
సూరత్: వినాయక నిమజ్జనాల సందర్బంగా గుజరాత్లోని సూరత్లో అద్భుతం జరిగింది. నిమజ్జనం సమయంలో సముద్రంలోకి కొట్టుకుపోయిన టీనేజి బాలుడు 24 గంటలపాటు జీవన్మరణ పోరాటం చేసి చివరికి సురక్షితంగా ఒడ్డుకు చేరాడు.
ప్రతి ఏటా జరిగినట్లే ఈ యేడు కూడా వినాయాక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాధుడు అనంతరం గంగాదేవి ఒడిలో ఒదిగిపోయాడు. అయితే ఉత్సవాల సందర్బంగా సూరత్ లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరి భక్తుల్లాగే నిమజ్జనోత్సవాన్ని చూసేందుకు డుమాస్ బీచ్కు తన బామ్మ, సోదరుడు సోదరితో కలిసి వెళ్ళాడు. అందరిలాగే ఆ సంబరాల్లో ఉన్న లఖన్ను సముద్రంలోని అలలు లోపలి లాక్కెళ్లిపోయాయి.
లఖన్ దేవీపూజక్ సముద్రంలోకి కొట్టుకుపోయిన తర్వాత అతని అమ్మమ్మ అక్కడి వారిని సాయమడగటంతో కొంతమంది యువకులు సహాయం చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి అగ్నిమాపక బృందాలు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగడంతో గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. బాలుడు గల్లంతై 24 గంటలు దాటడంతో ఆ కుటుంబం తీవ్ర దుఖంలో మునిగిపోయింది.
కానీ ఆ గణనాధుని చల్లని దయ వలన బాలుడు నడిసంద్రంలో నిమజ్జనం చేసిన ఒక గణేశుడి ప్రతిమ కింద ఉండే చెక్కబల్లను పట్టుకుని రాత్రంతా నీటిపై తేలియాడుతూ అలాగే ఉన్నాడు. ఆ మరునాడు అటుగా వచ్చిన జాలరులు పడవ కనిపించడంతో చేతిని పైకి ఊపుతూ వారికి సైగ చేశాడు లఖన్. అది గమనించిన మత్స్యకారుడు రసిక్ తండేల్ బాలుడిని రక్షించి పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు బాలుడిని ఆసుపత్రికి తరలించి కుటుంబానికి కబురు పంపించారు. అప్పటికే బాలుడిపై ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు లఖన్ మళ్ళీ మృత్యుంజయుడై వారి కళ్లెదుట ప్రత్యక్షమవడంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
ఇది కూడా చదవండి: ఆసుపత్రి డీన్తో టాయ్లెట్ శుభ్రం చేయించిన ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment