
చివరి దశకు కుత్తంబాక్కం బస్టాండు నిర్మాణం
– త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం
తిరువళ్లూరు: చైన్నెలో ట్రాఫిక్ను తగ్గించాలన్న ఉద్దేశంతో సుమారు రూ.336 కోట్లు వ్యయంతో కుత్తంబాక్కం వద్ద నిర్మిస్తున్న కొత్త బస్టాండు నిర్మాణపు పనులు దాదాపు 90 శాతం మేరకు పూర్తయిన క్రమంలో త్వరలో ప్రారంభించి అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. చైన్నెలో తరచూ ఏర్పడుతున్న ట్రాపిక్ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు చర్యలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగానే పాండిచ్చేరి, తిరుచ్చి, కడలూరు, అరియలూరు, మధురై, సేలం, కల్లకురుచ్చి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం కిలాంబాక్కం నూతన బస్టాండు నిర్మించి అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే విధంగా హోసూరు, వేలూరు, తిరుపతి, తిరుపత్తూరు, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్ళే బస్సులను కుత్తంబాక్కం బస్టాండు నుంచి రాకపోకలు సాగించాలని నిర్ణయించి సుమారు రూ. 336 కోట్లు వ్యయంతో కుత్తంబాక్కం వద్ద 2021లో నూతన బస్టాండు నిర్మాణపు పనులను ప్రారంభించారు. బస్టాండు విస్తీర్ణం సుమారు 5 లక్షల చదరపు అడుగులు. దీంతో పాటు బస్టాండుకు సమీపంలోనే మరో రెండు కోట్లు వ్యయంతో రోడ్డు సదుపాయం, పది కోట్లు వ్యయంతో బస్గ్యారేజీలను ఏర్పాటు చేశారు. ఈ పనులు దాదాపు 90 శాతం మేరకు పూర్తయ్యింది. వీటిని త్వరలోనే ప్రారంభించి అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో పాటూ కుత్తంబాక్కం బస్టాండుకు మెట్రోను సైతం అనుసంధానం చేయనున్నారు. కాగా ఈ బస్టాండు నుంచి వేర్వేరు ప్రాంతాలకు ప్రభుత్వ 70 బస్సులు, మరో 30 ప్రైవేటు బస్సులు, 30 ఎంటీసీ బస్సులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగించనున్నాయి. వీటితో పాటూ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు విశ్రాంతి గదులు, పలు దుకాణాలు, హోటల్స్, 200 వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. కాగా బస్టాండు అందుబాటులోకి వస్తే బెంగళూరు, హోసూరు, తిరుపత్తూరు తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచే బస్సులు నడవనున్నాయి.

చివరి దశకు కుత్తంబాక్కం బస్టాండు నిర్మాణం