
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో బీజేపీ నేతను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘాతుకానికి పాల్పడింది మావోయిస్టులు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జన్పడ్ పంచాయతీ సభ్యుడైన బీజేపీ నేత కట్ల తిరుపతి శుక్రవారం రాత్రి బీజాపూర్ జిల్లాలోని టోయనార్ గ్రామంలో ఓ పెళ్లికి హాజరయ్యారు.
కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి వెళుతుండగా కొందరు వ్యక్తులు పదునైన ఆయుధంతో అతడిని పొడిచి చంపారని బీజాపూర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) జితేంద్ర యాదవ్ తెలిపారు. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లినపుడు అక్కడ మృతి చెందినట్లు చెప్పారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీకి చెందిన నేత హత్యకు గురవడం గత సంవత్సర కాలంలో ఇది ఏడోసారి కావడం కలకలం రేపుతోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో నారాయణ్పూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు రతన్దూబేను మావోయిస్టులు హత్య చేశారు.
Comments
Please login to add a commentAdd a comment