
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా సోమవారం(ఏప్రిల్ 12వ తేదీ) రాజస్తాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్లు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. గత సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు లీగ్ మ్యాచ్ల్లోనూ రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. అదే ఊపును ఈ సీజన్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. కాగా, రాజస్తాన్ ప్రధాన బౌలర్ జోఫ్రా ఆర్చర్ లేకపోవడం ఆ జట్టును కలవరపరుస్తోంది.
ఇదే విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ కొత్త డైరెక్టర్ కుమార సంగక్కార స్పష్టం చేశాడు. తమ జట్టులో ఆర్చర్ లేకపోవడం చాలా పెద్ద లోటని పేర్కొన్నాడు. అది కచ్చితంగా తమ జట్టుకు భారీ ఎదురుదెబ్బని పేర్కొన్న సంగక్కార.. తమ ప్రణాళికలు అమలు చేస్తేనే పంజాబ్ కింగ్స్ను నిలువరించగలమన్నాడు. పీటీఐతో మాట్లాడిన సంగక్కార.. ‘ సంజూ శాంసన్(కెప్టెన్), నేను ఒక్క విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆర్చర్ మాకు పెద్ద బలం. ఈసారి అతను అందుబాటులో లేకపోవడంతో గట్టి దెబ్బతగిలినట్టయ్యింది’ అని పేర్కొన్నాడు.
గత నెలలో భారత్తో సిరీస్లో ఆర్చర్ చేతికి గాయమైంది. దీనికి సుదీర్ఘ విశ్రాంతి అవసరం కావడంతో ఐపీఎల్లో ఆడటంపై స్పష్టత లేదు. ఈ టోర్నీ మధ్య నుంచి కలుస్తాడనకున్నా అది సాధ్యపడేలా కనుబడటం లేదు. ఆర్చర్ స్థానాన్ని క్రిస్ మోరిస్తో పూడ్చాలని భావిస్తోంది రాజస్తాన్. ఈ ఏడాది జరిగిన వేలంలో మోరిస్కు 16 కోట్లు పైగా చెల్లించి రాజస్తాన్ తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment