
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై బీజేపీ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఎన్నికకు దూరంగా ఉండాలని భావించింది కమలం పార్టీ. అయితే.. తాజాగా ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది బీఆర్ఎస్. దీంతో బీజేపీ పునరాలోచనలో పడింది.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోటా ఓట్లు 127 కాగా ఇందులో 9 ఖాళీగా ఉన్నాయి. ఎల్లుండితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 118 కాగా, ఎంఐఎం 52, బీఆర్ఎస్ 41, బిజెపికి 25 ఓట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం ఓట్లలో 60 ఓట్లు వస్తే గెలిచినట్లు లెక్క. అంటే.. ఏ పార్టీ కూడా సొంతంగా గెలవలేని పరిస్థితి ఉందన్నమాట.
ఇక బీఆర్ఎస్-ఎంఐఎంల మద్దతు నేపథ్యంలో.. బీజేపీ గనుక బరిలోకి దిగితే ఓటింగ్ తప్పనిసరి కానుంది. ఇప్పటికే స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నిక పోటీపై బీజేపీ నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment