
పెద్దసాన పాఠశాలలో గందరగోళం
టెక్కలి: మండలంలోని పెద్దసాన గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం గందరగోళం చోటు చేసుకుంది. ఇటీవల పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు ప్రసాద్ పలువురు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ, లిఖితపూర్వకమైన ఫిర్యాదుతో డీఈఓ తిరుమలచైతన్య పాఠశాలకు చేరుకుని విచారణ నిర్వహించి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయుడు నేతాజీకు, సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయుడు ప్రసాద్కు మధ్య విభే దాలు ఉండడంతో తమకు చెప్పకుండా తమ పిల్లలతో బలవంతంగా లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేయించారంటూ కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల ఎదురుగా నిరసన చేస్తూ ప్రధానోపాధ్యాయుడి తీరును తప్పుపట్టారు. తాజాగా శనివారం విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు మరోసారి పాఠశాల ఎదురుగా నిరసన చేస్తూ ప్రధానోపాధ్యాయుడి దిష్టిబొమ్మతో నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయు డు నేతాజీ ఎస్సీ సామాజిక వర్గంపై తప్పుగా మాట్లాడారని, అలాగే ఈ వ్యవహారంతో సంబంధం లేని ఓ మహిళా టీచర్ ప్రసాద్పై చేయి చేసుకున్నారనే వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. కు లం పేరుతో దూషించడంపై ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యా య సంఘాలు, దళిత సంఘాల ప్రతినిధులు చల్లా రామారావు, కె.దాలయ్య, జె.బాబూరావు, ఎ.రాహుల్, వై.గోపి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి టెక్కలిలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హెచ్ఎం నేతాజీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.