
రాజమహేంద్రవరం రూరల్: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి, అహంభావానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరు బాలాజీపేట సెంటర్లో ఏర్పాటు చేసిన గొందేశి పూర్ణచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఉద్యోగులపై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారని, దీనిపై తెలంగాణ మంత్రి ‘మాతో పెట్టుకుంటే ఏదైనా చేస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల నీతి కలిగిన నాయకుడని, వైఎస్సార్ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తి అని, వైఎస్ జగన్ కష్టపడే ప్రతిచోటా ఆయన ఉంటారని తెలిపారు.
రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మున్నూరు కాపులను బీసీల్లో చేర్చి ఆదుకున్న విశాల హృదయం సీఎం జగన్మోహన్రెడ్డిదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై దురహంకార వ్యాఖ్యలు సరైనవి కావని, తెలుగువారిగా విడిపోయినా మనసులు విరిగిపోయినట్టు వ్యాఖ్యలు ఉండకూడదని హితవు పలికారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వలసలు వస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment