మహిళలు కన్నెర్ర చేస్తే ముష్కరులకు మూడినట్లే | Operation Sindoor has also become a symbol of India Naari Shakti | Sakshi
Sakshi News home page

మహిళలు కన్నెర్ర చేస్తే ముష్కరులకు మూడినట్లే

Jun 1 2025 5:51 AM | Updated on Jun 1 2025 11:54 AM

Operation Sindoor has also become a symbol of India Naari Shakti

నారీశక్తిని సవాలు చేసి వినాశనం కొనితెచ్చుకున్నారు  

తుపాకీ తూటాకు ఫిరంగి గుండ్లతో సమాధానమిస్తాం  

పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ హెచ్చరిక  

భోపాల్‌:  పాకిస్తాన్‌ ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న సూత్రధారులు భారత నారీశక్తిని సవాలు చేసి స్వయంగా వినాశనాన్ని కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పహల్గాం ఉగ్రవదాడిలో భార్యల కళ్లెదుటే భర్తలు చనిపోయారని అన్నారు. మన ఆడబిడ్డలు కన్నెర్ర చేస్తే ముష్కరులకు మూడినట్లేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశ చరిత్రలో ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అత్యంత విజయవంతమైన ఆపరేషన్‌ అని స్పష్టంచేశారు. పహల్గాంలో ఉగ్రవాదులు కేవలం రక్తం పారించలేదని... మన సంస్కృతిపై దాడి చేశారని, మన దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్రలు సాగించారని మండిపడ్డారు. 

రాణి అహిల్యాబాయి హోల్కర్‌ 300వ జయంతి సందర్భంగా శనివారం మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ‘మహిళా సశక్తికరణ్‌ మహా సమ్మేళన్‌’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మన సైనిక దళాలు పాకిస్తాన్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదుల అడ్డాలను నేలమట్టం చేశాయని అన్నారు. ముష్కరుల ఇళ్లలోకి చొరబడి మరీ అంతం చేయగలని నిరూపించినట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని పేర్కొన్నారు. మరోసారి భారత్‌పై దాడికి పాల్పడే సాహసం చేస్తే ఉగ్రవాదులు, వారి పోషకులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మరోసారి స్పష్టంచేశారు.  

వీరత్వానికి ప్రతీక సిందూరం  
ఉగ్రవాదులను ప్రయోగించి దొంగచాటు యుద్ధాలు చేద్దామనుకుంటే కుదరని పాకిస్తాన్‌కు తేల్చిచెప్పారు. తుపాకీ తూటాలకు ఫిరంగి గుండ్లతో బదులిస్తామని ఘాటుగా హెచ్చరించారు. మన సంప్రదాయంలో సిందూరం మహిళా శక్తికి ప్రతీక అని, రామభక్త హనుమాన్‌ సైతం సిందూరం ధరిస్తారని తెలిజేశారు. ఇప్పుడు సిందూరం వీరత్వానికి, ఉగ్రవాదంపై ప్రతిఘటనకు గుర్తుగా మారిందన్నారు. మహిళల సాధికారత కోసం నారీశక్తి వందన్‌ అధినియం బిల్లు తీసుకొచ్చామని అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో 75 మంది మహిళా ఎంపీలు ఉన్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వివరించారు.   

ఆపరేషన్‌ సిందూర్‌లో మహిళలదే కీలక పాత్ర  
అసిస్టెంట్‌ కమాండెంట్‌ నేహా భండారి నేతృత్వంలో బీఎస్‌ఎఫ్‌ మహిళా దళం ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ దళం ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్‌లో ఫార్వర్డ్‌ పోస్టులను పాకిస్తాన్‌ దాడుల నుంచి విజయవంతంగా కాపాడిందని వెల్లడించారు. రక్షణ శాఖలో 
భారతీయ మహిళల శక్తి సామర్థ్యాలు ప్రపంచం తిలకిస్తోందని అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌లో మహిళా జవాన్లు కీలక పాత్ర పోషించారని తెలిపారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ)లో 17 మంది తొలి బ్యాచ్‌ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవడం చరిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement