
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో భారీ ఉగ్ర కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని అమృత్సర్ ప్రాంతంలో టిఫిన్ బాక్సుల్లో అమర్చిన బాంబులతో సహా పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం డ్రోన్ల శబ్దాలు వినిపించడంతో స్థానికులు అప్రమత్తం చేశారని పోలీసులు పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ ద్వారా వీటిని డ్రోన్ ద్వారా జారవిడచినట్టు అధికారులు అనుమానిస్తున్నామన్నారు.
అమృత్సర్ జిల్లాలోని దలేకే గ్రామ సమీపంలో పోలీసులు ఐఈడీ, హ్యాండ్ గ్రెనేడ్ బాంబులను గుర్తించారు. ఏడు సంచుల్లో, రెండు నుండి మూడు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రోన్స్ ద్వారా పిల్లల టిఫిన్ బాక్సుల్లో బాంబులను అమర్చి భారీ దాడికి పథకం వేసినట్టు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా వెల్లడించారు. ఐదు హ్యాండ్ గ్రెనేడ్లు, 20 ఐఈడీ బాంబులు, తొమ్మిది పిస్టల్స్, మూడు డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 20 మందిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. దేశంలో, పంజాబ్లో పనిచేస్తున్న ఉగ్రవాదశక్తులు స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 15కి ముందు భారీ దాడులకు ప్లాన్ చేసినట్టు తెలిపారు.
కాగా ఇటీవలికాలంలో సరిహద్దుల్లో డ్రోన్ల కదలికలు కలకలం రేపాయి. ముఖ్యంగా కశ్మీర్లో వరుసల కదలికలను నిఘా వర్గాలు పసిట్టాయి. ఈ క్రమంలో కశ్మీర్ పోలీసులు ఒక డ్రోన్ను పేల్చివేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామం నేపథ్యంలో దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పంజాబ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో హై అలెర్ట్ను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment