
ఉగ్రవాద సంబంధిత కేసు పేరుతో బెదిరింపులు
ఐపీఎస్ అధికారినంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాడు
పోలీసులను ఆశ్రయించిన విశ్రాంత వైద్యురాలు
సాక్షి, సిటీబ్యూరో: ఉగ్రవాద సంబంధిత కేసు పేరుతో నగరానికి చెందిన విశ్రాంత వైద్యురాలిని ఫోన్లో బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి రూ.2.2 కోట్లు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీకి చెందిన వైద్యురాలికి గత నెల 27న ఫోన్కాల్ వచ్చిoది. లక్నో నుంచి మాట్లాడుతున్న ఐపీఎస్ అధికారి ప్రేమ్ కుమార్గా అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తమ పరిధిలో నమోదైన ఉగ్రవాద సంబంధ మనీలాండరింగ్ కేసులో వైద్యురాలి ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లు చెప్పాడు.
ఈ నేపథ్యంలోనే ఆ కేసులో నిందితురాలిగా చేరుస్తున్నామని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆమె ఈ షాక్ నుంచి కోలుకోకముందే వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. అప్పుడు మాట్లాడిన సైబర్ నేరగాడు తాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ సదానంద్ అంటూ పరిచయం చేసుకున్నాడు. తాము కొందరు ఉగ్రవాదుల్ని అరెస్టు చేశామని, వారి నుంచి స్వాదీనం చేసుకున్న వాటిలో ఏటీఎం కార్డులతో పాటు కొన్ని ఫొటోలు ఉన్నాయని చెప్పాడు. ఆ ఫొటోల్లో 17 ఆర్మీ అధికారులవి అయితే.. ఒకటి మాత్రం సదరు వైద్యురాలిదని పేర్కొన్నాడు. ఇది ఉగ్రవాద సంబంధిత కేసు కావడంతో విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచాలని స్పష్టం చేశాడు.
వెరిఫికేషన్ చేయాలంటూ..
ఏటీఎం కార్డుల్లో కొన్ని మీ పేరుతో తెరిచిన ఖాతాలతో లింకై ఉన్నాయని, వాటి ద్వారా పెద్ద ఎత్తున జరిగిన మనీలాండరింగ్తో ఉగ్రవాదులకు నిధులు అందాయని భయపెట్టాడు. తాను ఏ తప్పు చేయలేదని, ఆ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఉగ్రవాదులతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాధితురాలు ఎన్ఐఏ డైరెక్టర్గా చెప్పుకున్న వ్యక్తితో వాపోయారు.
ఆ విషయం ఖరారు కావాలంటూ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందని, దీనికోసం తాము చెప్పిన ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయాలని సూచించాడు. ఈ నగదు పూర్తిగా రిఫండబుల్ అని చెప్పిన కేటుగాడు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తిరిగి బదిలీ చేసేస్తామని చెప్పాడు.
ఆమెను పూర్తిగా నమ్మించడానికి ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు జడ్జ్ పేరుతో నకిలీ లేఖ కూడా సృష్టించి పంపారు. దీంతో నేరగాళ్ల వలలో పడిపోయిన వైద్యురాలు గత నెల 29 నుంచి 31వ తేదీ మధ్య వారు సూచించిన ఖాతాల్లోకి ఏకంగా రూ.2.2 కోట్లు బదిలీ చేశారు. తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తంతో పాటు ఫిక్సిడ్ డిపాజిట్లు విత్డ్రా చేసి, తెలిసిన వారి నుంచి కొంత తీసుకుని ఇలా బదిలీ చేశారు.
ఆ మొత్తం రిఫండ్ రాకçపోవడంతో పాటు వారి ఫోన్ నెంబర్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బా«ధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.