
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అయినవారిని పోగొట్టుకున్నవారి ఆవేదన వర్ణనాతీతం. అయితే ఈ ప్రమాదాన్ని తొలుత ఎవరు చూశారు? ఎలా స్పందించారు?.. అనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు.
108 అంబులెన్స్ డ్రైవర్ సతీందర్ సింగ్ సంధు మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్లో భోజనం చేస్తుండగా, అతనికి భారీ పేలుడు శబ్దం వినిపించింది. వెంటనే క్యాంపస్లోని హాస్టళ్లవైపు దృష్టి సారించి, హడలెత్తిపోయాడు. దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడాన్ని గమనించాడు. ఆ ప్రదేశానికి పరుగెత్తుకుంటూ వెళ్లి చూడగా, విమానం కూలిపోయి మంటల్లో దగ్ధమవడాన్ని గమనించాడు. వెంటనే అప్రమత్తమై, అంబులెన్స్ సర్వీస్ మేనేజర్ జితేంద్ర షాహికి ఫోన్ చేశాడు. ‘ఇక్కడ విమాన ప్రమాదం జరిగినట్లుంది. అగ్నిమాపక దళాన్ని వెంటనే పంపండి’ అని కోరాడు.
ప్రమాద స్థలంలో తీవ్రంగా కాలిపోయిన భద్రతా సిబ్బందిని సంధు తొలుత చూశాడు. అలాగే విమాన ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి (విశ్వాస్ కుమార్ రమేష్)ని కూడా చూశాడు.. రమేష్ అదే విమానంలో ఉన్న తన బంధువును కాపాడేందుకు ప్రయత్నించడాన్ని కూడా తాను చూశానని సంధు మీడియాకు తెలిపారు. తరువాత అతనిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.46 గంటలకు ఐదు 108 అంబులెన్స్లు సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించాయని, తొలుత తాము హాస్టల్ నుండి బయటకు వస్తున్న 20 మంది బాధితులను ఆస్పత్రులకు తరలించామని షాహి తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం.. శాటిలైట్ చిత్రాలలో..