
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 121 మంది మృతిచెందారు. వీరికి సంబంధించిన పోస్ట్మార్టం నివేదికలలో వీరంతా ఎలా మృతి చెందినదీ తెలియవచ్చింది. ఈ వివరాలు ఎవరినైనా కంటతడి పెట్టించేలా ఉన్నాయి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం అలీఘర్లో 37 మందికి పోస్టుమార్టం నిర్వహించగా, వారిలో 10 మంది ఊపిరాడక మృతి చెందారని వైద్యులు తెలిపారు. తలకు బలమైన గాయాలు కావడం, ఎముకలు విరిగిపోవడం, బ్రెయిన్ హెమరేజ్ మొదలైనవి పలువురి మృతికి కారణంగా నిలిచాయి. 12 నుంచి 15 మంది కాలేయం, ఊపిరితిత్తులు పగిలిపోవడంతో మృతి చెందారు. తల, భుజం, మెడ, వెన్నెముకపై తీవ్రమైన గాయాల కారణంగా మరికొందరు మృతి చెందారు.
జిల్లా ఆస్పత్రిలోని పోస్ట్మార్టం హౌస్కు మృతదేహాలు చేరుకోగానే.. అప్పటికే అక్కడికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు తమ వారిని చూసుకుని బిగ్గరగా రోదించారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా కంటతడి పెట్టుకున్నారు. పోస్టుమార్టం హౌస్ వద్దకు అంబులెన్స్లు, పోలీసు వాహనాల్లో మృతదేహాలను వరుసగా తీసుకువస్తుండటంతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. మృతదేహాలను ఉంచేందుకు జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ, పోస్ట్మార్టం హౌస్ సరిపోలేదు. దీంతో వాటిని తెల్లటి వస్త్రాలలో చుట్టి, ఆస్పత్రి ఆవరణలోనే ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment