
పశువుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెలు ఏర్పాటు
గన్నవరం: వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల తాగునీటి తొట్టెలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజ, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ వి.కె.షణ్ముఖ్కుమార్తో కలిసి మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న నీటి తొట్టె పనులకు భూమిపూజ, కొత్తగా నిర్మించిన సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం శశిభూషణ్కుమార్ మాట్లాడుతూ వేసవిలో పశువులు, మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి నీటి తొట్టెల నిర్మాణాలను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. మానికొండ గ్రామంలో రెండు చోట్ల నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, డ్వామా పీడీ ఎన్.వి.శివప్రసాద్యాదవ్, పశుసంవర్థక శాఖ అధికారి చిన నరసింహులు, డీపీఓ జె.అరుణ, తహసీల్దారు జె.విమలకుమారి పాల్గొన్నారు.
మర్లపాలెంలో పర్యటన
అనంతరం శశిభూషణ్కుమార్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం గన్నవరం శివారు మర్లపాలెం గ్రామంలో పర్యటించారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసిన నీటి కుంటలు, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన వివిధ రకాల పనులను పరిశీలించారు. వీటి వల్ల పొందుతున్న ప్రయోజనాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
యుద్ధప్రాతిపదికన నీటి తొట్టెల నిర్మాణం
నందిగామ రూరల్: వేసవి కాలంలో మూగజీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సహకారంతో యుద్ధప్రాతిపదికన నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మండలంలోని ఐతవరం గ్రామంలో చేపడుతున్న నీటి తొట్టెల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి మంగళవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 148 నీటి తొట్టెలను ఏర్పాటు చేశామని, మరో 143 ఆవాసాలలో తొట్టెల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. వేసవి తాగునీటి కార్యాచరణలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రధాన సెంటర్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఒక్కో నీటి తొట్టెకు రూ.33 వేలు
ఒక్కొక్క నీటి తొట్టె నిర్మాణానికి రూ.33 వేలు మంజూరవుతాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. జిల్లాలోని 780 ఆవాసాలలో నీటి తొట్టెల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు. వేసవి కాలం నేపథ్యంలో త్వరితగతిన నీటి తొట్టెల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ వేసవి కాలంలో మూగజీవాలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అవసరమైన చోట తొట్టెల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి హనుమంతరావు, డ్వామా పీడీ రాము, ఆర్డీవో బాలకృష్ణ అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్