
అగర్తలా: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) సభ్యులు 23 మందిని త్రిపుర పోలీసులు ఒక హోటల్లో హౌస్ అరెస్టు చేశారు. 2023లో జరిగే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరఫున క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసేందుకు ఐప్యాక్ బృందం వారం రోజుల కిందట అగర్తలాకు చేరుకుంది. ఆదివారం రాత్రి నుంచి త్రిపుర పోలీసులు వీరిని హోటల్ నుంచి బయటికి రానివ్వడం లేదు.
‘తృణమూల్ ఇంకా త్రిపురలో అడుగుపెట్టకముందే బీజేపీ భయపడుతోంది. 23 మంది ఐప్యాక్ ఉద్యోగులను గృహనిర్భందంలో పెట్టారు. బీజేపీ అరాచక పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఇలాగే పదేపదే ఖూనీ అవుతోంది’ అని తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ట్వీట్ చేశారు. బయటినుంచి వచ్చినందున వారికి కరోనా పరీక్షలు చేశామని, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment