
అన్నానగర్: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తామిద్దరూ నల్లగా ఉన్నా.. బిడ్డ మాత్రం మంచి రంగుతో జన్మించడంపై సందేహించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ అనుమానం కూడా అదే తీరులో బలపడింది. చివరకు ఆ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హతమార్చాడు. ఊయల తాడు బిగుసుకుని మరణించిందని బుకాయించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలడంతో ఆ కసాయి కటకటాలపాలయ్యాడు.
వివరాలు..చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్ జావిద్ (33) పత్తి దుకాణంలో పని చేసేవాడు. అతని భార్య నిలోఫర్. వీరికి పెళ్లయి నాలుగేళ్లైంది. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కుమార్తె పాహిమా ఉంది. గత 26వ తేదీ రాత్రి నీలోఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ ఉపవాసం విరమించేందుకు సమీపంలోని మసీదుకు వెళ్లింది. కుమార్తెతో ఇంట్లోనే జావిద్ ఉండిపోయాడు.
ఇఫ్తార్ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన నీలోఫర్కు పాహిమా మెడ తొట్టి తాడుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుందని అక్రమ్ జావిద్ తెలిపారు. వెంటనే చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు నార్త్ కోస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయకాంత్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
జావిద్ను ప్రశ్నిస్తే ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే శుక్రవారం అందిన పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమదైన శైలిలో విచారణ చేసేసరికి తానే బిడ్డను గొంతు నులిమి హతమార్చినట్టు జావిత్ అంగీకరించాడు. తాను, తన భార్య నల్లగా ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం మంచి రంగుతో ఉండడంతో తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలమిచ్చాడు.