
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ పలు అంచనాలను వెల్లడించింది. రాజధాని ఢిల్లీలో శనివారం (ఆగస్టు 24) ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం కురుస్తుందని తెలిపింది.
గుజరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, అస్సాం, మేఘాలయ, గోవా, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని 12 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
వాతావరణశాఖ అందించిన డేటా ప్రకారం ఈ సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇక్కడ 269.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత దశాబ్దంలోనే అత్యధికం. ఆగస్టు 23 వరకు, ఢిల్లీలో 274 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది ఆగస్టు 2014 లో నమోదైన గరిష్ట వర్షపాతం కంటే అత్యధికం.
ఆగస్టు 25న గుజరాత్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment