
నెల రోజులైనా కానరాని గల్లంతైన కార్మికుల జాడ
ఇప్పటివరకు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిన చోటుకు పక్కనే తవ్వకాలు
ఇక మిగిలింది సరిగ్గా ప్రమాదం జరిగిన చోట తవ్వకాలు జరపడమే
అక్కడ తవ్వితే మళ్లీ సొరంగం కూలుతుందనే భయాందోళనలు
నేడు సీఎం నేతృత్వంలో సమీక్ష.. సహాయక చర్యల కొనసాగింపుపై నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్/నాగర్కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం సరిగ్గా ఎక్కడ కుప్పకూలిందో అక్కడ తవ్వకాలు జరిపేందుకు అవకాశాలు లేవా?.. సహాయక చర్యల్లో పాల్గొంటున్న కొందరు అధికారులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు. ఇప్పటివరకు సొరంగం పైకప్పు కూలిన ప్రాంతం నుంచి పక్కకు కొట్టుకువచ్చిన బండరాళ్లు, మట్టి, బురద, తుక్కును తొలగించారు.
ఇక సొరంగం ఎక్కడైతే కూలిందో అక్కడ శిథిలాలను తొలగించాల్సి ఉండగా, అక్కడ తవ్వకాలు జరిపితే మళ్లీ సొరంగం కుప్పకూలి సహాయక సిబ్బందికి ప్రమాదం వాటిల్లవచ్చనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు కొనసాగించాలా? లేక నిలుపుదల చేయాలా? అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.
మొత్తం 12 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారికి తోడుగా రాడార్లు, డ్రోన్లు, రోబోలు, ఎక్సవేటర్లను వాడినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం హైదరాబాద్లో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షలో సహాయక చర్యల కొనసాగింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నెలరోజులు గడిచినా..
ఎమ్మార్పి–ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు సొరంగం–1 తవ్వకాలు పూర్తయ్యాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)తో తవ్వకాలను అక్కడి నుంచి ముందుకు కొనసాగిస్తుండగా గత నెల 22న సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగి నెల రోజులు గడిచిపోగా ఇప్పటివరకు ఒక కార్మికుడి మృత దేహాన్ని మాత్రమే వెలికితీయగలిగారు.
భూగర్భంలో 400 మీటర్ల దిగువన సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పైకప్పు కూలినప్పుడు భారీ పరిమాణంలో బండరాళ్లు, మట్టి, శిథిలాలు ప్రమాద స్థలానికి రెండువైపులా గుట్టల్లా ఏర్పడ్డాయి. బయటికి వెళ్లే మార్గం వైపు పేరుకుపోయిన శిథిలాల తొలగింపు పనులు మాత్రమే చేపట్టగా, శనివారం నాటికి కార్మికుల ఆచూకీకి సంబంధించి డీ1 నుంచి డీ2గా గుర్తించిన ప్రాంతాల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. దీంతో ఆదివారం కన్వేయర్ బెల్ట్ నుంచి డీ2 ప్రాంతం దిశగా తవ్వకాలు ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు కొంత ప్రమాదకరమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకుని సింగరేణి రెస్క్యూ బృందాలు సాహసించి పనులు కొనసాగిస్తున్నాయి.
కూలిన చోట శిథిలాల కిందే మిగతా కార్మికులు!
కేరళ నుంచి రప్పించిన కడావర్ డాగ్స్ పసిగట్టిన ప్రాంతాలన్నింటిలో తవ్వకాలు పూర్తి చేయగా, డీ2 ప్రాంతంలో ఓ మృతదేహం లభ్యమైంది. మిగిలిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినా ఇతర కార్మికుల జాడ తెలియరాలేదు. దీంతో గల్లంతైన మిగతా కార్మికులు కచ్చితంగా సొరంగం కూలిన ప్రాంతంలో భారీ బండరాళ్లు, బురద, మట్టి శిథిలాల కిందే ఉండవచ్చని సహాయ చర్యల్లో పాల్గొంటున్న అధికారులు అనుమానిస్తున్నారు.
అయితే అక్కడ తవ్వకాలు జరిపితే సొరంగానికి పైన 400 మీటర్ల వరకు ఉన్న బండరాళ్లు, మట్టి మళ్లీ కూలి పడతాయా అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సొరంగానికి రక్షణలో భాగంగా కాంక్రీట్ సెగ్మెంట్లతో లైనింగ్ చేశారు. అయితే డీ1 ప్రాంతం నుంచి ఆవలి వైపు ఏర్పాటు చేసిన ఓ కాంక్రీట్ సెగ్మెంట్కి పగుళ్లు వచ్చాయి. రెండు వైపులా పేరుకుపోయిన ఉక్కు, ఇతర శిథిలాలు సపోర్టుగా ఉండడంతో ప్రస్తుతానికి ఆ సెగ్మెంట్ కూలిపోకుండా ఉంది.
ఒక వేళ శిథిలాలను తొలగిస్తే వెంటనే దానితో పాటు సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉంటుందని, సహాయక సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలు ఒకట్రెండు రోజులు నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషిoచాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.
ఎన్జీఆర్ఐ నివేదిక కోసం నిరీక్షణ
సొరంగం కూలిన ప్రాంతంలో ఉపతరితల భాగం ఎంత మేర పటిష్టంగా ఉంది? ఎక్కడ బలహీనంగా ఉంది? తవ్వకాలను ముందుకు కొనసాగించవచ్చా? అనే అంశాలపై స్పష్టత వస్తేనే సహాయక చర్యలు ముందుకు కొనసాగనున్నాయి. దీనిపై ఇప్పటికే ఉపగ్రహ సహాయంతో అధ్యయనాలు నిర్వహించిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణులు ఈ నెల 25 లేదా 26న నివేదిక ఇస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.
కాగా ప్రత్యామ్నాయంగా సొరంగానికి ఉపరితలం నుంచి బోర్ హోల్ చేసి గల్లంతైన కార్మికులను బయటకి తెచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్జీఆర్ఐ ఇవ్వనున్న నివేదికపై ఈ నిర్ణయం ఆధారపడి ఉంది. సోమవారం నాటి సమీక్షకు ఎన్జీఆర్ఐ నిపుణులను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది.
ప్రమాదం నుంచి రక్షణ కోసం ఫెన్సింగ్
సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో సొరంగంలో పేరుకుపోయిన బురద, మట్టి శిథిలాలు ఒక్కసారిగా కొట్టుకువచ్చి సిబ్బందిని ముంచెత్తే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే తప్పించుకోవడానికి బురదకు ఫెన్సింగ్ చేస్తున్నారు. బురద లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఫెన్సింగ్ ఉబ్బినట్టు అవుతుంది. దీనిని సంకేతంగా భావించి సహాయక సిబ్బంది అక్కడినుంచి తప్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫెన్సింగ్ వల్ల బురద ఒక్కసారిగా జారిపడకుండా సిబ్బందికి కొంత సమయం లభిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం డీ2 ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment