మెడికల్‌ కాలేజీ మృతులెందరు? | Grieving Families Wait In Despair At BJ Medical College | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీ మృతులెందరు?

Jun 14 2025 6:31 AM | Updated on Jun 14 2025 6:31 AM

Grieving Families Wait In Despair At BJ Medical College

రోజున్నర దాటినా అస్పష్టతే

అధికారికంగా వెల్లడించని వైనం

24 మంది మరణించినట్టు ప్రాథమిక సమాచారం

అహ్మదాబాద్‌: ఎయిరిండియా విమానానికి సంభవించిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై గురువారం అర్ధరాత్రికే స్పష్టత వచ్చింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందికి గాను ఒక్కరు మినహా అందరూ దుర్మరణం పాలయ్యారు. 241 మంది మరణించినట్టు ఎయిరిండియా అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం టేకాఫైన 33 సెకన్లకే రన్‌వే సమీపంలోని బీజే మెడికల్‌ కాలేజీ మెస్, హాస్టల్‌పై పడి పేలిపోవడం తెలిసిందే. 

ఆ సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండటంతో అత్యంత భారీ పేలుడు సంభవించింది. దాంతో మెస్, హాస్టల్‌ ధ్వంసమవడమే గాక పరిసర భవనాలకూ నిప్పంటుకుని కాలిపోయాయి. కానీ అక్కడి వారిలో ఎందరు చనిపోయారన్న దానిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై గుజరాత్‌ ప్రభుత్వం గానీ, కేంద్రం గానీ అధికారికంగా స్పందించలేదు. కనీసం 24 మంది మరణించినట్టు గురువారమే వార్తలొచ్చాయి. 

గురువారం అర్ధరాత్రికే ఆస్పత్రికి 265 మృతదేహాలు వచ్చినట్టు డీఎస్పీ కనన్‌ దేశాయ్‌ చేసిన ప్రకటన వాటికి బలం చేకూర్చింది. నలుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఒక వైద్యుడు, మరో వైద్యుడి భార్య మృతిని కాలేజీ వర్గాలు గురువారం రాత్రి ధ్రువీకరించాయి. మరో 60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డట్టు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ పేర్కొంది. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయని, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని కూడా వెల్లడించింది.

 అంతేగాక ఇద్దరు ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్‌ డాక్టర్‌ మీనాక్షీ పారిఖ్‌ తెలిపారు. వీరి పరిస్థితి ఏమిటన్నది మాత్రం శుక్రవారం అర్ధరాత్రి దాకా తెలియరాలేదు. ప్రమాదస్థలి వద్ద భవనాల శిథిలాలు తదితరాలను తొలగించేందుకు ఆరు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శ్రమిస్తున్నట్టు సంస్థ డీజీ హరి ఓం గాంధీ శుక్రవారం తెలిపారు. మృతులపై మాత్రం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. 

దాంతో మొత్తం మృతుల సంఖ్యపై రకరకాల ఊహాగానాలు విన్పించాయి. శుక్రవారం మరో నలుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థుల మృతదేహాలు లభించాయని, మొత్తం మృతుల సంఖ్య 325కి చేరిందని వార్తలొచ్చాయి. గుజరాత్‌ పోలీసులు కూడా మృతుల సంఖ్య 294కు చేరినట్టు శుక్రవారం మధ్యాహ్నం చెప్పారు. కానీ, ‘240 మందికి పైగా మరణించార’ంటూ సాయంత్రానికల్లా సవరణ ప్రకటన చేశారు! మెడికల్‌ కాలేజీ మృతుల సంఖ్యను ప్రభుత్వం ఎందుకు గుట్టుగా ఉంచుతున్నదీ అంతుబట్టడంలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement