
నౌపడ నుంచి సాక్షి ప్రతినిధి/అరసవల్లి/ సంతబొమ్మాళి/కోటబొమ్మాళి: ‘తమ పాలనలో ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పుకోలేని వారు, మంచి చేయలేని వారంతా ఇప్పుడు ఏకమవుతున్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. తోడేళ్లలా ఏకమై ఈ రోజు ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి, అదే నిజమని నమ్మించే చీకటి యుద్ధం రాష్ట్రంలో జరుగుతోంది.
ఈ చీకటి యుద్ధాన్ని గమనించండి’ అని సీఎం జగన్ అన్నారు. బుధవారం ఆయన మూలపేట పోర్టు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘ఈ రోజు పెత్తందార్ల పక్షాన నిలబడ్డ టీడీపీకి, పేదవాడి పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు మ«ద్య యుద్ధం జరుగుతోంది.
వ్యవస్థల మేనేజ్ను నమ్ముకున్న వారికి, ప్రజలను నమ్ముకుని ప్రజల కోసమే బతుకుతున్న మీ బిడ్డకు మధ్య యుద్ధం జరుగుతోంది. వారి మాదిరిగా మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేవు. దత్తపుత్రుడూ లేడు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నా నమ్మకం,నా ఆత్మవిశ్వాసం మీరు. మీ బిడ్డ నమ్ముకున్నది ఒక్క దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు మాత్రమే. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి.
కానీ మీ బిడ్డకు భయం లేదు. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నాను. ఈ అబద్ధాలను నమ్మకండి.వీళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు మీ బిడ్డకు లేదు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలబడండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా కదలండి’ అని కోరారు.
పేరుపేరునా పలకరింపు
మూలపేట పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రతినిధులతో సీఎం ఆప్యాయంగా మాట్లాడారు. పేరు పేరునా పలకరిస్తూ.. భూములు ఇచ్చిన వారి త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని చెబుతూ ధన్యవాదాలు తెలిపారు. వారంతా బహిరంగ సభలో సీఎం జగన్ను సత్కరించారు. సంప్రదాయ బోటు జ్ఞాపిక, శ్రీవారి ప్రతిమ అందజేశారు. కాగా, పోర్టు నిర్వాసితులు 594 మందికి నౌపడ వద్ద 58 ఎకరాల్లో పునరావాస కాలనీ నిర్మిస్తున్నారు.
రూ.34.98 కోట్లతో పనుల ప్రారంభానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స , గుడివాడ, ధర్మాన, అంబటి, సీదిరి, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment