
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక ప్రాజెక్టుల కోసం వచ్చే కేంద్ర బడ్జెట్లో తగినమేర నిధులు కేటాయించాలని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో వ్యూహాత్మక రహదారులు, లింక్రోడ్లు, ఇతర అభివృద్ధి పథకాలకు కేంద్రం నుంచి అదనంగా సహాయం అందించాలని కోరారు. అభివృద్ధి పనుల కోసం రాష్ట్రం వేల కోట్లు వెచ్చిస్తోందని.. అందులో కేంద్రం తరఫున 15% నుంచి 33% వరకు భరించాలని, ఈ బడ్జెట్లో సుమారు రూ. 7,775 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.
కేటీఆర్ చేసిన విజ్ఞప్తులివీ..
- హైదరాబాద్లో కేపీహెచ్బీ నుంచి కోకాపేట మీదుగా నార్సింగి వరకు ప్రతిపాదిత మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఆర్టీఎస్) ప్రాజెక్టుకు రూ.3,050 కోట్లు
ఖర్చవుతుంది. అందులో కేంద్రం నుంచి 15 శాతం వాటాగా రూ. 450 కోట్లు కేటాయించాలి. సుమారు 30 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ ద్వారా 2030 నాటికి 5 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది.
- వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ), మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, తూర్పు–పడమర ఎక్స్ప్రెస్ వే, రక్షణ శాఖ పరిధిలోని ప్రాంతాల్లో బ్రిడ్జి లు, స్కైవేలకు కలిపి రూ.34,500 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం తన వంతుగా 10% అంటే రూ. 3,450 కోట్లను బడ్జెట్లో కేటాయించాలి.
- వరంగల్ మెట్రో నియో ప్రాజెక్టుకు రూ.184 కోట్లు నిధులు మంజూరు చేయండి. ‘మేక్ ఇన్ ఇం డియా, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’పాలసీలకు అనుగుణంగా.. తెలంగాణ ప్రభుత్వం మెట్రో–ని యో కోచ్ల తయారీ అవకాశాలను పరిశీలిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా..
రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మోడల్ కారిడార్స్ డెవలప్మెంట్, హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్లో భాగంగా రవాణా నెట్వర్క్ను మెరుగుపర్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 22మిస్సింగ్ లింక్ రోడ్లను అభివృద్ధి చేశాం. మరో 17 రోడ్లకు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. ఇవికాకుండా 104 అదనపు కారిడార్లు అభివృద్ధి చేస్తున్నాం. వీటన్నింటికి రూ. 2,400 కోట్లు అవుతుందని అంచనా. అందులో మూడో వంతు కింద రూ.800 కోట్లను కేంద్ర సాయంగా ఇవ్వండి.
- హైదరాబాద్ నగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మురుగునీటి శుద్ధి కోసం రూ. 8,684.54 కోట్లు వెచ్చిస్తున్నాం. ఇం దులో రూ. 2,891 కోట్లు (మూడోవంతు) కేంద్రం నుంచి కేటాయించాలి.
Comments
Please login to add a commentAdd a comment