source: X
జింబాబ్వేలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా గెలుపుతో బోణీ కొట్టింది. హరారే వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో మ్యాట్ రెన్షా, బౌలింగ్లో నాథన్ ఇల్లిస్ సత్తా చాటి ఆసీస్ను గెలిపించారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (109) సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. కూపర్ కన్నోల్లీ (51) కూడా రాణించాడు.
కెప్టెన్ మిచెల్ మార్ష్ (36), ఒలివర్ పీక్ (30), అలెక్స్ క్యారీ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ట్రవిస్ హెడ్ (4), జోష్ ఇంగ్లిస్ (4), జేవియర్ బార్ట్లెట్ (5) నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో న్యుమ్యాన్ న్యామ్హురి (5-62) ఐదు వికెట్లతో సత్తా చాటాడు. బ్రాడ్ ఈవాన్స్ 2, కెప్టెన్ సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే తడబడింది. నాథన్ ఇల్లిస్ (5-31) విజృంభించడంతో 45.1 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, రెన్షా, ఆడమ్ జంపా, కూపర్ కన్నోల్లీ తలో వికెట్ తీసి, జింబాబ్వే పతనంలో పాలుపంచుకున్నారు.
జింబాబ్వే ఇన్నింగ్స్లో క్రెయిగ్ ఎర్విన్ (59), కెప్టెన్ సికందర్ రజా (57) అర్ద సెంచరీలతో పోరాడినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. వీరికి మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఈ సిరీస్లో రెండో వన్డే సెప్టెంబర్ 18న ఇదే హరారే వేదికగా జరుగనుంది.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన బుమ్రా


