మా గోడు విని ఆదుకోండి
● పోలీసు గ్రీవెన్స్లో 86 ఫిర్యాదులు
నెల్లూరు సిటీ: హనీ ట్రాప్తో వేధిస్తునారు.. స్వామీజీ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.. వివాహం చేసుకుంటానని ఓ మహిళ మోసగించిందని, నకిలీ పత్రాలతో స్థలాన్ని కాజేస్తున్నాడంటూ ఇలా.. పలువురు తమ గోడును జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి 86 మంది తామెదుర్కొంటున్న సమస్యలను వివరించి ఆదుకోవాలని కోరారు. జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని సంబంధిత ప్రాంతాల పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరురూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఉమెన్ పీఎస్ డీఎస్పీ సీహెచ్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
హనీట్రాప్లో రూ.18 లక్షలు తీసుకున్నారు
ఆన్లైన్ ద్వారా పరిచయమైన దుర్గాభవాని అనే మహిళ తన స్నేహితులతో కలిసి హనీట్రాప్ చేసి తన నుంచి రూ.18 లక్షలు తీసుకుంది. తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నారని వీకేపాడుకు చెందిన బాధితుడు ఫిర్యాదు చేశారు.
నా స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి
ఆక్రమించారు
నెల్లూరురూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రాంరాజ్ కంపెనీ పేరుతో సతీష్, సురేష్ అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తనను నమ్మించారు. 67 అంకణాల తన స్థలాన్ని ముత్తుకూరుకు చెందిన శకుంతలమ్మ అనే మహిళకు నకిలీ పత్రాల ద్వారా అమ్మేశారు. తన స్థలంలో గోడ కూడా కట్టారని, విచారించి న్యాయం చేయాలని బాధితుడు కోరారు.
స్వామీజీ పేరుతో వేధిస్తున్నారు
కావలి మండలం పూలదొరువులో శక్తి పూజలు చేస్తానని పవన్కుమార్, అతని భార్య రజిని కలిసి తనన్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, తాము చెప్పింది చేయకపోతే నీ భర్తకు హాని కలిగేలా చేస్తానని బెదిరిస్తున్నారని తెలిపారు. తన నుంచి రక్షించి న్యాయం చేయాలని కోరారు.
పెళ్లి చేసుకుంటానని
రూ.4.50 లక్షలు తీసుకుంది
వేదాయపాళెం పరిధికి చెందిన వ్యక్తి తన భార్య కోవిడ్లో మరణించగా, జీవిత భాగస్వామి కోసం మ్యాట్రిమోనియల్ సైట్లో నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో నంద్యాలకు చెందిన కౌసల్య అనే మహిళ తనను వివాహం చేసుకుంటానని నమ్మించి అవసరాలకు రూ.4.50 లక్షలు తీసుకొని మోసం చేసిందని, విచారించి న్యాయం చేయాలని కోరారు.
ఫిలిప్పిన్స్లో ఎంబీబీఎస్
సీటు ఇప్పిస్తానని మోసం
టీపీగూడూరుకు చెందిన వ్యక్తి తన బిడ్డకు ఫిలిప్పిన్స్లో ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తానని, ఏజెంట్ రవితేజ తనను నమ్మించి రూ.21లక్షలు నగదు తీసుకొని, కాలేజీలో అసలు ఫీజు కట్టలేదని, మోసపోయామని, విచారించి న్యాయం చేయాలని కోరారు.


