breaking news
SPSR Nellore District News
-
ఇంటి నుంచి గెంటేశారు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వృద్ధుడి ఫిర్యాదు నెల్లూరు(క్రైమ్): ‘నాకు ఇద్దరు కుమారులున్నారు. ఆస్తిని వారికి సమానంగా పంచాను. అయినా బాగోగులు పట్టించుకోవడం లేదు. పెద్ద కుమారుడు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు’ అంటూ బిట్రగుంట పరిధికి చెందిన ఓ వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 69 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీసీఆర్బీ, మహిళా పోలీస్స్టేషన్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు ఎన్.రామారావు, టీవీ సుబ్బారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా తల్లి ఇటీవల మృతిచెందారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. లోతుగా విచారించి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విడవలూరుకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని గుంటూరుకు చెందిన సంపత్, రామాజంనేయులు, వారి స్నేహితులైన వంశీకృష్ణ, రత్నకుమారిలు రూ.3.96 లక్షలు తీసుకున్నారు. నకిలీ కాల్ లెటర్ ఇచ్చి మోసం చేశారు. విచారించి న్యాయం చేయాలని బిట్రగుంట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కోరారు. ● నా కుమార్తె అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. త్వరితగతిన ఆచూకీ కనుగొని అప్పగించాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు. -
అగ్నిమాపక శాఖ ఏర్పాట్లపై ఆరా
నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ సందర్భంగా బారాషహీద్ దర్గా ఆవరణలో అగ్నిమాపక శాఖ చేపట్టిన ఏర్పాట్లను ఆ శాఖ డైరెక్టర్ డి.మురళీమోహన్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజిన్లు వేగంగా ఘటనా స్థలానికి చేరుకునేలా మార్గాల్లో తోపుడు బండ్లు, ఇతర అడ్డంకుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. ఆయన వెంట జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వాకా శ్రీనివాసరెడ్డి, సిబ్బంది ఉన్నారు. మిద్దైపె వాకింగ్ చేస్తూ..● కిందపడి వృద్ధుడి మృతి నెల్లూరు(క్రైమ్): ఇంటి మిద్దైపె వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు సరస్వతి నగర్లో శ్రీనివాసులురెడ్డి (73) నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నాడు. రాత్రివేళ నిద్రలో మెలకువ వచ్చినప్పుడు ఇంటి వరండాలో, మిద్దైపె వాకింగ్ చేయడం అలవాటు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన శ్రీనివాసులురెడ్డి భార్యను లేపి కొబ్బరినీళ్లు తాగారు. నిద్రరావడం లేదని మిద్దైపెకి వెళ్లి వాకింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు పైనుంచి కింద వరండాలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని శ్రీనివాసులురెడ్డిని 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పంట కాలువలో మృతదేహంఅల్లూరు: మండలంలోని అల్లూరు ప్రధాన రహదారి బోడిసత్రం గ్రామం సమీపంలో పంట కాలువలో సోమవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించారు. మృతుడిని అల్లూరు తూర్పువీధికి చెందిన చిక్కిరేణి వెంకట సుబ్బయ్య (40)గా గుర్తించారు. అతను బియ్యం స్టోర్లో కూలీ పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఏమైందో గానీ కాలువలో విగతజీవిగా కనిపించాడు. అనుమానాస్పదగా మృతిగా కేసు నమోదు చేశారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.50 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 -
బాధిత మహిళకు న్యాయం చేయాలి
● వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ డిమాండ్ నెల్లూరురూరల్: కావలిలో మహిళపై జరిగిన దారుణం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, నిందితులపై చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పోతురాజు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెలికితీయాలని కోరారు. బాధితురాలికి పూర్తి రక్షణతోపాటు వైద్య, న్యాయ సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్ మాట్లాడుతూ మహిళలను అవమానించే ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చ అన్నారు. ఈ కేసులో చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. సమావేశంలో నెల్లూరు రూరల్ మహిళా అధ్యక్షురాలు పోతురాజు రమాదేవి, మురళి తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించకపోవడం దారుణం
నెల్లూరు(టౌన్): కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని ఏపీటీఎఫ్ నాయకులు అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పిచ్చిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించి పాస్ మార్కులను 35గా నిర్ణయించాలన్నారు. పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ బాధ్యులు సులోచనమ్మ, శీనయ్య, విజయభారతి, కిశోర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 115 మంది చిన్నారుల అప్పగింతనెల్లూరు(క్రైమ్): భారీ పోలీస్ భద్రతా ఏర్పాట్ల మధ్య రొట్టెల పండగ జరుగుతోంది. సోమవారం ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య బందోబస్తును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పోలీసు అధికారులు 450 మంది చిన్నారులకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగింగ్ చేశారు. తప్పిపోయిన 115 మంది చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోగొట్టుకున్న ఎనిమిది సెల్ఫోన్లు, రూ.46 వేల నగదును బాధితులకు అందజేశారు. పిక్ పాకెటింగ్కు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా బాంబ్, డాగ్స్క్వాడ్లు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నా కుమారుడిని స్వదేశానికి తీసుకురండి● ప్రభుత్వానికి తండ్రి వినతిబుచ్చిరెడ్డిపాళెం: ఫిలిప్పీన్స్లో చిక్కుకున్న తన కుమారుడు బరిగల ప్రేమ్చంద్ను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి చెందిన బరిగల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 2023లో తన కుమారుడిని ఎంబీబీఎస్ చదివించేందుకు సింహపురి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని ఆశ్రయించామన్నారు. అప్పులు చేసి రూ.16 లక్షలను దాని ప్రతినిధి సుధాకర్రెడ్డికి చెల్లించామని చెప్పారు. అయితే కాలేజీకి కేవలం రూ.40 వేలే చెల్లించడంతో తమ కుమారుడి వీసా పునరుద్ధరణ జరగలేదన్నారు. వీసా గడువు ముగియడంతో ప్రస్తుతం ప్రేమ్చంద్ ఫిలిప్పీన్స్లో అనధికారికంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఇబ్బందులు పడుతున్నాడని తెలిపారు. తాను బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నానని, ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడికి ఏదైనా అపాయం జరిగితే తాము తట్టుకోలేమని, మోసం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కండలేరులో 32.510 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 32.510 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
కష్టాలు.. కన్నీటి సుడులు
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు అందజేసిన ప్రజలునెల్లూరురూరల్: కాళ్లరిగేలా తిరుగుతున్నా సమస్యలకు పరిష్కారం మాత్రం దొరకడం లేదని పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి అనేకమంది తరలివచ్చారు. డీఆర్వో విజయ్కుమార్, డిప్యూటీ కలెక్టర్లు కేశవర్ధన్రెడ్డి, వంశీకృష్ణ, సర్వే ల్యాండ్ రికార్డుల డీడీ నాగశేఖర్ తదితరులు వినతులు స్వీకరించారు. మెరుగైన వసతులు కల్పించాలి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు హాస్టళ్లలో మెరుగైన వసతులు, భద్రత కల్పించాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యునైటెడ్ ఫోరం సామాజిక కార్యకర్తలు కోరారు. ఏలూరు జిల్లాలోని ఎస్సీ బాలికల హాస్టల్లో జరిగిన ఘటనను ఫోరం నాయకులు తీవ్రంగా ఖండించారు. దుప్పటి కావాలని అడిగిన బాలికను అర్ధరాత్రి సమయంలో హాస్టల్ నుంచి బయటకు పంపించిన ఘటన బాధాకరమన్నారు. కార్యక్రమంలో డి.పద్మజ, వి.రాజమ్మ, ఉషారాణి, ప్రభావతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మామిడి, పొగాకు రైతుల సమస్యలపై.. జిల్లాలో మామిడి, పొగాకు ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని బీజేపీ నాయకుడు మిడతల రమేష్ డిమాండ్ చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సుమారు 25 వేల ఎకరాల్లో మామిడి, 45 వేల ఎకరాల్లో పొగాకు సాగు చేసిన రైతులు నష్టాల్లో ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పరిశ్రమల కొనుగోళ్లు తగ్గడంతో మామిడి ధరలు పడిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కిలో పొగాకును రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం సగటున రూ.160కే కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి, చిట్టిబాబు, ఆదినారాయణ, అల్లూరు నాగేంద్రసింగ్, ఏవీ సుబ్బయ్య, ముజీబ్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. శ్మశాన భూమి ఆక్రమణ ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలోని శ్మశాన భూమి ఆక్రమణలను తొలగించాలంటూ గ్రామస్తులు బీజేపీ ఆధ్వర్యంలో డీఆర్వో విజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కొందరు పెత్తందారులు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. పనిభారం తగ్గించాలంటూ.. అంగన్వాడీ కార్యకర్తలపై అదనపు పనిభారాన్ని తగ్గించాలని సీఐటీయూ నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షురాలు రెహనా బేగం, కార్యదర్శి సుజాతమ్మ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ జనగణన విధులను అంగన్వాడీలపై అదనపు భారంగా మోపుతున్నారన్నారు. ఇప్పటికే ఇచ్చిన ట్రైనింగ్లు, డ్యూటీలను రద్దు చేయాలని కోరారు. కుమ్మర మాన్యం ఆక్రమణ మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని 3.32 ఎకరాల కుమ్మర మాన్యం భూమిని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్లూరు సుమన్ ప్రజాపతి డిమాండ్ చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్లుగా కుమ్మర కులస్తుల ఆధీనంలో ఉన్న ఈ భూమికి సంబంధించి అల్లంపాటి వేణుగోపాల్రెడ్డి, ఆయన తండ్రి చిన్నారెడ్డి రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకుని పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు. తహసీల్దార్ను సంప్రదించగా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారని పేర్కొన్నారు. న్యాయం చేయాలని కోరుతూ జూలై 8న మర్రిపాడు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మోచర్ల మధు ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.ృ సమస్యలు పరిష్కరించాలంటూ.. విద్యుత్ శాఖ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ అనుబంధ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లకు జేఎల్ఎం, జేఎల్ఎంలకు ఏఎల్ఎం పదోన్నతుల హామీలను అమలు చేయాలన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ల ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలని, ఉద్యోగులకు బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జాకీర్ హుస్సేన్, ప్రసాద్, జి.నాగయ్య, సుమన్, గిరిబాబు, హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ రద్దుకు డిమాండ్ రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు కలిగిస్తున్న ఏపీ ఏఐఎంఎస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాప్ అమలుతో రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కౌలు రైతుల వివరాలు యాప్లో సరిగా నమోదు కాకపోవడంతో వారు భూ యజమానులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి ఇస్తున్న ఎరువులను వారానికి ఒకసారి అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తుళ్లూరు గోపాల్, మూలివెంగయ్య, జనార్ధన్, పుల్లయ్య, వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక లావాదేవీలతోనే వ్యక్తి హత్య
● నిందితుడి అరెస్ట్ ఉదయగిరి: వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన దేవరకొండ గోవిందులు హత్య కేసులో నిందితుడు షేక్ జలీల్ను అరెస్ట్ చేశారు. ఉదయగిరి సీఐ ఎన్.వెంకట్రావు స్థానిక కార్యాలయంలో సోమవారం వివరాలను వెల్లడించారు. గోవిందులు ఈనెల 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. పక్కరోజు అతని భార్య నాగరత్తమ్మ వింజమూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 24న దుత్తలూరు మండలం గుండెమడుగల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం గోనెసంచిలో ఉన్నట్లు బీట్ అధికారి ఓంప్రకాశ్ పోలీసులకు సమాచారమివ్వగా వెళ్లి పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా జలీల్ అనే వ్యక్తి ఊటుకూరు సమీపంలో కౌలుకు నిమ్మ తోటలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గోవిందులు, నాగరత్తమ్మ ఆ తోటలో కూలీలుగా పనిచేస్తున్నారు. జలీల్.. గోవిందుల వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గోవిందులను హత్య చేయాలని జలీల్ నిర్ణయించుకున్నాడు. 20వ తేదీన తన తోటలో పనిచేసే రమణయ్య ద్వారా గోవిందులును రప్పించాడు. తోటలో అప్పు విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పథకం ప్రకారం జలీల్ గడ్డపారతో గోవిందులు తలపై కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి అటవీ ప్రాంతంలో పడేశాడు. నాగరత్తమ్మ ఇచ్చిన సమాచారంతో జలీల్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనలో జలీల్కు సహకరించిన రమణయ్య పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. -
నానాజీ దిగజారుడు వ్యాఖ్యలపై ఆగ్రహం
● పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు చిల్లకూరు: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు సనత్ నగర్లో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి సోమవారం ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, నాయకులు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుని ఎస్సై శిరీషాకు నానాజీపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఉన్న నానాజీ దిగజారి మాట్లాడటం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన నానాజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, షేక్ సుభాన్, అన్నం మురళి, పూర్ణచంద్ర, జోగి వినోద్, కార్ల దీప్తి, బుజ్జా మాధవ్, సర్వేపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరిలో.. ఉదయగిరి: పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్స్టేషన్లో వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం స్టేషన్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమైన నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు మోపి స్టేషన్లకు పిలిపించి చిత్రహింసలు పెడుతున్నారని చెప్పారు. ఇసుక, మట్టి, విలువైన ఖనిజ సంపదను దోచేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టడం ఖాయమని, అప్పుడు తప్పు చేసిన అధికారులతోపాటు, టీడీపీ నేతలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో నేతలు పల్లాల కొండారెడ్డి, షేక్ అలీ అహ్మద్, దస్తగిరి అహ్మద్, ఏంఏ సలీమ్, దస్తగిరి అహ్మద్, అక్కి భాస్కర్రెడ్డి, ఆర్.శ్రీనివాసరెడ్డి, చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మందలపు తిరుపతి నాయుడు, కాటం రవీంద్రరెడ్డి, ఇర్మియా, వై.ప్రభాకర్రెడ్డి, చెన్నరాయుడు, జక్కం శ్రీనివాసరెడ్డి, బాలగురువయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆగని భూ ఆక్రమణలు
మర్రిపాడు: మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూ ఆక్రమణలపై పత్రికల్లో కథనాలు రావడం.. రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడం, ఆక్రమణదారులు యథావిధిగా వాటిని పక్కనపెట్టి మళ్లీ కబ్జాలకు పాల్పడటం షరా మామూలైంది. ఇది రెవెన్యూ అధికారుల పనితీరుకు అద్దం పడుతుతోందని జనం అంటున్నారు. తాజాగా మరోసారి పెగళ్లపాడు గ్రామంలోని సర్వే నంబర్ 6లో భూమిని చదును చేసి ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివాదాలు కొనసాగుతూనే.. 34 ఎకరాల పరిధిలో ఉన్న భూమిలో గ్రామానికి చెందిన డీలర్ దుద్దుకుంట శేఖర్ సుమారు 12 ఎకరాలను చదును చేసి ఆక్రమించేందుకు యత్నించినట్లు గ్రామస్తులు చెబుతున్న మాట. ఇదే గ్రామంలో గతంలో కూడా సుమారు 12 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు పేర్కొంటున్నారు. గతంలోనూ ప్రభుత్వ భూములపై వివాదాలున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్న ప్రాంతాలను చదును చేయడం, కంచెల ఏర్పాటు, సాగు ప్రయత్నాలపై ఫిర్యాదులు వెళ్లినట్లు గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. అయితే శాశ్వత చర్యలు కనిపించలేదు. చెలరేగిపోతూ.. మండలంలో హైలెవల్ కెనాల్ భూసేకరణ పనులు జరుగుతుండడంతో గతంలో రెవెన్యూ రికార్డుల్లో భూములను అందజేసిన వారు, అదే విధంగా ఆయా గ్రామాల్లోని నాయకులు మళ్లీ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారులకు అర్జీలు సమర్పించినా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే కానీ పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. ఒకసారి కఠినంగా వ్యవహరిస్తే మళ్లీ ఆ భూమిలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేయరని, రెవెన్యూ అధికారులు మాత్రం హెచ్చరిక బోర్డులతో సరిపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. -
జిల్లాలో 99.41 శాతం పల్స్పోలియో నమోదు
నెల్లూరు(అర్బన్): జిల్లాలో 99.41 శాతం పల్స్పోలియో నమోదైనట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు 2,67,750 మంది చిన్నారులుండగా తొలిరోజు ఆదివారం 2,54,510 మందికి పల్స్పోలియో చుక్కలను వేసి 95.05 శాతం లక్ష్యాన్ని సాధించారు. రెండో రోజు సోమవారం ఇంటింటి సర్వే ద్వారా మరో 12,045 మందికి చిన్నారులకు పల్స్పోలియో చుక్కలను వేసి మరో 4.99శాతం నమోదు చేశారు. రెండు రోజులకు కలిపి 2,66,180 మందికి చుక్కలు వేసి 99.41శాతం ప్రగతి సాధించారు. మంగళ వారం కూడా ఇంటింటి సర్వే కొనసాగించి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. 7 నుంచి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ ట్రాన్స్కో వారి ఉత్తర్వుల మేరకు 2026–27 సంవత్సరానికి సంబంధించిన స్పోర్ట్స్ క్యాలెండర్ ప్రకారం ఇంటర్ సర్కిల్ క్యారమ్స్, చెస్, బాల్బ్యాడ్మి ంటన్ పోటీలను జూలై 7 నుంచి 9వ తేదీ వరకు నెల్లూరుక్లబ్లో నిరహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ నెల్లూరు స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరీ రామస్వామి వేలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడా పోటీలకు సంబంధించి విద్యుత్ ఉద్యోగుల ఎంపికలను జూలై 1న విద్యుత్ భవన్లో నిర్వహించనున్నట్లు చెప్పా రు. ఆసక్తి కలిగిన విద్యుత్ ఉద్యోగులు ఎంపికలకు హాజరుకావాలని కోరారు. వివరాలకు 90308 02038, 98660 70775, 995129 4829, 9848714330 నంబర్లను సంప్రదించాలని సూచించారు. రేపట్నుంచి సోమశిలలో చేపల వేట నిషేధం సోమశిల: సోమశిల జలాశయంలో జూలై 1 నుంచి రెండు నెలల పాటు చేపల వేటను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఎఫ్డీఓ సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో స్థానిక జాలర్లు, చేపల వ్యాపారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ మాట్లాడుతూ చేపలు గడ్లు పెట్టే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని జలాశయంలో చేపల వేటను నిషేధించినట్లు తెలిపారు. నిషేధ కాలంలో జలాశయ పరిసర ప్రాంతాల్లో వలలతో సంచరించడం, చేపలు పట్టడం, విక్రయించడం చట్టవిరుద్ధమన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా చేపల వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పడవలు, వలలను సైతం సీజ్ చేస్తామని హెచ్చరించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్) : జిల్లాలోని ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు వచ్చే నెల 10వ తేదీలోపు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి ఆర్ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://nationalawrdstoteachers.ed ucation. gov. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను విద్యాశా ఖ కార్యాలయానికి పంపించాలని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,793 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,221 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.38 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు సకాలంలో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
అధికారంలో ఉంటే.. వివస్త్రను చేస్తారా? చంపేస్తారా?
కావలి: అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా చెల్లు బాటు అయిపోతుంది. మమ్మల్ని కేసులు ఏం చేయలేవు.. అనే ధోరణితో టీడీపీ నేతలు అరాచ కాలకు పాల్పడుతున్నారు. అధికారంలో ఉంటే మహిళలను వివస్త్రను చేస్తారా? చంపేస్తారా? రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా? అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలుసుకోవాలని, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చట్టపరంగా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. పట్టణంలోని కచ్చేరిమిట్టలో టీడీపీ నేతల చేతిలో వివస్త్రకు, దాడికి గురైన బాధితురాలిని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డితో కలిసి కాకాణి సోమవారం పరామర్శించారు. తన విషయంలో టీడీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన చర్యలను కన్నీరు ము న్నీరవుతూ బాధితురాలు వివరించారు. నీకు జరిగిన అవమానం, అన్యాయం తెలుసుకుని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. ధైర్యంగా ఉండమని, న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని వైఎస్ జగన్ మాటగా ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ కావలి పట్టణంలో ఎరుకుల మహిళపై జరిగిన ఘటన అమానవీయమన్నారు. సభ్య సమాజంలో ఇలాంటి దారుణాన్ని తామెన్నడూ చూడలేదన్నారు. కూటమి పాలనలో మహిళలు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఎక్కడా లేదన్నారు. మహిళను కులం పేరుతో దూషిస్తూ, జుట్టు పట్టుకుని వీధిలోకి లాగి, బట్టలు ఊడదీసి వివస్త్రను చేశారన్నారు. న్యాయం అడిగితే.. రౌడీషీట్లు పెడతారా? తనపై జరిగిన దాడికి న్యాయం చేయమని గాయాలు, అవమానంతో బాధిత మహిళ పోలీస్స్టేషన్కు వెళ్తే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని ‘నీ కొడుకుపై కేసు నమోదైంది. నిన్ను కొట్టిన విషయం బయటకు రాకుండా ఉంటే, మీ కొడుకుపై ఎలాంటి కేసు లేకుండా పంపించేస్తామ ని’ బెదిరించడం ఏమిటని పోలీసులను కాకాణి నిలదీశారు. ఒకవేళ కేసు పెడతామని భీష్మించుకుంటే, నీ కొడుకుపై గూండా యాక్ట్ పెడతామని, రౌడీషీట్ తెరుస్తామని, జైల్లో పెడతామని, కుటుంబానికి దక్కకుండా చేస్తామని టూటౌన్ పోలీసులు భయపెట్టి రాజీపత్రం రాయించి, ఇద్దరి మధ్య ఎలాంటి వివాదా లు లేవని, ఇకపై ఒకరి జోలికి ఒకరు పోమని బలవంతంగా సంతకం పెట్టించి కేసును క్లోజ్ చేశామని చెప్పారన్నారు. తహసీల్దార్ ఏ విధంగా సర్టిఫికెట్ ఇస్తారు బాధితురాలిని బలవంతంగా తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి వేలిముద్రలు వేయించుకుని కులం, మతం సర్టిఫికెట్లు జారీ చేశారంటూ కాకాణి ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జన్మతః ఏ కులం, మతానికి చెందుతారో, అదే కులం ఉంటుందనే విషయం తహసీల్దార్కు తెలియదా? అని ప్రశ్నించారు. తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన తహసీల్దార్ ఉద్యోగంలో ఉంటాడా? జైలుకు వెళ్లకుండా తప్పించుకుంటాడా? అని కాకాణి నిలదీశాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఈ రోజు గిరిజన కుటుంబం పడుతున్న బాధ కంటే వంద రెట్లు ఎక్కువ బాధను అధికారులు భవిష్యత్లో అనుభవించక తప్పదన్నారు. నేరస్తుల కాపు కాస్తున్న ఎమ్మెల్యే కావలిని కాపు కాస్తానని చెప్పిన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నేరస్తుల కాపు కాస్తున్నాడని కాకాణి ధ్వజమెత్తారు. కచ్చేరిమిట్టలో చుట్టు పక్కల ఉన్న మహిళలను విచారిస్తే, గిరిజన మహిళపై దాడి చేయడానికి ప్రధాన కారకుడు మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం అని చెబుతున్నారని, ఇలాంటి వ్యక్తిని సమర్థించడమే దారుణమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన ఏ విధంగా సాగుతుందో ప్రజలు గమనిస్తున్నారని, మహిళలపై చేయి వేస్తే ఆ రోజే ఆఖరి రోజు అవుతుందన్న ఆయన మాటలు క్షేత్రస్థాయిలో నిజం కావడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాదిరిగా ఎన్నికల ముందు సుగాలి ప్రీతి హత్యను అడ్డం పెట్టుకుని హడావుడి చేసి అధికారంలోకి వచ్చాక మరిచిపోయే సంస్కృతి మాది కాదన్నారు. దాడికి గురైన బాధిత మహిళకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే జరిగేంత వరకు ఆమెకు మద్దతుగా ఉంటామన్నారు. ఒక వేళ చేయలేకపోతే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత మహిళను అన్ని విధాల ఆదుకొని న్యాయం చేస్తామన్నారు. గిరిజన మహిళకు అన్యాయం జరిగితే ఆమెనే పోలీసులు బెదిరిస్తారు ఈ విషయం బయటకు రాకూడదని రాజీపత్రం రాయించారు కేసును నీరుగార్చేందుకు కులం, మతం పేరుతో సర్టిఫికెట్లు సృష్టించారు తహసీల్దార్ తప్పుడు సర్టిఫికెట్లు అందజేశారు తప్పులు చేసిన పోలీస్, రెవెన్యూ అధికారులు జైలుకు వెళ్లక తప్పదు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
తూపిలిపాళెంలో తమిళ బోట్ల హల్చల్
● మా బతుకులు ఇంతేనా? ● స్థానిక మత్స్యకారుల ఆవేదనవాకాడు: కొన్నేళ్లుగా తమిళ జాలర్లు హద్దులు దాటి మత్స్య దోపిడీ, దాడులకు పాల్పడుతున్నా శాశ్వత చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఆదివారం తమిళ జాలర్ల బోట్లు వాకాడు మండలం తూపిలిపాళెం తీరంలో హల్చల్ చేశాయి. స్థానిక మత్స్యకారుల వివరాల మేరకు.. ఇటీవల జువ్వలదిన్నె వద్ద తమిళ జాలర్లు బోట్లను జిల్లా మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. అయితే తిరిగి వాటిని వదిలేయడంతో తమిళ జాలర్లు జిల్లా తీరం వెంబడి తమ అక్రమ వేటకు మళ్లీ స్పీడు పెంచారు. ఈ క్రమంలోనే 25 రోజులుగా ఆంధ్రా సరిహద్దుల్లో నిబంధనలకు విరుద్ధంగా తీరానికి అతి దగ్గర్లో వేట చేసి మత్స్యసంపదను దోచుకుపోవడం జరుగుతోంది. స్పీడు బోట్లతో సముద్రంపై హద్దులు దాటి తమ పరిధిలోకి చొచ్చుకొచ్చి అక్రమంగా వేట చేసి తమకేమీ మిగల్చకుండా విలువైన మత్స్యసంపదను దోచుకుపోతున్నారని జిల్లా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 52 స్పీడు బోట్లతో.. నాలుగు వారాల వ్యవధిలోనే చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండల పరిధిలోని సముద్రంలో సుమారు 52 స్పీడు బోట్లు ఒక్కసారిగా పరిధి దాటి వందల టన్నుల మత్స్యసంపదను దోచుకుపోవడం జరిగింది. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై రాళ్లదాడికి దిగడంతో తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. పొరుగు రాష్ట్రాల స్పీడు బోట్ల దందాకు ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారని, మా బతుకులు ఇంతేనా అని మత్స్యకారులు బాధపడుతున్నారు. రెండు నెలల వేట విరామం కాలం తర్వాత అరకొరగా లభిస్తున్న మత్స్య సంపదతో జీవనం సాగిస్తున్న తమకు పొరుగు జాలర్లు ఒక్క చేపను కూడా దొరకనివ్వకుండా నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా స్పీడు బోట్లు 8 నాటికల్ మైళ్ల దూరం పైన సముద్రంలో వేట చేయాలి. అలా కాకుండా నిబంధనలు అతిక్రమించి 2 నాటికల్ మైళ్ల దూరంలోనే వేట చేస్తున్నాయి. తాము ఏడాది మొత్తం పస్తులతో అలమటించినా.. ఎవరూ పట్టించుకోరా అని స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. -
కబ్జా చేశాం.. అడిగేదెవరు..
విలువైన భూముల ఆక్రమణ సురే దశరథరామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మేత పోరంబోకుతోపాటు చెరువు స్థలాలు, వాగు పోరంబోకు భూములను కూడా ఆక్రమించి సాగు చేస్తున్నారు. దాదాపు రూ.1.50 కోట్ల విలువైన భూముల్లో సాగు చేస్తున్నారు. మేత పోరంబోకు భూమి విషయంలో ప్రశ్నిస్తే దాడులు చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. దీంతో గ్రామస్తులు భయపడుతున్నారు. – గువ్వల శ్రీధర్రెడ్డి కావలి: జలదంకి మండలం చోడవరం గ్రామంలో పశువుల మేత కోసం కేటాయించిన పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. సుమారు రూ.4 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురవడంతో పశువులను మేపేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చోడవరం ఏర్పడిన సమయంలో గ్రామంలోని పశువులు అన్ని కాలాల్లో మేత మేసేందుకు సర్వే నంబర్ 282లో 40 ఎకరాలకు పైగా భూమిని పోరంబోకు భూమిగా వదిలివేశారు. వర్షాలు కురిసిన సమయంలో వ్యవసాయ పనులు, పంటల సాగు కొనసాగుతున్నప్పుడు గ్రామంలోని పశువులు ఈ భూమిలోకి వెళ్లి మేత మేసేవి. జామాయిల్ సాగు.. కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన సురే దశరథరామిరెడ్డి కుటుంబం సర్వే నంబర్ 282లోని సుమారు 10 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి జామాయిల్ సాగు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతడిని ఆసరాగా చేసుకుని మరికొందరు రైతులు కూడా మేత పోరంబోకు భూముల్లో జామాయిల్, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. దీంతో గ్రామంలోని పశువులకు మేత లేకుండా పోయింది. తమ పశువులను మేత పోరంబోకు భూముల్లోకి తీసుకెళ్తే సురే దశరథరామిరెడ్డి, అతని అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆక్రమణలతో గ్రామంలో అశాంతి దశరథరామిరెడ్డి కుటుంబం టీడీపీలో ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా ప్రైవేట్ భూములపై కూడా కన్నేస్తున్నారని స్థానికులు అంటున్నారు. తమను ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతూ గ్రామంలో అశాంతి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దశరథరామిరెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూములపై విచారణ జరిపి మేత పోరంబోకు భూమిని కబ్జాల నుంచి విడిపించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. రూ.4 కోట్ల విలువైన మేత పోరంబోకు భూమి కబ్జా పశువులకు మేత లేక రైతుల ఇబ్బందులు ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తుల ఆరోపణలు -
కసుమూరు దర్గాలో నిలువు దోపిడీ
● హుండీ నిర్వాహకుల బలవంతపు వసూళ్లు ●పట్టించుకోని అధికారులువెంకటాచలం: దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్వలీ దర్గాను దర్శించుకునే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. హుండీల్లో నగదును వేయాలని హుండీ కాంట్రాక్టర్లు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నా, అధికారులు అడ్డుకట్టేయకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా వద్ద నిర్వహించే రొట్టెల పండగకు వచ్చే భక్తుల్లో 50 శాతానికిపైగా ఇక్కడి దర్గాను దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. దర్గాలో అదనపు హుండీలను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసి, అందులో నగదును వేయాలని చెప్పడంతో భక్తులు ఆదివారం గొడవకు దిగారు. తమకు ఇష్టముంటే వేస్తామని.. మీరు బలవంతంగా సమర్పించాలని చెప్పడమేమిటని ప్రశ్నించారు. గొడవతో అర్ధగంటపాటు ఎవర్నీ దర్శనం చేసుకోనీయకుండా నిలిపేశారు. మూడు రోజులుగా ఇదే తంతు.. హుండీ నిర్వాహకులు బలవంతపు వసూళ్లకు మూడు రోజులుగా పాల్పడుతున్నా.. రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. సాధారణ రోజుల్లో దర్గాలో రెండు హుండీలే ఉంటాయి. భక్తులు తమకు తోచినంత నగదును అందులో సమర్పిస్తారు. అయితే గంధ మహోత్సవం, రొట్టెల పండగ సందర్భాల్లో దర్గా ప్రాంగణంలో అదనపు హుండీలను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసి, ప్రతి చోటా సిబ్బందితో బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండటం వివాదాస్పదమవుతోంది. -
పోలియో రహిత సమాజమే లక్ష్యం
● డీఎంహెచ్ఓ సుజాత ● జిల్లా వ్యాప్తంగా చిన్నారులకు చుక్కల మందు నెల్లూరు(అర్బన్): పోలియో రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని డీఎంహెచ్ఓ సుజాత అన్నారు. పల్స్ పోలియో 2026 కార్యక్రమాన్ని ఆదివారం నెల్లూరులోని శెట్టిగుంటరోడ్డులో ఉన్న వైవీఎం మున్సిపల్ పాఠశాలలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్తో కలిసి డీఎంహెచ్ఓ ప్రారంభించారు. 5 ఏళ్లలోపు వయసున్న పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 2,67,750 మంది చిన్నారులకు రెండు చుక్కల చొప్పున ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. వీరికోసం 1,620 పోలియో బూత్లు ఏర్పాటు చేశామన్నారు. హైరిస్క్ ప్రాంతాల్లో 83 మొబైల్ బూత్లను, ప్రయాణాల్లో ఉన్న పిల్లలకు చుక్కలు వేసేందుకు 88 ట్రాన్సిట్ బూత్లు పెట్టామన్నారు. తొలిరోజు మిస్సయిన పిల్లల కోసం సోమ, మంగళ వారాల్లో ఇంటింటి సర్వే ద్వారా చుక్కల మందు వైద్యసిబ్బంది వేస్తారన్నారు. కార్యక్రమంలో డెమో అధికారి కనకరత్నం, స్టాటిస్టికల్ అధికారి సహన, మెడికల్ ఆఫీసర్లు డా.ధనలక్ష్మి, డా.మౌనిక, డా.కార్తీక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. తొలిరోజు 95.05 శాతం మందికి.. తొలిరోజు 2,54,510 పిల్లలకు వైద్యసిబ్బంది చుక్కల మందు వేశారు. 95.05 శాతం నమోదైంది. డీఎంహెచ్ఓ సుజాత మాట్లాడుతూ హైరిస్క్ ప్రాంతాలైన గిరిజన కాలనీలు, ఇటుకబట్టీలు, తోటల్లో పనిచేసే చోట తల్లిదండ్రులతో ఉండే పిల్లలను గుర్తించి చుక్కల మందు వేసి 100 శాతం విజయాన్ని అందుకుంటామన్నారు. సహకరించిన అంగన్వాడీ, ఆర్ఎంపీ, పీఎంపీలతోపాటు స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రావెల్ టిప్పర్ల ఇష్టారాజ్యం● త్రుటిలో తప్పిన ప్రమాదం ● చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ కావలి: గ్రావెల్ టిప్పర్లు ఇష్టారాజ్యం తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం కావలి నుంచి బ్రాహ్మణక్రాక, కృష్ణాపాడు మీదుగా నెల్లూరుకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. దారిలో కావలి విట్స్ కళాశాల వద్ద ఉన్న స్టాప్లో ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటోంది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న సీతారామ లారీ సర్వీస్కు చెందిన టిప్పర్ బస్సును రాసుకుంటూ వెళ్లే పరిస్థితి లేక ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సు కుడివైపు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే ప్రమాదం పెద్దది కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టిప్పర్ల రాకపోకలపై ఆందోళన పట్టణ పరిసర ప్రాంతాల నుంచి అక్రమ గ్రావెల్ తరలింపులో భాగంగా టిప్పర్లు పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో భారీ వాహనాల రాకపోకలపై అధికారులు దృష్టి సారించాలని, ముఖ్యంగా పగటి సమయంలో టిప్పర్లు తిరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అప్రమత్తంగా విధులు నిర్వహించాలి
● ఎస్పీ అజిత వేజెండ్ల నెల్లూరు(క్రైమ్): భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె దర్గా పరిసర ప్రాంతాలు, క్యూలైన్లు, ఘాట్ ఏరియా తదితర ప్రాంతాల్లో బందోబస్తును పరిశీలించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తప్పిపోయిన చిన్నారులు, వ్యక్తుల విషయంలో తక్షణ స్పందనతో చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి దర్గా పరిసరాలను పరిశీలించారు. -
భక్తులకు బారా కష్టాలు
గంధం బిందెల వద్ద మతపెద్దలు నెల్లూరు (బారకాసు): రొట్టెల పండగ సందర్భంగా హాజరయ్యే భక్తులకు వసతుల కల్పనే తమ ప్రాధాన్యమని మంత్రులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో అది వాస్తవ విరుద్ధంగా ఉంది. మండిపోయే ఎండలతో కాళ్లు కాలుతూ భక్తులు హాహాకారాలు చేస్తున్నా.. తాగునీటి వసతి లేక అల్లాడుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏటా నిర్వహించే ఈ మహోత్సవానికి లక్షలాది మంది వస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సంఖ్య పెరుగుతుందే గానీ తగ్గేదంటూ ఉండదు. ఇవన్నీ తెలిసినా తమకెందుకులేనని నగరపాలక సంస్థ లైట్ తీసుకుందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నీ వెతలే.. ● ఆదివారం నాడు భానుడి భగభగలు తారస్థాయికి చేరాయి. అశేషంగా హాజరైన భక్తజనానికి నిలువు నీడ కరువైంది. ఫలితంగా చెట్లు, అవసరమైన జాగా కోసం వీరు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ● తాగునీటి సౌకర్యాన్ని కల్పి ంచడంలో కార్పొరేషన్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. దీంతో గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడాల్సి వచ్చింది. చలివేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు పేర్కొన్నారు. ● బారాషహీదులను దర్శించుకునేందుకూ భక్తులకు అగచాట్లు తప్పలేదు. కిలోమీటర్ మేర క్యూ చేరుకుంది. వీరి కాళ్లు కాలకుండా పట్టలను ఏర్పాటు చేసే అవకాశమున్నా.. నీటిని చల్లి ఉపశమనం కల్పించే ఆస్కారమున్నా, ఆ దిశగా ఎవరూ చర్యలు చేపట్టలేదు. ● చాంతాడంత క్యూలో ఉన్న వారికి ఆహారం, మంచినీటిని అందించాలనే కనీస ఆలోచన ఎవరికీ రాకపోవడం శోచనీయం. ఈ వ్యవహారాలను చూస్తే వక్ఫ్ బోర్డు, దర్గా కమిటీ పనితీరు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని నిలదీసిన భక్తులు దర్గాకు విచ్చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని భక్తులు నిలదీశారు. గుక్కెడే మంచినీరిచ్చే దిక్కులేదని.. ఎండ వేడిమికి చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సులున్న భక్తులు దర్గాలోకి నేరుగా వెళ్లి దర్శనం చేసుకోగలుగుతున్నారు. దర్గా ప్రాంగణంలో సిమెంట్ రోడ్డు లేని చోట క్వారీ డస్ట్ను వేసి చదును చేశారు. దీనిపై నీరు చల్లాల్సి ఉన్నా, అలా చేయలేదు. దీంతో మట్టి ఎగిరి కళ్లలో పడటంతో భక్తులు అసహనానికి గురయ్యారు. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించా ల్సిన మేయర్ సుజాత, కమిషనర్ నందన్ తమ ప్రచారం కోసం ఫొటోలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. వసతుల కల్పనలో అధికార యంత్రాంగం వైఫల్యం ఫొటోలకే పరిమితమైన మేయర్, కమిషనర్ షహీదుల సమాధుల దర్శనానికి బారులు ఆహారం, మంచినీటిని అందించడంలో వక్ఫ్ బోర్డు నిర్లక్ష్యం ఏటా పండగ పేరిట రూ.కోట్లను తమ ఖజానాలో వేసుకుంటున్న వైనం అధికార పార్టీ నేతలు, ఆఫీసర్ల సిఫార్సులకే ప్రాధాన్యం -
పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలి
కావలి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న కాకినాడ రూరల్ ఎమ్మె ల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ)పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదివారం కావలి వైఎస్సార్సీపీ నేతలు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వ్యక్తిగతంగా అవమానించే పదజాలంలో కేవలం రాజకీయ లబ్ధికోసం దిగజారి మాట్లాడడం రాజకీయాల్లో మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు వైఎస్సార్ కుటుంబం అభిమానులు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. తక్షణమే పంతం నానాజీతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటి వంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, గుండ్లపల్లి మురళీ యాదవ్, మాల్యాద్రి, వెంగళశెట్టి కళ్యాణి, జ్యోతి, పద్మ, సుమలత, పట్టణ మహిళ అధ్యక్షురాలు సీతారావమ్మ, సీనియర్ నాయకురాలు దామేర్ల నాగేశ్వరమ్మ, చేవూరు పద్మ, గూడ్లూరు మాల్యాద్రి, పరుసు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
అండగా ఉంటామని వైఎస్సార్సీపీ నేతల భరోసా
కావలి: ఈ నెల 19న కావలి పట్టణం కచ్చేరిమిట్టకు చెందిన గిరిజన మహిళపై జరిగిన దారుణ ఘటనను తెలుసుకున్న కావలి వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం ఆమె నివాసానికి తరలివెళ్లారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో టీడీపీ నేత లు అమానుషానికి బరితెగించారని, ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. తాము అండగా ఉంటామని ఆమెకు ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి దారుణాలు జరుగుతునే ఉన్నాయన్నారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు కొందరు అదే ప్రాంతంలో ఉన్నటు గిరిజన మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి వివస్త్ర చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారన్నారు. ఈ విషయమై అదే రోజు కావలి 2వ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోగా బాధితులను బెదిరించి రాజీ చేసుకోవాలని సూచించడంతో బాధిత మహిళ ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయంతో పది రోజులుగా అజ్ఞాతంలో ఉందన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు బాధితురాలిని బెదిరించేందుకు ఆమె పెట్టిన కేసు ను నమోదు చేస్తూ, ఆమె కుమారుడిపై నిందితురాల్లో ఒకరు స్నానం చేస్తుండగా పిట్ట గోడ ఎక్కి చూశారంటూ కేసు కూడా వారం తర్వాత ఈనెల 26వ తేదీన నమోదు చేయడంలోనే పోలీసుల వైఖరి తెలుస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కావలిలో రెడ్బుక్ రాజ్యాంగం పాలన నడుస్తుందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, మాజీ కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, ఎస్కే రహంతుల్లా, పేరం వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు వెంకటేశ్వర్లు, కలికి శ్రీనివాసులురెడ్డి, ఎస్కే నాయబ్ రసూల్, పరసు మాల్యాద్రి. ద్రోణాదుల వెంకట్రావు ఆత్మకూరు శ్రీనుబాబు, వైఎస్సార్సీపీ మహిళా నేతలు వెంగళశెట్టి కళ్యాణి, జ్యోతి, పద్మ, సుమలత, సీతారావమ్మ, దామెర్ల నాగేశ్వరమ్మ, చేవూరు పద్మ, తదితరులు ఉన్నారు. -
దుశ్శాసనులను కఠినంగా శిక్షించాలి
కావలి (నెల్లూరురూరల్): కావలి పట్టణం కచ్చేరిమిట్టలో గిరిజన మహిళ వివస్త్రను చేసి, పాశవికంగా దాడి చేసిన ఘటనను సామాజిక మహిళా కార్యకర్త సి. శారద శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో ముందుకు వచ్చి తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న మహిళలకు ఈ సభ్య సమాజంలో ఇలాంటి దుర్మార్గం జరగడం అత్యంత గర్హనీయం. మహిళలకు అండగా ఉంటామనే అధికార పార్టీ నేతలు నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి, కఠిన శిక్షలు పడేలా బాధితురాలి వైపు నిలబడాలని డిమాండ్ చేశారు. ఒక మహిళ రాష్ట్రపతిగా ఉన్న ఈ దేశంలో, ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ దారుణం జరగడం అత్యంత హేయమన్నారు. కావలి ఘటన చూస్తే.. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన దుర్ఘటను గుర్తు తెస్తుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు బాధితురాలిని కలిసి భరోసా ఇవ్వాలని కోరారు. నిందితులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారో ఆ రాజకీయ పార్టీ వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పులి వాహనంపై చాముండేశ్వరిదేవి ఇందుకూరుపేట: బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరీదేవి అమ్మవారు పులి వాహనంపై శనివారం విహరించారు. మేళతాళాలు.. విద్యుద్దీప వెలుగులు.. బాణసంచా నడుమ గ్రామం నుంచి పల్లిపాళెం వరకు ఊరేగించారు. కాగా అమ్మవారికి సింహ వాహనసేవను ఆదివారం నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాలను అలయ అర్చకులు అనిల్, రామకృష్ణ ఆధ్వర్యంలో జరిపారు. ఈఓ తాతా శ్రీనివాసరావు పాల్గొన్నారు. నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం రాపూరు: జిల్లాలోని పెంచలకోన క్షేత్రం భక్తులతో శనివారం కిక్కిరిసింది. పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామికి సుప్రభాతం, అభిషేకం, పూలంగిసేవను నిర్వహించారు. స్వామి వారి నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి వివిధ పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ దేవదేవేరుల కల్యాణాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అన్నదానం చేశారు. దేవదేవేరుల ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై ఉంచి సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్ సేవను నిర్వహించారు. -
పొగాకు రైతుపై సర్కార్ పగ
● గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో నిరసన ● ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ● అడ్డుకున్న పోలీసులు ● ఆర్డీఓకు వినతిపత్రం అందజేత సోమశిలలో 38.16 టీఎంసీలు సోమశిల: సోమశిల జలాశయంలో శనివారం సాయంత్రానికి 38.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ కాలువలకు 3550 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. రాస్తారోకో.. మర్రిపాడు: పొగాకు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో మర్రిపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి నిరసనగా నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై రాస్తారోకోను రైతులు చేపట్టి వాహన రాకపోకలను రెండు గంటలకుపైగా అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతు నేతలతో పోలీసులు చర్చలు జరిపి ఆందోళనను విరమించాలని కోరారు. అయితే ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిని నిరాకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రైతు సంఘ నేతలను ఖాకీలు అడ్డుకొని నిరసనను విరమించాలని ఒత్తిడి చేయడంపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపైనే పడుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఆత్మకూరు: పొగాకు సాగు ఖర్చులు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని.. పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధరల్లేక కంపెనీలు కుమ్మకై ్క తమను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. మంచి ధర కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు నినదించారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో మర్రిపాడు నుంచి డీసీపల్లి మీదుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీని సంఘటిత కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆత్మకూరు రైతు సంఘ నేతలు శనివారం నిర్వహించారు. ఆత్మకూరుకు కొన్ని ట్రాక్టర్లు చేరుకోవడంతో స్థానిక నెల్లూరుపాళెం సమీపంలో సీఐ గంగాధర్, ఎస్సై జంపాని కుమార్ అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతుల్లేవని, పట్టణంలోకి ప్రవేశించరాదని చెప్పడంతో ఇదేమి అన్యాయమని రైతులు ప్రశ్నించారు. ర్యాలీని తాము ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని, దీన్ని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. అయినా పోలీసులు అంగీకరించకపోవడంతో ట్రాక్టర్లను రోడ్డు పక్కన పెట్టి రైతులు దిగేసి.. అక్కడే నిరసన చేపట్టారు. సీఎం ఆదేశాలు బేఖాతర్ కిలో రూ.200కు తగ్గకుండా ఫ్లాట్ఫారాల్లో పొగాకును కొనుగోలు చేస్తారని సీఎం ఇటీవల పేర్కొన్నా, ఆయన ఆదేశాలు బేఖాతరయ్యాయని రైతు సంఘ నేతలు ఆరోపించారు. తేలిక నేలల్లో పండే నాణ్యమైన పొగాకు ఈ ప్రాంతంలో ఉత్పత్తవుతున్నా, దానికి తగిన ధరను చెల్లించకుండా రైతుల వద్ద దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఆపై అక్కడే సీఐకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆర్డీఓకు వినతిపత్రం ఆత్మకూరు ఆర్డీఓ పావనికి వినతిపత్రాన్ని సంఘటిత కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు అందజేశారు. రైతు సంఘ నేతలు చండ్ర రాజగోపాల్, మూలి వెంగయ్య, కృష్ణప్రసాద్, లక్ష్మీపతి, అన్వర్బాషా, నారాయణస్వామి, ఆత్మకూరు నాగయ్య, శివప్రసాద్, బడుగు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆర్డీఓకు వినతిపత్రమిస్తున్న రైతులుమాట్లాడుతున్న నేతలు ట్రాక్టర్ల ర్యాలీని నిలిపేసిన పోలీసులు -
తన టిప్పరే మృత్యు శకటమైంది
● మరమ్మతులు చేస్తుండగా డ్రైవర్ దుర్మరణం ముత్తుకూరు(పొదలకూరు): తను ప్రతినిత్యం తోలే టిప్పరే ఆ డ్రైవర్కు మృత్యు శకటంగా మారింది. టిప్పర్ కింద పడుకుని రిపేరు చేస్తున్న డ్రైవర్పైకి ప్రమాదవశాత్తు టిప్పర్ దొర్లడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన మండలంలోని జంగాలకండ్రిక వద్ద శనివారం జరిగింది. ముత్తుకూరు ఎస్సై డీవీ కొండారెడ్డి కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడి గ్రామానికి చెందిన నల్లబాయి విజయ్కుమార్(36) టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. టిప్పర్ మరమ్మతులకు గురికావడంతో జంగాలకండ్రిక గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి సరిచేస్తుండగా ఒక్కసారిగా టిప్పర్ వెనుక్కు దొర్లింది. దీంతో టిప్పర్ కింద ఉన్న విజయకుమార్ టైర్ల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ నిర్వహించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. టైర్ పంక్చరై అదుపుతప్పిన ఎలక్ట్రిక్ బస్సు ● స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు మనుబోలు: వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు హఠాత్తుగా టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పింది. ఈ ఘటన మనుబోలు, వెంకటాచలం మండలాల సరిహద్దులోని జాతీయ రహదారిపై చవటపాళెం క్రాస్రోడ్డు వద్ద శనివారం జరిగింది. వివరాలు.. తిరుపతి నుంచి 35 మంది ప్రయాణికులతో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు నెల్లూరు వైపు వస్తోంది. బస్సు చవటపాళెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ముందు టైరు పగిలిపోవడంతో అదుపుతప్పింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కనే ఉన్న పొలాల్లోకి మళ్లించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో స్వల్పగాయాలైన ప్రయాణికులను 108 అంబులెన్స్లో వెంకటాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అధికారులు ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. మనుబోలు ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ అవసరం నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. బారాషహీద్ దర్గాలో బందోబస్తును శనివారం ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చూడాలన్నారు. ప్రత్యేక పాస్లు కలిగిన వాహనాలు మినహా ఇతర వాహనాలు దర్గాలోపలికి అనుమతించరాదన్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్స్క్వాడ్లతో నిరంతర తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, గైర్హాజరైనా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీలు సౌజన్య, దీక్ష ఉన్నారు. నాలుగు డ్రోన్ కెమెరాలు భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు పోలీసుశాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. మంత్రి పొంగూరు నారాయణ నాలుగు నైట్ విజన్ డ్రోన్ కెమెరాలను ఎస్పీ అజితకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రివేళల్లోనూ నిరంతర ఏరియల్ సర్వైలైన్స్ నిర్వహిస్తామన్నారు. వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ నందన్, టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఉన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రాకారోత్సవం నెల్లూరు(బృందావనం): త్రయోదశి సందర్భంగా మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామివారికి చిన్నవెండినంది ప్రాకారోత్సవం వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివార్లను, నందీశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
తహసీల్దార్ పట్ల దురుసుగా ప్రవర్తించారని..
● రెవెన్యూ సిబ్బందికి, పోలీసులకు వివాదం నెల్లూరు(అర్బన్): రొట్టెల పండగ జరిగే బారాషహీద్ దర్గా ఆవరణాన్ని ఆనుకుని నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఉంది. తహసీల్దార్ కూడా దర్గా వద్ద విధుల్లో ఉన్నారు. అయితే ఏమి జరిగిందో ఏమో ఓ సీఐ విధి నిర్వహణలో ఉన్న తన పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించాడని తహసీల్దార్ సుధీర్ ఆరోపించారు. ఈ మేరకు కార్యాలయ రెవెన్యూ సిబ్బంది మొత్తం ఆందోళన చేసేందుకు దర్గా మొదటి గేటు వద్దకు చేరుకున్నారు. ప్రధాన గేటు వద్ద బైఠాయించేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన ఆర్డీఓ అనూష, ఏఎస్పీ అక్కడికి చేరుకుని పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. దీంతో తహసీల్దార్కు సంబంధిత సీఐ క్షమాపణ చెప్పడంతో గొడవ సర్దుమణిగింది. -
నరికేస్తాం.. తరలించేస్తాం..
వరికుంటపాడు: మండలంలోని తూర్పుకొండారెడ్డిపల్లిలో చెరువు అభివృద్ధికి ఎఫ్డీఆర్ పేరుతో రూ.4.70 లక్షల విలువైన కాంట్రాక్ట్ పనులు బీజేపీ నేతకు అప్పజెప్పారు. అదే అదనుగా సదరు వ్యక్తి చెరువు అభివృద్ధి పనులను గాలికొదిలేసి అవినీతి పనులకు పదునుపెట్టాడు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ వేప, నల్లతుమ్మ, తెల్లతుమ్మ చెట్లను నరికి వేస్తూ జేబులు నింపుకుంటున్నాడు. అంతటితో ఆగకుండా చెరువు కింద ఆయకట్టు కాలువ అభివృద్ధి అని చెప్పి కాలువకు రెండు వైపులా రూ.లక్షల విలువ చేసే టేకు, వేపచెట్లను తొలగించడం అతని అక్రమాలకు పరాకాష్టగా చేరింది. కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఇష్టానుసారంగా చెట్లను తొలగించడంపై పోలీస్స్టేషన్లో ఆ నాయకుడిపై గ్రామస్తులు, రైతులు ఫిర్యాదు చేశారు. తీవ్ర విమర్శలు తూర్పుకొండారెడ్డిపల్లి చెరువుతో పాటు పక్కన ఉండే చెట్ల నరికివేతపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు అభివృద్ధి పనులు చేస్తున్నారా లేక అవినీతి పనులు చేస్తున్నారా అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. చెరువు కట్టకు ఇరువైపులా ఉండే రైతుల పొలాల హద్దుల్లో సంవత్సరాల తరబడి చెట్లను కాపాడుకుని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా చెట్లను కొట్టడంపై శుక్రవారం గ్రామస్తులందరూ ఎదురు తిరిగి కర్ర తరలించకుండా అడ్డుకున్నారు. కాగా దీనిపై కూటమి నేతల్లో సైతం కుమ్ములాటకు దారితీస్తోంది. అభివృద్ధి ముసుగులో వాల్టా చట్టానికి తూట్లు ఇష్టానుసారంగా వృక్షాల నరికివేత రైతుల పొలాల్లోని టేకు చెట్లకు ఎసరు సదరు నేతపై పోలీసులకు ఫిర్యాదు కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు మూడు పువ్వులు, ఆరు కాయలు అనే చందంగా మారింది. చేపట్టే ప్రతి పనిలోనూ ఏదో ఒక విధంగా అక్రమాలకు తెరలేపుతున్నారు అధికార పార్టీ నేతలు. మండలంలోని తూర్పుకొండారెడ్డిపల్లిలో చెరువు అభివృద్ధి పేరుతో బీజేపీ నేత పక్కనే ఉన్న రైతుల పొలాల్లో ఉండే విలువైన టేకు చెట్లను సైతం కొట్టి తరలిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరకకూడదు తూర్పుకొండారెడ్డిపల్లి చెరువు కట్ట అభివృద్ధి కోసం రూ.4.75 లక్షల నిధులు కేటాయించాం. ఈ చెరువు కట్ట మీద జంగిల్ క్లియరెన్స్ చేయమని చెప్పాం. కానీ చెరువు లోపల ఉండే వేప, నల్లతుమ్మ చెట్లు నరికివేతపై మాకు సంబంధం లేదు. ఆ చెట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినది. రైతు పొలాల్లో ఉండే చెట్లు నరకకూడదు. – ఆది రమేష్, ఇన్చార్జి ఇరిగేషన్ ఏఈ -
తమిళ బోటు నిర్బంధం
● జువ్వలదిన్నె హార్బర్కు తరలింపు ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని నేలటూరుపాళెం సముద్ర తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో తమిళనాడుకు చెందిన మత్స్యకార పడవ అక్రమంగా చేపల వేటకొచ్చి స్థానిక మత్స్యకారుల వలలను కోస్తుండగా గస్తీ తిరుగుతున్న పోలీసులు నిర్బంధించారు. దుగరాజపట్నం కోస్టల్ సెక్యూరిటీ వివరాల మేరకు.. అక్రమ వేటకొచ్చిన తమిళ బోటు నేలటూరుపాళేనికి చెందిన మత్స్యకారుల వలలను కోయడంతో, ఇంజిన్ చిక్కుకొని కదల్లేని స్థితికి చేరుకుంది. అదే సమయంలో కృష్ణపట్నం సంయుక్త సముద్ర గస్తీ బృందం ఘటన స్థలానికి చేరుకొని పడవను అదుపులోకి తీసుకున్నారు. మత్స్యశాఖ అధికారులతో కలిసి తదుపరి చర్యల నిమిత్తం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు తరలించారు. -
రొట్టెల పండగకు వస్తూ విషాదం
● కారు అదుపుతప్పి యువకుడి మృతి ● మరో వ్యక్తికి తీవ్రగాయాలు మర్రిపాడు: అనంతపురానికి చెందిన నలుగురు మిత్రులు నెల్లూరు రొట్టెల పండగకు వస్తూ మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలోని శనివారం కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. నెల్లూరు బారాషహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగకు అనంతపురం నగరానికి చెందిన హరినాథ్, రఘునాథ్, నికిత్, సాయి(30) అనే స్నేహితులు కారులో బయలుదేరారు. చుంచులూరు వద్ద హైవేపై కారు డివైడర్ను ఢీకొనడంతో డ్రైవింగ్ చేస్తున్న సాయి అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రఘునాథ్ను ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. -
ఆనందాల కుటుంబంలో పుట్టెడు శోకం
● కొత్తకోడూరు బీచ్లో మునిగి బాలుడి మృతి, బాలిక గల్లంతు తోటపల్లిగూడూరు(పొదలకూరు): వారు ఎంతో ఆనందంతో నెల్లూరు రొట్టెల పండగకు వచ్చా రు. సముద్ర స్నానం చేద్దామని తోటపల్లిగూడూరు మండలం కొత్తకోడూరు బీచ్కు వెళ్లారు. సరదాగా నీటి లో మునుగుతూ అలల తాకిడికి ఆనందించారు. అంతలోనే ఆ కుటుంబంలోని బాలుడు అలల తాకిడికి మృతిచెందగా మరో బాలిక గల్లంతు కాగా ఓ బాలికను రక్షించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా సోమల మండలం కందుకూరు గ్రామానికి చెందిన మహ్మద్ రఫీ కుటుంబం శనివారం రొట్టెల పండగకు వచ్చారు. నెల్లూరులో రొట్టెలను పట్టుకుని సరదగా సముద్ర స్నానం చేసేందుకు కొత్తకోడూరు బీచ్కు వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానం చేస్తున్న మహ్మద్ సోఫియాన్(11), నఫీసా రుక్సానా, ముంతహిర సమీన్ అలల తాకిడికి గురయ్యారు. సోఫియాన్ మృతిచెందగా నఫిసా రుక్సాన గల్లంతయ్యారు. సమీన్ను అక్కడి వారు కాపాడారు. ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. రుక్సానా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి పోర్టు సీఐ రఘుబాబు, తోటపల్లిగూడూరు ఎస్సై వీరంద్రబాబు చేరుకుని విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనతో మహ్మద్ రఫీ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. గల్లంతైన రుక్సానా కోసం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. -
బతకాలని లేదు.. చావనివ్వండి
● పురుగు మందు తాగబోయిన వ్యక్తి ● సకాలంలో కాపాడిన పోలీసులు సీతారామపురం: జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగబోయిన వ్యక్తిని పోలీసులు కాపాడి కుటుంబసభ్యులకు అప్పగించిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనమ మేరకు.. మండలంలోని బసినేనిపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి సుబ్బారెడ్డి హైదరాబాద్లో రాపిడో డ్రైవరుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన భార్యతో విభేదించి స్వగ్రామమైన బసినేనిపల్లికి వచ్చాడు. అప్పసముద్రం వైపు వెళ్లి నిర్జీవ ప్రదేశంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని నిర్ణయించుకుని చివరిసారిగా తన తండ్రి రఘురామిరెడ్డికి విషయం చెప్పాడు. దీంతో ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించగా స్పందించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సుబ్బారెడ్డి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ప్రత్యేక వాహనంలో దాసరిపల్లి హైవే సమీపాన వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్న సుబ్బారెడ్డిని రక్షించారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బందిని పలువురు అభినందించారు. -
చుక్కల మందుతో భద్రత
● జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 2,67,750 మంది ● 6,656 పోలియో బూత్ల ఏర్పాటునెల్లూరు(అర్బన్): జిల్లాలో శిశు పక్షవాతం(పోలియో)ను నివారించేందుకు ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు పోలియో చుక్కల మందును వైద్యశాఖ ఆధ్వర్యంలో వేయనున్నారు. ఇటీవల ఇంటింటి సర్వే చేసి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోని చిన్నారులు జిల్లాలో 2,67,750 మంది ఉన్నట్టు వైద్యశాఖ లెక్కలు తేల్చింది. జిల్లాలో 52 పీహెచ్సీలు, 28 అర్బన్హెల్త్ సెంటర్లు, మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ట్రాన్సిట్ కేంద్రం పరిధిలో చుక్కల మందు వేస్తారు. మొత్తం 1,620 బూత్లతో పాటు 83 మొబైల్ బూత్లు, 88 ట్రాన్సిట్ బూత్లు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ బూత్లలో చుక్కల మందు వేసేందుకు 6,656 మందిని నియమించారు. అలాగే రూట్ సూపర్వైజర్లు 252 మందిని, మొబైల్ టీమ్స్లో 166 మందిని కలిపి మొత్తం 7,074 మంది సేవలందించనున్నారు. 5,206 వ్యాక్సిన్ క్యారియర్స్ను, 78 పెద్ద కోల్డ్ బాక్సులను ఏర్పాటు చేసి జాగ్రత్తగా పోలియో కేంద్రాలకు చేర్చారు. మొదటి రోజు పోలియో బూత్ల వద్ద చుక్కల మందువేస్తారు. మందు వేయించిన చిన్నారికి ఓటర్ లాగానే వేలికి సిరా చుక్క వేస్తారు. రెండోరోజు, మూడో రోజు ఇంటింటి సర్వే ద్వారా ఎక్కడైనా పిల్లలు మిగిలిపోయి ఉంటే వారికి కూడా చుక్కల మందు వేస్తారు. నగరంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
నిర్బంధం, దాడి అవాస్తవం
నెల్లూరు (క్రైమ్): వరికుంటపాడు మండలం గణేష్పురానికి చెందిన ఎస్. రవీంద్రరెడ్డిని కొండాపురం పోలీసులు అక్రమంగా నిర్బంధించి కొట్టారంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవమని కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ స్పష్టం చేశారు. శనివారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కలిగిరి సీఐ సుబ్బారావుతో కలిసి మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ రవీంద్రరెడ్డిపై కొండాపురం పోలీసుస్టేషన్లో రౌడీషీట్ ఉందనీ, ప్రతి ఆదివారం పోలీసుస్టేషన్లో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావడం లేదని, ఇదే సమయంలో నగదు తీసుకుని మోసగించాడంటూ ఒకరు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఎస్సై అతన్ని తీసుకురావాలని ఇద్దరు కానిస్టేబుల్స్ను పంపగా వారిపై రవీంద్రరెడ్డి దురుసుగా ప్రవర్తించారన్నారు. అనంతరం ఆయన్ను పోలీసుస్టేషన్కు తీసుకువచ్చి ఫిర్యాదుపై విచారించి, సత్ప్రవర్తనతో ఉండాలని స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి పంపించినట్లు తెలిపారు. -
కోర్కెలు తీరాలి.. మళ్లీ రావాలి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రొట్టెల పండగకు సర్వం సిద్ధమైంది. కోర్కెల రొట్టెల కోసం దేశ, విదేశాల నుంచి తరలివస్తున్నారు. భక్తజన తరంగాలతో స్వర్ణాల చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. శుక్రవారం నుంచి ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు పండగను అంగరంగవైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం కళకళలాడుతోంది. ఏర్పాట్లు పూర్తి సొందల్మాలిని శుక్రవారం.. గంధ మహోత్సవాన్ని శనివారం.. రొట్టెల పండగను ఆదివారం.. తహలీల్ ఫాతేహాను సోమవారం.. ముగింపు వేడుకలను మంగళవారం నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. పారిశుధ్యానికి పెద్ద పీటేస్తూ దాదాపు ఆరు వేల మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించేలా కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పోలీస్ యంత్రాంగం చేసింది. దర్గా ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. గజ ఈతగాళ్లతో నిరంతర గస్తీ స్వర్ణాల చెరువులో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలను మత్స్యశాఖ చేపట్టింది. 15 బోట్లు.. షిఫ్ట్కు 15 మంది చొప్పున మొత్తం 45 మంది గజ ఈతగాళ్లను నియమించారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి 125 మంది అగ్నిమాపక సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. రొట్టెలు మార్చుకుంటూ.. స్వర్ణాల చెరువులో కేరింతలు కొడుతూ.. రొట్టెల పండగకు సర్వం సిద్ధం నేటి నుంచి ఐదు రోజుల పాటు నిర్వహణ దేశ, విదేశాల నుంచి వస్తున్న భక్తజనం సందడిగా దర్గా ప్రాంగణం -
విద్యుత్ బిల్లులను నేడూ చెల్లించొచ్చు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం సెలవైనా జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథావిధిగా పనిచేయనున్నాయని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేశారని తెలిస్తే సదరు వైద్యులపై కఠిన చర్యలు చేపడతామని డీఎంహెచ్ఓ సుజాత స్పష్టం చేశారు. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై జిల్లా స్థాయి సలహా మండలి సభ్యులతో సంతపేటలోని డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ చట్టాన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ఉల్లంఘించారని తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1800 233 2447ను సంప్రదించాలని కోరారు. చట్టం కింద రిజిస్టరైన ప్రతి డాక్టర్.. గర్భిణులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఫారం – ఎఫ్లో తప్పక నమోదు చేయాలని కోరారు. చట్ట జిల్లా స్థాయి సలహా సంఘ చైర్పర్సన్ డాక్టర్ కిరణ్, పీడియాట్రిక్స్ అసోసియేషన్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసన్న, అనాటమీ అసోసియేట్ ప్రొఫెసర్ స్వర్ణారెడ్డి, డీఐఓ ఉమామహేశ్వరి, డెమో అధికారి కనకరత్నం, ఎన్జీఓలు కవితారెడ్డి, శ్రీనివాసరావు, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. మరోసారి ప్రభుత్వ భూముల ఆక్రమణ..? ● గతంలోనూ వివాదాలు మర్రిపాడు: మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ, కొండ పొరంబోకు భూముల ఆక్రమణలపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తగా, తాజాగా పెగళ్లపాడులోని సర్వే నంబర్ 6లో భూమిని చదును చేసి కబ్జాకు యత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 34 ఎకరాల పరిధిలోని భూమిలో 12 ఎకరాలను చదును చేసి ఆక్రమించేందుకు గ్రామానికి చెందిన డీలర్ దుద్దుకుంట శేఖర్ యత్నించారని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో సుమారు 12 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ భూములపై వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అప్పట్లో ఫిర్యాదు చేసినా, శాశ్వత చర్యలు కానరావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం ప్రత్యేక సర్వేను నిర్వహించి.. ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
రెప్పపాటులో ప్రమాదం.. మహిళ మృతి
● లారీని ఢీకొట్టిన ఆటో ● 10 మంది మహిళలకు తీవ్రగాయాలు మనుబోలు: ఆ మహిళలంతా ఇంటి నుంచి కూలీ పనికి బయలుదేరారు. అయితే హైవేపై లారీ ఆగి ఉంది. దీనిని ఆటో ఢీకొట్టడంతో ఓ మహిళ చనిపోయింది. మరో 10 మంది, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మనుబోలు మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారిపై పోలీస్స్టేషన్కు సమీపంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మడమనూరు సమీపంలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీకి గూడూరు మండలం చెన్నూరు నుంచి మహిళా కూలీలతో ఆటో వెళ్తోంది. పోలీస్స్టేషన్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సీహెచ్ సంతోషి, లక్ష్మి, టి.ఉష, ఎం.శివకుమారి, జి.సుజాత, పి.బుజ్జమ్మ, ఎస్కే హుస్సేన్బీ, కె.శ్రీలత, ఎం.మంగమ్మ, ఎస్కే జిలేఖ, విజయలక్ష్మి, డ్రైవర్ శివకుమార్ తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో మహిళలంతా చెల్లాచెదురుగా పడిపోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా కొద్దిసేపు భయానకంగా మారింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు, నెల్లూరులోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన గూడూరు మాళవ్యా నగర్కు చెందిన సీహెచ్ సంతోషి (26) నెల్లూరులో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈమెకు భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అడ్డదిడ్డంగా పార్కింగ్ మండల పరిధిలోని జాతీయ రహదారిపై పలుచోట్ల లారీలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. మనుబోలు బీసీ కాలనీ దారి, కాగితాలపూరు క్రాస్రోడ్డు, కొండూరుసత్రంలోని హోటళ్ల వద్ద నిత్యం రోడ్డుపైనే పదుల సంఖ్యలో లారీలు ఆపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగా బీసీ కాలనీ వద్ద ఈ పరిస్థితి ఉంది. దీంతో నిత్యం రద్దీ గా ఉండే హైవే ఇరుకుగా మారి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. లారీలను అడ్డదిడ్డంగా రోడ్డుపై నిలుపుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
రొట్టెల పండగకు ‘కూటమి’ రంగు
నేతల గుప్పెట్లో పండగ నెల్లూరు(బృందావనం): రొట్టెల పండగ. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఐదురోజులపాటు నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరుగుతుంది. అయితే పండగలో ‘కూటమి’ పెద్దల జోక్యం మితిమీరిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంప్రదాయాలు తెలిసిన వారిని దూరం పెట్టి రాజకీయంగా అనుకూలంగా ఉన్నవారికి బాధ్యతలు అప్పగించారనే అసంతృప్తి ముస్లిం సామాజిక వర్గంలో వ్యక్తమవుతోంది. అటు ఆర్థిక, ఇటు రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనలతో కొందరు కూటమి పెద్దలు చేసిన నిర్వాకం ఇప్పుడు చర్చకు దారి తీసింది. వారి తీరును ప్రశ్నిస్తే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని లోలోన మదనపడుతున్నారు. తమవారికే అవకాశం గతంలో సంప్రదాయాలపై అవగాహన ఉన్న 20 నుంచి 30 మంది సభ్యులతో ఫెస్టివల్ కమిటీలు ఏర్పాటు చేసి ఎలాంటి వివాదాలకు తావులేకుండా పండగ నిర్వహించేవారనేది కొందరి మతపెద్దలు మాట. ప్రస్తుతం రాజకీయ జోక్యం పెరగడంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కమిటీ ఏర్పాటులో తమ అనుయాయులకు, తమకు అనుకూలంగా ఉండేవారికి అవకాశాలు కల్పించారనే విమర్శలున్నాయి. పండగ నిర్వహణపై అవగాహన ఉన్నవారు ఉంటే లోటుపాట్లను ప్రశ్నించే అవకాశం ఉంటుందని, అయితే ఇలాంటి అవకాశం లేకుండా చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్, మతపెద్ద సయ్యద్ సమీ దర్గా సంప్రదాయాలు సక్రమంగా పాటించడం లేదని, ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయాల జోక్యం ఏమిటంటూ ప్రశ్నించడం దుమారం రేపింది. డిప్యూటీ మేయర్ దూరం రొట్టెల పండగ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశాలకు డిప్యూటీ మేయర్ తహసీన్ హాజరుకాకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కలెక్టర్, ఎస్పీ తదితరులతో జరిగిన సమావేశాల్లో మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అయితే ముస్లిం వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ను ఆహ్వానించారా? లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆహ్వానం ఉన్నప్పటికీ కొందరి ఆధిపత్య ధోరణుల కారణంగా ఆమె దూరంగా ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది. మితిమీరి.. ధార్మిక కార్యక్రమాల్లో కొందరు కూటమి నేతలు మితిమీరి రాజకీయ పెత్తనం చేయడం ముస్లిం వర్గాన్ని అసహనానికి గురిచేస్తోందని సమాచారం. రొట్టెల పండగలో గంధమహోత్సవం ప్రధాన ఘట్టం. 12 గంధం బిందెలుతో ఉత్సవం భక్తిప్రపత్తులతో వేడుకగా సాగుతుంది. గతేడాది ఏ మాత్రం అవగాహన లేని వారు గంధాన్ని లేపనం చేసి తమతో తీసుకెళ్లిపోయారన్న విమర్శలు వచ్చాయి. ఈ సంవత్సరం అటువంటి లోటుపాట్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భక్తిభావం, ధార్మిక కార్యక్రమాలపట్ల అవగాహన ఉన్న వారిని గంధ మహోత్సవానికి ఎంపిక చేస్తే బాగుంటుందని మతపెద్దలు ఆనాటి ఘటనలను గుర్తుచేసుకుని చెబుతున్నారు. కూటమి పెద్దలు తమకు అనుకూలమైన 12 మందిని గంధ మహోత్సవానికి ఎంపిక చేసే ప్రక్రియలో తలమునకలై ఉన్నారని సమాచారం. మితిమీరిన ఆయా పార్టీల పెద్దల జోక్యం సంప్రదాయాలు తెలిసిన వారిని దూరం పెట్టి.. అవగాహన లేని వారికి అందలం ప్రశ్నిస్తే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మౌనం బారాషహీద్ దర్గా రొట్టెల పండగను రాజకీయ నాయకులు తమ ఆధిపత్యంలోకి తీసుకున్నారని నెల్లూరు జిల్లా సాదత్ మషాయీఖ్ వెల్ఫేర్ కమిటీ (మహనీయులు పూర్వీకుల వంశావళి, పీఠాధిపతుల సంక్షేమ సంఘం) ఆందోళన వ్యక్తం చేసింది. సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, గంధ మహోత్సవం పవిత్రతను కూడా విస్మరిస్తున్నారని ఆరోపించింది. చిన్నబజార్లోని నెల్లూరు పెద్ద దర్గాలోని సయ్యద్ ఖాజాపీర్ మకాన్ అసార్ఘర్లో గురువారం పీఠాధిపతి కేఎస్ఎస్ బాబాసాహెబ్ బందానవాజ్, సాదత్ సయ్యద్ ఫయాజ్ రిజ్వీ, సర్దార్ హుస్సేన్ సాహిబ్, అబుల్ హసన్ హుస్సేన్ సాహిబ్, మౌలానా ఇస్తియాఖ్ అహ్మద్లు మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న రొట్టెల పండగ, బారాషహీద్ దర్గా గంధ మహోత్సవంలో స్థానిక మత పెద్దలు, సాదత్ పూర్వీకుల వంశావళి (మషాయీఖ్)కి తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతున్నప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఇష్టానుసారంగా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. -
అంతా గోప్యం..
● ఎస్ఐఆర్పై 11 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష ● మీడియాకు నో ఎంట్రీ నెల్లూరు(అర్బన్): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో బూత్ లెవల్ ఆఫీసర్లతో ఇంటింటి సర్వే జరుగుతోంది. దీనిపై సమీక్షించేందుకు గానూ 11 జిల్లాల కలెక్టర్లు, ఎంపిక చేసిన బీఎల్వోలతో కలెక్టరేట్లో సమావేశాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు గురువారం చేపట్టారు. ప్రకాశం, మార్కాపురం, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాలతో పాటు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషనర్ నవీన్కుమార్, రాష్ట్ర సీఈఓ వివేక్యాదవ్, కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు పాల్గొని.. ఇంటింటి సర్వేలో వస్తున్న ఇబ్బందులు, సమస్యలపై ఆరాతీశారు. విమర్శలు రాకుండా వాస్తవాలతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు సూచనలు చేశారు. ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం సర్వే వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు. వివరాలను బయటకు పొక్కనీయకుండా.. ఎస్ఐఆర్ పేరుతో కొన్ని వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమీక్షలో వివరాలు బయటకు పొక్కకుండా కలెక్టర్ హిమాన్షు శుక్లా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియాకు సమాచారం లేకుండా సమావేశాన్ని గో ప్యంగా నిర్వహించారు. బీఎల్వోలందర్నీ పిలవకుండా ఎంపిక చేసిన అతి కొద్ది మందినే ఆహ్వానించి క్షేత్రస్థాయిలో జరుగు తున్న సర్వే తీరును సమీక్షించారు. వివరాలను మీ డియాకు ఇవ్వొద్దంటూ సమాచార, పౌరసంబంధా ల శాఖను ఆదేశించారు. తమకు ఓట్లేయని వారి పే ర్లను జాబితా నుంచి తొలగించేలా అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కమిషన్ ద్వారా చేయిస్తున్నారంటూ ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ లాంటి వారు సభలు, సమావేశాల ద్వారా శాసీ్త్రయంగా ఆరోపిస్తున్నారు. సమావేశాలను రహస్యంగా జరపడాన్ని చూస్తే ఇలాంటి ఆరోపణలకు బలం చేకూరుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా పారదర్శకంగా సమీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. -
గరుడ వాహనంపై నారసింహుడు
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి మూలమూర్తి గురువారం చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలమూర్తికి ఎటువంటి ఆభరణాలు, పుష్పాలు లేకుండా చందనంతో అలంకరించారు. ఉదయం 8 గంటలకు స్వామి నిత్య కల్యాణ మండపంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి, ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వాతి నక్షత్రం కావడంతో స్వామికి శాంతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతిని జరిపించారు. అనంతంరం కల్యాణాన్ని కనులపండువగా చేశారు. రాత్రి స్వామి బంగారు గరుడ వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. -
నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు శుక్రవారం నుంచి జూలై 2వ తేదీ వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. గురువారం నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సామర్థ్యం, నిబంధనల అమలు, జాగ్రత్త, విద్యుత్ భద్రతను నిర్ధారించడం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ ప్రమాదాలను తగ్గించడం, వినియోగదారుల్లో భద్రతా అవగాహన పెంచడం వారోత్సవాల ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలోని అన్ని విద్యుత్ డివిజన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. విద్యుత్ పనులు చేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ, నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల నివారణకు ప్రజలు నాణ్యమైన విద్యుత్ వైర్లు వినియోగించాలని, విద్యుత్ లోడ్కు అనుగుణంగా పరికరాలు వాడాలని సూచించారు. దెబ్బతిన్న వైర్లు, పాత వైరింగ్ను మార్చుకోవాలని, ఎర్తింగ్ సదుపాయం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఏసీలు, ఇతర విద్యుత్ పరికరాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవడంతోపాటు లైసెన్స్ కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించుకోవాలని సూచించారు. వారోత్సవాల సందర్భంగా విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు భద్రతా చర్యలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. -
ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు
● జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 52 సర్వీసులు నెల్లూరు సిటీ: నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న రొట్టెల పండగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్ తెలిపారు. గురువారం ఆమె వివరాలు వెల్లడించారు. నెల్లూరు నుంచి కసుమూరుకు 20, రైల్వేస్టేషన్ నుంచి కసుమూరుకు 10, వెంకటాచలం నుంచి కసుమూరుకు 2, నెల్లూరు నుంచి ఏఎస్పేటకు 8, ఆత్మకూరు నుంచి ఏఎస్పేట మీదుగా నెల్లూరు వరకు 12 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సీ్త్ర శక్తి, దివ్యాంగ శక్తి పథకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ● రొట్టెల పండగకు వచ్చే భక్తుల కోసం నెల్లూరు నుంచి చైన్నెకి 2, బెంగళూరుకు 4, కడపకు 3, విజయవాడకు 5 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు షమీమ్ తెలిపారు. ఈనెల 28వ తేదీన ఏఎస్పేట నుంచి హైదరాబాద్కు 2, ఏఎస్పేట నుంచి బెంగళూరుకు 1 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు.కారు, ఆటో ఢీ ● ముగ్గురికి తీవ్రగాయాలు జలదంకి(కావలి): జలదంకి మండలం లింగరాజుఅగ్రహారం క్రాస్రోడ్డు వద్ద గురువారం కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. కావలి నుంచి జలదంకి మండలం నాగిరెడ్డిపాళేనికి ఇద్దరు మహిళా ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, జలదంకి మండలం బ్రాహ్మణక్రాక నుంచి కావలి వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలోని శాంతమ్మ, అలేఖ్య, డ్రైవర్ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. కారులోని ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఆటో మూడు భాగాలుగా విడిపోయి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా మారింది. మద్యం మత్తులో యువకుడి హల్చల్● జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం బుచ్చిరెడ్డిపాళెం: పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై గురువారం మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేసి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించాడు. ద్విచక్ర వాహనాన్ని రహదారిపై అడ్డంగా నిలిపివేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులతో అతను వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు కల్పించుకుని యువకుడిని శాంతింపజేయడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. -
అరాచకాలను గమనిస్తున్నారు..
బాబు పాలనలో కరువే.. ● రైతుల ప్రయోజనాలే లక్ష్యం ● లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● వందలాది మందితో సోమశిల జలాశయ సందర్శన ఆత్మకూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కమిటీ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను సాధించుకునేందుకు ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన చలో సోమశిల కార్యక్రమం విజయవంతమైంది. దీనికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కాకాణి మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందంతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి సీఎం మాటలతో ఈ విషయం తేటతెల్లమైందని చెప్పారు. దేశంలో చంద్రబాబు లాంటి రైతు ద్రోహి మరెవరూ ఉండరని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతాంగ ప్రయోజనాల కోసం జలయజ్ఞం పనులను దివంగత సీఎం వైఎస్సార్ చేపట్టారని గుర్తుచేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే మహోన్నత ఆశయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి గత సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసి రూ.3500 కోట్లను వెచ్చించి 50 శాతం మేర పూర్తి చేశారని వివరించారు. అయితే ఇది పూర్తయితే ఆయనకు ఎక్కడ మంచి పేరొస్తుందనే ఉద్దేశంతో నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇలాంటి చీకటి ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతూ భూసేకరణ చేస్తోందని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు దాని ఊసెత్తడంలేదని విమర్శించారు. రైతాంగం నష్టపోతే వారి శాపాలు బాబుకు తప్పవని స్పష్టం చేశారు. విడ్డూరంగా టీడీపీ నేతల వ్యాఖ్యలు పర్యావరణ అనుమతుల్లేవంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, అయితే ఎలాంటి పర్మిషన్లు లేకుండానే వివిధ రూపాల్లో ఎనిమిది టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోతుండటం వారికి కనిపించడంలేదానని ప్రశ్నించారు. నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణాన్ని గత సీఎం జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారని చెప్పారు. గత టీడీపీ పాలనలో సోమశిల జలాశయాన్ని 36 టీఎంసీలకు మించి నింపలేదని, అయితే ముంపు ప్రాంతాల వారికి నష్టపరిహారాన్ని దివంగత సీఎం వైఎస్సార్ చెల్లించి తొలిసారిగా 72 టీఎంసీలను నిల్వ చేశారని తెలిపారు. కూటమి రెండేళ్ల పాలనలో బ్యారేజీల పేర్లు తొలగించడం మినహా ఏమి చేశారని ప్రశ్నించారు. రైతులకు యూరియానే అందించలేని చంద్రబాబు.. భవిష్యత్తులో సాగునీటినీ ఇవ్వలేరని దుయ్యబట్టారు. ఉద్యమంలా వస్తున్న తమ పార్టీ శ్రేణులను అడ్డుకునేందుకు వందలాది మంది ఖాకీలను మోహరించారని, ఇలా చేస్తుండటంతోనే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దెబ్బతిని శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ను సాధించేంత వరకు పోరాటాలను చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్య, పార్టీ మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, పార్టీ మండల కన్వీనర్లు బిజివేముల పిచ్చిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీలు పద్మజారెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, రఘునాథరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి, కల్పనారెడ్డి, రహీం, కొప్పోలు వెంకటేశ్వర్లు, లింగాబత్తిన హరీష్, బాలఅంకయ్య, రాజశేఖర్రెడ్డి, వరప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసులు జలాశయ గేట్లను డీఎస్పీ వేణుగోపాల్, సీఐ గంగాధర్, పోలీసులు మూసేసి పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. జలాశయ మనుగడను కాపాడేందుకు.. లిఫ్ట్ ఇరిగేషన్ సాధన కోసమే చలో సోమశిల కార్యక్రమాన్ని చేపట్టామని నేతలు తెలిపారు. దీంతో కొద్ది మంది వెళ్లేందుకు అనుమతిచ్చారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా జై జగన్.. రైతు ద్రోహి చంద్రబాబు అని భారీగా నినాదాలు చేశారు. డ్యామ్ వద్దకు నేతలతో భారీగా చేరుకున్నారు. జలాశయ సందర్శనకు ర్యాలీగా వస్తున్న నేతలు బహిరంగ సభలో మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రాజెక్ట్ను సందర్శిస్తే ప్రభుత్వానికి నష్టమేమిటి..? కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పేర్కొన్నారు. రైతాంగానికి విఘాతం కలిగేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చంద్రబాబు గ్రహణం పట్టించారని ఆరోపించారు. దీన్ని నిర్వీర్యం చేస్తే కావలికి సాగునీరు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని సాధించుకునేందుకు పార్టీలకతీతంగా కృషి చేయాలని కోరారు. సోమశిల ప్రాజెక్ట్ను తాము సందర్శిస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని కాకాణి ప్రశ్నించారు. వారి చీకటి ఒప్పందాలను ప్రజల ముందుకు తెస్తున్నామనే భయంతోనే తమ గొంతు నొక్కేందుకు అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఇలాంటి అప్రజాస్వామిక ఆంక్షలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతు ద్రోహిగా మారిన చంద్రబాబును బ్రిటిష్ పాలకులను తరిమినట్లే రాష్ట్ర ప్రజలు త్వరలోనే తరిమికొడతారని పేర్కొన్నారు. రాయలసీమ అని ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కేవలం చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిందని, జిల్లాకు ఏమి ఉపయోగం ఉంటుందని కొందరు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు మేలు చేసింది వైఎస్సార్ కుటుంబమేనని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. బాబు పాలనలో కరువు కాచుకొని ఉంటుందని చెప్పారు. జలయజ్ఞం ద్వారా ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి.. సాగునీటిని అందించి పాడి పంటలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత దివంగత వైఎస్సార్కే దక్కుతుందని కొనియాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సోమశిల జలాశయానికి అదనపు జలాలొచ్చేలా గత సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నో చర్యలు చేపడితే, దాన్ని కూటమి ప్రభుత్వం నిలిపేయడం దారుణమని చెప్పారు. -
జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే
ముత్తుకూరు(పొదలకూరు): భారతమాల ప్రయోజన ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారి నిర్మాణానికి గురువారం గోపాలపురంలో అధికారులు సర్వే నిర్వహించారు. నారికేళపల్లి గ్రామం వద్ద నుంచి ముత్తుకూరు మీదుగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ గోపాలపురం, కృష్ణపట్నం పోర్టు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం సర్వే చేశారు. మండల సర్వేయర్ మస్తాన్, మరి కొందరు సహాయక బృందం సర్వేలో పాల్గొన్నారు. 5.175 కి.మీ మేరకు కృష్ణపట్నం పోర్టు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. గోపాలపురం ప్రాంతంలో రహదారి నిర్మాణానికి అధిక భాగం నివాస గృహాలు ఖాళీ చేయాల్సి వస్తుంది. స్లాబ్లతో కూడిన భవనాలు, రేకుల ఇళ్లు, ఖాళీ స్థలాలు, పంచాయతీ ఆస్తులు తదితర వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. మార్కెట్ ధరను బట్టి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుందని వెల్లడించారు. బాధితులు తమ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చన్నారు. పట్టా స్థలాలతో పాటు పోరంబోకు స్థలాల్లో ని నిర్మాణాలను కూడా అధికారులు పరిశీలించారు. -
1,743 మందితో భారీ బందోబస్తు
● 99 సీసీ కెమెరాలు, 26 డ్రోన్లతో పర్యవేక్షణ నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ నేపథ్యంలో ఎస్పీ అజిత వేజెండ్ల పర్యవేక్షణలో నగర ఏఎస్పీ దీక్ష బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాతోపాటు వివిధ జిల్లాకు చెందిన 1,743 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దర్గా ఆవరణలో పోలీసు అవుట్ పోస్టు పెట్టారు. దర్గా ఆవరణ, పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాల్లో 96 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది 24 గంటలూ దర్గా పరిసరాలను నిశితంగా పరిశీలించనున్నారు. 24 డ్రోన్లతో నిఘాను పటిష్టం చేశారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలుగకుండా మూడు ప్రధాన డైవర్షన్ పాయింట్లు, రెండు భారీ వాహనాల మళ్లింపు మార్గాలుు, 21 పార్కింగ్ ప్రాంతాలు, 20 మూవింగ్ పార్టీలు, 95 ట్రాఫిక్ నియంత్రణ పాయింట్లను ఏర్పాటు చేశారు. బట్వాడిపాళెం జంక్షన్, డీపీఓ పాయింట్, కేవీఆర్ జంక్షన్, పొదలకూరు రోడ్డు జంక్షన్ వద్ద బారికేడ్లను పెట్టారు. -
బరితెగిస్తున్న ఇసుకాసురులు
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇసుక, గ్రావెల్ మాఫియాలు చెలరేగిపోతున్నాయి. ఈ కోవలోనే జిల్లాలోని అనంతసాగరం మండలం పడమటి కంభంపాడులో గల పెన్నానదిలో ఇసుక రీచ్ను రాష్ట్రంలోనే తొలిసారిగా అనధికారంగా ప్రారంభించారు. నిత్యం భారీగా.. పడమటి కంభంపాడు అనధికార రీచ్లో పరిమితికి మించి నిత్యం వందల చొప్పున లారీలు, టిప్పర్లలో ఇసుకను లోడ్ చేయిస్తూ కొందరు టీడీపీ నేతలు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. లారీ కెపాసిటీని బట్టి పది చక్రాల వాహనానికి రూ.పది వేలు, 12 చక్రాల వాహనానికి సుమారు రూ.15 వేలను వసూలు చేస్తున్నారు. ఇక్కడి ఇసుకకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో మంచి డిమాండ్ ఉండటంతో భారీగా విక్రయించి వెనుకేసుకుంటున్నారు. దుర్భరంగా రోడ్లు మండల పరిధిలోని ఉప్పలపాడు చెరువుకట్ట నుంచి సోమశిల వరకు ప్రధాన రహదారి పూర్తిగా మట్టి రోడ్డుగా మారిపోయింది. ఇసుక లారీలు వందల సంఖ్యలో పరిమితికి మీరి అధిక టన్నేజీతో తిరుగుతుండటంతో ఈ దారంతా గుంతలమయంగా దర్శనమిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు సోమశిల వెళ్లే వీల్లేక ఆర్టిసీ బస్సులు నిలిచిపోయాయి. రహదారిని దుర్భరంగా మార్చిన వారిపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలానే వదిలేస్తే రీచ్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. పట్టించుకునేవారేరీ..? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోపే కొందరు పచ్చ నేతలకు రీచ్ను అనధికారికంగా అప్పగించి లోడింగ్ను అక్రమంగా ప్రారంభించారు. ఈ విషయం మీడియాలో బయటపడటంతో పార్టీ అధిష్టానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. అయితే వారు అధికారంలో ఉండటంతో ఏమీ చేయలేక నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలానే మరికొద్ది రోజులు సమీపంలో తవ్వుకుంటూ వెళ్తే జలాశయానికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని సమీప గ్రామాల వారు పేర్కొంటున్నారు. భారీ యంత్రాలతో.. పెన్నాలో ప్రస్తుతం హిటాచీ మెషీన్లను ఏర్పాటు చేసి భారీ లారీలు, టిప్పర్లకు లోడ్ చేస్తున్నా, కనీస చర్యలు కరువవుతున్నాయి. ముడుపులు అందుతుండటంతోనే జిల్లా మైనింగ్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వీటిని నిరోధించాలని కోరుతున్నారు. కాగా ఈ విషయమై తహసీల్దార్ వీరవసంతరావును సంప్రదించగా, ఆయన చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇసుక అక్రమ దందా రోజూ సాగుతుండగా, తమకు సమాచారం లేదని ఆయన బదులిచ్చారు. లక్షల టన్నుల అక్రమ రవాణా పేట్రేగిపోతున్న మాఫియా మట్టి రోడ్లుగా మారిన ప్రధాన రహదారులు రీచ్వైపు కన్నెత్తి చూడని అధికారులు పీకేపాడులో ఇదీ తీరు -
జీవనాడికి శాపం
నేడు చలో సోమశిల ● రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నెల్లూరు సస్యశ్యామలం ● ఈ ప్రాజెక్ట్ పూర్తయితే శ్రీశైలం ద్వారా రోజుకు 3 టీఎంసీలు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని జల ప్రాజెక్ట్ల అభివృద్ధిని పరుగులు పెట్టించి.. గంగమ్మను ఉరకలెత్తించి సస్యశ్యామలం చేస్తే.. చంద్రబాబు పాలనలో శాపంగా మారుతోంది. 1996 నుంచి 2026 వరకు ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారీ జల ప్రాజెక్ట్లకు గ్రహణం పట్టుకుంటుంది. చంద్రబాబు పాలనలో 35–40 టీఎంసీలకే పరిమితమైన సోమశిలను దివంగత వైఎస్సార్ జలయజ్ఞం ద్వారా 72 టీఎంసీల సామర్థ్యానికి పెంచితే.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 78 టీఎంసీలతో సమగ్ర సోమశిల కల సాకారమైంది. దివంగత వైఎస్సార్ హయాంలో ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణానది వరద నీటిని శ్రీశైలం డ్యాం ద్వారా రాయలసీమతోపాటు నెల్లూరుకు మళ్లించేందుకు ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటిని 44 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా కాలువలను ఆధునికీకరించారు. ఆ విధంగా కృష్ణమ్మను ఒడిసి పట్టి.. సోమశిలకు మళ్లించారు. ఆ నాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్తోపాటు కాలువలను అభివృద్ధి చేయకపోయి ఉంటే, నెల్లూరుతోపాటు రాయలసీమ సైతం ఎడారిగా మారేవి. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సోమశిల ప్రాజెక్ట్లకు సంబంధించి పెండింగ్ అటవీ భూములు, పరిహారాలు చెల్లింపులను క్లియర్ చేసి 78 టీఎంసీల కెపాసిటికి పెంచి సమగ్ర సోమశిలను సాకారం చేశారు. అదే సమయంలో వైఎస్సార్ హయాంలో శ్రీకారం చుట్టి సంగం, నెల్లూరు బ్యారేజీలను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ రెండేళ్ల కరోనా వంటి విపత్తును సైతం ఎదుర్కొని వీటిని పూర్తి చేసి రైతులకు అంకితం చేశారు. వీటితోపాటు సోమశిల–కండలేరు, కండలేరు– స్వర్ణముఖి కాలువ కెపాసిటీని రెట్టింపు చేశారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణతోపాటు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎత్తిపోతల పథకం వస్తే.. ముక్కారు పంటలే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతికూల పరిస్థితులనూ ఎదురించి దాదాపు 80 శాతం మేర పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపివేశారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించుకునే అవకాశం ఏర్పడేది. రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్లు, ఊరూరా చెరువులు జలకళతో నిండుకుండలా మారేవి. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. తెలుగుగంగ, ఎఫ్ఆర్సీసీ, గాలేరు, నగరి ఆయకట్టుకు సాగునీరు, చైన్నెకు తాగునీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే విడుదల చేయాలి. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్ట్లో 841 అడుగుల నీటిమట్టం వద్ద అమర్చారు. ప్రాజెక్ట్లో 841 అడుగుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంది. 2014–19 మధ్య కాలంలో చంద్రబాబు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వం తన ప్రాజెక్ట్ కాలువలను శ్రీశైలంలో 800 అడుగుట నీటి మట్టంలో నిర్మించారు. దీంతో ప్రాజెక్ట్లో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ నీటిని ఎలాంటి అవసరాలు లేనప్పటికీ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీలు, ఎస్ఎల్పీసీ నుంచి 0.5 టీఎంసీలు, పాలమూరు, రంగారెడ్డి, డీఎం ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరశి రోజుకు 6.95 టీఎంసీలు తరలించుకుపోతోంది. అయినా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. నెల్లూరు రూరల్: రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ గురువారం చలో సోమశిల ప్రాజెక్ట్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కన్వీనర్, మాజీమంత్రి సాకే శైలజానాథ్, మాజీ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డితోపాటు పలువురు సీమ నేతలు, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి సోమశిల ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ఏర్పాటు జరిగితే సీమ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లా రైతాంగానికి, ప్రజలకు ఎక్కువగా మేలుజరుగుతుందని, అలాంటి కీలకమైన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టడం వల్ల తీరని నష్టం జరగబోతోందని, అందువల్లనే వైఎస్సార్సీపీ రైతుల పక్షాన, ప్రజల పక్షాన పోరుబాట పట్టిందని కాకాణి పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు, ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చూడాలన్నారు. ఈ తరుణంలో ప్రాజెక్ట్లో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నిత్యం 3 టీఎంసీలు నీటిని తోడుకునే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూకుడుగా ఈ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. 20 శాతం పనులు జరిగిన సమయానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడంతో వ్యతిరేకించినప్పటికీ దాదాపు 80 శాతం పనులను పూర్తి చేశారు. ప్రభుత్వం మారడం ఈ ప్రాజెక్ట్కు శాపంగా పరిణమించింది. తీవ్ర వర్షాభావం నెలకొన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణతో పోటీగా కనీసం రోజుకు 3 టీఎంసీలు తరలించుకుంటే సీమ జిల్లాతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు జలకళతో విలసిల్లేవి. చంద్రబాబు ఈ పథకాన్ని పక్కన పెట్టడంతో ఈ ప్రాంతాలు కరువులో చిక్కుకునే ప్రమాదం ఉంది. సీమకు ద్రోహం.. -
సమన్వయకర్తలే టార్గెట్..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్సీపీ నేతలు రోడ్డెక్కితే.. కూటమి ప్రభుత్వానికి కూసాలు కదులుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ రెడ్బుక్ను అడ్డు పెట్టుకుని.. పోలీసులపై ఒత్తిళ్లు పెంచి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసుల పరంపర కొనసాగిస్తున్నారు. తండ్రీకొడుకుల అసమర్థ పాలనను ప్రశ్నించినా.. ఎన్నికల హామీలు, మోసాలు, వెన్నుపోట్లపై నిలదీసినా.. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై నిగ్గదీసినా కేసులే. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలను టార్గెట్ చేసి బనాయించిన అక్రమ కేసులకు లెక్కేలేదు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు చేసినా నేరంగా మారింది. రెడ్బుక్ రాజ్యంలో రాజ్యాంగం బందీ అధికార పార్టీ తన ప్రతీకార రెడ్బుక్ రాజకీయాలకు ఖాకీలను కవచంగా ఉపయోగించుకుంటోంది. ప్రశ్నించే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి కేసులను ఆయుధంగా చేసుకుని అణచివేయడం అప్రజాస్వామ పాలనకు అద్దం పడుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగం జిల్లాలో అపహాస్యం పాలవుతోంది. లోకేశ్ రెడ్బుక్ రాజ్యంలో రాజ్యాంగం బందీగా మారింది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు చేయడం కూడా నేరమన్నట్లుగా వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలను ప్రశ్నించడమే నేరం మెగా డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలను ప్రశ్నించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కుటుంబ సభ్యుల విద్యాసంస్థలపై దాడులకు చినబాబు రెడ్బుక్ ఉసిగొల్పింది. ఎమ్మెల్సీకి జరిగిన అన్యాయాన్ని వెలుగెత్తి చాటేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పార్టీ సమన్వయకర్తలపై మరోసారి రెడ్బుక్ రాజ్యాంగం అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి సంఘీభావంగా నెల్లూరు వీఆర్సీ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన ప్రదర్శించడం కూడా పెద్ద నేరమన్నట్లుగా ఒకే రోజు ఒకే ఘటనపై రెండు అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగిలింది. అందులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిని రెండు కేసుల్లో ఏ1గా ఉంచడం వెనుక రెడ్బుక్ కట్ర కోణం దాగి ఉంది. వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డిలను ఆ కేసుల్లో ఇరికించడం కూడా రెడ్బుక్ కుట్రకోణంలో భాగమేనని సృష్టమవుతోంది. ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు శాంతియుత నిరసనలు చేసినా నేరమే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు జిల్లాలో ఎనిమిది మంది వైఎస్సార్సీపీ సమన్వయకర్తలపై అక్రమ కేసులు జిల్లా అధ్యక్షుడు కాకాణిపై 26 అక్రమ కేసులు.. తాజాగా మరొకటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిపై ఒకే రోజు రెండు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల వ్యవధిలో జిల్లాలో వైఎస్సార్సీసీ సమన్వయకర్తలను టార్గెట్ చేశారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రశ్నించడమే నేరమైనట్లు, పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించడం అసాంఘిక కార్యక్రమైనట్లు అక్రమ కేసులు బనాయించడం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై 26 అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. మాజీ ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి మాజీ మంత్రులు అనిల్కుమార్యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డితోపాటు నెల్లూరు రూరల్, ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డిలపై అక్రమ కేసులు నమోదు చేశారు. -
దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు వినతి
● రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ● ఎస్పీకి వినతిపత్రం అందజేత నెల్లూరు(క్రైమ్): సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అజితకు వినతిపత్రాన్ని బుధవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా కొంతకాలంగా మధు, మనోహర్, హరీష్, శ్రీను, కిశోర్ తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, అవమానకర పోస్టులు పెడుతూ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. సదరు వ్యక్తులపై కావలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఈ నెల 14న ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాల ని కోరగా, ఎస్పీ సానుకూలంగా స్పందించారని వివరించారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు కావలి నియోజకవర్గంలో అధికార పార్టీ సాగిస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చెన్నాయపాళెం చెరువులో పగలూ, రాత్రనే తేడా లేకుండా వందలాది టిప్పర్ల్ల ద్వారా గ్రావెల్ను అక్రమార్కులు 20 రోజులుగా తరలిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కలెక్టర్ను గ్రామ రైతులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారని పేర్కొన్నారు. ఆర్డీఓతో మాట్లాడి తగు చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చినా, పరిస్థితిలో నేటికీ ఎలాంటి మార్పులేదని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో విషయాన్ని తన దృష్టికి తీసుకురాగా, ఆర్డీఓను కలిసి పరిస్థితిని వివరించామన్నారు. కావలి, మన్నంగిదిన్నె, బుడంగుంట చెరువులు, చింతలపాళెం తిప్ప ప్రాంతాల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాను అరికట్టాలని కోరామని తెలిపారు. మైనింగ్, విజిలెన్స్, ఇరిగేషన్ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రమేయం కారణంగా తామేమీ చేయలేమని కొందరు ఇరిగేషన్ అఽధికారులు చెప్పారని ఆరోపించారు. ఈ క్రమంలోనే టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకోగా జరిగిన ఘర్షణలో గ్రావెల్ మాఫియాపై చర్యలు చేపట్టకుండా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, మరో ముగ్గురిపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులను నమోదు చేశారని చెప్పారు. అక్రమాలు, అన్యాయాలను కట్టడి చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. కావలిలో అక్రమ కేసులు పరిపాటిగా మారాయని ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్ను గతంలో తాము ఖండించామని, ఈ వ్యవహారంలో కొందరు వీడియో తీయగా సంబంధం లేని తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. కొందరు మీడియా ప్రతినిధులు, నేతలపైనా కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. దగదర్తి మండలం బోడిగుడిపాడులో పంచాయతీ స్థల వివాదంలో కొందరిపై పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు దాడులు చేశారని, బాధితులు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపట్టాల్సిందిగా కోరామని పేర్కొన్నారు. పార్టీ కావలి పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, దగదర్తి మండల కన్వీనర్ వెలినేని మహేష్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కనమర్లపూడి వెంకటనారాయణ, అల్లూరు పంచాయతీ కన్వీనర్ దండే కృష్ణారెడ్డి, ఎస్సీ జిల్లా సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, కందుర్తి కామయ్య, గుడ్లూరు మాల్యాద్రి, చిన్న పుల్లయ్య, చిన్న ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. గిరిజన మహిళపై అమానుషం కావలిలోని 23వ వార్డులో గిరిజన మహిళను టీడీపీ నేతలు వివస్త్ర చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారనే విశ్వసనీయ సమాచారం తనకు ఉందని ప్రతాప్కుమార్రెడ్డి ఆరోపించారు. ఈ విషయం ఇంకా బయటకు పొక్కలేదని, జరిగిన దారుణం త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆయన చెప్పారు. -
డీ సెట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి
నెల్లూరు(అర్బన్): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ప్రవేశాలకు గానూ జూలై ఒకటిన నిర్వహించనున్న డీ సెట్కు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు చేసుకున్న 813 మంది అభ్యర్థులకు పరీక్షను పొట్టేపాళెంలోని అయాన్ డిజిటల్ సెంటర్, జై శ్రీరామ్ ఇన్ఫ్రా అండ్ ఐటీ సొల్యూషన్స్ కేంద్రాల్లో నిర్వహించనున్నామని వివరించారు. తమ అడ్మిట్ కార్డులను apdeecet. apcfss. in నుంచి డౌన్లోడ్ చేసుకోవాని కోరారు. వివరాలకు 94404 58428 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే జైలు.. నిరసన తెలిపితే నేరం..!
జిల్లాలో ప్రతిపక్ష నేతలపై కొనసాగుతున్న కేసుల పరంపర చూస్తుంటే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ హక్కులకు పోలీసులు కొత్త నిర్వచనం రచిస్తున్నారనిపిస్తోంది. అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపునకు పోలీస్ యంత్రాంగాన్ని పావుగా వాడుకుంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగం చట్టాలను పక్కన పెట్టి.. ప్రతిపక్ష నేతలపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఒక నిరసనకు రెండు పోలీస్స్టేషన్లలో వైఎస్సార్సీపీ కీలక నేతలపై కేసులు బనాయించడం ప్రతీకార రాజకీయం పరాకాష్టకు చేరిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక కేసులతో కట్టడి చేయాలనే ప్రయత్నాలు ప్రభుత్వ పాలకుల అసహనం, అసమర్థతకు నిదర్శనమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
రైల్లో బాల కార్మికుల తరలింపు
● సంరక్షించిన అధికారులు నెల్లూరు(క్రైమ్): బిహార్ రాష్ట్రానికి చెందిన బాలురను రైల్లో అక్రమంగా తరలిస్తుండగా రైల్వే పోలీసులు ఇతర శాఖలను సమన్వయం చేసుకుని మంగళవారం అర్ధరాత్రి సంరక్షించారు. వారి కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన బాలురను పనుల నిమిత్తం తమిళనాడు రాష్ట్రం ఈరోడ్కు అమృత్ భారత్ రైల్లో తరలిస్తున్నారని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మంగళవారం రాత్రి నెల్లూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించింది. రైల్వే డీఎస్పీ జి.మురళీధర్, సీఐ ఎ.సుధాకర్ నేతృత్వంలో నెల్లూరు, గూడూరు రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్, ఎహెచ్టీయూ, డీసీపీఓ సిబ్బంది బృందంగా ఏర్పడ్డారు. రైలు గూడూరులో ఆగగానే బృందం తనిఖీలు చేపట్టారు. నాయుడుపేటకు చేరుకునేలోపే వివిధ బోగీల్లో అక్రమంగా తరలిస్తున్న 14 మంది బాలురను సంరక్షించారు. వారిని పనుల నిమిత్తం ఈరోడ్కు తీసుకెళ్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ఎండీ అబ్బాస్, వాదూద్, మహబూబ్, నజీమ్, అబ్బాస్తోపాటు మరో ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు. బాలురను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచిన అనంతరం సంరక్షణ కేంద్రానికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఏజెంట్లను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. బుధవారం మురళీధర్ మాట్లాడుతూ ఒంగోలు, నెల్లూరు జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో 25 మంది బాలురను సంరక్షించి, 15 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశామన్నారు. తనిఖీల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని రైల్వే డీఐజీ సత్య ఏసుబాబు అభినందించారు. ‘సర్’లో చురుగ్గా పాల్గొనాలి : కలెక్టర్నెల్లూరు రూరల్: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమ పురోగతిపై కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులకు ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్ల తొలగింపు, పారదర్శకమైన జాబితా రూపొందించడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. డీఆర్వో విజయ్కుమార్, పార్టీల ప్రతినిధులు రసూల్, శ్రీనివాసులు, బాలసుధాకర్, శ్రీరామ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ పనులు చేస్తుండగా..● నాలుగో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి కోవూరు: మండలంలోని ఇనమడుగు గ్రామానికి చెందిన మావిళ్ల నరేష్ (37) ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి చనిపోయాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నరేష్ బుధవారం కోవూరులోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో లైటింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో కాలుజారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నరేష్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అటవీ ప్రాంతంలో మృతదేహం● ఊటుకూరు వాసిగా గుర్తింపు ● హత్యగా అనుమానం దుత్తలూరు: మండలంలోని బండకిందపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. బస్తాలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు చూసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది పోలీసులకు చెప్పారు. దీంతో ఉదయగిరి సీఐ వెంకట్రావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోనెసంచిలో వరిగడ్డి వేసి అందులో మృతదేహాన్ని ఉంచినట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ వచ్చి పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడిని వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన దేవరకొండ గోవిందులు (55)గా గుర్తించారు. అతను చనిపోయి లేదా హత్య చేయబడి నాలుగు నుంచి ఐదురోజులై ఉంటుందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక అందగానే మృతికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. బ్యాంక్లో షార్ట్ సర్క్యూటై ఫైళ్లు దగ్ధంకావలిరూరల్: పట్టణంలోని జేబీ కాలేజీ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బుధవారం షార్ట్ సర్క్యూటై ఫైళ్లు కాలిపోయాయి. సిబ్బంది కార్యాలయానికి ఉదయం 10 గంటలకు వచ్చారు. అప్పటికి విద్యుత్ సరఫరా లేదు. 10:40 గంటలకు కరెంట్ వచ్చింది. ఆ సమయంలో స్టోర్ రూమ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పాత ఫైళ్లు కొన్ని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే వచ్చి బ్యాంక్లో మంటలను ఆర్పి వేశారు. ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని స్టోర్ రూమ్లో అవసరం లేని పాత గోల్డ్ లోన్లు ఫైల్స్ మాత్రమే దగ్ధం అయ్యాయని మేనేజర్ సింగంశెట్టి ప్రియాంక తెలిపారు. ఏ విధమైన ఆస్తి నష్టం జరగలేదని, ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. -
గుండు చేస్తే రూ.400
● బారాషహీద్ దర్గాలో తలనీలాల పేరుతో దోపిడీ ● కమిటీ సభ్యుడికే బాధ్యతలునెల్లూరు(బారకాసు): దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న సామెతను నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఓ కమిటీ సభ్యుడు సీరియస్గా తీసుకున్నాడు. ఒక్కొక్కరికి గుండు చేసేందుకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా జరిగే రొట్టెల పండగకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. తమ కోర్కెలు తీరితే తలనీలాలు సమర్పిస్తామని అనేకమంది మొక్కుకుంటారు. దర్గా ప్రాంగణం మొత్తంగా ఒకేచోట తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ చెప్పిన మొత్తాన్ని భక్తులు ఇస్తేనే గుండు చేస్తారు. తమ వారికే.. రొట్టెల పండగ కోసమని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు తమ జేబులు నింపుకొనేందుకు ఒక్కొక్కరికి ఒక్కో అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా తలనీలాలు సమర్పించే ప్రత్యేక స్టాల్ను కమిటీలోని ఓ సభ్యుడికి అప్పగించారన్న ఆరోపణలున్నాయి. ఏడాదికి ఒకసారి జరిగే పండగ సమయంలో వచ్చిన అవకాశాన్ని వారు వదులుకోలేదు. ఈనెల 26వ తేదీ నుంచి రొట్టెల పండగ మొదలవుతుంది. అందుకు ముందు నుంచే ఈ దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించాలంటే ఒక్కొక్కరి నుంచి రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. లోకల్గా ఉన్న వారి నుంచి రూ.300, కమిటీ సభ్యులకు తెలిసిన వారైతే వారి నుంచి నామమాత్రం రుసుం ఇలా రకరకాలుగా తీసుకుంటున్నారు. ఐదు రోజులపాటు జరిగే పండగకు లక్షలాది మంది భక్తులు రానున్నారు. ఈ దోపిడీని అరికట్టాలని, నామమాత్రపు రుసుం వసూలు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
దొంగల హల్చల్
● జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు ● దగదర్తిలో నగదు, బంగారం, వెండి అపహరణ జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో దొంగలు హల్చల్ చేశారు. ఆలయాలు, ఇళ్లు, మద్యం షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. దగదర్తి: మండల కేంద్రమైన దగదర్తి మల్లయ్యమిట్ట ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన చోరీ కలకలం రేపింది. సుమారు రూ.4 లక్షల నగదు, ఏడు సవర్ల బంగారు నగలు, 750 గ్రాముల వెండి వస్తువులను చోరీ చేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. షేక్ అలీమ్ ప్రధాన రహదారి పక్కన నివాసం ఉంటూ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం అతని భార్య, కుమారుడు సమీపంలోని వెలుపొడు గ్రామానికి వెళ్లారు. అలీమ్ రాత్రి ఇంటి వద్ద నిద్రించే సమయంలో తలుపులకు తాళం వేయలేదు. బీరువా తాళాన్ని అక్కడే ఉంచి ఆరుబయట నిద్రపోయాడు. బుధవారం ఉదయం భార్య, కుమారుడు ఇంటికి చేరుకుని బీరువాను పరిశీలించగా అందులో ఉన్న నగదు, బంగారు నగలు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. డాగ్ స్క్వాడ్ను పిలిపించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు వైన్ షాపుల్లో.. దుత్తలూరు: మండల కేంద్రమైన దుత్తలూరులో రెండు వేర్వేరు చోట్ల ఉన్న వైన్ షాపుల్లో మంగళవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఒక దుకాణంలో రూ.లక్ష నగదు, మరో దుకాణంలో కొద్దిపాటి నగదు, మద్యాన్ని అపహరించారు. బుధవారం ఉదయం గమనించిన సిబ్బంది ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఆలయాల్లో.. వరికుంటపాడు: మండలంలోని తూర్పుచెన్నంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోరీలు జరిగాయి. స్థానికులు కథనం మేరకు.. రామాలయం, అంకాలమ్మ ఆలయాల్లో హుండీలను గుర్తుతెలియని దుండగులు పగులగొట్టారు. సుమారు రూ.10 వేల వరకు నగదును చోరీ చేశారు. గ్రామస్తుల సమాచారంతో ఎస్సై మధుసూదన్రావు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చోరీకి పాల్పడిన దొంగలను త్వరితగతిన గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు కోరారు. మండలంలో ఉండే 24 పంచాయతీల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. రూ.లక్షల విలువచేసే నగలు వెండి వస్తువులు చోరీకి గురవుతున్నాయి. అయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సవాలక్ష షరతులు..రాయితీలకు కొర్రీలు
సవాలక్ష షరతులు.. రాయితీలకు కొర్రీలు నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని ఉద్యాన రైతులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. ఉద్యాన తోటల పెంపకానికి విరివిగా ప్రోత్సాహకాలను అందజేస్తున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఉద్యాన సాగులో అత్యంత కీలకమైన పెంట్హౌస్లు, పందిళ్లు, షేడ్నెట్లు, డ్రై ప్లాట్ఫామ్స్, స్ప్రింక్లర్లు, స్ప్రేయర్లు వంటి మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం అరకొరగా నిధులను మంజూరు చేయగా వాటిని కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. సవాలక్ష ఆంక్షలతో కొర్రీలు పెట్టడంతో ప్రోత్సహకాలను రైతులు వినియోగించకోక నిధులు తిరిగి వెనక్కి వెళ్లినట్లు సమాచారం. కాగితాల్లోనే కేటాయింపులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉద్యానశాఖకు సుమారు రూ.12 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 4,812 మంది లబ్ధిదారులకు రూ.8.48 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన మొత్తం ఆర్థిక సంవత్సరం ముగియడంతో తిరిగి ఖజానాకు చేరిపోయాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.11.07 కోట్లు కేటాయించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మొదలై మూడు నెలలు గడచిపోతున్నా ఒక్క రైతుకు నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని ఉద్యాన రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మామిడి, నిమ్మ, బొప్పాయి, డ్రాగన్ఫ్రూట్, పూల తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ సాగుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు, ప్రోత్సాహం, యంత్ర సామగ్రి, శిక్షణ ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉద్యాన రైతులకు ఏ విధమైన ఆదరణ, భరోసా, సరైన మార్కెటింగ్ లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సాగుకు దూరమై.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పంటలు వేసుకుని పందిళ్లు నిర్మించుకుని చెట్లు బతికిన తర్వాత దశల వారీగా బిల్లులు అందజేస్తే అప్పుడు 50 శాతం సబ్సిడీ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో కుదేలవుతున్నారు. సాగుకు పెట్టుబడులు లేక పొలాలను సాగు చేయకుండా వదిలేయాల్సిన పరిస్థితులు ప్రస్తుత ప్రభుత్వంలో నెలకొన్నాయని ఎస్సీ, ఎస్టీ రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అర్హత గల ఉద్యాన రైతులు ఉన్నారు. అయినా గతేడాది కేవలం 4,812 మందికి 50 శాతం సబ్సిడీ రుణాలు అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకొందని రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఉద్యాన రైతులకు కూటమి మొండిచేయి గతేడాది జిల్లాకు రూ.12 కోట్లు మంజూరు అందులో రూ.3.52 కోట్లు వెనక్కి ఈ ఏడాది మూడు నెలలు గడిచినా అందని సాయం మొక్కలు బతికితేనే 50 శాతం సబ్సిడీ నిబంధన సాగుకు దూరమవుతున్న ఎస్సీ, ఎస్టీ రైతులుప్రోత్సాహం అందించాం 2025–26 ఆర్థిక సంవత్సతంలో 4,812 మంది లబ్ధిదారులకు ప్రోత్సాహం అందించాం. రూ.8.48 కోట్లు అచీవ్వెంట్ సాధించాం. ఈ ఏడాది రూ.11.07 కోట్ల నిధులు మంజూరయ్యాయి. – ఎంవీ సుబ్బారెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి -
మద్యం మత్తులో హల్చల్.. యువకులకు రిమాండ్
