సంక్షేమాలకు పరేషన్
నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డుతో లింకు పెడుతుండడంతో కార్డులు లేని వారికి శరాఘాతంగా మారింది. తాజాగా రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా ప్రభుత్వం రేషన్ కార్డుతో లింకు పెట్టింది. దీంతో రేషన్ కార్డులు లేని నిరుద్యోగులు పథకం ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తోంది. రేషన్ కార్డులు ఇప్పుడిస్తాం.. అప్పుడిస్తాం.. అంటూ ఊరిస్తున్న ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్నా కార్డులు జారీ చేయకపోవడంతో అనేక మంది ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు.
కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించారు. పథకం ద్వారా 50 శాతం వరకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి యూనిట్ను బట్టి 40 నుంచి 80 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ పథకానికి కూడా రేషన్ కార్డులతో ముడిపెట్టడంతో కార్డులు లేనివారు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డు లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే స్వీకరించడం లేదని పలువురు నిరుద్యోగులు వాపోతున్నారు.
ఏప్రిల్ 14 వరకు గడువు పొడగింపు
ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు సైతం ఇటీవల వెల్లడించారు. మొదట ఏప్రిల్ 5 వరకు ఉన్న దరఖాస్తు గడువును, యువత నుంచి వచ్చిన భారీ ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఏప్రిల్ 14 వరకు గడువు పెంచాలని ఆదేశించారు. మార్చి 31న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించి పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ పొడగింపు ద్వారా మరింత మంది యువతకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అన్ని పథకాలకు రేషన్ కార్డుతో లింకు..
ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో ముడిపెట్టడంతో కార్డులు లేని వారికి శాపంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో చివరగా 2021లో కొంతమందికి మాత్రమే రేషన్ కార్డులు జారీ చేశారు. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలన, గ్రామ, పట్టణ సభల్లో గ్యారంటీ పథకాల కోసం రేషన్ కార్డులు లేని వారి నుంచి సైతం దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకూ కార్డులు జారీ చేయలేదు. ఈ ఏడాది జనవరి 26న పైలట్ ప్రాజెక్టులో మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి కార్డులు జారీ చేసింది. గ్రామ, పట్టణ సభల్లో కొత్తగా మరిన్ని దరఖాస్తులు స్వీకరించారు. మీ సేవ కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. కానీ కొత్తకార్డులు జారీ చేయడంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని నిరుద్యోగులు వాపోతున్నారు. దీంతో సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. రేషన్ కార్డు లేక అనేక మంది 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకు సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం ఇలా ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. తాజాగా రాజీవ్ యువ వికాసం పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి ఉండాలని నిబంధన విధించడంతో కార్డులులేని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సత్వరమే రేషన్ కార్డులు జారీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఈనెల 3వ తేదీ వరకు కార్పొరేషన్ల వారీగా
రాజీవ్ యువ వికాసానికి అందిన దరఖాస్తులు
రేషన్ కార్డు నిబంధనతో అనర్హత గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యానికి నోచుకోని అర్హులు రాజీవ్ యువ వికాసానికీ లింకు దరఖాస్తు చేసుకోలేకపోతున్న నిరుద్యోగులు
మండలం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ
బాసర 12 86 198 56
భైంసా 42 315 571 112
దస్తురాబాద్ 101 153 237 2
దిలావర్పూర్ 47 80 216 48
కడెం 148 315 398 29
ఖానాపూర్ 129 236 404 13
కుభీర్ 258 214 566 41
కుంటాల 51 121 354 27
లక్ష్మణచాంద 15 95 274 23
లోకేశ్వరం 45 180 368 33
మామడ 142 85 171 41
ముధోల్ 47 151 217 106
నర్సాపూర్(జి) 33 107 232 63
నిర్మల్రూరల్ 76 129 387 28
పెంబి 91 39 112 5
సారంగాపూర్ 283 221 645 52
సోన్ 37 76 328 30
తానూర్ 58 206 372 50
మున్సిపాలిటీల వారీగా
భైంసా 11 136 518 554
ఖానాపూర్ 12 118 344 108
నిర్మల్ 53 296 1,501 1,049


