
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన తొలి జట్టుగా హరియాణా స్టీలర్స్ నిలిచింది. బుధవారం జరిగిన పోరులో స్టీలర్స్ 37–26 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ను చిత్తు చేసి ప్లే ఆఫ్స్ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకుంది. తాజా సీజన్లో ఇప్పటి వరకు 19 మ్యాచ్లు ఆడిన హరియాణా 15 విజయాలు, 4 పరాజయాలతో 77 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు ‘ప్లే ఆఫ్స్’లో చోటు ఖాయం చేసుకుంది.
బుధవారం ఏకపక్షంగా సాగిన పోరులో స్టీలర్స్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. హరియాణా తరఫున వినయ్ 9 పాయింట్లు, శివమ్ 8 పాయింట్లతో సత్తా చాటగా... మొహమ్మద్ రెజా 6 పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్ తరఫున జతిన్ (5 పాయింట్లు) కాస్త పోరాడాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో స్టీలర్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... బెంగళూరు 14 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది.
మరోవైపు ఈ సీజన్లో 18 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలు, 15 పరాజయాలు, ఒక ‘టై’తో 19 పాయింట్లతో ఉన్న బెంగళూరు బుల్స్... పట్టిక అట్టడుగున (12వ స్థానంలో) కొనసాగుతోంది. బుధవారమే జరిగిన మరో మ్యాచ్లో యు ముంబా 47–31 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. లీగ్లో భాగంగా గురువారం దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ (రాత్రి 8 గంటలకు), యూపీ యోధాస్తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment