ఇఫ్తార్ విందులక్కర్లేదు..
● కూటమి నేతల ఇఫ్తార్ విందులను బహిష్కరించండి
● ముస్లింలకు ఎస్డీపీఐ నాయకుడు అబ్దుల్ సత్తార్ పిలుపు
ఒంగోలు టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్న కూటమి పాలకులు ఇచ్చే ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్ సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు వక్ఫ్ సరవరణ బిల్లుకు మద్దతు ఇవ్వబోమంటూ బహిరంగంగానే ప్రకటించాయని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించక పోవడాన్ని తప్పుపట్టారు. ముస్లిం సమాజానికి ఇఫ్తార్ విందులు అవసరం లేదని, వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడమే కావాలన్నారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మక్కా గురించి, ప్రవక్త గురించి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యంతరం చెప్పకపోవడం వెనక అసలు మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రిని అదుపులో పెట్టాల్సిన బాధ్యత సీఎం మీదనే ఉందన్నారు. వక్ఫ్ చట్టానికి మద్దతు ఇస్తే ముస్లింలు జీవితాంతం చంద్రబాబును నమ్మేది లేదని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది యామని మచ్చగా మిగిలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఒకవైపు ముస్లింలను ద్వేషిస్తూ.. మరోవైపు ఇఫ్తార్ విందులు ఇవ్వడం మానుకోవాలని హితవుపలికారు.