
సాక్షి, హైదరాబాద్: నైనీ బొగ్గు బ్లాక్ను 2016 మేలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించింది. అన్ని రకాల అనుమతులు సాధించి, గనిలో తవ్వకం ప్రారంభించడానికి తొమ్మిదేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. సీఎం రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క అప్పటి కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రస్తుత బొగ్గు శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తులు చేశారు. ఒడిశా సీఎంతో సంప్రదింపులు జరిపి గని ప్రారంభానికి భట్టి మార్గం సుగమం చేశారు. దీంతో చివరికి సింగరేణీయుల చిరకాల స్వప్నం సాకారమైంది
నైనీ బొగ్గు బ్లాక్ విశేషాలు
» ఈ గనిలో 340.78 మిలియన్ టన్ను ల బొగ్గు నిల్వలు తవ్వితీయటానికి అవకాశం ఉంది. ఈ గనిలో ఉత్పత్తి పూర్తి స్థాయికి చేరుకుంటే ఏడాదికి 10 మిలియన్ టన్నులు.. అనగా కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది.
» సింగరేణిలో ప్రస్తుతం ఉన్న 17 ఓపెన్ కాస్ట్ గనులకన్నా ఇదే అతి పెద్ద గని కానుంది.
» ఏడాదికి కోటి టన్నుల చొప్పున 38 సంవత్సరాల పాటు ఈ గని నుంచి బొగ్గు తవ్వి తీయనున్నారు.
» తెలంగాణలో ప్రస్తుతం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఒక టన్ను బొగ్గు తవ్వి తీయడానికి సగటున 12 టన్నుల ఓవర్ బర్డెన్ (పై మన్ను) తొలగిస్తుండగా ఈ గనిలో మాత్రం ఒక టన్ను బొగ్గుకు కేవలం రెండున్నర క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీస్తే సరిపోతుంది. దీంతో లాభదాయకం కానుంది.
» ఈ గనిలో మేలైన జీ–10 రకం నాణ్యమైన బొగ్గు లభిస్తోంది.
» ఓవర్ బర్డెన్ తొలగించడానికి, బొగ్గు తవ్వకానికి, బొగ్గు రవాణాకు సంబంధించి ఇప్పటికే కాంట్రాక్ట్లను అప్పగించారు.
» ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గును ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా సమీపంలోని జరపడ రైల్వేసైడింగ్కు రవాణా చేసి, అక్కడి నుంచి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు.
» అయితే ఈ ప్రాంతంలోగల ఇతర బొగ్గు కంపెనీలతో కలిసి ఒక ప్రత్యేక 60 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించడం కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. మరో మూడేళ్లలో ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
» నైనీ బొగ్గు బ్లాకు కోసం మొత్తం 2,255 ఎకరాల భూమి సేకరించారు. దీనిలో 1,935 ఎకరాల అటవీ భూమి, 320 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూమి ఉంది.