
అభిమానోత్సాహం!
● విజయ్ను చూసేందుకు తండోపతండాలుగా రాక ● కట్టడి చేయలేక బౌన్సర్ల అవస్థలు
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం బూత్ కమిటీ మహానాడు రెండో రోజుగా ఆదివారం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాల ఆవరణలో జరిగింది. కోయంబత్తూరు, తిరుపూర్, నీలగిరి, కరూర్ జిల్లాలకు చెందిన ఎనిమిది వేల మందికి మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానం పలికారు. వీరి కోసం ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను అందజేశారు. తొలి రోజు శనివారం చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా రెండవ రోజు జాగ్రత్తలు తీసుకున్నారు. అదనంగా కేరళ నుంచి ప్రత్యేక బౌన్సర్లను భద్రత నిమిత్తం తీసుకొచ్చారు. అభిమానులను కట్టడి చేయడానికి ముందస్తు చర్యలు తీసుకున్నా అవన్నీ ఏ మాత్రం అభిమానం ముందు తట్టుకోలేక పోయాయి.
రంకెలేసిన అభిమానం
బౌన్సర్లు, పోలీసు భద్రత తమను అడ్డుకోలేవని అభిమానులు నిరూపించారు. విజయ్ను చూడాలన్న కాంక్షతో ఎన్నో దార్లు తొక్కారు. ముందు జాగ్రత్త కోసం సిద్ధం చేసిన అంబులెన్స్లను అస్త్రంగా చేసుకుని ప్రైవేటు ఆంబులెన్స్ల ద్వారా సమావేశ మందిరంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన అభిమానులు ఎందరో. పెద్ద ఎత్తున అభిమానులు విజయ్ కోసం తరలి రావడంతో వారిని కట్టడి చేయలేక బౌన్సర్లు చేతులు ఎత్తేచేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీలకు పని పెట్టారు. విజయ్ను చూసేందుకు కళాశాల ఆవరణలో పెద్దఎత్తున అభిమానులు ఎదురు చూశారు. అయితే సమావేశ మందిరంలోకి మాత్రం ఎవ్వర్నీ అనుమతించ లేదు.
మనం ఏమిటో నిరూపిద్దాం
బూత్ కమిటీని ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ నిన్నటి సమావేశంలో ఈ భేటీ అన్నది ఓటు కోసం కాదని తాను వ్యాఖ్యానించినట్టు గుర్తుచేస్తూ, మళ్లీ చెబుతున్నానని టీవీకే అన్నది స్వలాభం కోసం రాలేదని, సామరస్యానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చామని వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తే ఎంత వరకై నా వెళ్లడానికి రెడీ అని ప్రకటించారు. తమ పాలన అన్నది క్లీన్ గవర్నమెంట్ అని, అవినీతికి చోటు ఉండదని స్పష్టం చేశారు. బూత్ స్థాయి కమిటీలు ధైర్యంగా ప్రజలలోకి వెళ్లి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇదిచేస్తుందని స్పష్టం చేయాలని సూచించారు. ఈసందర్భంగా తాను ఒకటి చెప్పదలచుకున్నానని పేర్కొంటూ దివంగత అన్నా సూక్తులను గుర్తు చేశారు. శిరువాని నీరు ఏ విధంగా స్వచ్చంగాఉంటుందో ఆ విధంగానే టీవీకే పాలన ఉంటుందని ప్రజలలోకి తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. ముందుగా ఆపార్టీ నేత ఆదవ్ అర్జునన్ మాట్లాడుతూ చైన్నె సచివాలయంలో ఉన్న వారికి వినిపించే రీతిలో ఓ నినాదం చేయాలని కోరగా...సీఎం ...సీఎం..సీఎం విజయ్ అంటూ సభా ప్రాంగణం మార్మోగింది.
కేసుల నమోదు
విజయ్ శనివారం కోయంబత్తూరుకు వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలో చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. ఈ పరిణామాలపై తమకు అందిన ఫిర్యాదుతో ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించారంటూ కోయంబత్తూరు జిల్లా పార్టీ కార్యదర్శులతో పాటుగా ముఖ్య నిర్వాహకులపై కేసులను ఆదివారం పోలీసులు నమోదు చేశారు. అలాగే ఎలాంటి అనుమతి అన్నది లేకుండా విజయ్ వెన్నంటి దూసుకెళ్లి ట్రాఫిక్కు అంతరాయం కలిగించినట్టుగా 130కి పైగా వాహనాలకు జరిమానా విధిస్తూ కోయంబత్తూరు పోలీసులు చర్యలు తీసుకున్నారు.