రామన్నపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆదివారం రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో సీపీఎం మండలశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్ర ప్రారంభ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కేంద్ర ప్రభుత్వం యేటా రెండు కోట్ల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఎన్నికల వాగ్దానాలను ఎలా అమలు చేస్తాయాని ప్రశ్నించారు. డ్రైపోర్ట్ పేరుతో రైతులను మభ్యపెట్టి కొనుగోలు చేసిన భూముల్లో కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్లో భాగంగా రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంను పునరుద్ధరించాలని, రామన్నపేట ఆస్పత్రి స్థాయిని వంద పడకలకు పెంచాలని, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువలను పూర్తిచేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఇరవై ఏళ్లుగా కాలువల పనులు కాంట్రాక్టర్లకు వరప్రదాయినిగా మారాయని ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు పార్టీ పోరాడుతుందని తెలిపారు. పాదయాత్రకు పార్టీలకతీతంగా సంఘీభావం తెలపాలని కోరారు. పాదయాత్రలో భాగంగా సీపీఎం నాయకులు ప్రతిపాదిత అంబుజా సిమెంట్ పరిశ్రమ గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో ఎండిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జెల్లెల పెంటయ్య, బూర్గు కృష్ణారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి, పాదయాత్ర బృందం సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, బోయిని ఆనంద్, కందుల హన్మంత్, గన్నెబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, గొరిగె సోములు, బొడిగె రజిత, మేడి గణేష్, కొమ్ము అంజమ్మ, శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