
భార్య, కుమారుడి ఆత్మహత్య
తిరువొత్తియూరు: చూళగిరి సమీపంలో భర్త వివాహేతర సంబంధం కారణంగా భార్య, ఆమె కుమారుడు మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. వివరాలు.. క్రిష్ణగిరి జిల్ల చూళగిరి తాలూకా పెరిగై పోలీస్ స్టేషన్కు సంబంధించిన మీనం తొట్టి గ్రామానికి చెందిన బసవరాజ్ కట్టడ తాపీ మేస్త్రి. ఇతని భార్య రాణియమ్మ. వీరి కుమారుడు వెంకటరాజు బీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
బసవరాజుకు అదే గ్రామానికి చెందిన రాతమ్మతో గత 4 సంవత్సరములగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 7 గంటలకు మద్యం మత్తులో బసవరాజు ఇంటికి వచ్చాడు ఆ సమయంలో ఏర్పడిన గొడవలో రాణియమ్మపై బసవరాజు దాడి చేశాడు. దీనిని అడ్డుకునే ప్రయత్నం చేసిన కుమారుడు వెంకట్రాజ్తోనూ బసవరాజు ఘర్షణ చేశాడు. దీంతో విరక్తి చెందిన వెంకట్రాజ్ ఇంటి మిద్దె పైకి వెళ్లి అక్కడ ఉన్న గదిలో తల్లి చీరకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది చూసిన రాణియమ్మ ఆవేదన చెంది దుఃఖం తట్టుకోలేక అదే ప్రాంతంలో ఉన్న చింత చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో బసవరాజు అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఇద్దరు మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం హోసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న బసవరాజు కోసం గాలిస్తున్నారు.