Women Power
-
మహిళల సంతోషమే దేశానికి సంపద : శ్రీ శ్రీ రవిశంకర్
బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్న ఈ సదస్సులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుని, శ్రేయస్సును అందుకునే దిశగా అడుగులు పడ్డాయి. సామాజిక, లౌకిక విషయాలపై లోతైన చర్చలు, ప్రగాఢమైన మానసిక విశ్రాంతి నిచ్చే అంతరంగ ప్రయాణాలు, వాటికి తోడుగా సాంస్కృతిక ప్రదర్శనలు కలగలిసి ఆహుతుల కోసం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. బహ్రెయిన్కు చెందిన మహిళా సైనిక సైనికాధికారిణి, ఒక భారతీయ నటి, టర్కీదేశపు డిజిటల్, కృత్రిమ మేధ కళాకారుడు కలుసుకుని,మనస్సు, చైతన్యం - వీటిపై సృజనాత్మకత ప్రభావం గురించి చర్చించారు.ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, “నేను ఎదుగుతున్న దశలో కళలు నాకు ధ్యానాన్ని నేర్పాయి. అది సహజంగా జరిగిపోయింది. ఐతే నేను ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే నా శక్తిసామర్థ్యాలలో చిత్రమైన మార్పును గమనించాను. ప్రజలు మంచిగా ఉంటూ, అందరి మంచినీ కోరుకున్నప్పుడే సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.” అని అన్నారుబహ్రెయిన్ సైనిక, క్రీడా విభాగాలకు అధిపతిగా పనిచేస్తున్న కుమారి నూరా అబ్దుల్లా మాట్లాడుతూ, “సైన్యంలో ఆజ్ఞలను పాటించడమే తప్ప సృజనాత్మకతకు తావు లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను చూసిన తర్వాత, మార్పును సృష్టించేందుకు స్వేచ్ఛ అవసరమని, నిజమైన సృజనాత్మకత సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుందని నేను గ్రహించాను.” అన్నారు.ఈ సదస్సుకు చోదకశక్తిగా ఉన్న చైర్ పర్సన్ భానుమతి నరసింహన్ మాట్లాడుతూ, మహిళల జీవితంలో విశ్రాంతి, పని మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. “మహిళలుగా మనము మరింత ఎక్కువగా, మరింత త్వరగా సాధించాలనే ఆతృతలో ఉంటాము. నిజానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నపుడే మీరు అనుకున్నవి సాధించగలరు. ఇది విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండేందుకు తగిన సమయం.” అని పేర్కొన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ 180 దేశాలలో కోట్లాదిప్రజలకు అంతర్గత శాంతిని అందించడంలో ప్రపంచ శాంతి నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పోషించిన పాత్రను ఈ సదస్సుకు హాజరైన పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంలో గురుదేవ్ పాత్రను ప్రశంసిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, “భారతదేశం ఆధ్యాత్మిక దేశం, కానీ మారుతున్న కాలంతో మనం మన మూలాలకు దూరమవుతున్నాము. అందుకోసమే, మనం మరచిపోయిన విలువలను గుర్తుచేందుకు, మనకు స్ఫూర్తినిచ్చేందుకుగురుదేవ్ వంటి ఆధ్యాత్మిక నాయకులు ఇక్కడ ఉన్నారు.” అని అన్నారు.ప్రతిష్టాత్మకమైన విశాలాక్షి అవార్డు అందుకున్న సందర్భంగా కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ, "ఒక సాధుపుంగవునికి జన్మనిచ్చిన తల్లి పేరు మీద అవార్డును అందుకోవడం కంటే గొప్ప బహుమతి మరొకటి లేదు." అని భావోద్వేగానికి గురయ్యారు.జపాన్ మాజీ ప్రథమ మహిళ అకీ అబే మాట్లాడుతూ, హింసలేని ప్రపంచం కోసం గురుదేవ్ దృక్పథాన్నితన స్వీయ అనుభవంతో పోల్చి చూశారు. ఆమె భర్త, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుండగుని కాల్పులలో మరణించిన సంగతి విదితమే.“ప్రతి నేరస్థుడిలో ఒక బాధితుడు ఉంటాడని గురుదేవ్ చెప్పడం నేను విన్నాను. నా భర్త ప్రాణం తీసిన వ్యక్తిని ద్వేషించే బదులు, నేను కరుణించగలనా? అటువంటి హింస జరుగకుండా ఉండేందుకు నేను ఏమైనా సహాయం చేయగలనా? కేవలం నేరం జరిగిన తర్వాత బాధితులకు మద్దతిచ్చే సమాజం కంటే, నేరాలు తక్కువ జరిగే సమాజమే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.” అని ఆమె అన్నారు.సీతా చరితం: సాంస్కృతికదృశ్య వైభవంఈ 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు కేవలం చర్చలు, ఆత్మపరిశీలనలకు మాత్రమే పరిమితం కాకుండా, సీతా చరితం అనే చక్కని రంగస్థల సాంస్కృతిక ప్రదర్శనకు, వేదికగా కూడా మారింది. భారతీయ కావ్యమైన రామాయణాన్ని ఏ షరతులూ లేని ప్రేమ, జ్ఞానం, ఆత్మస్థైర్యం, భక్తి, కరుణరసాల కలయికగా సీతాదేవి దృక్కోణం నుండి చూపే ప్రయత్నం ఇక్కడ జరిగింది. 500మంది కళాకారులు 30 విభిన్న సంగీత నృత్య రీతులను మేళవించి, దేశంలో మొట్టమొదటిసారిగా 4-డి సాంకేతికతను ఉపయోగించి చేసిన సంగీత నృత్య రూపకం ప్రపంచం నలుమూలలనుండి హాజరైన ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.కాలానికి అతీతంగా, మానవాళికి ఆదర్శంగా నిలచిన రామకథను ఈ ప్రదర్శన 190 దేశాలకు తీసుకువెళుతుంది. ఇంగ్లీషులో రూపొందించిన స్క్రిప్ట్ కోసం 20కి పైగా వివిధ భాషలు, సంస్కృతులలోని రామాయణాలను పరిశీలించారనీ, ఇది నిజమైన ప్రపంచ సాంస్కృతిక అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. సీతా చరితం నిర్మాణం వెనుక ఉన్న ప్రేరణ గురించి సృజనాత్మక దర్శకురాలు శ్రీవిద్యా వర్చస్వి మాట్లాడుతూ, “సీతమ్మవారి కథ పరివర్తకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అంతే కాక, ఈ నాటకం, స్క్రిప్ట్, డైలాగ్లు అన్నీ గురుదేవుల జ్ఞానంతో నిండి ఉన్నాయి.” అని అన్నారు. -
గుండె గొంతుక లోన క్రియేటివిటీ
గు... డ్మా... ర్నిం... గ్ అంటూ... కనపడకుండా వినిపించే వారి గొంతులోని హుషారు మన మదిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కాలం కూడా పరుగులు పెడుతుందా అనిపిస్తుంది. వారు నోరారా పలకరిస్తుంటే క్షణాలలో ఆత్మీయ నేస్తాలైపోతారు. గలగలా మాట్లాడేస్తూ మనలో ఒకరిగా చేరిపోతారు. ‘ప్రతిరోజూ మా వాయిస్ని కొత్తగా వినిపించాల్సిందే, అందుకు కొత్త కొత్త కాన్సెప్ట్తో మమ్మల్ని మేం సిద్ధం చేసుకోవాల్సిందే...’ అని చెబుతున్నారు రేడియో ఎఫ్.ఎమ్.లతో తమ గళంతో రాణిస్తున్న మహిళా రేడియో జాకీలు... వారితో మాటా మంతీ...– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిక్రియేటివిటీ అనుకున్నంత సులువు కాదునచ్చిన సినిమా పాటలు (Movie Songs) ఇంట్లో పాడుకుంటూ ఉండే నా గొంతు విని మాకు తెలిసినవారు రేడియోలో ట్రై చేయచ్చు కదా! అన్నారు. అంతే, ఆడిషన్స్కు వెళ్లి ఆఫర్ తెచ్చుకున్నాను. అయితే, అది అనుకున్నంత సులువు కాదు. ఇది చాలా క్రియేటివ్ ఫీల్డ్. చాలామందితో డీల్ చేయాల్సి ఉంటుంది. చాలా స్మార్ట్గా ఉండాలి. ఏ రంగంలోనైనా మంచి, చెడు అనుభవాలు ఉంటాయి. కానీ, వాటిని మోసుకుంటూ వెళితే నిరూపించుకోలేం. ఒక వైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు రేడియో జాకీగా మార్నింగ్ షో (Morning Show) చేస్తుంటాను. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగుతూనే నటిగానూ పన్నెండు తెలుగు సినిమాల్లోనూ నటించాను. ఎక్కడ నా క్రియేటివిటీని చూపించగలనో అక్కడ నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ, నన్ను నేను మలుచుకుంటూ నా శ్రోతలను అలరిస్తున్నాను. నా ఫ్రెండ్స్ ద్వారా థియేటర్ ఆర్టిస్ట్గానూ వేదికల మీద ప్రదర్శనలలో పాల్గొంటున్నాను. ఏ వర్క్ చేసినా నా సోల్ రేడియోలో ఉంటుంది. అందుకని, ఎన్ని పనులు ఉన్నా రేడియో లైఫ్ను వదలకుండా నా క్రియేటివిటీకి పదును పెడుతుంటాను. – ఆర్జె ప్రవళిక చుక్కల, ఆకాశవాణినవరసాలు గొంతులో పలికించాలిరేడియో (Radio) అనగానే క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు అనుకుంటారు. కానీ, ఇందులో సృజనాత్మకత, ఉచ్చారణ, భావ ప్రకటనతో పాటు నవరసాలు పలికించాలి. కొన్ని సందర్భాలలో ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, ఎక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా ఆ ప్రభావం వర్క్పై పడకూడదు. నా గొంతు వేల మంది వింటున్నారు అనే ఆలోచనతో అలెర్ట్గా ఉండాలి. హైదరాబాద్ బి కేంద్రంలో యువవాణి ప్రోగ్రామ్ నుంచి నేటి వరకు పద్దెనిమిదేళ్లుగా ఆకాశవాణిలో పని చేస్తున్నాను. ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమాతారలు, సాహిత్యకారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, వైద్యులు... ఇలా ఇంచుమించు అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కరించాను. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందిరినీ నా వాయిస్తో అలంరించాను అని గర్వంగా ఉంది. ఆర్మీడే, ప్రధానమంత్రి యోజన పథకాలు, బ్యాంకు, వైద్యం, సమాజంలో బర్నింగ్ ఇష్యూస్... లాంటి వాటిని లైవ్ కవరేజ్లుగా ఇచ్చాను. బెస్ట్ ఆర్.జె. అవార్డులూ అందుకున్నాను. రేడియో అంటే గలగల మాట్లాడటమే కాదు సాంకేతిక సామర్థ్యంతో పాటు అన్ని స్థాయుల వారిని కలుపుకుంటూ పనిచేయాలి. – ఆర్జె దీప నిదాన కవి, ఆల్ ఇండియా రేడియోనన్ను నేను మార్చుకున్నానుఈ రంగంలోకి రాకముందు ఎప్పుడూ రేడియో వినలేదు. ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయం తెలిసి, ట్రై చేద్దామని వెళ్లాను. పదకొండేళ్లుగా రేడియోకి అంకితమైపోయాను. గుడ్ ఈవెనింగ్ ట్విన్సిటీస్ అని రెయిన్బోలో వర్క్ చేశాను. ఇప్పుడు వివిధ భారతిలో సాయంకాలం 5 గంటల నుంచి షో చేస్తున్నాను. సినిమా, వైరల్ న్యూస్, ట్రాఫిక్ అప్డేట్స్, యూత్ ట్రెండ్స్, గాసిపింగ్, కరెంట్ టాపిక్స్ .. ఇలా అన్నింటి గురించి చెబుతుంటాను. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎదుటివారిని మెప్పించేలా నన్ను నేను ఎలా మార్చుకోవాలనే విషయాలు రేడియోకి వచ్చాకే తెలుసుకున్నాను. ఏ చిన్న విషయమైనా తక్కువ సమయంలో క్రియేటివ్గా, ఆసక్తికరంగా అనిపించేలా చెప్పగలగడం రేడియో ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. – ఆర్జె కృష్ణ కీర్తి, వివిధభారతిఉన్నతంగా తీర్చిదిద్దిందిప్రసారభారతిలో పద్దెనిమిదేళ్లుగా పని చేస్తున్నాను. రేడియో జాకీలు అనగానే నోటికివచ్చిందేదో వాగేస్తుంటారు అనుకుంటారు. కానీ, మేం ప్రతిరోజూ కొత్తదనంతో శ్రోతలకు పరిచయం అవుతాం. కంటెంట్ను సొంతంగా తయారు చేసుకోవడం, సృజనాత్మకతను జోడించడం, గొంతుతోనే కళ్లకు కట్టినట్టుగా వివరించడాన్ని ఓ యజ్ఞంలా చేస్తుంటాం. స్టూడియోలో కూర్చొనే కాకుండా అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు... ఇలా 52 వివిధ రకాల స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేశాను. సినిమా కథ పేరుతో తెరవెనుక జరిగే ప్రతి కష్టాన్నీ వినిపించాను. రేడియో నన్ను ఉన్నతంగా మార్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ని చేసింది. యాంకర్గా వేదికలపైనా, వివిధ కార్యక్రమాలను చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇన్ని అవకాశాలు ఇచ్చిన రేడియో నాకు దేవాలయంలాంటిది. – ఆర్జె స్వాతి బొలిశెట్టి, ఆల్ ఇండియా రేడియోప్రతిరోజూ హుషారే! నాకు నచ్చిన పనిని డబ్బులు ఇచ్చి మరీ చేయమంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ ఆనందంతోనే పదేళ్లుగా రేడియో మిర్చిలో ఆర్.జె.గా చేస్తున్నాను. రోజూ చూసేవీ, వినేవీ.. నా ఫ్రెండ్స్కి ఎలాగైతే చెబుతానో... శ్రోతలతో కూడా అలాగే మాట్లాడుతుంటాను. కొన్నాళ్ల వరకు నా మాటలను మాత్రమే విన్నవారికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తున్నాను కూడా. ఆర్జె అంటే మాట్లాడటం ఒకటేనా.. నవ్వించడానికి ఏం చేయచ్చు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. క్రియేటివిటీ ఉన్నవారే ఈ రంగంలో ఉండగలరు. ఎంత హ్యాపీగా మాట్లాడినా పర్సనల్ ఎమోషన్స్ అడ్డు పడుతుంటాయి.అలాంటప్పుడు ఆ విషయాన్ని కూడా శ్రోతలతో పంచుకుంటాను. ‘ఈ రోజు అస్సలు బాగోలేదు, ఇంట్లో డిష్యూ డిష్యూం.. కానీ ఏం చేస్తాం, ముందుగా ఓ రెండుపాటలు వినేసి లైట్ తీసుకుందాం...’ ఇలా రోజువారి అంశాలకు హ్యాపీనెస్ను జతచేసి శ్రోతలకు ఇవ్వడానికి తపిస్తూనే ఉంటాను. నవరాత్రుల టైమ్లో తొమ్మిది మంది విభిన్నరంగాలలో విజయాలు సాధించిన మహిళలతో షో చేశాను. శ్రోతల్లో కొందరిని స్టూడియోకి పిలిచి, ట్రైనింగ్ ఇచ్చి మరీ వారి చేత మాట్లాడించాం. ఆర్జె స్వాతి...తో... అని షోలో మొదలుపెట్టే మాటలు, మిర్చి శకుంతల డ్రామా.. చాలా పేరు తెచ్చాయి. కళ్లతో చూసినదాన్ని గొంతులో పలికిస్తా. అదే అందరినీ కనెక్ట్ చేస్తుంది. – ఆర్జె స్వాతి, రేడియో మిర్చిరేడియోతో ప్రేమలో పడిపోయా! ‘సిరివెన్నెల’ నైట్ షోతో నా రేడియో జర్నీప్రారంభించాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ షోస్ అన్నీ చేస్తూ వచ్చాను. పదిహేనేళ్లుగా నేర్చుకుంటూ, పని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాను. ముఖ్యమైన రోజుల్లో ప్రముఖులతో మాట్లాడుతూ షో చేస్తుంటాం. మారుతున్న ప్రేమల గురించి చర్చిస్తుంటాను. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుంటాను. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే అది రేడియో. ఒక వ్యక్తి గొంతు మాత్రమే విని, అభిమానించడం అనేది మామూలు విషయం కాదు. ఒకమ్మాయి కొన్నేళ్లుగా నా షోస్ వింటూ ఉంది. కుటుంబపరిస్థితుల కారణంగా చనిపోవాలనుకున్న ఆ అమ్మాయి, నాతో చివరిసారిగా మాట్లాడుదామని ఫోన్ చేసింది. షో మధ్యలో ఆపేసి, ఆమెతో మాట్లాడి, ఇచ్చిన భరోసాతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యురాలిగా మారిపోయాను. రేడియో సిటీలో నా జీవితాన్ని మలుపుతిప్పిన ఇలాంటి సంఘటనలు ఎన్నో. – ఆర్జె సునీత, రేడియో సిటీచదవండి: ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?క్రమశిక్షణ నేర్పించిందిచిన్నప్పుడు రేడియో వింటూ మా అమ్మను ‘ఆ రేడియోలోకి ఎలా వెళ్లాలమ్మా!’ అని అడిగేదాన్ని. కానీ, నిజంగానే రేడియో స్టేషన్కి వెళ్లడం, అక్కడ నుంచి నా వాయిస్ను శ్రోతలకు వినిపించేలా మార్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు మాత్రం నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాలి. రేడియో స్టేషన్లో అడుగుపెడుతూనే బయట ప్రపంచాన్ని మరచిపోతాను. అంతగా నన్ను ఆకట్టుకుంది రేడియో. ఎఐఆర్ పరి«ధులను దాటకుండా మేం పనిచేయాల్సి ఉంటుంది. కరోనా టైమ్లో అయితే ఎక్కువ షోస్ చేసేవాళ్లం. ప్రజలను చైతన్యవంతం చేయడానికి, భరోసా ఇవ్వడానికి భయాలను పక్కనపెట్టేశాం. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం, మల్టీటాలెంట్ ఉన్నవారితో పరిచయాలు ఏర్పడటం.. ఇలాంటివెన్నో రేడియో ద్వారానే సాధ్యమయ్యాయి. కాన్సెప్ట్ రాసుకోవడం, తడబాటు లేకుండా మాట్లాడటం, టైమ్ ప్రకారం షోలో పాల్గొనడం.. ఒక క్రమశిక్షణను నేర్పించింది రేడియో. – ఆర్జె లక్ష్మీ పెండ్యాల, ఆల్ ఇండియా రేడియో -
ఏసీపీ అనితా: పట్టుదలలోనే కాదు ఫ్యాషన్లోనూ తగ్గేదెలే!( ఫోటోలు)
-
ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు
జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కఠోర శ్రమ కచ్చితంగా ఉండాలి. జీవితంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్లో కిక్ ఉంటుందని నమ్మేవారు చాలామందే ఉంటారు. అలాగే ఎవరి దగ్గరో పనిచేయడం కాకుండా తమంతట తాముగా ఏదైనా చేయాలనే తపనతో ఉన్నత శిఖరాలకు చేరింది. బెంగళూరుకు చెందిన దివ్య. నెలకు వెయ్యి రూపాయల ప్యాకెట్మనీ కోసం కష్టపడిన ఈమె ఇపుడు నెలకు నాలుగున్నర కోట్లు ఆర్జిస్తోంది. ఎలా? తెలుసుకోవాలని ఉందా?దివ్య రావు సాధారణ మధ్య తరగతి కుటుండంలో పుట్టి పెరిగింది. కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బావుంటుందన్న తల్లిదండ్రుల మాటలను అక్షరాలా నమ్మింది. అచంచలమైన దృఢ సంకల్పంతో 21 సంవత్సరాల వయస్సులోనే సీఏ చదివింది. తరువాత IIM అహ్మదాబాద్లో ఫైనాన్స్లో MBA చేసింది. ఈ సమయంలో ఆర్థికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక ఎగ్ పఫ్ తినడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వచ్చేది. కష్టపడి చదివి కుటుంబంలోనే సీఏ చదవిన యువతిగా పేరు తెచ్చుకుంది. అయితే నల్లేరుమీద నడకలా ఏమీ సాగలేదు. ఆర్థికంగా పలు సవాళ్లు ఎదుర్కొంది. అయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.వ్యాపారవేత్తగా ఎలా మారింది?ఐఐఎంలో చదువుకునే సమయంలోనే కొన్ని ప్రముఖ ఆహార సంస్థలు, వాటి సక్సెస్పై అధ్యయనం చేసింది దివ్యా. ఆ సమయంలోనే ఫుడ్ బిజినెస్ ఆలోచనకు బీజం పడింది. ముఖ్యంగా దక్షిణాది రుచుల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆసక్తి పెరిగింది. ఫుడ్ బిజినెస్ అంటే దివ్య తల్లి అస్సలు ఇష్టపడలేదు. 10-20 రూపాయలకు రోడ్లపై ఇడ్లీ, దోసెలు అమ్మాలనుకుంటున్నావా?" అని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీఏగా ఉద్యోగం మొదలు పెట్టింది. కానీ మనసంతా వ్యాపారం పైనే ఉండేది. (ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!)ఆహార పరిశ్రమలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న రాఘవేంద్రరావును కలిసే వరకు ఆమె ఆలోచనలకు ఒక రూపం రాలేదు. సీఏగా అతడికి పరిచయమైంది. అలా రాఘవ్కు ఫుడ్ బిజినెస్లో, ఆర్థికాంశాల్లో దివ్య అతనికి సలహాలిచ్చేది. దీంతో బిజినెస్ పార్ట్నర్స్గా మారారు. ఆ తరువాత అభిరుచులుకలవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. భర్త రాఘవేంద్రతో కలిసి 2021లో ‘రామేశ్వరం కెఫే’ ప్రారంభించింది. ఆహారం నాణ్యత పరంగా, టేస్ట్ పరంగా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేసింది.తొలుత బెంగళూరులో రెండు బ్రాంచీలతో మొదలై ఇపుడు కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే స్థాయికి చేరింది. రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, విదేశాలలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ దంపతులు. దుబాయ్, హైదరాబాద్ , చెన్నైలలో బ్రాంచెస్ తెరవనుంది. దాదాపు 700 మందికి ఉపాధి కల్పిస్తోంది. నివేదికల ప్రకారం ప్రతి స్టోర్ నుండి నెలకు రూ. 4.5 కోట్లు అమ్మకాలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Rupa (@ruparavi21578)రామేశ్వరం కెఫేకర్ణాటకలోని బెంగళూరు నగరంలో రామేశ్వరం కెఫే చాలా పాపులర్. అక్కడికి వెళ్లినవారు ఈ కేఫేకు వెళ్లకుండా రారు. అంత ఫేమస్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ కేఫును ఈ స్థాయికి తీసుకు రావడంలో భర్తతో కలిసి దివ్య అహర్నిశలు కష్టపడింది. ఇంత చదువూ చదివి, ఇడ్లీలు, దోసెలు అమ్ముతావా? అని గేలిచేసినా వెనుకడుగు వేయలేదు. తనకిష్టమైన ఫుడ్ బిజినెస్లోకి అడుగుపెట్టి తానేమిటో నిరూపించుకుంది.కెఫే వేదికగా ఇడ్లీ, దోసె, వడ, పొంగల్, బాత్, రోటీ, పరోటాతోపాటు, రైస్ వెరైటీలనూ ఆహార ప్రియులు ఆరగిస్తారు. అలాగే టీ, కాఫీలను స్పెషల్గా అందిస్తూ మరింతమందిని ఆకట్టుకుంటోంది. ప్రతీ వంటలోనూ ఆరోగ్య, నాణ్యతా ప్రమాణాల్ని తప్పకుండా పాటిస్తున్నామని ,సహజ పద్ధతుల్లో తయారుచేసిన నెయ్యి, ఇతర పదార్థాలను వాడతామని చెబుతుంది. తమ వంట తిన్న వారు తృప్తిగా.. ఆహా, ఏమిరుచి అన్నపుడు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటుంది సంతోషంగా దివ్య. తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించాలని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. -
మార్నింగ్ టీ కప్తోపాటు ఆకాంక్ష స్నాక్స్ ! ఇది కదా సక్సెస్!
కాలక్షేపం కోసం, అందరూ కలిసి ఒకచోట టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడానికి లక్నోలోని ఐఏఎస్ అధికారుల భార్యలు ఒకచోట చేరేవారు. ఆ తరువాత ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ (ఐఏఎస్ ఓడబ్ల్యూ) ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఈ సంస్థ సామాజిక సేవ వైపు తన పరిధిని విస్తరించింది. స్వయం–సహాయక సంఘం ‘ఆకాంక్ష’తో ఎంతోమంది సామాన్య మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.తాజా విషయానికి వస్తే... ‘ఆకాంక్ష’లోని మహిళా సభ్యులు కుంభమేళాలో 20 స్టాల్స్ ఏర్పాటు చేశారు.. ‘ఆకాంక్ష’ అనేది ‘ఐఏఎస్వోడబ్ల్యూ’కు స్వయం సహాయక సంఘం. కుంభమేళాలో భక్తుల సందడే కాదు లక్నోలోని ‘ఆకాంక్ష’లో భాగమైన ‘మసాల మాత్రి కేంద్ర’ మహిళల సందడి, సంతోషాలు కూడా కనిపిస్తాయి. నిన్న మొన్నటి వరకు వారు సాధారణ గృహిణులు. ఎప్పుడో తప్ప కొత్త ఊరికి వెళ్లని వారు. ‘ఆకాంక్ష’ పుణ్యమా అని వ్యాపారవేత్తలుగా మారారు. దేశంలోని ఎన్నో ప్రాంతాలకు వెళుతున్నారు.ఉత్తరప్రదేశ్లోని ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ (ఐఏఎస్ వోడబ్ల్యూ)కు కేవలం ఐఏఎస్ అధికారుల భార్యలు మాత్రమే నేతృత్వం వహించడం లేదు. గత సంవత్సరం జూలైలో ఐఏఎస్ ఆఫీసర్ రష్మీసింగ్ అధ్యక్షురాలు అయింది. ‘ఐఏఎస్ వోడబ్ల్యూ’కు ప్రెసిడెంట్ అయిన తొలి ఐఏఎస్ ఆఫీసర్గా నిలిచింది. జమ్మూకశ్మీర్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అయిన రష్మీ యూపీ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్సింగ్ భార్య.మసాల, మాత్రి (ఉప్పగా ఉండే స్నాక్స్) తయారీకి ప్రసిద్ధి చెందిన ‘మసాల మాత్రి కేంద్ర’లో గతంతో పోల్చితే ఇప్పుడు ప్రొఫెషనలిజం పెరిగింది. లడ్డూలు, చిక్కీలు, బ్యాగుల తయారీ, హస్తకళలలో విస్తరించింది. లక్నోకు చెందిన ఈ సంస్థ కార్యకలాపాలను నోయిడాకు విస్తరించ నున్నారు. కొన్ని నెలల క్రితం తమ ఉత్పత్తులతో భారీఎత్తున ఎగ్జిబిషన్ నిర్వహించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.‘ఈ ఎగ్జిబిషన్ ఆకాంక్ష సభ్యులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రిని తొలిసారి చూసినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఎగ్జిబిషన్ అనేది వారికి కేవలం డబ్బు సం΄ాదన మాత్రమే కాదు. కొత్త ప్రాంతానికి రావడం, కొత్త వ్యక్తులతో మాట్లాడడం... ఇలా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకున్నారు’ అంటుంది రష్మీసింగ్.‘మొదటిరోజు స్వయం సహాయక బృందానికి చెందిన మహిళ ఒకరు రెండు వేలే సంపాదించానని అసంతృప్తిగా మాట్లాడింది. అయితే ఈవెంట్ ముగిసే సమయానికి రూ.30,000 సంపాదించింది. ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంది’ అంటుంది ఐఏఎస్వోడబ్ల్యూ – ఉత్తర్ప్రదేశ్ కార్యదర్శి ప్రతిభ.యాభై నాలుగు సంవత్సరాల హలీమా గత దశాబ్దకాలంగా ‘ఆకాంక్ష’తో కలిసి పనిచేస్తోంది. ఈ కార్యక్రమం వల్ల ఆమెకు కశ్మీర్ నుంచి వచ్చిన మహిళలతో మాట్లాడే అవకాశం వచ్చింది. వ్యాపారం నుంచి తమ ప్రాంత ప్రత్యేకతల వరకు ఎన్నో విషయాలపై మాట్లాడుకున్నారు. వీరు మరోసారి కుంభమేళాలో కలవనున్నారు. ‘ఆకాంక్ష అనేది మా అందరి ప్రాజెక్ట్. మొదట్లో స్వయం సహాయక బృందం సభ్యుల మైండ్సెట్లో మార్పు తీసుకురావడానికి కృషి చేశాం. వారిన పాత పద్ధతుల నుంచి కొత్తదారిలోకి తీసుకువచ్చాం’ అంటుంది రష్మీసింగ్.‘మా సంస్థ ఒకప్పుడు ఐఏఎస్ అధికారుల భార్యలు టీ తాగడానికి, ముచ్చటించడానికి, యోగా కార్యక్రమాలను నిర్వహించ డానికి వేదికగా ఉండేది. ఇప్పుడు దాని పరిధి ఎంతో విస్తరించింది. సామాజిక సేవదారిలో ప్రయాణిస్తుంది’ అంటుంది శైలజ చంద్ర.‘ నాకు మార్నింగ్ టీ కప్తోపాటు ఆకాంక్ష స్నాక్స్ తప్పకుండా ఉండాల్సిందే’ అంటున్నాడు ఒక కస్టమర్. ‘ఆకాంక్ష’ సాధించిన అద్భుత విజయానికి ఈ ఒక్క మాట చాలు కదా! -
అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో అగాధాన్ని సృష్టించింది. మరెందరో జీవితాల్ని అతలాకుతలం చేసింది. అంతేకాదు కోవిడ్-19 సృష్టించిన విలయం కారణంగా ఆత్మీయులను కోల్పోయినవారిలో, ఉద్యోగాలను పోగొట్టుకున్నవారిలో జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఆవిష్కరించింది అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వారిలో ఒకరు కావ్య ధోబ్లే. కోవిడ్ రోగుల మధ్య నెలల తరబడి పనిచేస్తూ, రోజుకు అనేక మరణాలను చూడటం, స్వయంగా కరోనా బాడిన నేపథ్యంలో జీవితంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఆమె విజయానికి, సంతోషకరమైన జీవితానికి పునాది వేసింది. ఏంటి ఆ నిర్ణయం? కావ్య సాధించిన విజయం ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.కావ్య ధోబ్లే-దత్ఖిలే ముంబైలో ఒక నర్సు. కావ్య ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచనలో పెరిగింది. బహుశా ఆ కోరికే ఆమెన నర్సింగ్పైపు మళ్లించిందేమో.జనరల్ నర్సింగ్,మిడ్వైఫరీలో డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ముంబైలోని లోకమాన్య తిలక్ మున్సిపల్ మెడికల్ కాలేజ్ మరియు జనరల్ హాస్పిటల్ (సియోన్ హాస్పిటల్)లో పనిచేయడం ప్రారంభించింది. తరువాత ను టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండు సంవత్సరాలు పనిచేసింది. దీనితో పాటు, కావ్య 2017లో నర్సింగ్లో బి.ఎస్సీ పూర్తి చేసింది. ఒక ప్రైవేట్ కళాశాలలో ఒక సంవత్సరం బోధించిన తర్వాత,ముంబైలోని సియోన్ ఆసుపత్రికి స్టాఫ్ నర్సుగా చేరింది. 2019 నుండి 2022 వరకు సియోన్ హాస్పిటల్లో ఆయన పనిచేసిన కాలంలోనే కరోనా మహమ్మారి విజృంభించింది.ఉద్యోగం మానేసి, సంచలన నిర్ణయం కావ్య కూడా కరోనా బారిన పడి దాదాపు మరణం అంచుల దాకా వెళ్లి వచ్చింది. ఎన్నో మరణాలను చూసింది. కానీ తన రోగనిరోధక శక్తి తనను కాపాడిందనే విషయాన్ని అర్థం చేసుకుంది. అలాగే వ్యవసాయం అంటే మక్కువ ఉన్న ఆమె మనం పండించే, రసాయనాలతో నిండిన ఆహారం వ్యాధులకు హేతువని తెలుసుకుంది. అందుకే సమస్య మూలాన్ని తొలగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. అంతే నెలకు రూ. 75వేల జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసింది. ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించినా, ఆమె భర్త రాజేష్ దత్ఖిలే క్యావకు మద్దతు ఇచ్చాడు. 2022లో, ఆమె తన ఉద్యోగాన్ని వదిలి భర్త గ్రామానికి వెళ్లింది.నర్సింగ్ నుండి జీరో ఇన్వెస్ట్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వరకుఆహారానికి ఆధారం వ్యవసాయం. అందుకే ఎలాంటి రసాయనాలు వాడని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది కావ్య. పట్టుదలగా కృషి చేసింది. వర్మీ కంపోస్ట్ బిజినెస్తో లక్షలు సంపాదిస్తోంది. రాజేష్ కుటుంబానికి పూణేలోని జున్నార్లోని దత్ఖిలేవాడి గ్రామంలో ఒక ఎకరం భూమి ఉంది. ఇందులో 5 గుంతల (0.02 ఎకరాలు) వర్మీకంపోస్ట్ తయారీ యూనిట్ను ప్రారంభించింది. వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని వదిలి, వర్మీకంపోస్ట్ వంటి సేంద్రీయ ఇన్పుట్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కావ్య స్థానిక రైతులతో మాట్లాడింది. ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై ఒక యూట్యూబ్ ఛానెల్ను కూడా ప్రారంభించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తొలి సంవత్సరంలో టర్నోవర్ రూ. 24 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 50 లక్షల టర్నోవర్ టార్గెట్ పెట్టుకుంది. కావ్య ప్రతి నెలా దాదాపు 20 టన్నుల రిచ్ వర్మీకంపోస్ట్ను తయారు చేస్తుంది. 50 శాతం లాభం మార్జిన్తో 50 కిలోల బ్యాగు ధర రూ. 500 లకు విక్రయిస్తుంది. ప్రస్తుతం 30 లక్షల వార్షిక టర్నోవర్తో విజయ వంతంగా దూసుకుపోతోంది. వోల్జా డేటా ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వర్మీకంపోస్ట్ ఎగుమతిదారు. ఆ తర్వాత టర్కీ, ఇండోనేషియా,వియత్నాం ఉన్నాయి. ఈ రంగంలో అవార్డును కూడా అందుకుంది. ప్రారంభంలో తప్పని సవాళ్లుసేంద్రీయ వ్యవసాయం, వర్మీ కంపోస్ట్ గురించి కావ్య రైతులతో మాట్టాడినప్పుడల్లా, ఆమెకు లభించే సమాధానం, 'మీరు దీన్ని చేసి మాకు చూపించండి' అని. దీంతో ఆగస్టు 2022లో, అతను ఒక రైతు నుంచి ఒక కిలో వానపాములతో జీరో పెట్టుబడితో వర్మీ కంపోస్ట్ తయారీనీ మొదలు పెట్టింది. ప్రారంభించాడు. అక్టోబర్ 2022 నాటికి, వర్మీకంపోస్ట్ సిద్ధమైంది. మార్చిలో, కావ్య కృషి కావ్య బ్రాండ్ కింద వర్మీకంపోస్ట్ వాణిజ్య అమ్మకాలను ప్రారంభించింది. దాని ఫలితాలను రైతులు స్వయంగా అనుభవించారు. వారి విజయాలను తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసేది. ఒక రైతు ఐదు టన్నుల వర్మీకంపోస్టును రూ. 50,000 (కిలోకు రూ. 10) కు కొనుగోలు చేశాడు. రెండు వేల మంది రైతులకు ఇవ్వడానికి ఒక ఫౌండేషన్ 2,000 కిలోల వానపాములను కొనుగోలు చేసింది. కావ్య కిలో రూ.400కి అమ్మింది. ప్రతి రెండు నెలలకు 200 కిలోల వానపాములు, 35వేల కిలోల వర్మీ కంపోస్టును విక్రయిస్తుంది. అంతేకాదు ఆమె శిక్షణ తర్వాత మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నారు.తన చుట్టూ ఉన్నరైతుల్లో ఈ మార్పు తీసుకురాగలిగినందుకు చాలా సంతోషం అంటుంది కావ్య. వర్మీ కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు?వర్మీకంపోస్ట్కు అవసరమైన ప్రధానమైనవి ఆవు లేదా గొర్రెలు , మేక పెంట, చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, బయోగ్యాస్ ప్లాంట్ స్లర్రీ లాంటి సేంద్రియ వ్యర్థాల మిశ్రమానికి వానపాములు కలుపుతారు, అవి ఎరువుగా రూపాంతరం చెందుతాయి.కేవలం రూ.500 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కంపోస్ట్ను ఎత్తైన పడకల మీద, డబ్బాలు, చెక్క డబ్బాలు, సిమెంటు ట్యాంకులు లేదా గుంటలు, వెదురు, ప్లాస్టిక్ కంటైనర్లు లేదా మట్టి కుండలలో కూడా తయారు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 జాతుల వానపాములు ఉన్నాయి. అయితే స్థానిక జాతులను ఉపయోగించడం అనువైనది ఎందుకంటే అవి తక్షణమే అందుబాటులో ఉంటాయి, పైగా స్థానిక వాతావరణానికి బాగా సరిపోతాయి. భారతదేశంలో, సాధారణంగా ఉపయోగించే వానపాము జాతులు పెరియోనిక్స్ ఎక్స్కవాటస్, ఐసెనియా ఫోటిడా , లాంపిటో మౌరిటీ లాంటివి ఉన్నాయి. View this post on Instagram A post shared by Kavya Dhoble - Datkhile (@kavya.dhoble) -
గృహిణి అంత చులకనా? అందుకే ఇలా చేశా!
‘కలలు కనడం మానవద్దు. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడాలని మరువద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆశలకలను త్యాగం చేయవద్దు’ అంటోంది అరుణా విజయ్. తోటి గృహిణులకు ఆమె ఇస్తున్న సందేశం ఇది. గృహిణి అంటే ఏ పనీ రానివాళ్లనే అపోహతో కూడిన వెక్కిరింతకు చెంప చెళ్లుమనిపించింది అరుణ. ఏ సోషల్మీడియా అయితే ఆమెను తక్కువ చేసి మాట్లాడిందో అదే సోషల్ మీడియాలో ఇప్పుడామె ఒక ఇన్ఫ్లూయెన్సర్. మాస్టర్ షెఫ్ టాప్ 4 గా నిలిచి ప్రశంసలందుకుంటోంది. ఆమె వంటలకు వ్యూస్, లైక్స్తో విజేతగా నిలిచింది. అపోహ తొలగింది! చెన్నైలో పుట్టి పెరిగిన అరుణ 22 ఏళ్లకు పెళ్లి చేసుకుని ఇంటికి పరిమితమైంది. పదిహేనేళ్ల వయసు నుంచే వంటగదిలో ప్రయోగాలు చేసిన అరుణ భార్యగా, తల్లిగా ఇంటి బాధ్యతల నిర్వహణలో విజయవంతమైన మహిళ అనే చెప్పాలి. ఆమెది ఉద్యోగం చేసి డబ్బు సం పాదించాల్సిన అవసరం లేని జీవితమే. కానీ గృహిణి అనగానే తేలిగ్గా పరిగణించే సమాజం ఆమెకు చేసిన గాయాలెన్నో. తాను ఏదో ఒకటి సాధించాలనే కోరిక రగులుతూనే ఉండేదామెలో. ఆ కోరికే ఆమెను మాస్టర్ షెఫ్ ఇండియా 2023పోటీలకు తీసుకెళ్లింది. పోటీదారుల మీద రకరకాల కామెంట్లు రువ్విన సోషల్ మీడియా అరుణను ‘ఈవిడా... ఈవిడ గృహిణి’ అంటూ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదనే భావంతో తేలిక చేసింది. మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్లలో అరుణకు ఎదురైన చేదు అనుభవం ఇది. దక్షిణ భారత వంటలు ఇడ్లీ, దోశెలతో ఆమె ప్రయోగాలు న్యాయనిర్ణేతల నోట్లో నీళ్లూరించాయి. పోటీదారుల్లో నాలుగవ స్థానంలో నిలిచింది. పోటీ పాల్గొన్న నాటికి టాప్ ఫోర్లో నిలిచిన నాటికి మధ్య ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ‘‘సోషల్ మీడియా కామెంట్లకు మనసు గాయపడి కన్నీళ్లతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని’ చెప్పింది. మన సమాజంలో ‘గృహిణి అంటే ఏమీ తెలియని వ్యక్తి’ అనే అభిప్రాయం బలంగా ముద్రించుకుపోయి ఉంది. ఆ అపోహను తుడిచి పెట్టగలిగాను. గృహిణుల మనోభావాలకు నేను గళమయ్యాను’’ అంటోంది అరుణా విజయ్. View this post on Instagram A post shared by Aruna Vijay (@aruna_vijay_masterchef) -
రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!
మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్, ఐఎమ్టీ ఘజియాబాద్లో ఎంబీఏ చదివి నగరంలోని ఐటీ కంపెనీల్లో ఏడాదికి రూ.25 లక్షలకు పైగా జీతమిచ్చే ఉద్యోగాలు చేశారు. ఆ ఉద్యోగాలను వదిలేసి..‘ఆర్గానిక్ ఉత్పత్తులు ఆరోగ్యాన్నిస్తాయి.. కల్తీ ఆహార ఉత్పత్తులతో రోగాల పాలు కావొద్దు’ అని ఇంటింటికీ వెళ్లి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛమైన ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఆ విశేషాలు నగరవాసి యోగితా జాహ్నవి మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో గర్భిణిగా ఉన్నప్పుడు పోషకాహారం తినాలని ప్రతి ఒక్కరూ చెబుతారు కానీ పోషకాలు అందించే ఆహారం దొరకాలి కదా.. ఇప్పుడు ఎటు చూసినా కల్తీ.. ఈ పరిస్థితుల్లో కడుపులోని బిడ్డకు స్వచ్ఛమైన ఆహారం అందించడం ఎలా?’ అంటూ చాలా ఆందోళన చెందాను’ అంటూ తాను గర్భిణిగా ఉన్ననాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ వీ రిచ్ నిర్వాహకురాలు యోగితా జాహ్నవి. అంతా కల్తీ.. తినేదెలా? అదీ ఇదీ లేదని సందేహం వలదు.. ఎందెందు వెదికినా అందందే కలదు అడల్ట్రేషన్.. మనం తింటున్న ఆహారం మనకు పోషకాలు ఇస్తోందా? రోగాలు తెస్తోందా? ఈ ఆందోళన గర్భిణిగా ఉన్నప్పుడు మరింత పెరిగింది. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా స్వచ్ఛమైన పాలు, తేనె, కుంకుమ పువ్వు తీసుకోవాలనే ఆరాటంతో నా అన్వేషణ మొదలైంది. ఎంత కష్టమైనా సరే స్వచ్ఛమైన ఆహారోత్పత్తులను అందించాలనే తపన పెరిగింది. అదే ఏళ్ల తరబడి శ్రమించి అందుకున్న డిగ్రీ పట్టా, అది అందించిన లక్షల జీతమిచ్చే ఉద్యోగం.. వదిలేసి మా పల్లెటూరి వైపు నా చూపును మళ్లించింది. ఇదీ చదవండి: ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం పాడితో కూడి.. ప్రభుత్వోద్యోగం చేసి రిటైరయ్యాక డైరీ ఫార్మ్ పెడదామని నాన్న కల. ఉద్యోగం వదిలేశాక మా నాన్న కల సాకారంతో పాటు నా ఆశయాలకు ఆకారం కూడా ఇవ్వాలని మా సొంత ఊరు కందుకూరులో ఒక డైరీ ఫార్మ్ను ఏర్పాటు చేశా. ఆవులు, గేదెలకు గ్రోత్ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వకుండా వాటి మేత కూడా సహజమైన ఆహారమే అందిస్తున్నాం.. తద్వారా ఏ దశలోనూ కల్తీ కాని, రసాయనాలు కలవని స్వచ్ఛమైన పాలు ఉత్పత్తి చేస్తున్నాం. పరిశోధించి.. పరిశీలించి.. పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్లో ఒకే సీజన్లో తేనె లభిస్తుంది. ప్రభుత్వం, ఎన్జీవోలు కలిపి ప్రతి ఇంటికీ తేనె సేకరించేలా ఏర్పాట్లు చేస్తారు. విభిన్న రకాల పూల నుంచి సేకరించిన ఈ తేనెలో ఔషధ విలువలు పుష్కలం. ఇది తెలిసి అక్కడకు వెళ్లి వారితో ఒప్పందం కుదర్చుకున్నా. అదేవిధంగా బెల్లం పొడి కూడా అక్కడిదే. మెటల్ సీడ్ నుంచే పుట్టే ఈ బెల్లం ఆరోగ్యకరం. ఇక్కడ లభించే బెల్లం పొడిలా దీన్ని కలిపితే పాలు విరగవు. ఇందులో ఐరన్ కంటెంట్ బాలింతలకు ఆరోగ్యకరం. అలాగే అత్యుత్తమ రైస్ రకం గురించి అన్వేషిస్తే బ్లాక్ రైస్ గురించి తెలిసింది. వియత్నాం, రష్యాలో ఈ రైస్కి బాగా డిమాండ్ ఉంది. మన దేశంలో మణిపూర్లో బాగా పండిస్తారు. అక్కడి నుంచి బ్లాక్ రైస్ తెస్తున్నా. అలాగే కశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు ఇలా దాదాపు డజనుకుపైగా అన్వేషించినవి, అత్యుత్తమమైనవి అందిస్తున్నా. దీన్నేదో కేవలం వ్యాపారంగా చూడటం లేదు. అత్యధిక శాతం మహిళా సిబ్బందితో నడిచే మా సంస్థ.. ఇంటింటికీ ఆరోగ్యకరమైన ఉత్పత్తులు చేరవేయాలని, ముఖ్యంగా బాలింతలు, బలహీనంగా ఉండే మహిళలకు బలవర్థకమైన ఆహారం అందించాలనే ఆశయంతో నిర్వహిస్తున్నాం. -
ఆమే ఆకాశమై
కాలం ముందుకు సాగుతూనే ఉంటుంది. 24 గంటలకో రోజు పుడుతుంది. కలకాలం గుర్తుండే పని చేసిన వాళ్లతో రోజుకో కొత్త చరిత్ర పుడుతుంది. చరిత్ర సృష్టించిన స్త్రీశక్తిని సాక్షి ఫ్యామిలీ నిరంతరం పట్టిచూపుతోంది. ఈ ఏడాది సాక్షి గౌరవించిన మహిళామణుల్లో మరికొన్ని ఆణిముత్యాలు.మండే కండలుగుంటూరు జిల్లా, వేమూరుకి చెందిన ఎస్తేర్రాణికి తల్లిదండ్రులు లేరు. అండదండలు లేవు. నానమ్మ ఆకుకూరలు అమ్ముతుంది. ఇవేవీ ఆమెను పెద్ద కల కనకుండా ఆపలేకపోయాయి. బాడీ బిల్డర్ కావాలనే ఆకాంక్ష ఆమెతోపాటు పెరిగి పెద్దదైంది. హైదరాబాద్లో జిమ్లో ట్రైనర్గా ఉద్యోగం చేస్తూ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటోంది. చెన్నైలో జరిగిన మిస్టర్ అండ్ మిసెస్ హిందూస్థానీ పోటీలో పాల్గొని మెడల్ సాధించింది. ఆంధ్రప్రదేశ్లో బాడీ బిల్డింగ్ చేసిన మహిళలు లేరు. ఆ రికార్డును తాను సాధించాలనే పట్టుదల ఆమెను విజేతను చేసింది.శవాల గదిలో ఉద్యోగమా?!పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు.ప్రాణం పోవడం ఒక వేదన అయితే మార్చురీ నుంచి తన వాళ్ల పార్థివ దేహాన్ని తీసుకువెళ్లే వాళ్ల దుఃఖానికి అంతే ఉండదు. మార్చురీలో ఉద్యోగం చేయడం అంటే రోజుకు ఐదారుసార్లు గుండెను చిక్కబట్టుకోవాల్సిందే. అలాంటిది రామ్ ప్రసన్న అనే మహిళ మార్చురీలో ఉద్యోగం చేస్తోంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రితో పోస్ట్మార్టమ్ అసిస్టెంట్గా పని చేస్తోందామె. ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగం చేయడమేమిటి’ అనే వెక్కిరింతలను పట్టించుకోలేదామె. ‘చేయడానికి నీకు ఈ ఉద్యోగమే దొరికిందా’ అనే మాటలకు వెనక్కి తగ్గలేదు. వృత్తిమీద గౌరవాన్ని తగ్గించుకోనూలేదు.అమ్మ గీసిన బొమ్మఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, నిమ్మలకుంట గ్రామానికి చెందిన దళవాయి శివమ్మ తోలుబొమ్మల చిత్రకారిణి. తోలు మీద అపురూపమైన చిత్రాలను గీస్తారు. ఆమె ఈ ఏడాది ‘శిల్పగురు’ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇది వందల ఏళ్ల నుంచి పరంపరగా వస్తున్నప్రాచీన కళ. తోలు బొమ్మలాటలు తగ్గిపోయాయి. కానీ బొమ్మలను చిత్రించేకళ కొత్త రూపు సంతరించుకుంది. రామాయణఘట్టాలు, శ్రీకృష్ణలీలల చిత్రాలను ల్యాంప్సెట్లు, వాల్ పెయింటింగ్స్, డోర్ హ్యాంగర్స్ మీద చిత్రిస్తూ అనేక రాష్ట్రాల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తున్నారు. యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ కళ అంతరించిపోకూడదనే ఆకాంక్షతో కొత్త తరానికి శిక్షణనిస్తున్నారు శివమ్మ.యాంటీ రెడ్ ఐఅది ఆగస్టు 29. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరా పట్టుబడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అసాంఘిక కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తున్నది విద్యావంతులే. సభ్యసమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇలాంటి దారుణాలను అరికట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్, షీ టీమ్స్, భరోసా టీమ్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఉమెన్ క్యాడెట్లు విద్యాసంస్థల్లో వర్క్షాపులు నిర్వహించాలి. షాపింగ్ మాల్స్, హోటళ్లు, సినిమా థియేటర్లలో తనిఖీలు జరగాలి. అలాగే స్పై కెమెరాల కొనుగోళ్ల మీద నిఘా ఉంచాలని సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నారు యాంటీ రెడ్ ఐ యాక్టివిస్ట్ అడపా వరలక్ష్మి.కిడ్స్కు పాఠం క్వీన్ స్విమ్మర్గంధం క్వీనీ విక్టోరియా ఆరేళ్ల కిందటి వరకు సాధారణ గృహిణి. లండన్లోని ఇంగ్లిష్ చానెల్ ఈది రికార్డు సాధించారు. పిల్లలు స్మిమ్మింగ్ క్లాసులకు సరిగ్గా వెళ్లక పోవడం, ‘స్విమ్మింగ్ చేస్తే తెలుస్తుంది’ అని నిష్ఠూరంగా మాట్లాడడంతో ఈదడం అంత కష్టమా అనుకున్నారామె. ‘అంత కష్టమా! సరే చూద్దాం పదండి’ అని తల్లిగా పిల్లల ప్రశ్నలకు సమాధానం వెతకడంలో కోసం నీటిలో దిగారు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ తన పిల్లలకే కాదు మహిళాలోకానికే రోల్మోడల్గా నిలుస్తున్నారు.తెలుగు నేల మీద తుళు అడుగులుహైదరాబాదులో నివసిస్తున్న మైత్రీరావుది దక్షిణ కర్నాటకలోని ధర్మస్థల. మాతృభాష తుళు. ఆమె ఇన్ఫర్మేషన్ సైన్స్ గ్రాడ్యుయేట్. నోకియా కంపెనీలో ఉద్యోగం చేశారు. నాట్యం మీద అభిరుచితో భరతనాట్యం, కలరిపయట్టు, అట్టక్కలరి, వ్యాలికవర్ నాట్యరీతులను సాధన చేశారు. నాట్యం ఇతివృత్తంగా ఆమె చిత్రీకరించిన రెండు సినిమాలకు అంతర్జాతీయ పురస్కారం లభించింది. శాస్త్రీయ నాట్యం అంటే పౌరాణిక ఇతిహాసాల ప్రదర్శన అనే పరిధిని చెరిపివేశారామె. స్త్రీ శక్తిని సమాజానికి చాటి చెప్పడానికి తాను ఎంచుకున్న మాధ్యమం నాట్యమే అంటారు స్త్రీశక్తి పురస్కార గ్రహీత, ప్రముఖ నాట్యకారిణి మైత్రీరావు.కథల అమ్మమ్మకోరుపోలు కళావతి రచయిత్రి. ఆమెది విజయనగరం జిల్లా. నాగరకత ముసుగులో ఆదివాసీ బిడ్డలకు పెట్టే పరీక్షలు, అడవి బిడ్డల చుట్టూ ఊహకందని ప్రమాదాలు, పల్లెపదాలు, జానపద జావళులకు అక్షరం ఆమె. అలాగే అమెరికా ప్రకృతి అందాలు, అక్కడ మనవాళ్ల ప్రగతి సుమగంధాలకు అక్షరరూపమిచ్చారామె. ఆధునిక సమాజంలో పిల్లలకు కథలు చెప్పే అమ్మమ్మలు, నానమ్మలు కరవయ్యారని గ్రహించిన కళావతి కథల పుస్తకాలు రాస్తూ కథల అమ్మమ్మ అయ్యారు.సరళ వైద్యం... ఇంటింటా డాక్టర్డాక్టర్ సరళది కాకినాడ. ఆమె హోమియో డాక్టర్. ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ కూడా ఉండాలంటారు. తల్లే ఆ డాక్టర్ అయితే ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారామె. ఇందుకోసం వారం రోజుల హోమియో కోర్సులు నిర్వహిస్తున్నారు. కోర్సులో భాగంగా సాధారణంగా వచ్చే 24 రకాల అనారోగ్యాల గురించి, వాటికిప్రాథమికంగా తీసుకోవాల్సిన ఔషథాలగురించి శిక్షణనిచ్చి హెల్త్ అడ్వైజర్లను తయారు చేస్తున్నారు. ఆమె స్వయంగా 76 రుగ్మతలకు మందులు కనుక్కున్నారు. డాక్టర్లు ఆరోగ్యవంతమైన సమాజం కోసం తమ వంతు బాధ్యతగా పనిచేయాలన్నారు డాక్టర్ సరళ. ఇప్పటికీ గ్రామాల్లో తగినంత మంది డాక్టర్లు అందుబాటులో లేని గ్యాప్ను ఇలా భర్తీ చేస్తున్నారామె.స్వావలంబనకు చుక్కాని హైదరాబాద్. దారుల్షిఫాలో మహిళలు, బాలికల సంక్షేమం కోసం స్వచ్ఛందసేవ అందిస్తున్నారు రుబీనా నఫీస్ ఫాతిమా. మిలిటరీ కుటుంబంలో పుట్టిన రుబీనా అభ్యుదయపథంలో పెరిగారు. మహిళలు చదువుకోవాలని, ఎవరి మీదా ఆధారపడకూడదని నమ్మిన కుటుంబం కావడంతో ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆమె బాడ్మింటన్ప్లేయర్ కూడా. పెళ్లి తర్వాత భర్తతోపాటు సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ మంత్రిత్వశాఖలో ఉద్యోగం చేశారు. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత జీవితాన్ని సమాజసేవకి అంకితం చేశారు. సఫా సంస్థ ద్వారా 2008 నుంచి ముస్లిం మహిళల ఆర్థిక సామాజిక పురోగతి కోసం పని చేస్తున్నారు. అభివృద్ధి అనేది పరిపూర్ణంగా ఉండాలని, ఆడపిల్లలకు చదువుతోపాటు ఆటలు కూడా అవసరమంటారామె. అయితే ఆడపిల్లలను ఆటలకు పంపించడానికి కూడా నిషేధం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రులను చైతన్యవంతం చేసి, బాల్షెట్టీ ఖేత్ గ్రౌండ్లో ఆడపిల్లలు ఆడుకోవడానికి ఒక టైమ్ స్లాట్ కేటాయించి క్రీడలను ప్రోత్సహిస్తున్నారు రుబీనా నఫీస్ ఫాతిమా.యర్రంపల్లి నుంచి దిల్లీకిమహిళల ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించిన మినీ వేలంలో శ్రీ చరణిని ఎంపిక చేసుకోవడానికి ఫ్రాంచైసీలు పోటీ పడ్డాయి. దిల్లీ క్యాపిటల్స్ 55 లక్షలతో శ్రీ చరణిని ఎంపిక చేసుకుంది. కడప జిల్లా యర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణి సామాన్య కుటుంబంలో పుట్టింది. జిల్లాలోని వీరనాయుని పల్లెలోని వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తున్న శ్రీచరణి తల్లిదండ్రులప్రోత్సాహంతో ఆటల్లో రాణిస్తోంది. 2021లో అండర్ 19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా– సి జట్టుకిప్రాతినిధ్యం వహించిన శ్రీ చరణి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించింది. ఉమెన్ టీ ట్వంటీలో ఆంధ్రాజట్టుకుప్రాతినిధ్యం వహించి తన బౌలింగ్ తీరుతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.ఇదీ చదవండి: భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్ -
ఉమెన్ పవర్ 2024: కాలాన్ని కట్టడి చేశారు
కాలం.. మరో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. జారిపోతున్న కాలపు క్షణాలను అపురూపంగా ఒడిసిపట్టుకొని ఉన్నతంగా ఎదిగినవారు కొందరు... ఉదాత్తంగా జీవనాన్ని మలుచుకున్నవారు ఇంకొందరు ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా వెనక్కి లాగే పరిస్థితులు ఏవైనా కాలానికి ఎదురు నిలిచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ అత్యున్నతంగా ఎదిగిన కొందరు మహిళా మణుల కృషిని ఈ ఏడాది ‘సాక్షి ఫ్యామిలీ’ ఆవిష్కరించింది. ఆ గాథలను మరోమారు గుర్తుచేసుకుందాం. ఎదనిండా స్ఫూర్తిని నింపుకుందాం.డాక్టరమ్మ క్రీడా శిక్షణనిజామాబాద్ పట్టణంలో బాలికల క్రీడానైపుణ్యాలను చూసి, వారి కోసం తన పేరుతోనే 2019లో ఫుట్బాల్ అకాడమినీ ఏర్పాటు చేశారు డాక్టర్ శీలం కవితారెడ్డి. ఈ అకాడమీలో 41 మంది బాలికలకు కోచ్ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు ఈ అకాడమీ లో ఉచిత వసతి, ఆహారం, దుస్తులు, వైద్యసేవలను అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన ఖర్చులన్నీ భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి జాతీయ–అంతార్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఉన్నారు.అమ్మాయిలను కాపాడుకుందాం..గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణారావు. హైదరాబాద్ వాసి అయిన ఈ సామాజిక కార్యకర్త డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయ వేదిక ‘మకాం’ సహ వ్యవస్థాపకురాలిగానూ ఉన్నారు. నారీశక్తి పురస్కార గ్రహీత అయిన రుక్మిణీరావు ముప్పై ఏళ్లుగా ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్’ ద్వారా తెలంగాణలోని ఆరు మండలాలో 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఆడపిల్లల పెంపంకం పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి కృషి చేస్తున్నారు.అమ్మలాంటి అన్నదాత కోసంసాయి ప్రియాంక చదువుకున్నది హైదరాబాద్లో. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్తులో పాల్గొనే అవకాశాన్ని పొందింది. ఖమ్మంవాసి అయిన పగడాల సాయి ప్రియాంక తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. కూతురికి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తెలంగాణలోని రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న గ్రామాలలో రైతులను కలిసి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను పరీక్షించింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్డి చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్గా పనిచేస్తోంది. విభిన్న ఆలోచనలు గల సాయి ప్రియాంక కొత్త దారిలో ప్రయాణించడమే కాదు, తన తోటివారి స్ఫూర్తిగా నిలుస్తోంది.సవాళ్లే పట్టాలెక్కించేదిదక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్)గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారిగా కె.పద్మజ ఈ ఏడాది ఆగస్టులో నియమితులయ్యారు. 1991 ఐఆర్సిఆర్లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ఉద్యోగంలో మహిళగా ఎదుర్కొన్న వివక్షను వివరించారు. ‘సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే ఆ పని కూడా సులువు అవుతుంది’ అని తెలిపారు‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!జీవనశైలిని మార్చుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాసెస్ట్ మారథాన్ రన్నర్గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి. 50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తి చేసి, స్టార్ మెడల్స్ను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్లో పాల్గొంటున్న కవితారెడ్డి పదేళ్ల క్రితం వరకు గృహిణిగా బాధ్యతల నిర్వహణలో ఉన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం జిమ్లో చేరి, అటు నుంచి మారథాన్ రన్నర్గా దేశ విదేశాల్లో మహిళల్లో క్రీడాస్ఫూర్తిని నింపుతున్నారు.అన్నీ తానై... తానే నాన్నయివ్యవసాయం చేసే తండ్రి అనారోగ్యంతో చనిపోతే డిగ్రీ చదువుతున్న అతని చిన్న కూతురు అఖిల రైతుగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామ వాసి అఖిల ఉన్న రెండెకరల భూమిని సాగు చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తల్లినీ, నాయినమ్మనూ సంరక్షిస్తోంది. ΄÷లం పనులకు ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం చేసుకుంటూ, పోటీ పరీక్షలకు సిద్ధపడుతోంది. తండ్రిలేని లోటును తీర్చుతూ కుటుంబానికి అండగా నిలబడింది. నానమ్మ గురించి రాస్తా!పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల అమ్మాయి గురించి కథలుగా రాసి, దానిని బుక్గా అందరికి ముందుకు తీసుకువచ్చింది ఏడవ తరగతి చదువుతున్న అక్షయినీ రెడ్డి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలైన అక్షయినీ తాతయ్యలా ‘లా’ చేస్తాను, సమాజంలో ఉన్న గాధలను కథలుగా పరిచయం చేస్తాను, నానమ్మ గురించి రాస్తాను.. అంటూ తన భవిష్యత్తు లక్ష్యాలను మన ముందుంచింది. ఆటపాటలతో రోజులు గడిపేసే ఎంతో మంది పిల్లల మధ్య ఉంటూనే ప్రపంచంలో పేరొందిన రచయితల పుస్తకాలు చదువుతూ, క్రీడల్లో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని రూపొందించుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్నపిల్లలైనా పెద్ద కలలు కనవచ్చు అంటూ తన పుస్తకాన్ని చూపుతూ భావితరానికి చెబుతోంది.నీ ఆటే బంగారం శ్రీవల్లికరీంనగర్ వాసి శ్రీవల్లికి క్రికెట్ అంటే ఇష్టం. ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే హై స్కూల్ అబ్బాయిలతో కలిసి క్రెకెట్ ఆడటానికి వెళ్లింది. అందరూ ఆమెను చూసి వెటకారం గా నవ్వారు. వారి నవ్వులకు వెనకడుగు వేయకుండా విషయం పీటీటీ సర్కు చెప్పింది. శ్రీవల్లి ఇష్టం చూసిన పీఈటీ రహీం శ్రీవల్లి ఉత్సాహానికి మద్దతుగా నిలిచారు. తల్లిదండ్రులూ తమ ఆమోదం తెలిపారు. హైదరాబాద్లోని స్పోర్ట్స్ అకాడమీలో చేరి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. జాతీయ స్థాయి మహిళా క్రికెట్ జట్టులో తన సత్తా చాటుతోంది. చైతన్య లహరి బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. కరాటేలో బ్లాక్బెల్ట్, కిక్ బాక్సింగ్లో ప్రావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్గా సత్తా చాటింది. అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నవారికి అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసింది. నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. తోటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ‘హోప్ హౌజ్ ఫౌండేషన్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇటీవల బ్యాంకాక్లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. తండ్రిలాగే సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనేది లహరి లక్ష్యం.బస్తీ దొరసానిచెత్తను సేకరించే అమ్మాయి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ హోదాలో ఒక రోజు అధికారిణిగా పలు శాఖల విధులను స్వయంగా సందర్శించి, తెలుసుకుంది. హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని పిల్లిగుడెసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బస్తీల పిల్లల బాగు కోసం కృషి చేస్తోంది. తల్లిదండ్రులతో పాటు చేత్త సేకరణ పనిచేస్తూ, కాలేజీ చదువులు చదువుతూ, బస్తీ పిల్లలకు చదువులు చెబుతుంటుంది. కోవిడ్ సమయంలో యునిసెఫ్ నుంచి వాలెంటీర్గా పనిచేసింది. ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకుంది. గాంధీ కింగ్ స్కాలర్షిప్కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్ అయితే వారిలో జయలక్ష్మి ఒకరు. ఇందులో భాగంగా కిందటేడాది అమెరికా వెళ్లి వచ్చింది. ఇప్పుడు డిగ్రీ చేస్తూ యుపీఎస్సీ సాధించాలని కృషి చేస్తోంది.టీచర్ కొలువిచ్చిన సి‘విల్’ పవర్వనపర్తి వాసి అయిన హుమేరా బేగం తండ్రి రోజువారీ కూలీగా హైదరాబాద్లో ఒక మదర్సాలో పనిచేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్గా కొంత కాలం పనిచేసింది. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. పదవ తరగతి లో ఉండగా తండ్రి ఆరోగ్యం క్షీణించి మరణించాడు. హుమేరాకు సివిల్స్ సాధించాలన్నది కల. ఆర్థిక స్థితి లేక చదువును వదిలేయాల్సిన స్థితి. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ సంస్థ దృష్టికి చేరింది. ఆ సంస్థ ఆమె చదువుకు అండగా నిలబడింది. డీఎడ్పూర్తి చేసి ఎస్జీటీ ఉర్దూ టీచర్గా ఎంపిక అయ్యింది. దయనీయమైన పరిస్థితుల నుంచి టీచర్గా ఎదిగిన హుమేరా కృషి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. -
50 పైసలకు టీ అమ్ముకునే మహిళ..రూ. 100 కోట్లకు అధిపతిగా!
స్వతంత్రంగా జీవించాలని, సొంతకాళ్లపై నిలబడాలనే ఆలోచన ఒక మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అదీ కష్టాల్లో ఉన్న మహిళ ధైర్యంగా, ఆర్థికంగా ఉన్నతంగా బతకాలని నిర్ణయించుకుంటే మాత్రం తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ధీరగా నిలబడుతుంది. బీచ్లో కాఫీ, టీ అమ్ముకునే స్థాయి నుంచి రెస్టారెంట్ల సారధిగా ఎదిగిన పెట్రిసియా నారాయణ్ అనే మహిళ సక్సెస్ జర్నీ అలాంటిదే. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి!తమిళనాడులోని నాగర్కోయిల్ ప్రాంతంలో జన్మించారు ప్యాట్రిసియా థామస్ 17 ఏళ్ల వయస్సులోనే నారాయన్ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కలిగారు. కానీ కాల క్రమంలో ఆమె కలలన్నీ కరిగిపోవడం మొదలైంది. ఆమె భర్త మాదకద్రవ్యాలు, డ్రగ్స్కి భావిసగా మారిపోయాడు. జీవితం దుర్భరమైపోయింది. డబ్బుల కోసం భర్త వేధించేవాడు. సిగరెట్లతో కాల్చేవాడు. అందిన డబ్బులు తీసుకుని నెలల తరబడి అదృశ్యమయ్యేవాడు. ఇక అతనిలో మార్పురాదని గ్రహించింది. దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు అదృష్టవశాత్తూ ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆసరాగా నిలబడ్డారు.తల్లి ఇచ్చిన ఆర్థిక బలానికి పెట్రిసియా నారాయణ్ దృఢ సంకల్పం తోడైంది. వంటపై ఉన్న ఆసక్తినే వ్యాపారంగా మార్చుకుంది. పచ్చళ్లు, జామ్ లు వంటివి సిద్ధం చేసి విక్రయించటం ప్రారంభించింది. మంచి ఆదరణ లభించింది. దీంతో మరింత ఉత్సాహం వచ్చింది. విభిన్నంగా ఆలోచించింది. పచ్చళ్లు, జామ్ల వ్యాపార లాభాలను మరో వ్యాపారంలో పెట్టాలని భావించింది. అంతే క్షణం ఆలోచించకుండా చెన్నై మెరీనా బీచ్లో టీ, కాఫీ, జ్యూస్, స్నాక్స్ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం 50 పైసలకు కాఫీ, టీ అమ్మింది. మెుదటి రోజు కేవలం ఒక్క కాఫీ మాత్రమే అమ్ముడు బోయింది. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పట్టుదలగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అంతే తర్వాతి రోజు పుంజుకున్న వ్యాపారం రూ.700కి చేరింది. మెనూలో శాండ్విచ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్క్రీమ్లను కూడా చేర్చింది. స్నాక్స్, ఫ్రెష్ జ్యూస్, కాఫీ, టీ అమ్మడంలో ఆమెకు సహాయం చేయడానికి ఇద్దరు వికలాంగులను నియమించుకుంది. మెరీనా నే బిజినెస్ స్కూల్,అదే నా ఎంబీయే అంటారు ప్యాట్రిసియా. అలా తన సొంత వ్యాపారంతో కుటుంబాన్ని పోషించింది. ఈ క్రమంలో 1998లో సంగీత గ్రూప్ నెల్సన్ మాణికం రోడ్ రెస్టారెంట్కి డైరెక్టర్ అవకాశాన్ని పొందటంతో జీవితం మలుపు తిరిగింది.2002లో భర్త మరణించాడు. రెండేళ్ల తర్వాత కూతురు, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో దివంగత కుమార్తె జ్ఞాపకార్థం, కుమారుడుతో కలిసి తొలి రెస్టారెంట్ 'సందీప'ను ప్రారంభించింది. ఇక అప్పటినుంచీ, ఆ హోటలే తన కుమార్తెగా మారిపోయింది. అంత జాగ్రత్తగా దాన్ని ప్రేమించి పోషించింది. కట్ చేస్తే..సందీప్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ చెన్నైలో కొత్త బ్రాంచీలతో విస్తరించింది. ప్రస్తుతం పెట్రిసియా నారాయణ్ నికర విలువ దాదాపు రూ.100 కోట్లుగా అంచనా. ప్రస్తుతం ఆమె 14 వివిధ ప్రాంతాల్లో 200 మంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తున్న ఆమె సక్సెస్ జర్నీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది. 2010లో 'FICCI ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. సైకిల్ రిక్షా, ఆటో రిక్షానుంచి సొంతకారుకు తన జీవితం మారిందనీ, రోజుకు 50 పైసలు ఆదాయం రోజుకు రూ. 2 లక్షలకు పెరిగింది. ఇద్దరు వ్యక్తులతో మొదలైన తన వ్యాపారం 200 వందలకు చేరిందని గర్వంగా చెప్పుకుంటారు ప్యాట్రిసియా . ఇదీ చదవండి : నయా ట్రెండ్ : పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్ రచ్చ! -
కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!
రోజూ కొన్ని గంటల పాటు నడుచుకుంటూ పట్టణానికి వెళ్లి కూరగాయలు అమ్మే యాంగ్మీలా ఇప్పుడు ఒక స్టార్టప్కు యజమానురాలు. ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధిని, స్ఫూర్తిని ఇస్తున్న ఉత్తేజం.మణిపూర్లోని ఫరుంగ్ గ్రామానికి చెందిన యాంగ్మీలా ప్రతిరోజూ ఉదయం తన ఊరి నుంచి ఉఖ్రుల్ పట్టణానికి కూరగాయల బుట్టను మోసుకుంటూ ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లేది. వాటిని అమ్మి ఎండలో తిరిగి ఇంటికి వచ్చేది. తాను నడిచి వెళ్లే దారి మామూలు దారి కాదు. కొండల దారి.ఆర్థిక ఇబ్బందుల వల్ల 21ఏళ్ల వయసులో కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది యాంగ్మీలా. అప్పటికే ఆమెకు ఒక మగబిడ్డ. భర్త తనను విడిచి వెళ్లాడు. బిడ్డతోపాటు అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత ఉండడంతోకష్టాన్నే నమ్ముకుంది యాంగ్మీలా. వయసు పైబడుతుండడంతో యాంగ్మీలాకు నడక భారమైంది. ‘ఇలా ఎంతకాలం! వేరే మార్గం లేదా?’ అని ఆలోచించింది మనసులో. ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో మొదటగా పాత బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత కోళ్ల పెంపకం చేపట్టింది. మిఠాయిల దుకాణం నడిపింది. ఉసిరి, మామిడి, ఆపిల్... మొదలైన వాటిని ప్రాసెస్ చేసి మిఠాయిలు తయారు చేసేది. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన శిక్షణ శిబిరంలో సాల్గొన్న తరువాత ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.మిర్చి, వెల్లుల్లి, వంకాయలు, వెదురు చివుళ్లు... మొదలైన వాటితో సేంద్రియ ఊరగాయల తయారీని ప్రారంభించింది. తన స్టార్టప్కు ‘షిరిన్ ప్రొడక్ట్స్’ అని పేరు పెట్టింది. ‘షిరిన్’ అనేది నాగా పదం. ‘పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి’ అనేది దీని అర్థం.జర్మన్ ఎన్జీవో ‘జీఐజెడ్’ నుంచి ఈ స్టార్టప్కు 1.2 లక్షల గ్రాంట్ లభించింది. ఆర్బీఐకి సంబంధించిన ‘రంగ్ దే’ అనే లెండింగ్ ప్లాట్ఫామ్ నుంచి రెండు లక్షల రుణం తీసుకుంది. ‘షిరిన్ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ప్రాంతాలలోనే కాకుండా మణిపూర్ రాజధాని ఇంఫాల్, అస్సాం, నాగాలాండ్, దిల్లీలలో కూడా అమ్ముడవుతున్నాయి.ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది యాంగ్మీలా.‘ఒకే ఉద్యోగితో మా కంపెనీ ప్రారంభం అయింది. మొదట్లో డోర్ టు డోర్ అమ్మకాలు చేసేవాళ్లం. ఇప్పుడు నా దగ్గర పన్నెండు మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వారికి నేనే శిక్షణ ఇచ్చాను’ అంటుంది యాంగ్మీలా. ఎమ్మెస్సీ చేసిన ఆమె కుమారుడు షంగ్రీఫా ఇప్పుడు వ్యాపారంలో తల్లికి సహాయంగా ఉంటున్నాడు.‘సింగిల్ మదర్గా ఆమె ఎలాంటి కష్టాలు పడిందో ఊహించుకోవచ్చు. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కష్టపడాలి, ఎప్పుడూ ఏదో చేయాలనే తపన ఆమెకు విజయాన్ని చేరువ చేసింది. వ్యాపారం మీద ఎంత శ్రద్ధ పెట్టిందో నా చదువు, భవిష్యత్ మీద కూడా అంతే శ్రద్ధ పెట్టింది. ఆమెను చూసి గర్వపడతాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడని ధైర్యవంతురాలైన మహిళ మా అమ్మ’ తల్లి గురించి గర్వంగా చెబుతాడు షంగ్రీఫా.‘అస్సాం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అవార్డ్’ తో సహా ఎన్నో అవార్డ్లు అందుకున్న యాంగ్మీలా ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది. -
ఆమె... ఒక హి‘స్టోరీ’ : ఎవరీ గోపీ సిద్ధి
ఆ అవ్వని చూస్తే కర్ణాటక వాసి అని ఎవరూ అనుకోరు. ‘ఆఫ్రికన్’ అనే అనుకుంటారు. గోపీ సిద్దీ పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఇండియాకు తీసుకురాబడ్డారు. ఇక్కడికి వచ్చిన తరువాత స్థానిక సంస్కృతులతో కలిసిపోయినప్పటికీ, తమ మూల సంస్కృతిని కాపాడుకుంటున్నారు. సిద్దీస్ జాతి ప్రజలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలతో పాటు తమ సంస్కృతిని తన కథల ద్వారా లోకానికి చాటుతోంది గోపి సిద్దీ.తులసికొండ (కర్నాటక) ప్రాంతానికి చెందిన కుంటగని గ్రామానికి చెందిన గోపి సన్నా సిద్దీ జనాలకు ఒక వింత. ఒక పురాగాథ. విలువైన కథల చెట్టు. గోపి సిద్దీస్ అనేది ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక ప్రత్యేక జాతి. బానిసలు, కిరాయి సైనికులుగా, నావికులుగా వీరిని భారతదేశానికి తీసుకువచ్చారు. కాలక్రమంలో వీరు స్థానిక భాషలు నేర్చుకున్నారు. ఇక్కడి సంస్కృతిలో భాగం అయ్యారు. అదే సమయంలో తమ ఆఫ్రికన్ వారసత్వ మూలాలను కాపాడుకున్నారు. సంగీతం నుంచి నృత్యరూపాల వరకు అందులో ఎన్నో ఉన్నాయి.ఈ సిద్దీలు కర్నాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా కనిపిస్తారు. గోపి సిద్దీ బాల్యంలో కొత్త ప్రాంతానికి వెళితే... ‘ఆఫ్రికన్’ ‘నీగ్రో’ అని పిలిచేవారు. ‘అలా ఎందుకు పిలుస్తున్నారు?’ అని అడిగితే తమ పూర్వీకులు ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చారు అని తల్లి చెబుతుండేది. ఎప్పుడూ ఏవో కథలు వినిపించే గోపి సిద్దీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. భర్త ఆమెను వదిలేసి మూడు దశాబ్దాలు దాటింది. ఆక్రమణదారుల చెర నుంచి తన వ్యవసాయ భూమిని తిరిగి పొందాలి... ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తన కథల పుస్తకాలను ప్రచురించాలనే ఉత్సాహం, ఉక్కు సంకల్పంలో మాత్రం మార్పు లేదు. తన పుస్తక ప్రచురణ కోసం నగలు కూడా తాకట్టు పెట్టింది.తమ జాతి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు తనలో నుంచి రచయిత్రి బయటికి రావడానికి కారణం అయ్యాయి. ‘స్వేచ్ఛ గురించి తపించే దృఢమైన వ్యక్తిత్వం గోపి సిద్దీ సొంతం. జీవితంలో ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. గోపి సిద్దీ కథల్లో బాధ మాత్రమే కాదు జ్ఞానం కూడా ఉంటుంది. పర్యావరణ స్పృహ ఉంటుంది. తన తాతల కాలం నుంచి వింటూ పెరిగిన కథలు అవి. తనకు పరిచయం అయిన వారికల్లా ఆ కథలను చెబుతుంది. ఆమె శక్తిమంతమైన రచయిత్రి’ అంటుంది ‘బుడా ఫోక్లోర్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు రాలైన సవితా ఉదయ్.పది సంవత్సరాల క్రితం తన ఇంట్లో పని చేయడానికి ఒక పనిమనిషిని వెదుకుతున్న సమయంలో ఉదయ్కు గోపీతో పరిచయం ఏర్పడింది. మారుమూల గ్రామానికి పరిమితమైన గోపి సిద్దీ జీవిత కథను తన డాక్యుమెంటరీ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు బెంగళూరుకు చెందిన నిశాంత్ గురుమూర్తి. తన స్వచ్ఛంద సంస్థ ‘బుడా ఫోక్లోర్’ ద్వారా జానపదల కథానిలయమైన గోపి సిద్దీతో కర్ణాటక అంతటా పాఠశాల విద్యార్థులతో కథా సెషన్లు నిర్వహిస్తోంది సవితా ఉదయ్. కొంకణీ, కన్నడ భాషలలో ఆమె చెప్పే కథలకు పిల్లలు ఫిదా అవుతుంటారు.ఆ బాధ భరించలేనంత!భాషపరమైన అడ్డంకులు ఉన్నప్పటికి పట్నం పిల్లలు నా కథలను ఇష్టపడుతుంటారు. వారి అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కథలు చెప్పడం పూర్తయిన తరువాత నన్ను ఆ΄్యాయంగా కౌగిలించుకొని వీడ్కోలు చెబుతారు. బరువెక్కిన హృదయంతో ఇంటికి వస్తాను. వారిని విడిచి ఇంటికి వస్తుంటే... ఒక్కోసారి ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. – గోపి సిద్దీ -
‘పోస్ట్’ మార్టమ్... శవాలగదిలో ఉద్యోగమా?
మనుషులు వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాలలో శ్మశానం ఒకటి అని చెబుతుంటారు. అయితే అసహజ మరణాలకు సంబంధించిన శవాలు శ్మశానానికన్నా ముందు చేరుకునే ప్రదేశం మార్చురీ. అక్కడ కొద్దిసేపు గడపాలంటేనే ఇబ్బంది పడేవాళ్లు, భయపడేవాళ్లు ఉంటారు. అలాంటిది పోస్ట్మార్టం గదిలో రోజూ ఉద్యోగం చేయడం అంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ గుండె ధైర్యం రామ్ప్రసన్నలో ఉంది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టమ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రామ్ప్రసన్న... ‘ఆడవాళ్లు ఈ ఉద్యోగం చేయడం ఏమిటి!!’ అనే లింగవివక్షతతో కూడిన మాటలు... ‘చేయడానికి నీకు ఈ ఉద్యోగమే దొరికిందా!’లాంటి వెక్కిరింపులు ఎదుర్కొన్నా... ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. వృత్తి జీవితంపై గౌరవాన్ని తగ్గించుకోలేదు... ఇచ్చోటనే...నిండా పాతికేళ్లు కూడా నిండని యువకుడి శవం. ‘బహుశా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండొచ్చు’ అని ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి... తన పిల్లల్ని తలుచుకొని కళ్లనీళ్ల పర్యంతం అవుతున్నట్లు అనిపిస్తుంది. ‘ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయాలి. వారి పెళ్లి చూడకుండానే వరద నన్ను మింగేసింది’... మధ్యతరగతి తండ్రి శవం అదేపనిగా రోదిస్తున్నట్లుగా ఉంటుంది. శవాలు మౌనంగా చెప్పే కథలు ఎన్నో విన్నది రామ్ప్రసన్న. అలా అని శ్మశాన వైరాగ్యంలాంటిది తెచ్చుకోలేదు. వృత్తిని వృత్తిలాగే ధైర్యంగా నిర్వహిస్తోంది.‘నాకు ఉద్యోగం వచ్చింది అనగానే సంతోషించిన వాళ్లు శవాల గదిలో అని చెప్పగానే నోరు తెరిచారు. ఆడపిల్లవు...అక్కడెలా చేస్తావంటూ అడిగేవాళ్లు. ఎక్కువ రోజులు ఉండలేవు. వచ్చేస్తావు అన్నవాళ్లూ ఉన్నారు. అందుకే ఆడవాళ్లు ఎవరూ రాని ఈ వృత్తిలో కొనసాగుతున్నా’ అంటుంది తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం అసిస్టెంట్ (శవపరీక్ష సహాయకురాలు)గా విధులు నిర్వర్తిస్తున్న రామ్ ప్రసన్న.ఆసుపత్రి వెనుక వైపు కాస్తంత దూరంగా ఉండే మార్చురీలోకి నిత్యం వచ్చే శవాలతోనే తన వృత్తిజీవితం ముడిపడివుంది. ఆత్మహత్యకు పాల్పడినవాళ్లు, రోడ్డు ప్రమాదాల మృతులు, నీళ్లలో కొట్టుకు వచ్చిన మృతదేహాలు... నిత్యం ఆసుపత్రికి వస్తూనే వుంటాయి. అన్నింటికీ శవపరీక్ష నివేదిక కీలకమని తెలిసిందే. సంబంధిత వైద్యుడు శవపరీక్ష చేస్తే అందుకు తగినట్టుగా మృతదేహాన్ని సిద్ధం చేయటం, వైద్యుడికి సహాయపడటం సహాయకురాలిగా రామ్ప్రసన్న ఉద్యోగం.భర్త ప్రోత్సాహంతో...ప్రమాదాల్లో రక్తమోడుతున్న మృతదేహాలూ, నీటిలో ఉబ్బిపోయినవీ, డీ కంపోజింగ్కు చేరువైనవి... చూడటమే కష్టం. నెలకు పదిహేను నుంచి ఇరవై వరకు వచ్చే ఇలాంటి మృతదేహాలను శవపరీక్షకు సిద్ధం చేయాలంటే ఎంత ధైర్యం కావాలి? సన్నగా, రివటలా ఉండే రామ్ప్రసన్న ఆ విధులను వస్త్రాలకు అతుకులు కుట్టినంత శ్రద్ధగా, అలవోకగా చేస్తోంది.రామ్ప్రసన్న దూరవిద్యలో బీఏ చేసింది. కూలి పనులకు వెళుతుండే భర్తకు తోడుగా తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంది. డీసీహెచ్ఎస్ నుండి వెలువడిన నోటిఫికేష¯Œ లో పోస్ట్మార్టమ్ అసిస్టెంట్ పోస్టు కనిపించటంతో దరఖాస్తు చేసింది. ఇంటర్వ్యూ కూడా పూర్తయ్యాక తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టింగ్ ఇచ్చారు. భర్త ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండాప్రోత్సహించాడు.భయం అనిపించలేదు... ఆసక్తిగా అనిపించింది!తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో పోస్టుమార్టమ్ సహాయకులుగా ఇప్పటివరకు పురుషులే ఉండేవారు. శవపరీక్షకు ముందు మద్యం సేవించటం తప్పనిసరి అన్నట్టుగా ప్రవర్తించే వారు కొందరు. ఇలాంటి వారు మృతుల బంధువుల నుంచి మద్యానికి డబ్బులు వసూలు చేసేవారు. అలాంటి ఉద్యోగంలో ఇప్పుడు ఒక ఆడపిల్లను చూడడం చాలామందికి వింతగా ఉంది. ఆ ఆశ్చర్యం సంగతి ఎలా ఉన్నా మృతదేహాల రక్తసంబంధీకులకు ఇప్పుడు మద్యం కోసం పీడన లేదు. ‘ఈ ఉద్యోగంలోకి వచ్చాక తొలిసారి శవపరీక్షలో పాల్గొన్నాను. మరణానికి కారణాలు తెలుసుకోవటం ఆసక్తిగా అనిపించింది. భయం అనిపించలేదు. ఉద్యోగాన్ని అంకితభావంతో చేస్తున్నాను.’ అంటుంది రామ్ప్రసన్న. ‘మహిళలు ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయగలరు. ఇలాంటి ఉద్యోగాలు మాత్రమే చేయాలి’ అనే అప్రకటిత తీర్పులకు, పురుషాధిపత్య ధోరణులకు రామ్ప్రసన్న వృత్తిజీవితం, అంకితభావం చెంపపెట్టులాంటిది. ఈ ఉద్యోగం నాకు గర్వకారణంనేను చేస్తున్న ఉద్యోగంపై కొందరి సందేహాలు, భయాలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను వేరే లోకంలో ఉద్యోగం చేయడం లేదు. గ్రహాంతర జీవులు, ప్రమాదకర వ్యక్తుల మధ్య ఉద్యోగం చేయడం లేదు. నిన్నటి వరకు వాళ్లు మనలాంటి మనుషులే. మన మధ్య ఉన్న వాళ్లే. ్రపాణదీపం ఆరిపోగానే వారిని పరాయి వాళ్లుగా చూసి భయపడడం తగదు. నేను భయపడుతూ ఉద్యోగం చేయడం లేదు. గర్వంగా చేస్తున్నాను. అంకితభావంతో చేస్తున్నాను.– రామ్ప్రసన్న – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా
సాధించాలన్న పట్టుదల, కృషి,అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ఈవిషయాన్నే తన విజయం ద్వారా నిరూపించింది ఓ యువతి. ఒకటి కాదు రెండు ఏకంగా 13 బంగారు పతకాలను సాధించింది. CLATలలో అగ్రస్థానంలో నిలిచి, బంగారు పతకాలు సాధించడమే కాకుండా, యూపీఎస్సీలో మంచి (60) సాధించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన శ్రద్ధా గోమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి!శ్రద్ధా గోమ్ తండ్రి రిటైర్డ్ SBI అధికారి. ఆమె తల్లి వందన గృహిణి. శ్రద్ధా చిన్నప్పటినుంచీ తెలివైన విద్యార్థిని. ఇండోర్లోని సెయింట్ రాఫెల్స్ హెచ్ఎస్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అగ్రస్థానంలో నిలిచింది.తరువాత శ్రద్ధా గోమ్ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని బావించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)లో టాపర్గా నిలిచింది. ఈ ఘనత ఆమె ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), బెంగుళూరు, భారతదేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందింది. అత్యుత్తమ ప్రతిభకు గాను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రచేతులమీదుగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డుల పరంపరకొనసాగుతూనే ఉంది. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేసింది. ముంబై, లండన్లో విలువైన అనుభవాన్ని పొందింది. తరువాత తన స్వస్థలమైన ఇండోర్కు తిరిగొచ్చి, 2021లొ సివిల్ సర్వీసెస్కు (సీఎస్ఈ) ప్రిపేర్ అయింది. ఇంటర్నెట్ ద్వారా స్టడీ మెటీరియల్ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రద్ధా మంచి ఆర్టిస్ట్ కూడా. -
సవాల్ ఉంటేనే సక్సెస్... తగ్గేదేలే!
‘గృహిణిగా బోలెడన్ని బాధ్యతలు ఉంటాయి ఇంక వ్యాపారాలు ఏం చేస్తారు?’ అనుకునేవారికి ‘చేసి చూపుతాం..’ అని నిరూపిస్తోంది నేటి మహిళ. ‘ఒకప్పుడు మేం గృహిణులమే ఇప్పుడు వ్యాపారులం కూడా’ అంటున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా, నచ్చిన పని చేస్తూ అందరూ మెచ్చేలా విజయావకాశాలను అందుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలు కలిశారు. సవాళ్ళను ఎదుర్కోవడమే తమ సక్సెస్ మంత్ర అని చెప్పారు. ఆ వివరాలు వారి మాటల్లో... – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి స్ట్రాంగ్గా ఉంటే.. వింటారు సివిల్ ఇంజినీరింగ్ చేశాను. నాకు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఇంటీరియర్ అడ్వాన్స్ కోర్స్ 2018లో పూర్తి చేశాను. గేటెడ్ కమ్యూనిటీలు, సెలబ్రిటీ హౌజ్లు డిజైన్ చేశాను. కస్టమర్ బడ్జెట్, ఆలోచనలు తీసుకొని ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకు 200లకు పైగా ్ర΄ాజెక్ట్స్ పూర్తి చేశాను. ఇంటీరియర్ డిజైనింగ్లో మహిళలు రాణించలేరు అనుకుంటారు. కానీ, నేను డామినేటింగ్గా ఉంటాను. స్ట్రాంగ్గా ఉంటే ఎవ్వరైనా మన మాట వింటారు. – అనూష మేకప్ ఒక ఆర్ట్ మేకప్ ఆర్ట్ నాకు చాలా ఇష్టమైన వర్క్. అందుకే, ప్రొఫెషనల్ కోర్స్ తీసుకొని, ముందు మా కమ్యూనిటీలోనే స్టార్ట్ చేశాను. ఇంటివద్దకే వచ్చి మేకప్ చేయించుకునేవారు. రెండేళ్ల క్రితం స్టూడియో ఏర్పాటు చేశాను. 7–8 రాష్ట్రాలలో మా స్టూడియో ద్వారా మేకప్ సర్వీస్ అందిస్తున్నాను. చాలా మంది మేకప్ అనగానే ఫౌండేషన్, కాజల్.. బ్యుటీషియన్ వర్క్ అనుకుంటారు. అలాగే మేకప్ అనేది చాలా మందికి పెళ్లి వంటి ప్రత్యేకమైన సందర్భం తప్పితే అంతగా అవసరం లేనిదిగా చూస్తారు. కానీ, పెళ్లి, వెస్టర్న్ పార్టీలు, బర్త్ డే పార్టీలు... ఇలా సందర్భానికి తగినట్టు మేకప్ స్టైల్స్ ఉన్నాయి. మేకప్ ఆర్టిస్టులకి మార్కెట్లో చాలా పెద్ద పోటటీ ఉంటుంది. కానీ, వారి నెట్వర్క్తో ప్రొఫెషనల్గా చేసే మేకప్కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. – శ్రీలేఖ, మేకప్ సెంట్రల్ నిరూపించుకోవాలనుకుంటే సాధించగలంలక్సస్ డిజైన్ స్టూడియోస్పెషల్గా బ్రైడల్ వేర్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికీ డిజైన్ చేస్తాను. కార్పొరేట్ యూనిఫార్మ్స్, ఫస్ట్ బర్త్డే పార్టీలకు డ్రెస్ డిజైన్ చేస్తాను. 2013లో చెన్నైలో మొదటి బ్రాంచ్ స్టార్ట్ చేశాను. తర్వాత హైదరాబాద్లో ఏర్పాటు చేశాం. సెలబ్రిటీలకు దాదాపు 50 తమిళ సినిమాలకు, 50 తెలుగు సినిమా స్టార్స్కి డిజైన్ చేశాను. ఫ్యాబ్రిక్ ఎంపికలో, ఉద్యోగుల విషయంలోనూ, డిజైనింగ్లోనూ.. ప్రతిదీ సవాల్గా ఉంటుంది. మనల్ని మనం నిరూపించుకోవాలనుకుంటే ఏమైనా సాధించగలం. - అమూల్య, అమూల్య అండ్ కృష్ణ కొచర్ పనిలో ప్రత్యేకత చూపాలికేక్ బేకింగ్ తయారు చేసేటప్పుడు నా చుట్టూ ఉన్నవారు ‘ఇప్పటికే మార్కెట్లో చాలామంది హోమ్ మేకర్స్ ఉన్నారు, నీవేం సక్సెస్ అవుతావు’ అన్నారు. కానీ, వారి మాటలు పట్టించుకోలేదు. నా హార్డ్ వర్క్నే నమ్ముకున్నాను. కస్టమైజ్డ్ కేక్స్ హాఫ్ కేజీవి కూడా తయారు చేస్తాను. ఎగ్లెస్ డిజర్ట్స్ కేక్స్ మా ప్రత్యేకత. మొదట మా కమ్యూనిటీలోని వారికే చేసేదాన్ని. వాటిని ఇన్స్టాగ్రామ్లో ΄ోస్ట్ చేయడం, ఆ తర్వాత ఒక్కో ఆర్డర్ రావడం మొదలయ్యింది. టైమ్ ప్రకారం డెలివరీ చేసేదాన్ని. ఒకసారి ఒక జంటకు వారి బేబీ షవర్కి బహుమతులు ఆర్డర్పై అందించాను. ఇటీవల వారి రెండవ బేబీ షవర్ కోసం అతిథులకు ప్రత్యేకమైన కేక్ వర్క్షాప్ నిర్వహించాను. దాదాపు 400 మంది కస్టమర్లు ఆర్డర్స్ ఇస్తుంటారు. ఫైనాన్స్ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేశాను. నాదైన సొంత ఆలోచనతో స్టార్టప్ నడ΄ాలని బేకింగ్ తయారీ మొదలుపెట్టాను. సక్సెస్ అవుతుందా అనే ఆలోచన లేకుండా, ఆందోళన పడకుండా రుచికరమైన కేక్స్ తయారుచేసివ్వడంలోనే దృష్టిపెట్టాను. – రాధిక, ఆర్బేక్ హౌజ్ఇదీ చదవండి: 13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్లో టాపర్గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
ఎట్టకేలకు ప్రియాంక బరిలోకి : ఇందిర వారసత్వాన్ని నిలుపుకుంటుందా?
కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. తమ ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నెరవేరబోతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా, తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించిన, రాజకీయాల్లోకి అధికారిక ప్రవేశించినప్పటికీ ఎన్నికల సమరంలోకి దూకడం మాత్రం ఇదే ప్రథమం. రాహుల్ గాంధీ విజయం సాధించి (రెండు చోట్ల గెల్చిన సందర్భంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది) కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పలువురు కాంగ్రెస్ పెద్ద సమక్షంలో బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రియాంక గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె. ఆమె ముత్తాత దివంగత జవహర్ లాల్ నెహ్రూ , దేశానికి స్వాతంత్ర ఉద్యమ నేత. దేశ తొలి ప్రధానమంత్రి. ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ నెహ్రూ అడుగుజాడల్లో నడిచినవారే. ఇద్దరూ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేసిన వారే. అంతేకాదు ఇద్దరూ పీఎంలుగా పదవిలో ఉన్నపుడే హత్యకు గురయ్యారు. 1984లో కేవలం 12 సంవత్సరాల వయస్సులో, నానమ్మ ఇందిర అంగరక్షకులచే హత్యకు గురి కావడాన్ని చూసింది., రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ దుఃఖంనుంచి తేరుకోకముందే ఏడేళ్లకు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పొగొట్టుకుంది. అప్పటికి ప్రియాంకకు కేవలం 19 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తల్లికి, సోదరుడుకి అండగా నిలబడింది. ఆ సమయంలోనే ఇందిర గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకున్నారు. ఇక ప్రియాంక 25 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో పెళ్లి తరువాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంది. బిడ్డల పెంపకంలో నిమగ్నమైంది.అయితే 1990ల చివరి నాటికి, కాంగ్రెస్ కష్టాలు మొదలైనాయి. ప్రియాంక రంగంలోకి దిగినప్పటికీ ఆమె పాత్ర తెరవెనుకకు మాత్రమే పరిమితమైంది. సోదరుడు రాహుల్కు మద్దతు ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరోక్షంగా రాహుల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన రాజకీయ నైపుణ్యం, ప్రజలతోసులువుగా మమేకం కావడం సీనియర్ నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. స్టార్ క్యాంపెయినర్గా నిలిచింది. బ్యాక్రూమ్ వ్యూహకర్తగా, ట్రబుల్షూటర్గా, కాంగ్రెస్కు టాలిస్ మాన్గా పేరు తెచ్చుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంది. దీంతో ముఖ్యంగా పేద ప్రజలతో ఆమెలో అలనాటి ఇందిరమ్మను చూశారు.అంతేకాదు సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల ఆమె స్పందించిన తీరు, చూపించిన పరిణితి ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా 2008లో, ఆమె తన తండ్రి ,రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, ఆమెతో సంభాషించడం విశేషంగా నిలిచింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని రాయబరేలీలో సోదరుడు రాహుల్ని, అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మను గెలిపించి అమేథీని దక్కించుకుని పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. చివరికి ఇన్నాళ్లకు కేరళనుంచి ఎన్నికల సమరంలోకి దిగింది ప్రియాంక గాంధీ వాద్రా. అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిదా గాంధీ వారసత్వాన్ని నిలుబెట్టుకుందా? ప్రజల ఆదరణను నోచుకుంటుందా? బహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రియాంక చదువు,కుటుంబం1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ.మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రాపై మనీ లాండరింగ్, వివాదాస్పద భూముల కొనుగోళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వాద్రా ఖండిచారు. అలాగే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవని పార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. -
ఒక్క రోజు అమ్మాయిలకు అధికారం ఇస్తే..సూపర్ సక్సెస్!
దసరా నవరాత్రుల సందర్భంగాఉత్తర ప్రదేశ్లో హఠాత్తుగా పది జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు.అందరూ హైస్కూల్ గర్ల్ స్టూడెంట్లే. ‘జనతా దర్శన్’ పేరుతో సాగే ప్రజా దర్బార్లలో పాల్గొని సమస్యలు విని పరిష్కారాలకోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఉత్తుత్తికి కాదు.స్త్రీ శక్తి నిరూపణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచాలా సీరియస్గా నిర్వహించిన ‘ఆడపిల్లలకు ఒక రోజు అధికారం’ కార్యక్రమంలోజిల్లా యంత్రాంగం చేతులు కట్టుకుని వారి మాట వింది.ఈ అమ్మాయిలు ఈ అనుభవంతో ఐ.ఏ.ఎస్ కావాలనే తలంపునకు వచ్చారు. ప్రతి రాష్ట్రం ఇలాంటి ప్రయత్నం చేయాలి. అమ్మాయిలు చదువుకోవడం, విదేశాలకు వెళ్లి పై చదువులు చదవడం, మగవారికి మాత్రమే సాధ్యమయ్యే ఉద్యోగాలు తామూ చేయడం చూస్తూనే ఉన్నాం. చరిత్రలో మొదటిసారి అమెరికాలో అధ్యక్షపదవికి ఒక మహిళ పోటీ పడటం వరకూ ఈ మహిళా చైతన్యం సాగింది. అయినప్పటికీ మహిళల పట్ల వివక్ష, కుటుంబాలలో మగ పిల్లాడికి దక్క ప్రాధాన్యం, చదివించే విషయంలో అబ్బాయిలకు మంచి కోర్సు అమ్మాయిలకు అప్రధానమైన కోర్సు దేశంలో సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి మైండ్సెట్ని మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘శక్తి మిషన్’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. మహిళల స్వావలంబనే కాదు... అమ్మాయిల ఆత్మవిశ్వాసం పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో మరో ముఖ్యమైన కార్యక్రమం ‘అమ్మాయిలకు ఒకరోజు అధికారం’. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొన్నటి అక్టోబర్ 12న దాదాపు పది జిల్లాలలో ఈ కార్యక్రమం కింద ఇంటర్ లోపు చదువుతున్న అమ్మాయిలకు జిల్లా కలెక్టర్గా, ఎస్.పి.గా, సి.డి.ఓ. (చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా) పూర్తి అధికారాలు ఇచ్చారు. సర్వోన్నత ఉద్యోగాల్లో ఉంటే పేదవారికి, బలహీనులకు ఎలా న్యాయం చేయవచ్చో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు తెలియచేయడమే కాదు... వారు అధికారంలో ఉంటే మిగిలిన సిబ్బంది ఎలా వ్యవహరిస్తారో నిజంగా చేసి చూపించారు. ఆ విధంగా ఇదో స్ఫూర్తినిచ్చే కార్యక్రమం.కూరగాయల రేట్లు ఇవా?లక్ష్మీపూర్ ఖేరి జిల్లాకు ఎనిమిదవ తరగతి చదువుతున్న అగరిమ ధావన్ ఒకరోజు కలెక్టర్ అయ్యింది. ఆమె ఆ రోజు తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలు వింది. అందులో భాగంగా కూరగాయల రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నామన్న ఫిర్యాదు వింది. వెంటనే కింది స్థాయి అధికారులను పిలిచి ‘కూరగాయల రేట్లు ఇలా ఉంటే ఎలా? వీటిని క్రమబద్ధీకరించరా?’ అని ప్రశ్నించి వాటి అదుపునకు చర్యలు తీసుకోమంది. వెంటనే అందుకు తగిన చర్యలు మొదలయ్యాయి. జౌన్పూర్ జిల్లాకు ఇంటర్ చదువుతున్న సాజల్ గుప్తా కలెక్టర్ అయ్యింది. ప్రజాదర్బార్ లో 87 ఫిర్యాదులు ఆమె వద్దకు వచ్చాయి. వాటిలో 14 ఫిర్యాదులను అక్కడిక్కడే ఆమె పరిష్కరించింది తన అధికారాలతో. ఇక మహరాజ్ గంజ్కు కలెక్టర్ అయిన నిధి యాదవ్ అనే అమ్మాయి ఆ ప్రాంత వాసులకు రావాల్సిన (హైవే నిర్మాణం వల్ల) నష్టపరిహారాన్ని అప్పటికప్పుడు మంజూరయ్యేలా చేసింది. అదే జిల్లాకు ఎస్.పి.గా అధికారాలు స్వీకరించిన గోల్టీ అనే అమ్మాయి తన పరిధిలోని స్టేషన్లలో ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్న కేసులను మొదటగా ఇన్వెస్టిగేట్ చేసి పరిష్కరించాలని గట్టి ఆదేశాలు ఇచ్చింది. మిర్జాపూర్, ఘాజీపూర్, షామ్లీ, శ్రావస్థి, బాందా తదితర జిల్లాలలో కూడా ఆ జిల్లాల్లో చురుగ్గా చదువుతున్న అమ్మాయిలను ఎంపిక చేసి కలెక్టర్, ఎస్.పి. బాధ్యతలు అప్పజెప్తే వారు ఒక రోజంతా అద్భుతంగా బాధ్యతలు నిర్వహించడమే కాదు... విజిట్లకు కూడా వెళ్లారు.ఒక రోజు ఆఫీసర్ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలో అర్జున్ ఒక్క రోజు కోసం సి.ఎం. అయినా అతని నిర్ణయాలన్నీ అమలవుతాయి. ఇక్కడ కూడా ఈ అమ్మాయిలు తీసుకున్న నిర్ణయాలు అమలయ్యాయి. అమలు అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో తాసిల్దార్లుగా కూడా అమ్మాయిలను నియమించారు ఒకరోజు కోసం. కలెక్టర్గా నియమితమైన అమ్మాయి, తాసిల్దార్లుగా నియమితమైన అమ్మాయిలు కలిసి మాట్లాడుకుని ఆ రోజున తమ టేబుళ్ల మీద ఉన్న సమస్యలను చకచకా పరిష్కరించడం అందరినీ ఆకర్షించింది. ఎస్.పి.గా చేసిన అమ్మాయిలు కొందరు ఎఫ్ఐఆర్ల మీద కూడా సంతకాలు చేశారు.కలెక్టర్లమవుతాంఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మాయిలందరూ ప్రజల సమస్యలు విన్నారు. తాము బాగా చదువుకున్న ఆ సమస్యలను పరిష్కరించే అధికార స్థానంలో వెళ్లవచ్చని గ్రహించారు. ‘మేము బాగా చదువుకుంటాం’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ సందర్భంగా వీరందరూ కాన్వాయ్లలో ఆఫీసులకు చేరుకున్నారు. వీరందరూ భవిష్యత్తులో ఇంతకుమించిన బాధ్యతాయుత స్థానాల్లోకి వెళ్లాలని కోరుకుందాం. -
దేశంలోనే తొలి ట్రాన్స్ఉమెన్ డైరెక్టర్ సంయుక్త విజయన్ సక్సెస్ స్టోరీ
పొల్లాచ్చిలో పుట్టి శాన్ఫ్రాన్సిస్కోలో స్థిరపడిన ఈ ట్రాన్స్ ఉమన్ మన దేశ తొలి ట్రాన్స్ ఉమన్ డైరెక్టర్గా చరిత్రకు ఎక్కింది. పురుషుడిగా పుట్టి స్త్రీగా మారడానికి ఎన్ని అవస్థలు పడిందో ఆ ఘర్షణను ‘నీల నిర సూర్యన్’ పేరుతో సినిమా తీయడమే కాదు ముఖ్యపాత్ర పోషించింది. నేడు ఈ చిత్రం విడుదల సందర్భంగా సంయుక్త పరిచయం. 2016.తమిళనాడు–తిరుచ్చిలోని సొంత ఇంటికి దీపావళి పండక్కు వచ్చిన సంతోష్ అమెరికాకు తిరిగి వెళుతూ ‘అమ్మా... వచ్చే దీపావళికి నేను అమ్మాయిగా వస్తాను’ అని చెప్పాడు. తల్లి ఉలిక్కి పడలేదు. కన్నీరు కార్చలేదు. ‘నీ ఇష్టంరా. నీకెలా సంతోషంగా ఉంటే అలా చెయ్’ అంది. అమెరికాకు వెళ్లాక సంతోష్ ట్రాన్స్ ఉమన్గా మారడానికి అవసరమైన వైద్యం, చికిత్సలు చేయించుకున్నాడు. శనివారం వరకూ అబ్బాయి రూపంలోనే వెళ్లిన సంతోష్ సోమవారం నుంచి ‘సంయుక్త’ గా ఆఫీస్లో అడుగు‘పెట్టింది’. అయితే స్నేహితులు ఎటువంటి తేడా చూపించలేదు. అబ్బాయి సంతోష్తో ఎంత స్నేహంగా ఉన్నారో అమ్మాయి సంయుక్తతో అంత స్నేహంగా ఉన్నారు. ‘అందరి కథ ఇంత సులువుగా ఉండదు. అందుకే సినిమా తీశాను’ అంటుంది సంయుక్త.బీటెక్ గ్రాడ్యుయేట్సంయుక్త తండ్రి టైలర్. తల్లి గృహిణి. ముగ్గురు కుమారుల్లో ఒకడుగా పుట్టాడు సంతోష్. ‘అయితే నా భౌతిక రూపానికి నా మానసిక స్వభావానికి పొంతన కుదరలేదు. నాలోని స్త్రీనే నేను స్వీకరించాను. నా తల్లిదండ్రులు ఇందుకు నన్ను ఇబ్బంది పెట్టకపోయినా బయట నేను సంప్రదాయవాదుల గేలిని, అల్లరిని, అవమానాన్ని భరించాను. ట్రాన్స్పర్సన్ల జీవితం వెండి తెర మీద రావడం తక్కువ. మగవాళ్లు కొందరు ఆ పాత్రలు ధరించారు. ఇటీవల ‘తాలి’ సినిమాలో సుస్మితా సేన్ బాగా చేసింది. కాని నేను ట్రాన్స్ఉమన్గా ఉంటూ సినిమా తీయడం వల్ల మేమూ ఇండస్ట్రీలో మా కథలు చెప్పగలం అని నిరూపించదలుచు కున్నాను’ అంటుంది సంయుక్త.సినిమా అంటే తెలియకపోయినా...‘మా పొల్లాచ్చిలో రోజూ షూటింగ్లే. కాని ఏవీ నేను చూడలేదు. షార్ట్ఫిల్మ్లు తీయలేదు. అసిస్టెంట్గా పని చేయలేదు. 2020లో నేను సినిమా తీయాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ ఎలా రాయాలన్న సంగతిని యూట్యూబ్ పాఠాల ద్వారా తెలుసుకున్నాను. వందల వీడియోలు చూసి రెండేళ్ల పాటు స్క్రిప్ట్ రాశాను. నా జీవితాన్ని, నావంటి వారి జీవితంలోని ఘటనలను కలిపి ‘నీల నిర సూర్యన్’ సినిమా తీశాను. అంటే నీలి రంగు సూర్యుడు అని అర్థం. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ది బ్లూ సన్షైన్’ పేరుతో ప్రదర్శితమవుతుంది. తమిళ విడుదల కోసం తమిళ పేరు పెట్టాను’ అని తెలిపింది సంయుక్త.సొంత డబ్బు పెట్టి...సంయుక్త అమెరికాలో అమేజాన్లో ఉన్నత ఉద్యోగంలో ఉంది. తన సంపాదనలోని కొంత భాగాన్ని ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది. ‘సినిమాల్లో థర్డ్ జెండర్ని హాస్యానికే వాడి అపచారం చేశారు. ఇక మీదైనా ట్రాన్స్పర్సన్లను మర్యాదకరమైన రీతిలో ఇన్క్లూజివ్గా చూపి చేసిన పాపాన్ని కడుక్కోవాలి సినిమావారు. పరిస్థితి ఇంకా చిన్న ఊళ్లలో మారలేదు. ఉదాహరణకు ఒక స్కూల్లో టీచర్ని పిల్లలు గౌరవిస్తారు. కాని ఆ టీచర్ ట్రాన్స్ ఉమన్ అయితే తేడా వచ్చేస్తుంది. ఈ పరిస్థితి ΄ోవాలి. నేను తీసిన సినిమా కథ మాలాంటి వాళ్ల అస్తిత్వాన్ని గౌరవించవలసిందిగా అర్థం చేసుకోమని కోరుతుంది’ అందామె.స్త్రీగా మాత్రమేసంయుక్త తనను తాను స్త్రీగా తప్ప ట్రాన్స్జెండర్గా చెప్పడానికి అంగీకరించదు. ‘నేను స్త్రీగా మారదల్చుకున్నాను. మారాను. కనుక నా ఆధార్ కార్డులో స్త్రీ అనే ఉంది. ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాల కోసం ట్రాన్స్జెండర్ అనే అస్తిత్వం అవసరమైతే దానిని కొందరు స్వీకరించవచ్చు. కాని నేను పూర్తిగా స్త్రీ అస్తిత్వంతో ఉండాలని కోరుకుంటాను’ అంటుంది సంయుక్త. ఆమె మంచి భరతనాట్య కళాకారిణి. చెన్నయ్లో ఆరంగేట్రం చేస్తే చాలామంది మెచ్చుకున్నారు. విస్మరణకు గురైన జీవితాలకు సంబంధించి ఇవాళ అనేక సినిమాలు వస్తున్నాయి. సంయుక్త విజయన్ తీసిన ‘నీల నిర సూర్యన్’ మరో ముఖ్యమైన కథను చెబుతోంది. మరిన్ని కథలు సంయుక్త నుంచి మనం చూడొచ్చు.‘మా కథలు మేము చెప్పుకోవడం ఈ దేశంలో అంత సులువు కాదు’ అంటుంది సంయుక్త విజయన్. -
ఏరియల్ ఆర్ట్ : ఆకాశమే హద్దుకళ
అథ్లెటిసిజం కలగలసి వైమానిక విన్యాసాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. చూడటానికి జిమ్నాస్ట్గా అనిపిస్తూనే ఆకాశంలో హరివిల్లులా మారే నృత్యప్రదర్శన ఓ అద్భుత ప్రకియగా అందరి మనసులను ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర ప్రభుత్వ క్రీడా అవార్డును గెలుచుకున్న తర్వాత, అదితి దేశ్పాండే ప్రజలకు వైమానిక విన్యాసాలలో శిక్షణ ఇస్తోంది. ముంబైలోని తన అకాడమీ ఫ్లై హై ఏరియల్ ఆర్ట్ గురించి దేశ్పాండే మాట్లాడుతూ, ‘ఒక వ్యక్తి జిమ్కి వెళ్లినట్లుగానే, చాలామంది ఏరియల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని.. ఆఫీసులు, స్కూళ్ల టైమ్ తర్వాత శిక్షణ కోసం క్లాసులకు రావాలని కోరుకుంటున్నారని’ చెబుతోంది. శరీర బరువులో సమతుల్యతసిల్క్ ఫ్యాబ్రిక్, హూప్స్, తాళ్లు లేదా ట్రాపెజెస్ని ఉపయోగించి గాలిలో నృత్యం చేసిన వ్యక్తులు ఉన్నారు. ఈ డ్యాన్స్ సంగీతంతో సెట్ చేసి ఉంటుంది. ప్రదర్శనలు చేయడానికి వ్యక్తుల బలం, సౌలభ్యాన్ని మిళితం చేసి దృశ్యంగా మార్చే అద్భుతమైన ప్రక్రియ ఇది. ఒక సాధారణ వ్యక్తి ఈ విన్యాసాలను చాలావరకు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా చేయడానికి తన పూర్తి బలాన్ని ఉపయోగిస్తాడు. వైమానిక స్కిల్స్ ప్రదర్శించే సమయంలో వెనుక కండరాలను ఉపయోగిస్తాడు. దీనికి శరీర బరువులో ఒక సమతుల్యతను తీసుకురావాల్సి ఉంటుంది’అని వివరిస్తుంది దేశ్పాండే ఎలా చేస్తారంటే...ఈ వైమానిక ప్రదర్శనలో డ్రాప్స్, రోజులు, స్పిన్లను అమలు చేయడానికి ముందు వ్యక్తులు తమను తాము ఫాబ్రిక్లో చుట్టుకుంటారు. ఏరియల్ రోప్ అనేది లైక్రాతో తయారు చేయబడిన వృత్తాకార ఉపకరణం. దీనిని కళాకారులు విన్యాసాలను ప్రదర్శించడానికి ఉపయోగిస్తారు. ట్రాపెజ్ అనేది తాళ్లు, తీగలతో చేసేది. ఇక్కడ ప్రదర్శనకారులు గాలిలో ఊగుతూ విన్యాసాలు చేస్తారు. స్ట్రాప్స్లో కళాకారులు సీలింగ్కు జోడించిన పట్టీలపై ప్రదర్శనలు చేస్తారు. అక్టోబర్లో ఢిల్లీలోని స్విస్ దగ్గర ప్రదర్శనస్విస్ కళాకారుడు జాసన్ బ్రూగర్, భారతీయ హులా హూప్ ప్రాక్టీషనర్ ఎష్నా కుట్టి అక్టోబర్ 2024లో న్యూ ఢిల్లీలోని స్విస్ రాయబార కార్యాలయంలో రెండు దేశాలు 75 సంవత్సరాల స్నేహాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రదర్శన ఇవ్వనున్నారు. వైమానిక కళలకు ‘ఉన్నత స్థాయి సాంకేతికత అవసరం కాబట్టి ఇది కచ్చితంగా జిమ్నాస్టిక్స్ వంటి క్రీడలతో పోల్చవచ్చు. కానీ కదలిక, సంగీతం, కోర్సు సాంకేతికత ద్వారా కళ సృష్టించడం‘ అని బ్రూగర్ చెప్పారు. ‘వేదికపై ఉన్నప్పుడు నా వ్యక్తిగత లక్ష్యం నా శరీరం ఏమి చేయగలదో చూపించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం‘ అంటారు. వైమానిక కళ అందరికీ అందుబాటులో ఉందా?అహ్మదాబాద్లోని ఏరియల్ ఆర్ట్స్ ఇండియా అకాడమీ వ్యవస్థాపకుడు మాస్టర్ ట్రైనర్ అయిన జీల్ సోనీ– ‘మా దగ్గర 55 ఏళ్ల వ్యక్తి నుండి 12 ఏళ్ల అమ్మాయి వరకు ప్రతి ఒక్కరూ ఈ ఏరియల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ప్రజలు కొంచెం సాహసం చేయాలని చూస్తున్నందున జిమ్కి వెళ్లకుండా ఏరియల్ ఆర్ట్లను ఎంచుకుంటారు. పరికరాలు, మౌలిక సదు΄ాయాల విషయానికొస్తే క్రాష్ మ్యాట్లు, ప్రథమ చికిత్స, సేఫ్టీ గ్రిప్ ఎయిడ్ నుండి అన్నింటినీ అందిస్తాం’ అని చెబుతోంది.ఖర్చు ఎంతంటే..! సోని ఎనిమిది వైమానిక కళల శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల టైమ్ పడుతుంది. ఒకటి నుండి నాలుగు స్థాయిలు వైమానిక కళలను పరిచయం చేస్తాయి. ఐదు నుండి ఎనిమిది ఋత్తిపరమైన స్థాయి లు. ప్రతి పరిచయ స్థాయి శిక్షణకు ఒకటిన్నర నెలలకు సుమారు రూ. 6,500, ప్రతి ఉన్నత స్థాయికి మూడు నెలలకు రూ. 13,500 ఖర్చు అవుతుంది. సృజనాత్మకత, శిక్షణ, కఠినమైన మనస్తత్వం కూడా ఈ కళకు చాలా ముఖ్యమైనవి. మంచి కోచ్తో పని చేస్తే సరైన శిక్షణ లభిస్తుంది. సర్కస్లు, డ్యాన్స్ షోలు లేదా థియేటర్లలో ప్రదర్శించే ఏరియల్ ఆర్టిస్టులకు రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల వరకు చెల్లిస్తారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ, పూణేలోని స్టూడియోలు సెషన్ల సంఖ్య ఆధారంగా తరచుగా ప్యాకేజీలుగా ఉండే తరగతులను అందిస్తాయి. ప్లేస్, శిక్షణ రకం, కోచ్, కోర్సు వ్యవధి ఆధారంగా ట్రెయినింగ్ ఫీజు ఉంటుంది. -
మునుపటి కాలం కాదు ఇది, కానీ..
మునుపటి కాలం కాదు ఇది. సెలవులు, తీరిక దొరకగానే ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావాలనుకోవడం లేదు మహిళలు. సోలో ట్రావెలర్స్గా అవుట్డోర్ థ్రిల్స్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కోణంలో చూస్తే....‘ఆహా... ఎంత మార్పు’ అనిపిస్తుంది. మరో కోణంలో చూస్తే అవుట్డోర్ అడ్వెంచర్లలో మహిళలకు సౌకర్యాలు, భద్రతాపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి..గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో మహిళా సాహస బృందాలు, సోలో ఉమెన్ ట్రావెలర్లు పెరిగారు. చాలామంది మహిళలు సెలవుల్లో ఇంటికి పరిమితం కావడానికి బదులు అవుట్డోర్ థ్రిల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మన దేశంలో పర్వతారోహణ, స్కీయింగ్, స్కూబా డైవింగ్, పారాగ్లైడింగ్... మొదలైన సాహస విభాగాల్లో శిక్షణను అందించే సంస్థల నుండి ప్రతి సంవత్సరం మహిళలు పెద్ద సంఖ్యలో శిక్షణ తీసుకుంటున్నారు. అయినప్పటికీ..మహిళల నేతృత్వంలోని అడ్వెంచర్ టూరిజం కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. టూరిజం ఇండస్ట్రీ ఉమెన్ ట్రావెలర్ల అవసరాలను పూర్తిగా తీర్చడం లేదు. మహిళా గైడ్లు, సహాయ సిబ్బంది కొరత గణనీయంగా ఉంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే మహిళా గైడ్లను నియమించుకుంటున్నాయి. ‘గైడ్ అంటే పురుషులు మాత్రమే’ అనే భావనను పునర్నిర్వచించడమే కాకుండా మహిళా ప్రయాణికులకు భరోసాగా నిలుస్తున్నారు ఫిమేల్ గైడ్లు. మారుమూల ప్రాంతాలలో సౌకర్యవంతమైన వాతావరణానికి కృషి చేస్తున్నారు.మహిళా భద్రతా కోణంలో జెండర్ సెన్సివిటీ ట్రైనింగ్ అనేది కీలకంగా మారింది. ఈ శిక్షణ మేల్ గైడ్స్ ‘జెండర్ డైనిమిక్స్’ను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు లైంగిక వేధింపులను నివారించడానికి సహాయపడుతుంది. భద్రత, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ట్రావెలర్స్కు అవసరమయ్యే ఎక్విప్మెంట్ను రూపొందించాల్సిన బాధ్యత టూరిజం కంపెనీలపై ఉంది. శానిటరీ ప్రొడక్ట్స్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ కోసం పెయిన్ రిలీఫ్ మందులు, ఆరోగ్యం, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్టాండర్డ్ మెడికల్ కిట్లు అందుబాటులోకి తేవాలి. ‘సోలో ట్రావెలర్, అవుట్ డోర్ ప్రొఫెషనల్గా ఎన్నోసార్లు అసౌకర్యానికి గురయ్యాను. మహిళల సాహస ప్రయాణాలలో మౌలిక సదుపాయాల తక్షణ అవసరం ఉంది’ అంటుంది మౌంటెనీర్, ఎంటర్ప్రెన్యూర్ అనూష సుబ్రమణ్యియన్.ఇలా అంటున్నారు.. ఇటీవల ఒక సంస్థ సోలో ఉమెన్ ట్రావెలర్స్ గురించి నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 29 శాతం మంది భద్రత గురించి ఆందోళన చెందారు. మరో 29 శాతం మంది శారీరక సౌకర్యం (ఫిజికల్ కంఫర్ట్), 23 శాతం మంది వెహికిల్ బ్రేక్డౌన్స్, 13 శాతం మంది లైంగిక వేధింపుల గురించి ఆందోళన చెందారు. ఎవరి అభిప్రాయం మాట ఎలా ఉన్నా అడ్వెంచర్ టూరిజం ఇండస్ట్రీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది అందరి నోటి నుంచి వినిపించిన మాట.ఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని హరిణి.. హక్కుల చుక్కాని!
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య. ప్రధాని కావడానికి ముందు పార్లమెంట్ సభ్యురాలు. ఎంపీ కావడానికి ముందు లెక్చరర్. లెక్చరర్కు ముందు, లెక్చరర్ అయిన తరువాత స్త్రీవాదం, నిరుద్యోగం, లింగ వివక్ష... ఇలా ఎన్నో సామాజిక అంశాలపై హక్కుల కార్యకర్తగా తన గొంతును బలంగా వినిపించింది. సమస్యలు తెలిసిన... సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ప్రధాని అయితే ఆ పాలన దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చరిత్ర నిరూపించింది. ‘ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రయాణంతో శ్రీలంకలో మరో చరిత్ర మొదలుకానుంది’ అనే ఆశారేఖలు వెల్లివిరుస్తున్నాయి...కొలంబోలో పుట్టి పెరిగిన హరిణి అమరసూర్య హిందూ కాలేజ్, దిల్లీ యూనివర్శిటీలో బి.ఎ, సిడ్నీలోని మక్వరీ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ అండ్ డెవలప్మెంట్లో ఎం.ఎ, ఎడిన్బరో యూనివర్శిటీలో సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసింది. యూత్, పాలిటిక్స్, యాక్టివిజం, జెండర్, డెవలప్మెంట్, శిశు సంరక్షణ, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్... ఇలా ఎన్నో అంశాలపై లోతైన పరిశోధన చేసింది. పుస్తకాలు రాసింది. డిగ్రీ తరువాత శ్రీలంకలోని మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నెస్ట్’తో కలిసి పనిచేసింది హరిణి. ‘నెస్ట్’ వ్యవస్థాపకురాలైన సాలీ హులుగల్లే అట్టడుగు, అణగారిన వర్గాల కోసం పనిచేసింది. ‘నెస్ట్’ ద్వారా ఎంతో మార్పు తీసుకురాగలిగింది. ఆమె ప్రభావంతో మానసిక వైద్యశాలలలో ఎంతోకాలంగా దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న దీనులు, ఎవరూ పట్టించుకోని హెచ్ఐవీ బాధితులు, అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది హరిణి.చైల్డ్ ప్రొటెక్షన్, సైకలాజికల్ ప్రాక్టీషనర్గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన తరువాత శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో లెక్చరర్గా చేరింది. యాక్టివిస్ట్గా ఉచిత విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. ‘ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్’ సభ్యురాలైన హరిణి లింగసమానత్వం నుంచి జంతుసంక్షేమం వరకు ఎన్నో అంశాలపై తన గళాన్ని వినిపించింది.ఇక రాజకీయాల విషయానికి వస్తే... 2019లో ‘నేషనల్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్’లో చేరిన హరిణి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) అభ్యర్థి అనురా కుమార దిస్సానాయకే తరఫున ప్రచారం చేసింది. 2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల తరువాత ఎంపీగా పార్లమెంట్లోకి అడుగుపెట్టింది. ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అత్యున్నత పదవి విషయంలో ‘సరిౖయెన వ్యక్తి’ అనే ప్రశంస చాలా తక్కువమందికి లభిస్తుంది. ఇలాంటి వారిలో 54 సంవత్సరాల హరిణి అమరసూర్య ఒకరు. ‘ప్రధానిగా ఆమె సరిౖయెన వ్యక్తి’ అనేది ఇప్పుడు చాలామంది నోట వినిపిస్తున్న మాట.సమాజం అనే పుస్తకాన్ని చదివి..హరిణికి ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఇష్టం. ‘ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఉంది’ అంటూ నాన్న స్నేహితుడైన మాజీ దౌత్యవేత్త దగ్గర తన మనసులో మాట బయటపెట్టింది. మొదట ఆయన ఎగతాళిగా నవ్వినా ఆ తరువాత మాత్రం ఆంగ్ల సాహిత్యంలోని ఎంతో మంది దిగ్గజ రచయితలను పరిచయం చేశాడు. వారి రచనలు చదువుతుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ‘ఆంగ్ల సాహిత్యంలోకి అడుగు పెట్టిన తరువాత నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. ఆ తరువాత కాలంలో సాహిత్య అధ్యయనం కంటే నా చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలనిపించింది’ అంటుంది హరిణి. పుస్తక ప్రపంచంలో కంటే సామాజిక ప్రపంచంలోనే ఆమెకు ఎక్కువ విషయాలు తెలిసాయి. నిరుద్యోగం నుంచి లింగ వివక్ష వరకు ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె ఉద్యమకారిణిగా ప్రయాణంప్రారంభించడానికి, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ‘సమాజం’ అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది.అవును... ఆమె దిల్లీ స్టూడెంట్!‘హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయిన హరిణి శ్రీలంక ప్రధాని కావడం మా కళాశాలకు గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. హరిణి సాధించిన విజయం మా కళాశాల చరిత్రలో మరో మైలురాయి. హిందూ కళాశాలలో హరిణి గడిపిన కాలం ఆమె నాయకత్వానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ. హరిణి హిందూ కాలేజీలో 1991 నుండి 1994 వరకు చదివింది. బాలీవుడ్ దర్శకుడు నళిన్ రాజన్సింగ్ హిందూ కాలేజీలో హరిణి బ్యాచ్ మేట్.‘కాలేజీ ఉత్సవాలు, చర్చలలో హరిణి చురుగ్గా పాల్గొనేది. ఆమె ప్రధాని స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది’ అంటున్నాడు నళిన్ రాజన్సింగ్.ఇవి చదవండి: మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ -
మనసులో కుంచె ముంచి..
కళ సామాజిక ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి బోలెడు మ్యాటర్ ఉంది. ‘వ్యక్తిగతం’ మాట ఏమిటి? అనే విషయానికి వస్తే...‘కళ అద్భుత ఔషధం’ అంటున్నారు అమెరికాలోని బాల్టిమోర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్వేతారావు గార్గ్.‘ఒత్తిడిని చిత్తు చేయడానికి, ఉత్సాహాన్ని శక్తిగా చేసుకోవడానికి కళ బలమైన ఔషధంలా ఉపయోగ పడుతుంది’ అంటున్న శ్వేతారావు గార్గ్ బోధకురాలు, రచయిత్రి, ఆర్టిస్ట్. శ్వేతారావు గార్గ్ కాలేజీ రోజుల్లోకి వెళితే...‘ఒత్తిడి నుంచి బయటపడాలి’‘మనసుకు కాస్త ఉత్సాహం కావాలి’ అనుకున్నప్పుడల్లా ఆమె చేసే పని... కలాన్ని చేతిలోకి తీసుకొని తన మనసులోని భావాలను కాగితంపై పెట్టడం. లేదా కుంచె తీసుకొని రంగు రంగుల చిత్రాలు వేయడం. ఈ ఉపశమనం, ఉత్సాహాన్ని ఇచ్చే పని కళాప్రపంచంలో తనకు చోటు కల్పిస్తుందని శ్వేత ఊహించి ఉండదు.మొదట్లో తాను వేసిన చిత్రాలను ఇతరులకు చూపించేది కాదు. వాటిని రహస్యంగా దాచేది. వివిధ కారణాల వల్ల రచనలు చేయడానికి, బొమ్మలు వేయడానికి దూరమైన శ్వేత మళ్లీ కళాప్రపంచంలోకి వచ్చింది. అప్పుడు తనకు ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. బొమ్మలు వేయడమే కాదు నవలలు రాసే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది.రచనలు చేస్తున్న కొద్దీ, బొమ్మలు వేస్తున్న కొద్దీ తనమీద తనకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘వీటిని రహస్యంగా దాచుకోవడం ఎందుకు! ప్రపంచానికి చూపించాలి’ అనుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ రచనలు, చిత్రాలను అధ్యయనం చేసిన శ్వేత అనుకరణ నీడల్లోకి వెళ్లకుండా తనదైన సొంత శైలిని సృష్టించుకుంది.వంటగది నుంచి పిల్లల పెంపకం వరకు మహిళల దైనందిన జీవితంలో రకరకాల ఘట్టాలను కథలుగా మలిచింది. శ్వేత కళాత్మక సాధనలో ‘స్త్రీవాదం’ అనేది ప్రధాన అంశంగా మారింది. ఆమె రచనల్లో స్త్రీ ΄ాత్రలు పరాధీనంగా, బేలగా, నిస్సహాయంగా కనిపించవు. పురుషాధిపత్య ధోరణులను సవాలు చేసేలా, స్వతంత్య్రవ్యక్తిత్వంతో కనిపిస్తాయి. నిత్య ఉత్సాహంతో శక్తిమంతంగా కనిపిస్తాయి.ఇక చిత్రకళ విషయానికి వస్తే శ్వేత ఏ ఆర్ట్ స్కూల్లోనూ పట్టా పుచ్చుకోలేదు. అయితే విన్సెంట్ వాన్ గోహ్ నుంచి అమృతా షేర్గిల్ వరకు ఎంతోమంది చిత్రకారులతో మౌనసంభాషణ చేస్తూనే ఉంటుంది. తనదైన విలక్షణ దృశ్యభాషను సృష్టించుకోవడానికి సాధన చేస్తూనే ఉంటుంది.‘కాలేజీ రోజుల నుంచి నా భావాల వ్యక్తీకరణకు కళ అనేది బలమైన మాధ్యమంగా ఉపయోగపడింది. కథ అయినా కవిత్వం అయినా చిత్రం అయినా కొత్త కోణంలో కనిపించాలనుకుంటాను’ అంటుంది శ్వేత.బోధన, పరిశోధన, కళలలో తనకు ఇష్టమైనది ఏమిటి?ఆమె మాటల్లోనే చె΄్పాలంటే... ‘అవేమీ దేనికవి ప్రత్యేకమైన ప్రపంచాలు కావు. ఉదాహరణకు నా బోధన నేను చేసే పరిశోధనపై, నా పరిశోధన నా కళపై ప్రభావితం చూపిస్తాయి. ఒకదానికొకటి ఉపకరిస్తాయి’శ్వేతారావు గార్గ్ గ్రాఫిక్ నవల ‘ది టేల్స్ ఫ్రమ్ క్యాంపస్: ఏ మిస్ గైడ్ టు కాలేజి’ క్యాంపస్ వాతావరణం కాస్తో కూస్తో పరిచయం లేని వారిని కూడా క్యాంపస్లోకి తీసుకువెళ్లి ప్రత్యక్ష అనుభవాన్ని సొంతం చేస్తుంది. లింగభేదం, వేధింపులు, వర్గ హక్కులు, కులవివక్ష... ఇలా ఎన్నో అంశాలపై స్టూడెంట్స్ ఆలోచనలు, అవగాహనను ఈ నవల ప్రతిబింబిస్తుంది. పదమూడు చాప్టర్లలో ప్రతి చాప్టర్ తరువాత వచ్చే ‘స్టాప్ అండ్ థింక్’ సెక్షన్ ఎన్నో విషయాలలో పునరాలోచనకు అవకాశం కల్పిస్తుంది. -
కర్రసాము.. మార్షల్ ఆర్ట్స్.. ఇప్పుడు 'హర్ ఘర్ దుర్గ'!
కోల్కతాలో అభయ... హైదరాబాద్లో దిశ... ఢిల్లీలో నిర్భయ. చెప్పుకుంటూ పోవడమేనా? వేదన నింపుకోవడమేనా? లేడి కొమ్ములు దిగబడిన పులి కళ్లల్లో భయం కూడా సాధ్యమే. శిక్షణ తీసుకుంటే రక్షణాయుధాన్ని వాడితే దుర్మార్గం ఆగుతుంది. దుష్టుడు మన చేత చిక్కి కటకటాల పాలవుతాడు.ఆపద వస్తే ఎవరు సహాయం చేస్తారా అని నిస్సహాయంగా చూడడం కాదు, తనను తాను రక్షించుకోవడానికి ‘ఆమె’ను సమాయత్తం చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పని చేస్తోంది. ‘హర్ ఘర్ దుర్గ’ (ప్రతి ఇంట్లో దుర్గ) అనే నినాదంతో మహిళలకు స్వీయరక్షణ ప్రచారం మొదలుపెట్టింది. అమ్మాయిలకు కరాటే, జూడోలలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఐటీఐలన్నింటిలోనూ అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం కరాటే, జూడో క్లాసులు నిర్వహించనుంది. వారంలో కనీసం రెండు గంటల సమయం శారీరక వ్యాయామం, ఆత్మరక్షణ విద్యలకు కేటాయిస్తున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంఘాల సహకారం తీసుకోనున్నట్లు తెలియచేశాయి అధికార వర్గాలు. మనదగ్గర ఈ పని ఐదేళ్ల్ల కిందటే మొదలైంది. తెలంగాణ, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తగుళ్ల స్వర్ణయాదవ్ అనే యువతి కర్రసాము నేర్చుకుని, హైదరాబాద్లో అకాడమీ స్థాపించి బాలికలకు నేర్పిస్తోంది.కర్రసాము... మార్షల్ ఆర్ట్స్స్వర్ణ యాదవ్ ఫోక్ సింగర్. పాటలు పాడడానికి ఒంటరిగా వెళ్లాల్సి వచ్చేది. ్రపోగ్రామ్ పూర్తయిన తర్వాత ఇంటికి చేరేసరికి రాత్రి పది దాటుతుంది. తనను తాను రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుందామె. మన దగ్గర కర్రసాము ఉందిగాని నేర్పించేవారు లేరు. తమిళనాడులో సిలంబం (కర్రసాము) ఆర్ట్ బాగా విస్తరించి ఉంది. తమిళనాడు వెళ్లి రెండేళ్ల కోర్సు చేశారు స్వర్ణ. తాను నేర్చుకుంటే సరిపోదు, వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు నేర్పించాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత 2019 నుంచి స్కూళ్లలో నేర్పించడం మొదలు పెట్టింది. ‘స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ’ని 2022లో రిజిస్టర్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకుంది. పది మందికి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో శిక్షకులుగా తయారు చేసి వారి సహాయంతో యూసుఫ్గూడ, ఉప్పల్, పటాన్చెరు, ఎల్బీనగర్, మాదాపూర్, కూకట్పల్లిలో ఫ్రీ క్యాంపులు నిర్వహించింది. స్కూళ్లలో కూడా ఉచితంగా నేర్పించింది.. హైదరాబాద్ నగరంలో శిక్షణ తర్వాత తమ సర్వీస్ని తెలంగాణ జిల్లాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెబుతోందామె.అబ్బాయిలకు కూడా!‘‘కర్రసాముతోపాటు మనదేశీయ యుద్ధకళలన్నింటినీ మా అకాడెమీలో పరిచయం చేయాలనేది భవిష్యత్తు ఆలోచన. రాబోయే వేసవికి పంజాబ్ మార్షల్ ఆర్ట్ ‘గట్కా’ను ప్రవేశపెడుతున్నాం. స్కూళ్లలో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్ అబ్బాయిల్లో దేహదారుఢ్యం తగినంతగా ఉండడం లేదు. స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి ఊబకాయులవుతున్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, అబ్బాయిల్లో ఫిట్నెస్ పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు స్వర్ణ యాదవ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Dr Anita Shah: ఆధ్యాత్మిక కళకూ.. ఒక చరిత్ర ఉంది!
ఆమెది హైదరాబాద్లో స్థిరపడిన గుజరాతీ కుటుంబం. ఆమె వృత్తీ, ప్రవృత్తీ రెండూ కళలను అధ్యయనం చేయడమే కావడం వల్ల భారతీయ చిత్రరీతుల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. మనదేశంలో విలసిల్లిన కళారూపాలు ఏయే దేశాల మ్యూజియాల్లో ఉన్నాయో తెలుసుకుని ప్రతి విషయాన్నీ గ్రంథస్తం చేస్తున్నారు. ఆమే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన డాక్టర్ అనితా షా, చిత్రకళల పరిశోధకురాలు.ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ (ఐసీఓఎమ్)లో కీలక సభ్యురాలిగా ప్రపంచదేశాల్లో పర్యటిస్తూ మ్యూజియాలజీ విద్యార్థులకు గెస్ట్ ఫ్యాకల్టీగా బోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మనదేశంలో విస్తరించిన వైవిధ్యభరితమైన చిత్రకళారూపాల గురించిన సమగ్రమైన వివరాలతో ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో ఆవిష్కరించారు. అమెరికా, ఇండియాల్లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రకళ మీద సదస్సులు నిర్వహిస్తున్న అనితా షా గతంలో ఆమె భర్త భరత్ షాతో కలిసి ‘త్రెడ్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో రాజస్థాన్, గుజరాత్లోని కచ్లో అభివృద్ధి చెందిన ఎంబ్రాయిడరీలతో ప్రదర్శన నిర్వహించారు.రాస్తే కావ్యం... గీస్తే చిత్రం..‘‘చిత్రం అంటే సాహిత్యాన్ని కంటితో చూపించే ప్రక్రియ. నిరక్షరాస్యులకు ఒక గ్రంథసారాన్ని బొమ్మల్లో చూపించవచ్చు. చిత్రకారులు కాలానుగుణంగా మార్పులను జోడించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో దక్కనీ– హైదరాబారీ ఆర్టిస్టులు సంయుక్తంగా కృషి చేసి గోల్డెన్ కలంకారీ పెయింటింగ్స్కు రూపకల్పన చేశారు. ఇది పద్దెనిమిదవ శతాబ్దపు చివరి రోజుల్లో అభివృద్ధి చెందింది. కళాకారుల కళానైపుణ్యం అంతా కృష్ణుడు, గోపికల రూపాలను తీర్చిదిద్దడంలో కనిపిస్తుంది. నేను శ్రీవల్లభాచార్య వల్లభ సంప్రదాయ తత్వం పుష్టిమార్గం మీద ఎక్కువగా పని చేశాను.వల్లభాచార్య తత్వం శుద్ధ అద్వైతం, కృష్ణతత్వంతో ఉంటుంది. శైవం ప్రభావం కొన్ని చిత్రాల్లో కనిపిస్తుంది. ఇందులో తాత్విక చింతన, పురాణాల అవలోకనమే ప్రధానంగా సాగుతుంటుంది. సద్గురువుల ప్రవచనాలు, ప్రబోధాల వల్ల అనేక ఊహాచిత్రాలకు రూపం వచ్చింది. సామాన్యులకు ఆరోగ్యకరమైన, ఆచరణీయమైన దైనందిన జీవనశైలిని కూడా పౌరాణిక కథల ద్వారానే వివరించేవారు. తల్లి బిడ్డను లాలనగా నిద్రలేపడం, బిడ్డకు స్నానం చేయించి దుస్తులు ధరింపచేసి చక్కగా అలంకరించడం వంటివన్నీ కృష్ణుడు, యశోద పాత్రల ద్వారా బొమ్మల్లో రూపుదిద్దుకున్నాయి.చిత్రకళలో కృష్ణతత్వం..మన చిత్రకళ, శిల్ప కళ అన్నీ చరిత్ర, పురాణేతిహాసాల ఆధారంగానే అభివృద్ధి చెందాయి. సామాజిక మార్పులను ఇముడ్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. భాగవత పురాణాల ప్రభావం ఉత్తరాదిలో ఎక్కువ. కాబట్టి ఉత్తరాది చిత్రకళలు ఎక్కువగా కృష్ణతత్వాన్ని ప్రతిబింబిస్తుంటాయి. కృష్ణుడు ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యుడే. ప్రతి సంఘటనను కృష్ణుడితో అన్వయించుకుంటారు.ముస్లిం ఆర్టిస్టులు హిందూచిత్రాలు..నా తాజా రచన కలర్స్ ఆఫ్ డివోషన్ పుస్తకం వెనుక ఏడేళ్ల శ్రమ ఉంది. ఇది పాఠకుల సాంస్కృతిక, సామాజిక దృష్టి కోణాన్ని విస్తృతపరుస్తుందని చెప్పగలను. హిందూ పురాణాల ఆధారంగా చిత్రాలకు రూపకల్పన చేసిన వారిలో ముస్లిం చిత్రకారులున్నారు. ఆదిల్ షా స్వయంగా సరస్వతీ మాతను పూజించాడు. ఇలాంటి అనేక సామరస్య సహజీవన ఆధారాలు మనప్రాచీన చిత్రాల్లో దొరుకుతాయి. భారతీయ చిత్రకళలో సాంస్కృతికప్రాముఖ్యతను తెలియచేశాను.గతంలో ‘విజిటర్స్ టూ సౌత్ ఇండియన్ మ్యూజియమ్స్– మ్యూజియోలాజికల్ కాంటెక్ట్స్ అండ్ విజిటర్ స్టడీ’ పేరుతో పుస్తకం తెచ్చాను. చిత్రకళారీతులతోపాటు వాటిని చిత్రించిన వస్త్రనైపుణ్యాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తించాలి. మన చిత్రకళారీతులన్నీ ఒకచోట గుదిగుచ్చి లేక΄ోవడం దురదృష్టకరం. ఒక్కొక్కటి ఒక్కోచోట ఉండడంతో ఒక సమగ్రమైన స్వరూపం రావడం లేదు. అందుకే మ్యూజియాల్లో ప్రదర్శనలో ఉన్న కళాఖండాల ఫొటోలు, వివరాలతో రచనలు చేస్తున్నాను. ఇదే నా పని’’ అని వివరించారు డా. అనితాషా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వన ఉత్పత్తులకు.. దమ్మక్క బ్రాండ్!
అడవుల జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలు ఎదుగుతున్నారు. ఐదేళ్ల కిందట శిక్షణతో మొదలైన వారి ప్రయాణం నేడు ఈ కామర్స్ వాకిలి వరకు చేరుకుంది. వీరి విజయ గాథ...నైపుణ్య శిక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలు 2018లో హైదరాబాద్కు ఐటీడీఏ తరఫున వెళ్లారు. అక్కడ సబ్బులు, షాంపులు తయారు చేసే ఓ సంస్థలో మూడు నెలలు శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణతోనే సరిపెట్టుకోకుండా అదే కంపెనీ లో మరో తొమ్మిది నెలల పాటు పనిచేసి తమ నైపుణ్యానికి మరిన్ని మెరుగులు అద్దుకున్నారు. ఇందులో పదిహేను మంది సభ్యులు కలిసి దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్గా ఏర్పడ్డారు. రూ. 25 లక్షలతో షాంపూ, సబ్బుల తయారీ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకున్నారు.అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ..దమ్మక్క గ్రూప్ సభ్యుల ఉత్సాహం చూసి అప్పటి ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు బ్యాంకు అధికారులతో మాట్లాడి లోను ఇప్పించడంతో భద్రాచలంలో 2019 నవంబరులో షాంపూ తయారీ యూనిట్నుప్రారంభించారు. పనిలో చేయి తిరగడం అలవాటైన కొద్ది రోజులకే 2020 మార్చిలో కరోనా విపత్తు వచ్చి పడింది. లాక్డౌన్ లు, కరోనా భయాల వల్ల బయటకు వెళ్లి పని చేసేందుకు ఇంట్లో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఒక ఇబ్బందైతే, మరోవైపు తయారీ యూనిట్లో షాంపూ బాటిళ్లు పేరుకుపోయాయి. ఇంతలోనే ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు షాంపూ బాటిళ్లు కావాలంటూ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి ఆర్డర్ రావడంతో కొంత ఊతం లభించింది.’’ అంటూ దమ్మక్క గ్రూపు జాయింట్ సెక్రటరీ బేబీరాణి అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఊపందుకున్న అమ్మకాలు..షాంపూ కొనుగోలుకు జీసీసీ నుంచి మార్కెట్ అందుబాటులో ఉండటంతో పాటు షాంపూ నాణ్యత విద్యార్థులకు నచ్చడంతో క్రమంగా దమ్మక్క యూనిట్ పనితీరు గాడిలో పడింది. 100 మిల్లీలీటర్ల షాంపూ బాటిళ్ల తయారీ 2021లో యాభైవేలు ఉండగా 2022 ముగిసే నాటికి లక్షకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది ఏకంగా రెండు లక్షల బాటిళ్ల షాంపూలు తయారు చేసి విక్రయించారు. షాంపూల తయారీలో వచ్చిన అనుభవంతో ఈ ఏడాది మొదట్లో గ్లిసరిన్ ప్రీమియం సబ్బుల తయారీనిప్రారంభించి జీసీసీ స్టోర్లలో ప్రయోగాత్మకంగా అమ్మకాలుప్రారంభించగా... తొలి దఫాలో ఐదు వేల సబ్బులు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకున్నాయి.బ్యాంక్ రుణం కూడా తీర్చేశారు!యూనిట్ ఆరంభమైన తర్వాత ఏడాదిలో కేవలం మూడు నెలలే గ్రూపు సభ్యులకు పని దొరికేది. షాంపూ, సబ్బులకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది వరుసగా ఎనిమిది నెలలు అంతా పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బ్యాంకు రుణం కూడా తీర్చేశారు. ప్రతి సభ్యురాలికి ఖర్చులు పోను కనీసం రూ.10 వేల వరకు ఆదాయం వచ్చినట్టు గ్రూప్ ట్రెజరర్ పూనెం విజయలక్ష్మి తెలిపారు.ఈ కామర్స్ దిశగా..రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వేదికగా ఈ ఉత్పత్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు గ్రూపు అధ్యక్షురాలు తాటి రాజసులోచన తెలిపారు. ఈ మేరకు బ్రాండ్నేమ్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అది విజయవంతం అయితే మరెందరో కొత్త వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి, భద్రాచలంఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్!
మహిళా సాధికారతకు ఉత్తమ సాధనాలలో ఒకటిగా నిలిచింది డ్రోన్ శిక్షణ. ఢిల్లీకి ఉత్తరాన ఉన్న సింఘోలా, నైరుతి జిల్లాల్లోని 200 మంది మహిళలు శిక్షణ తీసుకొని డ్రోన్ లైసెన్స్ పొందేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా గ్రామీణ మహిళలకు సాధికారిత కల్పించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని కిందటేడాది చేపట్టింది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన మహిళలు దేశ రాజధానిలో ఇటీవల కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పొందిన డ్రోన్ దీదీలు పైలెట్ లైసెన్స్ సర్టిఫికెట్స్ పొంది, స్వయం ఉపాధి అవకాశాలను పొందుతారు. శిక్షణ పొందిన వారికి డ్రోన్లను ప్రభుత్వమే అందజేస్తుంది.స్వయం ఉపాధికి..డ్రోన్లను స్వయంగా ఉపయోగించడానికి, అద్దెకు ఇవ్వడానికి అనుమతిస్తారు. సర్వేలు, ఈవెంట్ షూట్లు, ఫొటోగ్రఫీ, వ్యవసాయంలో సీడింగ్, పురుగుమందులు చల్లడం వంటి వాటి కోసం డ్రోన్లను ఉపయోగించడమే లక్ష్యంగా ఉద్యోగావకాశాలు పొందుతారు.ఆర్థికాభివృద్ధికి..మూడేళ్ల కాలంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 15 వేల డ్రోన్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వ్యవసాయంతో పాటు అదనంగా మహిళలు డ్రోన్ సంబంధిత వ్యాపారాలను చేసుకునే అనుమతి లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి మరింతగా దోహదపడుతుంది. ఎరువులను చేతితో పిచికారీ చేసే సాంప్రదాయ పద్ధతులను డ్రోన్లతో భర్తీ చేయడం ద్వారా పురుగు మందుల వల్ల కలిగే ప్రమాదం తగ్గుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది.అంతేకాదు, డ్రోన్ల వాడకంలో ఖర్చులు తగ్గి, రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. టెక్నాలజీలో ఆధునాతన శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కృషి జరపడం అంటే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను మరింత శక్తిమంతులుగా తయారు చేయడమే.ఇవి చదవండి: Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా? -
Aishwarya Sushmita: వనితా విశేషణం..
యాక్ట్రెస్, సింగర్, మోడల్, బెల్లీ డాన్సర్, నేషనల్ లెవెల్ బాడ్మింటన్ ప్లేయర్.. ఈ విశేషణాలన్నింటి కలబోత ఐశ్వర్యా సుష్మితా! ‘బ్యాడ్ కాప్’ సిరీస్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఐశ్వర్యా సుష్మితా పుట్టింది బిహార్లోని దర్భంగాలో. పెరిగింది ఢిల్లీలో. నాన్న.. నారాయణ్ వర్మ, ఎస్బీఐ ఉద్యోగి. అమ్మ.. నీతా వర్మ, గృహిణి. ఐశ్వర్యా.. ఫిలాసఫీలో పోస్ట్గ్రాడ్యుయేట్.ఐశ్వర్యా ఆసక్తిని గమనించి, తల్లిదండ్రులూ ఆమెను మోడలింగ్ వైపే ప్రోత్సహించారు. దాంతో ఢిల్లీ బేస్డ్ మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయింది ఐశ్వర్యా. అక్కడే ప్రింట్ అడ్వర్టయిజ్మెంట్స్కి మోడల్గా పనిచేసింది.స్కూల్ డేస్లో ఆమె లక్ష్యం ఐఏఎస్ కావాలని. అందుకే కాలేజీకొచ్చాక ఫిలాసఫీ సబ్జెక్ట్ని ఎంచుకుంది. ఆమెకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం. బాడ్మింటన్ ప్లేయర్గా జాతీయ స్థాయిలో రాణించింది. అంతేకాదు అందాల పోటీల్లోనూ పాల్గొని, 2016, ఎన్డీటీవీ గుడ్ టైమ్ కింగ్ఫిషర్ సూపర్మోడల్స్కీ ఎంపికైంది. ఇవన్నీ ఆమె లక్ష్యాన్ని మార్చాయి.ఆ టైమ్లోనే ముంబై మోడలింగ్ ఏజెన్సీల నుంచీ ఆఫర్స్ రావడం మొదలుపెట్టాయి. ముంబై వెళ్లింది. మనీశ్ మల్హోత్రా, అనితా డోంగ్రే, రేణు టాండన్, మానవ్ గంగ్వానీ, రాహుల్ ఖన్నా వంటి సూపర్ డిజైనర్స్కి మోడల్గా పని చేసింది. టీవీ కమర్షియల్స్లోనూ నటించింది. ఆ ఫేమే ఆమెకు ‘స్పెషల్ ఆప్స్ 1.5’ అనే వెబ్ సిరీస్లో అవకాశాన్నిచ్చింది.ఆ నటన ఆమెను తాజాగా ‘బ్యాడ్ కాప్’ వెబ్ సిరీస్లో ప్రాధాన్యమున్న పాత్రకు ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతోంది.ఐశ్వర్యాకు సంబంధించి ఇంకో విశేషం, విశేషణం ఏంటంటే ఆమెకు స్పోర్ట్స్ బైక్ రైడింగ్ అంటే ప్రాణం. ఏ కొంచెం వీలు దొరికినా బైక్ రైడింగ్ చేస్తుంది. ఆమె ఫిట్నెస్ ఫ్రీక్ కూడా! రోజూ యోగా చేస్తుంది."నా పేరు విని అందరూ ఆశ్చర్యపోతారు సంబంధం లేకుండా రెండు పేర్లేంటని! ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్లు మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ క్రౌన్స్ గెలుచుకున్న ఏడాదే పుట్టాను. మా పేరెంట్స్కి వాళ్లిద్దరంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దే నాకు ఆ ఇద్దరి పేర్లను కలుపుతూ ఐశ్వర్యా సుష్మితా అని పెట్టారు. అదన్నమాట నా పేరు వెనుకున్న స్టోరీ!" – ఐశ్వర్యా సుష్మితా -
Annapurni Subramaniam: నక్షత్ర విజ్ఞాన సిరి..
అంతరిక్షం అంటేనే అనేకానేక అద్భుతాలకు నెలవు. అన్నపూరణిలో అంతరిక్షంపై ఆసక్తి చిన్న వయసులోనే మొదలైంది. ఆరు బయట రాత్రి పూట ఆకాశంలో చుక్కలు చూస్తున్నప్పుడు ‘ఎందుకు? ఏమిటి? ఎలా?’ అనే ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన తనను కుదురుగా ఉండనివ్వలేదు. నక్షత్రమండలాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేలా చేసింది. నక్షత్రాలపై ఆసక్తి తనను విషయ జ్ఞానానికి మాత్రమే పరిమితం చేయలేదు. సైంటిస్ట్ను చేసింది.‘విజ్ఞాన శ్రీ’ అవార్డ్ అందుకున్న ఏకైక మహిళా శాస్త్రవేత్తగా ఉన్నతస్థానంలో నిలిపింది. అన్నపూరణి సుబ్రమణ్యం ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) డైరెక్టర్గా పనిచేస్తోంది. ఈ సంస్థ భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం అత్యాధునిక టెలిస్కోప్లు, పరికరాలను తయారు చేస్తుంటుంది. ఆస్ట్రోశాట్, ఆదిత్య–ఎల్1ల ఇన్స్ట్రుమెంటేషన్లో అన్నపూరణి పాలుపంచుకుంది.కేరళలోని పాలక్కాడ్ విక్టోరియా కాలేజీలో చదువుకున్న అన్నపూరణి ‘స్టడీస్ ఆఫ్ స్టార్ క్లస్టర్స్ అండ్ స్టెల్లార్ ఎవల్యూషన్’ అంశంపై హీహెచ్డీ చేసింది. పీహెచ్డీ చేస్తున్న రోజులలో కవలూర్ అబ్జర్వేటరీ (తమిళనాడు) ఆమె ప్రపంచంగా మారింది. ఏ పరికరాన్ని ఎలా వినియోగించుకోవాలో లోతుగా తెలుసుకుంది. నక్షత్ర సమూహాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసింది.‘పరిశోధన’కు కామా నే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంటుంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! ప్రస్తుత కాలంలో ‘స్పేస్–బేస్డ్ అస్ట్రోనమీపై యువతరం అమితమైన ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఇది శుభసూచకం. స్పేస్ సైన్స్ ఎంతోమందికి అత్యంత ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తే భవిష్యత్ పరిశోధనలకు పునాదిగా మారుతుంది’ అంటుంది అన్నపూరణి సుబ్రమణ్యమ్.‘పరిశోధన’కు కామానే తప్ప ఫుల్స్టాప్ ఉండదు. అన్నపూరణి ఇప్పటికీ నక్షత్రమండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తూనే ఉంది. అది ఆమె హాబీ. అది ఆమె వృత్తి. ఆమె జీవనాసక్తి... జీవిక కూడా! -
Akanksha Kumari: తాను.. రొటీన్ ఐటీ కాదు.. మైనింగ్ మేటి!
‘ద్వారాలు మూసే ఉన్నాయి’ అని వెనక్కి తిరిగేవారు కొందరు. ఆ ద్వారాలను తెరిచి ముందుకు వెళ్లేవారు కొందరు. ఆకాంక్ష కుమారి రెండో కోవకు చెందిన మహిళ. తొలి భారతీయ మహిళా మైనింగ్ ఇంజినీర్గా చరిత్ర సృష్టించింది. ఉద్యోగంలో చేరిన రోజు ఎంత ఉత్సాహం, వృత్తి నిబద్ధతతో ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ‘నో రిగ్రెట్స్.. ఫీల్ గ్రేట్’ అంటుంది. మైనింగ్ ఫీల్డ్లోకి రావాలనుకునే మహిళలకు ధైర్యాన్ని ఇస్తోంది.ఝార్ఖండ్లోని మైనింగ్ప్రాంతంలో పెరిగిన ఆకాంక్ష కుమారి బొగ్గు గనుల్లో ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను ఎన్నోసార్లు విని ఉన్నది. మైనింగ్ ఇంజినీర్గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన తరువాత ‘పై కప్పు కూలిపోవడం’ అనే మాటను వినడం కాదు ప్రత్యక్షంగా చూసింది. ‘ఇది పురుషులు మాత్రమే చేసే కఠినమైన ఉద్యోగం అనుకునే వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె స్పందన ఇది...‘బొగ్గు తవ్వకాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో పుట్టి పెరిగాను. ఇక్కడి ప్రజలు ఏ మైనింగ్ కంపెనీలో పని చేయకపోయినా వాళ్లకు మైనింగ్ గురించి చాలా విషయాలు తెలుసు. స్కూల్ హాస్టల్లో నా స్నేహితులు పై కప్పు కూలిపోవడం గురించి మాట్లాడడం నేను ఎన్నోసార్లు విన్నాను. అదెలా? ఎందుకు?’ అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించేది. మైనింగ్కు సంబంధించి రకరకాల విషయాలు వినడం వల్ల నాకు తెలియకుండానే ఆ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే కలకు బీజం పడింది’ గతాన్ని గుర్తు చేసుకుంది ఆకాంక్ష.‘పదవ తరగతి పూర్తయిన తరువాత ఏం చేయాలి?’ అనుకున్నప్పుడు ఆటల గురించి ఆలోచించింది. తాను జాతీయస్థాయి అథ్లెట్లిక్స్లో కూడా పాల్గొంది. ఆటలపై దృష్టి పెట్టాలా, చదువు కొనసాగించాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు తాను ఉన్న పరిస్థితిల్లో ఉద్యోగం అనివార్యం కావడంతో చదువుకే ్రపాధాన్యత ఇచ్చింది. ఇంటర్మీడియెట్ పూర్తి అయిన తరువాత ‘ఐటీ రంగంలో ఉద్యోగంపై దృష్టి పెట్టు’ అని కొందరు తనకు సలహా ఇచ్చారు. అయితే ‘ఐటీ’ అనేది ఆకాంక్షకు ఆసక్తికరమైన సబ్జెక్ట్ కాదు. ఆ సమయం లోనే తన మనసులో దాగిన కల బయటికి వచ్చింది. ‘కోల్ మైనింగ్ ఫీల్డ్లో ఉద్యోగం చేయాలి’ అని నిర్ణయించుకుంది. ఉపాధ్యాయుడైన తండ్రి, అంగన్వాడీ వర్కర్ అయిన తల్లిని ఒప్పించడం కష్టం కాలేదు.‘మా అమ్మాయి మైనింగ్ జాబ్ చేయాలనుకుంటుంది’ అని ఆకాంక్ష తండ్రి మైనింగ్ కంపెనీలో పనిచేసే తన స్నేహితుడిని సలహా అడిగితే...‘చాలా కష్టం. మధ్యతరగతికి చెందిన ఆడపిల్లలు ఈ రంగంలో పనిచేయలేరు. ఆ పనిభారం తట్టుకోవడం ఆడపిల్లలకు చాలా కష్టం’ అన్నాడు. స్నేహితుడు చెప్పిన విషయాలను కూతురితో పంచుకున్నాడు. అయినా సరే, ఆకాంక్ష వెనక్కి తగ్గలేదు. ఇంజినీరింగ్ కోర్స్ అడ్మిషన్ సమయంలో కౌన్సెలర్ ఆమెకు మైనింగ్ ఇంజినీరింగ్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. వాదోపవాదాల తరువాత ఆకాంక్ష కల నెరవేరింది. ఝార్ఖండ్, ధన్బాద్లోని బిర్సా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింద్రీలో బీటెక్ పాసైంది. వొకేషనల్ ట్రైనింగ్లో భాగంగా అండర్గ్రౌండ్ మైన్లో కూడా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.‘ఇక్కడికి నిన్ను ఎవరు పంపించారు? ఎలా పంపిస్తారు? ఇక్కడ మహిళలకు సౌకర్యాలు, సదుపాయాలు లేవన్న విషయం మీ డిపార్ట్మెంట్ హెడ్కు తెలియదా?’ అని విసుక్కున్నాడు జనరల్ మేనేజర్. ఆ తరువాత మాత్రం గెస్ట్హౌజ్లో ఒక రూమ్ కేటాయించారు. అమ్మ, మేనత్తలతో కలిసి ఆ గదిలో ఉండేది ఆకాంక్ష. చదువు పూర్తయిన తరువాత హిందుస్థాన్ జింక్లో ఆకాంక్షకు ఉద్యోగం వచ్చింది. మూడు సంవత్సరాలు గనులలో పనిచేసింది. ఆ తరువాత సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్కు చెందిన బొగ్గు గనుల్లో పనిచేసింది. కనీస సౌకర్యాలు లేకపోయినప్పటికీ భూగర్భ గనుల్లో గరిష్ఠంగా ఆరు గంటలు పనిచేసింది.2021లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)లో ఆకాంక్ష చేరిన తరువాత ఇప్పటి వరకు మరో ముగ్గురు మహిళలు మాత్రమే పబ్లిక్ విభాగంలో చేరారు. అయినా సరే ఆకాంక్ష కుమారిలో ఆశాభావం తొలగిపోలేదు. మైనింగ్ ఫీల్డ్లో రావాలనుకుంటున్నవారికి సలహాలు ఇవ్వడం, దారి చూపడం మానడం లేదు. ‘సౌకర్యాలు లేకపోవచ్చు. శ్రమతో కూడిన ఉద్యోగం కావచ్చు. అయినా సరే చేస్తాను అనే పట్టుదల మీలో ఉంటే మైనింగ్ ఫీల్డ్లోకి తప్పకుండా రావచ్చు’ అంటుంది ఆకాంక్ష కుమారి. తొలి అడుగు వేసి మాత్రమే ఊరుకోలేదు. మరిన్ని అడుగుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూనే తన వంతు ప్రయత్నం చేస్తోంది ఆకాంక్ష.ఇవి చదవండి: ఈ ప్రాణం ఖరీదెంత? -
Paetongtarn Shinawatra: నా నవ్వులు పిల్లలవి!
బిలియనీర్ కూతురు అయిన పేటోంగ్ టార్న్ పదిహేడేళ్ల వయసులోనే పార్ట్టైమ్ ఉద్యోగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 37 ఏళ్ల వయసులోనే థాయ్లాండ్ నూతన ప్రధానిగా ఎంపికై చరిత్ర సృష్టించింది. తన ఇద్దరు పిల్లల నవ్వుల్లోంచి బలం తెచ్చుకొని రాజకీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ విజయపథంలో పయనిస్తోంది...థాయ్లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర చిన్న కుమార్తె పేటోంగ్ టార్న్. తక్సిన్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన దేశం విడిచి విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నాడు. దాంతో తండ్రి స్థాపించిన ‘ప్యూ థాయ్’ పార్టీకి పేటోంగ్ టార్న్ పెద్ద దిక్కుగా మారింది. బ్యాంకాక్లో పుట్టి పెరిగింది పేటోంగ్ టార్న్. పొలిటికల్ సైన్స్, ఆంత్రోపాలజీ, సోషియాలజీలో పట్టా పుచ్చుకున్న పేటోంగ్ టార్న్ ఇంగ్లాండ్లో ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసింది. చదువులో రాణించిన పేటోంగ్ టార్న్ ఆ తరువాత వ్యాపారరంగంలో అడుగుపెట్టింది. 21 కంపెనీలతో తిరుగులేని ఎంటర్ప్రెన్యూర్గా పేరు తెచ్చుకుంది.‘నేను ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాన్న రాజకీయాల్లోకి వచ్చారు’ అని చెబుతుంటుంది పేటోంగ్ టార్న్. పార్టీ నిర్వహణ, ఆ తరువాత ప్రధాన మంత్రిగా పనిచేసిన తండ్రి తక్సిన్ షినవత్రకు పిల్లలతో మాట్లాడే సమయం అతి తక్కువగా ఉండేది.‘నాకు నాన్న అంటే చాలా ఇష్టం. అయితే నాకంటూ సొంత వ్యక్తిత్వం ఉంది’ అంటున్న పేటోంగ్ టార్న్కు రాజకీయాల్లో చురుగ్గా ఉండడానికి కుటుంబ బలం అనేది ఎంత ముఖ్యమో తెలియనిది కాదు. రాజకీయ ప్రపంచం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఇద్దరు పిల్లలే తన ప్రపంచం. పేటోంగ్ టార్న్ ముద్దు పేరు ఉంగ్–ఇంగ్. గ్రామీణ ప్రజలు పేటోంగ్ టార్న్ను ప్రేమగా ఉంగ్–ఇంగ్ అని పిలుచుకునేవారు. కమర్షియల్ పైలట్ పిటాక సూక్సావత్ను పేటోంగ్ వివాహం చేసుకుంది. వీరిది అన్యోన్య దాంపత్యంగా చెబుతుంటారు. భార్యకు ఉన్న సహనాన్ని, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రదర్శించే తెలివితేటలను పిటాక ప్రశంసిస్తుంటాడు.‘రాజకీయ నాయకురాలిగా మీకు ఎన్నో చికాకులు ఉంటాయి. అయినా సరే, ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు!’ అని అడిగితే ఆమె సమాధానం నవ్వు. ‘ఈ బలం నాకు నా పిల్లలు ఇచ్చారు’ అంటుంది ఆ నవ్వు మరింత పెంచుతూ!‘సోషల్లీ–లిబరల్ క్యాపిటలిస్ట్’గా తనను తాను అభివర్ణించుకునే పేటోంగ్ ముందు రాజ్యాంగాన్ని పునర్లిఖించడంతో సహా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన కుటుంబ బలం ఉండనే ఉంది. -
తెలుగింటి.. వెలుగులు! ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?
అమ్మానాన్నలు వెంట లేకుండానే... టీచర్లు తోడు లేకుండానే ఈ అమ్మాయిలు ధైర్యంగా దేశం దాటి చైనా వెళ్లారు. శాస్త్ర సాంకేతిక సదస్సులో 38 దేశాల నుంచి హాజరైన బృందాలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. తెలుగు వారి తెలివితేటలను నిరూపించుకున్నారు. అంతర్జాతీయ ప్లాట్ఫారంపై అదరగొట్టారు. భావి శాస్త్రవేత్తలుగా భళా అనిపించుకున్నారు. ఎంచక్కా తిరిగి వచ్చారు. తమ అనుభవాలను సాక్షితో సంతోషంగా పంచుకున్నారు.ఇంతకూ ఎవరా అమ్మాయిలు..?ఆంధ్రప్రదేశ్, కాకినాడకు చెందిన సాయిశ్రీ శ్రుతి చిట్టూరి, లక్ష్మీ ఆశ్రిత నామ, సంజన పల్లా, వైష్ణవి వాకచర్లలకు అంతర్జాతీయ వేదికపై భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. చైనీస్ అసోషియేషన్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, చైనా ఎడ్యుకేషన్ క్యాంప్ రెగ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన యూత్ సైన్స్ టెక్నాలజీ వర్క్షాపులో ఈ స్టూడెంట్స్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొని ఇటీవలే తిరిగి వచ్చారు.ఆలోచనలను పంచుకున్నాం..దక్షిణాఫ్రికా, నేపాల్, ఆస్ట్రేలియా, మంగోలియా తదితర దేశాలæవిద్యార్థినుల పరిశోధన అంశాలపై ఆలోచనలు పంచుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఒకే వయస్సు వాళ్లం ఒక చోట చేరి ఎంపిక చేసుకున్న అంశాలపై విశ్లేషించుకోవడానికి ఈ సదస్సు ఉపకరించింది.– వైష్ణవి. ఎంపీసీ విద్యార్థిని, కాకినాడపురాతన జీవశాస్త్రంపై పరిశోధన..ఈ వర్క్షాపు ద్వారా వివిధప్రాంతాల విశిష్టత, ఆయాప్రాంతాల్లో జీవరాశుల స్వభావం, స్థితిగతులపైప్రాథమికంగా కొంత అవగాహన ఏర్పరుచుకుకో గలిగాం. భవిష్యత్తులో శాస్త్రవేత్తలం కావాలనే మా సంకల్పానికి ఈ వర్క్షాపు కచ్చితంగా ఉపయోగమే.– సంజన, బైపీసీ విద్యార్థిని, కాకినాడఎనిమిదో ఏడు..చైనా ఏటా ప్రపంచ స్థాయిలో 2017 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ వర్క్షాపు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, వివిధ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆలోచనలను పంచుకోవాలి. అలా భారతదేశం తరఫునప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారీ అమ్మాయిలు. భావి శాస్త్రవేత్తలకు దిక్సూచి: విశ్వం ఆవిర్భావం నుంచి నేటివరకూ ప్రపంచంలో చోటు చేసుకున్న మార్పులపై నిరంతరం పరిశోధనలు కొనసాగడం ఈ వర్క్షాపు లక్ష్యం. ఈ వర్క్షాపు లో ఎంపీసీ స్టూడెంట్స్ (శృతి, వైష్ణవి) ‘చేజింగ్ ద సన్’ అంశాన్ని, బైపీసీ స్టూడెంట్స్ (లక్ష్మి ఆశ్రిత, సంజన) ఫాజిల్స్ ను ఎంపిక చేసుకున్నారు. వివిధ దేశాల నుంచి ఎంపికైన వారితో తమ అభి్రపాయాలను పంచుకుని విజయ వంతంగా తిరిగి వచ్చారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, కాకినాడ. ఫొటోలు: తలాటం సత్యనారాయణ -
పోస్టల్ స్టాంపులు.. యుద్ధం ముద్రలు!
మహిళలు ఇల్లు విడిచి బయట అడుగు పెడితే వింతగా చూసే కాలంలో సాహసమే వెన్నెముకగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు ఎంతోమంది మహిళలు. వారి త్యాగాల వెలుగు చరిత్రకే పరిమితమైనది కాదు, వర్తమానంలోనూ స్ఫూర్తిని ఇస్తుంటుంది. ఎంతోమంది మహిళా స్వాతంత్య్ర సమరయో«ధుల పోస్టల్ స్టాంప్స్ విడుదల అయ్యాయి. ఈ చిన్న స్టాంప్లు వారి త్యాగాలు, పోరాట పటిమను ప్రతిఫలిస్తాయి. పోస్టల్ స్టాంప్స్పై మెరిసిన కొందరు మహిళా స్వాతంత్య్ర సమరయోధుల గురించి...రుక్మిణీ లక్ష్మీపతిఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని మధురైలో పుట్టింది రుక్మిణీ. గాంధీజీ ‘హరిజన సంక్షేమ ని«ధి’ కోసం తన బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేసింది. సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో చురుగ్గా పాల్గొంది. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించింది. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా అరెస్టయి జైలు శిక్ష అనుభవించిన తొలి మహిళగా చరిత్రలో నిలిచింది.సుభద్రా జోషిగాంధీజీ ఉపన్యాసాలతో ప్రభావితం అయిన సుభద్రా జోషి విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంది. ‘హమారా సంగ్రామ్’ పత్రికకు ఎడిటర్గా పనిచేసింది. సుభత్రను అరెస్ట్ చేసి లాహోర్ సెంట్రల్ జైల్కు తరలించారు. విడుదలయ్యాక మళ్లీ ఉద్యమంలో భాగం అయింది. సుభద్ర అంకితభావాన్ని నె్రçహూ ప్రశంసించారు.రాణి మా గైడిన్లియుబ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మొదలైన ‘హెరాక’ ఉద్యమంలో పదమూడు సంవత్సరాల వయసులోనే పాల్గొంది రాణి మా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఆదివాసి మహిళగా చరిత్రకెక్కింది. ‘హెరాక’ ఉద్యమంతో పాటు ఎదుగుతూ వచ్చిన రాణి మా ప్రముఖ రాజకీయ నాయకురాలిగా, ఆధ్యాత్మిక గురువుగా ప్రఖ్యాతి పొందింది.బేగం హజ్రత్ మహల్తొలి తరం మహిళా స్వాతంత్య్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్. బేగం హజ్రత్ ఇతర సంస్థానాధీశులతో కలిసి బ్రిటిష్ వారితో యుద్ధం చేసింది. లక్నో సమీపంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించింది. ఆ తరువాత కాలంలో మాత్రం ఓటమికి గురైంది. బ్రిటిష్ వారికి చిక్కకుండా అడవుల్లో తలదాచుకొని పోరాడేది.కమలానెహ్రూజవహర్లాల్ నెహ్రు సతీమణి కమలా నెహ్రూ మహిళా సాధికారత కోసం గళం విప్పిన యోధురాలు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా అరెస్టై జైలుకు వెళ్లింది. ‘దేశ సేవిక’ సంఘాలను ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం అయ్యేలా చేసింది.సుభద్రాకుమారి చౌహాన్సుభద్రాకుమారి చౌహాన్ కవయిత్రి, స్వాతంత్య్ర సమరయోధురాలు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరిన తరువాత నాగపూర్ నుంచి అరెస్ట్ అయిన మొట్టమొదటి మహిళా సత్యాగ్రహిగా చరిత్రలో నిలిచింది. మహిళలపై వివక్షతకు వ్యతిరేకంగా పోరాడింది. స్వాతత్య్ర పోరాటంలో భాగంగా ఎన్నో త్యాగాలు చేసింది.అరుణా అసఫ్ అలిభర్త అసఫ్ అలీతో పాటు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంది అరుణ. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయింది. కాంగ్రెస్పార్టీ క్విట్ ఇండియా తీర్మానం చేసిన తరువాత బ్రిటిష్ వారు విరుచుకుపడ్డారు. ప్రముఖ నాయకులను అరెస్ట్ చేశారు. ఆ క్లిష్ట సమయంలో అరుణా అసఫ్ అలి కార్యకర్తలకు అండగా ఉంది. బొంబాయి గొవాలియా ట్యాంక్ మైదానంలో కాంగ్రెస్ జెండాను ఎగరేసి క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకునేలా చేసింది.దుర్గాబాయి దేశ్ముఖ్దుర్గాబాయి దేశ్ముఖ్ సాహసవంతురాలైన సామాజిక కార్యకర్త, చిన్నతనం నుంచే మహిళల హక్కుల కోసం పోరాడింది. మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంది. గాంధీజీ ప్రభావంతో దుర్గాబాయి మాత్రమే కాదు ఆమె కుటుంబం మొత్తం అన్ని రకాల పాశ్చాత్య దుస్తులను విడిచిపెట్టి, ఖాదీని మాత్రమే ధరించేవారు. మద్రాస్లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించింది.రాజ్కుమారీ అమృత్ కౌర్రాజ్కుమారీ అమృత్ కౌర్ సామాజిక కార్యకర్త, స్వాతంత్య్ర సమరయోధురాలు. గాంధీజీ కార్యదర్శిగా పని చేసిన ఆమె దండి మార్చ్లాంటి ఎన్నో జాతీయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొంది. క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజ్కుమారి ఇరవై నెలల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. రాచరిక కుటుంబంలో పుట్టినప్పటికీ మహాత్ముడి ఆశ్రమంలో సాధారణ జీవితాన్ని గడిపింది. -
అరుదైన ఆహ్వానం: 12 ఏళ్లు.. 15 లైబ్రరీలు..
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నఇరవై మందిలో విద్యార్థులు ఆరుగురు. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షరసేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది. ‘‘హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్మాస్టర్ నుంచి 12వ తేదీన నాన్నకు ఫోన్ వచ్చింది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15వ తేదీన ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరుకావలసిందిగా మీ అమ్మాయి ఆకర్షణకు ఆహ్వానం వచ్చిందని చెబుతూ అభినందనలు తెలియచేశారు’’ అంటూ తాను లైబ్రరీ వ్యవస్థాపకురాలిగా మారిన వివరాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు ఆకర్షణ సతీష్.కోవిడ్ వచ్చినప్పుడు..‘‘హైదరాబాద్లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీశ్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో వెయ్యికి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది.తొలి లైబ్రరీ క్యాన్సర్ హాస్పిటల్లో..నాన్న ఉద్యోగరీత్యా క్యాన్సర్ హాస్పిటళ్లకు టచ్లో ఉంటారు. కోవిడ్ సమయంలో ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్లు ‘కోవిడ్ కారణంగా వంటవాళ్లు డ్యూటీకి రావడం లేదు. పేషెంట్లకు ఆహారం అందించడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి పెట్టవలసింది’గా కోరడంతో నాన్న వాళ్ల కోసం రోజూ భోజనం వండించి తీసుకెళ్లి ఇచ్చేవారు. నాకు స్కూల్ లేకపోవడంతో రోజూ నాన్నతోపాటు హాస్పిటల్కి వెళ్లేదాన్ని. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో నా ఏజ్ గ్రూప్ వాళ్లతో స్నేహం ఏర్పడింది. వాళ్లు కొంతమంది చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిపెట్టమని అడిగారు. రోజూ నా పుస్తకాలు కొన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు... ‘హాస్పిటల్కి చికిత్స కోసం ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుంటారు. హాస్పిటల్లోనే లైబ్రరీ ఉంటే బావుంటుంది’ అన్నారు. వారి ఆలోచనే నా లైబ్రరీ ఉద్యమానికి నాంది. నా పుస్తకాలతోపాటు మా స్కూల్, అపార్ట్మెంట్ స్నేహితుల నుంచి సేకరించిన వెయ్యికి పైగా పుస్తకాలతో తొలి లైబ్రరీ అలా మొదలైంది. ఇప్పటికి 9,836 పుస్తకాలతో 15 లైబ్రరీలు ఏర్పాటు చేయగలిగాను.పదకొండు వేల పుస్తకాలు..నాలుగేళ్లలో పదకొండు వేల పుస్తకాలు సేకరించాను. అందులో రెండు వేల పుస్తకాలు ప్రధాని నరేంద్రమోదీగారిచ్చారు. ఈ ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని, 25 లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చె΄్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను.అప్పుడామె ‘ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ్రపోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించ’మని చెప్పి ఆమే స్వయంగా 74 పుస్తకాలిచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, కర్తవ్య పథ్లో జరిగిన 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది’’ అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీశ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Yaroslava Mahuchyk: యుద్ధం ఆమెకు సలాం చేసింది..
ఉక్రయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. కాని ఆ దేశం నుంచి ఒలింపిక్స్లో పాల్గొంటున్న క్రీడాకారులు పతకాలు గెలిచి యుద్ధాన్ని చిన్నబుచ్చుతూనే ఉన్నారు. హైజంప్లో బంగారు పతకం సాధించిన యారోస్లావా ఏ క్షణంలో ఏ వార్త వినవలసి వస్తుందో అన్న ఆందోళనలో కూడా లక్ష్యాన్ని తప్పలేదు. యుద్ధం ఆమెకు సలాం చేసింది.యుద్ధం చేసిన గాయంతో ఇంకా ఆ దేశం కన్నీరు కారుస్తూనే ఉంది. బాంబులు, బుల్లెట్లు చిందించిన రక్తంతోనే అక్కడి ప్రజలు ఇప్పటికీ సూర్యోదయాన్ని చూస్తున్నారు. రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ ధ్వంసమయ్యి రెండేళ్లు దాటింది. కాని ఆ దేశ క్రీడాకారుల మనోబలాన్ని మాత్రం యుద్ధం దెబ్బతీయలేకపోయింది. మీరు మాపై తుపాకులు ఎక్కుపెట్టి యుద్ధం చేస్తే.. మేం బంగారు పతకాలతో శాంతి సందేశాన్ని అందిస్తామంటూ ప్రపంచానికి సగర్వంగా చాటి చెబుతున్నారు ఉక్రెయిన్ క్రీడాకారులు. హై జంప్లో బంగారు పతకం సాధించిన 22 యేళ్ల యారోస్లావా మహుచిక్ వారిలో ఒకరు.నిలువనీడ లేకపోయినా...ప్రశాంతంగా సాగుతున్న యారోస్లావా జీవితాన్ని యుద్ధం ఆందోళనలో పడేసింది. నిత్యం దూసుకొచ్చే క్షిపణులు ఆమెకు రెండున్నరేళ్లుగా నిలువ నీడలేకుండా చేశాయి. తూర్పు ఉక్రెయిన్ లోని సొంతూరు ని్రపో నుంచి బయటపడి వివిధ దేశాల్లో తలదాచుకుంది. తల్లీతండ్రి అక్క అప్పుడప్పుడూ తనను కలిసేందుకు వచ్చేవారు. వారిని చూశాక ఆమె మనసు మరింత కకావికలమయ్యేది. వారు వెళ్లిపోయాక ఏ క్షణాన ఏ వార్త వినాల్సిందోనన్న భయం ఆమెను వెంటాడేది. ఇంట్లో ఉన్నపుడు పక్కన బాంబులు పడుతుంటే ‘నాన్నా బేస్మెంట్లోకి వెళ్దామా అంటే.. ఇంకా భయపడి పారిపోవడంలో అర్థం లేదు. నాలాగే ఎంతోమంది ్రపాణాల మీద ఆశలు వదిలేసుకునే బతుకుతున్నారు తల్లీ’ అన్న తండ్రి మాటలు వద్దంటున్నా గుర్తుకువచ్చేవి. యుద్ధం ఆమెను వెంటాడుతూనే ఉండేది. నేలకొరుగుతున్న దేశ సైనికులు..రోడ్డున పడుతున్న ఉక్రెయిన్ ప్రజలు కళ్ల ముందు కదులుతూనే ఉన్నారు. వాటి మధ్యే ఆమె శిక్షణ కొనసాగిస్తూ వచ్చింది.విషాదగీతాలు మరిచేలా...స్లీపింగ్ బ్యాగ్, యోగా మ్యాట్ను ఎప్పుడూ తనతో తెచ్చుకునే మహుచిక్ ఆట విరామ సమయంలో స్డేడియంలో విశ్రాంతి తీసుకుంటూ ఆకాశంలోకి చూస్తూ దేశం గురించే ఆలోచించేది. యుద్ధ విషాద గీతాలు మరుగున పడేలా ప్రజల్లో చైతన్యం నింపేలా దేశానికి పతకం అందించాలని కలలు కనేది. హైజంప్ మ్యాచ్లో ప్రత్యర్థితో తలపడే సమయంలోనూ ఆమె మనసునిండా యుద్ధ దృశ్యాలే. చివరకు ఆమె పోరాట స్ఫూర్తి గెలిచింది. ఎంతటి భీకర యుద్ధమైనా ఆశలను, ఆశయాలను తుడిచిపెట్టేయలేదని నిరూపించింది. వ్యక్తిగత హోదాలో దేశానికి ఆమె సాధించి పెట్టిన తొలి గోల్డ్మెడల్ ఉక్రెయిన్ ప్రజల భవిష్యత్తుకు నిజంగా ఓ ఆశాకిరణమే. యారోస్లావా మహుచిక్ ఒక్కరే కాదు.. పారిస్ ఒలంపిక్స్లో పతకాలు సాధిస్తున్న ఇతర ఉక్రెయిన్ క్రీడాకారులు యుద్ధం కారణంగా నిస్సత్తువగా మారిన ఆ దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇంతకాలం యుద్ధం కారణంగా రక్తంతో తడిసిన దేశంలో పతకాల సుమాలు పూయిస్తున్నారు.ఒలింపిక్స్ జరుగుతున్నా...‘‘ఒలింపిక్ క్రీడలు శాంతి సందేశాలు. కానీ రష్యా ఇలాంటి క్రీడలు జరుగుతున్న సమయంలోనూ మా దేశంపై దాడులు ఆపకపోగా మరింత ఉధృతం చేసింది. చిన్నపిల్లల ఆసుపత్రిపై క్షిపణు లు కురిపించడంలోని క్రౌర్యం మాటలకందనిది’’ అంది యారోస్లావా మహుచిక్. -
యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.8 కోట్లు సంపాదిస్తున్న మహిళ
కొందరంతే.. తాముఅనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. మంచి ఉద్యోగం, చక్కటి సంపాదన, ఆర్థికంగా బాగా ఉన్నా కూడా ఏదో చేయాలనే తపన వారిని స్థిమితంగా ఉండ నీయదు. లండన్కు చెందిన నీషా షా ఈ కోవకు చెందినవారే. లండన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేస్తున్నా, ఏడాదికి రెండున్నర లక్షలకు డాలర్లకు పైగా జీతం. కానీ దాంతో సంతృప్తి దక్కలేదు. యూట్యూబర్గా సరికొత్త అడుగులు వేసింది. కట్ చేస్తే ఏడాదికి ఎనిమిది కోట్లు సంపాదిస్తోంది. నీషా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.నలుగురి కోసంఆరంకెల జీతం వస్తున్నా, బ్యాంకింగ్లో చేస్తున్నది కార్పొరేషన్లు, సార్వభౌమ ప్రభుత్వాలకు సహాయం చేయడమే కదా, తనకున్న విజ్ఞానం ద్వారా నలుగురి ప్రయోజన కోసం ఏదైనా చేయాలనిపించింది. దీనికి తగ్గట్టు చేస్తున్న పని సంతృప్తి నివ్వలేదు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి బిజినెస్ కంటెంట్ క్రియేటర్గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. 2023 జనవరిలో బ్యాంకింగ్ వృత్తిని వదిలి పూర్తిగా యూట్యూబ్నుకొనసాగించడానికి ధైర్యంగా ముందుకు సాగింది. ఒక్క ఏడాదిలోనే అనూహ్య విజయాన్నందుకుంది. View this post on Instagram A post shared by Nischa Shah (@nischa.me)2021 డిసెంబర్లో తన పేరుతోనే ఓ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించింది. తనకు ఆసక్తి , పట్టు ఉన్న పర్సనల్ ఫైనాన్స్, సెల్ఫ్ డెవలప్మెంట్, బిజినెస్కు సంబంధించిన అంశాలపై వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ప్రతి వారం రెండు వీడియోలు పోస్ట్ చేసేది. బిజినెస్ విషయాలు కావడం మొదట్లో ఆశించినంత ఆదరణ లభించలేదు. వెయ్యి మంది సబ్స్క్రైబర్ల కోసం దాదాపు సంవత్సరం వేచి చూడాల్సి వచ్చింది.అయినా పట్టుదలగా ముందుకే సాగింది. ఈ క్రమంలోనే 2022 సెప్టెంబరులో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఆమె అనుభవాలను వివరిస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. 50వేలకు పైగా సబ్స్క్రైబర్లు వచ్చారు. రూ.3 లక్షలు సంపాదించింది. అందరికంటే భిన్నంగా ఆర్థిక విషయాలపై అవగాహన కల్పింస్తూ తన అభిమానులను ఎడ్యుకేట్ చేస్తోంది. పర్సనల్ ఫైనాన్స్ గురించి సులభంగా, సరళంగా అర్థమయ్యేలా వీడియోలను షేర్ చేస్తుంది. ముఖ్యంగా "మనీ హ్యాబిట్స్ కీపింగ్ యు పూర్" నుండి "మీ తొలిపెట్టుబడి ఎలా పెట్టాలి" వరకు అంశాలపై సలహాలను అందిస్తోంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ పెట్టుబడి వ్యూహాలను అందిస్తుంది. ఆమె కంటెంట్ విభిన్నంగా, బిజినెస్లో చక్కటి సూచనలు సలహాలతో ఫాలోవర్ల మనసు దోచుకుంది. అలా 2024 మే నాటికి ఆమె సంపాదన రూ. 8 కోట్లను దాటేసింది. యూట్యూబ్ మానిటైజేషన్, కోర్సు విక్రయాలు, కార్పొరేట్ స్పీకింగ్ ఎంగేజ్మెంట్లు, బ్రాండ్స్ పార్టనర్షిప్ ఇందులో ఉన్నాయి. నచ్చిన పని చేయడంలో సంతోషం, విజయం ఉంటాయని చాటి చెప్పింది. సాధించాలన్న అభిరుచి ,పట్టుదల, టాలెంట్ ఉంటో ఆర్థికంగా ఎలా ఉన్నత శిఖరాలకు చేరవచ్చో నీషా స్టోరీ మనకు తెలియజేస్తుంది. లండన్కు చెందిన నీషా షా నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్ విభాగంలో డిగ్రీ , ఆ తర్వాత ఛార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) చదివారు. ఆ రోజుల్లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకోవడం అంటే దాదాపు 80 శాతం ఆదాయాన్ని కోల్పోవడమే. కానీ కష్టమైనా ఇష్టమైన నిర్ణయం తీసుకున్నా. ఇపుడు బ్యాంకింగ్ ఉద్యోగంలో పొందిన జీతం కంటే యూట్యూబర్గా ఎక్కువ సంపాదిస్తున్నాను. ఇది సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది- నీషా. -
Sheikh Hasina: ఆ అక్కకు.. చెల్లెలే ధైర్యం!
ఆగస్ట్ 15, 1975 సైనిక తిరుగుబాటులో బంగ్లాదేశ్ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్, అతడి భార్య, కుమారులు ఊచకోతకు గురయ్యారు. ఆ కల్లోల సమయంలో రెహమాన్ కుమార్తె రెహానా తన అక్క షేక్ హసీనాతో పాటు యూరప్లో ఉంది. అంత పెద్ద విషాదాన్ని, దుఃఖాన్ని తట్టుకోవడానికి ఎవరికి ఎవరు ధైర్యం చెప్పుకున్నారో తెలియదు.ఇక అప్పటి నుంచి వారిది వీడని బంధం అయింది. హసీనా ‘లైఫ్లాంగ్ షాడో’గా రెహానాకు పేరు పడిపోయింది. కుటుంబసభ్యుల ఊచకోత జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత బంగ్లాదేశీ విద్యావేత్త అహ్మద్ సిద్దిఖీని వివాహం చేసుకుంది రెహానా. ఆర్థిక కారణాల వల్ల లండన్లో జరిగిన ఈ పెళ్లికి షేక్ హసీనా వెళ్లలేకపోయింది అంటారు. తమ కుటుంబ సభ్యుల కిరాతక హత్యపై నిష్పాక్షిక విచారణకు పిలుపునిస్తూ మొదటిసారిగా అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది రెహానా. ఈ సమావేశంలో ప్రవాసంలో ఉన్న ఆమె రాజకీయ సహచరుల నుంచి అంతర్జాతీయ న్యాయనిపుణుల వరకు ఎంతోమంది పాల్గొన్నారు.క్రూరమైన సైనిక నియంతృత్వ నీడలో బంగ్లాదేశ్ ప్రజల దుస్థితిని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించింది రెహానా. కుటుంబ ఊచకోతకు సంబంధించిన అప్పటి విషాదం ఊహకు అందనిది. ఇప్పటి సంక్షోభం గురించి మాత్రం ఇద్దరికీ తెలుసు. నిరసనకారులు ఇంటిని చుట్టుముడుతున్నారు. మరోవైపు హసీనా సన్నిహితులు, సలహాదారులు పారిపోయే దారిలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి. ఆ పరిస్థితిలో కూడా అక్క చెయ్యి వీడలేదు రెహానా. ‘పారిపోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం’ అని అత్యంత సన్నిహితులు చెబుతున్నప్పటికీ ‘అది జరిగేది కాదు’ అంటూ వెనక్కి తగ్గలేదు హసీనా. ఆ సమయంలో వారు రెహానాను ఆశ్రయించారు. హసీనా దేశం వీడడానికి ఒప్పుకోవడానికి ఆమె కుమారుడు కారణమని, కాదు రెహానే కారణమని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఏది నిజం అయినప్పటికీ రెహనా అక్కతో పాటు ఇండియాలోకి అడుగు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.రెహానా కుమార్తె తులిప్ సిద్దిఖీ లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు. యూకేలో లేబర్ పార్టీ అధికారంలో ఉండడంతో బ్రిటన్ ప్రభుత్వాన్ని హసీనా ఆశ్రయం కోరింది. అయితే బ్రిటన్ నుంచి అనుకూల స్పందన రాకపోవడంతో ఇండియాను ఆశ్రయించక తప్పలేదు. అక్క అధికారిక పర్యటనలలో రెహానా ఉండేది. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభ (2006 –2008) సమయంలో హసీనా జైలులో ఉన్నప్పుడు అక్క తరపున పార్టీ సమావేశాలు నిర్వహించింది. కార్యకర్తల్లో ధైర్యం నింపింది. ఒక్క ముక్కలో చె΄్పాలంటే షేక్ హసీనాకు బంగ్లాదేశ్లో ఎంత చరిత్ర ఉందో ఆమె చెల్లెలు రెహానాకూ అంతే చరిత్ర ఉంది. ఆ చరిత్ర హసీనా వెలుగు ముందు మసక మసకగా కనిపించేది. అయితే ప్రతి కల్లోల సమయంలోనూ ఆమె పేరు మీద వెలుగు ప్రసరిస్తుంటుంది.‘రెహానా అక్కను తప్పుదారి పట్టించింది’ అని విమర్శించిన వారూ ఉన్నారు. ‘అక్క సరిౖయెన దారిలో పయనించడానికి, బలమైన నాయకురాలిగా ఎదగడానికి రెహానానే కారణం’ అన్నవారూ ఉన్నారు. ఈ వాదోపవాదాలు, నిజానిజాలతో సంబంధం లేకుండా ఒక్కమాట మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు... అక్కకు చెల్లి కొండంత అండగా నిలిచింది. నిలుస్తోంది. "షేక్ హసీనా పేరు వినిపించగానే ప్రతిధ్వనించే మరో పేరు... రెహానా. అలనాటి కల్లోల కాలం నుంచి అధికార పర్యటనల వరకు అక్క హసీనాతోనే ఉన్నది రెహానా. అక్క జైలుపాలైనప్పుడు పార్టీ క్యాడర్లో ధైర్యాన్ని నింపింది. ఒకప్పుడు కుటుంబాన్ని కోల్పోయి... ఇప్పుడు అధికారాన్ని కోల్పోయి అక్కాచెల్లెళ్లు మన దేశంలో తలదాచుకోవడానికి శరాణార్థులుగా వచ్చారు..." -
వయనాడ్ వారియర్స్: స్త్రీని కాబట్టి వెనక్కు తగ్గాలా?
ప్రమాదం జరిగినప్పుడు స్త్రీలను అక్కడకు వెళ్లనివ్వరు. చాలామంది స్త్రీలు తమ భర్త, కొడుకులను సహాయానికి పంపడానికి సంశయిస్తారు. కాని వయనాడ్ వరద బీభత్సం సంభవించినప్పుడు ఒక అంగన్వాడి టీచర్ రక్షణ దళాలతో సమానంగా రంగంలో దిగింది. సహాయక చర్యల్లో పాల్గొంది. ‘ఇంత దారుణ పరిస్థితిలో అందరూ ఉంటే స్త్రీని కాబట్టి నేను వెనక్కు తగ్గాలా?’ అని ప్రశ్నించిందామె.వయనాడ్లోని చిన్న పల్లె ముప్పైనాడ్. అక్కడ అంగన్వాడి టీచర్గా పని చేస్తోంది 36 ఏళ్ల విజయకుమారి. జూలై 30 తెల్లవారుజామున నాలుగు గంటలకు ఫోన్ కాల్ అందుకుంది. వాళ్ల పల్లె నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న చూరల్మలను వరద చుట్టుముట్టిందని అందరూ ప్రమాదంలో ఉన్నారని. ఆమె అంగన్వాడి టీచర్. ప్రమాదస్థలంలో ఆమెకు ఏ విధమైన విధులు లేవు ఒక ఉద్యోగిగా. ఒక పౌరురాలిగా ఎలాంటి నిర్బంధం లేదు సేవకు. కాని ఆమె ఆగలేక΄ోయింది. వెంటనే బయల్దేరడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. బయట భారీ వర్షం. హోరు గాలి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. అయినా సరే తన టూ వీలర్ తీసి చూరల్మలకు బయలుదేరింది. తెల్లవారుజాము ఐదు అవుతుండగా అక్కడకు చేరుకుంది.కాని అక్కడ కనిపించిన దృశ్యం ఆమెను అవాక్కు చేసింది. తనకు బాగా పరిచయమైనప్రాంతం, జనావాసం ఇప్పుడు కేవలం బురదదిబ్బ. ఎవరు ఏమయ్యారో తెలియదు. సహాయ బృందాలు వచ్చి అప్పుడప్పుడే సహాయక చర్యలు మొదలెట్టాయి. విజయకుమారి ఏమీ ఆలోచించలేదు. వెంటనే రంగంలో దిగింది. వారికి తనను పరిచయం చేసుకుని అగ్నిమాపక బృందం వారి షూస్, ఇనుపటోపి పెట్టుకుని రంగంలో దిగింది. ఆ తర్వాత ఆమె చేసినదంతా ఎవరూ చేయలేనంత సేవ. ‘నా ఎదురుగా మహా విపత్తు.ప్రాణంపోయిన వారు ఎందరో. ఇలాంటి సందర్భంలో స్రీగా వెనక్కు తగ్గాలా? అనిపించింది. కాని మనిషిగా ముందుకే వెళ్లాలని నిశ్చయించుకున్నాను. సహాయక చర్యల్లో పాల్గొన్నాను. తెల్లవారుజాము 5 నుంచి 8 లోపు ఎన్నో మృతదేహాలను వెలికి తీసి రవాణా చేయడంలో సాయ పడ్డాను’ అందామె.పనికి వచ్చిన కరాటే..విజయకుమారికిపోలీసు కావాలని చిన్నప్పటి నుంచి కోరిక.పోలీసు కావాలని కరాటే నేర్చుకొని బ్రౌన్ బెల్ట్ వరకూ వెళ్లింది. అంతేకాదు పరీక్షలు రాసిపోలీస్గా సెలెక్ట్ అయ్యింది కూడా. కాని వాళ్ల నాన్నకు ఆమె ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అపాయింట్మెంట్ లెటర్ చింపేశాడు. ఆమె అంగన్వాడి టీచర్గా మిగలాల్సి వచ్చింది. పోలీస్ కావాలని నేను తీసుకున్న కరాటే శిక్షణ, చేసిన ఎక్సర్సైజులు నాకు ఈ సమయంలో తోడు వచ్చాయి. రక్షణ దళాలతో సమానంగా నేను కష్టపడ్డాను. మనిషికి మనిషి సాయం చేయాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ఈ సమయంలో ఎందరో స్త్రీలు దుఃఖంతో స్పృహ త΄్పారు. సహాయక బృందాల్లో అందరూ మగవారే ఉంటారు. వారు ఓదార్చలేరు. కాని నేను స్త్రీని కావడం వల్ల వారిని దగ్గరకు తీసుకొని ఓదార్చగలిగాను. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలు ఉండాలి స్త్రీల కోసం’ అంటుంది విజయకుమారి. ఆమె సేవలను అందరూ మెచ్చుకుంటున్నారు. -
వయనాడ్ వారియర్స్: ఈ తల్లి ఒక అద్భుతం!
ప్రకృతి ప్రమాదాలు సంభవించినప్పుడు పాత బట్టలు, గిన్నెలు తీసుకుని బయల్దేరతారు కొందరు. కానీ, తల్లిని కోల్పోయి పాలకోసం ఏడుస్తున్న చంటిపిల్లలకు తన పాలు ఇవ్వడానికి బయల్దేరింది ఆ తల్లి.ప్రకృతి ప్రకోపంతో వయనాడు తల్లడిల్లితే ఆ విషాదంలో కొందరు శిశువులు తల్లిపాలు లేక అల్లాడారు. అయితే ఆ వార్త తెలిసిన వెంటనే ఇడుక్కికి చెందిన భావన బాధిత శిబిరాల దగ్గరకు వెళ్లి తన పాలు అందించింది. నాలుగేళ్ల వయసు, నాలుగు నెలల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఆమెకు ఉన్నారు. ఆమె భర్త సజిన్ డ్రైవర్గా పనిచేస్తాడు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు. వయనాడ్లోని పసికందుల అవస్థను భార్యకు చెప్పి తల్లి పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాడు.ఇడుక్కిలోని వారి ఇంటి నుండి పికప్ ట్రక్లో కేరళలోని వయనాడ్ కొండలపైకి వెళ్లి మెప్పాడిలోని శిబిరాల్లో కుటుంబాలకు సేవ చేసిన తర్వాత ఇడుక్కికి తిరిగి వచ్చారు ఆ దంపతులు. ‘మేం కొన్ని శిబిరాలు, హాస్టళ్లను సందర్శించాం. నేను ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న కొంత మంది పిల్లలకు నా పాలు ఇచ్చాను. కొందరికి ఆహారాన్ని తినిపించాను. కొండచరియలు విరిగిపడి గాయపడిన తల్లులు కోలుకున్న వెంటనే తమ పిల్లల బాధ్యతలు స్వీకరించారు. మేం ఒక కుటుంబంగా పిల్లల్ని చూసుకున్నాం. నేను చేస్తున్న పని తెలిసి చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు మా ట్రిప్ను స్పాన్సర్ చేస్తామన్నారు. కానీ, ఆ మాత్రం ఖర్చును భరించలేమా? నేను తల్లిని, పిల్లలకు తల్లి పాలు ఉత్తమమని నాకు తెలుసు. అందుకే, వాటిని కొందరికైనా అందించాలనుకున్నాను’ అని భావన చెప్పింది. -
‘కౌసల్య–క్వీన్ ఆఫ్ హార్ట్స్’.. ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?!
ఇతిహాసాల్లో స్త్రీ పాత్రలకు ఉన్నప్రాధాన్యత ఎంత?! భగవంతునికే పునర్జన్మను ఇచ్చిన స్త్రీ అంటే ఆమె ఎంత గొప్పదై ఉండాలి?! మానవ భావోద్వేగాలైన కోపం, అసూయ, ఆనందం, దుఃఖం, సంతృప్తి.. వ్యక్తిత్వాలలో నలుపు–తెలుపుల వడబోతలో వుండే షేడ్స్ ఎన్ని?! ఇలా ఎన్నో సందేహాలకు సమాధానాలు వెతుకుతూ ‘కౌసల్య’ను మన ముందుకు తెచ్చింది విభా సంగీత కృష్ణకుమార్. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్లో బయాలజీలో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చేస్తున్న విభా సంగీత ‘కౌసల్య– క్వీన్ ఆఫ్ హార్ట్స్’ పుస్తకాన్ని రచించింది. రామాయణంలో కొడుకు జీవితంలో స్త్రీ పాత్రకు ఉన్న ప్రాధాన్యత గురించి రాసిన ‘కౌసల్య’ పుస్తకం విభాకు మంచి పేరు తెచ్చింది. శాస్త్రీయ సంగీతంలోనూ ప్రావీణ్యురాలైన విభా సంగీతను కలిస్తే ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు.‘‘నేను పుట్టి పెరిగింది చెన్నై. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్లో బయాలజీ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్లో రెండవ సంవత్సరం చదువుతున్నాను. మా అమ్మానాన్నలు సీత, కృష్ణకుమార్ ఇద్దరూ ఉద్యోగస్తులే. రామాయణాన్ని రకరకాల కథనాల ద్వారా వింటూ పెరిగాను. అవన్నీ చాలా ఆసక్తిగా అనిపించేవి. ఈ క్రమంలోనే రామాయణంలోని స్త్రీల పాత్రల గురించి, వారి మనస్తత్వాల గురించి బాగా ఆలోచించేదాన్ని. అందులో కౌసల్య ప్రస్తావన గురించి వచ్చినప్పుడు చాలా ధర్మబద్ధమైన మహిళలలో ఒకరిగా, క్లుప్తంగా ఆమె పాత్ర ఉంది. భగవంతునికి పునర్జన్మను ఇచ్చిన స్త్రీ అంటే ఆమె ఎంత గొప్పదై ఉండాలి. ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం దక్కిందా అనిపించింది. ఆ ఆలోచన నుంచి పుట్టుకువచ్చిందే ‘కౌసల్య’. ఈ పుస్తకాన్ని పూర్తిగా కౌసల్య దృష్టి కోణం నుండే తీసుకున్నాను.మొదటి పుస్తకం..పుస్తకం రాయడం పూర్తయ్యేవరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ‘రామాయణం స్ఫూర్తితో ఎన్నో పుస్తకాలు, సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. వాటికి భిన్నంగా ఏం రాసుంటుంది ఈ అమ్మాయి’ అని అనుకుంటారు. నా పుస్తకంలో నా పాత్రలన్నీ మనుషులే. వారిని అతిగా ΄÷గడలేదు. అలాగని, వారిప్రాధాన్యతలను తగ్గించలేదు. మానవ భావోద్వేగాలు అన్నీ ఉంటాయి. వ్యక్తిత్వాలలో నలుపు–తెలుపు మాత్రమే కాదు వివిధ రకాల షేడ్స్ కూడా ఉంటాయి. ఇంతకు ముందు కొన్ని పుస్తకాలు రాశాను. కానీ, అవి ప్రచురించలేదు. ‘కౌసల్య– క్వీన్ ఆఫ్ హార్ట్స్’ నా మొదటి పుస్తకం. ఆంగ్లభాషా పత్రిక ‘శృతి’ మ్యాగజీన్కు కరస్పాండెంట్గా ఉన్నాను. ఈ మ్యాగజీన్లో నా వ్యాసాలు, సమీక్షలు ప్రచురించారు. ఆ విధంగా నా గురించి చాలామందికి తెలిసింది.మార్పులు చేసుకుంటూ..ఈ పుస్తకాన్ని రెండేళ్ల క్రితం జూలై 2022లోప్రారంభించాను. అలాగని నిరంతరాయంగా రాయలేదు. దీంతో పాటు అకడమిక్ బాధ్యతలు కూడా ఉన్నాయి. కిందటేడాది 84,000 పదాలతో పూర్తి చేసి అనేక మార్పులు చేశాను. ఈ నవల ప్రస్తుత వెర్షన్లో 65,000 పదాలు ఉంటాయి. జేకె పేపర్స్ ఆథర్స్ అవార్డ్ రావడం, ఢిల్లీకి చెందిన పబ్లిషర్, ఎడిటర్ రీడొమానియ నాకు ఎంతో ్రపోత్సాహాన్ని ఇచ్చారు. నేను చదువుకుంటున్నది సైన్స్కు సంబంధించినది. కథలు రాయడాన్ని ఇష్టపడతాను. శాస్త్రీయ సంగీతం నాకున్న మరో అభిరుచి.సామాన్యులకు సైన్స్..‘సమాజ శ్రేయస్సుకు పాటుపడటమే నా ముందున్న లక్ష్యం. రకరకాల వ్యాధుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. నా చదువును కొనసాగిస్తూనే వాటికి సంబంధించిన అధ్యయనం కూడా చేయాలనుకుంటున్నాను. కర్ణాటక సంగీతంలో చూపించిన ప్రతిభకు గానూ వందకు పైగా బహుమతులు అందుకున్నాను. భారత ప్రభుత్వం నుండి సిసిఆర్టి స్కాలర్షిప్ పొందాను. నా రచనకు వచ్చిన మొదటి అవార్డును మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను’ అంటుంది విభా సంగీత. – పరియాద రామ్మోహన్, సాక్షి, హైదరాబాద్ఇవి చదవండి: శభాష్ శంకర్! పదిహేనేళ్ల వయస్సులోనే ఏఐ స్టార్టప్గా.. -
Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో..
థార్లోని ఇసుక దిబ్బల గుండె సవ్వడి విన్నది. అరుణాచల్ప్రదేశ్లోని పర్వతశ్రేణులతో ఆత్మీయ స్నేహం చేసింది. అస్పాంలోని వరద మైదానాలలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న కనీళ్లను చూసింది. కేరళ, గోవా తీరాలలో ఎన్నో కథలు విన్నది. కొద్దిమందికి ప్రయాణం ప్రయాణం కోసం మాత్రమే కాదు. ఆనందమార్గం మాత్రమే కాదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక అన్వేషణ. తన అన్వేషణలో అందం నుంచి విధ్వంసం వరకు ప్రకృతికి సంబంధించి ఎన్నో కోణాలను కళ్లారా చూసింది బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఆర్టిస్ట్ ఆరతి కుమార్ రావు....రాజస్థాన్లో ఒక చిన్న గ్రామానికి చెందిన చత్తర్సింగ్ గుక్కెడు నీటి కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పశ్చిమబెంగాల్లో ఒక బ్యారేజ్ నిర్మాణం వల్ల నిర్వాసితుడు అయిన తర్కిల్ భాయి నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు తక్కువేమీ కాదు. సుందర్బన్ప్రాంతానికి చెందిన ఆశిత్ మండల్ వేట మానుకొని వ్యవసాయం వైపు రావడానికి ఎంతో కథ ఉంది. బంగ్లాదేశ్లోని మత్స్యకార్మికుడి పిల్లాడిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేస్తే ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ ఏడ్చే దృశ్యం ఎప్పటికీ మరవలేనిది.ఒకటా... రెండా ఆరతి కుమార్ ఎన్నెన్ని జీవితాలను చూసింది! ఆ దృశ్యాలు ఊరకే ΄ోలేదు. అక్షరాలై పుస్తకంలోకి ప్రవహించాయి. ఛాయాచిత్రాలై కళ్లకు కట్టాయి. ఒక్కసారి గతంలోకి వెళితే... ‘ఉద్యోగం మానేస్తున్నావట ఎందుకు?’ అనే ప్రశ్నకు ఆరతి కుమార్ నోట వినిపించిన మాట అక్కడ ఉన్నవాళ్లను ఆశ్చర్యానికి గురి చేసింది.‘ప్రకృతి గురించి రాయాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం మానేస్తున్నాను’ అని చెప్పింది ఆమె. యూనివర్శిటీ ఆఫ్ పుణెలో ఎంఎస్సీ, థండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్–ఆరిజోనాలో ఎంబీఏ, ఆరిజోనా యూనివర్శిటీలో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన ఆరతి అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఇన్టెల్లో ఉద్యోగం చేసింది. కొంత కాలం తరువాత తనకు ఉద్యోగం కరెక్ట్ కాదు అనుకుంది. సంచారానికే ప్రాధాన్యత ఇచ్చింది.బ్రహ్మపుత్ర నది పరివాహకప్రాంతాలకు సంబంధించిన అనుభవాలను బ్లాగ్లో రాసింది. పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఎన్నోప్రాంతాలు తిరిగిన ఆరతి ‘మార్జిన్ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ పేరుతో రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. ప్రకృతి అందాలే కాదు వివిధ రూ΄ాల్లో కొనసాగుతున్న పురా జ్ఞానం వరకు ఎన్నో అంశాల ప్రస్తావన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన అందం నుంచి వైవిధ్యం వరకు, వైవిధ్యం నుంచి వైరుధ్యం వరకు తన ప్రయాణాలలో ఎన్నో విషయాలను తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను అక్షరాలు, ఛాయాచిత్రాలతో ప్రజలకు చేరువ చేస్తోంది ఆరతి కుమార్ రావు.భూమాత మాట్లాడుతోంది విందామా!ఆరతి కుమార్ రావు రాసిన‘మార్జిన్ల్యాండ్స్’ పుస్తకం కాలక్షేప పుస్తకం కాదు. కళ్లు తెరిపించే పుస్తకం. ఇది మనల్ని మనదైన జల సంస్కృతిని, వివిధ సాంస్కృతిక కళారూ΄ాలను పరిచయం చేస్తుంది.– ‘ప్రకృతి దృశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం తగినంత సమయాన్ని తప్పకుండా వెచ్చించాలి. దానిలో జీవించాలి. దానితో ఏకం కావాలి’ అంటుంది ఆరతి.– ఈ పుస్తకం ద్వారా మన సంస్కృతిలోని అద్భుతాలను మాత్రమే కాదు తెలిసో తెలియకో మనం అనుసరిస్తున్న హానికరమైన విధానాలు, ప్రకృతి విపత్తుల గురించి తెలియజేస్తుంది.– ‘మన సంప్రదాయ జ్ఞానంలో భూమిని వినండి అనే మాట ఉంది. భూమాత చెప్పే మాటలు వింటే ఏం చేయకూడదో, ఏం చేయాలో తెలుస్తుంది’ అంటుంది ఆరతి కుమార్ రావు.ఇవి చదవండి: Aruna Roy: 'ఈ పయనం సామాజికం'! -
Aruna Roy: 'ఈ పయనం సామాజికం'!
‘మహిళలు ఐఏయస్ కావడం కష్టం’ అనుకునే ఆ రోజుల్లో తొలి ప్రయత్నంలోనే ఐఏయస్ సాధించింది. ‘ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే, ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడనప్పుడు ఆ ఉద్యోగం చేయడం వృథా’ అనుకొని ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాక్షేత్రంలోకి వచ్చింది అరుణారాయ్. గ్రామీణ మహిళలతో కలిసి పోయి ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. తాజా విషయానికి వస్తే... తన జ్ఞాపకాలను ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చింది. ఈ సందర్భంగా ఆమె ఉద్యమ ప్రయాణం గురించి...మనం పుట్టి, పెరిగిన వాతావరణం ఏదో రకంగా బలమైన ప్రభావం చూపుతుంది. కాలం కంటే కాస్త ముందుగా ఆలోచించే కుటుంబంలో చెన్నైలో పుట్టి పెరిగింది అరుణ. ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో పోస్ట్–గ్రాడ్యుయేషన్ చేసింది.‘మహిళలు ఐఏఎస్కు సెలెక్ట్ కాలేరు’ అని బలంగా అనుకునే కాలంలో తొలి ప్రయత్నంలోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పరీక్ష రాసి ఎంపికైంది. సబ్–డివిజనల్ మెజిస్ట్రేట్ నుంచి ‘లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిల్లీ’ సెక్రెటరీ వరకు ఎన్నో పదవులు నిర్వహించినప్పటికీ తనలో ఏదో అసంతృప్తి ఉండేది. వ్యవస్థీకృతమైన అవినీతికి సంబంధించిన అసంతృప్తి అది. ఈ అసంతృప్తులు తారస్థాయికి చేరి ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఉద్యోగానికి ఆరు నెలలు సెలవు పెట్టి భర్త సంజిత్ రాయ్ నిర్వహిస్తున్న సోషల్ వర్క్ రిసెర్చ్ సెంటర్(బేర్ఫుట్ కాలేజీ)లో చేరింది. రాజస్థాన్లోని తిలోనియ గ్రామంలో ఉన్న ‘బేర్ఫుట్ కాలేజీ’లో పనిచేయడం అరుణకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. ఉద్యోగానికి రాజీనామా చేసి సేవాపథంలోకి వచ్చింది.గ్రామాల్లో విద్యుత్ సరఫరా, తాగు నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం... మొదలైనవి లేని కాలం అది. కిలోమీటర్ల కొద్దీ దూరం నడవాల్సి వచ్చేది. అయితే ఈ అసౌకర్యాలేవీ ఎప్పుడూ అరుణకు కష్టంగా అనిపించలేదు. మహిళలు ఒక బృందంగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి పాటుపడేలా కృషి చేసింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు ఆహ్వానం అందినప్పటికీ అక్కడికి వెళ్లకపోగా దానికి ప్రత్యామ్నాయంగా రాజస్థాన్లో మహిళా మేళ (మహిళల పండగ) నిర్వహించింది. కెన్యాలో జరిగే అంతర్జాతీయ మహిళా సదస్సుకు, ఈ స్థానిక సదస్సుకు తేడా ఏమిటంటే... మొదటి దానిలో మధ్యతరగతి, ఆ పై తరగతి విద్యాధికులైన మహిళలే ఎక్కువగా పాల్గొనే సదస్సు. ఇక రెండోది పూర్తిగా గ్రామీణ మహిళలు, శ్రామిక మహిళల కోసం నిర్వహించిన సదస్సు. ఈ తరహా పండగ జరగడం దేశంలో మొదటిసారి.‘మహిళ మేళ’ ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక–రాజకీయ చర్చలకు వేదిక అయింది. మహిళలపై జరిగే హింసను నిరోధించడానికి జరిగిన తొలి బహిరంగ చర్చావేదిక అయింది. ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అరుణారాయ్ బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడింది. ‘మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్’ ఆర్గనైజేషన్ ద్వారా సోషల్ యాక్టివిస్ట్గా మరింత క్రియాశీలంగా పనిచేయడం ్రపారంభించింది.స్థూలంగా చెప్పాలంటే... అరుణా రాయ్ అంటే ఒక నామం కాదు. అనేకానేక ఉద్యమాల సమాహారం. సమాజహితాన్ని కోరుకునే వారికి స్ఫూర్తిదాయక ఉత్తేజం.పేద మహిళల కోసం...‘జ్ఞానం యొక్క ఉద్దేశం జ్ఞానం కాదు. కార్యాచరణ’ అంటాడు అరిస్టాటిల్. జ్ఞానం అనేది బుర్రలో భద్రపరుచుకొని మురిసిపోవడానికి కాదు. ఆ జ్ఞాన ఫలాలను ఆచరణలోకి, పదిమంది ఉపయోగంలోకి తీసుకురావడం ముఖ్యం. విశ్వవిద్యాలయాల నుంచి మారు మూల పల్లెల వరకు జ్ఞానమార్గంలో పయనించిన అరుణా రాయ్ ఆ జ్ఞానాన్ని పేద మహిళల సంక్షేమం, చైతన్యం కోసం వినియోగించింది. ఉద్యోగ, ఉద్యమ జ్ఞాపకాల ‘ది పర్సనల్ ఈజ్ పొలిటికల్’ ఆమె వ్యక్తిగతం కాదు. సామాజికం. ఉద్యమ బాటలో పయనించడానికి ఉపకరించే ఇంధనం. -
వంధ్యత్వం కాదు.. అంధత్వం!
ప్రకృతిలోని జీవరాశులను ప్రేమించే వాళ్లంతా మాతృత్వం కలవారే! దీనికి జెండర్ లేదు. వాత్సల్యం, కరుణే దానికి కొలమానం! అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వాన్ని ఫాలో అవుతున్నవాళ్లకు అర్థమయ్యే ఉంటుంది ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకో! అవును, కమలా హ్యారిస్ గురించి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ ప్రస్తావన. రాజకీయ ఎన్నికల ప్రచారంలో హుందాతనం.. అగ్రరాజ్యంలోనూ పూజ్యమని అర్థమైంది. అవతలి పక్షాన్ని ఎదుర్కోవడానికి ముఖ్యంగా మహిళానేతల విషయంలో ఎక్కడైనా వాళ్ల దక్షత కన్నా వ్యక్తిగతేచ్ఛలే పరిగణనలోకి తీసుకునేట్టున్నారు.దీనికి అభివృద్ధి చెందిన దేశాలు, వర్తమాన దేశాలనే వ్యత్యాసం లేనట్టుంది. పిల్లల్లేని మహిళలు దుర్భర జీవితాన్ని గడుపుతారని, వాళ్లు సమాజానికి భారమే తప్ప వాళ్ల వల్ల ఒరుగుతున్నదేమీ లేదని రిపబ్లికన్పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వాక్రుచ్చాడు. ఈ కామెంట్.. పిల్లల్లేని కమలా హ్యారిస్నుద్దేశించేనని ప్రపంచమంతా గ్రహించి, ఆమె పక్షాన నిలిచింది. పిల్లలను కనాలా వద్దా అనేది పిల్లల్ని కనే శారీరక స్థితి, పెంచే సామాజిక పరిస్థితులను బట్టిమహిళ నిర్ణయించుకోవాలని, ఆ నిర్ణయాధికారం ఆమె హక్కని నాగరిక సమాజం గొంతు చించుకుని అరిచింది. దాని మీద ఉద్యమాలనూ లేవనెత్తింది.ఇంతలోతైన ఆలోచన, అంత విశాలమైన దృక్పథం లేని వాన్స్ లాంటి వాళ్లకు కనీసం దాన్ని ఓ పర్సనల్ చాయిస్గా గుర్తించాలనే స్పృహ కూడా లేనట్టుంది. పెళ్లి, పిల్లలు అనేది వ్యక్తిగతం. పిల్లల్లేని చాలామంది ఆడవాళ్లు అనాథలను చేరదీసి, ఇరుగుపొరుగు పిల్లలను పోగేసి.. బంధువుల బిడ్డలను అక్కున చేర్చుకుని వాళ్లను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దిన ఉదంతాలు కోకొల్లలు! ఇందుకు కమలా హ్యారిస్ కూడా ఉదాహరణగా నిలుస్తారు. కడుపున పుట్టిన పిల్లల్లేక΄ోయినా ఆమె అద్భుతమైన మాతృమూర్తి! తన భర్త పిల్లలకు అమ్మతనాన్ని పంచింది. జేడీ వాన్స్ వ్యాఖ్యల క్రమంలో ఆ పిల్లలు కమలా హ్యారిస్ చేయి వదల్లేదు.ఆమె భుజాల చుట్టూ చేయివేసి ఆమె మనోనిబ్బరాన్ని మరింత పెంచుతున్నారు. దీన్ని ప్రపంచమూ హర్షిస్తోంది. అలాంటి మాతృమూర్తి మీద నోరుపారేసుకున్న వాన్స్.. తండ్రైనా హృదయం లేనివాడిగా ముద్రపడ్డాడు. నిజానికి అమెరికా అధ్యక్ష్య పదవికి తమ అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ని ప్రకటించగానే ఆపార్టీ విజయావకాశాలు అనూహ్యంగా పెరిగాయి. ఆ ధాటిని తట్టుకోలేక రిపబ్లికన్పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు ప్రతిపక్ష అభ్యర్థి జెండర్ను లక్ష్యంగా చేసుకుని, ఆమె వ్యక్తిగత జీవితం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.కమలా హ్యారిస్ మాతృత్వానికి.. అమెరికా అవసరాలకు లంకె ఏంటి? అక్కడే కాదు ఎక్కడైనా సరే.. స్త్రీల వ్యక్తిగత విషయాలకు.. దేశ పురోగతికి ఏమిటి సంబంధం? ఒకవేళ సంబంధమే ఉంది అనుకుంటే అప్పుడు పురుషుడి వ్యక్తిగత విషయాలూ అంతే ప్రభావం చూపిస్తాయి కదా! పెళ్లి, పిల్లలు.. ఎవరికైనా వాళ్ల వ్యక్తిగతమే! ఒకవేళ వాన్స్ అన్నదే తీసుకున్నా.. పెళ్లి, పిల్లలు అనే బాధ్యత లేని స్త్రీలు దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతిలో చెప్పుకోదగ్గపాత్రేపోషిస్తున్నారు. మాతృత్వాన్ని మహత్తర అనుభూతిగా చూపి ఆ బంధనంతో స్త్రీలను కట్టిపడేసి.. తమకుపోటీలేకుండా చూసుకోవాలనుకున్న పురుషాధిపత్య భావజాలం అమెరికన్లలోనూ జాస్తి అని వాన్స్ ద్వారా మరోసారి రుజువైంది. :::సరస్వతి రమ -
నమ్మరు గానీ... ఈ మహిళల రూటే సెపరేట్!
పుట్టుకతో అందరూ ఒకలా ఉండరు. అయితే తమలోని ప్రత్యేకను గుర్తించి, దాన్ని అద్భుతంగా మలుచుకునే వారు చాలా తక్కువ మందే ఉంటారు. తమ ప్రత్యేకతను మరింత స్పెషల్గా మలుచుకుని పాపులర్ అవుతారు. రికార్డులకెక్కుతారు. అదీ నమ్మశక్యంగాని రీతిలో. అలాంటి వండర్ విమెన్ గురించి చూద్దాం! న్యాకిమ్ గట్వేచ : 1993 జనవరి 27న పుట్టింది ఈ బ్యూటీ దక్షిణ సూడానీస్ సంతతికి చెందిన ఇథియోపియన్-జన్మించిన అమెరికన్ మోడల్. భూమిపై అత్యంత ముదురు చర్మపు రంగును కలిగి ఉన్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ప్రవేశించింది. తన ప్రత్యేకమైన అందంతో ఇన్స్టాలో చాలా పాపులర్ ఈ బ్యూటీ.మాకీ కర్రిన్ : ప్రపంచంలోనే అత్యంత పొడవాటి కాళ్లను కలిగి ఉన్న మహిళగా రికార్డు ఈమె సొంతం. నాలుగు సంవత్సరాలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను ఎవరూ బ్రేక్ చేయడం లేదు. యుక్తవయసులోనే అంటే 17 ఏళ్ల వయసులోనే ఈరికార్డుసాధించింది. ఆరడుగులమంచిన ఈ అందగత్తె ఎడమ కాలు పొడవు 53.255 అంగుళాలు, కాగా కుడి కాలు 52.874అంగుళాలు.కాథీ జంగ్ ప్రపంచంలోనే అతి చిన్న నడుము ఉన్న సన్నజాజి తీగ. 1999లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 5 అడుగుల 8 అంగుళాలు పొడవుండే ఈ సుందరి నడుము 38.1 సెంటీమీటర్లు (15.0 అంగుళాలు)యు జియాన్క్సియా: చైనాకు చెందిన యు జియాన్క్సియా కనురెప్పలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 12.4 సెం.మీ. ఎడమకంటిరెప్పమీ ఉంటే వెంట్రుక పొడవుతో 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కొట్టేసింది. 20.5 సెంటీమీటర్ల పొడవుతో తరువాత తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఆ సమయంలో, ఆమె కనురెప్ప ఆమె ఎడమ కన్ను ఎగువ కనురెప్పపై బుద్ధుడు ఇచ్చిన బహుమతి అని నమ్ముతుంది.బీ మెల్విన్ జాంబియన్ మోడల్. పుట్టుకతోనే వెండిలాంటి మెరిసి తెల్లటి జుట్టుతో పుట్టింది. ఈ ప్రత్యేకతే ఆమెను మోడల్గా నిలబెట్టింది. ఇన్స్టాగ్రామ్లో స్టార్గా ఎదిగింది. వలేరియా వాలెరీవ్నా లుక్యానోవా (Valeria Valeryevna Lukyanova) అచ్చం బార్బీ బొమ్మలా కనిపించే పాపులర్ రష్యన్ మోడల్. ఆమె ప్రస్తుతం మెక్సికోలో నివసిస్తోంది. బార్బీలా మరింత సహజంగా ఆకుపచ్చ/బూడిద/నీలం కళ్లపై మేకప్ , కాంటాక్ట్ లెన్స్లను ఉపయోగిస్తుంది.లిబర్టీ బారోస్: ఎటు కావాలంటే పాములా మెలికలు తిరిగే ప్రపంచంలోనే తొలి అమ్మాయి. బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని అధిగమించేందుకు వ్యాయామం మొదలు పెట్టి అద్భుతంగా రాణించింది. 2024 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కింది. అంతేకాదు ఫ్లెక్సిబుల్ బ్యాక్ బెండ్ లో మూడు ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. అబ్బి అండ్ హెన్సెల్: వీరు అవిభక్త కవలలు. 1996లో ఓప్రా విన్ఫ్రే షో ద్వారా వెలుగులోకిచ్చింది. వీరికి గుండె, ఊపిరితిత్తులు, వెన్నుపాము ఒకటే. కానీ తినడానికి నోరు వేరుగా ఉన్నాయి. అలాగే చేతులు మూడు. ఆ తరువాత వీరికి 12 ఏళ్ల వయస్సున్నపుడు ఆపరేషన్ చేసి మూడో చేతిని తొలగించారు. వీరిద్దరూ కలిసి బైక్, కారు నడపడంలాంటి కలిసే చేస్తారు. 2021లో మాజీ సైనిక అధికారిని పెళ్లి కూడా చేసుకున్నారు.నటాలియా కుజ్నెత్సోవ్ : రష్యన్ పవర్లిఫ్టర్. 14 ఏళ్ల వయస్సులో బాడీబిల్డింగ్లోకి ఎంట్రీ ఇచ్చింది. 33 ఏళ్ల కుజ్నెత్సోవ్ కండలు తిరిగిన దేహంతో తన సత్తా చాటుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక టైటిళ్లను కైవసం చేసుకుంది. బాడీబిల్డర్ వ్లాడిస్లావ్ కుజ్నెత్సోవ్ను వివాహం చేసుకుంది. -
Palak Muchhal: సింగర్గానే కాదు.. సామాజిక సేవలోనూ తన వంతుగా కృషి..
పాలక్ ముచ్చల్ అనే పేరు వినిపించగానే తీయటి పాట ఒకటి గుర్తొస్తుంది సింగర్గా మంచి పేరు తెచ్చుకున్న పాలక్ సామాజిక సేవలోనూ తన వంతుగా కృషి చేస్తోంది. ఫండింగ్ ద్వారా ఇప్పటి వరకు మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించింది. బాలీవుడ్ సినిమా ‘ఎంఎస్ దోని–ది ఆన్టోల్డ్ స్టోరీ’లోని ‘కౌన్ తుఝే’ పాటతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది పాలక్. ఇండోర్కు చెందిన పాలక్కు కాలేజీ రోజుల నుంచి పాటతో పాటు సేవా బాటలో పయనించడం అంటే కూడా ఇష్టం.పాలక్ తొలి ఫండ్ రైజింగ్ ్రపాజెక్ట్ కార్గిల్ వీర సైనికుల కోసం చేసింది. ప్రతి షాప్ ముందుకు వెళ్లి దేశభక్తి గీతాలు పాడి ‘కార్గిల్ వీర సైనికులకు మీ వంతుగా సహాయం చేయండి’ అని అడిగేది. కళ, సామాజిక సేవను పాలక్ వేరు చేసి చూడదు. మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించడానికి తనలోని కళ బలమైన మాధ్యమంగా ఉపయోగపడుతుందని చెబుతుంది పాలక్.సినిమాల్లో అవకాశాలు దొరకని రోజుల్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి పేద పిల్లల కోసం విరాళాలు సేకరించేది. పాలక్ ఒక మ్యూజిక్ప్రోగ్రామ్ చేసిందంటే పది మంది పేద పిల్లల వైద్యానికి అవసరమైన డబ్బును సేకరించినట్లే. బాలీవుడ్లో సింగర్గా పాలక్కు మంచి పేరు రావడమే కాదు ఆ పేరు విరాళల సేకరణకు బాగా ఉపయోగపడింది.‘మీ పాట అద్భుతం’ అనే ప్రశంస కంటే, పేదింటి తల్లిదండ్రుల గొంతు నుంచి వినిపించే... ‘మీ వల్ల మా బిడ్డ బతికింది’ అనే మాట పాలక్కు ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. ఇప్పుడు పాలక్ వెయిటింగ్ లిస్ట్లో 413 మంది పిల్లలు ఉన్నారు. వారికి హార్ట్ సర్జరీలు చేయించాల్సిన బాధ్యతను భుజాలకెత్తుకుంది. ‘మనస్ఫూర్తిగా కోరుకుంటే అంతా మంచే జరుగుతుంది. పేదపిల్లలకు అండగా నిలవడానికి ఇది దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాను’ అంటుంది పాలక్ ముచ్చల్. -
మహిత.. తానొెక సూక్ష్మ లిఖిత!
అన్నం మహిత... చిన్నప్పుడు పెన్సిల్తో బొమ్మలు వేసింది. ఇప్పుడు పెన్సిల్ మీద గ్రంథాలు చెక్కుతోంది. మహనీయుల జీవిత చరిత్రలను పెన్సిల్ మీద రాస్తోంది. ఇప్పటి వరకు ఆమె రాసిన జీవిత చరిత్రలు, మహాగ్రంథాల జాబితా ఆమె వయసుకంటే పెద్దదిగా ఉంది. ఆంధ్రప్రదేశ్, బాపట్ల జల్లా, కారంచేడు మండలం, స్వర్ణ గ్రామానికి చెందిన మహిత... తాను సాధన చేస్తున్న మైక్రో ఆర్ట్ గురించి ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్న వివరాలివి..‘‘చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరినప్పుడు కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. ఆ ఖాళీ టైమ్లో బియ్యం మీద వినాయకుడు, జాతీయ పతకాలను చెక్కాను. ఆ తర్వాత మినుములు, పెసలు, బొబ్బర్లు మీద బొమ్మలు చెక్కాను. వాటిని చూసి మా నాన్న మహాభారతం ట్రై చెయ్యి, నీ సాధనకు గుర్తింపు వస్తుందన్నారు. సంస్కృత భాషలో మహాభారతంలోని 700 శ్లోకాలను 810 పెన్సిళ్ల మీద చెక్కాను. మొత్తం అక్షరాలు 67, 230, పదాల్లో చె΄్పాలంటే 7,238.కళను సాధన చేయడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే... ఒకటి పూర్తయిన తర్వాత మరొకటి చేయాలనిపిస్తుంది. మహాభారతం తర్వాత వాసవీ కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్ర, పుట్టపర్తి సాయిబాబా చరిత్ర, అనేకమంది ప్రముఖుల జీవితచరిత్రలను పెన్సిల్ ముక్కు మీద రాశాను. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అమరజీవి ΄÷ట్టి శ్రీరాములు, నెల్సన్మండేలా, ప్రధాని నరేంద్రమోదీ, స్వర్గీయ ఎన్టీఆర్, వైఎస్సార్, అంబేద్కర్, కరుణానిధి, కేసీఆర్, నరేంద్రమోదీ, ఎంఎస్రెడ్డితో΄ాటు ఏఎన్ఆర్ ఇంకా అనేక మంది సినీ ప్రముఖుల జీవితచరిత్రలను చెక్కాను. మన జాతీయగీతాన్ని ΄ాస్తా మీద చెక్కాను.కర్ణాటక రాష్ట్ర అవతరణ చరిత్రను కూడా రాశాను. నా కళకు గుర్తింపుగా చీరాల రోటరీ క్లబ్తో మొదలు ఉత్తరప్రదేశ్ ఆర్ట్ కాంపిటీషన్ వరకు అనేక పురస్కారాలందుకున్నాను. ఈ కళాసాధనను కొనసాగిస్తాను’’ అన్నారు అన్నం మహిత. సూక్ష్మ కళ ఆసక్తి కొద్దీ సాధన చేసే వాళ్లతోనే మనుగడ సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి శిక్షణ అవకాశం లభిస్తే ఎక్కువ మంది కళాకారులు తయారవుతారని ఈ సందర్భంగా మహిత తన అభిలాషను వ్యక్తం చేశారు. – వంగూరి సురేశ్కుమార్, సాక్షి, బాపట్ల జిల్లా -
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
ఆమె అందరిలా కాదు. సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఇష్టం. విభిన్నంగా ఉండటం తన నైజం. అందుకే చిన్నప్పటినుంచీ అందరిలా రంగుల లోకంలో విహరించలేదు. రంగులనే తన లోకంగా ఎంచుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు..అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దే గొప్ప శిల్పిగా అవతరించారు. మహిళా శిల్పిగా గత రెండు దశాబ్దాలుగా అనేక అపురూప శిల్పాలతో దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకున్న డా. స్నేహలత ప్రసాద్ను సాక్షి.కాం పలకరించింది.ప్రతి మహిళకూ ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉంటుంది. కానీ కుటుంబం, పెళ్లి, పిల్లల బాధ్యతలు వారికి కల సాకారానికి బ్రేక్ పడుతుంది. కానీ ఆ తరువాత వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తామేంటో నిరూపించుకుంటారు. ఆ కోవకు చెందిన వారే డా. స్నేహలత. ఆ అవకాశమే ‘సెకండ్ ఇన్నింగ్స్’ అంటారు స్నేహలత. ఈ సమయంలో భర్త, కుటుంబ సభ్యులు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు సృష్టించకుండా, చేయూతనందిస్తే అద్భుతాలు సృష్టిస్తారంటారు ఆమె. రాజస్థాన్లోని జోద్పూర్లో జన్మించారు స్నేహలత. తల్లి లీలాదేవి అండతో కళారంగంలోకి అడుగుపెట్టారు. ఫైన్ ఆర్ట్స్సబ్జెక్ట్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఆ తరువాత పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. పెళ్ళి తరువాత హైదరాబాద్కు రావడం, ఇద్దరు సంతానం కుటుంబం, పిల్లల బాధ్యతల నేపథ్యంలో ఆమె ఆలోచనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కానీ తనలోని సృజనాత్మక సామర్థ్యాలను వెలికి తీయాలనే కోరిక రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది.బాధ్యతల్లో కాస్తంత వెసులుబాటు, భర్త డా.ప్రసాద్ తోడ్పాటుతో తన కరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని అంటారు డా. స్నేహలత. అరుదైన తన కళకు ఆత్మవిశ్వాసాన్ని జోడించి ఆకాశమే హద్దుగా ఎదిగారు. అతిపెద్ద పెయింటింగ్ వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆమె కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు. ప్రకృతి, పర్యావరణ ప్రేమికురాలు కూడా. ప్రకృతి మీద ఆమెకున్న ప్రేమ అంతా ఆమె ప్రతీ పెయింటింగ్లోనూ గోచరిస్తుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్లో అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించారు. దాదాపు అన్ని గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ విజయమే తనకు మరింత ప్రోత్సాహాన్నించింది అన్నారు ఆమె.చిత్రకళ కరియర్ ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా శిల్ప కళతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ కళమీద అంతులేని మక్కువ ఏర్పడింది. పట్టుదలగా అందులోనూ రాణించారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మహిళా శిల్పులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె తొలి శిల్పం తెలంగాణా తల్లిది కావడం విశేషం. అలాగే పారిశ్రామిక వ్యర్థాలను అందమైన కళాకృతులుగా, రాయి, ఫైబర్ ఇలా మీడియం ఏదైనా దాన్ని అద్భుతంగా మలచడంలోనూ ఆమెది అందె వేసిన చేయి.స్నేహఆర్ట్స్ పేరుతో ఆర్ట్ క్యాంపులు, ఆర్ట్ ఫెయిర్, కోర్సులు, ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్లు, ఆర్ట్ టాక్లు, లైవ్ డెమోలు, డాక్యుమెంటరీలతో ఎపుడూ బిజీగా ఉండే స్నేహలత ‘రంగభూమి’ అనే వేదిక ద్వారా ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. పుణేలో పర్యావరణ శిల్పంపుణేలోని వాకాడ్లో, కస్తూరి చౌక్ వద్ద ఇటీవల ఒక పర్యావరణ శిల్పాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో కార్మికుల భద్రతకు చిహ్నమైన టోపీ,సమాజానికి, స్థిరత్వానికి మధ్య కీలకమైన బంధాన్ని తెలిపేలా డీఎన్ఏ గొలుసు, ఇంకా పరిశ్రమలు,శక్తి, ఆవిష్కరణల మేళవింపుతో దీన్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణ ,వాతావరణ మార్పులపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. 21 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రెండునెలలపాటు శ్రమించి తయారు చేయడం విశేషం. తెలంగాణా కోసం చార్మినార్పుట్టింది రాజస్టాన్లోనే అయినా తనకిష్టమైన కళలో రాణించింది మాత్రం హైదరాబాద్ వచ్చిన తరువాతే. అందుకే హైదరాబాద్ కోసం ఏదైనా చేయాలనే తపన నాలో చాలా ఉంది. తనకు అవకాశం లభిస్తే పరిశ్రమలనుంచి వచ్చిన ఇనప వస్తువులు, బోల్ట్లు, నట్లు తదితర స్క్రాప్తో తెలంగాణాకు తలమానికమైన చార్రితక కట్టడం ‘చార్మినార్’ను యథాతథంగా నిర్మించాలనుకుంటు న్నాననీ, అది కూడా సందర్శకులు చార్మినార్ పైకి ఎక్కి నగర అందాలను దర్శించే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలనుంచి సహకారం లభిస్తే దీన్ని సాధించి తీరుతానని చెప్పారు.చెత్తనుంచే చిత్రమైన కళాకృతులుపనికిరాకుండా పారవేసే చెత్త, ఇతర వ్యర్థాలనుంచి కళాఖండాలను తీర్చిదిద్దడం ద్వారా ప్రకృతికి, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, ముప్పును తగ్గించడం ఒక మహిళగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాలుష్య నివారణలో అందరమూ తలా ఇంత చేయాల్సిందే అని సూచించారు.చిన్నప్పటినుంచీ గొప్పగా, పెద్దగా సాధించాలనేదే నా తాపత్రయం. అందుకే మహిళలకు ప్రవేశం అరుదుగా లభించే శిల్ప కళను ఎంచుకున్నాను. శిల్పాన్ని చెక్కేటపుడు వచ్చే దుమ్ము, ధూళి నాకు కనిపించదు. 200 ఏళ్లకు పైగా చరిత్రను చూసిన ఒక పవిత్రమైన వస్తువును స్పృశిస్తున్న పారవశ్యం. అదొక గొప్ప అనుభూతి. తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డకు ప్రాణం పోసినంత సహజంగా శిల్పం ఆవిష్కృతమవుతుంది అంటారామె. అందుకే అనేక అవార్డులు, రివార్డులు ఆమెను వరించాయి. చిత్ర కళ అయినా, శిల్ప కళ అయినా ఇందులోనే గణితం కూడా ఇమిడి ఉంటుంది. ప్రతీ దానికి ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారమే పోవాలి. నా జీవితమూ అంతే. ఒక లెక్క ప్రకారం కలలు, కళల మేళవింపుతో ఒక అందమైన చిత్రంగా మల్చుకున్నాను అని చెప్పారు స్నేహలత.విద్యార్థుల కోసం గురుకులం‘‘గురుకుల లాంటి విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పట్టుదలగా, పూర్తి నిబద్దతతో చిత్రకళను, శిల్ప కళను నేర్చుకోవాలనే వారికి శిక్షణ ఇవ్వాలనేది నా లక్ష్యం. విద్యార్థులకు సరియైన రీతిలో శిక్షణ ఇవ్వాలి. దేశ సంస్కృతీ,సంప్రదాయాల మీద వారికి అవగాహన కల్పించాలి. ఆసక్తిని కలిగించాలి. అపుడే వారు ఎవరూ ఉహించలేని అద్భుతాలు సృష్టిస్తారు.’’- స్నేహలతమహిళలకో మాట‘ఆడపిల్లలకు కూడా ఆశలు, కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. పట్టుదలా ఉంటుంది. కానీ తొలుత నచ్చింది నేర్చుకోవడంలో అడ్డంకు లొస్తాయి. తీరా చదువుకున్నాక, కుటుంబం ముందు, కరియర్ తరువాత అనే కట్టుబాట్లు మరింత అవరోధంగా మారతాయి. ఇలాంటి కారణాల రీత్యా చాలామంది తమలోని ఆశలను చంపేసు కుంటున్నారు. కానీ, అలా కాదు. దొరికిన వెసులుబాటును ఉపయోగించుకుని మహిళలు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలి. సానుకూల ధోరణి, దృక్పథంతో ముందుకు పోవాలి...’ ఇదీ స్నేహలత మాట! -
ఒకేరోజు 85 వేల పండ్ల మొక్కలు! ప్రపంచ రికార్డు
ఛత్తీస్ఘడ్లోని గరియాబంద్ జిల్లాలో 17వేల మంది మహిళలు ఒకేరోజులో 85వేల పండ్ల మొక్కలను నాటడం ద్వారా రికార్డ్ సృష్టించారు. ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ పేరుతో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లాకేంద్రం వరకు కొత్తగా పెళ్లయిన వారు, గర్భిణులు, తల్లులు పాల్గొన్నారు. మామిడి, జామ, నిమ్మ, పనస... మొదలైన మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు, పౌష్టికాహార మెరుగుదలకు దోహదపడే ఈ మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించారు. వీరి ఘనతను ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. ‘మొక్క నాటాను. ఇక నా పని పూర్తయిపోయింది అనుకోడం లేదు. నేను నాటిన మొక్క మా అమ్మ, నా బిడ్డతో సమానం. కంటికి రెప్పలా చూసుకుంటాను’ అంటుంది దస్పూర్ గ్రామానికి చెందిన సునీత అనే గృహిణి. ఇది ఆమె మాటే కాదు ‘అమ్మ పేరు మీద ఒక చెట్టు’ కార్యక్రమంలో పాల్గొన్న పదిహేడు వేల మంది మహిళలది. -
73 సార్లు తిరస్కరించారు : కట్ చేస్తే..రూ. వేలకోట్ల విలువైన కంపెనీలకు సారధి
స్టార్టప్ ఎకోసిస్టమ్లో అత్యంత స్ఫూర్తిదాయకమైన మహిళ రుచి కల్రా. అనేక సవాళ్లను అధిగమించి, అసాధారణ విజయాన్ని సాధించిన స్వీయ-నిర్మిత వ్యవస్థాపకురాలు. స్టార్టప్ ప్రపంచంలో, భారతీయ స్టార్టప్ పరిశ్రమలో సూపర్వుమన్ రుచికల్రా. అయితే దీని వెనుక పెద్ద కథే ఉంది. తిరస్కారంలోంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యంతో సాధించిన విజయం ఉన్నాయి. రండి, రుచికల్రా సక్సెస్ గురించి తెలుసుకుందాం.రుచి కల్రా ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్. బీటెక్,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా సాధించింది. వ్యాపారవేత్తగా రాణించే కంటే ముందు కల్రా మెకిన్సేలో ఎనిమిది సంవత్సరాల పాటు భాగస్వామిగా పనిచేశారు.అయితే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె పెట్టుబడిదారులను సంప్రదించారు. కానీ ఆమె ఐడియాను అందరూ 73 మంది తిరస్కరించారు. స్వయంగా కల్రా 2016లో ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయినా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. భర్తతో కలిసి రెండు యునికార్న్ కంపెనీలను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తోంది. 2022 నాటికి ఆమె నికర విలువ రూ. 2600 కోట్లు. వాటి విలువ రూ. 52,000 కోట్లుగా అంచనా2015లో భర్త ఆశిష్ మొహపాత్, మరో ఇద్దరితో కలిసి ముడి పదార్థాలు, పారిశ్రామిక సరఫరాలను విక్రయించే B2B ప్లాట్ఫారమ్ ఆఫ్ బిజినెస్ను (OfBusiness) స్థాపించారు ఈ జంట. ఈ కంపెనీ విలువ రూ.44,000 కోట్లు. ఆఫ్బిజినెస్ రుణ విభాగమైన ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్కు సీఈవో కూడా కల్రా. దీని విలువ. రూ. 8200 కోట్లు.2017లో, కల్రా వారి ప్లాట్ఫారమ్లో కొనుగోలుదారులకు ఫైనాన్సింగ్ అందించడానికి ఆక్సిజోను స్థాపించారు, చిన్న ,మధ్యస్థ వ్యాపారాలకు రుణాలు అందించడంలో పాపులర్ అయింది. 2021లో రూ. 197.53 కోట్లుగా ఉన్న ఆక్సిజో ఆదాయం మరు సంవత్సరం నాటికి రూ. 312.97 కోట్లకు పెరిగింది. 2022లో ఆఫ్బిజినెస్ ఆదాయం దాదాపు రూ. 7269 కోట్లు. పన్ను తర్వాత లాభం రూ. 125.63 కోట్లుగా నమోదైంది.మహిళలకు సందేశం‘‘వ్యవస్థాపక ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే కొన్ని పక్షపాతాలు చాలా సార్లు బయటికి కనిపించవు. కొన్ని అంతర్లీనంగా ఉంటాయి. అద్దంలో చూసుకొని నేను బాగానే ఉన్నా అనే విశ్వాసాన్ని పెంచుకోండి. వక్తిగత బలహీనతలను కరియర్లోకి రానివ్వద్దు. ప్రతీ దాంట్లో మనం నిష్ణాతులుగా ఉండాల్సిన అవసరం లేదు. మనకు తెలియని విషయంలో సహాయం కోరడం వల్ల నష్టం లేదు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, చుట్టుపక్కల.. ఇలా ప్రతి ఒక్కరి కలహా తీసుకోండి. నా భర్త చాలా సపోర్ట్ చేశారు. నా ఆరేళ్ల కుమార్తె కూడా స్ట్రాంగ్ పిల్లర్గా ఉంది. నేను చాలా మందికి రుణపడి ఉంటాను’’ పెద్ద పెద్ద స్టార్టప్లు చేయలేని ఫీట్ను భర్తతో కలిసి సాధించారు రుచి కల్రా. రెండు భారీ, లాభదాయకమైన కంపెనీల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడం ఆమె వ్యాపార దక్షతకు నిదర్శనం. మెకిన్సే అండ్ కోలో పనిచేస్తున్నపుడే రుచి, ఆశిష్ కలుసుకున్నారు. వీరి స్నేహం ప్రేమగా మారి దంపతులయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు. -
రుచులతో ప్రయాగాలు చేయడం.. కబితా సింగ్ అభిరుచి!
రుచులతో ప్రయాగాలు చేయడం కబితా సింగ్ అభిరుచి. అందులో ఆమెకు అపారమైన ప్రజ్ఞ ఉంది. కబితా గరిట పట్టిందంటే చాలు నలభీమ పాకం ఇలాగే ఉంటుందేమో అన్నంత టేస్టీగా ఘుమఘుమలాడిపోతుంది ఆ వంటకం. అలా తను చేసే డిఫరెంట్ వంటకాల గురించి లోకానికి చెప్పాలనుకుంది.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితే పర్ఫెక్ట్ అనుకుంది. అందుకే 2014లో Kabita's Kitchen పేరుతో యూట్యూబ్ చానెల్ను స్టార్ట్ చేసింది. అందులో ఆమె చేప్పే 10 మినిట్స్ ప్రెషర్ కుకర్ రెసిపీస్ నుంచి స్ట్రీట్ ఫుడ్ దాకా, నాన్ ఆయిలీ ఆలూ పాలక్ నుంచి పాస్తా, పిజ్జా, సాలిడ్స్, సూప్స్ దాకా అన్ని రకాల వంటలకు ఊహించని రీతిలో రెస్పాన్స్ మొదలైంది. 2017కల్లా మిలియన్ల వ్యూస్కి చేరుకుంది. ఇప్పుడు ఆమె చానెల్కి (2023 లెక్కల ప్రకారం) కోటీ 34 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.ఈ పాపులారిటీ వల్ల ఆమె చానెల్కి బ్రాండ్ ప్రమోషన్స్ పెరిగాయి. 2023 గణాంకాల ప్రకారం యాడ్స్ వల్ల ఆమె ఏడాదికి 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆర్జిస్తోందని అంచనా. అకార్డింగ్ టు వేరియస్ వెబ్సైట్స్ Kabita's Kitchen వాల్యూ 5 నుంచి 6 కోట్లు ఉండొచ్చట. చూశారా.. తిరగమోతకూ తిరుగులేని విలువుంటుంది. అందుకే వంటలో నైపుణ్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి!ఇవి చదవండి: Sharvari Wagh: అది సినిమానా? ఓటీటీనా? టీవీ సీరియలా అని చూడను.. -
తానొక.. రాక్ 'మాయా'జాలం!
అమెరికాస్ గాట్ టాలెంట్ వేదికపై తన ప్రదర్శనతో ఉర్రూతలూగించిన మాయా నీలకంఠన్ను సైమన్ కోవెల్ ‘రాక్ దేవత’ అని ప్రశంసించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తాడు. ముంబైలోని మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్లో మాయ త్వరలో ప్రదర్శన ఇవ్వనుంది. రెండేళ్ల వయసు నుంచే సంగీతంతో స్నేహం మొదలు పెట్టింది మాయ. నాన్న గిటార్ వాయించేవాడు. ఆయన ద్వారా ఎన్నో పాటలు నేర్చుకుంది మాయ.యూట్యూబ్ వీడియోల ద్వారా గిటార్ వాయించడం ఎలాగో తండ్రి నేర్పించాడు. ఆరేళ్ల వయసు నుంచే గిటార్ ప్లే మొదలు పెట్టింది. యాభైమంది ప్రేక్షకులు ఉన్న హాలులో తొలిసారి స్టేజీపై ప్రదర్శన ఇచ్చింది. ఇంటి నాలుగు గోడలౖకే పరిమితమైన తన ప్రతిభ తొలిసారిగా ప్రేక్షకుల్లోకి వచ్చింది.ప్రపంచంలోనే నంబర్ వన్ టాలెంట్ షో అమెరికాస్ గాట్ టాలెంట్(ఏజీటీ)లో వెయ్యిమంది ప్రేక్షకుల మధ్య ప్రదర్శన ఇచ్చింది. తాను స్టేజీ మీదికి వెళుతున్నప్పుడు ప్రేక్షకులు అరవడంతో మాయ కాస్త భయపడింది. అయితే మాయ ప్రదర్శన మొదలు కావడంతో ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు.గిటార్ ప్రసన్న అనే గురువు దగ్గర కర్నాటక సంగీతం నేర్చుకుంది మాయ. ‘ఏజీటీ’ కోసం రెండు మూడు వారాల పాటు శిక్షణ తీసుకుంది. శిక్షణ సమయంలో ప్రసన్నతో పాటు ఎంతోమంది తనకు సలహాలు ఇచ్చారు.‘ఏజీటీ’ వేదికపై మూమెంట్స్కు సంబంధించి నెటిఫ్లిక్స్ సిరీస్ ‘ఆరేంజ్ ఈజ్ ది న్యూ బ్లాక్’తో అవార్డ్ గెలుచుకున్న జెస్సికా పిమెంటల్ శిక్షణ ఇచ్చింది. షో కోసం మానసికంగా సిద్ధం కావడానికి అవసరమైన సలహాలు ఇచ్చింది. ‘విభిన్నమైన జానర్స్తో నాదైన సంగీతాన్ని సృష్టించాలనేది నా కల’ అంటుంది మాయా నీలకంఠన్. -
Sahaya Sharma: తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ..
బామ్మ జీవితం నుండి ప్రేరణం పొంది అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్గానూ తల్లి సంగీత పరిజ్ఞానాన్ని ఒంటపట్టించుకొని సంగీత కళాకారిణిగానూ ఒకేసారి రెండు కళల్లోనూ రాణిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది ఢిల్లీవాసి సహాయ శర్మ. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ యువతరపు ఆలోచనలకు అద్దం పడుతుంది.‘‘నా ఎదుగుదలలో సంగీతం పాత్ర చాలా పెద్దది. మా అమ్మ సంగీత కళాకారిణి. తను పాడుతుండటాన్ని నా చిన్ననాటి నుంచి వింటూ, నేనూ పాడుతూ పెరిగాను. సంగీత ప్రపంచం నుంచి నాదైన సొంత శైలిని కనుక్కోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండేదాన్ని. స్కూల్, కాలేజీ రోజుల్లో ఎప్పుడు సెలవులు వచ్చినా రకరకాల పాటల్ని డౌన్లోడ్ చేసుకొని, ఒక ప్రత్యేకమైన జాబితా తయారు చేసేదాన్ని.సొంతంగా ఆల్బమ్స్ విడుదల..కిందటేడాది ముంబయిలో కిందటేడాది మా ఫ్రెండ్ మ్యూజిక్ స్టూడియోని సందర్శించాను. అక్కడ నేను రాసిన ఒక పాటను ప్లే చేశాను. ఆ పాట విన్నాక, వారు తమతో కలిసి పనిచేయవచ్చని చెప్పారు. దీంతో కిందటేడాది జూలై నాటికి అనుకున్న పాటను పూర్తి చేశాను. ఈ యేడాది మార్చిలో ‘ఫెడెక్స్ ఫెడప్’ ని విడుదల చేశాను. నా వ్యక్తీకరణను ప్రపంచంతో పంచుకోవడానికి ఇది సరైన సమయం అని భావించాను. గొడవల నుంచి పాటలు..రెండేళ్ల క్రితం మా కుటుంబసభ్యులతో చాలా గొడవ పడ్డాను. భగవద్గీత ఒక శ్లోకంలో కోపానికి, భయానికి మూలకారణం అనుబంధమే అని చెబుతోంది. దీనినుంచే నా ఆల్బమ్ పుట్టిందని చెప్పవచ్చు. ఒక సమయంలో జీవితం స్తంభించుకు΄ోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి మ్యూజిక్ ఆల్బమ్ చేశాను.96 బిపిఎమ్ అనేది నాన్నతో గొడవ తర్వాత రాశాను. ఈ గొడవ తర్వాత స్త్రీ ప్రవర్తన నాకు కొత్తగా అర్థమయ్యేలా చేసింది. జీవితంలోని ఆచరణాత్మక దృక్పథాన్ని, భగవంతుని పట్ల ఉండే భక్తి అన్నీ బలమైన మనిషిగా తీర్చిదిద్దాయి. నా పాటలోని సాహిత్యం అంతా ఇలాగే ఉంటుంది. ‘నేను మళ్లీ కలుస్తూనే ఉంటాను. రౌండ్ అండ్ రౌండ్గా తిరుగుతూనే ఉంటాను...’ అని సాగుతుంది. ఇప్పటికి మూడు ఆల్బమ్స్ విడుదలయ్యాయి.చిత్రకళలో ఓదార్పు..రంగులలో లోతైన ఓదార్పును, శాంతిని కనుక్కోవడానికి ఉపయోగపడేదే పెయింటింగ్. సంగీతం ద్వారా నన్ను నేను బయటకు వ్యక్తపరుచుకుంటే పెయింటింగ్లో నన్ను నేను వెతుక్కోగలిగాను. ఇలా ఈ రెండు కళలు నన్ను కొత్తగా ఆవిష్కరింపజేశాయి. మా బామ్మ తన చీరలపై రకరకాల పెయింటింగ్స్ను చిత్రిస్తుండేది. వాటిని చూస్తూ నేనూ సాధన చేసేదాన్ని. అలా రంగుల ప్రపంచం నాకు పరిచయం అయ్యింది. అంతేకాదు, మా ఇల్లు రకరకాల పెయింట్స్, శిల్పాలతో ఒక ఆర్ట్ మ్యూజియంలా ఉంటుంది.మా నాన్న అంత అందంగా తీర్చిదిద్దారు ఇంటిని. ఇది కళాకారిణిగా నా విజువల్ కార్టెక్స్లోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేసింది. అక్కడి కళాకృతుల సేకరణలో అమ్మ అభిరుచి, మన దేశీయ సంస్కృతి... నాలో లోతైన గాఢత నింపాయి. ఆ ఇష్టంతోనే సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాను. రంగులతో ఆధ్యాత్మిక ప్రపంచాలను సృష్టిస్తుంటాను. సోలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తుంటాను. భార తదేశం, న్యూయార్క్, లండన్, బోస్టన్, దుబాయ్, హాంకాంగ్లోని కేఫ్లు, కోర్టులు, హోటళ్లు, గెస్ట్ హౌజ్ గోడలను నా పెయింటింగ్స్ అలంకరించాయి. మార్చిన ప్రయాణాలు..అమ్మానాన్నలతో కలిసి దేశమంతా తిరిగిన రోడ్డు ప్రయాణాలు, జంగిల్ సఫారీలు, ట్రెక్కింగ్ ఏరియాలు నన్ను ప్రకృతికి దగ్గర చేశాయి. నా తల్లితండ్రులు ప్రయాణంలో సంగీతం, కళ, కథలు, సంస్కృతిని పరిచయం చేశారు. అప్పటినుంచి అందమైన ప్రకృతి దృశ్యాలను నా పెయింటింగ్స్ లో చూపించడం అలవాటు చేసుకున్నాను.కరోనా సమయంలో జీవితం ఎంత చిన్నదో కదా అనిపించింది. అప్పుడు భౌతికంగా, ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. విలాసవంతమైన జీవనం అవసరమా అనేది తెలుసుకున్నాను. నా వాస్తవికత ఏమిటో అర్థమయ్యాక నేనేం సృష్టించాలో తెలుసుకున్నాను. అందువల్ల మ్యూజిక్ ఆల్బమ్స్, పెయింటింగ్స్ నన్ను కొత్తగా మార్చాయి’’ అని వివరిస్తుంది సహాయ. -
Akshita Sachdeva: ‘కిబో’ పరికరం ఆ దిశగా వేసిన తొలి అడుగు..
మనం ఏ బాట ఎంచుకోవాలో అనేది విధి నిర్ణయిస్తుందో లేదోగానీ పరిస్థితులు మాత్రం నిర్ణయిస్తాయి. డాక్టర్ కావాలనుకున్న అక్షితా సచ్దేవా పరిస్థితుల ప్రభావం వల్ల పరిశోధన రంగంలోకి వచ్చింది. ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది అంధులతో మాట్లాడింది. వారి సమస్యల గురించి లోతుగా తెలుసుకుంది. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుక్కోవాలనుకుంది. బెంగళూరు కేంద్రంగా ఆమెప్రారంభించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ‘ట్రెస్టిల్ ల్యాబ్స్’ అంధులకు బాట చూపించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ల్యాబ్స్ నుంచి వచ్చిన ‘కిబో’ పరికరం ఆ దిశగా వేసిన తొలి అడుగు....అక్షితా సచ్దేవా అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయింది. ఇక అప్పటి నుంచి డాక్టర్ కావాలనేది తన లక్ష్యంగా మారింది. అయితే కాలేజీ రోజుల్లో ఒక లెక్చరర్తో మాట్లాడిన తరువాత తన ఆలోచనల్లో మార్పు వచ్చింది. ‘డాక్టర్ కావాలి’ అనే తన లక్ష్యం గురించి చెప్పినప్పుడు క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించే సాంకేతికత, దాని ప్రాధాన్యతతో పాటు హెల్త్కేర్ రంగంలోని ఎన్నో ఆవిష్కరణల గురించి చెప్పారు ఆ లెక్చరర్.‘నా కళ్లు తెరిపించిన సందర్భం అది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంటుంది అక్షిత. ఆ రోజు నుంచి హెల్త్కేర్ రంగానికి సంబంధించిన సాంకేతికత, సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. ఫరీదాబాద్లోని మానవ్ రచన కాలేజ్లో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో దృష్టి లోపం ఉన్నవారి కోసం ఒక గ్లోవ్ను రూపొందించింది అక్షితా సచ్దేవా. చూపుడు వేలిపై కెమెరా ఉండే ఈ హ్యాండ్గ్లోవ్ సహాయంతో దృష్టి లోపం ఉన్నవారు చదవవచ్చు.ఈ గ్లోవ్ గురించి న్యూ దిల్లీలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్(ఎన్ఏబీ)కి వివరించింది అక్షిత. దృష్టి లోపం ఉన్న ఒక యువకుడు ఈ గ్లోవ్ను ఉపయోగించి న్యూస్పేపర్ చదవగలిగాడు. ఈ విజయం ఆమెలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలను పెంచింది. అంధులకు జీవనోపాధి, విద్య, దైనందిన జీవన విషయాల్లో సహాయపడడానికి తన ఆవిష్కరణను ముందుకు తీసుకువెళ్లాలనుకుంది.అంధులు ఎదుర్కొనే సమస్యలను లోతుగా అర్థం చేసుకోవాలనుకుంది. బ్యాంకర్లు, పీహెచ్డీ స్కాలర్లు, గృహిణులు... వివిధ విభాగాలకు చెందిన అంధులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుంది. ఆ సమయంలోనే దీపాలి పవార్ అనే స్టూడెంట్తో మాట్లాడింది.కాలేజీలో ఒక సెమిస్టర్ పూర్తి చేసిన దీపాలి హటాత్తుగా చూపు కోల్పోయింది. ఆమెను తిరిగి తీసుకోవడానికి కాలేజి వారు నిరాకరించారు. బ్రెయిలీ నేర్చుకోమని సలహా ఇచ్చారు. బ్రెయిలీ నేర్చుకోవడానికి దీపాలి రెండేళ్లు గడిపింది. అయితే అది ఆమెకు కష్టంగా ఉండేది. బ్రెయిలీ నేర్చుకున్న తరువాత కూడా ఆమెకు కాలేజీలో చదివే అవకాశం రాలేదు. యశ్వంత్రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీలో చేరడమే దీపాలి ముందు ఉన్న ఏకైక మార్గం అయింది.ఆడియో–రికార్డెడ్ పుస్తకాలను అందించే ఒక స్వచ్ఛంద సంస్థను సంప్రదించింది దీపాలి. అయితే ఒక్కొక్క పుస్తకం కోసం నాలుగు నుంచి ఆరువారాల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఆమె దగ్గర మూడు పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఆ పుస్తకాలను తీసుకువెళ్లిన అక్షిత వాటిని మొబైల్ అప్లికేషన్ ఫామ్లోకి మార్చి దీపాలికి ఇచ్చింది.మూడు నెలల తరువాత..దీపాలి నుంచి ఫోన్ వచ్చింది. ‘సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ను సింగిల్ అటెంప్ట్లో పూర్తి చేశాను’ అని సంతోషంగా చెప్పింది. ఇది అక్షితకు మరో విజయం. మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన విజయం. ఈ ఉత్సాహ బలమే బోనీదేవ్తో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘ట్రెస్టిల్ ల్యాబ్స్’ అనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీప్రారంభించేలా చేసింది.నాసిక్లోని ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్’లో పెద్దయంత్రాన్ని చూసింది అక్షిత. అయితే అది పెద్దగా ఉపయోగంలో లేదు. ఈ మెషిన్ ప్రింటెడ్ డాక్యుమెంట్స్ను చదవగలుగుతుంది. అయితే కేవలం ఇంగ్లీష్లో మాత్రమే. అప్పుడే అక్షితకు ఎన్నో భారతీయ భాషలకు సంబంధించిన పుస్తకాలను చదవగలిగే యంత్రాన్ని రూపొందించాలనే ఐడియా తట్టింది.అది ‘కిబో’ రూపంలో సాకారం అయింది. ఈ పరికరం విజయం సాధించడంతో నాసిక్ మున్సిపల్ కార్పోరేషన్, ఐఐఎం–అహ్మదాబాద్... మొదలైన సంస్థల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ‘భారతీయ భాషలపై దృష్టి కేంద్రీకరించిన తొలి అసిస్టివ్ టెక్ టూల్ కిబో’ అంటుంది అక్షిత.మరింతగా..అంధులకు ఉపకరించే దిశగా ఆసియా, ఆఫ్రికాలలో మా సంస్థను విస్తరించాలనుకుంటున్నాం. ‘కిబో’కు మరిన్ని భాషలను జోడించాలనుకొంటున్నాము. ఏఐ సాంకేతికతతో సెల్ఫ్–లెర్నింగ్, సెల్ఫ్–ట్రైనింగ్ మాడ్యూల్స్కు రూపకల్పన చేస్తాం. – అక్షితా సచ్దేవా, కో–ఫౌండర్, ట్రెస్టిల్ ల్యాబ్స్కిబో ఇలా..‘కిబో’ వాటర్ బాటిల్ ఆకారంతో ఉంటుంది. దీని ఎడమవైపు ఉన్న బటన్ను నొక్కితే టేబుల్ ల్యాంప్ ఆకారంలోకి మారుతుంది. యూఎస్బీ కేబుల్ దీన్ని ల్యాప్టాప్కు కనెక్ట్ చేస్తుంది. పుస్తక పాఠాన్ని ‘కిటో’ సంగ్రహిస్తుంది.అరవై భాషలలో ఏ భాషలలోనైనా అనువాదం అడగవచ్చు. వ్యక్తులు, సంస్థల కోసం విడిగా నాలుగు ‘కిబో’ప్రాడక్ట్స్ను రూపొందించారు. ‘కిబో ఎక్స్ఎస్’ను స్కూలు, కాలేజీలలోని లైబ్రరీల కోసం అందుబాటులో ఉంచారు. ‘కిబో 360’ని వ్యాపారసంస్థలు, యూనివర్శిటీలు, ప్రచురణ సంస్థల కోసం రూపొందించారు. -
Surabhi Yadav: జ్ఞాపకాలకు జీవం..
ఇంట్లో పెద్దవాళ్లు ఎవరైనా మరణిస్తే వారు వాడిన వస్తువులను జ్ఞాపకంగా భద్రపరచుకుంటాం. కొందరు ఆ వస్తువులు ఎందుకులే అని ఎవరికైనా ఇవ్వటమో.. అమ్మేయడమో చేస్తుంటారు. మీరట్కు చెందిన సురభి యాదవ్ మాత్రం తన అత్తగారు మరణించాక ఆమె గుర్తుగా ఉన్న వస్తువులను ఉపయోగంలోకి తెచ్చి, వాటికి తిరిగి జీవం పోయాలనుకుంది. అత్తగారి జ్ఞాపకాలుగా మిగిలిన వస్తువుల్లో 300 రకాల మొక్కలను పెంచుతూ.. ఇంటికి కొత్త కళను తీసుకొచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..‘మా అత్తగారు కోవిడ్ సెకండ్ వేవ్లో పోయారు. ఆవిడ లేని మా ఇల్లు కళ కోల్పోయినట్టు.. దిగులుగా అనిపించేది. ఇంట్లో మా అత్తగారు ఉపయోగించినవి, ఆమె సేకరించిన పాత్రలు చాలా ఉన్నాయి.అవి ఆమె 30ఏళ్ల కష్టానికి ప్రతీకలు. ఆవిడ జ్ఞాపకాలు. వాటికి కొత్తరూపం ఇచ్చి రోజువారీ వాడకంలోకి తెస్తే ఆవిడ మా మధ్య తిరిగినట్టే ఉంటుంది కదా.. ఎప్పటిలాగే ఇల్లు కళకళలాడుతుంది కదా అనిపించింది. అంతేకాదు దానివల్ల ఎంతోకొంత పర్యావరణానికి మా వంతు సాయం చేసినట్టవుతుంది అనిపించింది. అందుకే మా అత్తగారి కాలంనాటి సీసాలు, పాత్రలు, లాంతర్లు, ఫ్యాన్.. వంటివాటిని అందమైన ప్లాంటర్స్గా మార్చాను. నాకు ఎంతో ఊరట కలిగింది. ఒక అవగాహనా వచ్చింది.దాంతో మిగిలిన వస్తువుల్లో కొన్నిటిని అందమైన బొమ్మలుగా మార్చాను. ఇంకొన్నిట్లో మొక్కలను పెంచడం మొదలుపెట్టాను. ఇప్పుడు మా టెర్రస్ గార్డెన్లో పూలు, కూరగాయలు సహా 300 రకాల మొక్కలున్నాయి. నేనేం పెద్ద గార్డెనర్ని కాదు. నాకు తోచినట్టుగా ఓ చిన్నతోటతో మా అత్తగారి ప్రపంచాన్ని సజీవంగా మార్చేశాను!’ అని చెబుతుంది సురభి యాదవ్. -
Neenu Rathin: తక్కువ కాలంలోనే.. ‘సోషల్ ఎంటర్ప్రెన్యూర్’గా..
కేరళకు చెందిన నీనూ రతిన్కు సామాజిక సేవా రంగం అంటే ఇష్టం. సోషల్ యాక్టివిస్ట్లతో కలిసి పనిచేయడం అంటే ఇష్టం. ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రహించి నిధుల సేకరణలో వారికి సహకరించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. తక్కువ కాలంలోనే ‘సోషల్ ఎంటర్ప్రెన్యూర్’గా పెద్ద పేరు తెచ్చుకుంది. సోషల్ వర్కర్ కావాలనుకునే వారికి సంస్థ సహకారం అందిస్తుంది. స్వచ్ఛంద సంస్థలు వివిధ విషయాలలో పరస్పరం సహకరించుకునే వాతావరణాన్ని కల్పించింది.కేరళలోని త్రిసూర్లో పుట్టి పెరిగిన నీనూ రతిన్ చదువులో ‘తెలివైన అమ్మాయి’ అనిపించుకుంది. క్లాసులో టీచర్లు చెప్పే సామాజిక సేవకు సంబంధించి విషయాలను శ్రద్ధగా వినేది. అలా... తనకు చిన్నప్పుడే సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరిగింది. చదువుకు ఎంతప్రాముఖ్యత ఇచ్చేదో సామాజిక సేవా కార్యక్రమాలకు అంతగాప్రాధాన్యత ఇచ్చేది.ఇంజినీరింగ్ చేస్తున్నప్పటికీ ఆమె మనసు మాత్రం సామాజిక విషయాలపై కేంద్రీకృతమై ఉండేది. ఆమె ఫ్రెండ్స్కు మాత్రం ఇంజినీరింగ్ అంటే చాలా ఇష్టం. ఒకానొక దశలో అయితే ‘వీరి మధ్య నేను ఉండడం సరిౖయెంది కాదేమో. నా ఆలోచనలు వేరు, వీరి లక్ష్యాలు వేరు’ అనుకునేది నీనూ.ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందిగానీ ఏవో కారణాల వల్ల అందులో చేరలేక΄ోయింది. దీంతో ఒక చిన్న ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసింది. అయితే కొంత కాలం తరువాత... ‘ఈ ఉద్యోగం నాకు కరెక్ట్ కాదేమో’ అనుకుంది. అదే సమయంలో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పెళ్లి తరువాత తనకు ఎప్పటి నుంచో ఆసక్తి ఉన్న సామాజిక సేవారంగంలోకి అడుగు పెట్టింది.‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఇది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఆధ్యాత్మిక. సామాజిక కార్యక్రమాలు ఉండేవి. నాకు రెండోదానిపై ఆసక్తి’ అంటుంది నీనూ. ఫౌండేషన్కు సంబంధించి ఎన్నో రకాల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ కార్యక్రమాలు భవిష్యత్లో తాను చేయబోయే పనులకు పునాదిగా నిలిచాయి.తొలి అడుగుగా ఫౌండేషన్ తరపున ఎన్నో స్కూల్స్కు వెళ్లి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు చెప్పేది. మొక్కలు నాటేది. పది స్కూల్స్తో మొదలైన మొక్కలు నాటే కార్యక్రమం ఆ తరువాత 30కు చేరుకుంది. ఒకవైపు ఇంటిపనులు చూసుకుంటూనే పర్యావరణ విషయాలపై అవగాహన, మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనేది నీనూ.సామాజిక సేవా రంగంలో పనిచేయడం వల్ల తనలాగే ఆలోచించే ఎంతోమంది పరిచయం అయ్యారు. ఎన్నో స్వచ్ఛందసంస్థలతో కలిసి రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. కొంతకాలం తరువాత భర్త, పిల్లలతో కొచ్చికి వెళ్లింది నీనూ. అక్కడికి వెళ్లిన తరువాత కూడా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. మహిళా సమస్యలపై పనిచేయడం నుంచి రక్తదాన కార్యక్రమాల వరకు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంది.తాను కొచ్చిలో ఉన్న సమయంలో కేరళకు భయానకమైన వరదలు వచ్చాయి. వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. సోషల్ మీడియా వేదికగా బాధితులకు ఎన్నో రకాలుగా అండగా నిలబడింది. అట్టాపాడి, నీలంబూర్, వయనాడ్లోని గిరిజన జనావాసాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ‘బాధితులకు సహాయపడే కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది సమిష్టి కార్యాచరణ శక్తిని అర్థం చేసుకునేలా చేసింది. గతంలో మా కుటుంబ సభ్యులు ఎవరూ సామాజిక సేవా రంగంలో లేరు. నాకు కూడా కొత్త. ఎన్ని రకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంటే నాకు అంత ఉత్సాహం వచ్చేది’ అంటుంది నీనూ రతిన్.ఆ ఉత్సాహ బలమే ఆమెను ‘సోషల్ టౌన్’ అనే స్వచ్ఛంద సంస్థప్రారంభించేలా చేసింది. మొదట్లో ఇంటరాక్షన్స్ కోసం వాట్సాప్ గ్రూప్లు, ఈ మెయిల్స్ను ఉపయోగించేవారు. ఇప్పుడు ‘సోషల్ టౌన్ పరిధి విస్తరించి క్షేత్రస్థాయిలో సేవాకార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని కలలు కనే ఒకేరకమైన ఆలోచనా విధానం కలిగిన వ్యక్తులుండే సంఘంలాంటిది మా సంస్థ’ అంటుంది నీనూ రతిన్.ఆ బలమే వేరు..ఒకే రకమైన ఆలోచన విధానం ఉన్న వారు ఒకే దగ్గర ఉంటే ఆ బలమే వేరు. ఇంకా ఎన్నో మంచి పనులు చేయవచ్చు. చాలామందికి సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నప్పటికీ వారికి దారి తెలియదు. అలాంటి వారికి ఒక కొత్త దారిని చూపే బాధ్యతను మా స్వచ్ఛంద సంస్థ తీసుకుంంది. స్వచ్ఛంద సేవకురాలిగా ప్రభావశీలమైన ఎన్నోప్రాజెక్ట్లలో పాల్గొన్నాను. వాటి గురించి గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా ఉత్సాహం వస్తుంది. మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనిపిస్తుంది.– నీనూ రతిన్ -
Charlotte Chopin: యోగవికాసానికి పద్మ పురస్కారం!
నూటొక్క వసంతాలను చూసిన చార్లోట్ చోపిన్ ఈ ఏడాది మే నెలలో మనదేశం అందించే అత్యున్నత పద్మపురస్కారాన్ని అందుకున్నారు. ఆమె పుట్టి వందేళ్లు దాటింది. నిజమే, 1922, డిసెంబర్ 11వ తేదీన ఫ్రాన్స్లోని చేర్ పట్టణంలో పుట్టారామె. యాభై ఏళ్ల వయసులో ఆమె ఎదుర్కొన్న శారీరక, మానసిక రుగ్మతలకు సమాధానంగా యోగసాధన ప్రారంభించారు చార్లోట్. అప్పటి నుంచి ఆమె జీవనశైలి పూర్తిగా మారిపోయింది.తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని అంతటితో సంతృప్తి చెందలేదామె. యోగసాధన గురించి ప్రపంచానికి తెలియచేయాలని కంకణం కట్టుకున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి, ఆనందానికి, ఆహ్లాదకరమైన జీవనానికి యోగసాధనను మించినది మరొకటి లేదని వర్క్షాప్లు పెట్టి అవగాహన కల్పించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మశ్రీ అందుకుంటున్న చార్లోట్ చోపిన్ఫ్రాన్స్లో పరిమళించిన మనప్రాచీన విద్య..చార్లోట్ 1982 లో చేర్ పట్టణం నుంచి యోగసాధన పట్ల అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. యోగసాధన వల్ల లభించే ప్రయోజనాలను వివరిస్తూ, యోగసాధన నేరి్పస్తూ ఫ్రాన్స్ మొత్తం పర్యటించారామె. ఫ్రెంచ్ టీవీలో ‘ఫ్రాన్స్ గాట్ ఇన్క్రెడిబుల్ టాలెంట్’ ్రపోగ్రామ్ ద్వారా దేశమంతటా యోగ విద్యను విస్తరింపచేశారు. ఆమె తాను నివసిస్తున్న చేర్ పట్టణంలో స్వయంగా వేలాది మందికి నేరి్పంచారు. దేశవిదేశాల్లో యోగవిద్య విస్తరించడానికి ఆమె విశేషమైన కృషి చేశారు.ప్రాచీనమైన యోగవిద్య మనికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఏకైకమార్గమని ప్రపంచానికి చాటారు చార్లోట్. యోగసాధనకు వయసుతో సంబంధం లేదని, అందుకు తానే పెద్ద నిదర్శనమని అనేక సందర్భాల్లో చె΄్పారామె. తన ఆరోగ్య రహస్యం యోగసాధన అని 2024, మే, 9వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న సందర్భంగా కూడా చె΄్పారు చార్లోట్ చోపిన్.ఇవి చదవండి: Viji Venkatesh: కన్నీటి భాష తెలిసిన నటి ఈమె -
Viji Venkatesh: కన్నీటి భాష తెలిసిన నటి ఈమె
కన్నీళ్ల భాష తెలిసిన విజీ వెంకటేష్ కళారంగంలోకి అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్పై అవగాహన సదస్సులు నిర్వహించడం నుంచి క్యాన్సర్ బాధితులకు అండగా నిలవడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన విజీ వెంకటేష్లో నటిగా మరో కోణం పరిచయం అయింది. ఆమెకు నటనలో ఓనమాలు తెలియవు. అయితే ‘తెలియదు’ అనే మాట దగ్గర ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. మలయాళం మాట్లాడడం నేర్చుకుంది. సాధన చేసి నటనలో శభాష్ అనిపించుకుంది. ‘బలమైన సినీ మాధ్యమం ద్వారా ఎన్నో సందేశాలను ప్రజలకు చేరువ చేయవచ్చు’ అంటుంది విజీ వెంకటేష్...71 ఏళ్ల వయసులో మలయాళ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన విజీ వెంకటేష్ మన దేశంలో క్యాన్సర్ పేషెంట్ల కోసం మూడు దశాబ్దాలకు పైగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆమె స్వచ్ఛంద సంస్థ ‘ది మాక్స్ ఫౌండేషన్’కు ఇండియా, సౌత్ ఏషియా హెడ్గా ఉన్నారు.దిల్లీలో పుట్టి పెరిగిన విజీకి సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలపై స్కూల్రోజుల్లో నుంచే ఆసక్తిగా ఉండేది. ఆ ఆసక్తికి అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. వివాహం తరువాత దిల్లీ నుంచి బాంబేకు వచ్చింది. ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపించింది. తన ఆసక్తులకు తగిన వాతావరణం ఇక్కడ కనిపించింది. ఆంగ్లంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.‘ది మాక్స్ ఫౌండేషన్’ ద్వారా ఉద్యోగ, సేవాప్రస్థానాన్ని ప్రారంభించింది. ‘క్యాన్సర్ పేషెంట్ల గురించి పనిచేయాలనుకోవడానికి కారణం ఏమిటి? అని చాలామంది నన్ను అడుగుతుంటారు. అయితే కాన్సర్పై పోరాటానికి, అవగాహన కలిగించడానికి క్యాన్సర్ పేషెంట్ కానక్కర్లేదు. వారి కష్టాలు మనకు తెలిసుంటే చాలు. ముంబైలో సంస్థలు, వ్యాపారవేత్తల నుంచి క్యాన్సర్ బాధితులకు అవసరమైన నిధుల సేకరణ ్రపారంభిండం ద్వారా నా ప్రస్థానం మొదలైంది’ అంటుంది విజీ.నిధుల సేకరణ మాత్రమే కాదు పేద క్యాన్సర్ పేషెంట్ల ఇంటికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. ధైర్యం చెప్పేది. వీరిలో చాలామందికి పొగాకు నమిలే అలవాటు ఉన్నట్లు గ్రహించింది. ఉద్యోగ ప్రయాణం మొదలైన కొత్తలో బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీకి వెళ్లి క్యాన్సర్కు సంబంధించిన ఎన్నో పుస్తకాలను చదివి కొత్త విషయాలను తెలుసుకునేది. అంతేకాదు టాటా మెమోరియల్ హాస్పిటల్లోని ఆంకాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుంది.ఫ్యాక్టరీలకు వెళ్లి పొగాకు నమలడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యల గురించి కార్మికుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించేది. ఈ సమావేశాలు పొగాకు నమిలే అలవాటు ఉన్న చాలామందిలో మార్పు తీసుకువచ్చి ప్రమాదం బారిన పడకుండా చూశాయి. అవగాహన సదస్సులతో పాటు పేదల కోసం ఎన్నో చోట్ల క్యాన్సర్కు సంబంధించి ఎర్లీ డిటెక్షన్ క్యాంపులు నిర్వహించింది. ఈ క్యాంప్లు ఎంతోమందిని కాపాడాయి.ఫహద్ ఫాజిల్తో విజీ వెంకటేష్అసలు సినిమాల్లో నటించే అవకాశం విజీ వెంకటేష్కు ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే... సోషల్ మీడియాలో ఆమె చురుగ్గా ఉంటుంది. మలయాళ డైరెక్టర్ అఖిల్ సత్యన్, అతని టీమ్ ఇన్స్టాగ్రామ్లో విజీ వెంకటేష్ ఫొటోను చూశారు. తమ సినిమా ‘పచ్చుం అబ్బుతావిలక్కుమ్’కు ‘ఉమ్మచ్చి’ క్యారెక్టర్కు సరిగ్గా సరిపోయే మహిళ అనుకున్నారు. వెంటనే విజీ వెంకటేష్ను సంప్రదించారు.‘నేను ఫుల్–టైమ్ జాబ్ చేస్తున్నాను. నాకు మలయాళం పెద్దగా రాదు’ అని చెప్పింది. ‘ఈ వయసులో నటన ఏమిటి’ అని కూడా అన్నది. అయితే డైరెక్టర్ పట్టువదలని విక్రమార్కుడు అయ్యాడు. ‘రోల్’ గురించి మరింత వివరంగా చర్చించాడు. అతడి ఆసక్తి, వృత్తిపట్ల అంకిత భావం నచ్చడంతో విజీకి ‘ఓకే’ అనక తప్పలేదు. ఇక అప్పటినుంచి మలయాళం స్పీకింగ్ స్కిల్స్పై దృష్టి పెట్టింది. నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో విజీ తల్లి పాత్ర పోషించింది. స్వతంత్ర వ్యక్తిత్వం, పోరాడే ధీరత్వం ఉన్న మహిళ పాత్ర అది. నిజానికి ఈ పాత్రకి సంబంధించిన లక్షణాలు ఆమెలో సహజంగా ఉన్నవే.ఈ సినిమా నుంచి మరికొన్ని సినిమాల నుంచి ఆఫర్లు వచ్చాయి. ‘వీర’ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు జయరాజ్ చిత్రం కోసం సైన్ చేసింది. కాటుక, ముక్కు పుడక... ఇలా విజీ వెంకటేష్కు తనదైన సిగ్నేచర్ స్టైల్ ఉంది. తన మొదటి సినిమా కోసం ఆ స్టైల్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే కొత్త లుక్లో కూడా సహజంగా, అందంగా ఉంది విజీ వెంకటేష్. -
అక్కా చెల్లెళ్లు! కల నిజం చేసుకున్నారు..
ప్రతి కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఇది నూటికి నూరుపాళ్లు నిజమని నిరూపిస్తున్నారు అనుజా గుప్తా, ప్రతాంక్షా గుప్తా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఢిల్లీవాసులైన వీరిద్దరూ ఐదేళ్ల క్రితం లక్షరూపాయలతో చికన్కారీ కుర్తీల వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పుడు 45 మంది ఉద్యోగులతో, ఐదుకోట్ల టర్నోవర్తో వ్యాపారాన్ని నడుపుతున్నారు. ఒడిదొడుకులను అధిగమిస్తూ వ్యాపారంలో మైలురాళ్లను అధిగమిస్తున్నారు.అనుజా గుప్తా మాట్లాడుతూ ‘‘మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగిన అక్కాచెల్లెళ్లం. మా వ్యాపారం ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి మొదలైంది. 2020లో కోవిడ్ కారణంగా మా వ్యాపార కలలు కూడా కనుమరుగవుతాయనుకున్నాం. చాలా వ్యాపార సంస్థలు లాక్డౌన్ సమయంలో మూలనపడ్డాయి. మేం మా వ్యాపారాన్ని నలభై చికన్కారీ కుర్తీలు, పలాజోలు, చీరలతో మొదలు పెట్టాం. మా వెంచర్ పేరు ‘చౌకట్’. కోవిడ్ కాలంలో చాలామంది వద్ద డబ్బులేదు. కాబట్టి మా దుస్తులు అమ్ముడవుతాయన్న గ్యారెంటీ మాకు లేదు. అలాగని మా వ్యాపారాన్ని మూసేయడానికి మేం సిద్ధంగా లేం. మా నిర్ణయం సరైనదేనని ఆ తర్వాత అర్ధమైంది.పెరిగిన ఆర్డర్లు..అమ్మకానికి ఉంచిన డ్రెస్సులు హాట్కేక్లుగా అమ్ముడయ్యాయి. మొదటి నెలలోనే 34 ఆర్డర్లు వచ్చాయి. దాంతో మా ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. మరిన్ని ఆర్డర్లు వచ్చిన తర్వాత ఒక లాజిస్టిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. చికన్కారీ కుర్తీలు ఖరీదైనవి అనే అభి్రపాయాన్ని వారితో మాట్లాడి, మార్చగలిగాం.నాణ్యత విషయంలో రాజీపడకుండా తక్కువ ధరకే చికన్కారీ కుర్తీలు అందించ వచ్చని నిరూపించాం. ఈ నమ్మకం వల్లనే లాక్డౌన్ ప్రకటించిన ఇరవై రోజుల తర్వాత నుంచి కూడా మా ‘చౌకట్’ నుంచి దుస్తులు అమ్ముడు పోవడం పెరిగింది. కోవిడ్ కారణంగా డిజైనర్ల దగ్గరకు వెళ్లి, సరైనవి ఎంచుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మేమిద్దరం సొంతంగా డిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది కూడా మరో మైలురాయిలా నిలిచింది.‘చౌకట్’ టీమ్అభిరుచులు వేరైనా సృజన ఒక్కటే..ఇప్పుడు మా సంస్థలో 45 మంది ఉద్యోగులు ఉన్నారు. దేశంలో 5 వేల మంది నేత కార్మికులతో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. మా సంస్థకు విదేశాలలో కూడా క్లయింట్లు ఉన్నారు. డెబ్బైశాతానికి పైగా ఆర్డర్లు ఆన్లైన్లో డెలివరీ చేయబడతాయి. అక్కచెల్లెళ్లమే అయినా ఇలా కలిసి వ్యాపారం చేస్తామని కలలో కూడా అనుకోలేదు.మా ఇద్దరు చదువులు వేరు, అభిరుచులు వేరు. కానీ, మా ఇద్దరి ఆలోచన ఒక్కటిగా ఉన్నది ‘చౌకట్’ సృష్టించడంలో. నేను జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. ప్రతాంక్షా గుప్తా ఫ్యాషన్/అప్పేరల్ డిజైన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మా అమ్మానాన్నలు మాకు పూర్తి సహకారం అదించడంతో నేడు మా కంపెనీ ఐదుకోట్ల టర్నోవర్కు చేరుకుంది’’ అని వివరిస్తారు ఈ సోదరీమణులు.ఇవి చదవండి: Gaming: శతకోటి సూర్యప్రభా భాసిత... వీరాధివీరా! -
తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ!
బొట్టు, గాజులు, పువ్వులు.. భారతీయ స్త్రీకి అలంకారంగానే చూస్తున్నారు! వాటి చుట్టూ ఆర్థిక, సామాజిక భద్రత చట్రాన్ని బిగించి మహిళను బందీ చేశారు! అయితే స్వాతంత్య్రానికి పూర్వమే బుద్ధిజీవులు ఆ కుట్రను పసిగట్టారు. అలంకారం స్త్రీ హక్కు.. అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. ఆ ఆత్మవిశ్వాసమే ఆమె ఆర్థిక, సామాజిక సాధికారతకు పునాది అని నినదించారు! వితంతు చదువు, కొలువు, పునర్వివాహం కోసం పోరాడారు. సమాజాన్ని చైతన్యపరచడానికి చాలానే ప్రయత్నించారు. అయినా .. వితంతువుల జీవితాలేం మారలేదు.. సంఘసంస్కర్తల పోరు చిన్న కదలికగానే మిగిలిపోయింది! పురోగమిస్తున్న.. పురోగమించిన సమాజాల్లో ఎన్నో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి.. చట్టాలు వస్తున్నాయి!కానీ ఆల్రెడీ చట్టాల తయారీ వరకు వెళ్లిన విడో సమస్యల మీద మాత్రం ఆ సమాజాల్లో కనీస అవగాహన కొరవడుతోంది! చర్చలు అటుంచి ఆ పేరు ఎత్తితేనే అపశకునంగా భావించే దుస్థితి కనపడుతోంది! అందుకే యూఎన్ఓ ‘ఇంటర్నేషనల్ విడోస్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టింది.. ఏటా జూన్ 23న. ఆ రకంగానైనా ప్రపంచ దేశాలు విడో సమస్యలను పట్టించుకుని వాళ్ల రక్షణ, సంరక్షణ బాధ్యతను సీరియస్గా తీసుకుంటాయని.. ప్రజలూ వాళ్లను సమదృష్టితో చూసే పెద్దమనసును అలవరచుకుంటారని! ఆ సందర్భాన్నే ఈ వారం కవర్ స్టోరీగా మలిచాం!మోదీ 3.0 కేబినేట్లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా రక్షా ఖడ్సే రికార్డులోకి ఎక్కారు. ఆ ఘనత ఆమెకు గాలివాటంగా రాలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రక్షా భర్త, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనివార్యంగా రక్షా ఖడ్సే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు మహరాష్ట్రలోని రావేర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భర్త తరఫు కుటుంబం నుంచి సహకారం అందడంతో ఆమె రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే అందరికీ రక్షా ఖడ్సేలా çకుటుంబం నుంచి, సమాజం నుంచి సహాయ సహకారాలు అందడం లేదనడానికి ఒక ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవల కనిపించింది.తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచాయతీ ముదిరింది. ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తరఫు బంధువులు ఆస్తి పంపకం విషయంలో మృతుడి భార్య తరఫువారు వెనక్కి తగ్గితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనకు అవతలి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా మూడు రోజులైనా దహన సంస్కారాలు జరగలేదు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ముందుకు సాగింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ అదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. లేదంటే తనకు, తన పిల్లలకు ఈ సమాజం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే! ఆనాటి నుంచి ఈనాటి వరకు భర్తను కోల్పోయి ఒంటరైన మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు.మధ్యయుగాల్లో..భర్త చనిపోతే అతని చితిపైనే బతికున్న భార్యకు కూడా నిప్పంటించే సతీ సహగమనం అనే అమానవీయ ఆచారాలను రూపుమాపే ప్రయత్నాలు బ్రిటిష్ జమానాలోనే మొదలయ్యాయి. భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసి, తెల్ల చీరలు కట్టించి, ఇంటి పట్టునే ఉంచే దురాచారాన్ని పోగొట్టేందుకు రాజా రామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు అలుపెరగని పోరాటం చేశారు. వీరి కృషి ఫలితంగా ఈరోజు సతీసహగమనం కనుమరుగైంది. తెల్లచీర, శిరోముండన పద్ధతులూ దాదాపుగా కనుమరుగయ్యాయి. అంతగా కాకపోయినా పునర్వివాహాల ఉనికీ కనపడుతోంది. అయితే ఇంతటితో భర్తను కోల్పోయిన మహిళల జీవితాల్లో వెలుగు వచ్చేసిందా? వారి కష్టాలన్నీ తీరిపోయాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే స్ఫురిస్తుంది. భర్తపోయిన స్త్రీలకు కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు మన దగ్గరే కాదు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.ప్రస్తుత ప్రపంచ జనాభాను దాదాపు ఎనిమిది వందల కోట్లకు అటూ ఇటూగా పరిగణిస్తే అందులో వితంతువుల సంఖ్య 25 కోట్లకు పైమాటే! సమాజంలో అందరికంటే అత్యంత నిరాదరణ, అవమానాలు, కనీస మద్దతు వంటివీ కరువైనవారిలో వితంతువులే ముందు వరుసలో ఉన్నారు. జాతి, మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోగా అవమానాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమాజం పుట్టుక నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ జాతి వివక్ష, లింగ వివక్ష, కుల వివక్ష, ఆర్థిక అంతరాల మీద జరుగుతున్నంత చర్చ వితంతు సమస్యల మీద జరగడం లేదు. విపత్తులు, యుద్ధాలు, మహమ్మారులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు ఈ సమస్య పెరుగుతోంది. కరోనా, రష్యా– ఉక్రెయిన్, ఇజ్రాయేల్– పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలోనూ వితంతువుల సమస్యలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.గూంగీ గుడియా..మన దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులరాలైన ఇందిరా గాంధీ తన 43వ ఏట భర్త (ఫిరోజ్ గాంధీ)ను కోల్పోయారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి జవహర్ మరణంతో ఆమె రాజకీయ ప్రవేశం అనివార్యమైంది. ఇందిరా రాజకీయ జీవితం తొలినాళ్లలో సోషలిస్ట్ నేత రామ్మనోహర్ లోహియా ఆమెను గూంగీ గుడియా (మూగ బొమ్మ)గా అభివర్ణించేవారు. తర్వాత ఆమె తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు, చేపట్టిన ప్రజాదరణ పథకాలు, గరీబీ హఠావో వంటి నినాదాలతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలకడం వంటి సాహసాలతో ఆమె గూంగీ గుడియా కాదు ఐరన్ లేడీ అనే ప్రతిష్ఠను సాధించింది. అప్పటిదాకా వితంతువు దేశానికి అపశకునం అని నిందించిన నోళ్లే ఆమె రాజకీయ చతురతను చూసి దుర్గాదేవిగా కీర్తించటం మొదలుపెట్టాయి. ఆ తరానికి చెందిన ఎంతోమంది తమ పిల్లలకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టుకునేలా ప్రేరణను పంచారు ఆమె. ఆఖరికి ఇందిరా సమాధిని శక్తిస్థల్గా పిలిచే స్ఫూర్తిని చాటారు.కరోనాతో మరోసారి..రెండు ప్రపంచ యుద్ధాల సందర్భంగా ఈ ప్రపంచం గతంలో ఎన్నడూ చూడనంతగా వితంతు సమస్యను ఎదుర్కొంది. ఆ గాయాల నుంచి బయటపడే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చరిల్లింది. మరోవైపు సామ్రాజ్యవాదం నాటిన విషబీజాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు గడిచిన రెండు దశాబ్దాల్లో పెరిగాయి. వెరసి ఆయుధాల నుంచి తూటాలు దూసుకువస్తున్నాయి. ఆకాశం నుంచి జారిపడే బాంబుల గర్జన పెరిగింది. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. వీటి వల్ల అనూహ్యంగా వితంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య .. ఇరాక్, అఫ్గానిస్తాన్, పాలస్తీనా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అధికంగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలకు తోడు కరోనా వైరస్ ఒకటి. అది సృష్టించిన భయోత్పాతానికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజుల తరబడి స్తంభించిపోయాయి. 2020, 2021లలో లక్షలాది మంది జనం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారమే నాలుగున్న లక్షల మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కరోనా చేసిన గాయాల కారణంగా మనదేశంలోనూ వితంతువుల సంఖ్య పెరిగింది.మరిన్ని రూపాల్లో.. యుద్ధాలు, విపత్తులు, మహమ్మారుల రూపంలోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, రైతుల ఆత్మహత్యలు వంటివీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వితంతువుల సంఖ్య పెరగడానికి కారణాలవుతున్నాయి. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ స్థితిగతులపై అవగాహన లేకపోవడం, కరువు, అధిక వడ్డీలు, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఏ ఏటికి ఆ ఏడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అప్పటికే అప్పుల పాలైన సదరు రైతు కుటుంబం, ఆ రైతు జీవిత భాగస్వామి అలవికాని కష్టాల్లో మునిగిపోయుంటోంది. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో మద్యం ప్రాణాలను కబళిస్తోంది. తాగుడు అలవాటైన వ్యక్తులు అందులోనే జోగుతూ కుటుంబాలను అప్పుల్లోకి నెడుతూ అనారోగ్యంపాలై చనిపోతున్నారు. ఆఖరికి ఆ కుటుంబం చిక్కుల్లో పడుతోంది. అందులో అత్యంత వేదనను భరిస్తోంది సదరు మృతుడి జీవిత భాగస్వామే!అత్యంత సంపన్న మహిళ..33.50 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళాగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ కూడా ఒంటరి మహిళే! తన ¿¶ ర్త.. జిందాల్ గ్రూప్ ఫౌండరైన ఓంప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత.. స్టీల్, పవర్, సిమెంటుకు చెందిన జిందాల్ గ్రూప్ వ్యాపార సంస్థలకు చైర్పర్సన్ గా ఆ గ్రూప్ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.సమస్యల వలయం..హఠాత్తుగా భర్తను కోల్పోవడం స్త్రీ జీవితంలో అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు తనతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఒక్కసారిగా దూరం అవుతాయి. దీంతో మానసిక తోడును ఒక్కసారిగా కోల్పోతారు. ఆ స్థితిని అర్థం చేసుకుని మానసికంగా తమను తాము కూడగట్టుకోక ముందే ఆచారాలు, సంప్రదాయాలు ఆ స్త్రీ పై తమ దాడిని మొదలెడతాయి. ఆ వెంటనే ఆస్తి పంపకాలు, బాధ్యతల విభజన విషయంలో భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలవుతుంది. కాస్త చదువు, అదిచ్చిన ధైర్యం ఉన్న స్త్రీ అయితే స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉన్న దారిని ఎంచుకుంటుంది. ఆ రెండూ లేని వితంతువులు భర్త తరఫు కుటుంబం లేదా పుట్టింటి వారి దయాదాక్షిణ్యాలకు తల ఒగ్గుతారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ రెండు ఇళ్లలో ఏదో ఒక ఇంటికి స్వచ్ఛంద వెట్టి చాకిరికి కుదిరిపోతారు వారి తుది శ్వాస వరకు. కాలం మారినా ఈ దృశ్యాలు మాత్రం మారలేదు. పై చదువులు, కొలువుల కోసం అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే పురోగతి ఎంతగా కనిపిస్తోందో.. దేశానికి ఇంకోవైపు భర్తపోయిన ఒంటరి స్త్రీల దయనీయ జీవితపు అధోగతీ అంతే సమంగా దర్శనమిస్తోంది.కుటుంబాల మద్దతు లేకపోయినా, మెరుగైన జీవితం కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి జీవన పోరాటం మొదలుపెట్టినా.. పొద్దునే ఆమె ఎదురొస్తే సణుక్కుంటూ మొహం తిప్పుకుని వెళ్లడం, శుభకార్యాలకు ఆమెను దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు ఆమెను బహిష్కరించడం, అంతెందుకు దేవుడి గుడిలోనూ అలాంటి అవమానాన్నే పంటి బిగువున భరించాల్సి వస్తోంది ఆమె! వీటన్నిటినీ జయించే శక్తిని కూడదీసుకున్నా, భర్త పోయిన ఆడవాళ్లకు ఇంటా, బయటా ఎదురయ్యే లైంగిక వేధింపుల చిట్టా మరొక కథ. ఇలా విడో అన్నిటికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిన తీరు అభివృద్ధి చెందుతున్న, చెందిన సమాజాల్లోనూ కామన్ సీన్గా ఉందంటే లేశమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరోవైపు వారికి అందాల్సిన ఆర్థిక మద్దతు కరువైన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆఖరికి యాచకుల్లో కూడా విడోలకు ఆదరణ ఉండదనేది చేదు వాస్తవం. యాచనకు దిగిన వితంతువులను అపశకునంగా భావించి దానం చేసేందుకు నిరాకరించే జనాలు కోకొల్లలు. ఇలా నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోన్న శరణాలయాలు ప్రధాన దిక్కుగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా మానవత్వం లోపించిన వారి నుంచి వితంతువులకు ఇక్కట్లు తప్పడం లేదు.వరల్డ్ విడోస్ డే..ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటి పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలవడానికి ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ విడోస్ డే’ను నిర్వహించాలని 2011లో నిర్ణయించింది. అందుకు జూన్ 23వ తేదీని ఎంచుకుంది. నాటి నుంచి ‘వరల్డ్ విడోస్ డే’ ద్వారా భర్తపోయిన స్త్రీల రక్షణ, సంరక్షణల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధిలో చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం, ఆచారాలు, సంప్రదాయాల పేరిట వారిపై జరుగుతున్న మానసిక, శారీరక దాడుల నుంచి విముక్తి కల్పించడం వంటివి ఐరాస ముఖ్య ఉద్దేశాల్లో కొన్నిగా ఉన్నాయి.మెహినీ గిరి..మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వింతతు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్య కారణాలు ఆడపిల్లలకు చదువు లేకపోవడం, మూఢవిశ్వాసాలు, కన్యాశుల్కం. ఈ సమస్యను స్వాతంత్య్రానికి పూర్వమే గ్రహించారు రాజా రామమోహన్ రాయ్, జ్యోతిబా పూలే, కందుకూరి విరేశలింగం వంటి సంఘసంస్కర్తలు. అందుకే ఆడపిల్లలు, బాల వితంతువులకు చదువు, స్వావలంబన, వితంతు వివాహాల కోసమూ అంతే పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. అయితే వితంతువుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమించిన వారిలో మోహినీ గిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యపై చర్చను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆమె పాటుపడ్డారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆమెకు పద్మభూషణ్ సత్కారాన్ని అందజేసింది.వార్ విడోస్ అసోసియేషన్..స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లక్నో యూనివర్సిటీలో సైన్ ్స డిపార్ట్మెంట్ను ప్రారంభించడంలో మోహిరీ గిరి తండ్రి కీలకమైన పాత్ర పోషించారు. దీంతో యూనివర్సిటీలో మోహినీ గిరి తండ్రికి ఒక పెద్ద బంగ్లాను కేటాయించడంతో పాటు విశేషమైన గౌరవ మర్యాదలనూ ఆ కుటుంబానికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అంటే మోహినీ పదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆ యూనివర్సిటీలో ఆమె కుటుంబ పరిస్థితి తారుమారైంది. అప్పటికే ఆమె తల్లికి సంగీతంలో డాక్టరేట్ పట్టా ఉన్నా, యూనివర్సిటీ నుంచి సరైన రీతిలో ప్రోత్సాహం లభించలేదు. పిల్లల పెంపకం కష్టం కావడంతో ఆమె యూనివర్సిటీని వదిలి బయటకు వచ్చారు. ఒంటరి తల్లిగా ఆమెకు ఎదురైన కష్టాలు, తమను పెంచి పెద్ద చేయడంలో ఆమె పడ్డ ఇబ్బందులను మోహినీ దగ్గరగా చూశారు. ఆ తర్వాత ఆమె మాజీ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆ సమయంలోనే అంటే 1971లో ఇండో–పాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్కు విముక్తి లభించింది. అయితే ఆ పోరులో ఎందరో జవాన్లు అమరులయ్యారు. వారి భార్యలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరయ్యారు. దీంతో ఆమె 1972లో దేశంలోనే తొలిసారిగా ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ను ప్రారంభించారు.దాడులు..ఆ రోజుల్లో (ఇప్పటికీ చాలా చోట్ల) వితంతువులు బయటి పనులకు వెళ్లడాన్ని అనాచారంగా భావించే వారు. అంతేకాదు రంగురంగుల దుస్తులు ధరించడంపైనా ఆంక్షలు ఉండేవి. జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో మోహినీ గిరి.. వారణాసి, బృందావన్, పూరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో వితంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆశ్రయం కల్పించి ఆ కేంద్రాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. వారి పిల్లలకు చదువులు చెప్పించారు. వీవీ గిరి ప్రభుత్వపరంగా పెద్ద పోస్టుల్లో ఉన్నంత వరకు మోహినీ గిరి చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ సహకారం అందించిన సమాజం.. ఆయన పదవుల్లోంచి దిగిపోయిన వెంటనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మోహినీ గిరి.. వితంతువులకు రంగురంగుల దుస్తులు వేసుకోమని ప్రోత్సహిస్తోందంటూ మన తిరుపతిలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. ఆ దాడులకు ఆమె వెరవలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నేటికీ ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. ఎందరో బుద్ధిజీవులు మోహినీ గిరి అడుగుజాడల్లో నడుస్తూ వితంతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.వితంతు రక్షణ చట్టాలు..వితంతువులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి కనిష్ఠంగా నెలకు రూ. 300ల నుంచి రూ.3,000ల వరకు ఆయా ప్రభుత్వాల వారీగా అందుతున్నాయి. పెన్షన్ తో పాటుగా వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలనూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 నుంచి ఇప్పటి వరకు వితంవులు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలను రూపొందించినా, సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయి. చట్టాల రూపకల్పన, ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు వంటివాటిని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై ఆధారపడే స్థితి నుంచి అద్భుతాలు సాధించే దశకు చేరుకుంటారు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
Akanksha: ఇన్నోవేషన్.. పర్యావరణ హితం!
తండ్రి సైన్యంలో పనిచేస్తుండడంతో ఆకాంక్ష ప్రియదర్శిని బాల్యం దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో గడిచింది. పచ్చదనం అంటే చెప్పలేనంత ఇష్టం. రూర్కెలాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చేసిన ఆకాంక్షకు కాలుష్య సమస్య గురించి ఆందోళనగా ఉండేది.వాయు కాలుష్య ప్రభావంతో తన బంధువులు, కాలేజి స్నేహితులలో కొందరికి శ్వాసకోశ సమస్యలు రావడం ఆమెను కలవరపరిచింది. వాయు కాలుష్యంకు సంబంధించి ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలనే లక్ష్యంతో క్లైమెట్ టెక్ స్టార్టప్ ‘ఆరాసుర్’ప్రారంభించింది. ఒడిషాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ ‘ఆరాసుర్’ ప్రయాణం మొదలైంది.వైర్లెస్, సెన్సర్ ఆధారిత సాంకేతిక సహాయంతో ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఉన్న సమాచార అంతరాన్ని తగ్గించడానికి కంపెనీ చురుగ్గా పనిచేస్తోంది. హైపర్–లోకల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ అభివృద్ధి చేసింది. డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన సందేహాలకు సమాధానం చెప్పడానికి మా హార్డ్వేర్ పరికరాల నుంచి సేకరించిన డేటా ఉపయోగపడుతుంది.ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, రెవెన్యూ ఎలా జెనరేట్ చేయాలి....అనే విషయాలకంటే పర్యావరణ విషయాలకేప్రాధాన్యత ఇచ్చాం’ అంటుంది ఆకాంక్ష. హార్డ్వేర్ డిజైనింగ్, సప్లైచైన్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్, ఇన్స్టాలేషన్... మొదలైన వాటిలో ప్రావీణ్యం సాధించిన ఆకాంక్ష ‘మల్టీటాలెంటెడ్’గా గుర్తింపు పొందింది.ఇవి చదవండి: Arpan Kumar Chandel: తొలి ఆల్బమ్తోనే.. రాగాల రారాజుగా.. -
'సిగ్నోరా సర్వీస్ సెంటర్'! ఈ ముగ్గురు మహిళలు..
కలలు కనడమే కాదు.. వాటి సాకారానికి కృషి చేయాలనే ఆలోచన ఓ ముగ్గురు గృహిణులలో కలిగింది. ఫలితంగా వాహనాలను రిపేర్ చేయడంలో శిక్షణ తీసుకున్నారు. అంతటితో ఆగిపోకుండా ‘సిగ్నోరా’ పేరుతో వెంచర్ను కూడా ఏర్పాటు చేశారు. మేరీ, బిన్సీ, బింటు అనే ఈ ముగ్గురు మహిళలు కేరళలోని కాసర్గోడ్కు చెందినవారు. ‘ఫస్ట్ ఆల్ ఉమెన్ టు ఆటోమొబైల్ వెంచర్గా మా సంస్థకు గుర్తింపు రావడం గర్వంగా ఉంది’ అని చెబుతున్న ఈ మహిళల లక్ష్యం ఎంతోమందికి స్ఫూర్తి కలిగిస్తోంది.పనిముట్లను అందుకున్న మేరీ అరగంట కృషితో రిపేర్లో ఉన్న కారును డ్రైవింగ్కు అనుకూలంగా మార్చేసింది. మేరీ, బిన్సీ, బింటు ముగ్గురూ ఆ తర్వాత మరో వాహనాన్ని రిపేర్ చేయడంలో మునిగిపోయారు. సాధారణంగా మహిళలు వెనకడుగు వేసే ఆటోమొబైల్ రిపేరింగ్ రంగంలో ఈ ముగ్గురూ సక్సెస్ను చూపుతున్నారు.శిక్షణతో ముందడుగు..మహిళలు ఒంటరిగా లేదా బృందంగా వ్యా΄ారంప్రారంభించేందుకు శిక్షణ ఇవ్వడానికి పరప్ప బ్లాక్ పంచాయితీ ఆలోచన చేసింది. ఆ సమయానికి బిన్సీ, బింటు, మేరీలు ఎవరి కాపురాలు వారు చేసుకుంటూ కుటుంబ జీవనం గడుపుతున్నారు. అయితే తాము కుటుంబ బాధ్యతలకు అతీతంగా సమాజం ముందు సగర్వంగా నిలబడాలని కలలు కన్నారు. అంతటితో ఆగిపోలేదు.. వాటిని సాకారం చేసుకోవాలనుకున్నారు. పరప్ప బ్లాక్ పంచాయితీ ద్విచక్ర వాహనాల మరమ్మతులో వృత్తి శిక్షణ కోర్సును ΄్లాన్ చేసింది. ఆ శిక్షణా కార్యక్రమమే ముగ్గురు మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.గ్రూప్గా ఏర్పాటు..పద్ధెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు గల ఇరవై మంది మహిళలను కోర్సుకు ఆహ్వానించింది. ఈప్రాజెక్ట్ను అమలు చేసేందుకు ఏడు పంచాయతీలను ఎంపిక చేశారు. మొత్తం 23 మంది మహిళలు శిక్షణకు ముందుకు వచ్చారు. వీరికి నెల రోజుల ΄ాటు నిపుణులు శిక్షణ ఇచ్చారు. బిన్సీ మాట్లాడుతూ ‘కోర్సు పూర్తవగానే వెంచర్ప్రారంభించాలనుకునేవారికి సహాయం అందిస్తామన్నారు. అప్పుడే మేం ఒక గ్రూప్గా ఏర్పడి సరైన ΄్లాన్తో ముందుకు రావాలనుకున్నాం.ఒకే ప్రాంతంలో ఎంటర్ప్రైజ్ప్రారంభించాలనుకున్నాను. సిగ్నోరా అంటే లాటిన్ భాషలో ‘పెళ్లయిన స్త్రీ’ అని అర్థం. కుటుంబ సభ్యులు కూడా మాకు మద్దతునిచ్చారు. ఆటో సర్వీసింగ్ రంగం మహిళలకు అంత సులువైన పనికాదనే అభి్ర΄ాయం అందరిలోనూ ఉంది. దీనిని అధిగమించాలనే పట్టుదలతోనే మేం వర్క్షాప్నుప్రారంభించాం. భీమానది–కలికడవ్ మార్గంలో మా వెంచర్ను ఏర్పాటు చేశాం.మేరీ, బిన్సీ, బింటుతొలినాళ్లలో ‘ఆడవాళ్లు రిపేర్లు చేస్తే ఇక ఆ వాహనం ముందుకు నడిచినట్టే..’ లాంటి వ్యంగ్యపు మాటలు వినవచ్చేవి. అలాంటి ఆలోచనతో చాలా మంది మా వెంచర్కు వచ్చేవారు కాదు. అయితే, ఆ తర్వాత మెల్లగా మా వెంచర్కు వచ్చిన వాహనాలకు తగిన రిపేర్ చేయడంతో మంచి గుర్తింపు రావడం మొదలైంది. ఎలాంటి వాహన సమస్యనైనా మేం పరిష్కరించగలం.ప్రతిరోజూ కొత్త విషయాలు..‘విజయాన్ని త్వరగా సొంతం చేసుకోగల వృత్తి ఇది కాదని మేం నమ్ముతున్నాం. దీనివల్ల లాభాలు గడిస్తాం అని కూడా అనుకోవడం లేదు. ప్రస్తుతం వచ్చే ఆదాయం అద్దెకు, రుణం చెల్లించడానికి సరిపోతుంది. సర్వీస్ సెంటర్లో అధునాతన పరికరాలు కొనుగోలు చేయడానికి డబ్బు కావాలి. ప్రతి రోజూ ఒక్కో వాహనం గురించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం.మా ముగ్గురికీ ఆర్థిక సహకారం అందించేలా సంస్థ క్రమంగా ఎదుగుతుందని ఆశిస్తున్నాం’ అంటున్నారు ఈ మహిళలు. మొదట్లో ఆటోమొబైల్ సర్వీస్ ట్రెయినింగ్కు విముఖత చూపిన పలువురు స్థానిక మహిళలు ఇప్పుడు ఆసక్తిగా ఈ ΄ారిశ్రామికవేత్తలను సంప్రదిస్తున్నారు. తమ వెంచర్ విజయవంతమైతే ద్విచక్రవాహనాల రిపేరింగ్లో అమ్మాయిలకు శిక్షణ ఇవ్వాలనుకుంటున్నామ’ని మేరీ చెబుతోంది.‘ఈ వెంచర్ను ప్రారంభించి ఆరు నెలలు కావస్తోంది. యూనిఫామ్ ధరించి పని చేస్తున్నప్పుడు మాపై మాకు నమ్మకంగానూ, గర్వంగానూ అనిపిస్తుంది. టెక్నాలజీ రోజు రోజుకూ మారుతున్న కొద్దీ ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. చాలామంది అమ్మాయిలు, మహిళలు ఇప్పుడు మమ్మల్ని ఈ పని నేర్పించమని అడుగుతున్నారు. ఆసక్తి ఉన్నవారికి శిక్షణ అందించాలనుకుంటున్నాం. మా వెంచర్ను పెద్ద సంస్థగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం’ అంటున్నారు ఈ ఉమెన్ మెకానిక్స్.ఇవి చదవండి: ఇంతకీ ఎవరీ శతవరి? చరిత్రలో తొలిసారిగా.. -
ఇంతకీ ఎవరీ శతవరి? చరిత్రలో తొలిసారిగా..
‘కృత్రిమ నవ్వు’ అని వెక్కిరిస్తాం. ‘వారి మాటల్లో అంతా కృత్రిమత్వమే’ అని విమర్శిస్తాం. ‘కృత్రిమత్వం’ ‘సహజత్వం’ భిన్న ధ్రువాలు అనే వాస్తవాన్ని కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తిరగ రాసింది. కృత్రిమ మేధస్సు నుంచి పుట్టిన అందాల యువతులు నవ్వితే ఆ నవ్వులో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. మాట్లాడితే... మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందేగానీ ఎక్కడా కృత్రిమ ఛాయ కనిపించదు.మానవులతో పోటీ పడుతూ ‘ఎక్కడా తగ్గేదేలే’ అంటున్న డిజిటల్ సొగసరులకు ఏఐ సబ్స్క్రిప్షన్ ప్లాట్ఫామ్ ‘ఫ్యాన్ వ్యూ’ అందాల పోటీ నిర్వహించింది. ‘మిస్ ఏఐ’ పోటీ జరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘మిస్ ఏఐ’ పోటీలో ప్రపంచవ్యాప్తంగా పదిహేను వందల ఏఐ మోడల్స్, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లు పోటీ పడ్డారు. ‘టాప్ –10’ ఫైనలిస్ట్ జాబితాలో మన దేశం నుంచి డిజిటల్ దివా జరా శతవరి చోటు సాధించింది.బ్యూటీ, టెక్ స్కిల్స్, సోషల్ మీడియాలో వీరి ప్రభావం ఎంత... మొదలైన అంశాలు ‘మిస్ ఏఐ’ ఎంపిక ప్రక్రియలో ఉంటాయి. న్యాయ నిర్ణేతలలో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఉండడం విశేషం. ‘మిస్ ఏఐ విజేత’ ఎవరవుతారో అనే ఆసక్తికంటే ‘ఎవరీ జరా శతవరి?’ అనే ఆరా ఎక్కువ అయింది. అందానికి అక్షరాలా నిర్వచనంలా ఉన్న ఈ శతవరి ఎవరో తెలుసుకుందాం..ఒక మొబైల్ కంపెనీ యాడ్ ఏజెన్సీకి కో–ఫౌండర్ అయిన రాహుల్ చౌదరి శతవరి సృష్టికర్త. శతవరిని ‘డిజిటల్ మీడియా మేధావి’గా అభివర్ణించాడు రాహుల్. ‘మిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’లో శతవరికి ‘టాప్–10’ చోటు దక్కిన సందర్భంగా తన లింక్డ్ ఇన్ పోస్ట్లో సంతోషాన్ని వ్యక్తం చేశాడు రాహుల్.‘ఈ గుర్తింపు ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి జరా శతవరి చేసిన విశేష కృషిని తెలియజేస్తుంది. ప్రపంచ వేదికపై భారత్, ఆసియాకుప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తాను. శతవరి భారత్ నుంచి ఏకైక ఫైనలిస్ట్, ఆసియా నుంచి ఇద్దరిలో ఒకరు’ అని పోస్ట్లో స్పందించాడు రాహుల్.కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ని ఎలా చూడాలి?’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తోంది. అందం, సోషల్ మీడియాలోని అభిమాన గణం మాత్రమే శతవరి విలువకుప్రాతిపదిక కాదు. హార్మోన్ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కలిగిస్తుంది. కృత్రిమ మేధస్సులోని సానుకూల కోణానికి సంపూర్ణంగా అద్దం పడుతుంది.‘ఏ.ఐ. సామర్థ్యం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం ఆమె లక్ష్యం’ అంటున్నాడు జరా శతవరి సృష్టికర్త రాహుల్. కృత్రిమ మేధస్సు మంచి చెడుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో ‘శతవరి’ పనితీరును ఎలా చూడాలి? ’ అనే ప్రశ్నకు ‘వందశాతం పాజిటివ్’గానే అనే సమాధానం వినిపిస్తుందిశతవరి శక్తి ఇది...– ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఏఐ–పవర్డ్ సోషల్ మీడియా స్ట్రాటజీ, ఎనాలటిక్స్ నేర్చుకుంది.– 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కు ‘బ్రాండ్ అంబాసిడర్’గా ఉంది.– ‘ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్’గా తన టాలెంట్ను చూపించింది.– సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా ‘వావ్’ అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో సుమారు 8000 మంది ఫాలోవర్లు ఉన్నారు.– స్ట్రాటిజిక్ ప్లానింగ్, కంటెంట్ డెవలప్మెంట్, డేటా ఎనాలసిస్, బ్రాండ్ ఎవేర్నెస్, బ్రాండ్ అడ్వకసీ, ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, క్రియేటివ్ ఐడియేషన్, ట్రెండ్–సావి, హెల్త్ అండ్ వెల్నెస్ కన్సల్టింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఫ్యాషన్ స్టైలింగ్, కెరీర్ డెవలప్మెంట్ లాంటి విభాగాలలో ప్రతిభ చాటుతోంది. -
Revathi Pillai: తానొక.. డిజిటల్ స్టార్.. అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్..
రేవతి పిళ్లై.. ‘ద వైరల్ ఫీవర్ (టీవీఎఫ్)’ యూట్యూబ్ చానెల్ వీక్షకులకు సుపరిచితం. నటిని కావాలనుకుని ఈ రంగంలోకి అడుగుపెట్టలేదు రేవతి. ఇష్టంలేకుండానే మొదలుపెట్టింది ఈ ప్రయాణాన్ని. అయినా మనసు పెట్టే కొనసాగిస్తోంది. అందుకే ఇక్కడ రేవతిని పరిచయం చేస్తున్నాం..మహారాష్ట్రలో స్థిరపడిన మలయాళీ కుటుంబం రేవతి వాళ్లది. ఆమె థానేలో పుట్టిపెరిగింది. షీజా పిళ్లై, మనోజ్ పిళ్లై.. రేవతి తల్లిదండ్రులు.ఊహ తెలిసినప్పటి నుంచి ఆటోమొబైల్ ఇంజినీర్ కావాలని కలలు కన్నది. కానీ రేవతిలోని ఇమిటేషన్ స్కిల్స్ చూసిన ఆమె కజిన్ తన చెల్లెలు యాక్టర్ అయితే బాగుంటుంది అనుకున్నాడు అనుకోవడమే కాదు ఆడిషన్స్కీ తీసుకెళ్లేవాడు. ప్రతి ఆడిషన్కి రేవతి ఏడుస్తూనే వెళ్లేదట.రేవతికి మొదట మోడలింగ్లో అవకాశాలు వచ్చాయి. మోడల్గా రాణిస్తున్నప్పుడే టీవీఎఫ్ వాళ్ల ‘యే మేరీ ఫ్యామిలీ’ వెబ్ సిరీస్కి సెలెక్ట్ అయింది. అందులో ‘విద్య’గా నటించింది. అయిష్టంగానే నటనారంగంలోకి అడుగుపెట్టినా.. కెమెరా ముందుకు రాగానే తన మైండ్ని మేకప్ చేసింది.. అదే తన కెరీర్ అని.. కమిట్ కావాలని!ఆ కమిట్మెంట్ విత్ టాలెంట్ని టీవీఎఫ్ వదలుకోదల్చుకోలేదు. అందుకే తర్వాత సిరీస్ ‘కోట ఫ్యాక్టరీ’లోనూ చాన్స్నిచ్చింది. అది ఆమెకు మంచి పేరు తెచ్చింది. తర్వాత ‘స్పెషల్ ఆప్స్ 1.5’లోనూ నటించింది.కంఫర్ట్ జోన్లో ఉండటం రేవతి ఇష్టం ఉండదు. కంఫర్ట్ మనలోని క్రియేటివిటీని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని చంపేస్తుందని ఆమె అభిప్రాయం. అందుకే సిరీస్ చేస్తూనే ‘కాపిటల్ ఏ, స్మాల్ ఏ’ అనే షార్ట్ ఫిల్మ్లో నటించింది. ‘తారే జమీన్ పర్’ ఫేమ్ దర్శిల్ సఫారీ సరసన.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టాగ్రామ్లో రేవతికి లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. తన ఇన్స్టా హ్యాండిల్లో ఆమె లైఫ్స్టయిల్, నేచర్, ట్రావెల్ ఫొటోస్, వీడియోస్ని పోస్ట్ చేస్తూంటుంది.రేవతి నటించిన ‘దిల్ దోస్త్ డైలమా’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.‘అన్నిటికన్నా కూల్ రోల్ స్టూడెంట్ రోల్. అయితే ఆ పాత్రకే పరిమితం కాలేం కదా! యాక్టర్స్ అందరిలాగే నాకూ డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. ముఖ్యంగా సైకో కిల్లర్గా నటించాలనుంది!’ – రేవతి పిళ్లై -
Umamani: సముద్రం ఘోషిస్తోంది..
సముద్రం నిత్యం ఘోషిస్తూ ఉంటుంది. ఆ ఘోషకు భావకవులు రకరకాల అర్థాలు చెప్తుంటారు. కానీ సముద్రం లోపల ఏముంది? సముద్రం లోపల మరో ప్రపంచం ఉంది. పగడపు దీవులమయమైన ఆ అందమైన ప్రపంచాన్ని చందమామ కథల్లో చదివాం. మన ఊహల్లో అద్భుతమైన దృ«శ్యాన్ని ఊహించుకున్నాం. ఇప్పటికీ అదే ఊహలో ఉన్నాం. కానీ ఆ ఊహలో నుంచి వాస్తవంలోకి రమ్మని చెబుతున్నారు ఉమామణి. ఒకప్పుడు అందమైన పగడపు దీవులను చిత్రించిన ఆమె కుంచె ఇప్పుడు అంతరించిపోయిన పగడపు దీవులకు అద్దం పడుతోంది. బొమ్మలేయని బాల్యం..‘‘మాది తమిళనాడులోని దిండిగల్. నాకు బొమ్మలేయడం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడు చూసినా రంగు పెన్సిళ్లతో బొమ్మలు గీస్తూ కనిపించేదాన్ని. అది చూసి నానమ్మ ‘పిచ్చి బొమ్మల కోసం కాగితాలన్నీ వృథా చేస్తున్నావు. చక్కగా చదువుకోవచ్చు కదా’ అనేది. అలా ఆగిపోయిన నా చిత్రలేఖనం తిరిగి నలభై దాటిన తర్వాత మొదలైంది. ఈ మధ్యలో నాకు ఓ డాక్టర్తో పెళ్లి, వారి ఉద్యోగరీత్యా మాల్దీవులకు వెళ్లడం, ఓ కొడుకు పుట్టడం, ఆ కొడుకుకి కాలేజ్ వయసు రావడం జరిగిపోయాయి.ఇంతకాలం గృహిణిగా ఉన్న నాకు కొడుకు కాలేజ్కెళ్లిపోయిన తర్వాత ఆ ఖాళీ సమయాన్ని చిన్నప్పుడు తీరని కోరిక కోసం కేటాయించాను. గులాబీల నుంచి టులిప్స్ వరకు రకరకాల పూలబొమ్మలు వేసిన తర్వాత నా చుట్టూ ఉన్న సముద్రం మీదకు దృష్టి మళ్లింది. పగడపు దీవులు నా చిత్రాల్లో ప్రధాన భూమిక అయ్యాయి. తొలి చిత్ర ప్రదర్శన మాల్దీవులలోని మెరైన్ సెంటర్లో పెట్టాను. ఆ తర్వాత అనేక ప్రదర్శనల్లో నా చిత్రాలను ప్రదర్శించాను. వివాంత మాల్దీవ్స్ ప్రదర్శన సమయంలో ఒక భారతీయ మహిళ వేసిన ప్రశ్న నా దిశను మార్చింది.‘సముద్ర గర్భం ఎలా ఉంటుందో ఏమేమి ఉంటాయో స్వయంగా చూడకుండా బొమ్మలేయడం ఏమిటి’ అన్నదామె. ఆమె వ్యాఖ్య నాకు మొదట్లో అసమంజసంగా అనిపించింది. అనేక పరిశోధకుల డాక్యుమెంటరీలను చూసిన అనుభవంతోనే కదా చిత్రించాను. నేను స్వయంగా చూస్తే కొత్తగా కనిపించేది ఏముంటుంది... అని కూడా అనుకున్నాను. ఇంత సందిగ్ధం ఎందుకు... ఒకసారి సముద్రగర్భంలోకి వెళ్లి చూద్దాం అని కూడా అనుకున్నాను. అప్పుడు మా అబ్బాయి మా ΄ాతికేళ్ల వివాహ వార్షికోత్సవం బహుమతిగా నన్ను స్కూబా డైవింగ్ కోర్సులో చేర్చాడు.డైవింగ్కంటే ముందు ఈత రావాలి కదా అని చెన్నైకి వచ్చి రెండు వారాల స్విమ్మింగ్ కోర్సులో చేరాను. తిరిగి మాల్దీవులకెళ్లి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాను. తొలి రోజు అంతా అగమ్యంగా అనిపించింది. రెండవ రోజు కూడా అదే పరిస్థితి. మానేద్దామనే నిర్ణయానికి వచ్చేశాను. కోచ్ నా మాటలు పట్టించుకోలేదు. ప్రయత్నాన్ని కొనసాగించమని మాత్రం చె΄్పారు. నాకు నేను నెల రోజుల గడువు పెట్టుకున్నాను. ఆ నెలలో నావల్ల కాకపోతే మానేద్దామని నా ఆలోచన. ఆ నెల రోజుల్లో డైవింగ్కి అనుగుణంగా మానసికంగా ట్యూన్ అయిపోయాను.సముద్రగర్భాన్ని చిత్రించాను.. సముద్రం అడుగున దృశ్యాలు నన్ను వేరేలోకంలోకి తీసుకెళ్లిపోయాయి. పగడపు చెట్లు నిండిన దిబ్బలు, రకరకాల చేపలు, ΄ాములు ఒక మాయా ప్రపంచాన్ని చూశాను. ఆ ప్రపంచాన్ని కాన్వాస్ మీద చిత్రించడం మొదలుపెట్టాను. ఒక చిత్రానికి మరో చిత్రానికి మధ్య మాటల్లో వర్ణించలేనంత వైవిధ్యత వచ్చేసింది. ఆ చిత్రాలన్నింటినీ మాల్దీవుల మెరైన్ సింపోజియమ్ 2016లో ప్రదర్శించాను. ఆ చిత్రాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లా ఓషన్ రీసెర్చర్లు, అంతరించిపోతున్న పగడపు దిబ్బల పరిశోధకులకు ఉపయోగపడ్డాయి. కొంతకాలం తర్వాత సముద్రగర్భంలోని సన్నివేశాలను కెమెరాలో బంధించాలనుకున్నాను. ఫొటోగ్రఫీలో అనుభవం లేకపోవడంతో శబ్దరహితంగా పేలవంగా వచ్చింది ఫిల్మ్. అప్పటి నుంచి ఫిల్మ్ మేకింగ్, డాక్యుమెంటరీలు తీసే వారి దగ్గర మెళకువలు నేర్చుకునే ప్రయత్నం చేశాను. చాలామంది స్పందించలేదు. ఫిల్మ్ మేకర్ ప్రియా తువాస్సెరీ మాత్రం నాతో కలిసి ఫిల్మ్ తీయడానికి సిద్ధమయ్యారు.చిత్రీకరణ కోసం 2018లో మనదేశంలోని రామేశ్వరం, రామనాథపురం, టూటికోరన్ తీరాల్లో డైవ్ చేశాను. ఆశ్చర్యంగా సముద్రం అడుగుకి వెళ్లే కొద్దీ పగడపు దిబ్బలు కాదు కదా జలచరాలు కూడా కనిపించలేదు. ΄్లాస్టిక్ వ్యర్థాలు దిబ్బలుగా పేరుకుపోయి ఉన్నాయి. రసాయనాలు, పురుగుమందులు, ఎరువుల వ్యర్థాలను సముద్రపు నీటిలోకి వదలడంతో జలచరాలు అంతరించిపోయాయి. సునామీ విలయంలో పగడపు దీవులు అతలాకుతలం అయిపోయాయి. శిథిలమైన ఆనవాళ్లు తప్ప పగడపు చెట్ల సమూహాలు లేవు. చెట్లు చనిపోయిన దిబ్బలనే వీడియో, ఫొటోలు తీశాను.మనిషి తన సౌకర్యం కోసం చేసే అరాచకానికి సముద్రం ఎలా తల్లడిల్లిపోతోందో తెలియచేస్తూ ఆ ఫొటోలతో ప్రదర్శన పెట్టాను. మా సొంతూరు తమిళనాడులోని దిండిగల్తో మొదలు పెట్టి అనేక స్కూళ్లు, కాలేజ్లకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్నాను. సముద్రం ఘోషిస్తోంది. ఆ ఘోషను విందాం. ప్రకృతి సమతుల్యతను కా΄ాడుకుందాం. ఓషన్ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మీద పరిశోధన చేసే వాళ్లకు నేను తీసిన ఫొటోలు, చిత్రలేఖనాలు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లా ఉపయోగపడుతున్నాయి.ఒక సాధారణ గృహిణిగా నేను 43 ఏళ్ల వయసులో కుంచె పట్టి పెయింటింగ్స్ మొదలుపెట్టాను. 49 ఏళ్లకు స్కూబా డైవింగ్ నేర్చుకుని సాగర సత్యాలను అన్వేషించాను. సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని సేకరించగలిగాననే సంతృప్తి కలుగుతోంది. మొత్తంగా నేను చెప్పేదేమిటంటే ‘వయసు ఒక అంకె మాత్రమే. మన ఆసక్తి మనల్ని చోదకశక్తిగా నడిపిస్తుంది’. అంటారు ఉమామణి.ఇవి చదవండి: Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది -
Nidhi Mohan Kamal: తాను.. ఒక 'ఆల్ ఇన్ వన్'!
ఫుడ్ సైంటిస్ట్, ‘NidSun వెల్నెస్’కి డైరెక్టర్, పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్, అష్టాంగ యోగా టీచర్ కూడా! ఢిల్లీలో పుట్టిపెరిగింది. ఫుడ్ అండ్ కెమికల్ ఇంజినీరింగ్ రెండిట్లో గ్రాడ్యుయేషన్ చేసింది.బాడీ షేపింగ్ ఇండస్ట్రీలోకి 2007లో ఎంటర్ అయింది. న్యూట్రిషన్ ఫుడ్కి సంబంధించి ఆమె ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా మొదలు పలు వెబ్సైట్స్కీ ఆర్టికల్స్ రాస్తుంటుంది. ఆమె చేసిన హోమ్ వర్కవుట్ వీడియో సిరీస్ WION news అనే చానెల్లో ‘ద బ్రేక్ఫస్ట్ షో’ పేరుతో ప్రసారమైంది. వాటిని ఆమె తన యూట్యూబ్ చానెల్లోనూ పోస్ట్ చేసింది. స్పోర్ట్స్ న్యూట్రిషన్లోనూ నిధికి స్పెషలైజేషన్ ఉంది. పుమాకి అంబాసిడర్గా కూడా వ్యవహరించింది.ఇవి చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా? -
పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం..
మనలో చాలా మంది పక్షులను పెంచుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువశాతం తమ ఆహ్లాదం కోసమే. నిజానికి పక్షులను ఆదరించాల్సింది మన ఆహ్లాదం కోసం కాదు, వాటి ఆనందం కోసం దగ్గరకు తీయాలి. వాటి రెక్కలు విరిచి పంజరంలో పెట్టి మనం చూస్తూ ఆనందించడం హేయమైన చర్య. స్వేచ్ఛగా ఎగరడం వాటి సహజ లక్షణం. అది వాటికి ప్రకృతి ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం మనకు లేదు... అంటున్నారు మహారాష్ట్ర, పుణేలో నివసిస్తున్న రాధికా సోనావానే. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్న రాధిక పక్షి సంరక్షకురాలిగా మారిన క్రమాన్ని ఆమె చాలా ఇష్టంగా వివరిస్తారు.‘‘ప్రస్తుతం నా ఉద్యోగరీత్యా పూనాలో ఉన్నాం. మా స్వస్థలం ఔరంగాబాద్. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్కచెప్పలేను. పక్షుల మీద మమకారం ఏర్పడింది. నేను బర్డ్ లవర్ని బర్డ్ వాచర్ని మాత్రమే అనుకున్నాను. కానీ ఏ మాత్రం ముందస్తు ప్రణాళికలు లేకుండా అనుకోకుండా పక్షి సంరక్షకురాలినయ్యాను. పెళ్లి తర్వాత నా నివాసం ఔరంగాబాద్లోనే ఒక ఫ్లాట్లోకి మారింది.మా పొరుగింట్లో ఓ పెద్దాయన బాల్కనీలో బర్డ్ ఫీడర్, ఒక గిన్నెలో నీరు పెట్టడం చూసిన తర్వాత నాకూ ఆలాగే చేయాలనిపించింది. పుణేకి బదిలీ అయిన తర్వాత కూడా కొనసాగింది. ఇప్పుడు మా ఇంటి గార్డెన్ పక్షుల విహార కేంద్రమైంది. నాకు తోచిన గింజలు పెట్టి సరిపెట్టకుండా ఏ పక్షికి ఏమిఇష్టమో తెలుసుకోవడానికి పక్షుల జీవనశైలిని అధ్యయనం చేశాను. రామ చిలుకలకు వేరుశనగ పప్పులు ఇష్టం. గోరువంకలు అరటి పండు తింటాయి. రామ చిలుక ముక్కు పెద్దది.గోరువంక, పిచ్చుకల ముక్కులు చిన్నవి. ఆ సంగతి దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్సులు డిజైన్ చేయించాను. నేను పెట్టిన ఆహారాన్ని అవి ఇష్టంగా తింటున్నాయా లేదా, నేను చదివింది నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి బాల్కనీలో కూర్చుని శ్రద్ధగా గమనించేదాన్ని. అరటి పండు ముక్కలను చూడగానే గోరువంకలు సంతోషంగా పాటలు పాడడం మొదలుపెడతాయి. పాట పూర్తయిన తర్వాత తింటాయి. టైయిలర్ బర్డ్ అయితే పత్తి దూదిని చూడగానే రాగాలు మొదలుపెడుతుంది.గూడు కట్టుకోవడానికి పత్తి కనిపిస్తే దాని ఆనందానికి అవధులు ఉండవు. మనం సాధారణంగా కాకులను ఇష్టపడం. కానీ అవి చాలా హుందాగా వ్యవహరిస్తాయి. కాకులు, పిచుకలు, చిలుకలు, గోరువంకలు ఇతరులకు హాని కలిగించవు. పావురాలు అలా కాదు. వాటి ఆహారపు అలవాట్లు కూడా అంత సున్నితంగా ఏమీ ఉండవు. తమ ఆహారంలో ఇతరులను ముక్కు పెట్టనివ్వవు, ఇతరుల ఆహారాన్ని కూడా తామే తినేయాలన్నంత అత్యాశ వాటిది. పక్షి స్వేచ్ఛాజీవి..పెట్ డాగ్లాగా యజమానితో అనుబంధం పెంచుకోవడం పక్షుల్లో ఉండదు. స్వేచ్ఛగా విహరిస్తూ అనేక ప్రదేశాలకు వెళ్తుంటాయి. ఒక ప్రదేశంతో కానీ వ్యక్తితో కానీ అనుబంధం పెంచుకోవు. మా ఇంటికి వచ్చే నా అతిథుల్లో చిలుకలే ఎక్కువ. అలెగ్జాండ్రియన్ ΄్యారట్, ఇండియన్ రింగ్నెక్ ΄్యారట్లు తరచూ కనిపిస్తుంటాయి. సన్బర్డ్, వీవర్ బర్డ్ కూడా వస్తుంటాయి. కాలం మారేకొద్దీ అవి అప్పటి వరకు ఉన్న ప్రదేశాలను వదిలి తమకు అనువైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటాయి.వాయు కాలుష్యం, వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా పక్షుల వలసలకు కారణమే. సెల్ ఫోన్ టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా పక్షులు కంటి చూపును కోల్పోతున్నాయి. దాంతో అవి తమకు సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ ఎటుపోతున్నాయో తెలియడం లేదు. కరవు, అధిక వర్షాలు, యాసిడ్ వర్షాలు, అడవులలో చెట్లు నరకడం, మంటలు వ్యాప్తించడం... వాటికి ఎదురయ్యే ప్రమాదాలు. పక్షులు అడవిలో జీవించినంత ధైర్యంగా మనుషుల మధ్య జీవించలేవు.వాటికి మనుషులంటే భయం. ఆ భయాన్ని వదిలించి మచ్చిక చేసుకోవాలంటే వాటికి ఆహారాన్ని అందుబాటులో ఉంచడం ఒక్కటే మార్గం. ఆహారం కోసం ధైర్యం చేస్తాయి, క్రమంగా మన మీద నమ్మకం కలిగిన తర్వాత మన ఇంటిని తమ ఇంటిలాగా భావిస్తాయి. మా గార్డెన్కి రోజూ నలభై నుంచి యాభై పక్షుల వరకు వస్తుంటాయి. వాటి కోసం ఇంట్లో వంటగది, హాలు, బాల్కనీల్లో పక్షుల కోసం నీటి పాత్రలు పెట్టాను. దాహం వేసినప్పుడు నేరుగా దగ్గరలో ఉన్న నీటి పాత్ర దగ్గరకు వెళ్లిపోతాయి. పక్షులు మనతో మాట్లాడతాయి.రోజూ మా ఇంటి ఆవరణలో వినిపించే కిచకిచలన్నీ అవి నాకు చెప్పే కబుర్లే. కరోనా సమయంలో నా టైమ్ అంతా వీటి కోసమే కేటాయించాను. నన్ను నిత్య చైతన్యంగా ఉంచాయవి. నిజానికి పక్షి ప్రేమికులెవ్వరూ పక్షులను పంజరంలో బంధించరు. తమ సంతోషం కోసం పక్షులను పెంచే స్వార్థజీవులే ఆ పని చేస్తారు. దయచేసి పక్షులను బంధించవద్దు. వాటిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. చేతనైతే రోజుకు గుప్పెడు గింజలు, ఒక పండు పెట్టండి’’ అంటూ పక్షుల గురించి ఆసక్తికరమైన విషయాలెన్నో చెబుతారు రాధిక.ఇవి చదవండి: ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్గా..! -
ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’!
అల్లరి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న చంద్రికా రవి డ్యాన్సర్గా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంది. మోడలింగ్లోనూ మంచి మార్కులు కొట్టేసింది. నటనలో ‘వాహ్వా’ అనిపించింది. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన చంద్రికా రవి భారతీయ మూలాలను మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు. ఆమె మాట, పాట, నటన, నృత్యంలో భారతీయత ప్రతిఫలిస్తుంది. తాజా విషయానికి వస్తే... యూఎస్ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి భారతీయ నటిగా చంద్రికా రవి చరిత్ర సృష్టించింది. అమెరికన్ టాక్ షో ‘ది చంద్రికా రవిషో’కు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో పుట్టింది చంద్రికా రవి. మల్లిక, రవి శ్రీధరన్లు తల్లిదండ్రులు. మూడు సంవత్సరాల వయసులోనే డ్యాన్స్, యాక్టింగ్లలో చంద్రికకు శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే సింగపూర్లో నృత్య ప్రదర్శన ఇచ్చింది. కొత్త్ర పాంతాలకు వెళ్లడం అంటే చంద్రికకు ఎంతో ఇష్టం. టీనేజ్లోనే ఎన్నో దేశాలు చుట్టేసి వచ్చింది. ఆస్ట్రేలియా నుంచి లాస్ ఏంజెల్స్కు వెళ్లి యాక్టింగ్, మోడలింగ్లో కెరీర్ మొదలు పెట్టింది..‘సెయి’ అనే తమిళ చిత్రంతో భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో భారతీయ, పాశ్చాత్య సంస్కృతులపై బాగా పరిచయం ఉన్న యువతి పాత్రలో నటించింది. నిజానికి నిజజీవితంలోనూ ఆమెకు రెండు సంస్కృతులపై గాఢమైన పరిచయం ఉంది. ‘నా మూలాలు దక్షిణ భారతంలో ఉన్నాయి’ అని తనను తాను గర్వంగా పరిచయం చేసుకుంటుంది చంద్రిక. మోడలింగ్ చేసినప్పటికీ తన తొలి ్రపాధాన్యత మాత్రం నటనే.‘ఫిల్మ్ మేకింగ్, యాక్టింగ్లో యూఎస్లో శిక్షణ తీసుకున్నాను. విదేశాల్లో కొన్ని ఫీచర్ ఫిల్మ్లు చేశాను. నటన అంటే ఇష్టం అయినప్పటికీ ఒకేరకమైన పాత్రలు చేయడం ఇష్టం లేదు. వైవి«ధ్యం ఉన్న పాత్రలు చేయడానికే ్రపాధాన్యత ఇస్తాను’ అంటున్న చంద్రిక పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. సిల్క్ స్మిత బయోపిక్లో లీడ్ రోల్లో నటించింది. ‘అచ్చం స్మితలాగే ఉంది’ అనిపించుకుంది.రేడియో టాక్ షో విషయానికి వస్తే...‘ది చంద్రికా రవి షో’లో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన రకరకాల అనుభవాలు, సవాళ్లు, పోరాటాలను పంచుకోనుంది. చంద్రిక పోరాట నేపథ్యం గురించి విన్న రూక్స్ అవెన్యూ రేడియో వ్యవస్థాపకుడు సామీ చంద్ ఆమెకు వ్యాఖ్యాతగా అరుదైన అవకాశం ఇచ్చాడు.‘ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ షో ఉపయోగపడుతుంది’ అంటుంది చంద్రిక. అమెరికాలోని అతి పెద్ద నెట్వర్క్లలో ఒకటైన ‘ఐహార్ట్’ రేడియోలో ఈ షో ప్రసారం కానుంది. తన షోను ఆషామాషీగా తీసుకోవడం లేదు చంద్రిక. షో సక్సెస్ కోసం డిజైన్, ్ర΄÷డక్షన్, ప్రమోషన్లకు సంబంధించి బాగా కష్టపడింది.యూఎస్లో రేడియో షోను హోస్ట్ చేస్తున్న మొదటి భారతీయ నటిగా ప్రత్యేకత సాధించిన చంద్రిక.. ‘నన్ను నేను వ్యక్తీకరించుకోవడానికి, ప్రపంచంతో నా వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడానికి ఈ షో నాకు వరం లాంటిది’ అంటుంది."ఒత్తిడితో కూడుకున్నదైనప్పటికీ ఇదొక గొప్ప అనుభవం. నటిగా మాత్రమే పరిచయం అయిన నా గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ రేడియో షో ఉపయోగపడుతుంది". – చంద్రికా రవి -
మా చేతిలో ఉన్న పనికి.. సాంకేతిక పరిజ్ఞానం తోడైంది..!
‘‘ఇంట్లో మగ్గం ఉంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. నా గ్రామం నుంచి విదేశాలతో అనుసంధానం కావడానికి ఇవి చాలు. నేను నేసిన చీరను ఈ కామర్స్ వేదికల ద్వారా నేనే మార్కెట్ చేసుకోగలుగుతున్నాను. నా చేతుల్లో తయారైన చీరను ధరించే వారి చేతికి చేర్చే సాంకేతిక మార్గాలను నేర్చుకున్నాను. వందల మంది మహిళలం సంఘటితమయ్యాం. మాలోని నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాం. మేము గౌరవప్రదమైన ఉపాధిని పొందుతున్నాం’’ అంటోంది తమిళనాడుకు చెందిన ముత్తులక్ష్మి. ఆమె మాటలు అక్షరసత్యాలు.వైవిధ్యతే ఉపాధి..భాషలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లలో మాత్రమే కాదు మనదేశంలో ఉన్న వైవిధ్యత... కళలు, కళాత్మకతల్లోనూ ఉంది. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఆ కళాత్మకత ఉంటుంది. స్థానికంగా లభించే వస్తువులతో మహిళల చేతిలో రూపుదిద్దుకునే అనేక వస్తువులు ఇప్పుడు వారికి ఉపాధిమార్గాలవుతున్నాయి. దేశంలో దాదాపుగా ఏడు కోట్ల మంది చేతిలో కళ ఉంది. ఆ చేతుల్లో అందమైన హస్తకళాకృతులు తయారవుతున్నాయి. అందులో సగానికి పైగా మహిళలే.ఒకప్పుడు ఆ పని తమకు ఉపాధినిస్తుందని, గుర్తింపును తెస్తుందని తెలియదు వాళ్లకు. తెలిసినా సరే, మధ్య దళారుల దోపిడీకి గురవుతూ అరకొరగా లభించే రుసుముతోనే సంతృప్తి చెందేవాళ్లు. ఇప్పుడు మహిళలు చురుగ్గా ఉన్నారు. తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశ పెట్టే మాధ్యమాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. హస్తకళాకృతులు తయారు చేసే కుటుంబాల్లోని మగవారు మెరుగైన ఉపాధి కోసం ఆ వృత్తులను వదిలేస్తున్న తరుణంలో ఆ ఇళ్లలోని మహిళలు తమ వారసత్వ కళను కొనసాగిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని, అదే స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.ముత్తులక్ష్మి ఇంట్లో పవర్లూమ్ ఉంది. ఆ మరమగ్గం మీద ఆమె నెలకు పది చీరలను నేయగలుగుతోంది. తమిళనాడులోని అరుపోకోటాయ్ బ్లాక్ చేనేత చీరలకు ప్రసిద్ధి. అక్కడ నేసే చీరలను కూడా అదే పేరుతో అరుప్పుకోటాయ్ చీరలుగానే పిలుస్తారు. ఆమె నేసిన చీరలను ఫొటో తీసి తానే స్వsయంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తుంది. ఉత్పత్తిదారులకు– వినియోగదారులకు మధ్య మరో వ్యక్తి అవసరం లేదని, సాంకేతికతను ఒంటపట్టించుకోవడానికి పెద్ద చదువులు అక్కరలేదని నిరూపిస్తోంది. సాధికారత సాధించాం!‘‘ఒక్కో ప్రాంతంలోని మహిళల్లో ఒక్కో కళ ఉంటుంది. మా దగ్గర మహిళలు చేనేతతోపాటు తాటి, కొబ్బరి ఆకులతో బుట్టలు అల్లుతారు. కర్ణాటక, రాయచూర్ వాళ్లు అందమైన దండలు, ఊలు, క్రోషియో వైర్తో ఇంటి అలంకరణ వస్తువులు అల్లుతారు. గుజరాత్, దహోద్ వాళ్లు ముత్యాల ఆభరణాలతోపాటు వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేయడంలో నిష్ణాతులు.వాళ్లందరికీ డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్తోపాటు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తే అద్భుతాలు చేయగలరని నమ్మాను. అది నిజమైంది కూడా. ఇప్పుడు మొత్తం తొమ్మిది వందల మందిమి నాస్కామ్ నిర్వహించిన పదిరోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సొంతంగా అన్ని పనులూ చక్కబెట్టుకోగలుగుతున్నాం. మహిళా సాధికారత సాధనకు మా చేతిలో ఉన్న పని, సాంకేతిక పరిజ్ఞానం తోడైంది’’ అన్నది ముత్తులక్ష్మి. -
లోక్సభ ఎన్నికలు 2024 : విమెన్ పవర్ ట్రెండ్
2024 సార్వత్రిక ఎన్నికల పోరులో దేశవ్యాప్తంగా తాజా ట్రెండ్ ప్రకారం 543 లోక్సభ నియోజకవర్గాల్లో 74 మంది మహిళా అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఏడాది ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు.భారత లోక్సభ ఎన్నికలలో మహిళా ఓటర్లు, పాత్ర గణనీయంగా పెరిగినప్పటికీ ఈస్థాయిలో వారికి ప్రాతినిధ్య మాత్రం పెరగడం లేదు. ఈ ఏడాది ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. 2019 ఎన్నికలలో 726 మంది మహిళలు పోటీ చేశారు. వీరిలో 78 మంది మాత్రమే పార్లమెంటు సభ్యులు (ఎంపీ) గా ఎన్నికయ్యారు.లోక్సభ , రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని లక్ష్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాత ఆమోదించుకున్నప్పటికీ ఇది అమలుకు నోచుకోలేదు అనడానికి ఈ ఏడాది ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యమే పెద్ద ఉదాహరణ. 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళల కేటాయింపు స్వల్పంగా మాత్రమే పెరిగింది. మొత్తం 8,337 మంది అభ్యర్థుల్లో కేవలం 797 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్య 1957లో 3 శాతం ఉండగా, 2024 నాటికి దాదాపు 10 శాతానికి పెరిగింది. కానీ విజేతల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది.థింక్ ట్యాంక్ PRS విశ్లేషణ ప్రకారం గత 15 ఏళ్లలో ఈ ట్రెండ్లో పెరుగుదల చాలా స్వల్పం. 2009లో మొత్తం అభ్యర్థులల 7 శాతం మహిళలు ఉండగా, 2024లో 9.6 శాతానికి పెరిగింది. 2014లో 8 శాతంగా ఉన్న మహిళా ప్రాతినిధ్యం 2019లో 9 శాతానికి చేరింది. 1962లో, 74 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 36 మంది విజయం సాధించారు. అత్యధిక స్ట్రైక్ రేట్ 48.6శాతంగా ఉండటం గమనార్హం. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇపుడు 2024లో పొలిటిక్ క్వీన్గా అవతరించింది. బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్సభ స్థానం విజయం సాధించారు.పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ, జాదవ్పూర్ , మేదినిపూర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో తృణమూల్ కాంగ్రెస్కు ముగ్గరు యాక్టర్ కం పొలిటీషియన్స్ రచనా బెనర్జీ, సయానీ ఘోష్ , జూన్ మలియా గెలుపు దిశగా ఉన్నారు.బాన్సూరి స్వరాజ్: దివంగత బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 23000 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి వెనుకంజలో ఉన్నారు.సుప్రియా సూలే: బారామతి లోక్సభ స్థానం నుంచి ఎన్సీపీ నేత సుప్రియా సూలే 20 వేల ఆధిక్యంతో గెలుపు.హేమమాలిని: మధుర లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ హేమమాలిని 1,70,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్గర్ వెనుకంజలో ఉన్నారు.మహువా మొయిత్రా: కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి టీఎంసీకి చెందిన మహువా మొయిత్రా 50,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి అమృతా రాయ్ వెనుకంజలో ఉన్నారు. హర్యాలోని సిరీ ఎంపీ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణాలోని మహబూబ్నగర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ 4500ఓట్ల మెజార్టీతో గెలుపు -
Snehil Dixit Mehra: ఇంజినీర్ టు క్రియేటివ్ డైరెక్టర్..
నేర్చుకోవాలనే తపన ఉంటే... అదే తపస్సు. ఆ తపస్సు ఫలితాలు ఊరకే పోవు. విజయాలకు బలాన్ని ఇస్తాయి. ఎలాంటి డిగ్రీలు, అనుభవం లేకుండానే ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది స్నేహిల్ దీక్షిత్ మెహ్రా. వేగంగా నేర్చుకోవాలనే తపన ఆమె బలం. సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైటర్, కంటెంట్ క్రియేటర్, యాక్టర్, క్రియేటివ్ డైరెక్టర్గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది.జర్నలిస్ట్ కావాలనుకుంది స్నేహిల్. ‘అదేం కుదరదు. ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాల్సిందే’ అన్నారు తల్లిదండ్రులు. దీంతో భో΄ాల్లో ఇంజినీరింగ్ చేసింది. చదువు పూర్తయిన తరువాత ముంబైలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసింది. ఉద్యోగం చేస్తున్న మాటేగానీ తన మనసంతా టీవీ రంగంపైనే ఉండేది. ఒక ఫైన్ మార్నింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక చానల్లో ట్రైనీగా చేరింది. తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు.‘జర్నలిజంలో ఎలాంటి డిగ్రీ లేకుండా నెగ్గుకు రావడం కష్టం’ అన్నారు.ఆ తరువాత తల్లి మాత్రం ‘ఫరవాలేదు’ అన్నట్లుగా మాట్లాడింది. అండగా నిలబడింది. ముంబైలో ఉండే సోదరుడుప్రోత్సహించాడు.కొత్త ప్రయాణంలో స్నేహిల్కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ‘ఓటమిని దరి చేరనివ్వవద్దు’ అని బలంగా అనుకునే స్నేహిల్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ వెళ్లింది. సవాళ్లను అధిగమించే శక్తి తనకు త్వరగా నేర్చుకునే నైపుణ్యం నుంచి వచ్చింది.స్టోరీ టెల్లింగ్పై ఉన్న ΄ాషన్తో టెలివిజన్ నుంచి ఓటీటీకి అక్కడి నుంచి సోషల్ మీడియాకు వచ్చిన స్నేహిల్ ప్రతిచోటా తనను తాను నిరూపించుకుంది. ఎన్నో షోలు చేసి రైటర్గా, క్రియేటివ్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకుంది. ‘అప్హరణ్’ వెబ్ సిరీస్లో నటించడం ద్వారా నటిగా కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇదంతా ఒక్క ఎత్తయితే ‘హీరామండీ’ కోసం డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ టీమ్లో చేరడం మరో ఎత్తు.రైటింగ్ విభాగంలో పనిచేసిన స్నేహిల్కు సంజయ్ లీలా భన్సాలీ కొన్ని సీన్లను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సీన్లు బాగా చేయడంతో ‘హీరామండీ’ సిరీస్కు అడిషనల్ డైరెక్టర్గా ప్రమోట్ అయింది.‘ఇది పదిహేడు సంవత్సరాల కష్టఫలితం. భన్సాలీతో పని చేయడం వరంలాంటిది. ఫిల్మ్మేకర్,ప్రొడ్యూసర్గా ఆయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయనతో పనిచేయడం అంటే ఫిల్మ్ స్కూల్లో చేరి ఎన్నో విషయాలు నేర్చుకోవడంలాంటిది’ అంటుంది స్నేహిల్.ఇక ఇన్ఫ్లూయెన్సర్గా తన అనుభవాన్ని గురించి చెబుతూ... ‘కామెడీ అనేది రిస్క్. కొన్నిసార్లు ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో ఊహించలేము. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా నా వీడియోల నుంచి ఇన్స్టంట్ ఫీడ్బ్యాక్ తెలుసుకునేదాన్ని. ఫలానా వీడియో అభ్యంతరకరంగా, నొప్పించేలా ఉంది అనే కామెంట్స్ కనిపిస్తే వెంటనే ఆ వీడియోను తొలిగించేదాన్ని. ఎవరినీ నొప్పించకుండా అందరూ హాయిగా నవ్వుకునేలా కంటెంట్ను రూ΄÷ందించడం అనేది నిజంగా సవాలే’ అంటుంది బహుముఖ ప్రజ్ఞాశాలి స్నేహిల్ దీక్షిత్ మెహ్ర. కలల దారిలో...కలలు కనడం అనేది నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. కల కనడం గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఉత్సాహం దగ్గర మాత్రమే ఆగిపోకుండా నా కలను సాకారం చేసుకోవడానికి కష్టపడ్డాను. నేర్చుకోవాలనే ఉత్సాహం, నిరంతర కష్టం మనకు విజయాన్ని చేకూరుస్తాయి. – స్నేహిల్ దీక్షిత్ మెహ్ర -
మిస్ కేరళ ఫిజిక్గా టైటిల్ తనకు సొంతం!
‘కొన్నిసార్లు మీరు భయపడకుండా వేసే ఒక్క అడుగు జీవన గమనాన్ని మెరుగ్గా మార్చేస్తుంది’ అంటుంది 24 ఏళ్ల అశ్వతి ప్రహ్లాదన్. బాడీ షేమింగ్ను ఎదుర్కొన్న అశ్వతి ఇప్పుడు మిస్ కేరళ ఫిజిక్గా టైటిల్ గెలుచుకుంది.. సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి ఫిట్నెస్ కోచ్గా మారింది. సోషల్ మీడియాలో లక్షమంది ఫాలోవర్లతో బిజీగా ఉంది. ఎగతాళి మాటల నుంచి పట్టిన పట్టుదల ఎందరిలోనో స్ఫూర్తిని కలిగిస్తుంది.‘‘ఒక దశలో నేను బాగా బరువు తగ్గిపోయాను. కారణం కొన్నిరోజులపాటు వేధించిన జ్వరం. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది. సరైన ఆహారం తీసుకోలేక బాగా సన్నబడిపోయాను. కొన్నాళ్లపాటు ఆ సమస్యను జనాల నుంచి సూటిపోటి మాటల ద్వారా ఎదుర్కొన్నాను. ‘ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు? ఇంట్లో వాళ్లు ఫుడ్ పెట్టడం లేదా? గాలికి ఎగిరిపోయేలా ఉన్నావ్?.. లాంటి మాటలను ఎదురుగానే అనేవాళ్లు. చుట్టుపక్కల, బంధువులు రకరకాల సలహాలు ఇచ్చేవారు. దాంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయినా ఉద్యోగానికి వెళ్లాలంటే భయంగా ఉండేది. అమ్మాయిలు లావుగా ఉన్నా, మరీ సన్నగా ఉన్నా ఈ సమాజంలో జనం ఏదో ఒకటి అంటూ బాధించాలనే చూస్తారు. ఇదో పెద్ద మానసిక ఒత్తిడిగా అనిపించేది. ఈ ట్రామా నుంచి ఎలాగైనా బయట పడాలనుకున్నాను. అప్పుడే ఫిట్నెస్లోకి రావాలనుకున్నాను.నన్ను నేను ప్రేమించుకుంటూ..జనాలు ఎగతాళిగా అనే బాడీ షేమింగ్ వ్యాఖ్యలను అసలు పట్టించుకోవడం మానేశాను. నన్ను నేను ప్రేమించుకోవడం ప్రారంభించాను. నాలా బాధపడేవారికి ఓ రోల్మోడల్గా ఉండాలని జిమ్లో చేరాను. నా జీవనశైలిలో మార్పులు చేసుకున్నాను. సమతుల ఆహారంపై అవగాహన పెంచుకుని, దానిని తీసుకోవడంపై శ్రద్ధ పెట్టాను. ఫలితంగా ఆరోగ్యంలో మార్పు వచ్చింది. మానసిక ఆరోగ్యమూ మెరుగుపడింది. దీంతో ఫిట్నెస్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. ఎంతగా సాధన చేస్తూ వచ్చానంటే బాడీ షేమింగ్ బాధితులకు కేరళ ఫిజిక్ టైటిల్ను అంకితం చేసేవరకు నన్ను నేను మలుచుకోవడంలో ఒక తపస్సే చేశాను.అశ్వతి ప్రహ్లాదన్విమర్శలను పట్టించుకోను..‘ఏమీ చేయని వ్యక్తులే జీవితంలో ఏదైనా సాధించాలని ప్రయత్నించేవారిని నిందిస్తుంటారు. మొదట్లో వారి మాటలకు నేను కూడా ఎదురు సమాధానం చెప్పేదాన్ని. ఇప్పటికి కూడా సోషల్మీడియాలో ఫేక్ అకౌంట్లతో నన్ను నిందించే ప్రయత్నం చేసేవాళ్లున్నారు. టైటిల్ సాధనతో ఇప్పుడు చెడు వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య తగ్గి,పాజిటివ్ కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి.అపోహలు వద్దు..మగవారిలాగా తమ శరీరం కూడా కండలు తిరిగిపోతుందేమోనన్న భయంతో వర్కవుట్ చేయని మహిళలు ఉన్నారు. మరోవైపు వర్కవుట్ చేస్తూ బరువు తగ్గుతూ ఉంటే, ఏదైనా కారణాలతో మధ్యలో జిమ్ ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతామేమోనని అంటూ ఆందోళనపడేవారూ ఉన్నారు. ఇలాంటి అపోహలు మన సమాజంలో చాలా ఉన్నాయి. అలాంటి వారికి చెప్పేది ఏమిటంటే ‘జిమ్లోనూ, ఇంట్లోనూ మంచి జీవనశైలినిపాటించకుండా ఈ దురభి్రపాయాలకు రావద్దు. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గి, కండరాలు ద్రవ్యరాశిని కోల్పోయే అవకాశం ఉంది.కండర నిర్మాణానికి వ్యాయామం ఆరోగ్యకరం. కండరాలను నిర్మించడం అంటే శరీరం అంతా కండరాలుగా మారడం కాదు. ఫిట్నెస్నుప్రాక్టీస్ చేస్తే మానసిక, శారీరిక ఆరోగ్యంతో సహా అన్ని విషయాలు మెరుగుపడతాయి. అందుకని, అపోహలతో ఫిట్నెస్లోకి రావద్దు. మన వెనక జనాలు ఏదో మాట్లాడుతున్నారని వెనకడుగు వేయద్దు. నా విషయంలో అయితే ఈ రంగంలోకి రావడమే మంచి నిర్ణయం అయింది. అందరూ ఈ విషయాన్ని అంగీకరించారు కూడా. మన శరీరానికి సరైన రీతిలో శిక్షణ ఇస్తే మరిన్ని అద్భుతాలను మనమే చేయచ్చు.నా జీతం మొత్తం..ఏడాదిన్నర క్రితం ఇన్ఫోపార్క్లో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఫిట్నెస్ను కూడా నా జీవితంలో భాగం చేసుకున్నాను. కానీ, పనిలో చాలా ఒత్తిడి ఉండేది. ఒక్కోసారి తొమ్మిది నుంచి పదకొండు గంటలు పనిచేయాల్సి వచ్చేది. ఆ పనుల మధ్య జిమ్కి వెళ్లేందుకు సమయం దొరకడం కష్టమైంది. కుటుంబం నుంచి మద్దతు లభించింది. నా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంది మా అమ్మ.కానీ... వృత్తిని, అభిరుచిని కలపడం చాలా కష్టం అని గ్రహించాను. ఫిట్నెస్లో పోషకాహారం ఖరీదైనది. నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నా అభిరుచిని కొనసాగించగలిగాను. జీతం నా పోషణకు సరిపోయేది. కొన్ని సంప్లిమెంట్ల కోసం స్పాన్సర్లను వెతికాను. కానీ, లభించలేదు. దీంతో నా జీతం మొత్తం నా పౌష్టికాహారం కోసమే కేటాయించే దాన్ని. మరి ప్రయోజనాలు ఏంటి అని ఎవరైనా అడగచ్చు.ఈ రంగంలోకి వచ్చినతర్వాత నేనెవరో నాకు అర్ధమైంది.పాటలుపాడతాను, డ్యాన్స్ చేస్తాను. ఫిట్నెస్ నన్ను ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుతుంది. ఇది విజయంగా భావిస్తున్నాను. అంతేకాదు, నా ఫిట్నెస్ ఇప్పుడు నా ఆదాయ వనరు కూడా. అందుకే, ఉద్యోగాన్ని మానేసి బిజీ ట్రైనర్గా మారిపోయాను’ అంటూ తన ఫిట్నెస్ రహస్యాలను చెబుతుంది అశ్వతి.ఇవి చదవండి: Health: కడుపులోని బిడ్డ జాగ్రత్త! -
Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
‘రెస్టారెంట్ మేనేజ్మెంట్’ అంటే రెస్టారెంట్కు వెళ్లి ఇష్టమైన ఫుడ్ తిన్నంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు వేడి వేడిగా ఎదురవుతుంటాయి. చల్లని ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమిస్తేనే విజయం చేతికి అందుతుంది. ‘యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూర్’గా తనను తాను పరిచయం చేసుకునే అదితి దుగర్కు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా రెస్టారెంట్ బిజినెస్లోకి వచ్చింది. అయితే ఆమె ‘జీరో’ దగ్గరే ఉండిపోలేదు. కాలంతోపాటు ఎన్నోపాఠాలు నేర్చుకొని ఎంటర్ప్రెన్యూర్గా విజయ ఢంకా మోగించింది. ముంబైలో అదితి నిర్వహిస్తున్న ‘మాస్క్’ వరల్డ్స్ 50 బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సాధించింది. మనదేశంలో నంబర్వన్ రెస్టారెంట్గా గుర్తింపు పొందింది.కొన్ని సంవత్సరాల క్రితం...ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ‘మాస్క్’ పేరుతో అదితి దుగర్ ఫైన్–డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించింది. అయితే ఈ రెస్టారెంట్ వ్యవహారం ఆమె మామగారికి బొత్తిగా నచ్చలేదు. సంప్రదాయ నిబద్ధుడైన ఆయన రెస్టారెంట్లోకి అడుగు కూడా పెట్టలేదు. అలాంటి మామగారు కాస్తా ‘మాస్క్’ రెస్టారెంట్ తక్కువ సమయంలోనే బాగాపాపులర్ కావడం గురించి విని సంతోషించడమే కాదు రెస్టారెంట్కి వచ్చి భోజనం చేశాడు. తన స్నేహితులను కూడా రెస్టారెంట్కు తీసుకు వస్తుంటాడు.తన కోడలు గురించి ఆయన ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలను పరిచయం చేయడంతో ‘మాస్క్’ దూసుకుపోయింది. మోస్ట్ ఫార్వర్డ్ – థింకింగ్ ఫైన్–డైనింగ్ రెస్టారెంట్గా పేరు తెచ్చుకుంది. ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన అదితి ఎన్నో వంటకాల రుచుల గురించి పెద్దల మాటట్లో విన్నది. అలా వంటలపై తనకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. ఇద్దరు పిల్లల తల్లిగా నాలుగు సంవత్సరాలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత కేటరింగ్పై దృష్టి పెట్టింది.ఇంటి నుంచే మొదలుపెట్టిన కేటరింగ్ వెంచర్తో ఎంటర్ప్రెన్యూర్గా తొలి అడుగు వేసింది అదితి. ఆహా ఏమి రుచి అనిపించేలా వంటకాల్లో దిట్ట అయిన తల్లి ఎన్నో సలహాలు ఇచ్చేది. ఒకవైపు తల్లి నుంచి సలహాలు తీసుకుంటూనే మరోవైపు ΄్యాకేజింగ్ నుంచి మార్కెటింగ్ వరకు ఎన్నో విషయాల్లో తీరిక లేకుండా గడిపేది అదితి.క్యాటరింగ్ అసైన్మెంట్స్లో భాగంగా అదితి ఒక బ్రిటిష్ హోం చెఫ్తో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇది తన తల్లిదండ్రులు, అత్తమామలకు ఎంతమాత్రం నచ్చలేదు. దీనికి కారణం అతడు నాన్–వెజ్ చెఫ్ కావడమే. అయితే ఆ సమయంలో భర్త ఆదిత్య అదితికి అండగా నిలబడ్డాడు. అత్తమామలు, తల్లిదండ్రులకు నచ్చచెప్పాడు. ఒకవేళ అదిత్య కూడా అసంతృప్తి బృందంలో ఉండి ఉంటే అదితి ప్రయాణం ముందుకు వెళ్లేది కాదు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘ఆ సమయంలో ఆదిత్య నాకు అండగా నిలబడకుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు’ అంటుంది అదితి.‘అదితి విషయంలో నేను ఎప్పుడూ నో చెప్పలేదు. ఎందుకంటే ఆమె తప్పు చేయదు అనే బలమైన నమ్మకం ఉంది. ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తుంది. ఆమె ఆలోచనల్లో పరిణతి ఉంది’ అంటాడు మెచ్చుకోలుగా ఆదిత్య. ‘కొత్తగా ఆలోచించేవాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి అడిగినవి సమకూర్చితే అద్భుతమైన ఫలితాలు చూపించగలరు’ అనే ఆదిత్య మాటను అక్షరాలా నిజం చేసింది అదితి. ఫ్యామిలీ హాలిడే ట్రిప్లో స్పెయిన్లో ఉన్న అదితికి ‘మాస్క్’ ఐడియా తట్టింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత తన కలకు శ్రీకారం చుట్టింది. ‘ఫలానా దేశంలో ఫలానా వంటకం అద్భుతంగా ఉంటుంది. ఆ వంటకం మీ రెస్టారెంట్లో అందుబాటులో ఉండే బాగుంటుంది’... ఇలాంటి సలహాలు ఎన్నో కేటరింగ్ క్లయింట్స్ నుంచి వచ్చేవి.ఎంతోమంది సలహాలు, సూచనలతో ‘మాస్క్’ మొదలై విజయం సాధించింది. అయితే ‘మాస్క్’ వేగానికి కోవిడ్ సంక్షోభం అడ్డుపడింది.‘కోవిడ్ సంక్షోభం వల్ల ఆర్థికంగా నష్టం వచ్చినప్పటికీ విలువైనపాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కోవిడ్ అనేది మా వ్యాపారానికి సంబంధించి స్పష్టతను ఇచ్చింది’ అంటుంది అదితి.ఒక్కసారి వెనక్కి వెళితే...‘మాస్క్ పేరుతో డబ్బులు వృథా చేసుకోకండి. మీకు రెస్టారెంట్ బిజినెస్లో జీరో అనుభవం ఉంది. వ్యాపారంలో మీకు నష్టం తప్ప ఏమీ మిగలదు’ అన్నారు చాలామంది. ‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. అదితి దుగర్ విజయం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. – అదితి దుగర్ -
బోర్డర్లు చెరిపేసిన బామ్మ: క్రికెట్ అరంగేట్రంలోనే రికార్డు
గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పసిపిల్లల నుంచి పండుముసలాళ్ల దాకా క్రికెట్ ఆటకున్న క్రేజే వేరు. గత కొన్ని రోజులుగా సందడి ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. ఫైనల్పోరు కోలకత్తా నైట్ రైడర్స్ సునాయాసంగా సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది టైటిట్ను కైవసం చేసుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే లండన్కు చెందిన 66 ఏండ్ల సల్లీ బార్టన్(Sally Barton) విశేషంగా నిలుస్తోంది. ఈ కథా కమామిష్షు ఏంటో చూద్దాం రండి! ముగ్గురు మనువరాళ్లున్న ఈ అమ్మమ్మ క్రికెట్ అరంగేట్రం చేసిన రికార్డులు బద్దలు కొట్టింది గత నెలలో యూరోపా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఎస్టోనియాతో జరిగిన 3-మ్యాచ్ల మహిళల T20 సిరీస్లో గిబ్రాల్టర్ తరపున అరంగేట్రం చేసింది సాలీ బార్టన్. తద్వారా 66 ఏళ్ల 334 రోజుల వయసులో అత్యంత వృద్ధ అంతర్జాతీయ క్రికెటర్గా కూడా అవతరించింది. ఆ మాటలు విన్నవాళ్లంతా ‘బామ్మ నీ సంకల్పానికి జోహార్’. ‘నువ్వు నిజంగా సూపర్’ అంటూ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఏజ్ అనేది ఒక నంబరు మాత్రమేబీబీసీ స్పోర్ట్ కథనం ప్రకారం ‘‘అరవైల్లోకి వచ్చాక నేను క్రికెట్ ఆడుతానని అస్సలే ఉహించలేదు ‘నా డిక్షనరీలో ‘అతి పెద్ద వయస్కురాలు’ అనే పదమే లేదు. అందుకే 66 ఏళ్ల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేశాను’’ అని బార్టన్ తెలిపింది. 2012లో పోర్చుగల్కు చెందిన అక్బర్ సయ్యద్ (Akbar Saiyed) పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టింది. అక్బర్ 66 ఏండ్ల 12 రోజుల వయసులో క్రికెట్లో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించాడు.అయితే ఈ సిరీస్లో వికెట్ కీపర్ అయిన బార్టన్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అంతేకాదు ఏ ఒక్కరిని ఔట్ చేయలేకపోయింది. కానీ ఈ మ్యాచ్లో గిబ్రాల్టర్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. బార్టన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో గణితంలో లెక్చరర్గా రిటైర్ అయ్యారు సాలీ. అనంతరం క్రికెట్ బ్యాట్ పట్టి సరికొత్త రికార్డును సృష్టించడం విశేషం. -
సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆమె ఒక సూపర్ స్టార్ కూతురు. దేశంలోనే అతిపెద్ద యాక్షన్ స్టార్కు తోడబుట్టింది. స్టార్ హోదా ఉన్నప్పటికీ చాలామంది బాలీవుడ్ స్టార్ కిడ్స్లాగా సినిమాలను కరిర్గా ఎంచుకోలేదు. కానీ స్టార్ హోదాలో కోట్లు సంపాదిస్తోంది. ఇంతకీ ఎవరీ స్టార్ కిడ్? ఆమె ఎంచుకున్న వృత్తి ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం రండి! సాధారణంగా మూవీ స్టార్ల పిల్లలు తమ తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగంలోనే కెరీర్ను ఎంచుకుంటారు. కానీ ఆమె భిన్నంగా ఆలోచించింది. తన అభిరుచులుగా అనుగుణంగా నిర్ణయం తీసుకొని తనదైన శైలిలో రాణిస్తోంది.ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతుల కుమార్తె కృష్ణ ష్రాఫ్. ఆమె సోదరుడు, టైగర్ ష్రాఫ్ అనేకమంది సూపర్స్టార్లతో కలిసి నటించి, విజయవంతంగా కరీర్ను కొన సాగిస్తున్నాడు. 1993లో జన్మించిన కృష్ణ ష్రాఫ్ అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి, దుబాయ్లోని SAE యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించింది. చిన్నతనంలోనే క్రీడల పట్ల ఆసక్తితో పాఠశాలలో ఒక స్టార్ క్రీడాకారిణిగా నిలిచింది. అనేక అవార్డులను కూడా గెల్చుకుంది. సోదరుడు టైగర్ ష్రాఫ్తో పాటు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందింది కృష్ణ ష్రాఫ్ .సినిమా కుటుంబానికి చెందినప్పటికీ, కృష్ణ ష్రాఫ్ ఎప్పుడూ బాలీవుడ్పై ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా వ్యాపార నైపుణ్యాలకు పదును పెట్టింది. అంతేకాదు ఫిటెనెస్ అంటే ప్రాణం పెడుతుంది. ఈ నేపథ్యంలోనే 2018లో సోదరుడు టైగర్ ష్రాఫ్తో కలిసి MMA మ్యాట్రిక్స్ అనే కాంబేట్- ట్రైనింగ్ కేంద్రాన్ని స్థాపించింది.. ఆ తర్వాత మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) పేరుతో భారతీయ ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ కంపెనీని ప్రారంభించారు. ఈ రెండు కంపెనీలు ముంబైలో ఉన్నాయి. నేను (సినిమా) కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నేను తప్పనిసరిగా మూవీలు చేయాలని కాదు. దానికి మించిన ప్రపంచం ఉంది.నా కోరికలు , కలల్ని సాకారం చేసుకోవాలని భావిస్తున్నాను.’’ అయితే తనకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పింది. చాలా సినిమా ఆఫర్లను తిరస్కరించినట్లు గతంలో వెల్లడించింద కృష్ణ ష్రాఫ్. అయితే 2021లో కిన్ని కిన్ని వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఫిట్నెస్ పట్ల తనకున్న అభిరుచికి అనుగుణంగా ఈ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తోంది. కృష్ణ ష్రాఫ్ నికర విలువ 41 కోట్ల రూపాయలు. కాగా రోహిత్శెట్టి హోస్ట్ చేస్తున్న స్టంట్ ఆధారిత రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ద్వారా బుల్లితెర తెరంగేట్రానికి కృష్ణ ష్రాఫ్ సిద్ధమవుతోంది. -
ఈ పేదింటి బంగారం.. ఓ అద్భుతం!
అరవై దేశాల విద్యార్థులుపాల్గొనే అంతర్జాతీయ పోటీ అది. గోవా దాటని ఉష తొలిసారిగా దుబాయ్కు వెళ్లడానికి రెడీ అవుతోంది. వెళ్లడానికి ముందు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రకరకాల అడ్డంకులు ఎదురయ్యాయి. ‘సాధించాలని బలంగా అనుకుంటే కచ్చితంగా సాధిస్తాం’ అనే మాటను తారకమంత్రంలా జపించిన పదిహేను సంవత్సరాల ఉష దుబాయ్లో జరిగిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’లో కప్పు గెలుచుకుంది.కొన్ని రోజుల క్రితం..పనాజీ(గోవా)లోని ప్రోగ్రెస్ హైస్కూల్లో రోబో సందడి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్కూలు పిల్లలు తమ ప్రపంచం వదిలి రోబో ప్రపంచంలోకి వెళ్లారు. రోబోటిక్స్ పోటీ అయిన ‘కోడేవర్ 5.వో ఏఐ రోబో సిటీ చాలెంజ్’ తాలూకు సందడి అది. ఆ స్కూల్ స్టూడెంట్ ఉషను ఇంటర్నేషనల్ రౌండ్కు చేర్చడానికి టీచర్ మాయా కామత్ బాగా శ్రమించింది.దుబాయ్లో జరగబోయే అంతర్జాతీయ పోటీని సవాలుగా తీసుకుంది మాయా కామత్. ‘ఎన్నో దేశాలుపాల్గొనే ఈ పోటీలో మనం ఎక్కడ! అక్కడి దాకా వెళితే అదే పదివేలు’ ఇలాంటి మాటలను ఆమె పట్టించుకోలేదు. ఎలాగైనా బంగారు కప్పు గెలుచుకోవాలనే పట్టుదలతో పనిచేసింది.గోవాలో జరిగిన రీజనల్ రౌండ్ కోసం ముగ్గురు స్టూడెంట్స్ను ఎంపిక చేసింది మాయ. అందులో ఉషతోపాటు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే మొదట్లో కనిపించిన ఉత్సాహం ఉషలో ఆ తరువాత కనిపించలేదు. ఆత్మవిశ్వాసం తగ్గింది. ఇలాంటి సమయంలోనే మాయ ఉషలో ధైర్యం నింపి ముందుకు నడిపించింది. ఆ ధైర్యమంత్రం ఫలించి గురుగ్రామ్లో జరిగిన నేషనల్ రౌండ్లో ఉష అద్భుత పనితీరు ప్రదర్శించింది. రోబోను బాగా హ్యాండిల్ చేసింది. ఆ తరువాత దుబాయ్లో జరగబోయే ఇంటర్నేషనల్ రౌండ్కు ఎంపికైంది.నేషనల్ రౌండ్లో సాధించిన విజయం ఉషకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది. భయాలను ఎదుర్కొనేలా చేసింది. ఎట్టకేలకు మాయ కామత్ కలను ఉష సాకారం చేసింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ అంతర్జాతీయ పోటీలో ఉష కప్పును గెలుచుకుంది. ఉష తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. రోబో సిటీ చాలెంజ్ రూపంలో తన ప్రతిభను ప్రదర్శించే అరుదైన అవకాశం ఉషకు లభించింది. ఉష సాధించిన విజయం తల్లిదండ్రులను ఆనందంలో ముంచెత్తింది. ‘సాధించాలని గట్టిగా అనుకున్నాను. సాధించాను’ నవ్వుతూ అంటుంది ఉష.ఛాంపియన్స్ చేంజ్మేకర్..‘క్వార్కీ’ అనే రోబోట్ను స్టూడెంట్స్తో కలిసి తయారు చేసింది మాయా కామత్. నిర్ణీత సమయంలో రకరకాల పనులు చేసేలా ఈ ‘క్వార్కీ’ని రూపొందించారు. పోటీలో ‘క్వార్కీ’ అయిదు నిమిషాల్లో 11 టాస్క్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతిరోజు రెండు గంటలు ప్రాక్టిస్ చేసేది ఉష. రంగులను సరిపోల్చడం, దిశలను అంచనా వేయడం, అడ్డంకులను అధిగమించడం, వస్తువులను వేరు చేయడంలాంటి ‘క్వార్కీ’ నైపుణ్యాలను ఉష అద్భుతంగా ఆపరేట్ చేసింది.‘నేను చెప్పే సలహాలను శ్రద్ధగా విని అందుకు అనుగుణంగా ఉష ప్రాక్టిస్ చేసేది. నేర్చుకోవాలనే తపన ఆమె విజయానికి కారణం. విజయం సాధిస్తామనే గట్టి నమ్మకం ఉన్నప్పటికీ మాకు ఎదురైన అతి పెద్ద సవాలు దుబాయ్ పర్యటనకు నిధులు సమకూర్చుకోవడం. విజయం సంగతి ఎలా ఉన్నా అసలు దుబాయ్కు వెళ్లగలమా అనే సందేహాం వచ్చింది.ఈ పరిస్థితులలో ప్రోగ్రామింగ్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే సయేష్ గాంధీ అనే టీచర్ క్రౌడ్ఫండింగ్కు సంబంధించి సలహా ఇచ్చారు. ఉష కుటుంబ నేపథ్యం, రోబోటిక్స్ పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి, అంతర్జాతీయ పోటీలోపాల్గొనాలనే ఆమె కల, ఆర్థిక ఇబ్బందులు...మొదలైన వాటి గురించి వీడియో చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది’ అంటుంది మాయా కామత్. ఉష విజయం ఒక సంతోషం అయితే ఆమె గురువు మాయా కామత్ ‘చాంపియన్స్ చేంజ్మేకర్’ అవార్డ్ అందుకోవడం మరో సంతోషం.ఇవి చదవండి: పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు! -
పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన కార్టియర్ ఫెలోషిప్ను ఈ యేడాది ముగ్గురు భారతీయ మహిళలు దక్కించుకున్నారు. ఆ ముగ్గురూ ఢిల్లీ వాసి అయిన అక్షితా సచిదేవా, బెంగళూరు వాసులైన మాన్సీ జైన్, ఇరా గుహ లు. మన దేశం నుంచి వీరు మాత్రమే ఎంపిక అవడంలోని ప్రత్యేకత సామాజికంగా ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలుగా వీరికున్న గుర్తింపు.ప్రపంచంలోని అత్యంత కీలకమైన సవాళ్లను పరిష్కరిస్తున్న వేలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారిలో 33 మందిని ఎంపిక చేసిన కార్డియర్ ఉమెన్స్ ఇనిషియేటివ్ మీట్ ఇటీవల చైనాలో జరిగింది. ఇందులో ముగ్గురు యువ భారతీయ మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల ద్వారా ప్రభావ వంతమైన గుర్తింపు పొందారు.మాన్సీ జైన్..‘డిజిటల్పానీ’ అనే సాఫ్ట్వేర్ ల్యాట్ ఫారమ్ వ్యవస్థాపకురాలు మాన్సీ జైన్. ఇది మురుగునీటి శుద్ధి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా కలుషితమైన నీటిని సమర్థవంతంగా శుద్ధి చేయవచ్చు. తిరిగి ఉపయోగించుకోవచ్చు. డిజిటల్పానీ రోజుకు 90 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. భారత దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలోని దాదాపు 50 యూనిట్లలోని నీటిలో అధిక నాణ్యత, అనుకూలమైన సౌకర్యాలుగా మార్చి తన శక్తిని నిరూపించింది. అక్షితా సచిదేవా..ఏఐ ఆధారిత సాంకేతికత ‘కిబో’ను ఉపయోగించి అంధత్వం ఉన్న వ్యక్తులకు సమగ్ర విద్య, ఉపాధినిప్రోత్సహించడానికి ట్రెస్టిల్ ల్యాబ్లను స్థాపించింది బెంగళూరుకు చెందిన అక్షితా సచిదేవా. 60 భాషల్లో ప్రింట్, హ్యాండ్ రైటింగ్, డిజిటల్ కంటెంట్ను డిజిటైజ్ చేస్తుంది, అనువదిస్తుంది, ఆడియోలోకి మారుస్తుంది. జూలై 2019 నుండి కిబో 650 సంస్థలను కలుపుకొని 25 దేశాలలో 1.5 లక్షల మందికి పైగా వ్యక్తులు సాధికారత సాధించేలా చేసింది. కంటెంట్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అక్షిత చేసిన కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.ఇరాగుహ..స్త్రీల పీరియడ్ సమస్యలను పరిష్కరించడానికి, ల్యాస్టిక్ శానిటరీ ప్యాడ్ల నుండి వ్యర్థ కాలుష్యాన్ని తగ్గించడానికి మెనుస్ట్రువల్ కప్ను రూపొందించి, పేటెంట్ రైట్స్ పొందింది ఇరాగుహ. సామాజిక కార్యక్రమాల ద్వారా గ్రామీణ కుటుంబాలలోని మహిళలు మెనుస్ట్రువల్ కప్ని ఉపయోగించడం ద్వారా మిలియన్ల డాలర్లను ఆదా చేసింది. అలాగే, లక్షల టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను నివారించింది. వినూత్నమైన పీరియడ్ ట్రాకర్ యాప్ను అభివృద్ధి చేయడం ద్వారా కెనడా ప్రభుత్వం నుండి అవార్డును అందుకుంది.సామాజిక వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న ఈ ముగ్గురు యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తమ మద్దతును ప్రకటించింది కార్టియర్ ఫెలోషిప్. కోట్లాది మంది వీక్షకుల ముందు అవార్డులు అందుకున్న వారిలో ఈ ముగ్గురు ప్రత్యేకంగా నిలిచారు. తమ వ్యాపారాల ద్వారా సమాజంలో తీసుకు వస్తున్న మార్పులను పంచుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారు. -
అరుదైన ప్రతిభ.. అక్షత!
చిన్న వయసులోనే కృత్రిమ మేధా(ఏఐ) రంగంలో పెద్ద పేరు తెచ్చుకుంది అక్షతా కిశోర్ మొహరిర్. అభిరుచితో మొదలైన ప్రయాణం...అధ్యయనం, పట్టుదలతో మెషిన్ లెర్నింగ్ రంగంలో అక్షతను అగ్రగామిగా నిలిపింది.కర్నాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్శిటీ(విటీయు–బెళగావీ)లో కంప్యూటర్ సైన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్లకు సంబంధించిన ఆసక్తి మరింత పెరిగింది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ కాలేజ్పార్క్(యూఎంసీపీ)లో మెషిన్ లెర్నింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.ఇంటర్ప్రెటబుల్ అండ్ ఇంటరాక్టివ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అక్షతకు ఏడు యూఎస్ పేటెంట్లు లభించాయి. యూజర్ ఫ్రెండ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోల్యూషన్లను రూ΄÷ందించడంపై అక్షత దృష్టి పెట్టింది.ఇవి చదవండి: డెనిమ్ న్యూ లుక్ డిజైన్..! -
సక్సెస్ ఊరికే రాదు : వేలకోట్లతో నెక్ట్స్ లెవల్ అంతే! ఎవరీ బిలియనీర్ మహిళ
విజయవంతమైన వ్యాపార కుటుంబం నుంచి వారసులు చాలామంది వస్తారు. కానీ ఆ విజయాన్ని అంది పుచ్చుకుని అసాధారణ వృద్ధితో ఎదిగిన వ్యాపార దిగ్గజాలు కొంతమందే ఉంటారు. ప్రముఖ ఫుట్వేర్ కంపెనీ 'మెట్రో బ్రాండ్స్' మేనేజింగ్ డైరెక్టర్ ఫరా మాలిక్ భాంజీ కథ అలాంటిదే. బిలియనీర్ ఫరా మాలిక్ భాంజీ గురించి ఇంట్రస్టింగ్ సంగతులు ఈ కథనంలో తెలుసుకుందాం.దేశంలోనే సంపన్న ముస్లిం మహిళగా గుర్తింపు పొందారు. కంపెనీ సీఎండీగా ఫరా మాలిక్ భాంజీ రూ. 28,773 కోట్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. మెట్రో బ్రాండ్స్ ఛైర్మన్ రఫీక్ మాలిక్ రెండో కుమార్తె. తన నలుగురు సోదరీమణుల మాదిరిగానే, లంచ్ టేబుల్ వద్ద షాప్ టాక్ వింటూ పెరిగింది. కానీ కంపెనీ పగ్గాలు చేపట్టిన తరువాత ఫరా మార్గదర్శకత్వంలో, గతంలో 'మెట్రో షూస్'గా పిలువబడే మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. డిసెంబర్ 8 నాటికి 35,117 కోట్ల చేరడం విశేషం.ముంబై కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా సేవలందిస్తోంది ఈ కంపెనీ. ఫరా తాత మాలిక్ తేజాని 1955లో తిరిగి స్థాపించారు. మోచి, మెట్రో , వాక్వే వంటి విజయవంతమైన బ్రాండ్ల రాకకు పునాది. పాదరక్షల పరిశ్రమలో 20 ఏళ్ల చరిత్రను తిరగరాసి ఆధునిక యుగంలో గేమ్ ఛేంజర్గా నిలిచింది ఫరా. ఆమె వినూత్న విధానం , ఫార్వర్డ్-థింకింగ్ స్ట్రాటజీలు కంపెనీని నెక్ట్స్ లెవల్కి చేర్చాయి. ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువు చదివి కంపెనీలో మార్కెటింగ్ రంగంలో తన వృత్తిని ప్రారంభించింది. ఇదే ఆ తర్వాత మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్ సరఫరా గొలుసును పునరుద్ధరించడానికి తోడ్పడింది.2010లో వెబ్సైట్ ఏర్పాటు చేసి, ఆన్లైన్ అమ్మకాలు ప్రారంభించారు. దేశీ సంస్థల ఉత్పత్తులను రిటైలింగ్ చేసిన మెట్రో విదేశీ పాదరక్షల జోడింపుతో ‘మెట్రో బ్రాండ్స్’గా అవతరించింది.మెట్రో బ్రాండ్స్ పాదరక్షల దిగ్గజం క్రాక్స్ ఇండియా లిమిటెడ్ (CIL)తో ఒప్పందం నిబంధనలు, మార్పులతో తన భాగస్వామ్యాన్ని కూడా విస్తరించింది. దీని ప్రకారం భారతదేశంలోని పశ్చిమ , దక్షిణ రాష్ట్రాలలో Crocs "ఫుల్ కాస్ట్ " దుకాణాలనిర్వహణకు మెట్రో బ్రాండ్లకు ప్రత్యేక హక్కులను మంజూరు చేస్తుంది. కంపెనీ భారతదేశం అంతటా 200కి పైగా ప్రత్యేకమైన క్రోక్స్ స్టోర్లను నిర్వహిస్తోంది.స్కేచర్స్, క్లార్క్స్ వంటి ఇతర గ్లోబల్ టైటాన్స్తో వ్యూహాత్మక ఒప్పందాలున్నాయి. 2021లో మెట్రోని ఐపీవోకు వచ్చింది. రూ.28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో ఫరా మాలిక్ భాంజీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతోపాటు, పరిశ్రమ దిగ్గజాలకు సైతం స్ఫూర్తిగా ఉన్నారు. -
World Turtle Day: నారి.. తాబేలు మేలు కోరి!
తాబేలు నడకల గురించి తక్కువ చేసి నవ్వుకునే కాలం కాదు ఇది. ప్రమాదం అంచున ఉన్న తాబేలు జాతి గురించి సీరియస్గా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. చెన్నైకి చెందిన సుప్రజ నుంచి లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వరకు ఎంతోమంది నారీమణులు తాబేళ్ల సంరక్షణకు విశేష కృషి చేస్తున్నారు..చుట్టుపక్కల చూడరా...ముంబైకి చెందిన మోడల్ సౌందర్య గార్గ్ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ కార్యాలయానికి సమీపంలోని చెత్తకుప్పలో ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కదలడం చూసి ఆ బ్యాగును ఓపెన్ చేసింది. అందులో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక పెద్ద తాబేలు కనిపించింది. వెంటనే ల్యాబ్ అండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ హెల్ప్ లైన్కు ఫోన్ చేసింది. అక్కడి నుంచి వచ్చిన వాలంటీర్ సూచనలతో తాబేలును ఇంటికి తీసుకెళ్లి నీటిలో పెట్టింది. ఆ తరువాత ఆ తాబేలునుపాస్–రెస్క్యూ టీమ్కు అప్పగించింది.‘నేను–నా పని అని మాత్రమే... అని కాకుండా చుట్టుపక్కల కూడా తొంగి చూడాలి. ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని ఆరోజు సౌందర్య అనుకొని ఉంటే, తాబేలే కదా వదిలేద్దాం అనే నిర్లక్ష్యంలో ఉండి ఉంటే ఒక జీవి బతికేది కాదు’ అంటుంది యానిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ నిషా సుబ్రమణ్యియన్. దిల్లీలో మార్నింగ్ వాక్కు వెళుతున్న ఒక మహిళ రోడ్డుపై తాబేలును గమనించి రక్షించింది. దీని తాలూకు వీడియో వైరల్ కావడమే కాదు నీటిలో ఉండాల్సిన తాబేళ్లు రోడ్డు మీదికి ఎందుకు వస్తున్నాయి? వాటిని రక్షించడానికి ఏంచేయాలి?’ అనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది.ఆ విషాదంలో నుంచే..కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణవేత్త డా.జేన్ గుడాల్పై వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీని చూసింది చెన్నైకి చెందిన సుప్రజ ధరణి. ‘ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది’ అనే మాట ఆమెకు బాగా నచ్చడమే కాదు ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించింది.సుప్రజఒకరోజు పెరియ నీలంకరై బీచ్లో మార్నింగ్ వాక్ చేస్తున్న సుప్రజ ఒడ్డున కనిపిస్తున్న తాబేలు దగ్గరికి వెళ్లింది. అది చని΄ోయి ఉంది. దాని శరీరంపై పదునైన తీగలతో కోతలు కోశారు. ఈ దృశ్యం తనని చాలా బాధ పెట్టింది. ఒక రకంగా చె΄్పాలంటే కొన్ని రోజుల వరకు ఆ బాధ తనని వెంటాడింది.ఈ నేపథ్యంలోనే తాబేళ్ల సంరక్షణకు నడుం బిగించింది. పుస్తకాలు చదవడం, మత్స్యకారులతో మాట్లాడం ద్వారా తాబేళ్ల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాత ట్రీ ఫౌండేషన్ (ట్రస్ట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్)కు శ్రీకారం చుట్టింది. తాబేళ్ల సంరక్షణ విషయంలో చేసిన కృషికి గుర్తింపుగా డిస్నీ వరల్డ్ వైడ్ కన్జర్వేషన్ అవార్డ్, సీ వరల్డ్లాంటి ఎన్నో అవార్డ్లు అందుకుంది సుప్రజ.విజ్జీ–ది టర్టిల్ గర్ల్..భారతదేశ మొట్టమొదటి మహిళా హెర్పెటాలజిస్ట్, టర్టిల్ ఫీల్డ్ బయోలజిస్ట్గా గుర్తింపు పొందింది జె.విజయ. చిన్న వయసులోనే చని΄ోయింది. అయితే ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం తాబేళ్ల సంరక్షణ కోసం కృషి చేసింది. మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ పక్కన ఉన్న టర్టిల్పాండ్ దగ్గర ఆమె స్మారక చిహ్నం ఉంది. మద్రాస్ స్నేక్పార్క్లోకి వాలంటీర్గా అడుగుపెట్టింది విజయ.విజయఅప్పుడు ఆమె మద్రాస్లోని ఎతిరాజ్ కాలేజీ జువాలజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. స్నేక్పార్క్లో రకరకాల తాబేళ్లను వేరు వేరు వ్యక్తులకు అప్పగించేవారు. అలా విజ్జీకి మంచినీటి తాబేళ్లను అప్పగించారు. అక్కడితో మొదలైన తాబేళ్లతో చెలిమి ఎంతో దూరం వెళ్లింది. ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్ నుంచి పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తా వరకు తాబేళ్లకు ఎదురవుతున్న ముప్పు, సంరక్షణ గురించి ఎంతో పరిశోధన చేసింది. తాను తెలుసుకున్న వాటిని అక్షరబద్ధం చేసింది.అరుణోదయం..ఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన అరుణిమ సింగ్ వేలాది తాబేళ్లను రక్షించింది. తాబేళ్ల జీవితం, వాటిప్రాధాన్యత, సంరక్షణ గురించి ఎన్నో విద్యాలయాల్లో విద్యార్థుల కోసం అవగాహన సదస్సులు నిర్వహించింది. తాబేళ్ల సంరక్షకురాలిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అరుణిమ సింగ్ తన బాటలో ఎంతోమందిని నడిపిస్తోంది.గ్రీన్ టర్టిల్స్.. మీరు పచ్చగా బతకాలిఆకుపచ్చ తాబేళ్లు (చెలోనియా మైడాస్) ప్రమాదం అంచున అంతరించి΄ోయే జాతుల జాబితాలో ఉన్నాయి. లక్షద్వీప్ దీవుల్లో ఆకుపచ్చ తాబేళ్లపై గతంలో జరిగిన పరిశోధనలను పీహెచ్డీ స్టూడెంట్ నుపుల్ కాలే మరింత ముందుకు తీసుకువెళుతోంది. సముద్రపు గడ్డి మైదానాలు తగ్గడంలాంటివి గ్రీన్ టర్టిల్స్పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనేది తన పరిశోధనలో తెలుసుకుంది.నుపుల్ కాలే‘సముద్ర తాబేళ్ల గురించి అధ్యయనం చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి’ అంటుంది కాలే. యూనివర్శిటీలో ఒకరోజు ‘గ్రీన్ టర్టిల్స్ గురించి పనిచేయడంపై ఆసక్తి ఉందా?’ అని అడిగారు లెక్చరర్. ‘ఉంది’ అని చెప్పింది. ఆ తరువాత గ్రీన్ టర్టిల్స్కు సంబంధించి శ్రీలంకలో ఫీల్డ్వర్క్ చేసింది.‘గూడు కట్టుకోవడానికి ఒక గ్రీన్ టర్టిల్ బీర్లోకి వచ్చిన దృశ్యం తొలిసారిగా చూశాను. ఆ దృశ్యం చెక్కుచెదరకుండా ఇప్పటికీ నా మదిలో నిలిచిపోయింది’ అంటుంది కాలే.ఇవి చదవండి: ఈ నడక ఎంతో ఆరోగ్యం అంటున్నారు.. నిపుణులు!