ఆత్మకూరు: పట్టణంలో మద్యం మత్తులో కత్తితో హల్చల్ చేస్తూ ఓ కుటుంబాన్ని బెదిరించిన నలుగురు యువకులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచగా 14 రోజులు రిమాండ్ విధించిందని సీఐ జీ గంగాధర్ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని జ్యోతినగర్కు చెందిన వై ఆదర్శ్, ఏసీఎస్ఆర్కాలనీకి చెందిన కత్తి సుమంత్, ఎల్ఆర్పల్లి ప్రాంతానికి చెందిన భవాని గోవింద్, నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన షేక్ సుహాన్బాబు సోమవారం సాయంత్రం మద్యం సేవించి 13వ వార్డులోని వెంకి అలియాస్ వెంకటేష్ ఇంటి వద్దకు వెళ్లి కత్తితో కుటుంబసభ్యులను బెదిరించారు. అనంతరం మద్యం షాపు వద్ద గొడవకు పాల్పడ్డారు. దీంతో యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిందని సీఐ తెలిపారు. ఆయన వెంట ఎస్సై జంపని కుమార్ ఉన్నారు. -
జీజీహెచ్లో రాబందుల రాజ్యం
నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రాబందుల రాజ్యం నడుస్తోంది. మార్చురీ విభాగంలో శవాలకు పోస్టుమార్టం చేసేందుకు సైతం బేరసారాలు సాగిస్తున్నారు. జీజీహెచ్లోని మార్చురీకి పోస్టుమార్టం కోసం వచ్చే మృతదేహాల్లో ప్రమాదాలకు గురైన, ఆత్మహత్యలు చేసుకున్నవే ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. అయితే మానవత్వంతో వ్యవహరించాల్సిన మార్చురీ సిబ్బంది పోస్టుమార్టం చేసేందుకు వేలాది రూపాయలను బాధిత బంధువుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి నుంచి లంచాలు వసూలు చేయడంపై ‘సాక్షి’లో జనవరి 23న ‘జీజీహెచ్లో రాబందులు’, మార్చిలో ‘మార్చురీలో రాబందులు’ అనే శీర్షికల తో కథనాలు వెలువడ్డాయి. పత్రికల్లో ఎన్ని కథనాలొచ్చినా మాకెందుకు భయం..సిగ్గు అన్న చందంగా మారింది మార్చురీ సిబ్బంది తీరు. తాజాగా దారా మల్లికార్జున అనే బాధితుడు తన నుంచి లంచాలు ఎలా వసూలు చేశారో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవికి మంగళవారం రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాకు వీడియోను సైతం విడుదల చేయడంతో మార్చురీలో లంచాల బాగోతం మరోమారు వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టానికి రూ.5,500 వసూలు కోవూరు మండలం జమ్మిపాళెం గ్రామానికి చెందిన మల్లికార్జున పెదనాన్న నాగభూషణం బైకు యాక్సిడెంట్కు గురయ్యాడు. సర్వజన ఆస్పత్రికి తీసుకుని రాగా అక్కడ మృతి చెందాడు. అయితే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో అటెండెంట్గా పనిచేసే ఒక ఉద్యోగి పెద్ద మొత్తంలో లంచం అడిగాడు. బేరసారాలు కుదిరాక రూ.2,500 నగదు రూపంలో ఇచ్చాడు. మిగిలిన నగదు చేతిలో లేకపోవడంతో సుధీర్ అనే అటెండెంట్ సూచించిన మేరకు గౌతమ్ అనే వ్యక్తికి రూ.3వేలు నగదును ఫోన్పే చేశాడు. ఈ విషయమై మల్లికార్జున ఆస్పతి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశాడు. తన లాగా మరొకరిని పీడించకూడదనే ఉద్దేశంతోనే ఫిర్యాదు చేస్తున్నానని బాధితుడు తెలిపారు. వేటుపడినా మారని తీరు గతంలో మార్చురీలో పని చేసే కొంతమంది డాక్టర్లు తమ కింది స్థాయి సిబ్బంది ద్వారా లంచాలు వసూలు చేసేవారు. అటెండెంట్ బాధితులను పీడించి వసూలు చేసిన సొమ్మును డాక్టర్లతో కలిసి పంచుకునేవారు. ఈ విషయమై ‘సాక్షి’లో కథనాలు రావడం, లంచాల గురించి ఇష్టం లేని ఒక డాక్టర్ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి సద రు వ్యక్తిని కలెక్టర్ సూచనతో ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఆ అటెండెంట్ కోర్టు కెళ్లి మళ్లీ తన ఉద్యోగం తెచ్చుకున్నాడు. అయితే సూపరింటెండెంట్ ఆరోపణలు వచ్చిన పాత స్థానంలోనే మళ్లీ పోస్టింగ్ ఇవ్వడంపై విమర్శలు జోరందుకున్నాయి. పని చేయని రెండు సీసీ కెమెరాలు మార్చురీలో లంచాల గోలపై స్పందించిన సూపరింటెండెంట్ ఇటీవల అక్కడ పదమూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. రెండు నెలలు గడవక ముందే కీలకమైన ప్రదేశంలో ఉండే రెండు కెమెరాలు పని చేయడం లేదు. లంచాల బాగోతం బయట పడుతుందనే వైర్లు కట్ చేసి పనిచేయకుండా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రి చైర్మన్ లేదా కలెక్టర్ స్పందించి మార్చురీలోని రాబందులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. పోస్టుమార్టంలో శవ బేరసారాలు మార్చురీ సిబ్బంది తీరుపై పలుమార్లు మీడియాలో కథనాలు అయినా తీరు మార్చుకోని వైనం బాధితుడి ఫిర్యాదుతో మరోమారు లంచాల వ్యవహారం వెలుగులోకి చోద్యం చూస్తున్న అధికారులు -
మామూళ్లు ఇచ్చుకో.. దోచుకో
సాక్షి టాస్క్ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ దోపిడీదారులు చెలరేగిపోతున్నారు. సర్వేపల్లి ముఖ్యనేత అండతో గ్రావెల్ను కొల్లగొడుతున్నారు. పగలు , రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా గ్రావెల్ను తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రవాణా, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు మామూళ్ల మత్తులో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే కంటేపల్లి వద్ద రైల్వే అభివృద్ధి పనుల్లో భాగంగా అండర్ బ్రిడ్జి వద్ద అడ్డుగా ఉన్న గ్రావెల్ను తరలిస్తున్న టిప్పర్లను పోలీసులు అడ్డుకుని పోలీస్స్టేషన్కు తరలించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, శ్రీకాంత్కాలనీ, నాగంబొట్లకండ్రిగ తదితర గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమ గ్రావెల్ రవాణా జరుగుతోంది. మైనింగ్ అనుమతులు లేకుండానే అక్రమంగా తవ్వకాలు చేస్తున్నా వారి జోలికి రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు వెళ్లడం లేదు. గ్రావెల్ మాఫియా నుంచి నెలనెలా మామూళ్లు అందడంతోనే పోలీసులు గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే నాలుగు రోజుల క్రితం కంటేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద ఉన్న గ్రావెల్ను తరలిస్తుంటే పోలీసులు అక్కడికి చేరుకుని మూడు టిప్పర్లను అడ్డుకుని వెంకటాచలం పోలీస్స్టేషన్కు తరలించారు. అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన గ్రావెల్ గుట్టలు నిర్మాణ పనులకు అడ్డుగా ఉండడంతో టిప్పర్ల ద్వారా బయటకు తరలిస్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పోలీస్స్టేషన్కు తరలించిన మూడు టిప్పర్లలో రెండింటిని వదిలేశారు. ఒక్క టిప్పర్ను మాత్రమే పోలీస్స్టేషన్లో ఉంచడంతో సదరు టిప్పర్ నిర్వాహకుడు పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ను తరలిస్తున్న టిప్పర్ల జోలికి వెళ్లకుండా, రైల్వే అండర్బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన గ్రావెల్ పనులకు అడ్డుగా ఉండడంతో బయటకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకోవడం వెనుక అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యనేత అండతో.. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు మండలాల్లో సర్వేపల్లి ముఖ్యనేత అండతో గ్రావెల్ దోపిడీ నిర్విరామంగా సాగుతోంది. మైనింగ్ అనుమతులు లేకుండానే కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్ సంపదను కొల్లగొట్టారు. ప్రస్తుతం వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, నాగంబొట్లకండ్రిగ, శ్రీకాంత్కాలనీలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్ రవాణాతో తమ గ్రామాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయని, తాము బతికేదెలాగా అని గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా గ్రావెల్ను తరలిస్తున్నారు. గ్రావెల్ టిప్పర్ల రద్దీతో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని నాగంబొట్లకండ్రిగ గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని బెదిరింపులకు గురిచేసి మరీ గ్రావెల్ రవాణా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సర్వేపల్లిలో చెలరేగిపోతున్న గ్రావెల్ మాఫియా ముఖ్యనేత అండతో రేయింబవళ్లు తరలింపు కన్నెత్తి చూడని రెవెన్యూ,పోలీసు అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు అడ్డుగా మట్టికుప్పలు తరలిస్తుండగా టిప్పర్లను పట్టుకున్న పోలీసులు వారి తీరుపై తీవ్ర విమర్శలు -
రూ.22.51 లక్షల ఉపాధి నిధుల స్వాహా
● ఎంపీడీఓ ఆఫీసు ఎదుట నల్లగొండ్ల, శంఖవరం గ్రామస్తుల ఆందోళన ● విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వింజమూరు(ఉదయగిరి):మండలంలోని నల్లగొండ్ల, శంఖవరం గ్రామాల్లో గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద నిర్మించిన పాఠశాలల ప్రహరీలను చూపి కొత్తగా ఎంబుక్లు నమోదు చేసి ఉపాధి నిధులు రూ.22.51 లక్షలు స్వాహా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల స్వాహాపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద నల్లగొండ్ల పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లుగా తెలిపారు. అందుకు సంబంధించి బిల్లులు కూడా మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రహరీని చూపి ఉపాధి నిధులు రూ.9.71 లక్షలు స్వాహా చేశారని ఆరోపించారు. అలాగే శంఖవరం ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీని చూపి మరో రూ.12.80 లక్షలను స్వాహా చేసినట్లుగా తెలిపారు. ఇందులో ఎంఈఓ కార్యాలయంలో పనిచేసే ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పాత్ర ఉందని, ఆయన తన భార్య ఖాతాలో రెండు గ్రామాలకు సంబంధించి రూ.22.51 లక్షల నగదును వేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై సర్వశిక్ష అభియాన్ ఏఈ కృష్ణారెడ్డిని తాము ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పారన్నారు. ఎంపీడీఓతో మాట్లాడగా 2020–21 సంవత్సరానికి సంబంధించిన పనులకు బిల్లులు చెల్లించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులు తమను కోరగా వాటికి ఆమోదం తెలిపానని, మిగిలిన విషయాలు ఆ శాఖ అధికారులకే తెలియాలని చెప్పారన్నారు. నిధులు దుర్వినియోగంపై కలెక్టర్ విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సెలవుల వేళ.. విషాద ప్రయాణం
● డివైడర్ను ఢీకొన్న కారు ● అందులో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ● ముగ్గురికి తీవ్రగాయాలు ● ఒకరి పరిస్థితి విషమం ప్రమాదంలో దెబ్బతిన్న కారు కొడవలూరు: ఆ ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు. సెలవుల్ని సరదాగా గడుపుదామని కారులో బయలుదేరారు. అయితే ఊహించని ప్రమాదం జరిగి ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొడవలూరు మండలం గండవరం ఫ్లయిఓవర్పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన శ్రీకంఠం, కార్తికేయ, సూళ్లూరుపేటకు చెందిన రుషికేష్ ఓంకార్, ఉరవకొండకు చెందిన సుశ్రిత, హైదరాబాద్కు చెందిన సాకేత్రెడ్డి పంజాబ్లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. వారంతా స్నేహితులు. మూడో సంవత్సరం పూర్తవ్వడంతో సెలవులిచ్చారు. దీంతో అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ బంధువులను కలుస్తూ ఆనందంగా గడపాలని కారులో బయలుదేరారు. సోమవారం నాటికి విజయవాడ చేరుకున్నారు. అక్కడ శ్రీకంఠం, కార్తికేయ ఇళ్లకు వెళ్లి సరదాగా గడిపి రాత్రి 8 గంటల ప్రాంతంలో సూళ్లూరుపేటకు బయలుదేరారు. అర్ధరాత్రి గండవరం ఫ్లయిఓవర్పై వేగంగా వస్తూ డివైడర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. కారు నడుపుతున్న రుషికేష్ ఓంకార్, ఇంకా సాకేత్రెడ్డి, శ్రీకంఠం తీవ్రంగా గాయపడ్డారు. సుశ్రిత, కార్తికేయ స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి 108 అంబులెన్స్ ఈఎంటీ విజయ్, పైలట్ అబుబాకర్ అత్యవసర వైద్య సేవలందించి నెల్లూరులోని అపోలో హాస్పిటల్కు తరలించారు. సాకేత్రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
రొట్టెల పండగకు పటిష్ట భద్రత
● ఎస్పీ అజిత నెల్లూరు(క్రైమ్): నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఈనెల 26 నుంచి జరిగే రొట్టెల పండగకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశించారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రొట్టెల పండగ బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఎస్పీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దర్గా ప్రాంగణంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అనుసంధానం చేయాలన్నారు. ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేసి నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. డాగ్స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో నిరంతర తనిఖీలు చేయలన్నారు. పోలీస్ సేవాదళ్ సభ్యులు వృద్ధులు, ప్రత్యేక అవసరాలున్న భక్తులు దర్గా సందర్శన, రొట్టెల మార్పిడికి సహాయం చేయాలన్నారు. స్వర్ణాల ఘాట్, బోటింగ్ పాయింట్ల వద్ద లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గంధం ఉరేగింపు, క్యూలైన్ల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఏఎస్పీ సీహెచ్ సౌజ న్య, నగర ఏఎస్పీ దీక్ష, దర్గామిట్ట ఇన్చార్జి ఇన్స్పెక్టర్ జీ వేణుగోపాల్రెడ్డి, సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి సెక్టార్ల వారీగా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ జోన్లు తదితరాలను వివరించారు. కసుమూరు దర్గా, మైపాడు, కోడూరు బీచ్ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్ డీఎస్పీ జీ శ్రీనివాసరావు తెలిపారు. ఏఆర్ ఏఎస్పీ అప్పారావు, ఆత్మకూరు, ఏఆర్, హోమ్గార్డ్స్ డీఎస్పీలు వేణుగోపాల్, చంద్రమోహన్, రామకృష్ణ, నెల్లూరు నగర, రూరల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
గంజాయి, మద్యం మత్తులో యువకుల వీరంగం
ఆత్మకూరు: పట్టణంలో గంజాయి, మద్యం మత్తులో యువకులు వీరంగం చేయడం పరిపాటిగా మారింది. సోమవారం 13వ వార్డులోని ఓ ఇంట్లోకి చొరబడి నలుగురు యువకులు గంజాయి మత్తులో కుటుంబ సభ్యులను కత్తితో బెదిరిస్తూ నానా దుర్భాషలాడారు. వారు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపైన దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. 13వ వార్డు దళితకాలనీ ప్రాంతంలో వెంకి అలియాస్ వెంకటేశ్వర్లు ఇంట్లోకి ఆదర్శ్, సుమంత్, బాబు, గోవింద్ అనే నలుగురు యువకులు మధ్యాహ్నంత 3.30 గంటల సమయంలో చొరబడ్డారు. ఇద్దరు లోపలికి వెళ్లగా మరో ఇద్దరు బయట ఉన్నారు. వెంకిని బయటకు రావాలని బెదిరించారు. అతను ఇంటి వద్ద లేడని మహిళలు చెబుతున్నా వినిపించుకోకుండా కత్తితో బెదిరిస్తూ నానా దుర్భాషలాడారు. వెంకి కనిపిస్తే ఇక్కడే చంపేస్తామంటూ వీరంగం చేశారు. ఇంట్లోని మహిళలు తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు. కొద్ది సేపటికి నలుగురు వెళ్లిపోయారు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి వద్ద నుంచి వచ్చిన నలుగురు యువకులు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని మద్యం దుకాణంలో ఉండగా ఇద్దరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. అయితే సుమంత్, ఆదర్శ్ వారిపై తిరగబడ్డారు. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకుని చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాబు తప్పించుకున్నాడు. పట్టుబడిన గోవింద్, ఆదర్శ్, సుమంత్ను స్టేషన్కు తరలించారు. కాగా ఈ నెల మొదటి వారంలో ఏసీఎస్ఆర్కాలనీలో ఓ యువకుడు గంజాయి మత్తులో స్థానిక వ్యక్తిని బీరు బాటిల్తో తలపై గాయపరిచాడు. రెండు నెలల క్రితం టిడ్కో భవనాల్లో నివశిస్తున్న ఓ యువకుడు గంజాయి మత్తులో తండ్రిపై దాడి చేసి గాయపరిచాడు. ఓ ఇంటి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి యత్నం వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే తిరగబడి దాడి ఎట్టకేలకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై కక్ష సాధింపు
కూటమి ప్రభుత్వా న్ని ప్రశ్నించిన వారి పై, దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం పరిపాటిగా మారింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి వంటి సౌమ్యుడిని సైతం రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొనలేక తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ అడ్డదారులు తొక్కడం సిగ్గు చేటు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలను, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారీ మరింత దిగజారి ప్రవర్తించడం తండ్రీకొడులకు అలవాటుగా మారింది. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కృష్ణచైతన్య విద్యాసంస్థలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గం. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. ఎంతో మంది అనాథ పిల్లలకు, ఫీజులు కట్టలేని పేద విద్యార్థులకు చంద్రశేఖర్రెడ్డి కృష్ణచైతన్య విద్యాసంస్థలు ఉచితంగా విద్యను అందించి అండగా నిలిచింది. ఇది కేవలం ఒక సంస్థపై జరిగిన దాడి కాదు. ప్రశ్నించే గొంతులపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, వైఎస్సార్సీపీపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. – కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి -
యోగా పోస్టర్ విజేతలకు బహుమతుల ప్రదానం
నెల్లూరు(టౌన్): జిల్లా స్థాయి యోగా పోస్టర్ పోటీల్లో విజేతలకు సోమవారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేశారు. డీఈఓ బాలాజీరావు చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కావలి పాతూరు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి బున్సి సుదేశ్ ప్రథమ బహుమతి, మనుబోలు మండలం వీరంపల్లి జెడ్పీహెచ్ఎస్కు చెందిన అలకానంద ద్వితీయ స్థానాన్ని, ఇందుకూరుపేట ఎంకేఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థి వాహిద్ తృతీయ స్థానాన్ని సాధించారు. విజేతలకు వరుసగా రూ.1000, రూ.750, రూ.500 నగదు బహుమతులతోపాటు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు, యోగ్యతా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనధికార మద్యం విక్రయాలపై దాడులు● 36 కేసుల నమోదు ● ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసులు నాయుడు నెల్లూరు(క్రైమ్): ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా వారం రోజులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ.శ్రీనివాసులు నాయుడు తెలిపారు. తనిఖీల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. అక్రమంగా మద్యం నిల్వచేసి విక్రయిస్తున్న 36 మందిని అరెస్ట్ చేసి 280 క్వార్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 67 మందిని అరెస్ట్చేశామని చెప్పారు. బహిరంగ మద్యసేవనాన్ని కట్టడి చేసేందుకు రూపొందించిన పోస్టర్లను జిల్లాలోని ప్రధాన కూడళ్లు, మద్యం దుకాణాల వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు, మాదకద్రవ్యాలపై ఇతర శాఖల సమన్వయంతో కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తునామన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అనధికార మద్యం విక్రయాలు, అక్రమ నిల్వలు, ఇతర ఎకై ్సజ్ నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప ఎకై ్సజ్ అధికారులకు లేదా టోల్ఫ్రీ నంబర్ 14405కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. యువకుడి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జనశక్తినగర్కు చెందిన అఖిల్ కుమార్ (27), ప ర్వీన్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అఖిల్ ఓ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను ఓ మహిళతో మాట్లాడుతున్నాడని దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈనెల 17వ తేదీన పర్వీన్ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అఖిల్ ఆదివారం సాయంత్రం భార్యకు ఫోన్ చేశాడు. వారిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అఖిల్ తన బెడ్రూమ్లో సీలింగ్కు ఉన్న ఇనుప పైపునకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వినతుల వెల్లువ
● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 162 మంది తమ సమస్యలను ఎస్పీ అజిత వేజెండ్ల దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను విన్న ఆమె ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్, ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, ఎన్.రామారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● అల్లూరు ప్రాంతానికి చెందిన వాణి, సుధామోహన్, జగదీష్ నాకు పరిచయమయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తానని, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించి రూ.18 లక్షలు తీసుకుని మోసగించారు. నగదు అడుగుతుంటే చంపుతామని బెదిరిస్తున్నారని చిల్లకూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● గతేడాది డిసెంబర్లో నా భర్త మోటార్బైక్పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్ర గాయపడ్డాడు. ప్రమాద ఘటనపై సమగ్రదర్యాప్తు జరిపి న్యాయం చేయాలని మర్రిపాడు ప్రాంతానికి చెందిన వివాహిత కోరారు. ● భర్త, అత్తమామలు అదనపుకట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు ఇంటి నుంచి గెంటేశారు. విచారించి న్యాయం చేయాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ వివాహిత వినితపత్రం ఇచ్చారు. ● వెంకటరమణయ్య అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. దగదర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసును రాజీచేసుకోవాలని వెంకటరమణయ్య బెదిరిస్తున్నాడు. తగిన చర్యలు తీసుకోవాలని దగదర్తి ప్రాంతానికి చెందిన ఓ మహిళ కోరారు. ● నా భర్త విజయ్ ఒకటిన్నర నెల నుంచి కనిపించడం లేదు. చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారణ వేగవంతం చేసి భర్త ఆచూకీ కనుక్కోవాలని వివాహిత అర్జీ సమ ర్పించారు. -
డీఎస్సీపై ప్రశ్నించినందుకే దాడులు
చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని చంద్రశేఖర్రెడ్డి ఆధారాలతో ప్రశ్నిస్తున్నందుకే కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మేము తప్పు చేస్తాం. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ఇబ్బందులకు గురిచేస్తాం.. భయపెడతాం.. వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తాం అనే ధోరణితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేశ్ బెదిరింపులకు ఎవరూ భయపడేవాళ్లు లేరు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, రాబోవు ఎన్నికల్లో మీకు బుద్ధి చెబుతారు. ఇది కేవలం చంద్రశేఖర్రెడ్డికి సంబంధించిన విద్యాసంస్థల సమస్య మాత్రమే కాదు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన విషయం. కూటమి నాయకులను ప్రశ్నించారని, రాజకీయ కక్షలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం. కాలేజీలను నిజంగానే సంస్కరించాలి అనుకుంటే, ముందు నారాయణ విద్యాసంస్థలను సంస్కరించేందుకు చర్యలు చేపట్టాలి. కృష్ణచైతన్య కాలేజీల్లో ఎలాంటి తప్పులూ లేవు. చంద్రశేఖర్రెడ్డిని ఎదుర్కొనలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారు.– కాకాణి పూజిత, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ -
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
– రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందు నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహించి ఆ తర్వాత చంద్రశేఖరరెడ్డి కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాలి. నియమ నిబద్ధతతో విద్యాసంస్థలు నడుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి కళాశాలల్లో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించడం రాజకీయ విద్వేషంగా భావిస్తున్నాం. అలవికాని హామీలిచ్చారు. అమలు చేయలేక.. ప్రజా వ్యతిరేకతను అణచివేసేందుకు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్ట్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ డీఎస్సీ స్కామ్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. లేకుంటే బాధ్యత వహించి రాజీనామా చేయాలి. -
తప్పుల మీద తప్పులు చేస్తున్నారు
– కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వం ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు తప్పుపై తప్పులు చేస్తుంది. 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేసింది. డీఎస్సీ అవినీతి, అక్రమాలపై సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తున్న తమ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి చెందిన కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి భయాందోళనలకు గురి చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు భయపడే వారెవరూ మా పార్టీలో లేరు. రాష్ట్రంలో ప్రతి రంగంలో అవినీతి పెరిగిపోయింది. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన బాబు ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమైంది. -
ఆర్టీసీని ప్రైవేట్పరం చేయొద్దు
● కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ టీయూసీ నిరసన నెల్లూరురూరల్: ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేట్పరం చేయొద్దని వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జయకుమార్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలు రోజూ ఆర్టీసీ సేవలపై ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ప్రైవేటీకరణ అమలైతే మారుమూల ప్రాంతాలకు రవాణా సేవలు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్రయాణ చార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సామాజిక రవాణా సేవలు దెబ్బతింటాయని, వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కంటే లాభాపేక్షకు ప్రాధాన్యం పెరిగే ప్రమాదం ఉందని, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తదితర వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేయడంతోపాటు సిబ్బంది నియామకాలు చేపట్టి, ఆధునిక సౌకర్యాలతో సంస్థను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు నవీకుమార్రెడ్డి, చెన్నారెడ్డి, పరంధామయ్య, వంశీ, శ్రీకాంత్, పెంచలయ్య, నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. -
డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి
– వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ డీఎస్సీలో అక్రమాలు, అవినీతి జరగకుంటే వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలి. ఆ డీఎస్సీలో జరిగిన కుంభకోణాలను వెల్లడించారనే తమ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దుర్మార్గం. నెల్లూరు నగరంలో 70 జూనియర్ కళాశాలలుంటే కేవలం చంద్రశేఖర్రెడ్డికి చెందిన జూనియర్ కళాశాలలపై దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై గళం విప్పుతున్న వారి వ్యక్తిగత వ్యాపారాలు, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. -
హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్
– రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ప్రజావ్యతిరేకతను తట్టుకోలేక చంద్రబాబు, లోకేశ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెండేళ్లుగా కూటమి చేసిన మోసాలు, వెన్నుపోట్లను, డీఎస్సీ అక్రమాలను, అమరావతి భూ కుంభకోణాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలని, ప్రశ్నించిన గొంతులను నొక్కాలని చూస్తున్నారు. డీఎస్సీ స్కామ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మకం. విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ అసమర్థుడు. నీతి నిజాయితీ ఉంటే తన శాఖలో జరిగిన కుంభకోణానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. -
ఆలకించండి.. పరిష్కరించండి
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● సమస్యలు విన్నవించిన అర్జీదారులు నెల్లూరురూరల్: ‘సార్.. మేం చాలాదూరం నుంచి వచ్చాం. మా వినతులు పరిశీలించి న్యాయం చేయండి’ అంటూ ప్రజలు వేడుకున్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో సోమవారం ప్రజాసస్యల పరిష్కారవేదిక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ పవన్తేజ, తెలుగుగంగ ప్రత్యేకాధికారులు కేశవర్ధన్రెడ్డి, వంశీకృష్ణ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జీవనాధారం తీసేస్తున్నారు తమ కుటుంబ జీవనాధారమైన వ్యవసాయ భూమికి నీటి వసతి లేకుండా చేస్తున్నారని చేజర్ల మండలం రెడ్డివారి కండ్రిక గ్రామానికి చెందిన లెక్కల మాలకొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు అర్జీ ఇచ్చిన అనంతరం మాట్లాడారు. తమ 20 ఎకరాల వ్యవసాయ భూమి నుంచి సుమారు 25 ఏళ్ల క్రితం సోమశిల కాలువ వెళ్లిందని, అప్పటి నుంచి కాలువపై పైపులు ఏర్పాటు చేసుకుని నీటిని వినియోగిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నామని తెలిపారు. టీడీపీకి చెందిన వ్యక్తులు డీఈపై ఒత్తిడి తెచ్చి పైపులు తీయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు సూచనల మేరకే పైపులు ఏర్పాటు చేసుకున్నామని, వాటి వల్ల ఇతర రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. రాజకీయ కారణాలతో వ్యవసాయానికి అడ్డంకులు సృష్టించకుండా అధికారులు స్పందించి, తమకు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. డీఎస్సీలో అక్రమాలపై విచారణకు డిమాండ్ డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి షేక్ మున్నా డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనలు, అనుమానాలను నివృత్తి చేసి అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. ని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అన్ని ఉద్యోగ నియామకాలను ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే నిరుద్యోగ యువతకు అండగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పునరావాసం కోసం ఎదురుచూపులు కండలేరు ముంపు గ్రామమైన వండ్లూరు ప్రజలకు తక్షణమే పునరావాసం కల్పించాలని బీజేపీ నాయకుడు మిడతల రమేష్ డిమాండ్ చేశారు. బాధితులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ముంపు బాధితులకు సరైన పునరావాసం కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన కొందరికి ప్లాట్లు కేటాయించినప్పటికీ, కండలేరు జలాశయంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు, దళితులు, బీసీ వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ముంపు బాధితులతో కలిసి రాష్ట్ర రాజధానిలో అధికారులను కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. -
డీఎస్సీ కుంభకోణాన్ని ప్రశ్నించడమే నేరం
● ప్రజాదరణను ఓర్వలేకనే దాడులు ● కక్ష సాధింపు చర్యలను దీటుగా ఎదుర్కొంటాం ● రాజకీయంగా ఎదుర్కోలేకనే అడ్డదారులు తొక్కుతున్న కూటమి నేతలు ● కృష్ణచైతన్య విద్యాసంస్థల్లో అర్ధరాత్రి తనిఖీలను ముక్తఖంఠంతో ఖండించిన ఎమ్మెల్సీలు ● కదం తొక్కిన పార్టీ శ్రేణులు సాక్షిప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల వెన్నుపోటు, మోసాలు, అసమర్థ పాలన, మెగా డీఎస్సీ పేరుతో సాగించిన కుంభకోణంపై ప్రశ్నించడమే నేరమన్నట్లుగా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేయడాన్ని ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులతో కలిసి నెల్లూరులో కదం తొక్కారు. డీఎస్సీ కుంభకోణంపై సాక్ష్యాధారాలతో ప్రశ్నించిన ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థలపై ఇంటర్బోర్డు అధికారులు తనిఖీలు చేయడం, అనుమతుల పేరుతో వేధింపులకు దిగిన నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలు 18 మంది సర్కారు దమననీతిపై దండయాత్ర చేశారు. సోమవారం చిల్డ్రన్స్పార్కు రోడ్డులోని రాంజీనగర్లోని చంద్రశేఖర్రెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ర్యాలీగా వీఆర్సీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శనగా కొనసాగారు. నల్లకండువాలు ధరించి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఫ్లకార్డులు, బ్యానర్లు చేతబూని ప్రభుత్వ దుర్నీతిని, దమన కాండలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలతో నిరసనను వ్యక్తం చేశారు.ఽ ఈ క్రమంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, కేఆర్జే భరత్, శివరామిరెడ్డి, ఈసాక్బాషా, ఆర్ రమేష్యాదవ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేరిగ మురళీధర్, ఎన్. రామారావు, ఎం హనుమంతరావు, ఎండీ రూహుల్లా, డాక్టర్ ఎం.అరుణకుమార్, కవురు శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, మేకపాటి రాజారెడ్డి, నాయకులు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, మందల శేషయ్య, ఆశ్రిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నారాయణ విద్యాసంస్థలపై దాడులు చేసే ధైర్యం ఉందా
ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కొ నే దమ్ము, ధైర్యం చంద్రబాబు, లోకేశ్లకు లేదు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడడం దుర్మార్గం. డీఎస్పీ అక్రమాలను ప్రశ్నించిన తమ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో తనిఖీలు, ఆకస్మిక దాడులు చేస్తున్నారు. చంద్రశేఖర్రెడ్డి విద్యాసంస్థలపై జరిగిన దాడులను తమ పార్టీపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారం చేపడితే తాము కూడా ఇదే ఒరవడి, సంప్రదాయం కొనసాగిస్తే కూటమి నాయకులు తట్టుకోలేరు. విద్యాశాఖ మంత్రి లోకేశ్కు చిత్తశుద్ధి ఉంటే వందల సంఖ్యలో ఉన్న నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలపై దాడులు చేసే ధైర్యం చేయాలి. అక్రమంగా నిర్వహిస్తున్న హాస్టళ్లపై తనిఖీలు ఎందుకు జరపడం లేదు. ప్రశ్నించిన వారిపై అకమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. – లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ -
కక్ష పూరితంగా అక్రమ తనిఖీలు
– తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనను, అవినీతి, అక్రమాలు ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. డీఎస్సీ అక్రమాలను నిగ్గదీసి ప్రశ్నించినందుకే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విద్యా సంస్థల్లో రాజకీయ కక్ష పూరితంగా తనిఖీలు చేశారు. చంద్రశేఖరరెడ్డి నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో ఎంతో మంది పేదలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థల్లో ఒక్కరికై నా ఉచితంగా చదువు చెప్పారా? కందుకూరు నియోజక వర్గంలోఒక మహిళ నుంచి రూ.15 లక్షలు తీసుకుని డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు. నా వద్ద బ్యాంకు స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. డీఎస్సీలో అడ్డగోలుగా ఉద్యోగాలు అమ్ముకున్నారు. కూటమి ప్రభుత్వ అక్రమాలను ఎండగడతాం. -
తురిమెర్లలో మహిళపై దాడి
దగదర్తి: మండలంలోని తురిమెర్లలో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీలో నమోదైంది. సోషల్ మీడియాలో వైరలైంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు సోమవారం వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కొల్లి కామేశ్వరమ్మ ఆదివారం మధ్యాహ్నం తన గేదెలను మేతకు తీసుకెళ్తోంది. ఈ సమయంలో ఘటాల కొండయ్య ఇంటి ప్రహరీని గేదెలు రాసుకుంటూ వెళ్లాయి. దీంతో కొండయ్య అత్త, కామేశ్వరమ్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న కొండయ్య ఆగ్రహానికి లోనై కామేశ్వరమ్మపై దాడి చేశాడు. ఆమెకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం బాధితురాలి బంధువులు దగదర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళపై జరిగిన దాడిని గ్రామస్తులు ఖండించారు. నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు దగదర్తి ఎస్సై మహేంద్ర తెలిపారు. -
సమస్యలు పరిష్కారం కావడం లేదు
● రెవెన్యూ అధికారులపై మహిళ ఆరోపణలు నెల్లూరు(అర్బన్): ‘రెవెన్యూ అధికారులు సకాలంలో సమస్యలు పరిష్కరించడంలేదు. తిప్పుకొంటున్నారు. దొంగలు’ అంటూ నెల్లూరుకు చెందిన సుబ్బరామమ్మ అనే లాయర్ ఆరోపించారు. ఆమె తమ క్లెయింట్లకు సంబంధించిన సమస్యలపై తరచూ కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలిస్తుంటారు. సోమవారం ఆమె కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో, ఇతర జిల్లా అధికారుల ముందు, మంత్రి నారాయణ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై ఘాటుగా ఆరోపణలు చేశారు. ఈ మాటలు రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపాయి. చర్యలకు డిమాండ్ రెవెన్యూ వ్యవస్థను కించపరస్తూ మాట్లాడిన సుబ్బరామమ్మ అనే మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచలరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారులను దొంగలంటూ కించపరచడం దారుణమని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు
ఉదయగిరి రూరల్: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని ముగ్గురు వ్యక్తులు గాయపడిన ఘటన ఆదివారం ఉదయం పట్టణ సమీపంలోని గండిపాళెం వెళ్లే మార్గంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. వరికుంటపాడు మండలం జి.కొండారెడ్డిపల్లికి చెందిన కె.వెంకటయ్య బైక్పై ఉదయగిరి వెళ్తున్నారు. అదే మార్గంలో ఉదయగిరి నుంచి శకునాలపల్లికి బైక్పై దుగ్గయ్య, పవన్కుమార్ వెళ్తున్నారు. పట్టణ సమీపంలోని రైస్ మిల్లు వద్దకు వెళ్లేసరికి రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో వెంకటయ్యకు తీవ్ర గాయాలు కాగా దుగ్గయ్య, పవన్కుమార్కు స్వల్ప గాయాలైంది. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చవటపల్లి వద్ద.. మండలంలోని అప్పసముద్రం పంచాయతీ చవటపల్లి గ్రామానికి చెందిన పి.సుబ్బారెడ్డి బైక్పై ఉదయగిరి వెళ్తున్నారు. గ్రామ సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో సుబ్బారెడ్డికి గాయాలు కావడంతో స్థానికులు గమనించి 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యుల పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. -
యోగాతో ఒత్తిడి దూరం
నెల్లూరు(క్రైమ్): యోగాతో ఒత్తిడి దూరమవుతుందని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు, ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందుతాయన్నారు. పోలీసు విధుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుందని, యోగా, ధ్యానం అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారు సైతం యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్ పోలీస్–ఫిట్ సొసైటీ లక్ష్యంతో పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, ఫిట్నెస్కు జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఏఆర్ ఏఎస్పీ అప్పారావు, నగర ఏఎస్పీ దీక్ష, యోగా గురువు మురళి, డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, గిరిధర్, చంద్రమోహన్, రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పెన్నాలో గుర్తుతెలియని మృతదేహం
నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని కొండ్లపూడి వద్ద పెన్నానదిలో ఆదివారం గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. సుమారు 40– 45 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు బ్లూ టీషర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నారు. ఐదు రోజుల క్రితం మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 34.210 టీఎంసీల నీరు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 34.210 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2000, హైలెవల్ కాలువకు 100, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. పొదలకూరు నిమ్మధరలు(కిలో) పెద్దవి : రూ.60 సన్నవి : రూ.30 పండ్లు : రూ.15 -
అంగరంగ వైభవంగా..
ఆత్మకూరు పట్టణ పరిధిలో ఆదివారం సాయంత్రం హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. బైపాస్రోడ్డులోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి రవితేజ కల్యాణ మండపం సెంటర్ మీదుగా పట్టణంలోకి మోటారు బైక్లపై కాషాయ జెండాలు చేతబట్టి యువకులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఏకలవ్య నగర్ యువకులు చేసిన కర్రసాము, పలు ప్రాంతాలకు చెందిన మహిళల కోలాట నృత్యం, దేవతా రూపాల వేషధారణలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్రలో అయోధ్య బాలరాముడు, ఆంజనేయస్వామి, రాములవారి భారీ విగ్రహం వంటి పలు దేవతారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. – ఆత్మకూరు -
కూటమికి కంట్లో నలుసుగా మారిన పర్వతరెడ్డి
రెడ్బుక్ రాజ్యాంగం, భూముల నుంచి సర్కారు కొలువుల కుంభకోణాలే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ అరాచకాలు సాగుతున్నాయి. వీటిని ప్రశ్నించే గొంతుకులను నులిమేసే విధంగా ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్ట్లు, తప్పుడు కేసులతో అణచివేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. అధికార మదంతో రాజకీయ రాక్షసం ప్రదర్శిస్తున్నాడు. తన శాఖలో డీఎస్సీ కుంభకోణానికి తెరతీసిన నేపథ్యంలో ఆధారాలతో సహా వెలుగెత్తి చాటిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిని టార్గెట్ చేసి ఆయన విద్యా సంస్థల్లో తనిఖీలతో వేధింపులు ప్రారంభించాడు. తన సహచర మంత్రి నారాయణ విద్యాసంస్థలు ఎలాంటి అనుమతుల్లేకుండా తరగతి గదులు, హాస్టళ్ల నిర్వహిస్తుంటే లోకేశ్కు ‘కంపట్లేదు’. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అలవికాని హామీలిచ్చి.. అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వంలో మంత్రి లోకేశ్ షాడో సీఎంగా రాజ్యాంగేతర శక్తిగా అరాచక పాలన సాగిస్తున్నాడు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కొలేక.. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో రాజకీయ కక్ష సాధింపులతో తాలిబన్లను మించిన క్రూరత్వం ప్రదర్శిస్తున్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజావ్యతిరేకత అణచివేసేందుకు లేని కుంభకోణాలు సృష్టించి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్లతో జనం దృష్టిని మరల్చి మెగా డీఎస్సీ పేరుతో పోస్టుల భర్తీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. ఈ కుంభకోణానికి సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఇటీవల పక్కా ఆధారాలతో మీడియా ముఖంగా వెల్లడించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రాజకీయంగా తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను రాజకీయంగా ఎదుర్కొలేక నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి నారాయణ మంత్రి లోకేశ్తో కలిసి రాజకీయ కుట్రలకు తెరతీశారు. దొడ్డి దారిన బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి చెందిన కృష్ణచైతన్య జూనియర్ కళాశాలల్లో ఇంటర్బోర్డు అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేయడం జిల్లాలో రాజకీయ చర్చకు దారి తీసింది. కృష్ణచైతన్య కళాశాలల్లోనే తనిఖీలు జిల్లాలో నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా విద్యా భవనాలు, తరగతి గదులు, హాస్టళ్లు నిర్వహిస్తున్నాయి. కానీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడిని టార్గెట్ చేసి కేవలం ఆయనకు చెందిన నెల్లూరులోని కృష్ణచైతన్య జూనియర్ కళాశాలలతో పాటు బుచ్చిరెడ్డిపాళెంలో ఉన్న జూనియర్ కళాశాలలో శనివారం రాత్రి ఇంటర్బోర్డు ఆర్జేడీ పద్మ, జిల్లా ఇంటర్బోర్డు ప్రాంతీయ విద్యాశాఖాధికారి వరప్రసాదరావు తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు తనిఖీలతో హడావుడి చేశారు. సిబ్బంది, ఉద్యోగులను పలు రకాల ప్రశ్నలతో వేధింపులకు గురి చేశారు. కళాశాలలకు సంబంధించిన అనుమతులు, ల్యాబ్లు, ఫైర్ సర్టిఫికెట్ తదితర పత్రాలను అడిగి తీసుకున్నారు. మరో రెండు రోజుల్లో నోటీసులు జారీ చేసే యోచనలో ఇంటర్బోర్డు అధికారులు ఉన్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారంటూ వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా.. నోరు మెదపని, కాలు కదపని ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నపళంగా కేవలం కృష్ణచైతన్య విద్యా సంస్థల్లోనే తనిఖీలు చేయడంపై రాజకీయంగా ఆయన్ను ఎదుర్కొలేకనే కక్షపూరితంగా ప్రభుత్వ పాలకులు వ్యవహరిస్తున్నారని స్పష్టమైంది. నారాయణ విద్యా సంస్థల అక్రమాలు ‘కంపట్లేదా’? జిల్లాలో మంత్రి నారాయణకు చెందిన జూనియర్ కళాశాలలకు సంబంధించి నిర్వహిస్తున్న హాస్టల్స్ల్లో ఏ ఒక్క హాస్టల్కు ప్రభుత్వ అనుమతి లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లను తలపించే విధంగా కళాశాలల భవనాలు ఉన్నాయి. అన్ని కళాశాలల్లో సైన్స్ ల్యాబ్లు, మైదానాలు లేవు. నిబంధనలకు విరుద్ధంగా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారు. హాస్టల్స్కు అనుమతులు లేకున్నా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఆయా విద్యా సంస్థల అక్రమాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నా.. కళ్లముందు కనిపిస్తున్నా.. ఇంటర్బోర్డు అధికారులకు కనబడక పోవడం, చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఏ రోజూ నారాయణ జూనియర్ కళాశాలలను తనిఖీలు చేసిన పాపాన పోలేదు. పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడి కేవలం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీగా ఉండడంతో కృష్ణచైతన్య విద్యా సంస్థలను టార్గెట్ చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. డీఎస్సీ కుంభకోణంపై వెలుగెత్తిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి విద్యాసంస్థలపై లోకేశ్ టార్గెట్ కృష్ణచైతన్య కళాశాలలపై ఇంటర్ బోర్డు అధికారుల తనిఖీలు ఆరు జూనియర్ కళాశాలల్లో అర్ధరాత్రి వరకు సాగిన తనిఖీలు అనుమతులు, పత్రాలు చూపించాలంటూ హడావుడి అనుమతులు లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తున్న నారాయణ వాటి జోలికి వెళ్లని ఇంటర్ బోర్డు అధికారులు రాజకీయంగా ఎదుర్కొలేక కృష్ణచైతన్యపై దాడులు నగర నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేస్తున్న ఎమ్మెల్సీ అది చూసి తట్టుకోలేక పోతున్న మంత్రులు లోకేశ్, నారాయణ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారారు. కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతి అక్రమాలను ఎండగడుతున్నారు. మండలిలో వైఎస్సార్సీపీ గొంతుకుగా మారి.. కల్తీ నెయ్యి ముసుగులో హెరిటేజ్ టీటీడీ నిధుల దోపిడీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచిన తీరును, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ తల్లికి వందనం మోసాలు, విద్యా కిట్ల పంపిణీ, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన పథకాలను అమలు చేయకపోవడం, ఉపాధ్యాయులను వేధిస్తున్న వైనం, మెగా డీఎస్సీ కుంభకోణం, స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలను నిలదీస్తూనే ఉన్నారు. అమరావతి భూముల కుంభకోణంపై మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరుతో వైఎఎస్సార్సీపీ సానుభూతిపరులు ఓట్లు తొలగింపుపై పోరాడుతున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ చేస్తున్న నెల్లూరులో వీఆర్ పాఠశాల నుంచి పచ్చదనం పేరుతో సాగిస్తున్న అవినీతి, అక్రమాలు, ఆయన అనుచరుల దౌర్జన్యకాండపై ఎప్పటికప్పుడు మీడియా ముఖంగా బట్టబయలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు నగర పాలక సంస్థలో ఏకపక్షంగా కొత్త డివిజన్ల పెంపు, పునర్విభజన అస్తవ్యస్తంగా చేయడంపై హైకోర్టును ఆశ్రయించి పోరాటం చేస్తున్నారు. కూటమి రెండేళ్లుగా సాగిస్తున్న వెన్నుపోటు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు చేస్తున్న ఆందోళనలకు ప్రజాస్పందన వెల్లువెత్తుతోంది. ఇటీవల టీడీపీ నుంచి డివిజన్ల వారీగా వందల కుటుంబాలు చంద్రశేఖర్రెడి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడంతోపాటు ఆయనకు జైకొట్టడాన్ని మంత్రి నారాయణ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ను రాజకీయంగా తట్టుకోలేని అధికార పార్టీ పెద్దలతోపాటు మంత్రి నారాయణ రాజకీయ కక్ష సాధింపులకు తెరలేపుతున్నారు. -
రైల్లో చోరీ.. నిందితుడి అరెస్ట్
● తొమ్మిది గ్రాముల బంగారం స్వాధీనం నెల్లూరు(క్రైమ్): రైల్లో చోరీకి పాల్పడిన కేసులో నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు రైల్వే పోలీస్స్టేషన్లో ఆదివారం స్థానిక, గూడూరు ఇన్చార్జి ఎస్సై ఎన్.హరిచందన నిందితుని వివరాలను వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు రైల్వేస్టేషన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న మోపూరు ప్రాంతానికి చెందిన పెంచల నరసింహను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ఏడాది మేలో గూడూరు సమీపంలో తిరుపతి వెళ్లే రైలులో చోరీ చేసినట్లు నిందితుడు వెల్లడించడంతో అరెస్ట్ చేసి తొమ్మిది గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రయాణికులు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో ఆర్పీఎఫ్ ఎస్సై నారాయణ, ఆర్పీఎఫ్ ఏఎస్సై ప్రభాకర్, జీఆర్పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక టిప్పర్ అదుపుతప్పి..
దుత్తలూరు: మండలంలోని తెడ్డుపాడు బీసీ కాలనీ సమీ పాన 565 జాతీయ రహదారిపై వంతెన గోడను టిప్పర్ ఢీకొట్టిన ఘటన ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన టిప్పర్ ఇసుక కోసం పెన్నానది ప్రాంతానికి వెళ్తోంది. ఈ తరుణంలో టిప్పర్ తెడ్డుపాడు బీసీ కాలనీ వద్దకు రాగానే అదుపుతప్పి వంతెన గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ క్యాబిన్ ఊడి వంతెన కింద కాలువలో పడిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ నాగరాజును బయటకు తీశారు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం 108 వాహనానికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ప్రశాంతంగా నీట్
డీకేడబ్ల్యూ పరీక్ష కేంద్రం వద్ద కోలాహలం హాల్ టికెట్ నంబర్లను చూసుకుంటూ.. ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నీట్ను ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. నగరంలోని తొమ్మిది, గూడూరులోని మూడు కేంద్రాల్లో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.15 వరకు పరీక్షను జరిపారు. నగరంలో 3005 మందికి గానూ 2758 మంది.. గూడూరులో 499 మందికి గానూ 437 మంది హాజరయ్యారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు. విద్యార్థులను మెటల్ డిటెక్టర్తో తనిఖీలు నిర్వహించారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. – నెల్లూరు (టౌన్) -
టెట్ నుంచి మినహాయించకుంటే ఉద్యమమే
కోట: ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామని బీటీఏ రాష్ట్ర కోశాధికారి ఎమ్మార్ చక్రవర్తి హెచ్చరించారు. కోట క్రాస్రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో బీటీఏ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా చక్రవర్తి హాజరై, సభ్యత్వ నమోదు, సంఘ నిర్మాణం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయులపై పనిఒత్తిడి పెంచేస్తున్నారని, రెండేళ్లలో ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీకి పరిష్కారం చూపలేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డేగ సుబ్రహ్మణ్యం, నాగరాజు, పీవీ కిష్టయ్య, శేఖర్, రమణయ్య, సుదర్శనమ్మ, చెంగమ్మ, సుజాత పాల్గొన్నారు. -
గంగపట్నం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఇందుకూరుపేట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగపట్నంలోని చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం అర్ధరాత్రి ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది లాగే సంప్రదాయాలను పాటిస్తూ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూలంగి సేవ జరిపారు. ఆలయ అర్చకుడు అనిల్స్వామి, రామకృష్ణస్వామి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, సోదరుడు శ్రీధర్రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయయ కమిటీ, అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. -
రాజ్యాధికారం వైపు అడుగులేయాలి
● విశ్వబ్రాహ్మణులకు మధుసూదనాచారి పిలుపు నెల్లూరు(బృందావనం): విశ్వబ్రాహ్మణులు సంఘటితంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేసి తమ ఉనికిని చాటుకోవాలని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ సభాపతి సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు అగర సుబ్రహ్మణ్యం ఆచారి, గౌరవాధ్యక్షుడు అల్లంపాటి వెంకటరమణాచారిల ఆధ్వర్యంలో రంగనాయకులపేటలోని సోమిశెట్టి వారి కల్యాణ మండపంలో ఆదివారం ఏపీ విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ, హైదరాబాద్ ఆర్థిక నేర విభాగం సహాయ పోలీస్ కమిషనర్ కేఎం కిరణ్కుమార్ ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మధుసూదనాచారి హాజ రై, మాట్లాడుతూ సమాజం క్రియేటర్స్, ఇమిటేటర్స్, స్పెక్టేటర్స్, ఫ్రస్టేటర్స్తో ఉంటుందన్నారు. క్రియేటర్స్ గా ఉన్న విశ్వబ్రాహ్మణ సంఘీయులు నేడు తమ జాతి శక్తిని విస్మరించి ఎవరికి వారు సంఘాలుగా విడిపోయి బలహీనులుగా మారి ఫ్రస్టేటర్స్గా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ తీరులో మార్పు రావాలంటే ఐక్యతగా ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగాలన్నారు. తాను చెప్పినట్లు వ్యవహరిస్తే జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేని, స్థానిక సంస్థల్లో ఒక చైర్మన్ పదవిని పొందవచ్చన్నారు. అనంతరం మధుసూదనాచారి, పార్వతమ్మ, కిరణ్కుమార్లను సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగార్జునాచారి, ఎల్.భోగేశ్వరరావు, తాటికొండ రంగబాబు, చెన్నుపల్లి శ్రీనివాసరావు, చికలపాటి మధుసూదనాచారి, గుమ్మడిపూడి కల్యాణ్ఆచారి, ఆర్కాట్ కుమార్, సీహెచ్ పిచ్చయ్య ఆచారి, గజ్జల మోహనాచారి, బి.పవన్కుమార్, సానాల రవీంద్ర ఆచారి పాల్గొన్నారు. -
నేడు 21మంది ఎమ్మెల్సీల నెల్లూరుకు రాక
నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం బరి తెగింపు చర్యలను ఎండగట్టేందుకు రాష్ట్రంలోని 21మంది ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు సోమవారం నెల్లూరుకు వస్తున్నారని పార్టీ జిల్లా కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మెగా డీఎస్సీ కుంభకోణంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ పాత్రపై ఆధారాలతో సహా వెల్లడించిన నేపథ్యంలో కక్ష గట్టిన ప్రభుత్వ పెద్దలు చంద్రశేఖరరెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయనకు చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థల్లోనే తనిఖీలు చేసి, వేధింపులకు గురి చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అండగా మేమున్నామనే భరోసా కల్పించేందుకు ఎమ్మెల్సీలు వస్తున్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సైతం చంద్రశేఖర్రెడ్డికి అండగా నిలవాలని కోరారు. డయల్ యువర్ ఎస్ఈ, సీఎండీ నేడు నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నగరంలోని విద్యుత్ భవన్లో.. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించనున్నారు. డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి సంబంధించి 0861 – 2320427 నంబర్ను ఉదయం 8.30 నుంచి 9.30లోపు సంప్రదించి సమస్యలను తెలియజేయొచ్చు. అదే విధంగా డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి గానూ 89777 16661 నంబర్ను ఉదయం పది నుంచి 12.30లోపు సంప్రదించి సమస్యలపై ఫిర్యాదు చేసే అవకాశముంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం నెల్లూరు (టౌన్): యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగాను జీవనశైలిగా మార్చుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, కమిషనర్ నందన్, డిప్యూటీ డైరక్టర్ మాధురి, మెప్మా పీడీ కిరణ్కుమార్, జిల్లా పర్యాటక శాఖాధికారి అజర్ఆలీ, డీఎస్డీఓ జసీమ్ తదితరులు పాల్గొన్నారు. యోగాతో మంచి ఆరోగ్యం నెల్లూరు(లీగల్): యోగాతో ఎంతో ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిత్య జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఉంటాయని, వాటిని అధిగమించి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే యోగాతోనే సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి మహత్తరమైన యోగా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ జడ్జి వైజే పద్మశ్రీ, న్యాయమూర్తులు పీజే సుధా, శుభవాణి, పరశురామ్, శ్రీనివాస్, భరద్వాజ్, సులోచనరాణి, సాయిరామ్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, న్యాయశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 93,303 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 41,688 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
సామాన్యుడిపై ధరాఘాతం
● మండుతున్న కూరగాయల రేట్లు ● పేద, మధ్య తరగతి వర్గాలపై పెనుభారం నెల్లూరు(వేదాయపాళెం): కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. కొన్నిరకాల కూరగాయల కేజీ ధర వంద రూపాయలు దాటేస్తోంది. ప్రభుత్వ పర్యవేక్షణాలోపం, నిర్లక్ష్య ధోరణులతో అన్ని వర్గాలకు అవసరమైన నిత్యావరాల ధరలు విపరీతంగా పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలను సాకుగా చూపి కొందరు వ్యాపారులు వినియోగదారుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. పప్పు దినుసులు, కిరాణా వస్తువులు సైతం ప్రతి నెలా పెరుగుతున్నాయి. సామాన్యుడి ఆదాయ వనరులు మాత్రం పెరగకపోవడంతో ధరాఘాతంతో పేద, మధ్య తరగతి వర్గాలు జీవనం కష్టమవుతుంది. నగరంలో ఇలా.. నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్లో గత నెలలో రూ.30లు ధర ఉన్న కొన్ని రకాల కూరగాయలు ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 ధర పలుకుతున్నాయి. ప్రస్తుతం వంకాయలు కేజీ రూ.100కుపైగా, బీరకాయ రూ.50, పందిరి చిక్కుళ్లు రూ.90, బీన్స్ రూ.70, గోరు చిక్కుళ్లు రూ.80, క్యాబేజీ రూ.40, కాలీఫ్లవర్ ఒక్కటి రూ.50 ధర పలుకుతున్నాయి. ఇటీవల వరకు కేజీ రూ.50 నుంచి రూ.60 వరకు ధర పలికిన టమాటాలు ప్రస్తుతం రూ.20లకు దొరకడం విశేషం. రిటైల్ దుకాణాల్లో మరింత.. ఏసీ మార్కెట్లో కేజీ రూ.30లకు విక్రయించే సమయంలోనే వీధుల్లోని రిటైల్ దుకాణాల్లో పావు కేజీ రూ.20 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తారు. ప్రస్తుతం కేజీ రూ.80 నుంచి రూ.100 వరకు ధర పలుకుతుండడంతో రిటైల్ దుకాణాల్లోని ధరలకు అంతే ఉండదని పేద, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అర కేజీ కంటే తక్కువ పరిమాణంలో మార్కెట్లో విక్రయించరు. అందువల్ల తమకు కావల్సిన పావుకేజీ, అంతకంటే తక్కువ తూకంతో చిల్లర దుకాణదారుడు విక్రయిస్తుండంతో ధర అధికమైనా తమ ప్రాంతంలో రిటైల్ దుకాణంలో ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. ప్రభావం చూపుతున్న పెట్రో ధరలు దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డిజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. నగరంలోని కూరగాయల మార్కెట్లకు ప్రధానంగా కర్ణాటకలోని కోలార్, గుంటూరు జిల్లాలోని ముదిగుబ్బ, ఉల్లి అయితే మహారాష్ట్ర నుంచి చేరుతుంటాయి. ఈ సరుకు రవాణాలో డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. ఆ ప్రభావం కూరగాయలపై పడి సామాన్యులకు ధరాఘాతం తప్పడం లేదు. తూకాల్లో మోసాలు ఏసీ మార్కెట్లోని కొన్ని దుకాణాల్లో తూకాల్లో మోసాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. సంబంధిత ఎలక్ట్రానిక్ కాటాలను అడ్జస్ట్ చేసి కేజీకి 850 నుంచి 900 గ్రాముల్లోపు మాత్రమే వచ్చే విధంగా విక్రయాలు సాగిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. మోసాలు చేస్తే చర్యలు వినియోగదారునికి కచ్చితమైన కొలతలతో దుకాణదారులు విక్రయించాల్సి ఉంటుంది. తూకంలో మోసం జరిగినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – అనితకుమారి, ఏడీ, మార్కెటింగ్ శాఖ -
కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్
నెల్లూరు (టౌన్): నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని ఏఐడీఎస్ఓ జిల్లా ఇన్చార్జి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వీఆర్ హైస్కూల్ సర్కిల్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేపర్ లీక్ చేసిన వారిని శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపైనే అనుమానం వ్యక్తం చేయడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నగర ఇన్చార్జి ప్రియ, సభ్యులు థామ్సన్, మస్తాన్, సాధిక్, ధనూష్ పాల్గొన్నారు. నేర ప్రవృత్తిని వీడాలి నెల్లూరు(క్రైమ్): నేరచరిత్ర కలిగిన వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకుని సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని పోలీసు అధికారులు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, కేడీలు, డీసీలు, సస్పెక్ట్లకు పోలీసు అధికారులు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని, ప్రజాజీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై పీడీయాక్ట్లు తప్పవని హెచ్చరించారు. మీ ప్రాంతాల్లో అల్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే డయల్ 112, పోలీసు కంట్రోల్రూమ్ వాట్సాప్ నంబర్ 93929 03413 లేదా సమీప పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని పోలీసు అధికారులు కోరారు. భార్య కళ్లెదుటే భర్త మృతి మనుబోలు: భార్య కళ్లెదుటే భర్త మరణించిన విషాదకర ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొమ్మలపూడి క్రాస్రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు వెంగళరావు నగర్కు చెందిన వేమాల సాయి(30) భార్యతో కలిసి మోటార్సైకిల్పై నాయుడుపేటకు వెళ్లి తిరిగి నెల్లూరుకు వస్తున్నారు. మండలంలోని కొమ్మలపూడి క్రాస్రోడ్డు సమీపంలోని వంతెన రెయిలింగ్ను బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి మృతి నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని సౌత్మోపూరు నుంచి ఓ వ్యక్తి బైక్పై నెల్లూరు వస్తుండగా ఎదురుగా మరో బైక్ ఢీకొని గాయపడిన సురేష్బాబు(52) చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన సురేష్బాబు సౌత్మోపూరులోని కెనరా బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీన సౌత్మోపూరు నుంచి నెల్లూరుకు బైక్పై వస్తున్నారు. ఎదురుగా మరో బైక్ అతన్ని ఢీకొంది. దీంతో సురేష్బాబు తీవ్రగాయాలపాలయ్యాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సురేష్ ఆదివారం మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేదిలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● బెయిల్పై విడుదలైన కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నెల్లూరు రూరల్: తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని వరుసగా కేసులను నమోదు చేస్తున్నారని.. అక్రమ అరెస్ట్లు, జైళ్లకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. అక్రమ కేసులో అరెస్టయి నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి బెయిల్పై విడుదలైన పార్టీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ శ్రేణులతో కలిసి కాకాణి ఆదివారం స్వాగతించారు. అనంతరం కాకాణి మాట్లాడారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా కామిరెడ్డిపై అక్రమ కేసులను బనాయించి 97 రోజుల పాటు జైల్లో నిర్బంధించారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించడం.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఆయన చేసిన తప్పన్నారు. ఓ కేసులో బెయిలొచ్చిన వెంటనే మరో కేసులో పీటీ వారెంట్లు జారీ చేస్తూ జైల్లోనే ఉంచేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలున్నా, కనీస మానవతా దృక్పథాన్ని సైతం చూపలేదని విమర్శించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని టార్గెట్ చేస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీస్స్టేషన్లంటే ప్రజల్లో భయం ఒకప్పుడు రక్షణ కోసం వెళ్లే పోలీస్స్టేషన్లు.. నేడు భయాందోళనలకు కేంద్రాలుగా మారాయని విమర్శించారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అణిచేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సాయికృష్ణ లాకప్ డెత్.. క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అండగా నిలిచిన జగన్ కష్టకాలంలో సత్యనారాయణరెడ్డి కుటుంబానికి తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని, స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారని తెలిపారు. న్యాయపరమైన పోరాటం కోసం మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డిని పంపి సాయాన్ని అందించారని చెప్పారు. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం సత్యనారాయణరెడ్డి అరెస్ట్, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలు తగిన సమయంలో ఎండగడతారన్నారు. అవరోధాలను అధిగమించి తిరిగి తమ మధ్యకు సత్యనారాయణరెడ్డి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. సత్యనారాయణరెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన జగన్మోహన్రెడ్డి, సూళ్లూరుపేట ప్రజలు, పార్టీ శ్రేణులు, కిలివేటి సంజీవయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. పోరాటాన్ని కొనసాగిస్తాం సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కిలివేటి సంజీవయ్య విమర్శించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతామని.. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో కాకాణి సారథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇసుక కేసులో 27 మందిపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కామిరెడ్డి ఆరోపించారు. రీచ్ను ఎక్కడిచ్చారు.. ఇసుకను ఎక్కడ తవ్వుతున్నారు.. గడువు ముగిసిన చోట తవ్వకాలకు అనుమతిని ఎవరిచ్చారనే మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కూటమి నేతలను డిమాండ్ చేశారు. తనపై 16.. కాకాణిపై 27 కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఇసుక, గ్రావెల్ దందాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాను తప్పు చేశానని ఆధారాలతో నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఒకవేళ అలా కాకపోతే ఆరోపణలు చేస్తున్న వారు ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
చిట్టీల పేరుతో రూ.2 కోట్లకు పైగా మోసం
● నిందితుల అరెస్ట్ ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో చిట్టీల పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన చల్లా చెంగమ్మ, ఆమె భర్త ఏడుకొండలు, మరో వ్యక్తి రవికుమార్ కలిసి పలువురు పేద ప్రజలను నమ్మించి చిట్టీల పేరుతో సుమారు రూ.2 కోట్లకు పైగా వసూలు చేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. రోజువారీ కూలి పనులు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే పేదలను లక్ష్యంగా చేసుకుని పిల్లల చదువులు, వివాహాల కోసం దాచుకున్న డబ్బులను నిందితులు చిట్టీల్లో పెట్టుబడిగా పెట్టించారు. అయితే చిట్టీల సమయం పూర్తయిన తర్వాత నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేయడంతో బాధితులు కొందరు స్పందించారు. దీంతో మిగిలిన బాధితులంతా కలిసి పెద్ద సంఖ్యలో కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. యాతలూరు అరుణ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో స్పందించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి దాచుకున్న సొమ్ము ఒక్కసారిగా పోవడంతో అనేక కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఒక్కో రూపాయి కూడబెట్టి దాచుకున్న డబ్బు తిరిగి రాదనే ఆందోళనలో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు పోర్టు సీఐ రఘుబాబు ఆధ్వర్యంలో ఎస్సై శ్రీనివాసరెడ్డి నిందితులను రిలయన్స్ రోడ్డు వద్ద అరెస్ట్ చేశారు. -
రెవెన్యూ డే నాడే.. రెడ్హ్యాండెడ్గా..!
● ఉద్యోగోన్నతి పొంది పది రోజులు కాకముందే ● రూ.20 వేలు డిమాండ్ చేసి పట్టుబడిన తహసీల్దార్ ● కలగా మారిన ప్రక్షాళన నెల్లూరు(అర్బన్): రెవెన్యూ డేను ఆ శాఖ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకొన్నారు. కలెక్టరేట్లో కలెక్టర్, జేసీ, డీఆర్వో, రెవెన్యూ సంఘాల నేతలు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు మంచి సేవలందిస్తామంటూ ఉపన్యాసాలిచ్చారు. అయితే ఉద్యోగోన్నతి పొంది పట్టుమని పది రోజులు కాకముందే తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన అధికారి మ్యుటేషన్ కోసం ఏకంగా రూ.20 వేల లంచం పుచ్చుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ విషయం రెవెన్యూ వర్గాలతో పాటు జిల్లాలో సంచలనంగా మారింది. ఇలాగేనా సేవలందించేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ప్రతి పనికో రేటు జిల్లాలో రెవెన్యూ వ్యవస్థలో ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించి వసూలు చేస్తున్నారనే విమర్శలు జోరందుకుంటున్నాయి. కలెక్టరేట్లోని సీసీల మొదలుకొని కింది స్థాయి వీఆర్వోల వరకు ఈ అవినీతి పరంపర సాగుతోందనే వార్తలు గుప్పుమంటున్నాయి. పాస్పుస్తకం కావాలన్నా.. అందులో తప్పులను సరిదిద్దాలన్నా.. నోషనల్ నుంచి రెగ్యులర్ ఖాతాకు మార్చాలన్నా.. నిషేధిత భూముల ఫైల్ నడపాలన్నా.. ఇలా ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించి వసూలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. తప్పులు చేసేదీ వారే.. లంచాలడిగేదీ వారే..! -
ఉదయం ఎఫ్ఏ.. సాయంత్రానికి బీఎల్ఏ
● వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఇదీ తంతు ● అధికారుల ఆదేశాలు బేఖాతర్ ఉదయగిరి: ప్రభుత్వం నుంచి వేతనాలు పొందే ఉద్యోగులెవరూ రాజకీయ పార్టీల తరపున బీఎల్ఏలుగా ఉండకూడదని కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఉదాహరణకు వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలో క్షేత్ర సహాయకుడు దమ్ము మల్లికార్జున టీడీపీ బీఎల్ఏగా వ్యవహరిస్తున్నాడు. జాతీయ ఉపాధి హామీ పనులకు శనివారం ఉదయం హాజరై కూలీలకు సంబంధించిన మస్తర్లు, ఫొటోలు తీసుకున్నారు. సాయంత్రమయ్యేసరికి సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో పాల్గొన్నారు. నిబంధనలు పాటించని క్షేత్ర సహాయకులను విధుల నుంచి తొలగించాలని పలువురు కోరుతున్నారు. -
కళ్లు కాయలుకాసేలా..
ఇంజినీరింగ్ విద్యనభ్యసించి.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనే ఆశతో ఉన్న స్టూడెంట్స్కు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదల్లో అంతులేని జాప్యం చేస్తూ.. నీలినీడలు కమ్ముకునేలా సర్కార్ వ్యవహరిస్తోంది. ఏటా రిజల్ట్స్ ఈ పాటికే విడుదలై.. షెడ్యూల్ ఖరారై.. కౌన్సెలింగ్ కోసం ఎదురుచూసేవారు. అయితే ఈ దఫా వ్యవహారం దీనికి భిన్నంగా సాగుతోంది. ఫలితంగా పక్క రాష్ట్రాల్లో చదువైతేనే బెటర్ అనే భావనకు అధిక శాతం మంది వచ్చేశారు. ఇప్పటికే ఏటా అడ్మిషన్లు తగ్గిపోతూ.. కాలేజీల మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలోనూ ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇలా.. నెల్లూరు (టౌన్): రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యపై విద్యార్థుల్లో నీలి నీడలు కమ్ముకున్నాయి. పక్క స్టేట్స్లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు సంబంధించిన షెడ్యూల్ ప్రారంభమైనా, ఇక్కడ మాత్రం ఏపీఈఏపీ సెట్ ఫలితాలే విడుదల కాలేదు. రిజల్ట్స్ను ఎప్పుడు వెల్లడిస్తారో.. కౌన్సెలింగ్ను ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంపై నేటికీ స్పష్టత లేదు. ఫలితంగా ఇంటర్ పూర్తి చేసి ఈ పరీక్ష రాసిన స్టూడెంట్స్ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 13 ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ బ్రాంచీల్లో తొమ్మిది వేలకుపైగా సీట్లున్నాయి. ప్రధానంగా సీఎస్ఈవైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇందులో కొద్ది సీట్లే ఉండటంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైన్స్, ఏఐఎమ్మెల్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యూర్టీ తదితర బ్రాంచీలను ఆయా కాలేజీల యాజమాన్యాలు తెరపైకి తీసుకొచ్చాయి. సీఎస్ఈ తర్వాత ఈసీఈ, మెకానికల్, సివిల్ తదితర గ్రూపులకు డిమాండ్ ఉంది. అక్కడలా.. ఇక్కడిలా..! తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ను ఈ నెల 19 నుంచి నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇతర రాష్ట్రాలు.. ఇక్కడికి మధ్య పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొనడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు పలువురు ఉపక్రమిస్తున్నారు. భారం తగ్గించుకోవాలనేనా..? ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ను ఆలస్యంగా ప్రారంభిస్తే, ఎక్కువ మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు తీసుకుంటారని, దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందనే భావనలో సర్కార్ పెద్దలున్నారనే టాక్ నడుస్తోంది. కన్వీనర్ కోటా కింద ఆయా కాలేజీల్లో చేరిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ను గవర్నమెంట్ ఇస్తుంది. ఈ క్రమంలోనే కౌన్సెలింగ్ను ఆలస్యం చేస్తున్నారనే వాదనా లేకపోలేదు. నైరాశ్యంలో యాజమాన్యాలు ఉమ్మడి జిల్లాలో గతంలో 24 ఇంజినీరింగ్ కళాశాలలుండేవి. ఆ తర్వాత ఆశించిన మేర ప్రవేశాల్లేకపోవడంతో ఒక్కొక్కటికీ తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 13కు చేరుకుంది. కౌన్సెలింగ్ ఆలస్యమైతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన వీరిలో నెలకొంది. అధిక శాతం మంది పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందితే కాలేజీలను ఎలా నడపాలనే మీమాంసలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ను సైతం సకాలంలో విడుదల చే యకుండా పెండింగ్లో ఉంచుతున్న తరుణంలో, కనీ స స్థాయిలో ప్రవేశాల్లేకపోతే కాలేజీలను నడిపే అవకాశమే లేదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.సీట్లు 9 వేలకుపైగా.. కళాశాలలు 13 ఈ పర్యావసానాల క్రమంలో ఏపీలో చేరాలా లేక పక్క రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ పొందాలో అర్థంకాని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ సీటు రాకపోతే.. పక్క రాష్ట్రాల్లోనైనా లభిస్తాయాననే ఆందోళన సైతం వీరిలో నెలకొంది. ఫలితంగా సమీప స్టేట్స్కు వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల సంఖ్య బాగా తగ్గిపోతోంది. ప్రతి నెలా ఏదో మల్టీ నేషనల్ కంపెనీల్లో వందల సంఖ్యలో జాబ్స్ను తొలగిస్తున్న పరిస్థితీ నెలకొంటోంది. ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదల్లో జాప్యం కౌన్సెలింగ్ కోసం అంతులేని నిరీక్షణ తెలంగాణలో ఇప్పటికే ప్రారంభమైన షెడ్యూల్ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఇక్కడి విద్యార్థులు ఏఐ రాకతో ఉద్యోగాల కోసం తిప్పలు జిల్లాలో ఏటా తగ్గిపోతున్న కాలేజీలు షెడ్యూల్ను త్వరగా ప్రకటించాలి ఏపీఈఏపీ సెట్ ఫలితాలను వెంటనే విడుదల చేసి కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించాలి. దీని కోసం వందలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రాల్లో షెడ్యూల్ను ప్రకటించారు. అక్కడ రూ.లక్షలు వెచ్చించి సీట్లు కొనాల్సి వస్తోంది. – ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించి ఫలితాలను ఏప్రిల్ 16న విడుదల చేశారు. దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్ సైతం వెలువడ్డాయి. అయితే ఏపీఈఏపీ సెట్కు సంబంధించిన ఫలితాల విడుదల తేదీని నేటికి ప్రకటించలేదు. ఇవి ఎప్పుడొస్తాయా నేటికీ తెలియని అయోమయం నెలకొంది. ఒకవేళ వీటిని విడుదల చేశాక, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను వెంటనే ప్రకటిస్తారా.. లేదా పక్క రాష్ట్రాల్లో ముగిశాక తెలియజేస్తే తమ పరిస్థితి ఏమిటనే సందిగ్థంలో వీరున్నారు. -
సమస్యల స్వర్ణాల
రొట్టెలు వదిలే ప్రాంతంలో కుప్పగా పోసి ఉన్న గుర్రపుడెక్క కంటితుడుపు పనులతో నీటిపై తేలియాడుతున్న గుర్రపు డెక్క దర్గా ప్రాంగణంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న టూరిజం ప్రహరీకుక్కల విడిదిగా మారిన జిల్లా పర్యాటక శాఖ కార్యాలయ ప్రాంగణం దెబ్బతిన్న ట్రాక్ రొట్టెల పండగకు రోజులు సమీపిస్తున్న తరుణంలో అక్కడ సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ఉన్న ఏపీ టూరిజం భవనం వద్ద కూలేందుకు సిద్ధంగా ఉన్న ప్రహరీ, విరిగిన ర్యాంప్ వాకింగ్ ట్రాక్తో పాటు స్వర్ణాల చెరువులో గుర్రపుడెక్కను సైతం పూర్తిస్థాయిలో తొలగించకుండా వదిలేశారు. ఇప్పటికే భక్తులు వస్తున్న క్రమంలో రొట్టెలు వదిలే ప్రదేశంలో భారీగా గుర్రపుడెక్కను వదిలేసి ఉన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
ఏసీబీ వలలో తహసీల్దార్
అనుమసముద్రంపేట: ఏఎస్పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంపై దాడులను ఏసీబీ అధికారులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ శాంతి స్వరూప్ పట్టుబడ్డారు. పందిపాడుకు చెందిన బాధిత రైతులు కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి వివరాల మేరకు.. పొలాలకు సంబంధించిన మ్యుటేషన్ కోసం ఆన్లైన్లో గత నెల 17న దరఖాస్తు చేసుకున్నామని, వీటిని ఆర్ఐ, వీఆర్వోవెరిఫికేషన్ చేసి తహసీల్దార్కు అప్పగించారని చెప్పారు. పని పూర్తి చేసేందుకు రూ.40 వేలు డిమాండ్ చేయగా, అంత ఇచ్చుకోలేమని చెప్పగా, చివరికి రూ.20 వేలను ఇవ్వాలని ఆయన సూచించారు. అయితే ఈ మొత్తాన్నీ ఇవ్వడం ఇష్టం లేని వీరు ఏసీబీని ఆశ్రయించారు. అధికారుల సూచనల మేరకు ఈ నగదును కార్యాలయంలో తహసీల్దార్కు ఇచ్చే సమయంలో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు, సీఐ విజయ్కుమార్ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేయనున్నామని చెప్పారు. -
11న జాతీయ లోక్ అదాలత్
నెల్లూరు, (లీగల్): జాతీయ లోక్ అదాలత్ను వచ్చే నెల 11న నిర్వహించనున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తెలిపారు. కోర్టు హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, కోట, ఉదయగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించనున్నామని వివరించారు. సివిల్, క్రిమినల్, చెక్కు బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ వాహన ప్రమాదాలు, మున్సిపల్, ప్రీ లిటిగేషన్ తదితర రాజీకి అనువైన కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూలైన్ చేరుకుంది. స్వామివారిని 74,128 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 36,053 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.58 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. రెండు తమిళ బోట్ల నిర్బంధం ముత్తుకూరు(పొదలకూరు): రాష్ట్ర పరిధిలోని ససముద్ర జలాల్లో చేపల వేటను అక్రమంగా సాగిస్తున్న తమిళనాడుకు చెందిన రెండు బోట్లను నిర్బంధించామని మత్స్యశాఖ ఏడీ చాంద్బాషా తెలిపారు. మత్స్య, అటవీ శాఖలు, మైరెన్ పోలీసులు సంయుక్తంగా గస్తీని శనివారం నిర్వహిస్తున్న క్రమంలో కృష్ణపట్నం తీరానికి 18 కిలోమీటర్ల దూరంలో తమిళనాడుకు చెందిన రెండు మెకనైజ్డ్ బోట్లు రాష్ట్ర ప్రాదేశిక జలాల్లో చేపల వేటను అక్రమంగా సాగిస్తున్నారని గుర్తించారు. వీటిని వెంటనే స్వాధీనం చేసుకొని జువ్వలదిన్నె హార్బర్కు తరలించి, అక్కడి మైరెన్ పోలీసులకు అప్పగించామరు. మత్స్య సంపద పరిరక్షణతో పాటు స్థానిక మత్స్యకారుల హక్కుల కోసం గస్తీని నిరంతరం నిర్వహించనున్నామని చెప్పారు. తడ – నెల్లూరు జాతీయ రహదారి విస్తరణకు డీపీఆర్ నెల్లూరు రూరల్: ఎన్హెచ్ – 16లోని తడ – నెల్లూరు సెక్షన్, నెల్లూరు బైపాస్ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు సంబంధించిన డీపీఆర్ కోసం సేవలను షెలాడియా అసోసియేట్స్ కన్సల్టెన్సీ చేపట్టనుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గల సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణికులకు మరింత సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని వివరించారు. డీపీఆర్ తయారీ ప్రక్రియలో భాగంగా వివిధ అంశాలను పరిశీలించనున్నారని వెల్లడించారు. జాతీయ రహదారుల పీడీ రమేష్ గణపతి, సీనియర్ డిజైన్ ఇంజినీర్ మురళి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ సుజాత, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు నాగఅనూష, అరుణాదేవి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పటిష్ట భద్రత
నెల్లూరు(క్రైమ్): నీట్ను ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడా రు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రాలను ఏఎస్పీ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. -
డీఈఓ సస్పెన్షన్కు డిమాండ్
నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్ పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నా పట్టించుకోని డీఈఓను సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మస్తాన్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్ తదితర పేర్లతో విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు గుంజుతున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో రూ.2 వేలు విలువ కూడా చేయని పుస్తకాలను రూ.10 వేలకు అమ్ముతున్నారన్నారు. ఈ రీతిలో వసూళ్లు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో నోటీసు బోర్డుల్లో ఫీజుల పట్టికను ప్రదర్శనలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో నాయకులు షారూఖ్, శివంవర్మ, అశీర్, యస్దానీ, సోహెల్, ఖాదర్బాషా, జీవన్, కోటి, మున్నా, హర్ష, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి నెల్లూరు(పొగతోట): సమాజంలో ఎదురవుతున్న సమస్యలను మహిళలు ధైర్యంగా ఎదుర్కోవాలని ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్ అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని మహిళలతో నిర్వహించిన నో సూసైడ్ మానస్ వికాస్ కార్యక్రమంలో పీడీ మాట్లాడారు. మహిళలు మానసిక ఆరోగ్య పరిరక్షణ, ఒత్తిడి నిర్వహణ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలన్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలపై మహిళలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. సఖీ సెంటర్ అడ్మిన్ షహనాజ్ మాట్లాడుతూ మహిళల మానసిక ఆరోగ్య సహాయానికి 14416, సహాయర్థం 181, పిల్లల రక్షణ కోసం 1098, అత్యవసర సేవల కోసం 112 హెల్ప్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పీడియాట్రిక్ ఒబేసిటీ సేవలు ప్రారంభం నెల్లూరు(అర్బన్): పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం(ఒబేసిటీ) సమస్యను తగ్గించేందుకు నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పీడియాట్రిక్ ఒబేసిటీ సేవలను ప్రారంభించామని ఆస్పత్రి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి సునంద తెలిపారు. ఇందుకు సంబందించిన వాల్పోస్టర్లను శనివారం ఆస్పత్రిలో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జంక్ఫుడ్, స్క్రీన్కు ఎక్కువగా అతుక్కుపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లల్లో ఊబకాయం పెరిగిపోతుందన్నారు. ఫలితంగా భవిష్యత్తులో బీపీ, మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత, గుండె సంబంధిత సమస్యలు వస్తాయన్నారు. ఇక్కడి ఒబేసిటీ కేర్లో ప్రాథమిక పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. ప్రత్యేకమైన పరీక్షలపై 50 శాతం రాయితీ కల్పించామన్నారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలో డైటీషియన్ సలహాలు ఇస్తారన్నారు. హార్మోన్ల సమస్య ఉంటే ఉచితంగా ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించవచ్చన్నారు. జూలై 26వ తేదీ వరకు ఉచితంగా సేవలందిస్తామన్నారు. కార్యక్రమంలో చిన్నపిల్ల వైద్యులు డాక్టర్ హారిక, చీఫ్ డైటీషియన్ పద్మజామదన్, సాంబశివరావు, ఆస్పత్రి ఏజీఎం ఏసీ శేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
సాయికృష్ణ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
● పౌర హక్కుల సంఘం డిమాండ్ నెల్లూరురూరల్: సాయికృష్ణ కస్టడీ మరణం, అనంతరం ఆయన మృతదేహాన్ని మాయం చేసిన ఘటనపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.బ్రహ్మం, కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం కేవలం కృష్ణలంక సీఐ నాగరాజుపై మాత్రమే హత్యా కేసు నమోదు చేయడం కేసును నీరుగార్చే ప్రయత్నంలో భాగమన్నారు. ఈ ఘటనపై 20 రోజులుగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నప్పటికీ, విజయవాడ పోలీస్ కమిషనర్తో పాటు సంబంధిత ఉన్నతాధికారుల పాత్రపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ కేసులో సంబంధిత పోలీసు అధికారులను ముద్దాయిలుగా చేర్చి విచారణ జరపాలని కోరారు. ఇందులో ఉన్నతస్థాయి అధికారుల పాత్రపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్పీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించడం సరైన చర్య కాదన్నారు. మృతుడు సాయికృష్ణ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం అందించాలని కోరారు. అలాగే గతంలో క్రాంతికుమార్ అనే దళిత యువకుడు తనకు జరిగిన వేధింపుల గురించి సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఘటనపైనా సీఐ నాగరాజు, ఇతర సంబంధిత అధికారులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు శిక్షణ నెల్లూరు (లీగల్): న్యాయవాదుల జాతీయ రిజిస్టర్ (ఈ ఫైలింగ్ వెర్షన్ 3.0)పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం శనివారం జిల్లా కోర్టు హాలులో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి న్యాయవాది రిజిస్టర్ చేసుకుని కేసులు ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయాలని, అందుకోసం రిజిస్ట్రేషన్ అయిన ప్రతి న్యాయవాదికి యూనిక్ నేషనల్ అడ్వొకేట్ ఐడీ గుర్తింపు పొందుతారని తెలిపారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. స్టేట్ స్టూడెంట్ వింగ్ సెక్రటరీగా నేలటూరి నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ స్టేట్ స్టూడెంట్ వింగ్ సెక్రటరీగా ఆత్మకూరుకు చెందిన నేలటూరి మల్లికార్జున్రెడ్డిని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. -
కరెంట్ రాలేదని సబ్స్టేషన్ వద్దే నిద్ర
ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో కొద్ది రోజులుగా ఇష్టానుసారంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండడం, దీనికితోడు చిన్నపాటి గాలివాన వచ్చినా విద్యుత్ వైర్లు దెబ్బతిని గంటల తరబడి సరఫరా లేకపోతుండడంతో పట్టణవాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో 20వ వార్డు ఏకలవ్యనగర్లో శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి ఎదురుచూసినా సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో కాలనీవాసులు సమీపంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నేలపై పడుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అనంతరం శనివారం ఉదయం విద్యుత్ శాఖ కార్యాలయం వద్దకు సీపీఎం నాయకులతో కలిసి వెళ్లి కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ కాలనీలో విద్యుత్ సమస్య గురించి ఎన్నిమార్లు అదికారులకు తెలిపినా పరిష్కారం కాకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం విద్యుత్ శాఖ డివిజనల్ ఈఈ భానునాయక్కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ పట్టణంలో పాత విద్యుత్ కండెక్టర్లు మార్పిడి చేయనున్నామని, చిన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. -
చాముండేశ్వరి బ్రహ్మోత్సవాలకు వేళాయె
ఇందుకూరుపేట: భక్తుల కొంగు బంగారమైన గంగపట్నంలోని చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 21 నుంచి జూలై 2వ తేదీ వరకు అమ్మవారు ప్రతిరోజు వివిధ వాహనాలపై పలురూపాల్లో దర్శనమివ్వనున్నారు. ఆదివారంతో అంకురార్పణ, ధ్వజారోహణ, 22న చప్పరోత్సవం, 23న గజ వాహనం, 24, 28న సింహవాహనం, 25, 27న పులి వాహనం, 26 అశ్వ వాహన ఉత్సవాలు జరుగనున్నాయి. అలాగే ముఖ్యమైన కల్యాణోత్సవం 29వ తేదీ, 30న వసంతోత్సవం, గంగోత్సవం జరుగుతాయి. ఉత్సవాల్లో ప్రధానమైన సిరిమాను(రథోత్సవం) జూలై 1న, తెప్పోత్సవం 2వ తేదీ ఉంటాయి. ఉత్సవాలకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. -
ఇలాగైతే బడికి పంపలేం
● గిరిజన కాలనీ వాసుల ఆవేదన కోట: స్థానిక శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీ ప్రైమరీ స్కూల్ విద్యార్థులను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యాంసుందరపురంలోని మోడల్ ప్రైమరీ స్కూల్కు తరలించడాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు గిరిజన కాలనీవాసులు కలెక్టర్ను కలిసి గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎంఈఓలు శిరీష, మస్తానయ్యలు గిరిజన కాలనీలో శనివారం విచారణ జరిపారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాలు.. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకునే వెసులుబాటు ఉండేదని, దీంతో పిల్లలను బడికి పంపించామన్నారు. శ్యాంసుందరపురం ప్రాథమిక పాఠశాలలో ఇక్కడి 3, 4, 5 తరగతులను విలీనం చేయడంతో 16 మంది విద్యార్థులు రెండు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి పాఠశాల ముగిసిన తరువాత నడిచి రావాల్సి వస్తుందన్నారు. అంతదూరం వెళ్లి రావడంతో చిన్న పిల్లలు అలసిపోతున్నట్లు తెలిపారు. కాలనీలో ఉన్న పాఠశాలను 1, 2 తరగతులకే పరిమితం చేశారని, ఇలాగైతే గిరిజనులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై ఎంఈఓ శిరీష మాట్లాడుతూ డీఈఓకు నివేదికను పంపుతామన్నారు. -
అన్నదాతకు అడుగడుగునా అన్యాయం
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● జిల్లా వ్యవసాయ కార్యాలయం ఎదుట ధర్నా నెల్లూరు(వేదాయపాళెం): వరి సాగుపై ఆధారపడిన అన్నదాతకు తీరని అన్యాయం చేసేందుకు సైతం చంద్రబాబు జమానా వెనుకాడటంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలనే డిమాండ్తో నగరంలోని జిల్లా వ్యవసాయ కార్యాలయ ఎదుట శుక్రవారం చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ విధానంతో కౌలు రైతులు తీవ్ర అవస్థలు పడుతూ, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. భూ యజమాని అమెరికాలోనో లేదా ఇతర దేశాల్లో ఉంటే ఓటీపీ వారికే వెళ్తుందని, తిరిగి వారు దాన్ని తెలియజేయాలంటే ఇక్కడ రాత్రవుతోందని పేర్కొన్నారు. దీన్ని చెప్తే గానీ యూరియాను ఇవ్వకపోవడంతో కౌలు రైతులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. యూరియాను ఎగ్గొట్టేందుకు సర్కార్ యత్నించిందని, తమ పార్టీ పోరాటాల ఫలితంగా ప్రస్తుతం మూడు బస్తాల మేర ఇచ్చేందుకు దిగొచ్చిందని చెప్పారు. వరి పంటను నిర్వీర్యం చేసేందుకు సర్కార్ యత్నిస్తోందని మండిపడ్డారు. సంప్రదాయ పంటలు, ఆహార అలవాట్లను సైతం మార్చేసి ప్రజల జీవన విధానాన్నే శాసిస్తున్నారని విమర్శించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మార్చేస్తామని చెప్పినందుకు గానూ శ్రీలంకలో అక్కడి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారని, ఇక్కడ చంద్రబాబు సర్కార్కు సైతం ఇదే జరుగుతుందని చెప్పారు. వరి సాగును తగ్గించి ఆ భూములను పరిశ్రమల పేరుతో తక్కువ ధరలకు తమ అనుచరులకు కట్టబెట్టే యత్నంలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడీకి వినతిపత్రమిస్తున్న కాకాణి, కిలివేటి, ఆనం తదితరులు నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు -
అగ్రవర్ణ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు
నెల్లూరు(బారకాసు): చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘లలితమ్మ విద్యా వికాస పథకం’ కింద ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ అత్యంత పేద, అనాథ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు www.chaganamlbmtrust.org వెబ్సైట్ను సందర్శించాలన్నారు. ఎంపికై న ప్రతి విద్యార్థికి రూ.25,000ల స్కాలర్షిప్ మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. 29.28 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ నెల్లూరురూరల్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం నాటికి 19,74,240 మంది ఓటర్లలో 5,78,067 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. 29.28 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 7,976 ఫారాలను (0.40) డిజిటలైజ్ చేశారు. కావలి నియోజకవర్గంలో 2,41,702 మంది ఓటర్లకు గానూ 53,132 ఫారాలు పంపిణీ చేశారు. 21.98% నమోదైంది. 733 ఫారాల డిజిటలైజేషన్ (0.30%) జరిగింది. ఆత్మకూరులో 2,17,309 మంది ఓటర్లకు 84,274 ఫారాలు పంపిణీ (38.78%) చేశారు. 378 ఫారాల డిజిటలైజేషన్ (0.17%) జరిగింది. కోవూరులో 2,69,146 మంది ఓటర్లకు గానూ 53,916 ఫారాలు పంపిణీ (20.03%) చేశారు. 1,304 ఫారాల డిజిటలైజేషన్ (0.48%) జరిగింది. నెల్లూరు సిటీ పరిధిలో 2,39,870 మంది ఓటర్లకు 61,037 ఫారాలు పంపిణీ (25.45%) చేశారు. 1,371 ఫారాల డిజిటలైజేషన్ (0.57%) జరిగింది. నెల్లూరు రూరల్లో 2,82,312 మంది ఓటర్లకు గానూ 69,561 ఫారాలు పంపిణీ (24.64%) చేశారు. 1,515 ఫారాల డిజిటలైజేషన్ (0.54%) జరిగింది. సర్వేపల్లిలో 2,34,393 మంది ఓటర్లకు 66,900 ఫారాలు పంపిణీ (28.54%) చేయగా 1,168 ఫారాల డిజిటలైజేషన్ (0.50%) జరిగింది. గూడూరు (ఎస్సీ)లో 2,46,086 మంది ఓటర్లకు గానూ 96,509 ఫారాలు పంపిణీ (39.22%) చేయగా 702 ఫారాల డిజిటలైజేషన్ (0.29%) జరిగింది. ఉదయగిరిలో 2,43,422 మంది ఓటర్లకు 92,738 ఫారాలు పంపిణీ (38.10%) చేశారు. 805 ఫారాల డిజిటలైజేషన్ (0.33%) పూర్తయింది. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్ఓలకు త్వరితగతిన అందజేయాలని యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. పనికి వెళ్లొచ్చేసరికి..● ఇంట్లో బంగారం చోరీ నెల్లూరు సిటీ: ఇంటి బయట పూలకుండీలో తాళాలు పెట్టి పనికి వెళ్లొచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు బంగారం చోరీ చేసిన ఘటన శుక్రవారం జరిగింది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. పెద్ద చెరుకూరులోని శివాలయం వెనుక వీధిలో శ్రీనివాసులు కుటుంబం ఉంటోంది. అతను బేల్దారి పనిచేస్తుంటాడు. శుక్రవారం శ్రీనివాసులు, అతని భార్య పనికి, కుమార్తె బడికి వెళ్లారు. ఇంటి తాళాలు పూలకుండీలో పెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు తీసి ఇంట్లోకి ప్రవేశించారు. బాధిత కుటుంబం వచ్చి తిరిగి వచ్చిచూసేసరికి బీరువాలో రెండున్నర సవర్ల బంగారు కమ్మలు, ఉంగరాలు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించండినెల్లూరురూరల్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో ఎన్.విజయ్కుమార్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సమస్యలపై ఉద్యోగ సంఘం నేత బండారుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇంకా ఈహెచ్ఎస్ నెట్వర్క్ ఆస్పత్రులు, ఆరోగ్యమిత్రల జాబితాను ఉద్యోగులు, పెన్షనర్లకు అందుబాటులో ఉంచాలని పలువురు కోరారు. నేతలు గాదిరాజు రామకృష్ణ, పి.కిరణ్కుమార్, ఆంజనేయ వర్మ, లక్కాకుల పెంచలయ్య, కె.సురేష్, టి.మల్లికార్జునరావు, ఏవీ కృష్ణకుమార్, సుధాకర్రెడ్డి, రామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 34.67 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 34.670 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, హైలెవల్ కాలువకు 50, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.60 సన్నవి : రూ.30 పండ్లు : రూ.15 -
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల కుదింపు
● మొదటి ఏడాది ఎగనామం ● రెండో ఏడాదిలో గత ప్రభుత్వంలోని లబ్ధిదారుల్లో 18,801 మంది తొలగింపు ● మూడో ఏడాదిలో గతేడాది లబ్ధిదారుల్లో 18,321 మంది లబ్ధిదారులు కట్ ● ఈ దఫా తొలి విడతలో 1,77,545 మందికి మాత్రమే ● వైఎస్సార్సీపీ హయాంలో 2,14,667 మందికి రైతు భరోసా రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటూ కూటమి ఆ రైతును సంక్షోభంలోకి నెట్టేస్తోంది. అప్పట్లో వ్యవసాయమే దండగన్న చంద్రబాబు.. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని పథకం ప్రకారం కుప్పకూల్చేస్తున్నారు. రెండేళ్లకు ముందు అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి పంటకు అ‘ధర’హో అనే రీతిలో ధరలు లభించగా, కూటమి పాలనలో రెండేళ్లుగా ఏ పంటలకు కనీసం ‘మద్దతు’ ధర కూడా లభించడం లేదనేది నిర్వివాదాంశం. ఇక అన్నదాత సుఖీభవ పథకాన్ని చివరకు అన్నదాత దుఃఖీభవగా మార్చేసింది. తొలి ఏడాది ఎగనామం పెడితే.. రెండో ఏడాదిలో అమలు చేసినా గత ప్రభుత్వంలోని లబ్ధిదారులను భారీగా తొలగించింది. గతేడాది కూటమి పాలనలో లబ్ధిపొందిన లబ్ధిదారుల్లోనూ ఈ ఏడాదిలో మరింతగా కోత పెట్టింది. అన్నదాత సుఖీభవ నిధులురైతులుసాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు దగాకు అన్నదాత కన్నీరు పెడుతున్నాడు. కాడి కట్టి.. మేడి పట్టిన హలధారి ఉరితాళ్లకు వేలాడుతున్నాడు. అప్పులు చేసి ఆరుగాలం అష్టకష్టాలుపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కక.. అప్పుల ఊబిలో కూరుకుపోయి పాడెక్కుతున్నాడు. అన్నదాత సుఖీభవ పథకంతో ఆదుకుంటానని ఆశలు రేకెత్తించిన చంద్రబాబు సర్కారు అమల్లో కోతలు పెట్టి.. గుండె కోతను మిగిల్చింది. రెండేళ్లకు ముందు వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లు ముక్కారు పంటలతో ధాన్యసిరులతో విలసిల్లిన జిల్లాలో ఇప్పుడు అన్నదాతలు కుమిలి కుమిలి దుఃఖిస్తున్నారు. ‘వ్యవసాయం దండగ అని చిన్న చూపు చూసిన సీఎం చంద్రబాబు.. ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలు, ధరాఘాతాలతో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోయింది. కాడి పట్టిన రైతులు.. చివరకు రాళ్లు, మట్టి మోసే కూలీలుగా మారారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంతి అయ్యాక వ్యవసాయాన్ని పండగ చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకేసి అంతకు మించి రైతును ఆర్థిక సంక్షోభం నుంచి రారాజుగా చేశారు. రెండేళ్ల కూటమి పాలనలో రూ.274.21 కోట్ల లబ్ధి అధికారం కోసం అలవికాని హామీలిచ్చి.. దక్కాక వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈ కోవలోనే అన్నదాతలు ఉన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం కంటే మిన్నగా ఆదుకుంటానని నమ్మించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో అప్పుల ఊబిలోకి నెట్టేశారు. తొలి ఏడాది మంగళం పలికారు. రెండో ఏడాదిలో రెండో ఏడాదిలో 3.19 లక్షల మంది అర్హులు దరఖాస్తులు చేసుకుంటే.. చివరకు 1,95,866 మందికి ఇచ్చి చేతులు దలుపుకున్నారు. దాదాపు 84,134 మంది దరఖాస్తులను అకారణంగా తిరస్కరించారు. ఈకేవైసీ, ఆధార్లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి మరో 14 వేల దరఖాస్తులు వివిధ రకాల కారణాలతో పెండింగ్ పెట్టారు. మొత్తంగా రెండేళ్లలో అన్నదాత సుఖీభవగా రూ.274.21 కోట్లు అందించింది. తాజా ఏడాది లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తే.. తొలి విడతలో 1,77,545 మందికి లబ్ధికి అన్నదాత సుఖీభవగా రూ.88.77 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కూటమి కూతలు, కోతల ప్రభుత్వంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్’ దగా జిల్లాలో అర్హులైన రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడ్డదిడ్డంగా.. అలవి కాని హామీలిచ్చారు. గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండీ కూడా ఏ నాడు రైతుల సంక్షేమానికి ఒక్క పథకాన్ని అమలు చేయని చంద్రబాబు సూపర్ సిక్స్లో భాగంగా పీఎం కిసాన్ సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఏటా ప్రతి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇస్తామని హామీలిచ్చారు. తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపి అంటూ నాలిక మడతేసి.. రూ.14 వేలు మూడు విడతల్లో ఇస్తామన్నారు. రెండో ఏడాదిలో పథకాన్ని అమలు చేసినా.. గత ప్రభుత్వంలోని లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టారు. రెండో ఏడాదిలో పథకాన్ని అమలు చేసినా.. వైఎస్సార్సీపీ పాలనలో ఉన్న లబ్ధిదారుల్లో 18,801 మందికి కోత పెట్టి 1,95,866 మందికి లబ్ధి చేకూర్చింది. మూడో ఏడాదికి వచ్చేసరికి 1,77,545 మంది ఇవ్వనున్నట్లు లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది. గతేడాది లబ్ధిపొందిన లబ్ధిదారుల్లో 18,321 మంది రైతులను జాబితా నుంచి తొలగించింది. ఇలా ఏటా సుమారు 18 వేల మంది రైతులను ఈ పథకం నుంచి తొలగిస్తూ వస్తోంది. అధికారంలోకి రాక ముందు కౌలు రైతులకు పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పినా.. అమల్లోకి వచ్చే సరికి కౌలు రైతుల ఊసే ఎత్తకుండా.. అర్హులైన లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టింది. అర్హత ఉండీ పథకం వర్తించని లబ్ధిదారులకు నెల రోజులు గడువు ఇస్తున్నామని అర్హతులతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి తిరిగి సాయం అందిస్తామని నిధుల విడుదల ప్రతిసారి చెబుతోంది. కానీ అర్హత ఉండీ లబ్ధి చేకూరని రైతులకు నేటికీ దిక్కులేదు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం టీడీపీ పాలనలో అన్నదాత సుఖీభవ వైఎస్సార్సీపీ ఐదేళ్లల్లో రూ.1510.70 కోట్లు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2.15 లక్షల మంది రైతులకు ఏటా వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఏటా రూ.13,500 అందజేసింది. ఐదేళ్లలో మొత్తంగా రూ.1510.70 కోట్లు అందజేయగా, తొలి రెండేళ్లల్లోనే రూ.601.83 కోట్లు అందజేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకేలో రైతుల జాబితాలను నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి పారదర్శకతకు పాతరేసింది. -
విద్యాలయం.. అపవిత్రం
● పాఠశాల ఆవరణలో మందుబాబుల హంగామా ● వంటగదిలోనే నివాసం ● రాత్రి, పగలు తాగుతూ. ● భయాందోళనలో విద్యార్ధులు, తల్లిదండ్రులువిడవలూరు: కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. మందుబాబుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం పక్కన ఉన్న దళితవాడ ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. మధ్యాహ్న భోజనం వండేందుకు ఏర్పాటు చేసిన గదికి తలుపుల్లేవు. కొందరు స్థానిక యువకులు దీనిని అవకాశంగా తీసుకున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్కడ మద్యం తాగుతూ ఖాళీ బాటిళ్లను గదిలో పారేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్లు ఏర్పాటు చేసుకుని పాఠశాల విద్యుత్ను ఉపయోగిస్తూ అక్కడే నిద్రిస్తున్నారు. బడి వేళల్లోనూ మద్యం మత్తులో పడుకుని ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా మందుబాబులు వంటగదిని ఆక్రమించడంతో విద్యార్థులకు వంట చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఏజెన్సీ నిర్వాహకురాలు ఇంటి వద్ద భోజనం తయారు చేసి తీసుకువస్తోంది. భయాందోళనలో తల్లిదండ్రులు పాఠశాల పరిసరాలు ఇలా మారిపోవడంతో తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నారు. విద్యాశాఖ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. వంటగదికి తలుపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రతి ఓటును కాపాడుకుందాం
● దొంగ ఓట్లను అడ్డుకుందాం ● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కొడవలూరు: ‘వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. బీఎల్ఏలు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి ఓటును కాపాడుకుందాం’ అని మాజీ మంత్రి, ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నార్తురాజుపాళెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో బీఎల్ఏలతో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డితో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ చంద్రబాబుకు దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర ఉందన్నారు. అందువల్ల దొంగ ఓట్ల చేరికపై కూడా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. ఏ ఒక్క ఓటు తొలగింపునకు గురికాకుండా చూసుకోవల్సిన బాధ్యత బీఎల్ఏలపైనే ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐర్లో ప్రతి ఓటు నూతనంగా నమోదు చేయడం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఓటు ఉందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే అది గల్లంతవుతుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు సూచించిన వారినే బీఎల్ఏలుగా పెట్టడం జరిగిందన్నారు. వచ్చే నెల 14వ తేదీ వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. బీఎల్ఏలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్లను కాపాడుకుంటూనే దొంగ ఓట్ల చేరికను అడ్డుకోవాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, ఎంపీపీ గాలి జ్యోతి, నాయకులు అడపాల మోహనకృష్ణ, కొట్టే మల్లికార్జున, ఎండీ కరిముల్లా, చక్కా మనోహర్, బి.సుప్రియ, కె.మోహన్రావు, సతీష్ రెడ్డి, షాహుల్, అనపల్లి ఉదయ్ భాస్కర్, బొచ్చు శ్రీనివాసులు, దేవనబోయిన శివకుమార్, వెంకటసతీష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
నిమ్మ ధరలు నేలముఖం
● నానాటికీ పతనమవుతున్న వైనం ● దిగులు పడుతున్న రైతులు చిల్లకూరు: అతి పెద్దదిగా పేరొందిన గూడూరు నిమ్మ మార్కెట్లో ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కొనుగోళ్లు తగ్గిపోతుండటంతో ఇక్కడ ధరలు అమాంతం దిగజారుతున్నాయి. ఫలితంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఏ పంటకూ సరైన మద్దతు ధరల్లేపోవడంతో కర్షకులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వేసవిలో మామిడి, నిమ్మ, చీని ధరలు తగ్గిపోతుండటంతో రైతులకు దిక్కుతోచడంలేదు. నెల్లోనే పతనం గూడూరు, పొదలకూరు ప్రాంతాల్లో కాయలు మార్కెట్లకు బాగానే వస్తున్నా, కిలో రూ.25 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. గత సీజన్లో కిలో రూ.150 వరకు.. నెల క్రితం రూ.200 వరకు ఉండింది. అయితే ఒక్క నెల్లోనే రేట్లు అమాంతం పడిపోయాయి. వాస్తవానికి ఇక్కడి కాయలు మంచి రుచిగా ఉంటాయనే ఉద్దేశంతో ఉత్తరాది రాష్ట్రాల్లోని వారు బాగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో నిమ్మ సాగు ఎక్కువ కావడంతో అక్కడ్నుంచి కాయలు ఎగుమతవుతున్నాయి. దీంతో ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, నకిరేకల్లు, రాష్ట్రంలోని ఏలూరు, తెనాలి, కర్ణాటకలోని బిజాపూర్, మహారాష్ట్రలోని అకోలా తదితర ప్రాంతాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతవుతుండటంతో ఇక్కడ సమస్య తీవ్రమవుతోంది. పొదలకూరు మార్కెట్ నుంచి 20.. గూడూరు నిమ్మ మార్కెట్ నుంచి 30 నుంచి 50 లారీల వరకు ఇతర రాష్ట్రాలకు నిత్యం వెళ్లేవి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితే లేదు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పల్లె కాపులకు త్వరలో పట్టాల పంపిణీ
ముత్తుకూరు(పొదలకూరు): ఏడు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్న పల్లె కాపులకు పట్టాలను త్వరలో పంపిణీ చేయనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని పిడతాపోలూరులో పల్లె వీక్షణం కార్యక్రమానికి శుక్రవారం హాజరైన ఆయన మాట్లాడారు. సహజసిద్ధంగా ఎరువులను తయారు చేస్తున్న సహాయక గ్రూపులకు తోడ్పాటును అందించనున్నామని వివరించారు. పిడతాపోలూరు ఎస్టీ కాలనీలో లో ఓల్టేజీ సమస్యను అధిమించేందుకు త్రీ ఫేజ్ విద్యుత్ను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. పల్లె వీక్షణం కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలను రెండు రోజులు ముందే గుర్తించి వాటిని పరిష్కరించేలా తగు చర్యలను చేపట్టనున్నామని పేర్కొన్నారు. పొదలకూరు మండలంలో కార్యక్రమాన్ని వచ్చే వారంలో నిర్వహించనున్నామని తెలిపారు. పిడతాపోలూరులో ప్రధాన సమస్యలను పరిష్కరించామని, మంచినీటిని రెండు వారాల్లో అందించనున్నామన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు.. స్వయం సహాయక గ్రూపు సంఘాలకు రూ.నాలుగు లక్షల చెక్కులను అందజేశారు. ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలు, డ్రిప్ ఇరిగేషన్, చెత్తతో సంపద తయారీ కేంద్రాలను పరిశీలించి గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామస్తులు వెల్లడించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్డీఓ నాగఅనూష, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ సుజాత, వ్యవసాయ, ఉద్యానశాఖల జిల్లా అధికారులు సత్యవాణి, సుబ్బారెడ్డి, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రాఘవేంద్రం, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
దర్జాగా కబ్జా.. అడిగితే ఒట్టు
వెంకటాచలం: రెండు మండలాలకు సాగు, తాగునీరు అందించాల్సిన ప్రధానమైన సర్వేపల్లి రిజర్వాయర్ ఆక్రమణలకు గురవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రిజర్వాయర్ భూముల్లో సాగు చేసుకునేందుకు ఏకంగా నీటినే అక్రమంగా తరలించేందుకు కాలువలు తవ్వుతున్న పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రిజర్వాయర్ భవిష్యత్పై ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు మండలాలకు ఆధారం వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు సాగు, తాగునీరు అందించడంలో సర్వేపల్లి రిజర్వాయర్ కీలకంగా ఉంది. ఇక్కడి నుంచి ఆ రెండు మండలాల్లోని 64 గ్రామాలకు తాగునీరు, 15,300 ఎకరాలకు అధికారికంగా, అనధికారికంగా కలిపి సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. రిజర్వాయర్ విస్తీర్ణం 15 వేల ఎకరాలు కాగా.. ఏటా పైభాగంలో జరుగుతున్న ఆక్రమణలతో విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. చుట్టూ ఉన్న గ్రామాల్లోని ఆక్రమిత భూముల్లో ఆక్రమణదారులు వరి సాగు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా.. రిజర్వాయర్ భూముల ఆక్రమణలపై ఆయకట్టు రైతులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు కనిపించడం లేదు. 2011లో ఆక్రమణలపై సర్వే నిర్వహించారు. అప్పట్లో 300 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురై వరి సాగు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆక్రమణదారులకు నోటీసులిచ్చి వదిలేశారు. ఆ తర్వాత నుంచి నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం100 నుంచి 150 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురై ఉంటుందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు సాగిస్తూ.. సర్వేపల్లి రిజర్వాయర్ను ఆక్రమించి సాగు చేసుకుంటున్న భూములు చేతులు మారుతున్నాయి. అనికేపల్లి, గొలగమూడి, కంటేపల్లి, జోసఫ్పేట తదితర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు కొన్నేళ్లుగా రిజర్వాయర్ భూముల్లో అక్రమ సాగు చేస్తున్నారు. యంత్రాలతో చుట్టూ గట్లు వేయించి, మోటార్ల ద్వారా రిజర్వాయర్ నీటినే తరలిస్తున్నారు. దీంతో ఎకరాకు నాలుగు పుట్లకు తగ్గకుండా దిగుబడి వస్తుండటంతో సెంటు భూమి లేని కొందరు వ్యక్తులు ఈ భూములను ఎకరా రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు కొనుగోలు చేసి సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కొంతమంది ఆక్రమిత భూములకు సాగునీరు అందించేందుకు రిజర్వాయర్ మధ్యలో నుంచే ఇష్టారాజ్యంగా కాలువలు తవ్వుతున్నారు. అధికారులు చూస్తే కదా.. ఆక్రమణలు పెరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అనికేపల్లి, గొలగమూడి గ్రామాల పరిధిలోని రిజర్వాయర్ ప్రాంతంలో ఏటా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆక్రమిత భూముల కారణంగా ఆయకట్టు పొలాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ మధ్యలో నుంచే యంత్రాలతో కాలువలు తవ్వుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రిజర్వాయర్ ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వివరణ కోసం సర్వేపల్లి రిజర్వాయర్ డీఈ అనిల్కుమార్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. సర్వేపల్లి రిజర్వాయర్లో ఏటా పెరుగుతున్న ఆక్రమణలు చేతులు మారుతున్న ఆక్రమిత భూములు పట్టించుకోని అధికారులు ఇష్టారాజ్యంగా సాగు -
నీట్ – 26కు పకడ్బందీ ఏర్పాట్లు
● డీఆర్వో విజయ్కుమార్ నెల్లూరురూరల్: ‘ఈనెల 21వ తేదీన జరిగే నీట్ – 26కు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించాలి’ అని డీఆర్వో విజయ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలో 9, గూడూరు పట్టణ పరిధిలో 3 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో రాష్ట్ర పోలీసు సిబ్బందితోపాటు కేంద్ర రక్షక పోలీసు దళాల పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే తనిఖీ చేసి మౌలిక వసతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సహా ఎవరూ మొబైల్ ఫోన్లు వినియోగించరాదని స్పష్టం చేశారు. సమావేశంలో చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసు, వైద్య, విద్యుత్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రాల వివరాలు నెల్లూరు నగర పరిధిలో దర్గామిట్టలోని డీకే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు), డీసీఆర్ జెడ్పీ హైస్కూల్ (బాలురు), డీసీఆర్ జెడ్పీ హైస్కూల్ (బాలికలు), కొత్తూరులోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, స్టోన్హౌస్పేటలోని ఆర్ఎస్ఆర్ఎం సీహెచ్సీ స్కూల్, వైవీఎం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, ఏసీ నగర్లోని ఎంఎస్ఎంఎం హైస్కూల్, గూడూరు పట్టణ పరిధిలో తిలక్ నగర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సనత్నగర్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలు కేంద్రాలుగా ఉన్నాయి. -
నడుచుకుంటూ ఇంటికెళ్తుండగా..
● మినీ ట్రక్కు ఢీకొని వ్యక్తి మృతి సీతారామపురం: మండలంలోని బోడసిద్ధాయపల్లి గ్రామ రోడ్డు సెంటర్లో మినీ ట్రక్కు ఢీకొని అదే గ్రామానికి చెందిన భూమనబోయిన నాగరాజు (36) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నాగరాజుకు వివాహమై పిల్లలున్నారు. హైరర్స్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నాగరాజు బోడసిద్ధాయపల్లి గ్రామ రోడ్డు సెంటర్లోని జాతీయ రహదారిపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. మినీ ట్రక్కు మైదుకూరులో కూరగాయలు తీసుకుని మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురంలో అన్లోడ్ చేసి తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో నాగరాజును ఢీకొట్టడంతో ఎగిరి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు 108 అంబులెన్స్లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఇసుక టిప్పర్ మాయం
సాక్షి, టాస్క్ఫోర్స్: కొంతకాలంగా నకిలీ బిల్లులతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్న సైదాపురం మండల అధికార పార్టీ నాయకుడి టిప్పర్ను పొదలకూరు పోలీసులు పట్టుకున్నారు. అయితే అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఫోన్ కాల్తో దానిని వదిలివేసిన వైనం గురువారం చోటుచేసుకుంది. కలువాయి మండలం రాజుపాళెం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న నాయకుడి వ్యవహారం, టిప్పర్ను వదిలిలేసిన సమాచారం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. వెంకటగిరి ముఖ్యనేత పేరును అడ్డుపెట్టుకుని ఇసుకను తరలిస్తున్న సైదాపురం నాయకుడి టిప్పర్పై మైనింగ్ జిల్లా అధికారి నెల్లూరు వేదాయపాళెం పోలీస్స్టేషన్లో గతేడాది ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. అధికారం ఉందని.. నకిలీ బిల్లులతో కొంతకాలంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను వదిలివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారం ఉందని ఏమైనా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇసుక మాఫియా పటిష్టంగా ఉన్నందున గంటల వ్యవధిలోనే టిప్పర్ను స్టేషన్ వెలుపల లేకుండా చేశారు. ఈ ఘటనపై పెద్ద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రెండు నియోజకవర్గాల పరిధిలో ఘటన జరగడంతో ప్రజాప్రతినిధుల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. తన నియోజకవర్గంలో నకిలీ బిల్లులతో వెళ్తున్న ఇసుక టిప్పర్ను పట్టుకుని వదిలివేయడం ఏమిటని పోలీసులను సోమిరెడ్డి నిలదీసి వెంటనే కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే వదిలివేసిన టిప్పర్ తిరిగి తీసుకురావాలంటే పోలీసులకు సమస్యగా మారుతుందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ తీసుకొచ్చినా వెంకటగిరి ముఖ్యనేత సమ్మతించకుంటే పంచాయితీ పెద్దది అవుతుందనే ప్రచారం ఉంది. నకిలీ బిల్లులతో వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఫోన్ కాల్ గతంలో ఆ వాహనంపై మైనింగ్ అధికారి ఫిర్యాదు -
కారుమూరి సునీల్ అరెస్ట్ దుర్మార్గం
● రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బీవీ రమణయ్య చిట్టమూరు: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్ట్ దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బీవీ రమణయ్య అన్నారు. చిట్టమూరులో పార్టీ బీసీ నాయకులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ నాయకుల ఎదుగుదలను అధికార టీడీపీ సహించలేక పోతోందన్నారు. సునీల్ భవిష్యత్ను అణగ దొక్కేందుకు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అక్రమ రవాణా కేసు పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ అరాచకాలను గమనిస్తున్నారని సరైన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో కార్యక్రమంలో పట్టివానిపల్లి మాజీ సర్పంచ్ పిట్టి ప్రవీణ్, వైఎస్సార్సీపీ బీసీ నాయకులు కృష్ణమూర్తి, శోభన్, సురేష్, అక్కెం మునెయ్య, బద్ధిగ శ్రీనివాసులు, వినోద్, సునీల్ పాల్గొన్నారు. -
రిట్ పిటిషన్ దాఖలు
టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఎన్నిక ఏదైనా విజయమే పరమావధిగా చేయని కుట్రల్లేవు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రశ్నించే వారిని నిర్బంధించడం.. ఫిరాయింపులను ప్రోత్సహించడం.. ఎవరైనా లొంగకపోతే వారిని నయనో.. భయానో లొంగదీసుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించింది. ఈ కోవలోనే నెల్లూరు నగరపాలక సంస్థను తమ హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో డివిజన్లను అడ్డగోలుగా విభజించేందుకు రంగం సిద్ధంగా చేసింది. జనగణన ప్రస్తుతం సాగుతున్న తరుణంలో ఈ ఒంటెత్తు పోకడలను అవలంబించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించి.. హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ క్రమంలో ప్రక్రియపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఊహించని ఈ పరిణామంతో సైకిల్ పార్టీ, జనసేన నేతలు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. నెల్లూరు(బారకాసు): నిబంధనల మేరకు పునర్వి భజన ప్రక్రియ జరిగితే స్థానిక ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించిన కూటమి నేతలు సరికొత్త కుట్రలకు తెరదీశారు. రూల్స్ను గాలికొదిలి అధికారులతో కలిసి అడ్డగోలు విభజనకు శ్రీకారం చుట్టారు. సరిహద్దులను చెరిపేసి.. డివిజన్లను చెల్లాచెదురు చేశారు. పారదర్శకత పూర్తిగా లోపించింది. అభ్యంతరాలు పెడచెవిన నగరంలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అశాసీ్త్రయంగా సాగిందంటూ అభ్యంతరాలు వ్యక్తమైనా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ తీరును వ్యతిరేకిస్తూ హైకోర్టును నగర ప్రజలతో పాటు 13వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులు ఆశ్రయించారు. ఈ తరుణంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. పునర్విభజన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో అడ్డదారిలో విజయం సాధించాలనే టీడీపీ, జనసేన కుట్రలు బెడిసికొట్టాయి. 54 నుంచి 72కు.. వాస్తవానికి నెల్లూరు నగరపాలక సంస్థలో 54 డివిజన్లు ఉన్నాయి. వీటిని 72కు పెంచుతూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు పునర్విభజన చేయాలని ఆదేశాలిచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మార్చేలా కూటమి నేతలు ప్లాన్ చేశారు. టీడీపీ కీలక నేతల కనుసన్నల్లో.. నిబంధనలను కార్పొరేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 20 డివిజన్ల నుంచి 250 అభ్యంతరాలొచ్చాయంటే ఆఫీసర్లు ఎలా వ్యవహరించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదే తరహాలో 13, 51, 43, 26వ డివిజన్లలోనూ స్థానికులు, కార్పొరేటర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటమి తప్పదనే ఇలా.. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయింది. హామీల విస్మరణ.. దిగజారిన శాంతిభద్రతలు.. నిరుద్యో గం.. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు.. ఇలా ఎన్నో కారణాలతో సర్కార్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భావనతో కుట్రలకు పచ్చ నేతలు తెరదీశారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియను అడ్డం పెట్టుకొని అడ్డదారిలో విజయం సాధించేందుకు ప్లాన్ చేశారు. నిజానికి ఈ వ్యవహారంలో కొన్ని నిబంధనలను విధించారు. అయితే వీటన్నింటినీ ఉల్లంఘించి అస్తవ్యస్త విభజనకు నిర్ణయించారు. నగరపాలక సంస్థలో అడ్డగోలుగా డివిజన్ల పునర్విభజన గెలుపే లక్ష్యంగా టీడీపీ కుతంత్రాలు నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్పులు, చేర్పులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైఎస్సార్సీపీ డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు నైరాశ్యంలో టీడీపీ, జనసేన నెల్లూరు నగరపాలక సంస్థలో అధికార పార్టీ చేపట్టిన పునర్విభజన ప్రక్రియపై హైకోర్టులో రిట్ పిటిషన్ను 13వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున దాఖలు చేశారు. 2027 జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని, ఇది పూర్తికాక ముందే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అన్ని వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జనగణన నిబంధనల మేరకు 2025 డిసెంబర్ 31లోపు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని, 2026 జనవరి 1 నుంచి 2027 ఏప్రిల్ 1 వరకు మొత్తం ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల నుంచి అన్ని మున్సిపాల్టీ లు, కార్పొరేషన్లకు స్పష్టంగా తెలియజేసిందని పేర్కొన్నారు. అయినా నిబంధనలను ఉల్లంఘిస్తూ డివిజన్ల పునర్వభజన చేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో డీలిమిటేషన్ ప్రక్రియపై ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక స్టే విధించింది. సరిహద్దులా.. మేము చెప్పలేము..! -
మాకు సంబంధం లేదు
జిల్లాలో ఇంటర్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్వహిస్తున్న హాస్టళ్లతో మాకెలాంటి సంబంధం ఉండదు. వాటిని పర్యవేక్షించే అధికారమూ లేదు. జిల్లాలో దేనికీ అనుమతుల్లేవు. పర్మిషన్లు ఎవరిస్తారో కూడా మాకు తెలీదు. – వరప్రసాదరావు, ఆర్ఐఓ ప్రభుత్వ హాస్టళ్లనే పర్యవేక్షిస్తాం ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతే మాది. ఇంటర్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్వహిస్తున్న హాస్టళ్లతో మాకు సంబంధం లేదు. ఎవరూ చూస్తారో కూడా తెలీదు. – వెంకటలక్ష్మమ్మ, సోషల్ వెల్ఫేర్ అధికారి ● -
21న నీట్
నెల్లూరు (టౌన్): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నీట్ను ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షను మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.15 వరకు జరపనున్నారు. గత నెల్లో జరిగిన పరీక్ష సమయానికంటే 15 నిమిషాలను అదనంగా పెంచారు. జిల్లా వ్యాప్తంగా 3005 మంది హాజరుకానున్న ఈ టెస్ట్ను మొత్తం 12 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. నగరంలోని డీకేడబ్ల్యూ, డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల, దర్గామిట్టలోని జెడ్పీ బాలుర, బాలికోన్నత పాఠశాలలు, ఏసీనగర్లోని మల్లెల సంజీవయ్య మున్సిపల్, స్టోన్హౌస్పేటలోని ఆరెస్సార్, పప్పులవీధిలోని వైవీఎం మున్సిపల్ హైస్కూల్, గూడూరులోని పాలిటెక్నిక్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీ బాలికోన్నత పాఠశాలల్లో పరీక్షను జరపనున్నారు. శ్రీవారి దర్శనానికి పది గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 82,438 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 39,948 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
జిల్లాలో ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్ణయాలు విద్యార్థులకు శాపాలుగా పరిణమిస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులను వసూలు చేస్తూ.. అనుమతుల్లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తూ.. వందలాది మంది స్టూడెంట్స్ను ఇరుకు గదుల్లో కుక్కుతున్నారు. అరకొర వసతులు, నాసిరకమైన భోజనాన్ని అందిస్తున్నా, తమకేమీ సంబంధంలేదనే రీతిలో ఇంటర్ బోర్డు అధికారులతో పాటు ఆయా శాఖల ఆఫీసర్లు తప్పించుకుంటున్నారు. చదువు ఒత్తిడి.. నామమాత్రపు ఫెసిలిటీస్.. అధ్వానమైన ఫుడ్ను తినలేక సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యమవుతోంది. ఈ విషయమై తల్లిదండ్రులకు తెలియజేసినా, కొద్ది రోజులుంటే సర్దుకుపోతారులేనంటూ లైట్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరికీ చెప్పుకోలేక స్టూడెంట్స్ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. నెల్లూరు (టౌన్): ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్ విద్య కీలకం కావడంతో దీనిపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నీట్, జేఈఈ మెయిన్స్, ఐఐటీ, ఎంసెట్ తదితర పేర్లతో కోర్సులను కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ప్రారంభించి అందిన కాడికి దండుకుంటున్నాయి. రెగ్యులర్ కంటే హాస్టళ్లలో ఉండి చదువుకుంటే సీటు గ్యారెంటీని తామే ఇస్తామంటూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. దీంతో తమ పిల్లలను అక్కడే చేర్పించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటూ.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. అనుమతి లేకుండానే.. జిల్లాలో 185కుపైగా కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 35 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అదే విధంగా 60కుపైగా కాలేజీలకు అనుబంధంగా హాస్టళ్లున్నాయి. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, ఆరెన్నార్, ఎస్సార్, ఓవెల్ తదితర జూనియర్ కాలేజీలకు సంబంధించిన బ్రాంచీల పేరుతో వసతిగృహాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ఏసీ, నాన్ ఏసీ, భోజన రకాలను బట్టి ఫీజులను నిర్ణయించారు. ఇలా రూ.1.5 లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయితే వీటిలో దేనికీ అనుమతి లేకపోవడం గమనార్హం. ఇరుకు భవనాలు, చిన్న గదుల్లో నలుగురు లేదా ఆరుగురు విద్యార్థులను కుక్కుతూ ఇబ్బందులు పెడుతున్నారు. వీరి సంఖ్యకు అనుగుణంగా టాయ్లెట్లూ ఉండటంలేదు. ఇవి అపరిశుభ్ర వాతావరణంలో దర్శనమిస్తుండటంతో స్టూడెంట్స్ వెతలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. సరైన గాలి, వెలుతురు లభించడమూ కరువే. వారు పెట్టే భోజనాన్ని తినే పరిస్థితే లేదని వాపోతున్నారు. హాస్టళ్లు – 60కుపైగా వసూలు చేస్తోంది – రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు (గది, భోజనం బట్టి) బాధ్యతెవరిదో అంతుచిక్కడంలేదుఇంటర్ జూనియర్ కళాశాలల హాస్టళ్ల అనుమతి, బాధ్యత ఎవరిదనే అంశంపై స్పష్టత లేదు. తమకు సంబంధం లేదని జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు చెప్తూ.. సంక్షేమాధికారులను అడగాలని సలహా ఇస్తున్నారు. వారిని సంప్రదిస్తే, ప్రభుత్వ వసతిగృహాల విషయంలోనే తమ ప్రమేయముంటుందని.. ప్రైవేట్ హాస్టళ్లలో ఏమీ ఉండదని బదులిస్తున్నారు. ఫలితంగా తమ సమస్యలను ఎవరికి తెలియజేయాలో పాలుపోక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవేళ ఎవరైనా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే, తల్లిదండ్రులకు ఏదో సాకు చెప్పి విద్యార్థులను ఇక్కడ్నుంచి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇంటర్ జూనియర్ కళాశాలల హాస్టళ్ల నిర్వహణపై కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బందీఖానాలుగా మారిన వైనం జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వసతిగృహాలు దేనికీ పర్మిషన్లు లేవంటున్న ఇంటర్ బోర్డు అధికారులు చేతులు దులుపుకొంటున్న ఆర్ఐఓ, బీసీ వెల్ఫేర్ అధికారి అరకొర వసతులు, నాసిరకమైన ఫుడ్తో విద్యార్థులకు తంటాలు అనుమతులు, పర్యవేక్షణ బాధ్యతెవరిదో..? ఒత్తిడి, వసతుల్లేమితో పలువురి బలవన్మరణాలు -
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
చేజర్ల: మండలంలోని ఆదూరుపల్లిలో గల పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా వీరాంజనేయ ఫర్టిలైజర్స్ దుకాణంలో రూ.12,89,847 విలువజేసే యూరియా, డీఏపీ ఇతర కాంప్లెక్స్ ఎరువులను నిల్వ చేశారని గుర్తించారు. అనంతరం దుకాణాన్ని సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సుభానీ, వ్యవసాయ శాఖ నిఘా విభాగాధికారి వేణుగోపాల్, చేజర్ల వ్యవసాయాధికారి హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
ఫస్టియర్లో ఆరు.. సెకండియర్లో నాలుగు
● ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో ఆరు.. సెకండియర్లో నాలుగో స్థానాన్ని జిల్లా సాధించింది. ఫస్టియర్కు సంబంధించి 4756 మంది హాజరుకాగా., వీరిలో 1998 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 42 శాతంగా నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 4358 మందికి గానూ 2788 మంది పాసయ్యారు. ఇందులో పాస్ పర్సంటేజీ 64 శాతంగా ఉంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు.. ఫలితాలకు సంబంధించిన రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్లో సబ్జెకుకు రూ.260.. రీ వెరిఫికేషన్లో సబ్జెక్ట్కు రూ.1300 మేర ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంది. బీసీల పరిస్థితులపై సమగ్ర అధ్యయనం నెల్లూరు రూరల్: బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి గురువారం నిర్వహించారు. జిల్లాలోని బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. గణాంకాలు, రికార్డులను సమగ్రంగా సిద్ధం చేసి కమిషన్కు అందజేయాలని సూచించారు. అనంతరం వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, నేతల నుంచి వినతిపత్రాలను స్వీక రించారు. డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మ, డీపీఓ వసుమతి, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఆరుగురు ఎంపీటీసీల సస్పెన్షన్ కోట: మండలానికి చెందిన ఆరుగురు ఎంపీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు. ఎంబేటి శశి (వంజివాక), మండి శివరావమ్మ (గూడలి – 2), మొబీన్బాషా (కోట – 2), కర్లపూడి సుబ్రహ్మణ్యం (తిన్నెలపూడి), దాసరి పోలమ్మ (సిద్ధవరం), ఎంబేటి హిమబిందు (కొక్కుపాడు)పై సస్పెన్షన్ వేటేశారు. ఈ నెల నాలుగున నిర్వహించిన కోట ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వీరిని సస్పెండ్ చేశారు. గస్తీ బోటు రాకతో తమిళ జాలర్ల పరార్ వాకాడు: అక్రమ వేటను నివారించేందుకు సముద్రంపై గస్తీ తిరుగుతున్న అధికారుల బోటు సైరన్ను వాకాడు మండలం తూపిలిపాళెం తీరంలో మోగించడంతో తమళ జాలర్లు పరారయ్యారు. తూపిలిపాళెం తీరం వద్ద వేటను అక్రమంగా సాగిస్తున్న క్రమంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మైరెన్, మత్స్యశాఖ అధికారుల బోటు ఉనికిని పసిగట్టిన వీరు తమ ఖరీదైన వలను కత్తులతో కోసి అక్కడే వదిలేసి పరారయ్యారు. అధికారులు వెంబడించినా, పలాయనం చిత్తగించారు. నిరీక్షణ.. చివరికి వాయిదా సైదాపురం: అధికారులు గంట తరబడి నిరీక్షించారు. చివరికి కోరం లేక మండల సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని ఎంపీడీఓ ప్రకటించారు. సైదాపురం మండల సర్వసభ్య సమావేశాన్ని గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించాల్సి ఉంది. మండల, గ్రామ స్థాయి అధికారులు హాజరై సభ్యుల కోసం నిరీక్షించారు. అయితే ఎంపీపీ పలుగొటి పెంచలమ్మ, ఊటుకూరు, పాలూరు ఎంపీటీసీలు తిరకాల భాస్కర్, ఈశ్వరరాజు మాత్రమే హాజరయ్యారు. తమకు నిధులను కేటాయించడంలో పక్షపాత ధోరణిని పాటించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి సమావేశాన్ని వాయిదా వేశారు. -
సర్దాగా మార్చేశారు..!
● అధికార పార్టీ బీఎల్ఏలుగా క్షేత్ర సహాయకులు ● ప్రభుత్వం నుంచి గౌరవవేతనం పొందుతూ.. ● విషయం తెలిసినా, మౌనం వహిస్తున్న అధికారులు ● ప్రక్రియ సజావుగా సాగడంపై అనుమానాలు సాక్షి టాస్క్ఫోర్స్: కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను టీడీపీ నేతలు అస్తవ్యస్తంగా మార్చారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పలువురు క్షేత్ర సహాయకులు, అక్రిడిటేషన్ పొందిన కొందరు మీడియా ప్రతినిధులు సైతం అధికార పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లుగా (బీఎల్ఏ) రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారివి తొలగించే కుట్రలో భాగస్వాములవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయిలో అత్యంత కీలకంగా ఉన్న ఉపాధి హామీ ఎఫ్ఏలు ఇందులో చేరడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఏం జరుగుతోంది..? ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు అత్యంత కీలకం. ఈ వ్యవస్థను అనేక సార్లు అపహాస్యం చేసిన చంద్రబాబు.. ప్రతిపక్ష ఓట్లను తొలగించే వ్యవహారానికి శ్రీకారం చుట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సర్ ప్రక్రియలో పచ్చ పార్టీ కార్యకర్తలు చొరబడి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే బీఎల్ఓలను తమ గుప్పెట్లో పెట్టుకొని.. ప్రతిపక్ష పార్టీల బీఎల్ఏలకు సమాచారమివ్వకుండానే ఎన్యూమరేషన్ ఫారాలను ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తమకు వ్యతిరేకంగా ఓట్లు పడే కుటుంబాల్లో కొన్నింటిని తొలగించే కుతంత్రాన్ని పన్నుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారనే సాకుతో ఓట్ల సంఖ్యను తగ్గించే కుట్రకు పదును పెడుతున్నారనే మాట టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. కాలనీల్లోని ప్రతి కుటుంబంపై పూర్తి అవగాహన ఉండి. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న క్షేత్ర సహాయకులు, వెలుగు వీఓఏలను ఉపయోగించి తమకు అనుకూలంగా లేని ఓట్లను తొలగించే దుస్సాహసానికి తెరలేపారనే అంశం తాజా పరిణామాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. -
యాదవులపై టీడీపీ పైశాచిక ప్రచారం
కావలి: కావలి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా యాదవ సామాజిక వర్గం రగిలిపోతుంది. కొంత కాలంగా అధికార పార్టీలోని యాదవ సామాజిక వర్గం అణిచివేతకు గురవుతోందని లోలోన మదనపడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండడంతో అవమానాలు జరుగుతున్నప్పటికీ ఏమీ చేయలేక పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. కొంతమంది అప్పుడప్పుడు బాహాటంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవల యాదవ సామాజిక వర్గానికి చెందిన మురళీయాదవ్ పూర్తిగా అణిచి వేయబడుతూ తీవ్రంగా అవమానాలకు గురి చేస్తుండడంతో దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ టీడీపీతో అనుబంధాన్ని వీడి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారు. బతికున్న మనిషిని చంపేస్తూ పోస్టులు కావలికి చెందిన చిలకపాటి మధు అనే వ్యక్తి యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యే అడుగులకు మడుగులు ఒత్తుతూ టీడీపీలోని యాదవ సామాజిక వర్గం నేతల నుంచి ప్రతిపక్ష నేతలనూ సైతం టార్గెట్ చేసి అభ్యంతరమైన రీతిలో కించపరుస్తూ పోస్టులు పెట్టించడంతో పాటు ఈ–పేపర్ మీడియాల్లో కథనాలు రాయించి, ఆ కథనాలను సైతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ బోగోలు మండలాధ్యక్షుడు మద్దిబోయిన వీర రఘు అకాలంగా మృతి చెందారంటూ పోస్టులు పెట్టిన వీరు.. తాజాగా గుండ్లపల్లి మురళీయాదవ్ టీడీపీని వీడిపోయాడని అతన్నే కాదు.. ఆ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కించపరుస్తూ ‘యాదవ నాయాళ్లారా’ అని సంభోదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావుకు ఇటీవల విక్రమసింహపురి యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేయడాన్ని కూడా తప్పు పడుతూ ఆయనపైనా దుష్ప్రచారం చేస్తూ పెయిడ్ ఈ–పేపర్ మీడియాల్లో కథనాలు రాయించారు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి పెల్లుబికింది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఆ సామాజిక వర్గం ఏకతాటిపైకి వచ్చి ఈ నెల 14న కావలిలోని జర్నలిస్టు క్లబ్లో మురళీయాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు చైతన్య, మరికొంతమంది నాయకులు మీడియా సమావేశంలో చిలకపాటి మధు పైశాచిక పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకపాటి మధుని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తమ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి కించపరచడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా నీచమైన పోస్టులు సొంత పార్టీ నేత బీద మస్తాన్రావునూ వదిలి పెట్టని వైనం అన్ని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయని పరిస్థితి రగిలిపోతున్న ఆ సామాజిక వర్గీయులు ఫిర్యాదులు బుట్టదాఖలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా ముసుగులో పెయిడ్ ఆర్టిస్ట్లు చిలకపాటి మధు, చిలకపాటి మనోహర్, మధు కిషోర్, తోకల శ్రీను, గొర్రెపాటి హరీష్ తదితరులు వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి నిత్యం అభ్యంతరకరమైన రీతిలో పోస్టులు పెడుతుండడంతో ఇటీవల మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో యాదవ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ పోస్టుల పెట్టడాన్ని నిరసిస్తూ కావలితోపాటు బోగోలు, దగదర్తి, అల్లూరు పోలీస్స్టేషన్లో ఆ సామాజికవర్గీయులు వరుసగా ఫిర్యాదులు చేశారు. అయినా ఇంత వరకు కేసులు నమోదు చేయకపోగా, పోలీసులు సదరు సోషల్ మీడియా వ్యక్తులకు వత్తాసు పలకడాన్ని పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని యాదవులు ఏకతాటిపైకి వచ్చి మండి పడుతున్నారు. కేసులు బుట్టదాఖలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు తాము ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి అండతో కొంత మంది టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్లు యాదవ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి అభ్యంతరకరమైన రీతిలో పైశాచిక ప్రచారానికి తెగబడుతున్నారు. ఆ సామాజిక వర్గీయులను కించపరుస్తూ సోషల్ మీడియాతో పాటు ఈ–పేపర్ మీడియాల్లో కథనాలు రాయిస్తున్న వైనం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయిలో ఆ సామాజిక వర్గీయులు రగిలిపోతున్నారు. సదరు సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయకపోగా, వారికే వత్తాసు పలుకుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
కాపలాదారుడి దారుణ హత్య
ముత్తుకూరు (పొదలకూరు): రొయ్యల గుంతల వద్ద దశాబ్ద కాలంగా కాపలాగా ఉన్న ఓ గిరిజన వృద్ధుడిని గుర్తుతెలియని వారు కర్రలు, కత్తులతో దాడి చేసి హతమార్చారు. మంగళవారం అర్ధరాత్రి వృద్ధుడిని పాశవికంగా హత్య చేయడం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పొట్టెంపాడు నక్కల కాలువ సమీపంలో పోలంరాజు గుంటకు చెందిన దువ్వూరు సుబ్బరామిరెడ్డి రొయ్యల చెరువుల వద్ద అల్లూరి శేషయ్య (70) పది సంవత్సరాలుగా కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కృష్ణపట్నం సీఐ రఘుబాబు, ఎస్సై కొండారెడ్డి, పోలీస్ సిబ్బందితో బుధవారం ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సీఐ వెల్లడించారు. సుబ్బరామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతిముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణపట్నం దళితవాడకు చెందిన దాసరి మహీధర్ (33) పంటపాళెంలోని పామాయిల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన బావను ఫ్యాక్టరీ వద్ద వదిలిపెట్టి బైక్పై బయలుదేరిన మహీధర్ తిరిగి ఇంటికి వెళ్లలేదు. అర్ధరాత్రి గోపాలపురం సమీపంలోని తూము వద్ద పొలంలో బైక్ లైట్లు వెలుగుతుండటాన్ని గమనించిన స్థానికులు వెళ్లి పరిశీలించగా మహీధర్ హెల్మెట్తో బోర్లా పడి మృతిచెంది ఉండటాన్ని గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఆరడుగుల దిగువనున్న పొలంలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగి మృతిచెంది ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేశారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడులునెల్లూరు సిటీ: నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్కు ఎదురుగా చెరకు తోటలో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. బుధవారం రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేశారు. ఎనిమిది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. రూ.5,610 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.కాలువలో మృతదేహం లభ్యంనెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ పరిధిలోని కేవీకే కల్యాణ మండపం వద్ద కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 40 – 45 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. అతను చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
కనుపూరు చెరువులో గ్రావెల్ తవ్వకాలు
● అడ్డుకునేందుకు ఇరిగేషన్ అధికారుల యత్నం ● వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు వెంకటాచలం: మండల కేంద్రమైన వెంకటాచలంలోని కనుపూరు చెరువులో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు టీడీపీ నేతలు తెరలేపారు. పలువురు నాయకులు బుధవారం పోటాపోటీగా ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలతో గ్రావెల్ తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమంగా గ్రావెల్ తరలించారు. దీనిపై స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు అడ్డుకునేందుకు కనుపూరు చెరువు వద్దకు వెళ్లగా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. అయితే అక్రమ గ్రావెల్ తవ్వకాలపై సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. దీంతో తవ్వకాలను నిలిపివేసి జేసీబీ, ట్రాక్టర్లను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. -
వసతి గృహ విద్యార్థులపై నిర్లక్ష్యం తగదు
నెల్లూరు(వేదాయపాళెం): వసతి గృహ విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే మస్తాన్ షరీఫ్ అన్నారు. నెల్లూరులోని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం బుధవారం నేతలు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్ అంకయ్యకు వినతిపత్రం సమర్పించారు. శివంవర్మ, సోహెల్, ఖాదర్బాషా, మౌళి, అశోక్, రమేష్, కుమార్, జగదీష్ పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
● జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం నెల్లూరు(అర్బన్): మలేరియాతోపాటు డెంగీ, చికున్గున్యా, ఎన్సెఫలోపతి తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం సూచించారు. బుధవారం నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో వివిధ సబ్ యూనిట్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ నెలలో తొలకరి వర్షాలు పడుతున్నాయన్నారు. ఇందువల్ల దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుత్రపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. కరపత్రాలు పంచుతూ ఆరోగ్య సూత్రాలు తెలియచేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఆల్ఫాసైఫోమెత్రిన్ లాంటి మందులను స్ప్రే చేసి బ్యాక్టీరియాలను నశింపజేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జయరామ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఏఐతో విప్లవాత్మక మార్పులు
నెల్లూరు(టౌన్): విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, బ్యాంకింగ్, పరిశోధన లాంటి అనేక రంగాల్లో ఏఐతో విప్లవాత్మక మార్పులు వస్తాయని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల డీన్ గంగినేని ధనుంజయ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, వైద్య, డిగ్రీ కళాశాలల్లో బోధన, పరిశోధన, మూల్యాంకనం తదితర కార్యకలాపాల్లో ఏఐ ఆధారిత విధానాలను అమలు చేస్తున్నారన్నారు. ఏఐ విద్యావ్యవస్థను పూర్తిగా మార్చగల శక్తిగా అవతరిస్తుందన్నారు. ఏఐ ప్రభావంతో ఉద్యోగ రంగంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దివ్యాంగ విద్యార్థుల విద్యా ప్రగతికి ఏఐ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎంబీఏ విద్య ద్వారా ఫైనాన్స్, మార్కెటింగ్, మానవవనరుల నిర్వహణ, కార్యకలాపాల నిర్వహణ, వ్యవస్థాపకత, ప్లేస్మెంట్లు తదితర వాటిల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఏఐ ద్వారా పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఉన్నత విద్యలో ఏఐను విజయవంతంగా అమలు చేయాలంటే దశల వారీ కార్యచరణ ప్రణాళిక అవసరమన్నారు. వృద్ధురాలి ఆత్మహత్యమర్రిపాడు: మండలంలోని అల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. డి.కొండమ్మ (75) బుధవారం పురుగు మందు తాగింది. గమనించిన కోడలు ఆమెను వెంటనే ఆత్మకూరు వైద్యశాలకు తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తీసుకెళ్తుండగా కొండమ్మ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొండమ్మకు ఐదుగురు పిల్లలున్నారు. -
నెల్లూరు నుంచే పోరుబాట
● ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నెల్లూరు (అర్బన్): పోరాటాల పురిటి గడ్డ.. ఎన్నో ఉద్యమాలకు నాంది పలికిన నెల్లూరు నుంచే ఉద్యోగుల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు శ్రీకారం చుడుతున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పీఆర్సీ ఐఆర్, డీఏ అరియర్స్, సరెండర్ లీవు, ఎర్న్ లీవులు తదితర ఆర్థిక అంశాలపై కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన పోరాటంపై చర్చించేందుకు బుధవారం బొప్పరాజు వెంకటేశ్వర్లు నెల్లూరులో జేఏసీలో భాగస్వాములైన అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముక వంటి వారన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేసేది కూడా ఉద్యోగులేనన్నారు. ఉద్యోగులకు ఉన్న గౌరవ ప్రదమైన జీవితాన్ని ఆర్థిక పరంగా దిగజార్చవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతున్నామన్నారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ సిద్ధం ఇప్పటికే 28 జిల్లాల్లో ఉద్యమ కార్యాచరణపై కార్యవర్గ సమావేశాలు నిర్వహించామన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కలిసొచ్చే సంఘాలను కలుపుకుంటూ మంత్రులను కలుస్తూ ఉద్యమ అవసరాన్ని వివరిస్తున్నామన్నారు. రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారని, రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 90 శాతం ఉద్యోగుల ఖర్చులకే సరిపోతున్నాయని చెబుతూ ప్రజల దృష్టిని ప్రభుత్వం మళ్లించడం అన్యాయమన్నారు. పెన్షనర్లకు, ఉద్యోగులకు పెట్టే ఖర్చుపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెల సాధనకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం చేపట్టే కార్యక్రమాలను వంద శాతం విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఒక్కటంటే ఒక్క ఆర్థిక ప్రయోజనం చేకూర్చలేదని తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణిపేర్రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ ఓవీ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్, జిల్లా మహిళా చైర్మన్ సోమిశెట్టి వసంతకుమారి, మహిళా సెక్రటరీ చెన్నమ్మ, కార్యవర్గ సభ్యులు థామస్, చెంచురామయ్య, మురళి, మాల్యాద్రి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు డానియేల్ పీటర్, గోపీకృష్ణ, బాలకోటమ్మ, వెంకట్, ప్రధానోపాధ్యాయుల సంఘం గౌరవాధ్యక్షుడు ఎమ్వీ చలపతి, బుజ్జయ్య, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘ నాయకులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొని ఉద్యమానికి మద్దతుగా సంఘీభావాన్ని ప్రకటించారు. -
తహసీల్దార్ కార్యాలయంలో రైతు నిరసన
ఉదయగిరి రూరల్: మండల తహల్దార్ కార్యాలయంలో బుధవారం ఓ రైతు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గన్నేపల్లి రెవెన్యూ పరిధిలోని కొట్టాలపల్లికి చెందిన కే రామానాయుడుకు 135–3–2 సర్వేనంబరులో 60 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. వారసత్వంగా వచ్చిన ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో భూమిపై బ్యాంకులో వ్యవసాయ రుణం సైతం తీసుకుని చెల్లించి ఉన్నాడు. ప్రస్తుతం భూమిపై వ్యవసాయం రుణం పొందేందుకు బ్యాంకుకు వెళ్లగా నిషేధ జాబితాలో ఉందని తిరస్కరించారు. ఈ విషయమై రైతు వీఆర్వోను అడిగేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ సీట్లో ఉన్న వీఆర్వోకు సమస్యను విన్నవించే క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలో గన్నేపల్లి వీఆర్వో కార్యాలయానికి రాగా తన భూమిని ఎలా మారుస్తారు అంటూ నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తహసీల్దార్ ఎల్ రామ్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లగా లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేస్తే రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రైతుల్ని ఆదుకోవడంలో ‘కూటమి’ విఫలం
● ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు: అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం యూరియా సైతం తగినంత సరఫరా చేయలేక ఏపీఏఐఎంఎస్ యాప్తో వారిని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. యాప్ను తీసుకొచ్చి కొత్త విధానం అమలు చేస్తున్నామని బుకాయిస్తూ అన్నదాతలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులు, పట్టాదారు పాస్పుస్తకాల్లేని రైతులు, చెరువు లోతట్టు ప్రాంతాల్లో సాగు చేస్తున్న వారికి ఈ ప్రభుత్వం ఎరువులు అందించక పంగనామం పెడుతుందని, దీంతో వారు ఎరువుల దుకాణాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లో ఆర్బీకేలను ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు గుమ్మం ముందుకే చేర్చారన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సమృద్ధిగా సాగునీరు ఉన్న క్రమంలో లక్షల ఎకరాల్లో పైర్లు సాగవుతున్న విషయం ప్రభుత్వం ముందుగా గుర్తించక, ఎరువుల సరఫరా చేయడంలో విఫలమవ్వడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం అధికారుల ద్వారా ఎరువుల నిల్వలు పెంచి కొరత లేకుండా యూరియా, డీఏపీ, తదితర ఎరువులను డిమాండ్ మేరకు సరఫరా చేయడంలో చొరవచూపాలని కోరారు. కౌలు రైతులకు ప్రత్యేక విధానం ద్వారా ఎరువులు అందజేయాలని, పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. రైతులు మండిపడి రోడ్డెక్కే పరిస్థితులు తీసుకురావ్వొద్దని పేర్కొన్నారు. -
ప్రశాంతమ్మా.. విమర్శలు మాని అభివృద్ధిని చూపండి
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి బుచ్చిరెడ్డిపాళెం: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కూటమి ప్రభుత్వ, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. బుచ్చిరెడ్డిపాళెంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తనపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇటీవల పెనుబల్లి, చెల్లాయపాళెం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెనుబల్లిలో రూ.60 లక్షలతో గ్రామ సచివాలయం, రూ.22లక్షలతో రైతుభరోసా కేంద్రం నిర్మించామని చెప్పారు. రూ.2.10 కోట్లతో ముంబై హైవే నుంచి పెనుబల్లి వరకు సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. జొన్నవాడ నుంచి బుచ్చిరెడ్డిపాళెం వరకు పెనుబల్లి మీదుగా రహదారి అభివృద్ధికి రూ.2.50 కోట్లు వెచ్చించామని తెలిపారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా మండల పరిషత్ పాఠశాలను రూ.15 లక్షలు, ఉన్నత పాఠశాలను రూ.35 లక్షలతో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. తుపానుతో కూలిపోయిన పాఠశాల ప్రహరీని సహకార బ్యాంకుల ద్వారా రూ.45 లక్షలు సమీకరించి నిర్మించామని చెప్పారు. ఆనాడు డీసీఎమ్మెస్ చైర్మన్గా ఉన్న వీరి చలపతి రూ.25 లక్షలు, వవ్వేరు బ్యాంకు చైర్మన్గా ఉన్న సూరా శ్రీనివాసులురెడ్డి రూ.10 లక్షలు కేటాయించారని తెలిపారు అలాగే మరో బ్యాంకు చైర్మన్గా ఉన్న మేనకూరు సీతారామిరెడ్డి రూ.10 లక్షలు అందజేశారని చెప్పారు. ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే తెలుసుకుని మాట్లాడాలన్నారు. తమ ప్రభుత్వంలో 33 సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలకు అండగా నిలిచామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ హామీలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా మంజూరు చేసిందా అని నిలదీశారు. మేము చేసిన అభివృద్ధిని సాక్షాధారాలతో సహా వెల్లడిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. కోవూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రౌడీయుజం ఎక్కువైందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థి పార్టీల ఫ్లెక్సీలు చించివేయడంతో పాటు కార్యకర్తలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ వంశీపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ రాజకీయ భిన్నాభిప్రాయాలను హింసతో అణచివేయాలని చూడడం ప్రమాదకర ధోరణి అని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను ఎదుర్కోవాలి గానీ దాడులతో సమాధానం చెప్పడం సరికాదన్నారు. అధికార పార్టీ నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి ఒకచోట..తవ్వకాలు మరోచోట
చిట్టమూరు: తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో నది పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆరోపిస్తూ చిట్టమూరు మండలానికి చెందిన పలువురు రైతులు గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. వారి ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని తిరుపతి, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు నోటీసులిచ్చింది. అయినా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తే ఎదురు దాడి స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు ఓ ప్రైవేటు సంస్థకు గనుల శాఖ ద్వారా అనుమతులిచ్చారు. కోట మండలం గూడలి ప్రాంతంలో మాత్రమే తవ్వకాలు చేపట్టాలని అనుమతులున్నప్పటికీ.. సదరు సంస్థ నిబంధనలను పట్టించుకోకుండా ఇతర ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చేపడుతోందని ఆరోపణలున్నాయి. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన వారిపై అడిగేందుకు మీరు ఎవరంటూ ఎదురు దాడికి దిగుతున్నారని రైతులు వాపోతున్నారు. పరిధి దాటి తవ్వకాలు కోట మండలం గూడలి ప్రాంతంలో మాత్రమే ఇసుక రీచ్కు అనుమతులున్నాయి. అక్కడ నిబంధనలను తుంగలో తొక్కి అనుకున్న దాని కన్నా ఎక్కువగా తవ్వకాలు పూర్తి చేసుకుని.. ఇసుక లేదని నిర్ధారించుకున్న అనంతరం స్వర్ణముఖి నదిలో ఎగువ ప్రాంతంలోని చిట్టమూరు మండలంలో ఉన్న గునపాడు, మెట్టు, గునపాటి పాళెం గ్రామాలకు సమీపంలోని నదీ గర్భంలో లోతుగా తవ్వకాలు చేపడుతున్నారు. పగలు, రాత్రి సమయంలో తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నా కనీసం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. 40 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు చిట్టమూరు, వాకాడు, కోట మండలాలలోని సుమారు 40 గ్రామాలకు తాగు, సాగునీటి అవసరాలకు స్వర్ణముఖి నది ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాలుగా ఒక పంట పూర్తిగా పండితే రెండో పంటకు నీరు లేని స్థితి ఏర్పడుతోంది. మూడు మండలాల్లో నది పరీవాహపక ప్రాంతాలతోపాటుగా స్వర్ణముఖి నదిని ఆధారంగా చేసుకుని ఉన్న చెరువుల కింద సుమారుగా 15 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. వేసవి కాలంలో నీరు ప్రవహించకపోతే నదిలోనే బోర్లు వేసుకుని పంటలకు నీరు అందించేవారు. ఇలా రైతులు సుమారు 3 వేలకు పైగా బోర్లు నది పరీవాహక ప్రాంతంలో వేసుకుని సాగు చేస్తున్నారు. అలాగే తాగునీటి పథకాలకు చెందిన బోర్లు కూడా నదిలోనే ఉండటంతో భారీగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు ఉచిత ఇసుక పేరుతో కాంట్రాక్ట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్ద యంత్రాలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా నాయుడుపేట, గూడూరు ప్రాంతాలకు, టిప్పర్ల ద్వారా చైన్నె, బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. అయినా ఆగలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనుమతులు పొందిన గూడలి రీచ్ పరిధిని దాటి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని చిట్టమూరు మండలంలో ఉన్న గునపాడు, గునపాటిపాళెం, మెట్టు గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్లో పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ చైన్నెలోని గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. రైతులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన ట్రిబ్యునల్.. స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు బ్రేక్ వేయాలని రెండు జిల్లాల కలెక్టర్లకు సూచించినట్లు రైతులు తెలిపారు. అయినా తవ్వకాలు కొనసాగుతున్నాయని, ఇకనైనా అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేసి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇష్టారాజ్యంగా స్వర్ణముఖి నది ఇసుక తరలింపు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతుల ఆందోళన రెండు జిల్లాల కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన -
విభిన్న ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు
నెల్లూరు(టౌన్): జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం అందజేసే స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు. ప్రత్యేక అవసరాల గల 394 మంది పిల్లలకు రూ.22.14 లక్షల విలువ చేసే సహాయక పరికరాలను నెల్లూరులోని ఏన్జీఓ హోంలో బుధవారం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2025 – 26 విద్యా సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం ద్వారా ఎస్కార్ట్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, బాలికల స్టై ఫండ్, బేస్డ్ ఎడ్యుకేషన్ కలిపి రూ.71.82 లక్షలు అందజేయడం జరిగిందన్నారు. డీఈఓ బాలాజీరావు మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో సీడబ్ల్యూసీఎన్ విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ప్రత్యేక అవసరాల గల పిల్లలకు హియరింగ్ పరికరాలు, టీఎల్ఎం, బ్రెయిల్ కిట్లు, వీల్చైర్లు, ట్రై సైకిళ్లు తదితర వాటిని అందజేసినట్లు చెప్పారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ 6 ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు, కావలి, వింజమూరు, గూడూరు ప్రాంతాల్లో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. వాటి ద్వారా పిల్లలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేట్ బొబ్బల శ్రీనివాస యాదవ్, ఏఎంఓ సుధీర్బాబు, ఐఈ కో ఆర్డినేటర్ ప్రసాద్రావు, ఎంఈఓ మురళి, అలింకో ప్రతినిధి సోని యాదవ్, సెక్టోరియల్ అధికారులు, ఐఈఆర్పీలు పాల్గొన్నారు. -
వింజమూరులో భారీ వర్షం
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగ్లా సెంటర్లోని ఇరిగేషన్ కార్యాలయం, ఎస్సీ వసతిగృహంలోకి సుమారు అడుగున్నర మేర వర్షపు నీరు చేరడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఈదురుగాలులకు ఎమ్మెస్సార్ డిగ్రీ కళాశాల సమీపంలోని కాలనీలో చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు నేలకొరిగాయి. పట్టణంలోని పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని బొమ్మరాజుచెరువు ప్రాంతంలో ఇటుకబట్టీల్లోని ఇటుకలు వర్షానికి తడిసిపోయాయి. మామిడితోటల్లోని కాయలు నేలరాలడంతో రైతులు నష్టపోయారు. కలిగిరి, జలదంకి, వింజమూరు, కొండాపురం, దుత్తలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీవ్ర ఎండవేడితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. -
విద్యార్థులకు యోగా పోటీలు
నెల్లూరు(బారకాసు): యోగా పోటీల విజేతలకు నెల్లూరు ఎన్ఎంసీ కార్యాలయంలోని సీసీసీ భవన సమావేశ మందిరంలో బుధవారం బహుమతులు ప్రదానం చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో పోటీలు ఈనెల 14, 15, 16 తేదీల్లో నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగాయి. విజేతలను మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైఓ నందన్, డిప్యూటీ డైరక్టర్ మాధురి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, ఆయుష్ డాక్టర్ ఎ.శారద హెప్సీబా ఘనంగా సత్కరించి బహుమతులను అందజేశారు. మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు రాజేంద్ర, ప్రసన్నకుమార్, స్వప్న, యోగా అబ్జర్వర్లు రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 86,601 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,111 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.32 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ వినతుల స్వీకరణ నేడు నెల్లూరు(వేదాయపాళెం): డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్రంజన్మిశ్రా కలెక్టరేట్ ఆవరణలోని తిక్కనభవన్లో గురువారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి పీ వెంకటలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరిస్తారని చెప్పారు. జిల్లాలోని కుల సంఘాలు, పౌరులు, ప్రజాప్రతినిధులు తమ వినతులను అందజేయాలని కోరారు. ఊనుగుంటపాళెంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోట: మండలంలోని ఊనుగుంటపాళెం సమీపంలో 12 మెగా వాట్స్ సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్తెలిపారు. బుధవారం రాత్రి ఆయన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం సేకరించిన స్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం 40 ఎకరాలు సేకరించినట్లు తెలిపారు. మోహన్ స్పింటెక్స్ సంస్థ విద్యుత్ కేంద్రం పనులు చేపడుతుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లోగా కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను యూనిట్ రూ.3.09 వంతున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఆయన వెంట టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య, సీజీఎం రమణ, నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్ఈలు రాఘవేంద్ర, చంద్రశేఖర్, గూడూరు ఈఈ నరేంద్రరెడ్డి ఉన్నారు. అవినీతిలో టీడీపీ నేతల కొత్తపుంతలు ● కాలువలో నీరు ప్రవహిస్తుండగానే పూడికతీత పనులు ● బిల్లుల కోసమే తూతూమంత్రంగా చేపడుతున్నారని రైతుల గగ్గోలు మనుబోలు: సర్వేపల్లి నియోజకవర్గ అధికార పార్టీ నాయకులు అవినీతిలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇరిగేషన్ పనులు చేయకుండానే చేసినట్లుగా చూపిస్తూ బిల్లులు చేసుకున్న ఉదంతాలు మరవక ముందే మరో సరికొత్త అవినీతికి తెరతీశారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి నుంచి చెర్లోపల్లి వరకు ఉన్న కండలేరు పంట కాలువలో నిండుగా నీరు ప్రవహిస్తుండగానే పూడికతీత పనులు పడుతున్నారు. సాధారణంగా పంట కాలువల్లో సాగునీటిని విడుదల చేయకముందే పూడికతీత పనులు చేపట్టాలి. కానీ టీడీపీ నాయకులు అందుకు విరుద్ధంగా కాలువకు నీరు వదిలాక పూడికతీత పనులు చేపట్టడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకునేందుకు తూతూ మంత్రంగా కాలువ గట్టుపై ఉన్న గడ్డిని తొలగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. -
ఓఆర్బీ–ఈ స్కూటర్ డిజైన్కు పేటెంట్
గూడూరురూరల్: ఆదిశంకర కమ్యూనిటీ ఇంకుబేషన్ సెంటర్ (ఏసీఐసీ), అటల్ ఇన్నోవేషన్ మిషన్ (నీతి ఆయోగ్)లో ఇంకుబేషన్ పొందుతున్న భారత్ ఆల్ట్ ఫ్యూయెల్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి విప్లవాత్మక ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఓఆర్బీ–ఈ’కి డిజైన్కు పేటెంట్ను అధికారికంగా మంజూరు చేసినట్లు ఆదిశంకర డీమ్డ్ టు బీ యూనివర్సిటీ చాన్సలర్ అరవింద వంకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ స్టార్టప్లు, అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరణలు చేయగలవని ఈ పేటెంట్ నిరూపిస్తోందన్నారు. దీని ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ప్రోత్సహించే మేక్ ఇన్ ఇండియా దృష్టిని బలంగా ధ్రువపరుస్తోందన్నారు. ఓఆర్బీ–ఈను ఆధునిక డిజైన్తో పట్టణ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. ఆదిశంకర ఏసీఐసీ కేంద్రం ద్వారా మొబిలిటీ, క్లీన్టెక్, అధునాతన ఇంజినీరింగ్ రంగాల్లో స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ఆదిశంకర చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య ప్రారంభించిన ఈ సదుపాయం ద్వారా నూతన ఆవిష్కరణలకు, భారతీయ తయారీ రంగానికి మద్దతు అందిస్తున్నట్లు తెలియజేశారు. -
టీడీపీ నేత నుంచి ప్రాణహాని ఉంది
● పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేజర్ల: మండలంలోని పెరుమాళ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తల్లపనేని జయంతులు నాయుడి నుంచి ప్రాణహాని ఉందంటూ అదే గ్రామానికి చెందిన గట్టుపల్లి జయరామయ్య నాయు డు మంగళవారం చేజర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సర్వే నంబర్ 591లో తనకు పొలం ఉందని, అందులో చెట్లు తొలగించేందుకు కూలీలను తీసుకువెళ్లగా జయంతులు నాయుడు మరి కొంతమంది అటకాయించి చంపేస్తామంటూ బూతులు తిడుతూ దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భార్యపై ఇటుకతో దాడి● అదనపు కట్నం కోసమే.. నెల్లూరు సిటీ: అదనపు కట్నం కోసం భర్త దాడి చేశాడంటూ ఓ మహిళ నెల్లూరు రూరల్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. మాదరాజుగూడూరు గ్రామంలోని దళితవాడలో పి.ప్రశాంత్, మానస దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అదనపు కట్నం కోసం ప్రశాంత్ కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి అతను భార్యను తిట్టాడు. అంతటితో ఆగకుండా ఇటుకతో దాడి చేశాడు. దీంతో ఆమె తల, ఎడమ చేతికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల సహకారంతో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రశాంత్ కుటుంబ సభ్యులు సహకరించారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
108 అంబులెన్స్ల తనిఖీ
నెల్లూరు(అర్బన్): భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న 108 అంబులెన్స్లను రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్ మోహన్బాబు మంగళవారం నెల్లూరులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంతోపాటు రూరల్ ప్రాంతాల్లో వాహనాలను చూశారు. పైలట్లకు సూచనలిచ్చారు. రోగులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చాలని పేర్కొన్నారు. గుండెపోటు కేసులకు సంబంధించి గోల్డెన్ అవర్గా పేర్కొనే మొదటి గంటలోనే ఆస్పత్రికి చేర్చితే వారికి చికిత్స అందుతుందన్నారు. వాహనాల్లో ఉన్న పరికరాలు, టెక్నాలజీని పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ సుజాత, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్కుమార్ను కలిసి రోగులకు 108 వాహనాల ద్వారా మెరుగైన వసతులు కల్పించే విధానం గురించి చర్చించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం
● వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు జాన్ వెస్లీ నెల్లూరురూరల్: ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారింది. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారు’ అని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు జాన్ వెస్లీ విమర్శించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశం జరిగింది. తొలుత ఆ పార్టీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అన్ని సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నేతలు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయత, చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రిస్టియన్లు, మైనార్టీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. కార్పొరేట్, మతతత్వ, కులతత్వ విధానాలతో ప్రభుత్వ వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. భూ, ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలు పెట్రేగిపోతున్నాయన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. క్రిస్టియన్ మైనార్టీ కమిషన్ను ఇప్పటివరకు ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైఎస్ జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం అందించడంతో పాటు పేద క్రైస్తవులకు జెరూసలేం యాత్ర అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఒక్కరినైనా జెరూసలేం యాత్రకు పంపిందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారన్నారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అనుదీప్, సిటీ అధ్యక్షురాలు సులోచన, రూరల్ అధ్యక్షుడు దాసరి రాజేష్, విభాగ నాయకులు పాల్గొన్నారు. -
అగ్రిగోడు
ఉదయగిరి: అగ్రిగోల్డ్ సంస్థ.. ఆకర్షణీమైన వడ్డీని ఆశ చూపింది. కోట్లాది రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసింది. ఆ తర్వాత బోర్డు తిప్పేసి డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టింది. లక్షలాది మంది డిపాజిటర్లకు తీరని శోకాన్ని మిగిల్చింది. గతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలే కుటల్రు చేసి అగ్రిగోల్డ్ సంస్థను మింగేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు బాధితులకు న్యాయం చేయకపోగా అగ్రిగోల్డ్ సంస్థ ప్రతినిధుల ద్వారా ఆస్తులను కాజేసే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వంలో బాధితులకు న్యాయం జరగలేదు. రూ.కోట్ల విలువైన సంపద స్వాహా జిల్లాలో అగ్రిగోల్డ్కు చెందిన భూములు, అందులోని సంపదను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాహా చేసే ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాలోని ఉదయగిరి, కలిగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, గూడూరు, మనుబోలు తదితర మండలాల్లో 3,200 ఎకరాల భూములు ఉన్నాయి. అందులో విలువైన జామాయిల్, మామిడి, ఎర్రచందనం చెట్లు సాగులో ఉన్నాయి. వాటిపై కూటమి నేతలు కన్నేసి సంపదను కొల్లగొట్టారు. వరికుంటపాడులోని అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్ను అక్రమంగా తరలిస్తుండగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలు అడ్డుకున్నారు. వారిపైన అక్రమార్కులు దాడులకు సైతం పాల్పడ్డారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అగ్రిగోల్డ్ భూముల్లోని రూ.కోట్ల విలువ చేసే సంపదను స్వాహా చేశారు. న్యాయం జరిగేనా..? గత వైఎస్సార్పీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని సంకల్పించింది. రూ.కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలో ఉంచి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలని భావించింది. కానీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. ఆస్తులను వేలం వేసి వచ్చిన సొమ్మును బాధితులకు ఇవ్వాలని సంకల్పించింది. ఈ వ్యవహారంలో విలువైన భూములు, ఆస్తులను కాజేసే ప్రయత్నాలు జరగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని కోసం కూటమి ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. మరి బాధితులకు ఎప్పుడు న్యాయం చేస్తుందో తెలియని పరిస్థితి. పదేళ్లుగా బాధితులు మాత్రం న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. పాదయాత్రలో జగన్ దృష్టికి.. జిల్లాలో 1.20 లక్షల మంది బాధితులు అందాల్సిన సొమ్ము రూ.150 కోట్లు న్యాయం కోసం పదేళ్లకుపైగా పోరాటం జగన్ ప్రభుత్వంలో ఊరట బాధితుల గోడును పట్టించుకోని కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఆయన కొంత మేర నిలబెట్టుకున్నారు. జిల్లాలో 1.20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరు గతంలో ప్రజాప్రతిధులు, ఆధికారుల చుట్టూ న్యాయం కోసం తిరిగి అలసిపోయారు. గత చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019లో అధికారం చేపట్టిన వెంటనే జగన్మోహన్రెడ్డి బాధితులకు న్యాయం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో రూ.10వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు రూ.50 కోట్లు చెల్లించారు. కానీ జిల్లాలో ఇంకా రూ.150 కోట్లకు పైగా చెల్లింపులు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారడంతో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయలేకపోయింది. ఇంతలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం రావడంతో అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి తలకిందులైంది. -
మొదలైన చేపల వేట
ముత్తుకూరు(పొదలకూరు): రెండునెలలపాటు కొనసాగిన చేపల వేట నిషేధ కాలం ముగిసింది. ముత్తుకూరు మండల తీర ప్రాంతాల మత్స్యకారులు పడవలు, వలలు, వేట సామగ్రితో వేటకు బయలుదేరారు. నేలటూరుపాళెం, కృష్ణపట్న ం గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేటను పునః ప్రారంభించారు. సముద్రంలో చేపల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు ప్రభుత్వం వేటపై నిషేధం విధిస్తుంది. ఈ సమయంలో మత్స్యకారులు బోట్ల మరమ్మతులు, ఇంజిన్లను సరిచేయడం, వలల తయారీ, ఇతర సామగ్రి సిద్ధం చేసుకోవడం వంటి పనులు పూర్తి చేసుకున్నారు. నిషేధ సమయం పూర్తవుతుందునగా బోట్లకు డీజిల్, ఐస్, ఆహార సామగ్రిని సమకూర్చుకున్నారు. తీరానికి చేరుకున్న మత్స్యకారులు సముద్ర దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు రోజువారీ వేటకు వెళ్లగా, మరికొందరు రెండు నుంచి నాలుగు వారాల పాటు సముద్రంలోనే ఉండి వేట సాగించనున్నారు. రెండు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకార కుటుంబాలు వేట ప్రారంభంతో ఊరట చెందుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే పీతలు, రొయ్యలు, వివిధ రకాల చేపలు అధికంగా లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రెండు నెలల విరామం తర్వాత తీర ప్రాంతాల్లో మళ్లీ బోట్ల శబ్దాలతో సందడి నెలకొంది. -
యాదవులను కించపరిచేలా పోస్టులు
● యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడిపై ఫిర్యాదు బిట్రగుంట: కావలి కేంద్రంగా సోషల్ మీడియాలో యాదవ సామాజికవర్గాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్న యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడిపై బోగోలు జెడ్పీటీసీ సభ్యురాలు మద్దిబోయిన కీర్తన బిట్రగుంట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. కావలికి చెందిన చిలకపాటి మధు అనే వ్యక్తి సీఎండీ న్యూస్ ఛానెల్ పేరుతో ఏర్పాటు చేసి యాదవులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. జర్నలిస్ట్ల పేరుతో కావలి కేంద్రంగా ఎన్నో యూట్యూబ్ ఛానెళ్లు, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తూ యాదవ సామాజికవర్గాన్ని కించపరచడమే లక్ష్యంగా ఈ ముఠా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇటీవల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు యాదవ్పై సైతం ఇదే తరహాలో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వైరల్ చేశారని గుర్తుచేశారు. రఘు చనిపోయాడంటూ అర్ధరాత్రి సమయంలో వాట్సాప్లో తప్పుడు కథనాలు వైరల్ చేశారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. పోలీసులు ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కాగా అంతకుముందు కీర్తన నివాసం వద్ద వీరరఘు, స్థానిక యాదవ సామాజికవర్గ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చిలకపాటి మధును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ విలేకరులకు కూడా పోలీసులు వంతపాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలోనూ ఈ ముఠా తప్పుడు వ్యవహరాలపై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. -
అపార్ట్మెంట్లో భారీ చోరీ
జిల్లాలో శాంతిభద్రతలు భ్రమగా మారాయి. పోలీస్ వ్యవస్థ రెడ్బుక్ రాజ్యాంగం మత్తులో తూగుతూ ఉండడంతో నేరస్తులు పంజా విసురుతూనే ఉన్నారు. వేకువ జామున ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వందల మంది పోలీసుల బూట్ల చప్పుళ్లతో హడావుడి చేసి కార్డెన్ సెర్చ్లంటూ ఇల్లిల్లూ జల్లెడ పడుతున్నా.. నాకాబందీ అంటూ ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నా.. నేరాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా వ్యవహరించిన పోలీస్ వ్యవస్థ నిఘాను పూర్తిగా గాలికొదిలేసింది. ప్రజలు రాత్రి వేళే కాదు.. పగటి పూట కూడా ప్రశాంతంగా, భద్రతగా బతకలేని పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. పట్టపగలు వరుస చైన్ స్నాచింగ్లే కాకుండా.. ఏకంగా భారీ చోరీలు, దోపిడీలకు తెగబడుతున్నారు. రాత్రయితే మద్యం మత్తులో రౌడీమూకలు రోడ్లపై చెలరేగుతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన చోరీలు, దోపిడీలే ఇందుకు అద్దం పడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా దొంగలు బరితెగిస్తున్నారు. పట్టపగలే ప్రజల సొమ్మును ఇట్టే కొల్లగొడుతూ పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఆరు నెలల వ్యవధిలో దుండగులు సుమారు రూ.3 కోట్లకు పైగా సొత్తును దోచుకెళ్లారు. వరుస దొంగతనాలు జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో ప్రతి రోజు ఏదో ఒక పోలీసుస్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు కార్డెన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. పాతనేరస్తుల కదలికలపై నిఘాతోపాటు జైల్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టం చేశారు. అయినప్పటికీ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. నేరస్తులు యథేచ్ఛగా నేరాలకు పాల్పడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని పంజా విసురుతున్నారు. రాత్రులే కాదు పట్టపగలే నిర్భయంగా ప్రజలు కూడబెట్టుకున్న ఽసొత్తును దోచుకెళుతున్నారు. శివారు ప్రాంతాల్లోని ఇళ్లలోనే కాకుండా అపార్ట్మెంట్ల్లోనూ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. దొంగతనాలకు కాదేది అనర్హమంటూ చోరులు దేవాలయాలను వదలడం లేదు. కొంతకాలంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఓ కేసులో నిమగ్నమై ఉండగానే నేరస్తులు మరో చోట నేరాలకు పాల్పడుతూ పోలీస్ వ్యవస్థకు చాలెంజ్ విసురుతున్నారు. ఈ పరిణామాలతో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. పసిడి ధరలు పెరగడమే.. రోజు రోజుకు బంగారం ధరలు రాకెట్లా దూసుకెళుతుండటంతో దొంగల కన్ను పసిడిపై పడింది. దీంతో దొంగతనాలు అధికమయ్యాయి. పోలీసు గస్తీ అంతంత మాత్రంగా ఉండడం, అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం చోరులకు కలిసి వస్తోంది. దొంగలు చిన్నపాటి ఆధారం దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖాలకు మాస్క్లు, తలకు హెల్మెట్లు ధరించి నంబర్ ప్లేట్లు లేని, దొంగిలించిన బైక్లపై సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలను, డీవీఆర్లను అపహరించుకుని వెళుతున్నారు. రాత్రి వేళల్లో బైక్పై వెళుతున్న దంపతులను కత్తులతో బెదిరించి నగలు, నగదు దోచేస్తున్నారు. పసిడి కోసం హత్యలకు, హత్యాయత్నాలకు వెనుకాడడం లేదు. తాజాగా నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో ఓ అపార్ట్మెంట్లో పట్టపగలు దుండగలు దాదాపు 30 సవర్ల బంగారం, 2 కేజీల వెండిని దోచుకెళ్లడం జిల్లాలో సంచనలనంగా మారింది. సెక్యూరిటీతోపాటు సీసీకెమెరాల నీడలో ఉండే అపార్ట్మెంట్లోనే దొంగలు దర్జాగా స్కూటీపై దోచుకెళ్లారంటే చోరుల బరితెగింపునకు, ఖాకీ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. గొలుసు దొంగతనాలు జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో శివారు ప్రాంతాల్లో ఎక్కువగా చోటు చేసుకునేవి. ఇప్పుడు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ గొలుసులను తెంపుకెళుతున్నారు. రోడ్లపై ఒంటరిగా వెళ్లే, ఇళ్ల ముందు శుభ్రం చేసుకునే, దుకాణాల్లో ఒంటరిగా ఉంటున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళుతున్నారు. మహిళలపై దాడిచేసి మరీ దోచుకెళుతున్నారు. ఇటీవల నెల్లూరు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను దుండగులు తెంపుకెళ్లారు. గూడూ రుకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు ఆటలో పాఠశాలకు వెళుతుండగా ఆటో డ్రైవర్ ఆమైపె దాడి చేసి మెడలోని ఒకటిన్నర సవర బంగారు గొలుసును దోచుకున్నాడు నిఘా ఏదీ..? నిఘా, సాంకేతికత చోరీలను కట్టడి చేయలేకపోతున్నాయి. పగలు, రాత్రి గస్తీ అంతంత మాత్రంగానే మారింది. అనేక చోట్ల క్రైమ్ పార్టీలు మొక్కుబడి విధులకే పరిమితమైయ్యాయన్న విమర్శలున్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి సీసీ కెమెరాలు సక్రమంగా లేవు. ఉన్న ప్రాంతాల్లోనూ కొన్ని పనిచేయకపోవడం చోరులకు కలిసి వస్తోంది. పోలీసు అధికారులు స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు సీసీకెమెరాల నిఘా నీడలోకి జిల్లాను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఘటనలు మచ్చుకు కొన్ని.. రెండేళ్లుగా జిల్లాలో శాంతిభద్రతలు క్షీణత రెడ్బుక్ రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థ నిత్యం కార్డెన్ సెర్చ్, నాకాబందీ అంటూ హడావుడి అయినా విచ్చలవిడిగా దొంగతనాలు, దోపిడీలు ఒక బ్యాచ్ పట్టపగలు 30 సవర్ల బంగారం, 2 కేజీల వెండి చోరీ దర్జాగా స్కూటీలో వచ్చారు.. పని కానిచ్చేశారు ఓ కారు తనిఖీల్లో రౌడీషీటర్ల వద్ద మారణాయుధాలు పట్టుబడిన వైనం ఫలితమివ్వని పోలీస్ చర్యలు బంగారం, వెండి అపహరణ నెల్లూరు (క్రైమ్): సీసీ కెమెరాల నీడలో ఉండే ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో గుర్తు తెలియని దుండగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు... వనంతోపు మూడో వీధిలోని కల్పతరువు అపార్ట్మెంట్ రెండో ఫ్లోర్లోని ఫ్లాట్లో యామిని నివాసం ఉంటున్నారు. ఆమె కుమార్తె హైదరాబాద్లో ఉంటోంది. కుమార్తె తన బంగారు ఆభరణాలను తల్లి వద్దే ఉంచి వెళ్లారు. ఇటీవల యామిని ప్లాట్కు తాళం వేసి కుమార్తె వద్దకు వెళ్లింది. సోమవారం ఇద్దరు దుండగులు స్కూటీపై అపార్ట్మెంట్కు వచ్చారు. ప్లాట్ తలుపును పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాను తెరచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లోని వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం ఫ్లాట్ తలుపులు తెరచి ఉండడాన్ని వాచ్మెన్ గమనించి అపార్ట్మెంట్ వాసులకు తెలియజేశారు. వారు ఈ విషయాన్ని బాధితురాలికి చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బయలుదేరడంతోపాటు వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఇంట్లో 35 సవర్లకు బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 20 సవర్లకు పైగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. బాధితులు వస్తే ఎంత మేరకు సొత్తు అపహరణకు గురైందో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. పక్కా రెక్కీవేసి.. సోమవారం ఉదయం 10.49 గంటల ప్రాంతంలో దుండగులిద్దరూ హెల్మెట్లు ధరించి స్కూటీపై అపార్ట్మెంట్ లిఫ్ట్ వద్దకు వచ్చారు. అందులో వెనుక కూర్చొన్న వ్యక్తి స్కూటీ దిగి అపార్ట్మెంట్లోకి వెళ్లగా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సెల్లార్లో స్కూటీపై వేచి ఉన్నాడు. పైకి వెళ్లిన వ్యక్తి రెండు నిమిషాల తర్వాత కిందకు వచ్చాడు. అనంతరం ఇద్దరు కలిసి పైకి వెళ్లి చోరీ చేసి స్కూటీపై వెళ్లిపోయారు. చోరీ జరిగిన తీరు, నిందితుల వ్యవహార శైలిని బట్టి పక్కా రెక్కీ వేసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇద్దరు నిందితుల్లో ఒకరు ఢిల్లీకి చెందిన వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన నిందితుడు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంతోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
హుండీ కానుకల లెక్కింపు
ఇందుకూరుపేట: మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరి దేవస్థానంలో హుండీ కానుకలను మంగళవారం లెక్కించారు. మూడు నెలల కాలానికి గానూ ప్రధాన హుండీ ద్వారా రూ.5,93,784.. అన్నదాన హుండీ ద్వారా రూ.28,363 మొత్తం లభించింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఈసారి రూ.53,330 మేర పెరిగిందని ఆలయాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి మాట్లాడారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా దేవస్థానం కృషి చేస్తోందని వెల్లడించారు. హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయాభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నామని పేర్కొన్నారు. కోవూరు గ్రూప్ దేవస్థానాల ఈఓ కృష్ణప్రసాద్, ఈఓ తాతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల అప్రమత్తం.. తనిఖీలు విస్తృతం
● రైల్వే స్టేషన్లలో భద్రతపై ప్రత్యేక దృష్టి ● కొనసాగుతున్న తనిఖీలు ● ప్రయాణికుల జాగ్రత్తగా ఉండాలి ● సూచించిన అధికారులు నెల్లూరు(క్రైమ్): జిల్లా రైల్వే పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. ఆదివారం అర్ధరాత్రి బాపట్ల సమీపంలో దొంగలు రైల్లోని మహిళల వద్ద బంగారు నగలు దోచుకుని పరావుతుండగా పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో రైల్వే డీఎస్పీ మురళీధర్ నేతృత్వంలో సీఐ ఎ.సుధాకర్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రమేష్గౌడ్ తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి రైల్వేస్టేషన్లు, రైళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. నేరాలు జరిగిన/అవకాశమున్న శ్రీవెంకటేశ్వరపాళెం, బిట్రగుంట, అల్లూరు రోడ్డు, కొడవలూరు, వెంకటాచలసత్రం, గూడూరు చైన్నె ఔటర్, రేణిగుంట ఔటర్ పాయింట్లో సాయుద సిబ్బందితో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక హైవే పోలీసులను సమన్వయం చేసుకుని రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న హైవే వెంబడి గస్తీని పెంచారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. ఏం చేస్తున్నారంటే.. దొంగల కళ్లు బంగారంపైనే ఉంటున్నాయి. రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారంలపై సంచరిస్తూ ఏ బోగీల్లో మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరించారో గుర్తిస్తున్నారు. ప్రయాణికుల్లా ఆ బోగీల్లో ఎక్కి అందరితో కలివిడిగా ఉంటున్నారు. అదును చూసి బ్యాగ్ లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, బంగారు ఆభరణా లను తస్కరించి క్షణాల్లో మాయం అవుతున్నారు. సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. గతంలో పలు ఘటనలు ● రెండేళ్ల క్రితం కావలి – శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ మధ్య దుండగులు సిగ్నల్ ట్యాంపర్ చేసి నరసాపురం నుంచి ధర్మవరం వెళ్తున్న రైల్లో ఎస్ – 13, ఎస్ – 11 బోగీల్లో దోపిడీ చేశారు. అడ్డువెళ్లిన ప్రయాణికుడిపై రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. అదేరోజు షిర్డీ సాయినగర్ నుంచి తిరుపతి వెళ్తున్న రైల్లోని ఎస్ – 3, ఎస్ – 5 కోచ్ల్లోనూ చోరీ చేశారు. ● గతేడాది అల్లూరు రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో దుండగులు హోమ్ సిగ్నల్స్ ట్యాంపర్ చేయడంతో హౌరా నుంచి బెంగళూరు వెళ్లే రైలు ఆగిపోయింది. అయితే సిగ్నల్ ట్యాంపర్ జరిగిన ప్రాంతానికి రైలు నిలిచిన ప్రాంతానికి మధ్య దూరం ఉండటంతో దోపిడీ విఫలమైంది. ● అదేరోజు గంట అనంతరం చండీఘర్ నుంచి మదురై వెళ్తున్న రైల్లో దుండగులు చైన్లాగి ఎస్ – 2, ఎస్ – 4, ఎస్ – 5 కోచ్ల్లోని ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు చైన్లు, బ్యాగ్లు అపహరించారు. ● గతేడాది మేనెలలో శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ వద్ద నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో దొంగలు బీభత్సం చేశారు. జాగ్రత్తలు తప్పనిసరి ప్రయాణికులు రైళ్లలో ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిచితులు ఇచ్చే తినుబండారాలు, పానీయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదు. మహిళలు సాధ్యమైనంత మేరకు ప్రయాణాల్లో బంగారు ఆభరణాలు ధరించకపోవడం మంచింది. రాత్రి వేళల్లో కిటికీ పక్కన ఉంటే నగలు, ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కిటికీ అద్దాలు మూసి ఉంచాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 139కు లేదా బోగీల్లోని టీటీఈ, రైల్వే పోలీసులకు సమాచారం అందించాలి.చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు రైళ్లలో చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నాం. బీట్ వ్యవస్థను పటిష్టం చేశాం. నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశాం. పాతనేరస్తులు, అంతర్ రాష్ట్ర ముఠాల కదలికలపై నిఘా పెంచాం. దొంగలు కనిపిస్తే కాల్చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. – ఎ. సుధాకర్, రైల్వే సీఐ -
సాగరతీరంలో సామూహిక యోగా
విడవలూరు: మండలంలోని రామతీర్థం బీచ్లో మంగళవారం సామూహిక యోగా కార్యక్రమం జరిగింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు స్వయంగా యోగా సనాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా సంజీవని లాంటిదన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత ఒత్తిడిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి నిత్యం యోగా సాధన చేయాలని కోరారు. యోగాంధ్ర స్ఫూర్తితో జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆరోగ్య చైతన్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షిచారు. ప్రముఖ యోగా గురువు డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో ఈ యోగాసనాల ప్రదర్శన సాగింది. యోగాలోని ప్రతి ఆసనం ప్రాముఖ్యతను, అవి మానవ శరీరానికి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలను ఆమె వివరిస్తూ యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఏ లక్ష్మీప్రసన్న, ఎంపీడీఓ టి.నగేష్కుమారి, ఆయూష్, పర్యాటక, ఆరోగ్య, మత్స్య శాఖల అఽధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, యోగా సాధకులు పాల్గొన్నారు. -
రైల్లోంచి జారిపడి..
● వృద్ధుడి మృతి నెల్లూరు(క్రైమ్): రైల్లోంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు కొండాయపాళెం గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 60 నుంచి 65 ఏళ్లలోపు ఉంటుందని భావిస్తున్నారు. గ్రే కలర్ హాఫ్ హ్యాండ్స్ టీషర్టు ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 92475 75628 ఫోన్ నంబర్కు తెలియజేయాలని ఆమె కోరారు. గూడ్స్ రైలు కిందపడి..● గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య రాపూరు: ఓబులవారిపల్లి – కృష్ణపట్నం పోర్టు రైల్వే మార్గమధ్యలో రాపూరు సమీపంలో గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. అతని వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. కాఫీ కలర్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. కేసు నమోదు చేశామని రైల్వే ఎస్సై హరిచందన తెలిపారు.వీధికుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలుమర్రిపాడు: మండలంలోని ఇర్లపాడు గ్రామంలో వీధికుక్క దాడిలో 9 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. భరత్ కృష్ణ మంగళవారం ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధికుక్క దాడి చేసి పలుచోట్ల కరిచినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని మర్రిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వైద్యుడు గోపీనాథ్ చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇదిలా ఉండగా గ్రామాల్లో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నా రులు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి వీధికుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఐస్ ఫ్యాక్టరీలో మృతదేహంకోవూరు: కోవూరు సమీపంలోని రామన్నపాళెం గేటు వద్ద ఉన్న పాడుబడిన ఐస్ ఫ్యాక్టరీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతని వయసు, మరణానికి గల కారణాలపై ప్రాథమిక వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. ఆపేవారేరీ?● ఆగని ఇసుక అక్రమ రవాణా ● పట్టించుకోని అధికారులు కావలి: జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఇసుక రీచ్లను మూసి వేసినా యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. అధికార పార్టీ నాయకుల అండదండలతోపాటు అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈనెల 8వ తేదీ నుంచి రీచ్లను మూసివేయగా డంపింగ్ యార్డ్ల నుంచి ఇసుక తరలించాల్సి ఉంది. అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా రీచ్ల నుంచే ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. పొట్టకూటి కోసం ట్రాక్టర్లు, ఆటోలు నడుపుకొని జీవనం సాగించే వారిపై జులుం ప్రదర్శించే అధికారులు అధికలోడుతో ఇసుక తరలిస్తుంటే ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గుండెపోటుతో వ్యవసాయాధికారి మృతిబుచ్చిరెడ్డిపాళెం: మండల వ్యవసాయాధికారి నడవాటి శ్రీహరి (46) గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం ఆయన బుచ్చి మండలంలో జరిగిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పర్యటనలో పాల్గొన్నాడు. సాయంత్రం అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని తన నివాసానికి చేరుకున్నాడు. అనంతరం అకస్మాత్తుగా గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రాత్రి మృతిచెందాడు. శ్రీహరికి భార్య, పిల్లలున్నారు. మృతి విషయం తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, రైతు సంఘాల నాయకులు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
భూ సమస్యను పరిష్కరించాలని ఆందోళన
● ఆర్డీఓ కార్యాలయంలో బైఠాయించిన డ్వాక్రా మహిళలు కావలి రూరల్: భూ సమస్యను పరిష్కరించాలని ఆరు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని చెన్నాయపాళెం పంచాయతీ పరిధిలోని ఆరు గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కావలి ఆర్డీఓ కార్యాలయంలోని గ్రీవెన్స్హాల్లో బైఠాయించి ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1998లో ప్రభుత్వం ఆరు గ్రామాల డ్వాక్రా మహిళల ఉపాధికి 190 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. 1998లో గ్రామంలో చోటు చేసుకున్న గొడవల నేపథ్యంలో తాము ఊర్లను, భూమిని వదిలి వలస వెళ్లినట్లు చెప్పారు. గొడవలు సద్దుమణిగిన తర్వాత తిరిగి వచ్చి ప్రభుత్వ అనుమతితో జామాయిల్ సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే తమ భూములపై కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు రికార్డుల్లో పేర్లు మార్చుకుని కబ్జా చేశారని ఆరోపించారు. ఇటీవల బీపీసీఎల్ కంపెనీకి కేటాయించిన భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లిస్తుండగా కబ్జా విషయం తెలిసిందన్నారు. ఈ విషయమై న్యాయం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓ ఎలీషా, తహసీల్దార్ శ్రావణ్కుమార్ను వేడుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పెద్దపట్టపుపాళేనికి వచ్చి భూ సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. మంగళవారం 12 గంటల వరకు ఎదురుచూస్తామని తహసీల్దార్ వచ్చి సమస్యను పరిష్కరించకపోతే కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు వెనుకాడబోమని డ్వాక్రా మహిళలు హెచ్చరించారు. -
బీసీ వెల్ఫేర్ ఉద్యోగులకు పదోన్నతులు
నెల్లూరు(వేదాయపాళెం): బీసీ సంక్షేమ శాఖలో నాల్గో తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్న బీ సురేష్, యూ రత్నకుమారికి పదోన్నతులు లభించాయి. వారి అర్హతలను అనుసరించి గ్రేడ్–2 హాస్టల్వెల్ఫేర్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించినట్లు ఆ శాఖ జిల్లా సాధికారిత అధికారిణి పీ వెంకటలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కనభవన్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా పదోన్నతుల ఉత్తర్వులను అందజేశారని చెప్పారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు(వీఆర్సీసెంటర్): 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర కార్మిక శాఖ ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న కార్మికుల పిల్లల నుంచి ఉపకారవేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని జిల్లా బీడీ కార్మిక సంక్షేమ అస్పత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ కేవీ భాస్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐరన్, మాంగనీస్, లైమ్స్టోన్, డోలామైట్, మైకా గనులతో పాటు బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలు ఉపకారవేతనాలకు అర్హులని చెప్పారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఆగస్ట్ 31వ తేదీలోగా, ఇంటర్ నుంచి ఆపై తరగతులు చదువుతున్న వారు అక్టోబరు 31వ తేదీలోగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రామతీర్థం బీచ్లో సామూహిక యోగా నేడు నెల్లూరురూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడవలూరు మండలం రామతీర్థం బీచ్లో మంగళవారం ఉదయం 6 గంటలకు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే స్వర్ణాల చెరువు, రామతీర్థం బీచ్తో పాటు రెసిడెన్షియల్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన యోగా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. యోగా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 95,094 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,909 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.93 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
వారే కీలకం
ప్రతి నెలా ఆర్టీఏ అధికారులకు మామూళ్లు ఆరు టైర్ల వాహనాలు 450 X 12,000 = 54,00,000 పది టైర్ల వాహనాలు 550 X 16,000 = 90,75,000 రవాణా శాఖాధికారులు రాబందుల కంటే దారుణంగా తయారయ్యారు. జిల్లాలోనూ, జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు నిత్యం వేలాది లారీలు, టిప్పర్లు, ట్రాలీ వాహనాల్లో అధిక టన్నేజీతో గ్రానైట్, ఇసుక, సిలికా, క్వార్ట్జ్తో పాటు రేషన్ బియ్యం లారీలు యథేచ్ఛగా వెళ్తున్నాయి. ఇలాంటి ఏ వాహనాలపై ఒక్క కేసు నమోదు చేసిన దాఖలాలైతే లేవు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటలకు స్థానికంగా గిట్టుబాటు ధరలు రాక పక్క రాష్ట్రాలకు తీసుకెళ్తుంటే టార్గెట్ చేసి వేలకు వేలు జరిమానాలు విధించి తమలోని అవినీతి రక్కసిని చాటుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల పేరుతో ఓవర్ టన్నేజీలకు రూ.లక్షల్లో టర్నోవర్ చేసున్నారు. జిల్లా నుంచి వెళ్లే ధాన్యం లారీలే కాకుండా.. పండ్లు, రొయ్య ల, చేపల వాహనాలే లక్ష్యంగా రవాణాశాఖాధికారులు ఒకటి.. రెండు.. టన్నులు అధికంగా ఉంటే పెద్దనేరంగా భారీ మొత్తంలో చలాన్లు విధించి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోల్కతా–చైన్నె నేషనల్ హైవేపై మనుబోలు సమీపంలో ప్రతి నిత్యం సాయంత్రం రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. ప్రతి వాహనాన్ని నిలిపి తనిఖీలు చేస్తారనుకుంటే పొరపాటే. నెల మామూళ్లు చెల్లించే వాహనాలకు రవాణాశాఖ పోస్ట్పెయిడ్ కార్డులు ఇస్తోంది. తమ వద్ద ఉండే జాబితాలో ఆ వాహన నంబర్లు ఉంటే పంపిస్తారు. లేదంటే అధిక టన్నేజీ చూపి టన్నుకు రూ.2 వేలు లెక్కన అనధికారికంగా వసూలు చేస్తున్నారు. నెల్లూరు రవాణాశాఖ ఎంవీఐ తన డ్రైవర్తో నిత్యం దందా చేస్తూ రోజుకు రూ.లక్ష లేనిదే ఇంటికి వెళ్లడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన ఉన్నతాధికారులకు వాటాలు పంచుతూ.. మిగిలింది తన జేబులో వేసుకుంటున్నారని ఆ శాఖాధికారులే చెబుతున్నారు. ఇటీవల నెల్లూరు నుంచి చైన్నెకు బియ్యం లోడుతో వెళ్తున్న నాలుగు వాహనాలను నిలిపివేశారు. ఒక్కో వాహనంలో 3 టన్నులు అధికలోడు ఉందని, టన్నుకు రూ.5 వేలు వంతున వసూలు చేసుకుని పంపించేశారు. లంచం పర్మిట్ ఉంటే.. సరి జిల్లా నుంచి నిత్యం వందలాది లారీలు, టిప్పర్లు, ట్రాలీల్లో పక్క రాష్ట్రాలకు ఇసుక, రేషన్ బియ్యం, గ్రానైట్, క్వార్ట్జ్, మైకా, సిలికా తరలిస్తున్నారు. స్థానికంగా తిరిగే టిప్పర్లు, లారీలు సైతం అధిక టన్నేజీతో రవాణా చేస్తున్నాయి. ఒక్కో టిప్పర్కు 36 టన్నుల కెపాసిటీ ఉంటే.. 50 నుంచి 60 టన్నుల వరకు ఇసుక, సిలికా, క్వార్ట్జ్, మైకా లోడ్ చేసుకుని వెళ్తున్నా.. 70 టన్నుల కెపాసిటీ ఉన్న ట్రాలీల్లో 100 నుంచి 130 టన్నుల వరకు గ్రానైట్ బండలను రవాణా చేస్తున్నా.. అటువంటి వాహనాలపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. అధిక టన్నేజీ వాహనాలకు నెల మామూళ్లు చెల్లిస్తుండడంతో టన్నేజీ సంగతి పక్కన పెడితే.. సరైనా పత్రాలు లేకున్నా రైట్ రైట్ అంటూ పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ నెల మామూలు చెల్లింపుల్లో ఆలస్యమైనా చాలు రహదారిపై కాపు కాసి వాహనాలను నిలిపి ముక్కు పిండి వసూళ్లు చేసుకుంటున్నారు. ముడుపులు చెల్లించని వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేసి ముప్పతిప్పలు పెడుతున్నారు. దీంతో వాహన యజమానులు మాత్రం అధిక లోడింగ్ ఉన్నా.. లేకున్నా నెల మామూళ్లు సమర్పించుకుని వెళుతున్నారు. జిల్లా పరిధిలో సుమారు 1000 పైగా లారీలు, టిప్పర్లు, ట్రాలీలు ఉన్నాయి. జిల్లాలో జరిగే రహదారుల నిర్మాణాలు, భవన నిర్మాణ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, ఇతరత్రా అవసరాలతో మట్టి, కంకర, ఇసుక, రవాణా చేస్తున్నాయి. పలు ప్రాంతాల నుంచి క్రషర్స్ నుంచి కంకర తోలకాలు సాగిస్తున్నారు. బిల్లులు లేకుండా పలు రకాల సరుకులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పశువులు, గ్రానైట్ రవాణా సాగుతోంది. కృష్ణపట్నం పోర్టుకు వివిధ రకాల సరుకులు, వస్తు సామగ్రి కూడా ఎగుమతుల కోసం తరలిస్తున్నారు. ఆయా వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నాయంటే.. ఆ శాఖాధికారులకు నెల మామూళ్లు చేరుతున్నాయని అర్థమవుతోంది. రవాణా శాఖ అధికారుల అక్రమ వసూళ్లు నెల మామూళ్లు రూ.1.45 కోట్ల్లు దళారులను పెట్టి మరీ దండకాలు ఇవ్వని వాహనాలను టార్గెట్ చేసి దాడులు ధాన్యం, బియ్యం లారీలే ప్రధాన లక్ష్యం ఓవర్ టన్నేజీతో నిత్యం వందల వాహనాల్లో గ్రానైట్, ఇసుక, రేషన్ బియ్యం రవాణా మంత్లీ కార్డు ఉంటే.. ఓవర్ టన్నేజీ ఉన్నా సరైన పత్రాలు లేకున్నా రైట్ రైట్ నెలకు రూ.లక్షల్లో వసూళ్లు ఉమ్మడి నెల్లూరు ఆర్టీఏ పరిధిలోని 12 మంది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లతోపాటు స్పెషల్ స్క్వాడ్, ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు ఉన్నాయి. జిల్లాలో ఆత్మకూరు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల వెహికల్ ఇన్స్పెక్టర్లు నెలవారీ వచ్చే దండకాలు సమానంగా పంచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి వసూళ్ల కోసం దళారులను పెట్టుకున్నారు. ఆ దళారులే వాహన యజమానులు వద్ద వసూలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు టైర్ల వాహనానికి నెలకు రూ.12 వేలు, పది టైర్ల వాహనానికి రూ.16 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 10వ తేదీలోగా చెల్లించకపోతే.. భారీ చలాన్లు పడక తప్పదు. నెల మామూళ్లు తీసుకొనేందుకు ఆర్టీఏ కార్యాలయంలోని ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తారు. వారు ప్రతి వాహనదారుడితో లావాదేవీలు జరిపి నెలవారీగా వసూళ్లు చేసి అందరికి పంపకాలు చేస్తారు. ఇక పోలీసులకు మాత్రం ఒక్కో స్టేషన్ పరిధిలోని ఎస్ఐకు సన్నిహితంగా మెలిగే ఓ కానిస్టేబుల్ ద్వారా వసూళ్ల ప్రక్రియ చేపడతారు. ఇలా వసూళ్లు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కొంత నగదు ఇస్తుంటారు.


