1996 వరల్డ్ కప్ సమయంలో ఐదేళ్ల వయసున్న శశాంక్కు తొలిసారి క్రికెట్లో ఓనమాలు నేర్పించారు. అప్పటికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడలేదు. శశాంక్ పుట్టిన భిలాయ్ మధ్యప్రదేశ్లోనే ఉంది. చిన్న వయసులోనే ఆటలో చురుకుదనం చూపించిన శశాంక్ మధ్యప్రదేశ్ అండర్–15, అండర్–17 జట్ల తరఫున ఆడాడు. ఇక సీనియర్ స్థాయికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తండ్రి తీసుకున్న ఒక నిర్ణయం శశాంక్ కెరీర్ గతి తప్పేలా చేసింది.తనకు ముంబైకి బదిలీ కావడంతో కొడుకును కూడా అక్కడకు తీసుకెళ్లారు. నిజానికి ముంబైలో ఉంటే మంచి శిక్షణ లభిస్తుందని, ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఆయన సానుకూల రీతిలోనే ఆలోచించారు. కానీ అక్కడికి వెళ్లాక అంచనా తప్పి అంతా తలకిందులైంది.దేశవాళీలో అవకాశాలు దక్కినా..ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా.. లీగ్లతో మొదలు పెట్టి శశాంక్ అన్ని రకాల గుర్తింపు పొందిన టోర్నీలలో ఆడాడు. అప్పటినుంచే అతనికి దూకుడైన, విధ్వంసక ఆటగాడిగా, భారీ సిక్సర్లు కొట్టేవాడిగా గుర్తింపు వచ్చింది. సంప్రదాయానికి భిన్నంగా ఉండే అతని టెక్నిక్తో శశాంక్ పరుగుల వరద పారించాడు. ఒక లీగ్ మ్యాచ్లో అతను ఒక్కరోజే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. దాంతో 2014–15 సీజన్లోనే ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది.ఆ తర్వాత ఇదే జోరులో వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం కూడా ముంబై జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆ సమయంలో జట్టులో ఉన్న రహానే, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అభిషేక్ నాయర్, శార్దూల్ ఠాకూర్, సిద్దేశ్ లాడ్ వంటి స్థానిక ఆటగాళ్లను దాటి తుది జట్టులో చోటు దక్కించుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. దాంతో పాటు శశాంక్ను అంతా ముంబైకి చెందని ‘పరాయివాడు’గా చూడటం మొదలైంది.దాంతో ప్రదర్శన ఎంత బాగున్నా ఒక్క మ్యాచ్లో ఆడే అవకాశం ఇస్తే నాలుగు మ్యాచ్లలో ఆడించకుండా కూర్చోబెట్టసాగారు. దాంతో నాలుగేళ్ల పాటు జట్టుతో ఉన్నా రంజీ ట్రోఫీలో ఆడే అవకాశమే రాలేదు. ఇది శశాంక్ను తీవ్ర అసహనానికి గురిచేసింది.పంజాబ్ జట్టు యజమాని ప్రీతీ జింతాతో.. పట్టుదలతో పైకి లేచి..‘అది నాకు కష్టకాలం. అయితే నేను ఎవరినీ నిందించలేదు. విమర్శలు చేయలేదు. నా ఆటపై నాకు నమ్మకముంది. ఇది నా కెరీర్ కోసం సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటానని, మీ సహకారం అవసరం లేదని కూడా నాన్నకు స్పష్టంగా చెప్పా. అందుకే జట్టు మారాలని నిర్ణయించుకున్నా’నని చెబుతూ శశాంక్ నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ముంబై నుంచి మారాలని నిర్ణయించుకున్న తర్వాత దేశవాళీలో పుదుచ్చేరిని ఎంపిక చేసుకొని ఒక సీజన్ పాటు ఆడాడు. కానీ అది మరీ బలహీన జట్టు కావడంతో తాను ఆశించిన ఫలితం దక్కలేదు.చివరకు తనకు సరైంది తన రాష్ట్రమే అని అతను అర్థం చేసుకున్నాడు. ఛత్తీస్గఢ్ కోచ్ దేవేంద్ర బుందేలా సలహా మేరకు టీమ్లోకి వచ్చిన శశాంక్ 2019–20 సీజన్లో రంజీ ట్రోఫీలోకి అడుగు పెట్టాడు. దాంతో తన కెరీర్లో ఏదో సాధించిన సంతృప్తి. గత ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో మణిపూర్తో మ్యాచ్లో 150 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీసిన శశాంక్ ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే అతనికి మరింత సంతృప్తినిచ్చిన విజయం నాలుగేళ్ల క్రితం విజయ్ హజారే ట్రోఫీలోనే వచ్చింది. ముంబై జట్టులో తనతో కలసి ఆడిన పలువురు క్రికెటర్లు అన్నివైపుల నుంచి స్లెడ్జింగ్ చేస్తుండగా కీలక ఇన్నింగ్స్ ఆడి తొలిసారి ముంబైపై 5 వికెట్ల తేడాతో ఛత్తీస్గఢ్ విజయం సాధించడం అతనికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఐపీఎల్లో ఆలస్యంగా..ఈ ఏడాది ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తో చెలరేగిపోతున్న శశాంక్ ప్రయాణం ఇక్కడా గొప్పగా సాగలేదు. 2017 నుంచి 2021 మధ్య ఢిల్లీ, రాజస్థాన్ జట్లతో ఉన్నా ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఎట్టకేలకు 2022లో సన్రైజర్స్ తరఫున బరిలోకి దిగి తొలి మ్యాచ్లో 6 బంతుల్లోనే 25 పరుగులు సాధించి వెలుగులోకి వచ్చాడు. అయితే ఇలాంటి ప్రదర్శన తర్వాత కూడా అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు.గత సీజన్లో అయితే ఆడే చాన్సే రాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా దక్కిన ఆపర్చునిటీని అతను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగిపోతూ ధనాధన్ బ్యాటింగ్తో లీగ్పై తనదైన ముద్ర వేశాడు. ‘నా కొడుకు జీవితంలో కొత్త వెలుగు వచ్చేందుకు బాగా ఆలస్యమైంది. ఇది నన్ను నిరాశపరచే అంశం’ అంటూ తండ్రి బాధపడినా.. తనకు అలాంటి చింత ఏమీ లేదని, ప్రతికూలతలను దాటి తాను వచ్చిన స్థాయి పట్ల సంతృప్తిగా ఉన్నానని శశాంక్ చెప్పుకున్నాడు.కొన్నేళ్ల క్రితం క్రికెట్లో పరిస్థితులు చూసి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టినా.. ఆటపై ప్రేమ కుదురుగా ఉండనీయక మళ్లీ అతను బ్యాట్ పట్టేలా చేసింది. 32 ఏళ్ల వయసులో భారత జట్టులో స్థానాన్ని ఆశించే విషయంలో ఏమీ చెప్పలేకపోయినా.. అతని ఆట చూస్తే ఏదోరోజు అద్భుతం జరగవచ్చని మాత్రం అనిపిస్తోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాదిఇవి చదవండి: Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్రత్త! -
పిల్లల్లో కోపం హద్దులు దాటితే.. ఇలాగే జరుగుతుంది..!
అరుణ్ నాలుగో తరగతి చదువుతున్నాడు. కానీ వాడిని చూస్తే క్లాస్ మొత్తానికీ హడల్. ఓసారి ఏదో అన్నాడని క్లాస్మేట్ గొంతు పిసికాడు. మరోసారి క్లాస్ టీచర్పైనే పుస్తకం విసిరేశాడు. ఇంకోసారి ఏకంగా ప్రిన్సిపాల్ పైనే అరిచేశాడు. దాంతో పలుమార్లు స్కూల్లో కౌన్సెలింగ్ చేయించారు. పేరెంట్స్ను స్కూల్కి పిలిపించి హెచ్చరించారు. కానీ అరుణ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో క్లాస్ టీచర్ సలహా మేరకు కౌన్సెలింగ్ సెంటర్కు వెళ్ళారు. పేరెంట్స్తో మాట్లాడాక అరుణ్ ప్రవర్తనకు మూలం ఇంటి వాతావరణంలోనూ, చూస్తున్న సీరియల్స్లోనూ ఉందని తేలింది.హింసాత్మక ప్రవర్తన..పిల్లల చుట్టూ ఉండే విభిన్న అంశాలు హింసాత్మక ప్రవర్తన, ధోరణిని పెంచుతాయి. అది వయసును బట్టి కొట్టడం, తన్నడం, కొరకడం, జంతువులను బాధించడం నుంచి ఇతరులపై దాడిచేయడం, కాల్పులు వంటి నేరపూరిత చర్యల వరకు ఉంటుంది. ఇలాంటి హింసాత్మక, విధ్వంసక ప్రవర్తనను సకాలంలో నియంత్రించకపోతే తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు చిన్నప్పటి నుంచే కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.పిల్లల్లో హింసకు కారణాలు..పిల్లల్లో హింసాత్మక ప్రవర్తన పెరగడానికి కారకాలేంటో తెలుసుకోవడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడు సంవత్సరాల పాటు అధ్యయనం జరిపారు. శారీరక శిక్ష, దూకుడు ఆలోచనలు, దూకుడు ప్రవర్తన, ఆత్మగౌరవ లేమి లాంటివి హింసాత్మక ప్రవర్తనకు కారకాలని తేలింది. మరికొన్ని కారణాలు.. 1. శారీరక, మానసిక, శాబ్దిక, లైంగిక దోపిడీకి గురికావడం.2. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, మంచి ఇంటి వాతావరణాన్ని అందించకపోవడం..3. బాధాకరమైన సంఘటనలకు గురికావడం లేదా నిరంతర ఒత్తిడిని అనుభవించడం..4. బెదిరింపుల బాధితుడుగా ఉండటం లేదా తానే బెదిరించడం..5. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటి మాదకద్రవ్యాల వాడకం..6. టెలివిజన్లో హింసాత్మక ప్రోగ్రామ్లు చూడటం..7. కత్తులు, తుపాకులు లాంటివి ఇంట్లో కంటికెదురుగా ఉండటం..8. చాలా వాస్తవికమైన ఫస్ట్–పర్సన్ షూటర్ గేమ్స్ లాంటివి ఆడటం ఉదా.. పబ్జీ గేమ్.. 9. అఈఈ, అఈఏఈ, బైపోలార్ డిజార్డర్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మతలు..నిరోధించడమిలా..హింసాత్మక ప్రవర్తనను ప్రేరేపించే కారకాలకు దూరం చేస్తే హింసాత్మక ప్రవర్తన తగ్గుతుందని లేదా నిరోధించవచ్చని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాల్య, కౌమారదశల్లో ఇల్లు, సమాజం, మీడియా ద్వారా హింసకు గురికావడాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి. ఇంకా..1. కోపం, చిరాకులను సరైన రీతిలో ఎలా వ్యక్తం చేయాలో నేర్పించాలి.2. తన చర్యలకు, పరిణామాలకు తనదే బాధ్యతని గుర్తించేలా తయారుచేయాలి. 3. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, టీవీ, వీడియోలు, చలనచిత్రాలతో సహా పిల్లల స్క్రీన్ విషయంలోనూ హింస లేకుండా పర్యవేక్షించాలి. 4. అన్నిటికీ మించి మంచి కుటుంబ వాతావరణాన్ని అందించాలి. 5. బడిలో, పరిసరాల్లోని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. 6. ఎన్ని ప్రయత్నాలు చేసినా కోపం తగ్గకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ను సంప్రదించాలి. 7. సైకాలజిస్ట్లు పిల్లల కోపానికి కారణాలు లేదా మానసిక సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సైకోథెరపీ ద్వారా సహాయపడతారు.కోపం సాధారణ భావోద్వేగం..కోపం మనందరిలో ఉండే ఒక సాధారణ భావోద్వేగం. అయితే చిన్న పిల్లలకు తమ కోపాన్ని ఎలా వ్యక్తం చేయాలో, లేదా ఎలా నియంత్రించుకోవాలో తెలియదు. బొమ్మలు పగలగొట్టవచ్చు, స్నేహితులను నెట్టివేయవచ్చు, కొట్టవచ్చు. వయసు పెరిగేకొద్దీ కోపం నియంత్రించుకోవడం తెలుస్తుంది. కానీ అరుణ్లా కొందరిలో ఆ నియంత్రణ శక్తి ఉండదు. హెచ్చరిక సంకేతాలు.. 1. తరచుగా అదుపులేని కోపం2. సులువుగా నిరాశ చెందడం 3. చాలా సున్నితంగా ఉండటం 4. తరచు చిరాకు పడటం 5. ఇంపల్సివ్గా వ్యవహరించడం 6. తరచుగా బెడ్ను పాడుచేయడంసైకాలజిస్ట్ విశేష్(psy.vishesh@gmail.com)ఇవి చదవండి: Mother's Day-2024: తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం! -
తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!
ప్రేమ.. త్యాగం.. భరోసా.. భద్రత.. అని ఏ భాషలో గూగుల్ చేసినా వాటన్నిటికీ, అన్ని భాషల్లో ‘అమ్మ’ అన్న ఒకే మాటను చూపిస్తుందేమో గూగుల్! అలాగే బంధాలు, అనుబంధాల్లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిందే అమ్మే! ఇంట్లో వాళ్ల గారాం.. మారాం.. అలక.. కోపం.. విసుగు.. చిరాకు– పరాకు.. ఆనందం.. అసహనం.. అలక్ష్యం.. అవమానం.. అవహేళన.. మోసం.. కుట్ర.. కుతంత్రం.. వంటి అన్ని భావోద్వేగాలుచ లక్షణాలకు బలయ్యేది అమ్మే! శక్తిసామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యల్లో అమ్మను మించిన వారుండరేమో! అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లోప్రొఫైలే! అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు! అది హోమ్ కాదు గోడలు, చూరున్న ఒట్టి హౌస్ మాత్రమే!అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది.. ఏనుగంటి తండ్రి వెనుకపడ్డా.. ఎలుకంత తల్లి ముందుండాలి అని! తన సుఖదుఃఖాలు, సాధకబాధకాలతో సంబంధం లేకుండా.. ఇంటిల్లిపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది. పిల్లల వృద్ధికి దారి చూపే మైలు రాయిలా నిలబడుతుంది! అందుకే అమ్మ సెంటిమెంట్ కాదు.. ఆలోచనాపరురాలు! తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మలచే నాయకురాలు! అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఉనికిలో ఉంది! ఆమె నీడన సేదతీరుతోంది! అందుకే అమ్మ నిత్యపూజనీయురాలు! ఆమె పట్ల మనసులోనే దాచుకున్న ఆ ప్రేమను.. గౌరవాన్ని ఏడాదికి ఒక్కరోజైనా ప్రదర్శిద్దాం.. మాతృదినోత్సవంగా!ఆధునిక ప్రపంచంలో ‘మదర్స్ డే’కి అమెరికా నాంది పలికినా.. ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయ రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశాలున్నాయి. ప్రాచిన గ్రీస్లో గాయియా(భూమాత), రియా(సంతాన దేవత)లకు ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున పూజలందించేవారట. దీన్నే తొలి ‘మదర్స్ డే’ వేడుకగా భావిస్తారు గ్రీకు దేశస్తులు. యునైటెడ్ కింగ్డమ్లోని ‘మదరింగ్ సండే’ కూడా ‘మదర్స్ డే’ లాంటిదే.అయితే వీటన్నిటికీ భిన్నమైంది మే రెండో ఆదివారం జరుపుకుంటున్న మోడర్న్ మదర్స్ డే కాన్సెప్ట్! అమెరికా, వర్జీనియాకు చెందిన ఏన్ రీవ్స్ జర్విస్ అనే సామాజిక కార్యకర్త.. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి శిక్షణనిచ్చేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన మందులు, పోషకాహారాన్ని సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు.ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకూ విస్తరించింది. సివిల్ వార్ టైమ్లో ఈ క్లబ్బులు ఇరువర్గాల బాధితులకు ఆహారం, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొల్పడానికి ఏన్ జర్వీస్ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తన చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహసంబంధాలను నెలకొల్పడానికి ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ పేరుతో సభను ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్లా కొన్నేళ్లపాటు కొనసాగింది. తర్వాత ఏన్ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ల దగ్గరకు వెళ్లిపోయి.. 1905, మే 9న కన్ను మూసింది.జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్ జర్విస్ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్ 1907, మే 12 న ఒక సభను ఏర్పాటు చేసింది. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా ‘మదర్స్ డే’కి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ఇవ్వాలనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇది ఆరేళ్లపాటు కొనసాగింది. ఆమె పట్టుదల ఫలితంగా నాటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్.. ప్రతి మే రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా.. జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. తర్వాత అనా ‘మదర్స్ డే ఇంటర్నేషనల్ అసోసియేషన్’ నూ స్థాపించింది. ఉన్నత∙ఆశయంతో మొదలైన ‘మదర్స్ డే’ 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది.ఆ రోజున గ్రీటింగ్ కార్డ్స్, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్ చేసుకోసాగాయి సదరు కంపెనీలు! అమ్మలకు గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు, కానుకలు ఇవ్వడమే ‘మదర్స్ డే’ సంప్రదాయమైంది. అంతేకాదు అనా జర్విస్ వాళ్లమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్ ఫ్లవర్స్ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్. ‘మదర్స్ డే’ అనేది ఓ సెంటిమెంట్గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలసి వస్తుంది అనుకుంటే అదేదో మార్కెట్ ప్రాఫిట్ డేగా మారుతోందని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకరమైన మార్కెట్ సెలబ్రేషన్స్ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఓ క్యాంపెయిన్ నడిపింది అనా. అది ఫలించకపొగా గ్లోబలైజేషన్ తర్వాత మే రెండో ఆదివారం వచ్చే ‘మదర్స్ డే’ గ్లోబల్ ఈవెంట్ అయింది. ఈ కథనానికి సందర్భమూ అదే అనుకోండి!అయితే మొదట్లో ప్రస్తావించినట్టు చాలా దేశాలు తమ తమ సంస్కృతీ సంప్రదాయల నేపథ్యంలో భిన్న మాసాలు.. భిన్న తేదీల్లో విభిన్న రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మే రెండో ఆదివారం మదర్స్ డే చేసుకునే దేశాలతోపాటు ఆ విభిన్న రీతులేంటో కూడా చూద్దాం!ప్రతి సంవత్సరం.. ‘మదర్స్ డే’ నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయట.క్రిస్మస్, ఏnuజుజ్చుజి తర్వాత పూలు, మొక్కలు అత్యంతగా అమ్ముడుపోయే మూడో అతి పెద్ద వేడుక.. మదర్స్ డే!ఏడాది మొత్తంలో అమ్ముడు పోయే పూలల్లో నాలుగింట ఒక వంతు పూలు మదర్స్ డే రోజునే అమ్ముడుపోతాయి.ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్కి మదర్స్ డే బిజీయెస్ట్ డే.మదర్స్ డే సంప్రదాయ కానుక.. సింగిల్ కార్నేషన్.ప్రపంచంలోని చాలా భాషల్లో ‘అమ్మ’ అనే పదం ఎమ్తోనే మొదలవుతుందట.ఇటలీలో మదర్స్ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీల్ చేస్తారట కుటుంబ సభ్యులంతా!ఒంటరి తల్లులకు అండగా.. ఆస్ట్రేలియాలో 1924 నుంచి మే రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది అమ్మలు తమ భర్తలను, కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ.. ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్ హేడెన్ అనే మహిళ. ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు జానెట్ ఆ అమ్మల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. జానెట్ను చూసి స్ఫూర్తిపొందిన చాలా మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్ పెరిగి అదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ విరగబూసే చేమంతులే మదర్స్ డే సంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి.పబ్లిక్ హాలీడే కాదు.. పోలండ్లో ‘మదర్స్ డే’ను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్ హాలీడే కాదు. సంప్రదాయ వేడుకలు, కానుకలు కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ ఫ్లవర్స్ని తమ తల్లులకు కానుకగా ఇస్తారు.బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్!మెక్సికోలో మే 10న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. అక్కడిది అతి పెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, ఫుడ్తో సెలబ్రేట్ చేస్తారు. అమ్మ గుణగణాలను పాటలుగా రాసి బాజాభజంత్రీల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతోనే అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్కి తీసుకెళ్తారు. మదర్స్ డే.. మెక్సికోలోని రెస్టారెంట్స్ అన్నిటికీ బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని చెబుతారు స్థానికులు.మదర్ ఫిగర్స్ అందరికీ..నికరాగువాలో మే 30న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. కుటుంబమంతా కలసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీస్లకు సెలవు ఇస్తారు. ఒక్క అమ్మకే కాదు.. అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ల జీవితాల్లోని మదర్ ఫిగర్స్ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు. వేడుకలతో అలరిస్తారు.రాణి పుట్టిన రోజు..థాయ్లండ్లో ఆ దేశపు రాణి.. క్వీన్ సిరికిట్ బర్త్ డే.. ఆగస్ట్ 12ను ‘మదర్స్ డే’గా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్ డేని ‘మదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఈ ఆచారం 1976 నుంచి మొదలైంది. అదొక స్వచ్ఛంద సేవా దినంగా ఉంటుంది. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు. విరాళాలిస్తారు. సైనిక వందనం ఉంటుంది. బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్ సిరికిట్ ఫొటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు.. స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కానుకగా ఇస్తారు.మూడు రోజుల వేడుక!ఇథియోపియాలో వర్షకాలపు చివరి రోజుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. వీళ్లకిది మూడు రోజుల వేడుక. ఈ మూడు రోజులూ మగవాళ్లు పాటలు పాడుతూ.. డాన్సులు చేస్తూ.. అమ్మతోపాటు భూదేవికీ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సంప్రదాయ వంటకాలైన ‘హష్’, ‘పంచ్’లను ఆరగిస్తారు. హష్ అంటే ఇథియోపియన్ మసాలాలు, చీజ్తో వండిన మటన్ లేదా బీఫ్. ఈ వంటకానికి కావల్సిన కూరగాయలు, చీజ్ని కూతుళ్లు, మాంసాన్ని కొడుకులు తెచ్చి, ఇద్దరూ కలసి దీన్ని వండటం వీళ్ల ఆచారం. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్బెరీ, బత్తాయి, తెల్ల ద్రాక్షారసాల మిశ్రమం.కుటుంబ పండగబ్రెజిల్లో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ . దీన్ని ఇక్కడ అతిపెద్ద కమర్షియల్ హాలీడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి దగ్గరకు వచ్చి ఆమెతో కలసి ఈ వేడుకను జరుపుకుంటారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్తో కలిపి వడ్డించే ఛిజిuటట్చటఛిౌ అనే గ్రిల్డ్ మీట్ ‘మదర్స్ డే’ స్పెషల్ డిష్ ఇక్కడ.వారం రోజులు..పెరూలోనూ మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. వీళ్లకిది వారం రోజల పండగ. వైవిధ్యంగా జరుపుకుంటారు. తమ కుటుంబంలో.. కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల మీదుంచి వాళ్లకిష్టమైన వంటకాలు, డ్రింక్స్ను నైవేద్యంగా పెడతారు. వాళ్ల ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తర్వాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్టు గడుపుతారు.రూరల్ విమెన్స్ డే కూడా..మలావీలో అక్టోబర్ 15న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వీళ్లకు నేషనల్ హాలీడే. అక్టోబర్ 15 ‘రూరల్ విమెన్స్ డే’ కూడా కావడంతో దేశా«ధ్యక్షుడు అమ్మల ఔదార్యం, ప్రాధాన్యం గురించి బహిరంగ ప్రసంగం చేస్తాడు.రెడ్ కార్నేషన్తో.. జపాన్లో మొదట్లో.. వాళ్ల సామ్రాజ్ఞి కోజన్ పుట్టిన రోజు.. మార్చి 6ను ‘మాతృదినోత్సం’ కింద పరిగణించేవారు! అయితే 1949 నుంచి మే రెండో ఆదివారమే మదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజున పిల్లలు రెడ్ కార్నేషన్ ఫ్లవర్తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను చాటుకుంటారు.రెండుసార్లు.. రష్యాలో మార్చి 8న, మే రెండో ఆదివారం రోజున.. రెండుసార్లు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మే రెండో ఆదివారం రోజున తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకల కంటే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మొగ్గు చూపుతారు.ఆఖరి ఆదివారంఫ్రాన్స్లో మే ఆఖరి ఆదివారమే ‘మదర్స్ డే’. ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్ ఇస్తారు. ఇది ఒక కుటుంబ వేడుకగా జరుగుతుంది.స్వయంగా చేసి.. స్పెయిన్లో డిసెంబర్ 8న ‘మదర్స్ డే’ను సెలబ్రేట్ చేస్తారు. దీన్ని మదర్ మేరీకి సంబంధించిన పండగగా భావిస్తారు. పిల్లలంతా తమ తల్లులకు ఇష్టమైనవాటిని తామే స్వయంగా చేసి బహూకరిస్తారు. ఈ రోజున గీట్రింగ్ కార్డ్స్, చాక్లేట్స్, పువ్వుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయట!జపాన్లో అమ్మకు రెడ్ కార్నేషన్ ఇస్తూ..తల్లులకు ఆసరాగా.. స్వీడన్లో మే ఆఖరి ఆదివారం ‘మదర్స్ డే’. ఈ రోజున స్వీడిష్ రెడ్ క్రాస్.. చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను విక్రయిస్తుంది. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటుంది.ఎంత మంది పిల్లలు అనే లెక్కనజర్మనీలో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్ట్లతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ఈ సీన్ వేరుగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంత మంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్తో సత్కరించేవారట.రెండూ ఒకే రోజుఫిలిప్పీన్స్లో మే రెండో ఆదివారం నాడే మదర్స్ డే’ జరుపుకుంటారు. అయితే 1980లో అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కస్ డిసెంబర్ మొదటి సోమవారాన్ని మాతృ, పితృదినోత్సవం’గా ప్రకటించాడు. కానీ తర్వాత అధ్యక్షుడు కోరీ అక్వినో ఎప్పటిలాగే మే రెండో ఆదివారాన్ని ‘మాతృదినోత్సవం’గా, జూన్ మూడో ఆదివారాన్ని ‘పితృదినోత్సవం’గా ప్రకటించాడు. అయితే అయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ జోసెఫ్ ఎస్ట్రాడా 1998లో మళ్లీ ఈ రెండిటినీ డిసెంబర్కే మార్చేశాడు. ఇదేలా ఉన్నా ఫిలిప్పినీస్ తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. ‘మదర్స్ డే’ రోజున ఫ్లవర్స్, చాక్లేట్స్, గిఫ్ట్లతో అమ్మ మీది ప్రేమను ప్రకటిస్తారు.స్కౌట్ మూవ్మెంట్ మద్దతుఆస్ట్రియాలో మదర్స్ డేని మొదటిసారిగా 1924లో జరుపుకున్నారు. ఆస్ట్రియన్ విమెన్స్ మూవ్మెంట్ వ్యవస్థాపకురాలు మరియాన్ హెయినిష్ ‘మదర్స్డే’ జరిపేందుకు చొరవ తీసుకుంది. దీనికి ఆమెకు స్కౌట్ మూవ్మెంట్ మద్దతు చ్చింది. ఇక్కడా మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకుంటారు.పెరూలో కీర్తిశేషులైన తల్లులకు పువ్వులు అర్పిస్తూ..అమ్మను చూసే రోజు..నేపాల్లో మాతా త్రితా ఆన్సి (్చunటజీ) అనే పండగ రోజున ఇక్కడి మాతా త్రితా కోనేరు దగ్గరకు వచ్చి.. కీర్తిశేషులైన మాతృమూర్తులకు తర్పణం వదిలి వాళ్ల పట్ల ఉన్న తమ ప్రేమాభిమానాలను చాటుకుంటారు. దీన్ని ‘ఆమా కో ముఖ్ హెర్నే దిన్ (అంటే అమ్మను చూసే రోజు)’గానూ వ్యవహరిస్తారట. దీన్నే ‘మదర్స్ డే’ అనుకోవచ్చు అంటారు నేపాలీలు. అయితే ఆరోజున.. కీర్తిశేషులైన వాళ్లను తలచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాద పూజ చేస్తారు.ముస్తఫా అమిన్ వల్ల..ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, కతార్, సిరియా కువైట్, మారిటేనియా, ఒమాన్, పాలెస్తీనా, సౌది అరేబియా, సొమాలియా, సుడాన్, యూఏఈ, యెమెన్ వంటి దేశాల్లో మార్చ్ 21న ‘మాతృదినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఈజిప్ట్ ఈ వేడుకను 1956లో జర్నలిస్ట్ ముస్తఫా అమిన్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి చాలా అరబ్ దేశాలు ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.నేపాల్లో మాతా త్రితా ఆన్సి పండగ..పిల్లల్ని రక్షించినందుకు..ఇజ్రాయెల్లో ‘మాతృదినోత్సవం’ క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. ఇది జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారం షెవత్ 30న అంటే జనవరి 30 నుంచి మార్చి 1 మధ్యలో వస్తుంది. హెనుయెటా జోల్డ్ నాయకత్వం లోని యూత్ ఆలియా ఆర్గనైజేషన్.. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.ఇంకా ఈ దేశాల్లో.. నార్వేలో ఫిబ్రవరి రెండో ఆదివారం, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, కజకిస్తాన్, మాల్డోవా, సైబీరియా, వియత్నాంలలో మార్చి 8, గర్నెసీ, ఐర్లాండ్, నైజీరియాల్లో ఫోర్త్ సండే ఆఫ్ లెంట్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలాల్లో మార్చి 10, అల్జీరియా, కేమరూన్, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, మడగాస్కర్, మాలి, మారిషస్, మొరాకో, నిగర్, సెనెగల్, ట్యునీషియా దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. -
ఈ అలవాట్లను మార్చుకున్నారో.. విజయం మీదే..!
జీవితంలో విజయాన్ని సాధించాలని, అన్నింటిలోనూ సక్సెస్ అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. అంతదాకా ఎందుకు, మీరు సక్సెస్ కోరుకుంటున్నారా అని అడిగితే ప్రతి ఒక్కరూ అవుననే అంటారు. అయితే మనం అనుకున్నంత సులువేం కాదు విజయాన్ని సాధించడం. ఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. జీవితంలో విజయం సాధించాలంటే కచ్చితంగా కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం... సక్సెస్ని చవిచూద్దాం...విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనకాల ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉండే ఉంటాయి. అయితే ఆ కష్టాలను ఇష్టాలుగా... ఆ కన్నీటిని పన్నీటిగా స్వీకరిస్తేనే వారు విజయాన్ని సొంతం చేసుకుని ఉంటారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.సమయాన్ని సద్వినియోగం... అందరికీ రోజులో ఉండేది 24 గంటల మాత్రమే. అయితే ఎవరు ఎక్కువగా ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారన్న సూత్రమే సాఫల్యాన్ని సూచిస్తుంది. అందుకోసం చేసుకోవాల్సిన మొదటి అలవాటు ఉదయాన్నే త్వరగా నిద్ర మేల్కొనడం. కనీసం ఉదయం ఐదింటికల్లా నిద్రలేవడాన్ని అలవాటు చేసుకుంటే... రోజంతా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, ఎంత సమయం మిగులుతుందో మనకే అనుభవంలోకి వస్తుంది.బుక్ రీడింగ్..విజయం సాధించే వారిలో ఉండే మరో మంచి లక్షణం పుస్తక పఠనం. జీవితంలో గొప్ప స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను, గొప్పవారి జీవిత కథలను, ఆత్మకథలను చదవడం వల్ల మనసు పొరలు తెరుచుకుంటాయి. కొత్త ఉత్సాహం వస్తుంది. ఒక్కసారి పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే సరి... ఆ తర్వాత పుస్తకాలు చదవకుండా ఉండలేరు.ఆరోగ్యం... ఆకృతి!జీవితంలో అనుకున్నది సాధించాలంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. అందుకే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంటారు. కచ్చితంగా ఉదయం వ్యాయామాలు చేస్తుంటారు. మంచి ఆహారం తీసుకుంటారు. రాత్రి సమయానికి నిద్ర΄ోతారు. ఆరోగ్యం బాగున్న వారే అహరహం శ్రమించగలిగే శక్తిని కలిగి ఉంటారనే విషయాన్ని మరచి ΄ోకూడదు.సరైన స్నేహం..మనం ఎప్పుడూ మంచి స్నేహితులనే ఎంచుకోవాలి. శల్య సారథ్యం చేసేవారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. శల్య సారథ్యం అంటే నువ్వు ఆ పని చెయ్యలేవు, నీ వల్ల అది సాధ్యం కాదు అంటూ వెనక్కి లాగడం. అందువల్ల మన పక్కన సానుకూల దృక్పథంతో ఉండేవారే ఉంటే మనకు చాలా మంచిది. అందువల్ల అలా పాజిటివ్గా ఉండే వారినే ఎంచుకోవడం, అలాంటి వారితోనే స్నేహం చేయడం చాలా మంచిది. కొందరు నిత్యం నెగిటివ్ ఆలోచనతో, నెగిటివ్ మాటలతో విసిగిస్తుంటారు. అలాంటి వారితో స్నేహం చేస్తే మీరు కూడా నెగిటివ్ దారిలోనే వెళ్తారు.వాదనలకు దూరంగా ఉండటం..జీవితంలో విజయం సాధించిన వారు ఎప్పుడైనా ఇతరులతో వాదనలకు దూరంగా ఉంటారు. వీలైనంత తక్కువ వాదిస్తుంటారు. ఎదుటి వ్యక్తితో వాదించే సందర్భంగా వచ్చినా మౌనంగా ఉంటారు తప్ప.. వాదనలకు దిగరు.ఇవి చదవండి: మీ బ్రెయిన్ ఆక్టివ్ ఉండాలంటే.. ఇలా చేయండి! -
మీ బ్రెయిన్ ఆక్టివ్గా ఉండాలంటే.. ఇలా చేయండి!
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో మెదడు ఒకటి. మెదడు ఆదేశాల ప్రకారమే శరీరంలోని అన్ని భాగాలు పనిచేస్తాయి. మెదడు సరిగ్గా పని చేయకపోతే... మనిషి ఏ పనీ సరిగ్గా చేయలేడు. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం కొన్ని చెయ్యాలి... మరికొన్నింటిని తినాలి... అవేంటో చూద్దాం...దేనినైనా సరే, సరిగ్గా పని చేయిస్తేనే అది సక్రమంగా పని చేస్తుంది. ఎన్ని వేలు పోసి కొన్న యంత్రాన్నైనా సరే, దానితో పని చేస్తేనే కదా అది సరిగ్గా పనిచేసేదీ లేనిదీ తెలిసేది! అందువల్ల మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి ఎప్పుడూ తగిన పని చెబుతూనే ఉండాలి. అదేవిధంగా మెదడు చురుగ్గా పని చేయాలంటే కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: మెదడు సరిగ్గా పని చేయాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ ను ప్రోత్సహిస్తాయి. తృణ ధాన్యాలు కూడా మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.యాంటీ ఆక్సిడెంట్లు: ఇవి కూడా మెదడు కణాలను ఒత్తిడి, వాపు నుంచి రక్షించడంలో సహకరిస్తాయి. విటమిన్ బి12 లోపిస్తే నరాల బలహీనతకు దారితీయవచ్చు. కాబట్టి మీ డైట్లో విటమిన్ బి12 ఉండేలా చూసుకోండి.అదే విధంగా అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గి మతి మరపు పెరుగుతుంది. కాబట్టి షుగర్ తక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. అదేవిధంగా హైడ్రేట్గా ఉండటం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.అరోమా: కొన్ని రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలు మెదడు కణాలను పరిరక్షించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి ఐక్యూని మెరుగుపరుస్తాయి. కాబట్టి మీ ఆహారంలో పసుపు, దాల్చిన చెక్క, రోజ్ మేరీ వంటివి ఉండేలా చూసుకోండి.ఇవిగాక మెదడును చురుగ్గా ఉంచేలా పదవినోదాలు, పదవిన్యాసాలు పూర్తి చేయడం, సుడోకు వంటివి ఆడటం, క్యారమ్స్, చదరంగం వంటి ఇన్డోర్ గేమ్స్ ఆడటం, రోజూ కొన్ని పదాలను గుర్తు పెట్టుకోవాలనే నియమాన్ని పెట్టుకుని దానిని సరిగ్గా అనుసరించడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.ఇవి చదవండి: Shipra Singhania: సిమెంట్ వాడకుండా.. గోరువెచ్చని ఇల్లు! -
అమ్మా.. బాగున్నావా? ఆరోగ్యం జాగ్రత్త!
ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందరి బాగోగులూ చూసే తల్లులు తమ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. అమ్మ తనని తాను పట్టించుకోదని వదిలేసి ఊరుకోలేము, ఊరుకోకూడదు కూడా. మనకోసం అహరహం తపించే మన కన్నతల్లిని కంటికి రెప్ప లా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. అందుకోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...రేపు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ నేపథ్యంలో అమ్మ గురించి, అమ్మ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. రోజంతా రాత్రి, పగలు ఇంట్లోని వారందరి బాగోగులు చూసే తల్లులు తీరా తమ దగ్గరకొచ్చేసరికి అంతగా పట్టించుకోరు. దాంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేయాలంటే ఏం చేయాలో, వారు ఆరోగ్యంగా... ఆనందంగా ఉండేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో చూద్దాం...చురుగ్గా ఉండేలా...ఎవరైనా సరే, ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడం చాలా ముఖ్యం. అమ్మ ఉత్సాహంగా ఉల్లాసంగా లేకపోయినా కనీసం చురుగ్గా అయినా ఉంటోందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు ఆమె వాకింగ్ చేసేలా చూడాలి. దాని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఏవిధమైన ఇన్ఫెక్షన్లూ సోకవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి, తల్లులు సులువుగా చేయగలిగే కనీస వ్యాయామాలు చేసేలా చూడాలి. అలా చేయాలంటే మనం కూడా మన బద్ధకాన్ని వదలగొట్టుకుని శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే వ్యాయామాలు చేయడం అవసరం. మనల్ని చూసి మన తల్లులూ, మన పిల్లలూ కూడా వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా... సరైన ఆకృతిలో ఉండేందుకు తప్పకఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోందా?అమ్మలు మనం ఇష్టంగా తినేవాటిని ఎంతో శ్రమపడి వండి వారుస్తారు కానీ, వారి విషయానికొచ్చేసరికి సరిగా తినరు. అలా కాకుండా అమ్మ ఏమేం తింటోంది, ఎలా తింటోంది... అసలు సరిగ్గా తింటోందో లేదో పట్టించుకోవాలి. అమ్మ వండింది మనం కడుపునిండా తినడమే కాదు, అమ్మ ఏమైనా తింటోందో లేదో చూస్తూ, ఆమె ఇష్టాన్ని కనిపెట్టి వారికి నచ్చే ఆహారాన్ని బయటినుంచి కొని తీసుకు రావడమో లేదా వీలయితే మీరే ఒకరోజు సరదాగా వండిపెట్టడమో చేయాలి.వారు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ ఫుడ్ని అందించండి. వారి డైట్లో పాలు, గుడ్లు, నట్స్, సోయా వంటి ్రపోటీన్ రిచ్ ఫుడ్స్ని యాడ్ చేసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తినే చూడండి. దీంతో పాటు హైడ్రేటెడ్గా ఉండేలా నీటితో పాటు, గ్రీన్ టీ, హెర్బల్ టీలను తాగించండి. వీటితో పాటు హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి ఫుడ్స్, అలానే కాల్షియం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకునేలా చూడడం తప్పనిసరి.ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారా? ఆరోగ్యమే మహా భాగ్యం అన్న సూక్తి చాలా పాతదే అయినప్పటికీ అది ఎల్లవేళలా అనుసరించవలసినదే. ఆరోగ్యాన్ని మించిన ధనం లేనేలేదు. అందువల్ల నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మనకెవరికైనా ఏమాత్రం ఆరోగ్యం బాగుండకపోయినా సరే, తల్లడిల్లిపోయే తల్లులు తమ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి పట్టించుకోరు.మీరు అలా అని వదిలేసి ఊరుకోవద్దు. అమ్మకి తప్పనిసరిగా హెల్త్ చెకప్స్ చేయించండి. థైరాయిడ్, హైబీపి, షుగర్ వంటి సమస్యలేమైనా ఉంటే అవి ఏ మేరకు అదుపులో ఉన్నాయో ఈ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి 3 నెలలకి ఓ సారి చెకప్స్, ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ చెకప్స్, దీనికి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ ఇంట్లోనే 6 నెలలకి ఓసారి చేయించడం మంచిది.ప్రేమ పూరితమైన పలకరింపు!అన్నిటినీ మించి అమ్మ దగ్గర రోజూ కాసేపు కూర్చుని అమ్మను ప్రేమగా పలకరించి, ఆమెతో కాసేపు కబుర్లు చెప్పడం వల్ల ఎంతో సంతోషపడుతుంది అమ్మ. అమ్మ ఏమైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు విసుక్కోవడం, కసురుకోవడం అసలు పనికిరాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ఇలా మదర్స్డే, ఫాదర్స్డే వంటివి జరుపుకునేది విదేశాలలోనే కానీ, మనకెందుకులే అని పట్టించుకోకుండా ఊరుకోకండి.ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అమ్మలు కూడా అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించండి. అమ్మకు తప్పనిసరిగా శుభాకాంక్షలు చెప్పి, ఆమె ఆశీర్వాదాన్ని అందుకోవడం మాత్రం మరచిపోవద్దు. విష్ యు ఏ హ్యాపీ మదర్స్ డే..
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement