రుణమాఫీకి రేషన్‌కార్డు కాదు.. పాసుబుక్‌లే ముఖ్యం: సీఎం రేవంత్‌ | Telangana Govt Releases Farm Loan Waiver Funds | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి రేషన్‌కార్డు కాదు.. పాసుబుక్‌లే ముఖ్యం: సీఎం రేవంత్‌

Published Thu, Jul 18 2024 4:06 PM | Last Updated on Thu, Jul 18 2024 5:57 PM

Farmers Runa Mafi Amount Released By Telangana Govt

రుణమాఫీ నిధుల సందర్భంగా కాంగ్రెస్‌ నేతల కామెంట్స్‌ అప్‌డేట్స్‌..

రైతులతో కలిసి రాహుల్‌ సభ..
👉సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..‘ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎన్ని సవాళ్లు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నాం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదు. మరోసారి 2019లో కూడా అదే హామీ ఇచ్చి రైతులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్‌ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరోసారి రుజువైంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రుణమాఫీ చేస్తున్నాం.

👉రాహుల్‌ గాంధీ రైతు డిక్లరేషన్‌లో భాగంగా రూ.2లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చుతున్నాం. నా జీవితంలో ఇది మరపురాని రోజు. రైతు రుణమాఫీ అద్భుతమైన కార్యక్రమం. ప్రభుత్వం తరఫున రైతులందరికీ కృతజ్ఞతలు. దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఇచ్చారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా రూ.లక్ష వరకు తొలివిడతలో రుణమాఫీ చేస్తున్నాం. మూడు విడుతల్లో రూ.31వేల కోట్లు వచ్చే నెలలోపు రుణమాఫీ చేస్తాం. రైతు రుణమాఫీకి పాస్‌ పుస్తకాలే ముఖ్యం. రేషన్‌ కార్డు ముఖ్యం కాదు. రుణమాఫీలో సాంకేతిక సమస్యలు వస్తే అధికారులు సరిచేస్తారు. కొందరు రుణమాఫీపై అపోహాలు, అబద్దాలు చెబుతున్నారు వాటిని నమ్మకండి.

👉గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రతీనెలా రూ.7వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. ఎల్లుండి ఢిల్లీ వెళ్తాను.. రాహుల్‌ గాంధీతో సమావేశమవుతాను. వరంగల్‌లో భారీ సభ పెడతామంటూ రైతులకు రేవంత్‌ చెప్పారు. ఐదు లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేద్దామన్నారు. వరంగల్‌లో రైతులతో కాంగ్రెస్‌ సభ జరుగుతుంది. ఈనెలాఖరులో సభకు ఏర్పాట్లు చేసుకుందామని చెప్పారు. రాహుల్‌ గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించి సంబురాలు చేసుకుందామని రైతులను కోరారు. 

👉వరంగల్ రైతు డిక్లరేషన్ ఎక్కడ చేసామో అక్కడే సభ జరుగుతుంది. వరంగల్ సభకు రాహుల్ కృతజ్ఞత సభగా నామకరణం చేశారు. రైతు రుణమాఫీ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్లమెంటులో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేశారు. రుణమాఫీ జరిగిన పలువురు రైతులకు సీఎం రేవంత్‌ చెక్‌లు అందజేశారు.

👉ఇక, ఇదే సమయంలో రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నవాళ్ళు ఇప్పటికైనా గుర్తించాలి. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు. మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం.. మీ విజ్ణతకే వదిలేస్తున్నాం.

👉రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుంది. ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో 29వేల కోట్లు ఖర్చు చేశాం. 

👉రైతు రుణమాఫీ నిధులు విడుదల సందర్భంగా రైతువేదికల్లో ఉన్న రైతులతో సీఎం రేవంత్‌ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పలు జిల్లాల నుంచి రైతులు నేరుగా సీఎం రేవంత్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతీ జిల్లా నుంచి రైతులు మాట్లాడారు. 

👉తెలంగాణ సచివాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. పలు జిల్లాలో కూడా కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

 

మంత్రి సీతక్క కామెంట్స్‌..
👉రుణమాఫీ నేపథ్యంలో రైతు లోకానికి శుభాకాంక్ష‌లు. రైతన్న‌కు రుణ విముక్తి, తెలంగాణ ప్ర‌గ‌తికి నాంది. రైతురాజ్యం కాంగ్రెస్ ప్ర‌జా ప్ర‌భుత్వానికే సాధ్యం. కేసీఆర్ పదేళ్లలో చేయలేనిది..మేము కేవలం నెలన్నరలో చేస్తున్నాం. విప‌క్షాలకు మాట్లాడే నైతిక అర్హ‌త లేదు. జై కిసాన్ జై తెలంగాణ‌ అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్‌.. 
👉నల్లగొండలో రైతువేదికలో రైతులతో కలిసి మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీఎం రేవంత్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేస్తూ చరిత్ర సృష్టించాం. రైతులు అప్పులాపాలు కాకుండా ఉండేందుకు రుణమాఫీ చేశాం.  రూ.481 కోట్ల రూపాయల మాఫీ నల్లగొండ జిల్లాలో జరిగింది. బ్యాంకు వాళ్లు ఇబ్బందులు పెడితే అధికారులు, నా దృష్టికి తీసుకురండి. త్వరలో లక్షన్నర, రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తాం. డిండి, ఎస్సెల్బీసీ సొరంగ మార్గం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పూర్తిచేస్తాం.

 

డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్‌..
👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రైతులకు ఇది పండుగ రోజు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ హామీని నెరవేర్చింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ హామీని నెరవేర్చలేదు. ప్రతీ రూపాయి పోగేసి.. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్నాం. ఒకేసారి రూ.31వేల కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేస్తున్నాం. 

 

తుమ్మల నాగేశ్వర రావు కామెంట్స్‌..
👉రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మకరోజు.. రైతులకు పండుగరోజు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఎంత మంది అపహాస్యం చేసినా.. రైతుల రుణమాఫీ చేస్తున్నాం. ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తోంది. అత్యంత కష్టతరమైన ఈ బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ చేసి చూపిస్తోంది. ఆర్దిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాం. రాహుల్ గాంధీ మాట ఇచ్చారు.. మేము నెరవేరుస్తున్నాం. భవిష్యత్‌లో రైతులకు ఉపయోగపడే మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తాం. 

 

రుణమాఫీ నిధుల విడుదల..
👉తెలంగాణలో రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అ‍య్యాయి. ప్రభుత్వం రుణమాఫీ నిధులను విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 11.42 లక్షల మంది రైతుల ఖాతాలోకి ఏడు వేల కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. నేడు లక్ష రూపాయల వరకు రుణమాఫీ కానుంది.

👉కాగా, తెలంగాణ సచివాలయం నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు.. పలుచోట్ల రైతువేదికల్లో ఉన్న రైతులతో మాట్లాడనున్నారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సంబురాల్లో పాల్గొననున్నారు. మరోవైపు.. రుణమాఫీ నిధులు ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. 

👉ఇక, ఈ నెలాఖరులోగా రెండో విడత, ఆగస్టు మొదటి వారంలో మూడో విడతతో మిగిలిన రుణాలను మాఫీ చేయనున్నారు. రైతుల రుణమాఫీ కోసం మొత్తం రూ.31వేలను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, ఆగస్టు దాటకముందే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తోంది. కాసేపట్లో రైతులతో సీఎం రేవంత్‌ మాట్లాడనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement