షెడ్లు సిద్ధం.. అందని మగ్గం
● ‘వర్కర్ టు ఓనర్’ పథకంపై నేతన్నల ఆశలు ● కార్మికుడు యజమాని అయ్యేదెప్పుడో ?
● మార్గదర్శకాల ఊసే లేదు..మగ్గాల జాడే లేదు ● 2017లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
● రూ.374 కోట్లతో 88.03 ఎకరాల్లో సిరిసిల్ల వీవింగ్ పార్క్
ఇదీ పథకం స్వరూపం
స్థలం: పెద్దూరు వద్ద 88.03 ఎకరాలు
నిధులు : రూ.373 కోట్లు
ఇప్పటికీ చేసిన ఖర్చు : రూ.210 కోట్లు
మొత్తం వర్క్షెడ్లు : 48
ఇప్పటికీ పూర్తయినవి : 40
ఒక్కో షెడ్డు విస్తీర్ణం : 23వేల చదరపు అడుగులు
వార్పిన్ షెడ్లు : 04
తొలివిడతగా లబ్ధిపొందే కార్మికులు : 1104
ఆధునిక మరమగ్గాలు : 4416
ఇప్పటికీ బిగించిన లూమ్స్ : 04
పవర్లూమ్స్ నడుపుతున్న ఇతను సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్కు
చెందిన మామిడాల సమ్మయ్య వయస్సు 48 సంవత్సరాలు. గత 28 ఏళ్లుగా నేతకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతని తండ్రి చేనేత మగ్గాలను జీవితకాలం నడిపాడు. రోజూ 10 నుంచి
12 గంటల పాటు 8 పవర్లూమ్స్పై పాలిస్టర్ బట్టను ఉత్పత్తి చేస్తే వారానికి రూ.1,600
నుంచి రూ.2వేలు వస్తాయి. సమ్మయ్య
సంపాదన బట్టకు, పొట్టకే సరిపోతుంది.
ఇలాంటి వారికి నాలుగు సాంచాలు(మగ్గాలు) ప్రభుత్వం ఇస్తే.. ఆసాములు లేకుండానే నేరుగా డబుల్కూలీ (రెండింతల ఆదాయం)
లభిస్తుంది. సమ్మయ్య లాంటి వారికి సొంత సాంచాలు ఉన్నాయనే ధైర్యంతో మెరుగైన జీవనం సాగించేందుకు అవకాశం ఉంటుంది.
ఆ నాలుగు సాంచాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకురావడం లేదు. ఇది ఒక్క సమ్మయ్య పరిస్థితి కాదు.. సిరిసిల్లలో పనిచేస్తున్న 25వేల మంది కార్మికుల దుస్థితి.
కార్మికులను యజమానులను చేయాలి
సిరిసిల్లలో ఎన్నో పోరాటాల ఫలితంగా నేతకార్మికులను యజమానులుగా చేయాలనే ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని అమలు చేస్తే మొదటి దశలోనే 1104 మంది కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఈ పథకంపై పేద నేతకార్మికులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం వెంటనే నిర్మాణం పూర్తయిన షెడ్డుల్లో సాంచాలు ఏర్పాటు చేసి ఈ పథకాన్ని అమలు చేయాలి.
– మూషం రమేశ్,
పవర్లూమ్ కార్మిక సంఘం నాయకుడు
ప్రాసెస్ జరుగుతోంది
సిరిసిల్ల బైపాస్రోడ్డులో వీవర్స్పార్క్ నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. మౌలిక వసతులు పూర్తయ్యాయి. పార్క్లో మోడల్లూమ్స్ నాలుగు బిగించాము. వాటిని ట్రయల్ రన్ చేశాం. ఈ పథకం ప్రాసెస్ జరుగుతోంది. కార్మికులకు అందించాల్సిన లూమ్స్ కొనుగోలు చేయాల్సి ఉంది. అది పూర్తయితే వర్కర్ టు ఓనర్ పథకం అమలులోకి వస్తుంది.
– వెంకటేశ్వర్రావు, చేనేత, జౌళిశాఖ సీజీఎం
సిరిసిల్ల: పాలకులు మారినప్పుడల్లా అభివృద్ధి స్వరూపం మారిపోతుంటుంది. అభివృద్ధి.. సంక్షేమ ప్రాధాన్యతలు మారుతుంటాయి. దీని ప్రభా వం సిరిసిల్ల నేతకార్మికులపై స్పష్టంగా కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేత కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించే ‘వర్కర్ టు ఓనర్’ పథకం ఇప్పుడు మూలనపడింది. కార్మికులను యజమానులుగా మార్చే బృహత్కార్యం అప్రధాన్యతగా మారింది. సిరిసిల్ల ఎమ్మె ల్యే, అప్పటి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సిరిసిల్లలో నేతకార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. 2017 అక్టోబరు 11న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో శంకుస్థాపన చేయించారు. రూ.374కోట్ల భారీ బడ్జెట్తో దేశంలోనే తొలిసారిగా వీవర్స్పార్క్కు శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ‘వర్కర్ టు ఓనర్’ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఆధునిక వసతులతో నిర్మాణం
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల, మౌలిక వసతుల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో వీవర్స్పార్క్ నిర్మాణమైంది. 2023లోనే ఇక్కడ రోడ్లు, వీధిదీపాలు, మురికికాల్వలు, ప్రహరీల పనులు పూర్తయ్యాయి. వర్కర్లు పని చేసేందుకు 48 షెడ్లు నిర్మించారు. కానీ అందులో మగ్గాలను ఏర్పాటు చేయలేదు. నేతకార్మికులు కోటి ఆశలు పెట్టుకున్న ఈ పథకంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రయోగాత్మకంగా రెండు సెమీ ఆటోమేటిక్ లూమ్స్ను, మరో స్పన్వైండింగ్ మిషన్ను ఏర్పాటు చేశారు. నాణ్యత, నవ్యతతో కూడిన వస్త్రాలను ఉత్పత్తి చేసే లూమ్స్ను ఏర్పాటు చేస్తారు. ఒకేసారి నాలుగు రంగుల నూలుతో అనేక డిజైన్లతో వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రపంచస్థాయిలో వస్త్రాన్ని వీవర్స్ పార్క్లో ఉత్పత్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
జారీకాని మార్గదర్శకాలు
సిరిసిల్లలో ‘వర్కర్ టు ఓనర్’ పథకానికి ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు జారీకాలేదు. తొలి విడతగా 1,104 మంది పేద కార్మికులను ఎంపిక చేస్తామని 2023లో అధికారులు ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి రెండు సెమీ ఆటోమేటిక్, మరో రెండు జకార్డ్ లూమ్స్ను, ఒక్క స్పన్ వైండింగ్ మిషన్ ఇస్తారు. ఒక్కో షెడ్డులో 96 లూమ్స్, 24 స్పన్వైండింగ్ మిషన్స్ను అమర్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఆ లూమ్స్ను కొనుగోలు చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక విధానం ప్రకటించకపోవడంతో సిరిసిల్ల నేతన్నల్లో నిరాశ నెలకొంది. తొలుత ఎంపికై న కార్మికులు ప్రాజెక్టు వ్యయంలో పది శాతం చెల్లిస్తే.. 50 శాతం ప్రభుత్వ రాయితీ, మరో 40 శాతం బ్యాంకు రుణం అందించే విధంగా ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేశారు.
షెడ్లు సిద్ధం.. అందని మగ్గం
షెడ్లు సిద్ధం.. అందని మగ్గం
షెడ్లు సిద్ధం.. అందని మగ్గం


